వంద మంది కవులు బోయీలై ఊరేగించిన హోసూర్ ఉగాది ‘’ఆశల పల్లకి ‘’

వంద మంది కవులు బోయీలై ఊరేగించిన హోసూర్ ఉగాది ‘’ఆశల పల్లకి ‘’

ప్రతి సంవత్సరం లాగే ఈ విశ్వావసు ఉగాదికి వందమంది  రాష్ట్ర,, రాష్ట్రేతర కవులనాహ్వానించి   కవితలను రాయించి  ప్రచురించింది ‘’హోసూర్ బస్తీ యువక సంఘం ‘’డా అగరం వసంత్ ఆధ్వర్యం లొ .ఇందులో కవుల మనోభావాలు ఆశలు ఆశయాలు ,తాము పుట్టి పెరిగిన పల్లెటూరు అందులోని చెరువు  చెట్టూ పుట్టా గట్టూ పిట్టా ,అనుభవాల సారం ,వృద్ధాప్యపు ఆవిరైన ఆశలు,అమ్మభాష ,పుస్తకం ,జీవితాన్ని తీర్చి దిద్దే గీతామృత సారం ,ప్రపంచాన్ని మలుపుతిప్పిన మహనీయుల స్పూర్తి ,తెలుగు పండుగలైన సంక్రాంతి ,ఉగాది విశేషాలు ,పర్యావరణ పరిరక్షణ ,దానికి  మానవుడు చేస్తున్న ద్రోహం,కొత్తగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ,మొదలైన ఎన్నో సామాజిక అంశాలపై కవులు వైవిధ్యమైన కవితలల్లారు .చేయితిరిగిన కవులతోపాటు ,వర్దిష్ణులైన యువ కవులూ ఉండటం విశేషం .ఒక రకం గా వీరంతా కవితామతల్లిని పల్లకీ లొ ఊరేగించారు .తాము సంతృప్తి చెంది పాఠక లోకానికి పరమానందాన్ని పంచారు .’’హోసూరు తావు రచనలను ఎంతగానో అభిమానించే ఆదరించే పెద్దాయన ‘’అంటూ నాకు ఈ కవితా సంపుటిని అంకితం చేయటం హోసూరు వారి అమృత హృదయానికి దర్పణం .అందుకని నేనూ పల్లకీలో ఊరేగినంత స౦బర పడ్డాను .ధన్యవాదాలు తెలుపు కొంటున్నాను .

  ఈ వంద కవితలలో నాకు బాగా నచ్చిన మొదటి రెండు కవితలను ముచ్చటించి ,మిగిలిన వాటిలో నెరుసులను మాత్రమె పేర్కొంటాను . తన కవితనుఎప్పుడూ చివర్లో వేసుకొనే డా. వసంత్ రాసిన ‘’చెట్టమ్మ’’  మొదటికవిత .ప్రతిపదం లొ కవిత్వం ఉట్టి పడింది .’’గాలిలో గుసగుసలు , వెలుగుతో మిసమిసలు -చినుకుతో చికుబుకులు ,నిప్పుతో నిగనిగలాడుతుంది చెట్టు .అమ్మ .’’నీలానే ఉంటాను -నేల ఋణం తీరుస్తాను’’అంటాడు కవి .’’చక్కాని పండును చిలుకకు ఇచ్చి ,పచ్చాని పండును పులుగుకు ఇచ్చి -ఎండిన పండును నేలకు ఇచ్చి -మళ్లీ చెట్టై నిలిచిన తల్లి చెట్టు .’’ప్రాణవాయువుకు పుట్టబడి చేసి -ప్రతి ప్రాణికీ జీవమై నిలిచి -లెక్కలు తెలియని తల్లి -ప్రేమను పంచే అమ్మ చెట్టు ‘’ఆని కేర్తి కిరీటం పెట్టాడు వసంత్ .గోదారి జిల్లా ‘’చెట్టుకవి ‘’ఇస్మాయిల్  గుర్తుకు వస్తాడు . రెండవ కవిత బడబాగ్ని శంకర రాజు కవిత ‘’విలపిస్తున్న చెరువు ‘’.ఇందులోనూ కవిత్వం ఉబికి వెల్లువై పారింది .’’చెరువు అద్దం లొ ప్రతిబింబాన్ని చూసుకొంటున్న పల్లెటూళ్ళు -కరువును వెలివేసి -వలలను చేపలతో నింపిన చెరువు-రైతు కంటిలో కన్నీరు రాకుండా -మేఘాలను నీటి గర్భం లొ దాచుకొన్న చెరువు .ఇదంతా ఒకప్పుడు .ఇప్పుడు కాలం మారి ‘’తూర్పున సమాధుల కైలాసం ,ఉత్తరంచెత్తకుప్పలు దక్షిణాన విస్తరించిన పొలాల హద్దులు -అన్ని వైపులా చెరువు గర్భం పై దాడి ‘’నలిగినలిగి కొన్ని రోజుల్లో చెరువు నిర్యాణం చెందటం ఖాయం ‘’ఆని బోరున విలపించాడు కవి తనఇంటిపేరును సార్ధకం చేసుకొని  వేదనా ‘’బడబాగ్ని’’ని బయటకు కక్కి .ఇక మిగిలిన కవితలలో మెరుపులు నెరుసులూ  చూద్దాం .

