నెల్లూరు జిల్లా విద్యావ్యాప్తికి కృషి చేసిన స్వాతంత్ర్య సమర యోధులు,శాసన సభ్యులు , -శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య
శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య 1882 సెప్టెంబర్ లొనెల్లూరు జిల్లా కావలి లొ జన్మించారు .తండ్రి లక్ష్మీ నారాయణప్ప .బి.ఏ .బి.ఎల్ .చదివి 1905నుంచి కావలి లొ న్యాయవాద వృత్తీ ప్రారంభించి 1921వరకు కొనసాగించారు . బాల్యం నుంచి దేశాభిమానం ఎక్కువ .విద్యార్ధిగా ఉండగానే 1900 లొ విదేశీ వస్త్రాలు వదిలేసి ,చేనేత వస్త్రాలు ధరిస్తూ ,గాంధీ మహాత్ముని ప్రబోధంతో ఖాదీ వస్త్రాలు ధరి౦చారు .
స్వాతంత్ర్యం రావటానికి తొలి మెట్టుగా దేశం లొ విద్యా వ్యాప్తి జరగాలని భావించి ,1910లొ కావలి లొ బాలికా పాఠశాల నెలకొల్పి,వయోజనులకోసం ఒక రాత్రి పాఠశాల స్థాపించి అవి సక్రమంగా పని చేయటానికి తగిన వసతులన్నీ కల్పించారు .1911లొ నెల్లూరులో వివేకానంద విద్యాలయం ఏర్పాటు చేశారు .1917లొ నెల్లూరులో హోమ్ రూల్ లీగ్ స్థాపించి ,హోమ్ రూల్ ఉద్యమాన్ని నెల్లూరు జిల్లా అంతా విస్తృతంగా ప్రచారం చేశారు .1921లొ నెల్లూరులోనే ‘’తిలక్ జాతీయ విద్యాలయం ‘’నెలకొల్పి నెల్లూరు జిల్లాలో విద్యావ్యాప్తి గొప్పగా చేశారు .
సహాయ నిరాకరణ ఉద్యమం లొ పాల్గొని 1921-22ప౦ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష,.ఉప్పు సత్యాగ్రహం లొ పాల్గొన్నందుకు నాలుగు నెలలు నెల్లూరు రాయవెల్లూరు బళ్ళారి జైళ్ళలో శిక్ష అనుభవించారు . 1937లొ మద్రాస్ శాసన సభకు శాసన సభ్యులుగాకాంగ్రెస్ పక్షాన ఎన్నికై ,1939వరకు సేవలందించారు .
రెండవ ప్రపంచ యుద్ధం కాలం లొ వ్యక్తి సత్యాగ్రహం లొ పాల్గొన్నందుకు 6-2-1941న అరెస్ట్ అయి ఎనిమిది నెలలు జైలు శిక్ష రాయవెల్లూరు ఆలీపూర్ ,జైళ్ళలో అనుభవించి ,క్విట్ ఇండియా ఉద్యమం లొ పాల్గొన్నందుకు 10-8-1942 న అరెస్ట్ అయి డిటిన్యు గ నెల్లూరు జైల్ లొ ఉన్నారు .వీరి కుమారుడు ఆకస్మికంగా చనిపోయినందుకు ప్రభుత్వం వీరిని 16-12-1942 న విడుదల చేసింది .తాను నమ్మిన వాటి నన్నిటిని త్రికరణ శుద్ధిగా ఆచరించిన దేశ భక్తులు శ్రీ వెంకట సుబ్బయ్య గారు .
1921లొ యువజనులను చేరదీసి నెల్లూరు జిల్లా అంతటా మద్య నిషేధ ప్రచారం చేయించి చాలా వరకు కృత కృత్యులయ్యారు .అన్ని రంగాలలో సంఘ సంస్కరణలో అగ్రగామిగా నిలిచారు .చాందసుల కులనిషేదానికీ గురయ్యారు .దేనికీ వెరవక తన ఉద్యమం సాగించి విజయం సాధించారు .వీరిని ఆదర్శంగా తీసుకొని వీరి కుటుంబ సభ్యులంతా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .1946-47 కాలం లొ పల్లెపాడులోని ‘’పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ‘’ ఆది పత్యాన్ని పొంది ,దాని సువ్యవ స్థితం చేశారు .ఆశ్రమం లొ ఆయుర్వేద వైద్యశాలను స్థాపించారు .94వ ఏట నిండు వార్ధక్యం లొ 1-4-1976 న నెల్లూరు జిల్లా విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేసి , స్వాతంత్రోద్యమలో అనేక సార్లు జైలుపాలైన మహా దేశ భక్తులుశ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారు పరమ పదించారు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-25-ఉయ్యూరు
