అద్వితీయ అమోఘ ‘’అత్యంతాధునిక దేవాలయం ‘’-పోలవరంప్రాజెక్ట్ – తెలుగు తల్లికి’’ జల మణిహారం ‘’
కొందరు తమ స్వీయ సేవాభాగ్యం తో చరితార్దులౌతారు ,చరిత్రనూ సృస్టిస్తారు ,భావి తరాలకు మహా మార్గ దర్శకులై తేజో మూర్తులని పించుకుంటారు .పనిలో కసి ,కృషిలో నైశిత్యం ,ఆలోచనలో నవీనం ,శ్రేయస్సులో యశస్సు ఉన్న వాడే మన నవ్యాంధ్ర ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు .ఆయన మంత్రి వర్గ సహచరులలో అదే దీక్షతో అదే తపనతో ,ఆయన పదంలో పదం కలిపి అంతే అంకిత భావం తో పనిచేస్తు కలల సాకారానికి కృషి చేస్తున్న మన జల వనరుల మంత్రి శ్రీ దేవి నేని ఉమా మహేశ్వర రావు ఆయనకు సరి జోడు .ఇద్దరూ కలిసి’’ టు ఇన్ వన్’’. అందుకే పట్టి సీమ ఎత్తిపోతల పధకం అంత త్వరలో రూపు దిద్దుకొని ,విభజన వలన అన్నపూర్ణ వంటి కృష్ణా గుంటూరుజిల్లాల అన్నదాతలు నీళ్ళో రామచంద్రా అని మొత్తు కోకుండా ,దశాబ్దాల సుప్త స్థితిలో ఉన్న పోలవర జలాశయ నిర్మాణం ప్రారంభించినా, దానికి ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలవలన అసలుకే మోసం వస్తుందేమో అనే ముందు చూపుతో దాని పని దాన్ని సాగిస్తూ ,ఆపద్ధర్మగా పట్టిసీమ ఎత్తి పోతల పధకం బాబు మస్తిష్కం లో తళుక్కున మెరవటం ,సాధన సంపత్తి చేకూర్చుకొని అసహాయ సూరునిలా కార్య రంగం లో దిగి గోదారమ్మను రికార్డ్ టైం లో క్రిష్ణమ్మలో అను సందానించి ‘’గోదా కృష్ణ ‘’లేక క్రిష్ణావరి ‘’ని సాధించి రైతన్న వదనాలలో దరహాసాలు పూయించి ,వరిలో రికార్డ్ ఉత్పత్తి సాధించేట్లు చేయగలిగి స్వర్ణాంధ్ర కు నాంది పలికాడు .లేక పోతే అసలే కర్నాటక డాములవలన బక్క చిక్కిన కృష్ణా నది బెజవాదదాకా కూడా వచ్చే అవకాశం ఉండేదికాదు .ఇదీ దార్శనికుడైన పాలకునికి ఉండాల్సిన లక్షణం .ఆ లక్షణాలు పూర్తిగా మూర్తీభవించిన వాడు చంద్రబాబు . ఈ కలల సాకారానికి మరింతసమర్ధతతో కృషి చేసి తామూ ఏమాత్రం తీసి పోనీ వారమని రుజువు చేశారు ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు ,కార్మికులు ..ఇందరి సమైక్య ,సమష్టి కృషి ఫలితం మనం ఒక్క ఏడాదిలో నే అనుభవించాం .నిరంతర పర్యవేక్షణ ,సముచిత సలహాలు ఎదురయ్యే అడ్డంకుల్ని ముందే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం విజన్ ఉన్న వారికే సాధ్యమౌతుంది .ఆ విజన్ ఉన్న వాడు మన చంద్ర బాబు .అపర భగీరధుడు అనేది రొటీన్ మాట కనుక నేను చంద్ర బాబు ను ఇంజనీర్ కాకపోయినా ‘’ఆంధ్రా కాటన్ ‘’అంటాను .ఈ కాంబి నేషన్ ఇలాగే సమర్ధంగా పని చేస్తే మన కళ్ళ ముందు ‘’స్వర్ణాంధ్ర ‘’మెరిసిపోతూ దర్శన మిస్తుంది .క్షణం లో సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్ధవంతంగా అమలు జరపాలి .అప్పుడే ఫలితాలు అతి త్వరగా అందరికీ అందుతాయి .దీనికి మరో ఉదాహరణ చూద్దాం –