‘’దర్పం వదిలేసిన దర్పణాలెన్నో-మన దృష్టికటకాలను-కటకాలు తీరుస్తున్నరీతుల్ని ‘’మనుషులలో చూశాడు విశ్వావసు లొ కవి రాపోలు .’’తనపొట్టకోసినాఅక్షరం ముక్కలే ఉంటాయి .తనను పుస్తకాల పురుగు అంటే నోబెల్ వచ్చినంత సంతోషం ,తాను  నడుస్తుంటే సమూహం కదులుతున్న ఫీలింగ్ పొందాడు పుస్తకప్రియుడు నానీల తాత  డా గోపి .తరంగ సోయగాల తరగలలో లీనమై ,నిరాకార అవ్యక్త భావాలు  దూరమై ఆన౦ద  డోలికలలో తెలియాడాడు హన్మకొండ కవి శ్రీ  రంగస్వామి.’’అమృత భాండం ఉద్భవించాలంటే -హాలాహలాన్ని భరించాలి -విజయాలన్నీ కన్నీటిబొట్టు నుంచో చెమట  చుక్కనుంచో -పొటమరించే స్వప్నాలే ‘’  ఆశల పల్లకీలో ఊరేగిన భాను భూషణ్ కు .బండి ఎక్కక పోయినా-ప్రయాణం ఎప్పుడో మొదలైందిట ఉప్పలధడియం కు .’’ఆడపిల్లను కనీసం ఒక్కసారైనా నవ్వనివ్వండి ప్లీజ్ ‘’ అంటోంది శశికళ .సంప్రదాయ బద్ధంగా ఉగాది జరుపుకోవాలని ఆశ పడ్డాడు విజయకుమార్ .అందరి బంధువు చందమామమయ్య -అతడు౦టేనే ముద్దూ ముచ్చట పెనుమాకకు .తెన్నేటి మాస్టారికి ‘’జ్ఞాన శిఖరాల బాట భగవద్గీత ‘’.’’ఓటరుకు నిజాయితీ యే కోటు ‘’ఆని సుద్ది చెప్పాడు చలపాక .బిచ్చ గత్తె కు ‘సంచారమే జీవనగతి -భరోసాలేని స్థితి భ్రుతి ‘’ఆని వాపోయాడు హరిశ్చంద్రా రెడ్ది .పిళ్ళావారికి తనపూర్వీకులు పన్నిన పద్మ వ్యూహం లొ  తాను  చిక్కిన అభిమన్యుడనని ,’’అవయవ అంతరంగాలను కూడ దీసుకొని ప్రాణావశిష్టమైన శిల్పి అనిపించింది .పర్యావరణ రక్షణకు సార్ధక వృక్షం అవ్వాలనే ఆశ ఆచంట హైమవతిది. అనంతరామయ్యకు ‘’మనిషి గుట్టును అర్ధం చేసుకొంటే -మనిషి అర్ధమౌతాడు ‘’అనే ఎరుక కలిగింది .గర్భ శ్మశానం లొ కమిలి నశించే పసి ప్రాణం చూసి విలవిలలాడాడు భ్రూణహత్యలకు అంతమెప్పుడో ఆని’’ పంతుల ‘’ .తానొక 5G ఉలిపిరికాయ నని మనిషిగా ఏనాటికైనా రి చార్జ్ కాగలనా ?’’  ఆని ఆవేదన ఐన కోట కు .

