ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -112
47- భారత జాతి పిత మహాత్మా గాంధి -2
1891లో బార్ ఎట్ లా పాసై గాంధి ,ఇండియాకు తిరిగి వచ్చి లాయర్ గా ప్రాక్టీస్ లో సఫలం కాలేక పోయాడు .ఇక్కడి కపటనాటకం ,సంస్థానాల అవినీతి నిరాశ పరచాయి .ఒక వ్యాపార సంస్థ తమ న్యాయ వ్యవహారాల కోసం గాంధిని దక్షిణాఫ్రికాకు పంపిస్తే సంతోషంగా వెళ్ళాడు .ఆ పని కొద్దికాలమే అయినా ఇరవై ఏళ్ళు అక్కడే లా ప్రాక్టీస్ చేశాడు .24వ ఏట దక్షిణాఫ్రికావెళ్లి అక్కడి భారతీయులకు జరుగుతున్నా అన్యాయాలను వర్ణ విచక్షతనుహీనంగా చూడటాన్ని గుర్తించాడు .అమెరికాలోని జిమ్ క్రో నిబంధనలాగానే అక్కడ బ్రిటీష్ వాళ్ళు ఇండియన్స్ ను అవమానిస్తున్నారు .ఒక కేసులో వాదిస్తున్నప్పుడు నెత్తిమీదున్న టర్బన్( తలపాగా )తీసేయమంటే తిరస్కరించాడు గాంధి . .గాంధీని ‘’కూలీ బారిస్టర్ ‘’అని ఎద్దేవా చేసేవాళ్ళు .ఫస్ట్ క్లాస్ పెట్టెలో ఎక్కితే దింపి మూడవ తరగతి పెట్టెలో కూచో మనేవారు .ఒకసారి ఎదురు తిరిగితే బయటికి నెట్టేసి కొట్టారు కూడా .చూసీ చూడనట్లు ఉండటం అసాధ్యమని పించింది .ఉపేక్ష ఇక పనికిరాదనుకొన్నాడు .అక్కడి ప్రజల భవ్య భవిష్యత్తు కోసం దక్షిణాఫ్రికా ఇండియన్ల సంఘం ఏర్పాటు చేశాడు .తమను ప్రభుత్వం గౌరవించే స్థాయి కలిగి ఉండే ట్లు ప్రవర్తించాలని ప్రజలను కోరాడు .గాంధీ ఒక్కడే .అయినా వారిని కదిల్చాడు వారి ఆలోచనలో మార్పు తెచ్చాడు .దీనికి ఆయన విశుద్ధ ప్రవర్తన ముక్కు సూటి తనం మనోధైర్యం బాగా తోడ్పడ్డాయి . వాళ్ళంతకు వాళ్ళు చేయలేని దాన్ని గాంధీ దగ్గరుండి చేసేట్లు చేశాడు .అంతటి గొప్ప పరివర్తన వారిలో వచ్చింది .
పాతికేళ్ళ దక్షిణాఫ్రికా జీవితం లో గాంధీని ప్రభావితం చేసినవారిలో రష్యన్ నవలా కారుడు లియో టాల్ స్టాయ్,ఆంగ్ల విమర్శకుడు జాన్ రస్కిన్ ,అమెరికా రచయిత హెన్రి డేవిడ్ థోరో.టాల్ స్టాయ్ రచన ‘’ది కింగ్డం ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యు ‘’చదివి సాంఘిక విషయాలలో ప్రతిఘటన లేకుండా నిరసన వ్యక్తం చేయటం ఎలాగో తెలుసుకొని అమలు చేశాడు .ధోరో శాసనోల్లంఘన ,హక్కులు తెలియ జేశాడు .కాని గాంధీని అత్యంత ప్రభావితం చేసిన వాడు రస్కిన్ మాత్రమె .రస్కిన్ రచన ‘’అన్ టు దిస్ లాస్ట్ ‘’చదివి పనిలోని గౌరవాన్ని –డిగ్నిటి ఆఫ్ లేబర్ అర్ధం చేసుకొన్నాడు .సహజం గా హిందూ జీవితం లో పురుషులకు సమాన వ్యక్తిత్వం అనాదిగా ఉన్నా కుల వ్యవస్థ వారిని దిగ జార్చింది .ఎవరూ చేయని అతి తక్కువ స్థాయి పనులను చేసేవారిని అస్ప్రుస్యులు గా సమాజం చూసి వారిని దూరంగా పెట్టింది .రస్కిన్ ను అర్ధం చేసుకొన్న గాంధి వీటిపై గొప్ప మార్పులు రావాలని తలచి దీక్షగా ముందుకు కదిలాడు .తానూ మారటమే కాదు యావత్తు సమాజాన్ని మార్చాలను కొన్నాడు .తాను దివ్య జీవితం గడుపుతుతూనే ఉన్నాడు .కాని ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు చాలా తీవ్రమైనవి సమాజ మూలాలను పూర్తిగా మార్చేవి .దీనికి ఆర్ధిక సహకారమూ కావాలి అప్పుడే సాధ్యం .
