వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం  బైరాగి వరకు 33 మంది పై వరద కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు ప్రవర్తనల తీరుకు పరిశీలించి ఆత్మీయంగా రాసిన విశేషాలివి .వారి తరం వాటి ఊపిరి చప్పుళ్ళు వినిపించాడు వరద .రచయిత రచనా సామర్ధ్యం ,ప్రేరణ వెనుక ఉన్న వైయక్తిక జీవిత నేపధ్య విలువ తెలిపాడు .ఆయన చెపితేనే మనకు మారేపల్లి ,బొడ్డు ,ముద్దు కృష్ణ ,పురిపండా ,మాచిరాజు ,తురగా ,నలినీకుమార్ లగురించి పూర్తిగా తెలిసింది .వారి అనుభవాలు ‘’స్వ ఘోషలు ‘’కావు .వారి స్థాన నిర్ణయాల కు ఆకరాలు(రిఫరెన్స్ లు ) .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఆకాడెమీ ఆవిర్భావానికి పూర్వ రంగం ,అ.ర స .ఆవిర్భావ నేపధ్యం ,విలువైన డాక్యు మెంట్లు అన్నాడు శ్రీకాంత శర్మ .అంతకు మించి వరద ‘’కదన శైలి ‘’మరో ఎత్తు .కబుర్లు చెప్పినట్లు రాయటం చదివే ధోరణి పెంచేందుకు బాగా తోడ్పడింది .పాఠకుడిని మార్చే నైపుణ్యం ఉంది ఇందులో .పది పరిశోధన గ్రంధాలు ఇవ్వలేని సారాన్ని అయిదారు పేజీలలో తేల్చాడు వరద .అయన రుచి భేదం మనకు నచ్చకపోవచ్చు కాని అభిరుచిని కాదనలేం .అన్నాడు శర్మ .

‘’ఉన్మత్త భావ శాలుర జఠరాగ్నిని ని కవన కుతూహలం ఎట్టకేలకు చల్లార్చింది ‘’అన్నాడు అంబటి సురేంద్ర రాజు .కవుల వ్యక్తిగత జీవితం లోని ఔన్నత్య,సత్య సంధత,ఆదర్శం ,నిర్భీతి ,వ్యక్తిత్వం విలువలకోసం తపన మనముందుంచి కళ్ళు తెరిపించాడు వరద అన్నాడు రాజు రాజా లాంటి మాట .ఇది అసంపూర్తి గానే ఉంది .అప్పుడే అయిపోయిందా అనే ఉత్కంఠ మిగిల్చాడు .అన్ని వ్యాసాలూ ‘’జీవన శకలాలే ‘’.రెప్పపాటుకాలం లో గొప్ప కాంతి ప్రజ్వరిల్ల జేశాయి .శైలీ విన్యాసమే దీనికి గొప్పకారణం .పాఠకుడిని ‘’నిర్నిమేషుడిని ‘’చేసింది .బెల్లం కొండ ‘’త్రిపుట ‘’,తాగు బోతూ చెల్లెలా ‘’పాప’’ యెర్ర జీర ‘’రాయప్రోలు రాజశేఖర్ ‘’నివాళి ‘’’’శిష్ట్లా జ్ఞాపకాలు ‘’ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి ధన్యవాదాలు చెప్పాడు రాజు .’’సాహిత్య శిరో వేదన తో బాధ పడుతున్న ‘’సమకాలీన కవితా బాధితులకు ‘’కవన కుతూహలం ‘’ఒక ఉప శాంతి ‘’అన్నాడు అజంతా .అంతే కాదు ‘’సైద్ధాంతిక శిరో ముండనానికి  ఇది విరుగుడు కూడా ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు  సురేంద్ర రాజు .

‘’నారాయణ బాబు వట్టి అమాయకుడు అనుకొనే వాడిని ‘’అన్న వరద మాటల్లో బాబు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అన్న భావం ఉంది ‘’అన్నాడు ఏ బి కె .శ్రీ శ్రీ కవిత్వం మీదే సదభిప్రాయం లేని వరద, బాబు గురించి ఇంతకంటే ఏమంటాడు అన్నాడు ప్రసాద్ .’’ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం –ఒక రమ్యా లోకం ‘’అన్నది ఎందరికో నచ్చినమాట  అంటాడు  ‘’ఆర్ ‘’.ఆనాటి నవ్య కవులు 1920 లోపు కంటే 19 21-30 మధ్యనే గొప్పకవిత్వం అంతా రాశేశారు .కనుక 1910-1930  కాలం స్వర్ణయుగం అనాలి అని సవరణ చేశాడు ఆర్ .వరద కవన కుతూహలం చూస్తే ,చదివితే ఆనాటి సాహిత్య వాతావరణం మళ్ళీ వస్తే బాగుండును అనే ‘’నాస్టా ల్జియా ‘’కలుగుతుందన్నాడు ఆర్ .ఈ స్కెచెస్ కవుల జీవిత చరిత్రలుకావు తనజ్ఞాపకాల కధనం .విభిన్న వ్యక్తిత్వాల సజీవ సందర్శనం .శేషేంద్ర శర్మ కూడా పద్యాన్ని వరదలానే నెత్తికి ఎత్తు కోన్నవాడే తర్వాత వచనకవితలో పండిపోయాడు .

‘’ముద్దుకృష్ణ రాస్తాను అన్నాడు రాయలేదు.ఇది ముద్దు కృష్ణ రాయాల్సిన పుస్తకం అని వరద అనటం ఆయన మర్యాద ..రావి శాస్త్రి కూడా ప్రేరకుడు .ఈ వ్యాసాలూ హోమియోపతి మందులాగా ‘’విగరు, పొగరు ,పోటేన్సి ‘’కలిగి ఉన్నాయి అన్నాడు పురాణం .వరదను జీనియస్ అని రావి శాస్త్రి ఎప్పుడూ చెప్పేవాడని చందు సుబ్బారావు జ్ఞాపకం చేశాడు .

ఇంతటి కుతూహలం పుట్టించింది వరద ‘’క’వన కుతూహలం  ‘’

మహా శివరాత్రి శుభా కా౦క్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-2-17 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.