    కానందుడు అంటే వివేకానందస్వామి ‘’శక్తి సమీరం,స్పూర్తి కిశోరం -మహోన్నత స్వామి ‘’అనిపించాడు జగదీశ శర్మకు ‘’.అ౦బస్టుడు ఇచ్చిన జుట్టు, దర్జీ ఇచ్చిన దర్జా మనది ‘అంటారు.ఇవాళ దర్జీ అనే టైలర్ మాస్టర్ అనిపించాడు మాధవీ సనారాకు . ‘’ఆరునెలలు రైతు  కష్టపడి ప్రసవ వేదన పడితే వచ్చింది మెతుకు .వృధా చేస్తే ఎలా బ్రతుకు  ?ఆని ప్రశ్నించాడు యోగీశ్వరరావు .ముడావత్ లోకేందర్ కు  ‘’నాజాతి తెలుగు -నా మాట వలపు -నా నడక గెలుపు -నా వజ్రాల మూట తెలుగు’’ఆని పించింది  .’’జన్మ తాపత్రయ తపన కావాలని అందుకు త్యాగాలతో జట్టు కట్టాలని ‘’హితవు పలికాడు మోహన రావు .’’సడి చేయకుండా సేక్యులరిష్టులు ప్రయత్నించి మనుష్యుల్ని మఠం మత్తు నుంచి కాపాడాలి ‘’అన్నాడు దేవీ ప్రసాద్ .’’బ్రతుకు సృజనలో రైతు ప్రభ ‘’కన్పించి హల దరహాసం సంక్రాంతి శోభ లొ దర్శనమిచ్చింది వడలి రాధా కృష్ణకు .చిన్నారుల చిత్రాలు ‘’చూయిస్తున్న’’ పంతులమ్మకు తానూ ఆ ఛాయా చిత్రాల తరుచ్చాయల్లో ఒక రంగుల చిత్రం అయ్యానని,బాల్య పరిమళ నజరానా ఇస్తున్నట్లు  తెలీదు’’అంటాడు శ్రీనివాస గౌడ్ .అపార్ట్ మెంట్ కల్చర్ లొ బతుకుతున్నమనకు ,వాటి సమర్ధ నిర్వహణకు ఐక్యతే ఘనం గా అనిపించింది ‘వంకా ‘కు .క్షమయా ధరిత్రికి శట కోటి వందనాలన్నాడు’’ కడలి’’.మరణ సమయం లొ బంధాలు జ్ఞాపకాలు ,భావోద్వేగాలు ,పువ్వులై ప్రాణ దీపం కొండేక్కేప్పుడు అనేక మరణాలుగా చీలిపోవటం మరణం ‘’ఆని వ్యాఖ్యానించాడు జాని మాస్టర్ .’’పెద్దలమైన మనం మారితేనే మన తర్వాత తరానికి మార్గదర్శకులమవుతాం ‘’ఆని సుద్ది చెప్పాడు ఆళ్ళ .’’లోపం ఎక్కడుందో ,లోకం ఏమౌతుందో గడచి పోయిన గతాన్ని అడగమంటాడు రవీంద్రా చారి.గర్భస్థ ప్రాణి ‘’తల్లి ప్రేమలో తాదాత్మ్యం చెంది ఆమెను ఆరాదిస్తానని బాస చేసి ‘’నన్ను ఈ ప్రపంచం లొ ఉదయించనీయ మని ‘’వేడుకోలు’’  చేసినట్లు  అనిపించింది ఎకేబి లక్ష్మికి .