ఆంధ్ర మహా విష్ణువు ఏలుబడిలో ఉన్న ప్రధమాంధ్ర రాజధాని శ్రీకాకుళం లో కృష్ణ దేవరాయల మహోత్సవాలతో ‘’పద్య కవితా బ్రహ్మోత్సవాలు ‘’ను ఈ నెల 18 19 తేదీలలో నిర్వహించి తెలుగు పద్యానికి బ్రహ్మ రధం పట్టించిన సంగతి మనకు తెలుసు .రెండవ రోజు సభకుమంత్రి శ్రీ దేవినేని రావటం ,ఉత్సవాలు జరుగుతున్న తీరుకు పులకి౦చి పోవటం, అక్కడ హాజరైన అన్నదాతల ముఖాలలో వెలిగిన నవ్వులను చూసి స్పందించటం ,కవులందరూ పట్టి సీమ పోలవరం ప్రాజెక్ట్ లను తప్పని సరిగా చూసి స్పందనలు తెలియ జేయాలని కోరటం, అప్పటికప్పుడు ఆర్టీసి ఎం. డి.శ్రీ మాలకొండయ్య తో మాట్లాడటం దాన్ని సవాలుగా తీసుకొన్న’’కత్తి’’లాంటి సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ దీర్ఘాసి (దీర్ఘాసి అంటే పెద్ద కత్తి అని అర్ధం )విజయభాస్కర్ రేపే మనకవులు పట్టిసీమ పోలవరం సందర్శిస్తారని చెప్పటం ,20 వ తేదీ సోమవారం ఉదయం అందరం బెజవాడ చేరటం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ బస్ లో డా జి .వి. పూర్ణ చంద్ గారి నాయకత్వం లో ప్రయాణించి పట్టి సీమ ఎత్తి పోతల పధకాన్ని ,అక్కడికి 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ను అక్కడి ఇంజినీర్లు మాకు ప్రతివిషయాన్ని దగ్గరుండి పూస గుచ్చి నట్లు వివరిస్తే తెలుసుకోవటం ,కమ్మని ఆతిధ్యం అందజేయయం ,డాం నిర్మాణం జరిగే నదీ గర్భానికి తీసుకువెళ్ళి భారత దేశం లోనే ఎక్కడా ఇంతవరకు జరగని ,లేని అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక సాయంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచేట్లు నిర్మిస్తున్న పోలవరం రిజర్వాయర్ ,బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా చూసే గొప్ప అనుభవం పొందటం ,తిరిగి వచ్చేటప్పుడు పోలవరం కాలువా పట్టి సీమ ఎత్తి పోతల కాలువా అనుసంధానం అయ్యే చోటు చూడటం ,రాత్రి బెజవాడ వస్తుండగా మంత్రి శ్రీ ఉమా మమ్మల్ని వారి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించటం ,అక్కడ విందు తర్వాత మమ్మల్ని అందరిని గౌరవంగా వేదిక పై ఆసీనులను చేయటం అక్కడ అప్పటికే హాజరై ఉన్న అన్నదాతలకు మా అందరి అనుభవాలను గంటన్నర సేపు తెలియ జెప్పించటం ,ఆ ప్రాజెక్ట్ లపై మేము రాసిన కవితలు వినిపింప జేయటం , వారంతా అత్యంత శ్రద్ధగా వింటూ చప్పట్లతో మమ్మల్ని అభినందించటం ,మంత్రిగారు మాకు అందరికి స్వయం గా శాలువాలు కప్పి సన్మానించటం ,అంతా రాత్రి 11-30 గంటలు అయినా దాదాపు 5 వందల కిలో మీటర్లు ప్రయాణం చేసిన మాకు కాని ,పొద్దుటినుంచి రైతులతో ,జలసంఘాలవారితో భేటీలో ఉన్నా మంత్రిగారికి కాని, అర్ధ రాత్రి అవుతున్నా అన్నదాతలకు కాని విసుగు అని పించకుండా కార్యక్రమం అంతా ఒక్క రోజులో జరగటం చూస్తే కలయో వైష్ణవ మాయయో అనిపించింది .