తన సంకల్పాన్ని అమలు చేయటానికి ఒక వరుసగా కార్యక్రమాలు చేబట్టాడు .మొదట అందరికి విజ్ఞప్తి చేశాడు .ఉత్తరాలు వ్యాసాలూ కరపత్రాలు పేపర్లలో వ్యాసాలూ రాసి తన మోభావాలను ప్రజలకు తెలియ జేశాడు .దక్షిణాఫ్రికా లో తన పని పూర్తికావటానికి ఇంకా చాలాకాలం పడుతుందని గ్రహించి గాంధి ఇండియా తిరిగి వచ్చేశాడు .అప్పటికే రెండోకొడుకు మణిలాల్ జన్మించాడు .గాంధీ వ్యాసాలూ చదివిన జనం ఆయన చెడిపోయాడని కనుక ఆయన ఎక్కి వచ్చిన నౌకను నౌకాశ్రయం లో ఆపటానికి వీల్లేదని ఆందోళన వచ్చింది .23రోజులు అలాగే ఓడ లో ఉండి చివరి పరిస్తితులు సర్దుకున్నాక బయటికి రావటానికి ఒప్పుకొన్నారు కాని ఆయన చీకట్లో రహస్యం గా రావటానికి ఇష్టపడలేదు .పగటి పూట సముద్ర తీరంపైకి చేరగా అక్కడ చేరిన జనం ఆయనపై దాడి చేశారు .రాళ్ళతో చెప్పులతో కొట్టారు కింద పడేశారు తన్నారు .శరీరభాగాలేవీ దెబ్బతిన కుండా పోలీసుల జాగ్రత్త వలన బతికి బయట పడ్డాడు .దీనిపై కేసు పెట్టమని చాలా మంది ఒత్తిడి తెస్తే అలాచేయటానికి గాంధి ఒప్పుకోలేదు .హింసాత్మక చర్యలతో తన మనో దీక్షను బలహీన పరచటం ఎవరికి సాధ్యం కాదని రుజువు చేశాడు .
గాంధీ 32వ ఏట బోయర్ యుద్ధం వచ్చింది .బోయర్ల పై సహజంగా సానుభూతి ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం లో ఉన్నాం కనుక ప్రభుత్వానికి సహకరించాలను కొన్నాడు .ఇది ఆయన నమ్మిన అహింసా సిద్దా౦తానికి విరుద్ధం . ఇలా గాంధీ కొన్ని విషయాలలో విరుద్ధంగా ప్రవర్తించాడు .మొదటి ప్రపంచయుద్ధం లో ప్రభుత్వానికి సహకరించాడు .నిజంగా యుద్ధం లో పాల్గొనక పోయినా అంబులెన్స్ లో ఉండి పని చేశాడు .బోయర్ యుద్ధం ముగిసాక ,తన స్వగ్రామం లో ఉండిపోవాలనుకొన్నాడు కాని దక్షిణాఫ్రికా నుండి పిలుపు వచ్చింది .అక్కడ ఆయన ప్రజానాయకుడుగా లాయర్ గా బాగా విజయాలు సాధించాడు .ధనం బాగా వచ్చినా ,అసమానత పై ద్రుష్టి మారలేదు .సాంఘిక పోరాటాలలో మరింత దీక్షగా పని చేశాడు . రోజు వారీ జీవితం పై ప్రభావం కలిగించాడు .అంటరాని వారితో కలిసి పని చేశాడు. తన కుటుంబం వారికి ఆ విషయమై అవగాహన కలిగించి ఒప్పించి వారిలోనూ మార్పు తెచ్చాడు .ఎవరిపని వారు చేసుకోవటం నేర్పాడు .పాకీ దొడ్లు కదిగాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-16-ఉయ్యూరు