  ఒక సంప్రదాయ మిత్రుని మధుమేహ తల్లికి  కిడ్నీలకు చుట్టుకొన్న యమపాశం లాగేస్తుంటే ,తన అంటరాని కిడ్నీ తో  ప్రాణదానం చేసి ‘’గడ్డి పువ్వు ‘’గా మిగలగా ఆ అమృతవల్లి బిడ్డగా అక్కున చేర్చి ఆనంద రసార్ణవం లొ ముంచి తేల్చినట్లనిపించింది మంచిమనసున్న మోహన మురళికి .  ఇది ఏసు క్రీస్తు ‘’Before the cock crows  tomorrow ,you will deny me thrice ‘’అన్న మాటలు కోడికూయటం ఎంత సహజమో అతడు చేసి౦ది కూడా అంతే మానవ సహజం .ఆతల్లి ప్రేమా అలాంటిదే . వినవె బాలా నా ప్రేమ గోల అంటూ రేలంగి పాడినట్లు దుర్గారావు ఆన౦దహేలలో ఆమె పొందు ధన్యం అని పాడాడు .ఎందఱో మహానుభావులు తెలుగుతల్లికి గుడికట్టి ఋణం తీర్చుకున్నారని ఆమె ఒడిలో సేదదీరి ఋణం తీర్చుకోవాలని సూర్యనారాయణ పిలుపు .’’ఇవాల్టి మదుపు రేపటి బతుకు ‘’అన్నాడు సింగ్ జీ .’’వల్ల కాదు అనుకొంటే వల్ల కాడు వరకు చేతకాని వాడుగా మిగిలి పోతాడు మనిషి ‘’అన్నాడు రామబ్రహ్మం. ’’నిత్యకవికొండ’’ నరసరాజు కు ‘’విరామ చిహ్నం లేని విధ్వంసాల మధ్య మనిషి మరణించాడు ‘’అనిపించింది .పవిత్రగ్రంథాలన్నీ రక్తకన్నీరు కారుస్తున్నాయి .పిల్లలు లేని దేశం ఊహించ లేడు .బతికే హక్కు ధ్వంసం చేయొద్దని ‘’మా సమాధులపై ఉదయించే నెలవంకలే రేపటి శాంతి పతాకలు ‘’ఆని చిన్నారిపాప సభ్య సమాజాన్ని ప్రాధేయడింది  అంటాడు . మానవి అయిన అమ్మాయి తనను తానె రక్షించుకోవాలి అవసరమైతే అగ్ని శిఖకావాలి భద్రకాళి గామారాలి కానీ పిరికిపందగా మృగ రాక్షసులమధ్య బతకారాదు ఆని ధైర్యం నూరి పోశాడు కిశోర్ .మనిషి జీవితం  వృత్తాకారం  లొ ఇమిడి ఉండటం చూశాడు రామస్వామి .మనల్ని గురించి మనం ఆలోచించినా ప్రక్కవానిని పట్టించుకోవడం ప్రత్యేకం అంటోంది అనూరాధ .’’వీల్ చైర్ ఆ పతికి ,సంపతికి ఆదుకొనే సోపతి ‘’లా అనిపించింది శంకరయ్యకు ..’’జాను తెనుగు రసమాధురి -కావ్యసుధల సుస్వర ఝరి ‘’అయింది ప్రతాప్ కు .స్వచ్చతే సాంఘిక సదాచారం -ఆత్మ గౌరవానికి మన్నన మరుగు దొడ్డి ‘’ఆని మెచ్చాడు పాండురంగం .’’ఎంతటి ఎడారి గుండైనా -తడి హృదయం తడిమితే -ఆకు పచ్చ భూతలమే ‘’అవు తు౦దన్నాడు రమేష్ .ఇవాళ మనిషి ఒక  యంత్రాంగమే.విముక్తి దొరకడం కష్టం అన్నాడు రాజన్న కవి .అన్నిటినుంచి మరలిపోతున్నమనిషి -ఆధునిక అనాగరికుడు ‘’గా కనిపించాడు అచ్యుత్ కు .దగ్గరున్న పుస్తకం హస్తభూషణమై ,మస్తకానికి హాయినిస్తుంద౦టాడు సాధనాల నాయుడుగారు .గాయం లేకపోతె తనలో జీవం లేనట్లే అంటుంది ఫిలసాఫికల్ గా జన్ను లక్ష్మి .తాను  దేహాన్ని వదిలినా ఆత్మమాత్రం పుస్తకాల గది చుట్టూనే తిరుగుతుదంటాడు మరో పుస్తకప్రియ ప్రతాప రెడ్ది.డా.రాజేశ్వరికి ‘’సనాతన ధర్మమే జీవన పరమార్ధం.’’ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు’’పర్యావరణానికి ఆకుపచ్చని తొడుగు తొడగాల్సిందే ‘’ఆని తేల్చాడు నూజెట్టి .

