ఆనంద రామాయణ విశేషాలు -10-

   ఆనంద రామాయణ విశేషాలు -10-

          సపరివారం గా రాముడు అగస్త్యాశ్రమానికి వెళ్ళటం

సీత  తో తమ్ములతో మంత్రి ఇష్ట మిత్రులతో కలిసి ఒక సారి రాముడు పుష్పక విమానమెక్కి దండకారణ్యం లోని అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళాడు .ముని ఎదురొచ్చి స్వాగత సత్కారాలు అందజేశాడు .మహర్షి స్నానం చేసి అన్నపూర్ణా దేవిని స్మరించాడు .ఆమె సంప్రీతి చెంది ఒక పాయస పాత్రను ఆయనకు ఇచ్చి’’మునీశ్వరా ! ఈ పాత్రలో అనేక పక్వాన్నాలు సమస్త భోజ్య పదార్ధాలు ఉన్నాయి .నీభార్య లోపాముద్రకు ఈ పాత్రనిచ్చి అందరికి వడ్డించమని చెప్పు ‘’అని చెప్పి అదృశ్యమయింది. అలాగే అగస్త్య పత్ని రామ పరివారానికి వడ్డించింది .అందరికి ఎవరికి ఏది ఇష్టమో ఆ పదార్ధాలన్నీ పాయస పాత్త్రనుండి వస్తుండగా సంతోషంగా వడ్డించి వారదరికీ తృప్తి కలిగించింది .భోజనాల తర్వాత సీతా రాములకు బంగారు ఆభరణాలను నూతన వస్త్రాలను ముని దంపతులు సమర్పించి ఆశీర్వ దించారు .

    రాముడు అగస్త్యునితో పంచాప్సర సరోవరానికి వెళ్ళటం

 మళ్ళీ పుష్పకమెక్కి పరివారం తో దండకాటవి సోయగాలను తిలకిస్తూ పంచాప్సర సరోవర తీరం చేరి ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని సంకల్పించారు .సీతారాములు అప్సర నాట్య గానాలు తిలకించి సంతోషించారు .కాని అప్సరసలు మాత్రం ఎవరి కంటికీ కనిపించలేదు .అందులోని రహస్యాన్ని రాముడు అగస్త్య మునినిని తెలియ జేయమని కోరాడు .’’రామా ! సర్వజ్నుడివి నీకు తెలియని విషయమే లేదు. నాద్వారా వినాలనే నువ్వు అడిగావు .చెప్తున్నాను విను ‘’పూర్వం గంధర్వ రాజు పుత్రికలు అయిదుగురు మనోహరా౦గులై రజస్వలలు కాకపూర్వం ఈ సరోవరం లో క్రీడించారు .ఇంతలో సరోవరం నుండి ఏడుగురు నాగకన్యలు కూడా బయటికి వచ్చి జలక్రీడలాడుతున్నారు .ఇలా నాగ గంధర్వకన్యలకు బాగా పరిచయాలు పెరిగిపోయాయి .సరస్సు ఒడ్డున తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరునికి వీరి జలక్రీడల వలన తపో భంగం కలిగింది .ఆయన వారందరినీ సరస్సు వద్దకు రావద్దని గట్టిగా చెప్పాడు .చపల చిత్తం కల అకన్యలు ముని మాట లక్ష్యపెట్ట లేదు. దేవేంద్రుడు కూడా వారిని ప్రోత్సహించి మరికొంతమంది అప్సరసలను అక్కడికి పంపి ముని సహనాన్ని పరీక్షించాడు .ఏంతో కోపం వచ్చిన వీళ్ళకు శాపం ఇస్తే తన తపస్సు వృధా అవుతుందని ముని ఆగుతున్నాడు .ముని జలదేవతలను ప్రార్ధించాడు. వారు వచ్చి అయిదుగురు అప్సరసలను నాగ కన్యలను బలాత్కారం గా అక్కడినుంచి తీసుకొని వెళ్లి ఎవరికీ వినపడని కనపడనిని నీటి ఇంటిలోదాచేశారు .హాయిగా తపస్సు చేసుకొని కొంతకాలానికి ఆ ముని స్వర్గం చేరుకొన్నాడు ..వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు నృత్య గీతాలాపన కొనసాగిస్తున్నారు .అదే నువ్వు వింటున్నది .నువ్వు వారిపై దయతో వారిని సంతుస్టూలను చేయి ‘’అన్నాడు .