అంతటి బృహత్తర నిర్మాణ దశలను ప్రత్యక్షంగా చూడటం మా అదృష్టం శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి భారత ప్రధాని నెహ్రు శంకుస్థాపన చేసిన వారానికే నేను ,మా అమ్మా శ్రీశైలం సందర్శింఛి అక్కడ దాదాపు పది హీను రోజులున్న విషయం జ్ఞాపక మొచ్చింది .ఇదీ నిన్నటి మాపర్యటన సారాంశం .వివరాలు తరువాత తెలియ జేస్తాను .మా పర్యటనలో మాతోపాటు ప్రపంచ ప్రసిద్ధ నైరూప్య చిత్రకారులు ,ఆధునిక పికాసో,పద్మశ్రీ ఎస్వి .రామారావు గారు ,పత్రికా రంగానికి చెందిన శ్రీ చలపాక ప్రకాష్ , వంటి వారు ఉండటం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది . ఈ సమావేశాన్ని ‘’జలదాతలు,అన్నదాతలు అక్షరాదాతల’’ సంయుక్త సమావేశం కనుక సత్ఫలితాలనిస్తుంది ‘అని నా కవిత వినిపించాను- .కవులమైన మేము రాసింది ,రాస్తున్నదీ ,రాయబోఏదీ ప్రభుత్వానికి భజన కాదు వ్యక్తులకు డప్పు కొట్టటం కాదు ,అక్కడ జరుగుతున్న అభివృద్ధిని,మేం చూసిన కళ్ళతో తెలియ జేయటమే . ప్రాజెక్ట్ పూర్తీ అయితే ఎంతటి మహోత్క్రుస్టం గా రాష్ట్రం ఉండబోతోందో ,ఎంత నిబద్ధతగా ఇరావైనాలుగుగంటలూ, వారానికి ఏడు రోజులు పని చేస్తూ అనుకున్న సమయానికి నిర్మాణ౦ పూర్తీ చేసి ఆంద్ర జాతికి అంకిత మిచ్చే కృషిలో అందరూ భాగ స్వాములవుతున్నారో ,కళ్ళున్నా చూడలేని ,చెవులున్నా వినలేని ,అభి వృద్ధి ఉన్నా లేదని బుకాయించే వారికి తెలియ జెప్పటానికి మాత్రమే.ప్రభుత్వానికి మేం ప్రచార సారదులం కాము కాము కాము అని విన్న విస్తున్నాం .సత్యానికి మాత్రమే మా ప్రచారం .
పట్టిసీమ
పట్టి సీమ
బాబు పట్టు బట్టిన
సృష్టి సీమ
ఎత్తిపోతల జల వృష్టి సీమ
ఆంధ్ర అన్నదాతల సంతుష్టి సీమ
పంటలకు ,సౌభాగ్య పుష్టి సీమ
శాస్త్ర సాంకేతిక సమష్టి కృషి సీమ
సస్య శ్యామలాంధ్ర పునః సృష్టి సీమ .
పోలవరం
ప్రాజెక్ట్ పోలవరం
దశాబ్దాల కాంక్షల కలవరం
సాకార మౌతున్న ‘’జల pool వరం ‘’
భగీరధుని కన్నా మిన్న
విజన్ ఉన్న చంద్ర బాబు
‘’ఆంధ్రా కాటన్ ‘’ అనటం సబబు .
ఇవి నవ్యాంధ్ర జనవనరుల బ్రహ్మోత్సవాలు
ఆనందం తో నర్తించే మన హృదయ పులకా౦కితాలు .
మిగిలిన వివరాలు తరువాత వ్యాసం లో
సశేషం
మాతృభాష దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-17 –ఉయ్యూరు