  మారుతీ దేవికి ‘’మౌనమేశ్రీకారం,ఓంకారం శివం శంకరం దైవత్వ పరమాత్మ ‘’.తెలుగు సంవత్సరాది ముద్దు ‘’అంటోంది జయలక్ష్మి .మహిళ’’లయకారుడి ఓంకారం లా,సృష్టికే ప్రతి సృష్టిగా ‘’సాగిపోమ్మని మార్చింగ్ సాంగ్ పాడింది  రాజేశ్వరి .కన్నెర్రజేసి హక్కుల జెండా ఎగరేసినప్పుడే మహిళకు విముక్తి రోజు అంటాడు ఎర్రోజు . పోరాడి గెలిచే జీవితం మనది ఎవర్నీ పట్టించుకోకుండా గమ్యం వైపు సాగమని బోధించాడు రవికుమార్ .మాతృభాషా ,మాతృమూర్తీ ,కళ కవిత అన్నీ నేనే  అంటోంది పాటిబండ్లకవిత .భార్యా భర్తా అర్ధనారీశ్వరతత్వం అంటాడు డా ప్రభాకర్ .అరుణ పతాకం ఎర్ర మందారం అనిపించింది గొండ్యాలకు .పుస్తకం అభయ హస్తం .చేతిలో ఇమిడిపోయే ప్రపంచం మరో పుస్తక ప్రియుడు రాధా సురేష్ కు .’’వాడొక జంబుకం బహురూపి కనుక తస్మాత్ జాగ్రత .అంటూ వాడిని రూపాలోదిలేసి నిజరూపానికి రమ్మంటాడు కిషన్ .జగదీశ్వరీ మూర్తికి తను  ‘’పాతకొత్తల తొ ప్రవహించే అనంతాక్షర అమృత వాహిని ‘’గా భావించింది .రెక్కలు రానిపసికూన పక్షి పిల్లలకు తల్లి పక్షి ముక్కుతో కరచుకొని తెచ్చిన ధాన్యం తినిపించి పెంచి , రెక్క లొచ్చాక ఎప్పుడు తిరిగోస్తాయో ఆని ఎదురుచూపు . రెక్కలు చల్లగుండాలని దీవన శంకర్ ది. తనలో సగం మిగిలి పోయిన కవిత ఒకటి దిగులు పొదనుంచి తొంగి చూస్తోంది .వస్తే చూరునుంచి  జాల్వారే చినుకు ముత్యాలతో పాదాల్ని కడిగి కరిగి పోతాయి కనుక ‘’ శిలలో ఉత్తేజ బీజాలు విత్తటానికి’’ బేగి’’ రారమ్మని పిలుస్తున్నాడు సంగేనేని రవీంద్ర .

  క్షణ భంగురమైన జీవిత చరమాంకం లొ ఉన్న వృద్ధులు ఉన్న దాంట్లో సంతోషించాలి .అర్ధం కాలేదనుకొంటే అంతా వ్యర్ధమే ఆని వృద్ధోపదేశం  డా .నరహరి ది.వృద్ధులను సీనియర్ సిటిజన్స్ అంటాం .దీనినే  సుధామ ‘’సీ -నియర్ ‘ అంటే దగ్గర గా చూసేవాడు ఆని అర్ధం చెప్పారు ‘’జీవన సంధ్య ‘’లొ .వీరికోసం ఒక ప్రత్యెక వైద్యవిభాగం ‘’జీరియాట్రిక్స్’’వచ్చిందట .పూర్వం లాగా అన్ని రోగాలకు ఒకే వైద్యుడు వైద్యం చేయటం .ఇదిన్యుజిలాండ్ లొ బాగా ప్రాచుర్యం పొంది హైదరాబాద్  అపోలో హాస్పిటల్ లొ ఒక డాక్టర్ దీనితో యమా బిజీ గా ఉన్నాడని ప్రొఫెసర్ సుశీలమ్మ గారు ఉవాచ .ఎండలో పండ్ల చెట్టు శిబి చక్రవర్తిలా ,నిత్య నైమిత్తికాలలో విష్ణు చిత్తుడిలా ,ఉపద్రవాలను నివారించే గీతా గోవిందుడి లాఅనిపించింది రాముకు .