ముని ఆజ్ఞను ఔదల దాల్చి శ్రీ రాముడు లక్ష్మణ స్వామిని తన ధనుర్బాణాలను వెంటనే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు  తాను వెళ్లి జలదేవతను శిక్షించి నాగకన్యల చేర విడిపిస్తానని అన్నాడు .అన్న చెప్పినట్లు తమ్ముడు చేశాడు. చాపం చేత బూని ధనుస్టంకారం చేసి బాణాన్ని సంధించ టానికి సిద్ధ పడ్డాడు  రాముడు .అప్పుడు భూమి కంపించింది  చండమారుతం వీచింది ,దిక్కులన్నీ దుమ్ము కమ్మి చీకటి పడినట్లయింది .చుక్కలు రాలిపడి పోతున్నాయి .ప్రళయ భీకర రామ ధనుస్టంకారానికి భయపడిన జలదేవాతలు భయపడి తాము దాచి ఉంచిన కన్యలనందరిని వెంట బెట్టుకొని రామ దర్శనానికి వచ్చారు .రామపాదార విన్దాలపై పడి ప్రణమిల్లారు .సర్వాలంకార శోభితులైన పన్నెండుమంది నాగ కన్యలను శ్రీరామునికి సమర్పించారు .రాముని పాదాలపై వ్రాలిన జల దేవతలు రామునితో ‘’శ్రీ రామా !మా అపరాధం క్షమించు .బాణాన్ని ప్రయోగించవద్దు .సూర్య వంశాజులెవ్వరూ స్త్రీలపై బాణ ప్రయోగం చేయలేదు .నువ్వు కూడా గంగా తీరం లోసీతాదేవి ప్రతిజ్ఞ చేసినప్పుడు  బాణం ప్రయోగించకుండా భూదేవిని రక్షించిన కరుణా సముద్రుడివి .తాటకిని చంపానుకదాఅని నువ్వు ప్రశ్నించ వద్దు .పాపులను  సంహరించటం తో బ్రహ్మ హత్యా పాతకం రాదనీ నీకు తెలుసు ‘’అని భయ భక్తులతో ప్రార్ధించారు .సంతోషించిన రాముడు వారి మాటల విశేషానికి నవ్వి బాణాన్ని తూణీరం లో నుంచి బయటికి తీయలేదు .జలదేవతలు రాముని పూజించారు .వారిని స్వస్థానాలకు వెళ్ళిపొమ్మని రామాజ్న .అప్పటికే అక్కడికి చేరిన నాగ ,గంధర్వులు సీతారామ అగస్తులను అభినందించి రామునికి కానుకలు అందించి మనోహర వాక్యాలతో ప్రశంసిస్తూ .

      నాగ గంధర్వులు శ్రీరాముని ప్రార్ధించటం

‘’రాజీవాక్షా !ఈ కన్యలు రజస్వల కాని కన్నెలు .వీరందరూ నీ పుత్రికలుగా భావించు .వీల్లనందర్నీ నీ పుత్రులకు ఇచ్చి వివాహం చేసి కన్నెచెర విడిపించు .నీవలన మాకులాలు పవిత్రమయ్యాయి .’’రాముడు వారికి అలానే చేస్తానని వాగ్దానం చేసి వారినిపంపేశాడు .అగస్త్యుదు రామునితో  ‘’రామా  !నువ్వు  వైకుం ఠానికి  వెళ్ళేటప్పుడు కుముదుని చెల్లెలైన కుముద్వతిని కుశుని ధర్మ పత్నిగా ఏర్పాటు చేయి .ఈ చంపిక కు మగ పిల్లలు పుట్టరు .కుముద్వితి వలన కుశునికి అతిధి అనే కొడుకు జన్మిస్తాడు అతడే రాజ్యానికి ఉత్తరాదికారి అవుతాడు .వంశ వర్ధనుడౌతాడు .ఇప్పుడు కుశుడు తప్ప మిగిలిన లవుడు మొదలైన వారికి నాగ కన్యలను ఏడుగురిని విధి విధానంగా వివాహం చేయించే ఏర్పాటు చేయి .నీ కొడుకు యూప కేతువు ఇంకొక అమ్మాయిని రాక్షస వివాహం చేసుకొంటాడు .అతని సమర్ధత వలన వచ్చే భార్యకూడా మంగళాంగి అవుతుంది .వారికి కొడుకులు మనుమలు కలుగుతారు .నీకొడుకులు కోడళ్ళు అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లుతారు .మనుమలు మునిమనుమలను కళ్ళారా చూసి వారి సౌభాగ్యాన్ని గమనించి సంతృప్తి చెంది అప్పుడు మాత్రమె నువ్వు  వైకుంఠానికి సపరివారంగా వెళ్ళాలి ‘’అని ఆదేశించాడు రాముడు చిరునవ్వుతో ముని ఆజ్ఞను శిరసా వహిస్తానన్నాడు .కన్యల పేర్లను అడిగి తెలుసుకొన్నాడు రాముడు .వారే చంద్రిక ,చంద్ర వదన ,చంచల ,చపల ,అచల ‘’అని తెలియజేశారు గంధర్వులు .ఆ తర్వాత నాగుల నడిగి ఆ కన్యల పేర్లు ‘’కంజానన,కంజ నేత్ర , కంజాంఘ్రి ,కలావతి ,కళిక ,కమల ,మాలతి ‘’అని తెలుసుకొన్నాడు .వారందరి మనోభావాలను తెలుసుకొని వారికి తనకుమారులతో వివాహం మనస్పూర్తిగా ఇష్టమే నని గ్రహించాడు .అందరిని పుష్పకం ఎక్కించి సుఖ నిద్రపోయారు .మర్నాడు ఉదయం స్నానాదికాలు నిర్వహించి అగ్ని హోత్రాన్ని అర్చించి గాంధర్వ నాగ జనాన్ని చూసి రాముడు ‘’ఈ జనం తో నేను నాగ గాంధర్వ స్వర్గ లోకాలకు మనుష్యలోక వాసినైన నేను రావటానికి యోగ్యుడినికాను .కనుక నామాట విని మీరు మీ స్వస్థానాలకు వెళ్లి పోయి ,ఈ కన్యల వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా మళ్ళీ అయోధ్యాపురికి విచ్చేసి  కళ్యాణాలనులను తిలకించి పులకించి మా ఆతిధ్యాన్ని స్వీకరించి మమ్ములనందరిని ఆనందింప జేయండి ‘’అని చెప్పి అయోధ్యకు చేరాడు .

  వీరందరి వివాహం ఎలా జరిగిందో కిందటి ఎపిసోడ్ లో తెలుసుకొన్నాం కదా .ఇక స్వస్తి

 ఆనంద రామాయణం ప్రధమ సంపుటం లోని విశేషాలు ఇంతటితో సమాప్తం .

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.