గంగా దేవి తెలియ కుండా చేసిన తప్పు ,పొందిన శాపం, ఫలితం
ఇక్ష్వాకు వంశం లో ‘’మహాభిషుడు ‘’అనే చక్రవర్తి వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేసి చక్కగా పాలిస్తున్న ధర్మ శీలుడు, సత్యవ్రతుడు.దేవేంద్రుడిని సంతోషపెట్టి స్వర్గం లో నివాసం పొందాడు .ఒక సారి ఆయన బ్రహ్మ దర్శనానికి సత్యలోకం వెళ్లాడు .అప్పుడ దేవతలు ,దేవనది గంగాదేవి కూడా వచ్చారు .ఆ సంరంభం లో గాలి తాకిడికి గంగాదేవి పైట జారింది .చూడటం తప్పు ఆని దేవతలు తల వంచు కొన్నారు .మహాభిముఖుడు మాత్రం తదేక దృష్టితో చూశాడు .ఆమె కొంత అనురక్తి చూపగా ,ఇద్దరి చూపులు కలిశాయి .ఆమెలో ప్రేమ అంకురించి కామ మోహిత అయింది .సిగ్గుతో పారిపోయింది .ఇద్దరూ పరిసరాలు మరచి ఒకరి నొకరు చూసుకొంటూ మైమరచి పోయారు .బ్రహ్మ దేవుడు గమనించి ఇద్దర్నీ మానవ లోకం లో పుట్టమని శపించాడు .అప్పటికి స్పృహలోకి వచ్చి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు .
మహాభిముఖుడు మంచి వంశం లో పుట్టాలని వెదికి వెదికి ‘’పురు వ౦శం ‘’లో ‘’ప్రతీప రాజు’’ కొడుకు గా పుట్టాడు .ఆ సమయం లో అష్ట వసువులు తమ భార్యలతో ఆకాశ సంచారం చేస్టూ వశిష్టాశ్రమ ప్రాంతానికి వచ్చారు .అందులో ఒక వసువు పేరు ‘’ద్యు’’.అతడి భార్య వశిష్టాశ్రమం లో నందిని ధేనువును చూసి ముచ్చటపడి అది వశిష్టునిది ఆని,అది దివ్య ధేనువు ఆని ,దాని పాలుతాగితే ,దీర్ఘాయుస్సు ,నిత్య యవ్వనం సిద్ధిస్తాయని భర్త వల్ల ఆని తెలుసుకొని గోముగా భర్త ద్యుతో ‘’నాధా !నా ఇష్టసఖి ఉశీనర రాజర్షి పుత్రిక మృత్యులోకం లో ఉంది .ఆమె కోసం ఈ ధేనువును దూడతో సహా తీసుకు పోదాం .ఈ ఆవు పాలుతాగి నా స్నేహితురాలు మళ్లీ ఆరోగ్య వంతు రాలవుతుంది ,నిత్య యౌవనం తొ శోభిస్తుంది ‘’ఆని పట్టు బట్టింది .అప్పుడు మహర్షిఆశ్రమం లో లేడు .ఇదే లక్కీ చాన్స్ అనుకొని ఆ వసువులు ద్యు ప్రోత్సాహంతో నందిని ధేనువును అపహరించి తీసుకు పోయారు .
కొంతసేపటికి మహర్షి వశిష్టుడు వచ్చి జరిగింది తెలుసుకొని ఆ అష్ట వసువులను భూలోకం లో జన్మించమని శపించాడు .వాళ్లకు హాట్ ట్రాక్ లో తెలిసి పరిగెత్తుకొని వచ్చి మహర్షి పాదాలపై వ్రాలారు .పొరబాటును క్షమించమని కాళ్ళావేళ్ళా బ్రతిమిలాడారు .మహర్షి శాంతించి కోప తీవ్రత తగ్గించి ‘’ఏడాదికి ఒక్కరు చొప్పున మీరు శాప విముక్తి పొందుతారు .దీనికి వ్యూహ రచన చేసిన ద్యు మాత్రం చాలా కాలం మానవ శరీరంతో ఉండక తప్పదు ‘’అన్నాడు .
‘’అను వత్సరం సర్వె శాపమోక్ష మవాప్స్య ధ -యే నేయం విహ్రుతా దేను ర్నందినీ మమ వత్సలా -తస్మాత్ ద్యౌ ర్మానుషె దేహే దీర్గకాలం వసిష్యతి’’ .