ఒక్కసారిపుట్టిన పల్లెకు  వెళ్ళి బాల్యపు రోజులు గుర్తుకు తెచ్చుకోవాలనిపించింది అనకాపల్లి శాస్త్రికి .’’రోడ్డు పక్కన గుడ్డ గుడిసెలో గుట్టుగా రగులుతూ ఎదుగుతున్న రేపటి తరాల పౌరుల బాల్యం నివురు కప్పిన నిప్పు’’అన్న మయూరి చూపు విశిష్టమైనది .గీతాపారాయణం ఆ చంద్రార్క అమృతం ‘’ జనశ్రీకి .ఆటో డ్రైవర్ పర్యావరణ ప్రేమకు జోహార్ పలికింది ఉషారాణి . ‘’ఊకేనే గూసూని ఊహల్లో దేలక -జర్రంత ప్రయత్నం జేసి చూడు -ఓడినా గెల్చినా -చరిత్రలో నీ పెరేక్కించుకో ‘’  అంటూ సుద్దులు మాండలిక యాసలో’’ సేప్పిండు ‘’మహేందర్ ‘’మా’’రాజు .అభిమాన గొర్రెల హడావిడే గాని హీరోలకు మనసుండదు అంతా యాపారమే ‘’ఆని సత్యం చెప్పాడు మల్లారెడ్డి .పలమ నేరు బాలాజీకి ‘’మొక్కనాటి నీరు పోయడం ఒక ప్రార్ధన ,దీవెన ‘’.

   రంగమహల్ క్రాస్ రోడ్ లొ కూలీల  దైన్యగాథ కళ్ళకు కట్టిస్తూ ‘’తనతోబాటే మిగిలిన జాలి చూపుల ‘’చద్దిమూట  ‘’ను వర్ణించాడు చంద్రశేఖరయ్య .అవనిగడ్డ శిశు విద్యా మందిర్ లొ ఉపాధ్యాయిని సింహాద్రి పద్మ రిటైరవుతూ ‘’సూర్యుడి  తోబాటు పరిగెత్తిన ఉద్యోగ జీవితంకు వీడ్కోలు చెబుతూ ‘’బడి నేస్తాన్ని దిగులుగా వదిలి పోతున్నానని ,అది అనివార్యం ఆని జీవిత సత్యాన్ని చెప్పింది .జీవితమంతా పరుగు పందెంలో మునిగిపోతే ‘’చివరికి నన్ను నేనే కోల్పోయాను ‘’అనిపించింది ఐశ్వర్యకు .’’వెళ్ళే దారి ఏదైనా మన ఆలోచనలే కర్మఫలాన్ని అనుభవిస్తాయి ‘’ఆని పురాణ ఇతిహాస వేదాంత సారం లక్ష్మీ శ్రీని వాస్ ది.’’అలుపెరుగని  ఆత్మ విశ్వాసంతోసాగించే జీవనపయనం ఆదర్శం ‘’అయింది  స్రవంతికి .’’ఔన్నత్య శిఖరం నుంచి చూస్తె బాంధవ్య పరిమళం విరగబూస్తుంది’’అనే విశ్వాసం విద్యాధర్ కు .ప్లాస్టిక్ భూలోక రాక్షసి గా కనిపించింది వీరభద్ర గౌడ్ కు .’’మత్తు దిగే వరకే మద్యం -ఋణం తీరేవరకే బంధం ‘’రెండిటిని దూరంగా ఉంచితే ఆరోగ్యం ,ఆహ్లాదం శరీరానికి, మనసుకు’’ఆని మత్తు వదలమని బంధం తె౦చుకోమని ‘’కాళిదాసు’’ కవి చెప్పిన జీవన సూత్రం .’’ సాంప్రదాయాలను భావి తరాలకు తెలియ జేసే బాధ్యత మనది’’ అంటోంది శ్రీదేవి .  ‘’ఏ తల్లి అయినా బిడ్డల్ని వీరులుగా కాక, మనుషులు గా తీర్చిదిద్దితే ఇహం ,పరం’’ అంటాడు దేశరాజు . దామరాజు  శంకరానికి ఎంకి పాటల నండూరి సుబ్బారావు’’ పూని ‘’.కమకమ్మని భార్యా భర్తల  సరసం వినిపిస్తూ ‘’సాయమందిస్తున్న సరకారోరికి ‘’సలాములు’’ సెప్పాడు’’ . ‘’ఆమె చూపులో ఉప్పొంగే గోదారి హంసలు ‘’కనిపించాయి మానససరోశవరంనుంచి ఎగిరివచ్చి శర్మ గారికి .