చిత్రకళోపన్యాసకుడు ,ప్రతిభావంత చిత్రకారుడు ,అత్యంత క్లిష్టమైన జపాన్ టెక్నిక్ ,ఫిగరేటివ్ వాష్ టెక్నిక్ లతో అద్భుత చిత్ర కళాసృష్టి కర్త ,కళా స్రష్ట ,శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్రకర్త ,కళారత్నశ్రీమాదేటి రాజాజీ
మాదేటి రాజాజీ 1937, సెప్టెంబర్ 3న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో మాదేటి సూర్య ప్రకాశ రావు ,అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు.ప్రాధమిక మాధ్యమిక విద్య రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో జరిగింది .
చిత్రకళా ప్రస్థానం
ప్రముఖ చిత్రకారుడు వరదా వెంకట రత్నం దగ్గర చిత్రకళాభ్యాసం చేసి, తదుపరి బొంబాయి జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి మ్యూరల్ డ్రాయింగ్స్ లో డిగ్రీ పొందాడు. 1960 నుండి మరణించే వరకు రాజమండ్రి దామెర్ల రామారావు ప్రభుత్వ చిత్ర కళాశాల నందు చిత్రకళోపన్యాసకుడిగా పనిచేశాడు.విదేశీ చిత్రకళా రీతులను అధ్యయనం చేస్తూ చాలా వ్యాసాలూ రాశాడు
పురస్కారాలు
దాదాపుగా 300 లకు పైగా పెయింటింగ్స్ వేసిన రాజాజీ అనేక పురస్కారాలు అందుకున్నాడు. తూలిక అనే పత్రికను నడిపారు.అనేక బంగారు వెండి పురస్కారాలు నగదు బహుమతులుగా పొందాడు .ఆర్ట్ గ్యాలరీ ప్రిన్సిపాల్ గా నాలుగేళ్ళు పనిచేసి భారత చిత్రకళా ప్రదర్శన అద్వితీయంగా నిర్వహించాడు .దామెర్ల ఆర్ట్ గ్యాలరి ,,కలకత్తా అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ,హైదరాబాద్ అజంతా ఆర్ట్ పెవిలియన్ లలో ‘’వన్ మాన్ షో ‘’లు నిర్వహించాడు .’’వర్ణ చిత్ర ఘనాపాఠి’’ అనిపించాడు .దేశంలోని అన్ని ముఖ్యపట్నాలలో చిత్రాలను ప్రదర్శించి మెప్పు పొందాడు .కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి ప్రముఖుల చిత్రాలు గీయటం రాజాజీ ప్రత్యేకత .గోకవరం బస్ స్టాండ్ లోని’’ నన్నయ శిలావిగ్రహం’’ కు ఆధారం రాజాజీ చిత్రించిన నన్నయ్యగారి తైల వర్ణ చిత్రమే ‘’.ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య’’అలనాటి క్షేత్రయ్య , అల్లూరి సీతారామ రాజు చిత్రాలు ఆయన కళాభిరుచికి అద్దం పడతాయి .చిత్రకారుడు, సంపాదకుడు, రచయిత రాజాజీ .’’తూలిక ‘’సచిత్ర చిత్రకళా మాసపత్రికను తెలుగు,ఇంగ్లిష్ లలో వెలువరించిన ఘనత రాజాజీది
అందరికి అందుబాటులో లేని ‘’జపాన్ టెక్నిక్’’ నేర్చి చిత్రాలుగీసి విమర్శకుల ,కోవిదుల ప్రశంసలు పొందాడు. ఈ టెక్నిక్ ను బెంగాల్ లోని ఆరవలం టాగూర్ మాత్రమె ఉపయోగించేవాడు . ‘’ఫిగరేటివ్ వాష్ టెక్నిక్’’ ను స్వంతం చేసుకొన్నాడు .వేసిన అనేక చిత్రాలను భద్రపరచుకోలేక పోవటంతో పరులపాలయ్యాయి .1986 గోదారి వరదలకుఆయన ఇల్లు మునిగి కొన్ని చిత్రాలు చివికి పోయాయి .ఆయన అన్న కుమారుడు మాదేటి రాజేష్ మిత్రులవద్ద పోటీ ప్రదర్శన శాలాల నుంచి సేకరించినవి 62మాత్రమె భద్రంగా ఉన్నాయి .భావ ఔన్నత్యం ,వ్యక్తి ఔన్నత్యం చెడిపోకుండా వర్ణన లోని పదాలే రంగులలో ఇమిడ్చిన అప్రతిహత ప్రతిభావంతుడు రాజాజీ .1975ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన గీసిన ‘’భువన విజయం ‘’చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాజాజీ ని ఘనం గా సన్మానించింది .1989 లోఆంధ్ర ఆర్ట్స్ అకాడెమీ విజయవాడలో జరిపిన చిత్రకళా పోటీలో రాజాజీ చిత్రం ‘’మొఘల్ వైభవం ‘’కు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మల్హోత్రా ,నుంచి అత్యుత్తమ బహుమతి అందుకొన్నాడు .ప్రముఖ లాండ్ స్కేప్ చిత్రకారులు శ్రీ సంజీవ దేవ్ రాజాజీ ని బాగా ప్రశంసించారు.
ఇతర విషయాలు
చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై అవగాహనతో పెరిగిన జగన్ బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సమయంలో గిరిజనుల జీవితాలను దగ్గర నుండి చూసి, స్పూర్తిని పొంది… ఒక చిత్రకారుడిగా తనకున్న ప్రతిభను ప్రాయోజిత చిత్రాలుగా మరల్చి జన జాగృతం చేశాడు.
నండూరి వారి ఎంకిని ,విశ్వనాథ కిన్నెర ను ఆదరించినట్లు రసజ్ఞులు రాజాజీ చిత్రాలకు ఆకర్షితులౌతారు .సమాజం పట్ల బాధ్యతా ప్రకృతిపై మమకారం ఆయన చిత్రాలలో కనిపిస్తాయి .అవకాశాలు వచ్చినా విదేశాలకు వెళ్ళకుండా తెలుగుగడ్డపై కళకు కొత్త సోయగాలు అందించాడు .
రాజాజీ చిత్ర ప్రతిభ గుర్తించి ‘’ఇంటర్నేషనల్ హౌస్ అండ్ హు ఇన్ ఆర్ట్ అండ్ యా౦టి క్యూస్ -కేంబ్రిడ్జి సంస్థ ‘’1973 లో రాజాజీకి ఇంగ్లాండ్ నుంచి మెరిట్ సర్టిఫికేట్ పంపించింది .నిశ్శబ్ద మానవుడు, కళా తపస్విరాజాజీ రాజమండ్రి పుస్తక సంస్థల పుస్తకాలకు ఎన్నెన్నో ‘’ఇల్లష్టేషన్స్ ‘’చిత్రాలు అందించారు .తమిళనాడు రాజాజీ సునిశిత రాజకీయ మేధావి అయితే మన ఆంధ్రా మాదేటి రాజాజీ సుసంపన్న మేధోవర్ణ చిత్రకారుడు .అవిశ్రాంతంగా బొమ్మలకు ప్రాణం పోసిన రాజాజీ ‘’తూలిక ‘’10-7-1990 న తలవాల్చింది .
ఆధారం -శ్రీ పి ఎస్.రవికాంత్ వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-25-ఉయ్యూరు