మానవ జన్మలో ఏడాది కాలం ఎలా బతకాలి అనుకొంటూ ఉంటే ,భూలోకానికి వస్తున్న గంగా దేవి కనిపించగా తమల్ని ఉద్ధరించమని ఆమెను శరణు వేడుతూ ఆమెను భూలోకం లో శ౦తన మహారాజు భార్యగా జన్మించి ,ఏడాదికోక్కో క్కరినిగా తమల్ని ప్రసవించి ,పుట్టిన వాడిని పుట్టినట్లు తన పవిత్ర జలాలలో కలిపె తమకు ముక్తి ప్రసాదించమని ప్రార్ధించారు . సరే ననగా వారు వెళ్ళిపోయారు .
ప్రతీప మహారాజుకు సంతానం లేదు .గంగాతీరంలో పుత్ర సంతానం కోసం సూర్యోపాసన తీవ్ర తపస్సుతో చేశాడు.ఒక రోజు గంగనుంచి ఒక సుందర స్త్రీ వచ్చి ప్రతీపుడి కుడి తొడమీద కూర్చుంది .కళ్ళు తెరిచి చూసి విషయం గ్రహించి తన అనుమతి లేకుండా అలా కుడి తొడమీద కూర్చున్న ఆమె ఎవ్వరో ప్రశ్నించాడు .కామించి వచ్చాను స్వీకరించమన్నది సుందరాంగి .ప్రతీపుడు ‘’నేను పర స్త్రీ వ్యామోహం లేని వాడిని .నా కుడి తొడమీద కూర్చున్నావు.అలా కూర్చునే ఆర్హత కొడుకు, కూతురు, కోడలు కు మాత్రమె ఉంది .
‘’స్థితా దక్షిణ మూరు౦ మె సమాశ్లిష్యచ భామిని – అపత్యానాం ,స్నుషాణా౦ చ స్థానం విద్ధి సుచిస్మితే ‘’
.నాకు సంతానం లేదు .ఒక వేళ నాకు కనుక కొడుకు పుడితే నిన్ను నా కోడలిని చేసుకొంటాను.’’అన్నాడు సరే ఆని వెళ్ళిపోయింది .కానీ ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు .కొంతకాలానికి ప్రతీపుడికి శంతనుడు పుత్రుడుగా పుట్టాడు .పెరిగి పెద్ద వాడయ్యాక రాజ్యం అప్పగించి వానప్రస్థానానికివెళ్ళా లనుకొని కొడుకుకు సుందరాంగి వృత్తాంతం చెప్పాడు .అడవికి వేటకు వెడితే ఆమె కనిపించి మొహిస్తుందని తిరస్కరించవద్దని ,ప్రశ్నించకుండా ధర్మ పత్నిగా స్వీకరించ మని .ఇదీ తన ఆజ్ఞ ఆని హితవు చెప్పాడు .శంతనుడికి ఆమె కనిపించింది అతడే ‘’మహాభిషుడు ‘’గా గుర్తించి౦ది .ఆ సుందరి గంగా దేవి ఆని అతడు గుర్తించలేదు .ఇద్దరికీ ప్రేమ అంకురించిఒడి ఆమె అతడిని ‘’నాకు ఒక వరం ఇస్తే పెళ్ళికి సిద్ధం .నేనేపని చేసినా ప్రశ్నించకూడదు .ప్రశ్నించి ఆపితే నేను నిన్ను విడిచి వెళ్లిపోతా ‘’అన్నది సరే అన్నాడు
‘’యచ్చ కుర్యామహం కార్యం శుభం వా యదివా అశుభం -న నిషేధ్యా త్వయా రాజన్ న వక్తవ్యం తదాప్రియం ‘’
శంతనుడు ఒప్పుకోవటం గంగాదేవి ఏదాదికి ఒకడిని కనటం వాడిని గంగలో పడేయ్యటం అలా ఏడుగురు వసువులు శాపవిముక్తి పొందటం ఎనిమిదవ వసువు భీష్ముడుగా పుట్టటం ఈసారి కనీసం వీడినైనా బ్రతించమని కోరటం ఆమె శ౦తనుడిని కొడుకును తీసుకొని వెళ్లి పోవటం అతడికి వేద వేదాంగాలు నేర్పి మళ్లీ శంతనుడికి అప్పగించటం మనక తెలిసిన కధే .దీని వెనక ఇంత ఫ్లాష్ బాక్ ఉంది .
ఆధారం – ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి శ్రీదేవీ భాగవతం
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-25-ఉయ్యూరు .