సరోజినీ దేవి ’’సూర్య చంద్రులశ్రమైక సౌందర్యం, నదీమ తల్లులకృషీవలత్వం  ‘’దర్శించి ‘’జగద్గురువులు’’ అన్నది .హేమలతకు ‘’ఆశ వెలుగుల పులుగులా ఉషోదయతుషార బిందువులా దర్శనమిచ్చి ‘’వేకువ వేదికపై నవోదయ దర్శనమైంది .’’’’కర్మఫలం తప్పనప్పుడు -పంచాంగం తొ పనేమిటి ?ఆని మిలియన్ డాలర్ల ప్రశ్న వేశాడు రాజేశ్వర్ .’’’పంచాంగం నలిపెస్తే వర్షాలు రావు’’అనే వాళ్ళు మనవాళ్ళు  ’నేటి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ,రేపన్నది ఎలాగున్నా -ముందుకు సాగాలన్నాడు ‘’దోసపాటి వేదాంతి .హోసూరు చంద్రశేఖర్ ప్రకృతికవి ‘’కొమ్మల్లో అల్లుకొని వేగంగా ప్రాకాలనే లేత తీగల పట్టుదల’’ కనిపించింది అతనికి . ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో ఆజాదీ అమృతోత్సవ్ సమయంలో కూడా ‘’గోస లెళ్ళ దీస్తూ  వలసలై ప్రవహిస్తున్న బక్క,దీన జనాలను చూస్తే’’గుండె తరుక్కు పోతోంది శ్రావణికి .కడ చూపు కోసం వచ్చిన బంధు జనాలను చూస్తె పోయే ప్రాణానికి ప్రాణం తిరిగి  వస్తుందని ‘’అదే జీవన హేల ‘’ఆని పించింది మౌని డాక్టర్ కు .’’చెన్నై చెన్నయ్య’’కు ‘’స్త్రీ పై నిత్యం జరిగే అమానుష కృత్యాలు చూస్తే ‘ఈ జగం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు’’ . భాగ్య లక్ష్మికి ‘’విశ్వాసు శ్రీ లక్ష్మీ విష్ణు రక్షితం ‘’గా తోస్తే, దామల చెరువు ప్రసాద్ కు ‘’పసి మోము దరహాస చంద్రిక ‘’గా కనిపించింది .’’కోటి విద్యలవృత్తి సాధనాలే-ముడుపు లందుకొనే పల్లె -పండుగ ముక్కోటి దేవతా దర్శనం ‘’పాండు రంగ కు.చివరగా ఆకుల మల్లేశ్వరరావు కు ‘’సౌండ్ ప్రూఫ్ మది గది లొ అణచిపెట్టిన సముద్ర ఘోష వినిపించింది .మనశ్శాంతి మన్ను తిన్న పాము అయింది .వెలసి పోయిన ఆన౦దాల అవశేషాలు- జ్ఞాపకాల కుడ్య చిత్రాలయ్యాయి’’అంటూ పొయెటిక్ గా చెప్పాడు .

 కవులందరికీ,.ప్రోత్సహించి రాయించిన హోసూరు బస్తీ యువక బృందానికి అభినందనలు .అయితే కొందరు రెండు మూడు పేజీలు రాశారు .కవిత క్లుప్తంగా,  చిక్కగా, చక్కగా, కవిత్వ పరిమళ భరితంగా ఉంటేనే రాణిస్తుంది ,జీవిస్తుంది .ఇది అందరూ గ్రహించాల్సిన సత్యం .మరో సారి అందర్నీ అభినందిస్తూ –

శ్రీరామ నవమి శుభా కాంక్షలతో

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-25-ఉయ్యూరు . .  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.