గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
386-మధ్వ విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)
ద్వైతమత స్థాపనాచార్యులపై మధ్వ విజయం రాసిన నారాయణ పండితాచార్య శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు త్రివిక్రమ పండితా చార్య కుమారుడు .మధ్వ విజయం 16 సర్గల మహాకావ్యం . మధ్వాచార్యులు సమకాలీకులవటం వలన ఈ గ్రంధం మన విద్యారణ్యులవారి శంకర విజయంలాగా సాధికారమైనది . దీనికి ఆయనే ‘’సుమధ్వ విజయ ‘’వ్యాఖ్యానం రాశాడు ప్రకాశిక అనే పేరు కూడా ఉంది .నారాయణ పండితాచార్య శివస్తుతి ,3 వేల శ్లోకాలతో సంగ్రహ రామాయణం ,ప్రమేయ నవ మాలిక అనే ‘’అనుమాధవ విజయం’’ కూడా రాశాడు .ఇది 32 శ్లోకాల మధ్వ సంగ్రహ చరిత్ర .దీనికి రాఘవేంద్ర స్వామి తమ పూర్వాశ్రమం లో వ్యాఖ్యానం రాశారు .
మణి మంజరి ,శుభోదయకావ్యాలు కూడా ఈ కవి రాశాడు .మణి మంజరిలో మధ్వాచార్యులు ముందున్న వైష్ణవాచార్యుల చరిత్ర అంతా ఎనిమిది సర్గలలో సరళ సుందరంగా రాశాడు . ఈయన రచనన్నిటిపై విపులమైన వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి .మధ్వాచార్యులు దశ ప్రకాశం పై నారాయణ పండితాచార్య ప్రసిద్ధ వ్యాఖ్యానం ‘’విష్ణు తత్వ నిర్ణయ సారం ‘’రాశాడు . ఈ టీక నే ‘’తత్వ మంజరి ‘’అంటారు .అందుకనే ఈయనకు ‘’ప్రాచీన టీకాకారుడు ‘’అని పేరు . కేరళలోని కాసార్ గోడ్ లో ఇప్పటికీ ఆయన స్వగృహాన్ని చూడవచ్చు . దీనిని గౌరవంగా ‘’కవి మఠం ‘’అంటారు .
387-భ్రమర గీత కర్త -శ్రీ పాద రాజ(1404-1502)
కర్ణాటకలో హరిదాస ఉద్యమ పిత . విజయనగర సామ్రాజ్య రాజగురువుకూడా .లక్ష్మీ నారాయణ తీర్ధ అనీ అంటారు ..కర్ణాటక చెన్నపట్న తాలూకా అబ్బూరులో జన్మిచాడు . ఆయనను ధ్రువుని అవతారంగా భావిస్తారు .. ద్వైత ,హరిదాసు సాహిత్యానికి ,రాజకీయ సాంస్కృతిక మార్పులకు ఆయన అసమాన కృషి చేశాడు . ఒకసారి స్వర్ణ వర్ణ తీర్ధ స్వామి అబ్బూరు వచ్చి బాల లక్ష్మీ నారాయణ ను అబ్బూరు ఎంత దూరం అని అడిగితె ,తెలివిగా ‘’అస్తమయ సూర్యుని చూస్తున్నారుకదా .మేము ఇక్కడ ఆడుతున్నాం కదా .యెంత దూరమో మీరే ఊహించండి ‘’అన్నాడు .అంటే చీకటిపడుతుంటే ఇంటికి వెళ్ళటానికి మాకు ఎక్కువ సమయం పట్టదు కదా అంతతక్కువ దూరం అనే భావం తో చెప్పాడన్నమాట . స్వాములవారు ఈ బాలుడు గడుసు పిండమే నని గ్రహించి ,తన శిష్యుడిని చేసుకొని సన్యాసమిప్పించి ఉత్తరాధికారిని చేశాడు .
శ్రీపాద రాజ తీర్ధ పీఠాధిపతి అయి విజయ నగర రాజులుచేసిన బ్రాహ్మహత్యా దోషాలను ఇవారించాడు సంస్కృత ,కన్నడ భాషలలో గొప్ప పండితుడై చాలా గ్రంథాలు రాశాడు .భ్రమర గీత ,వేణుగీత ,గోపీ గీత ,మాధవ నామ సంస్కృత రచనలు బహుళ వ్యాప్తి పొందాయి .ఆయనతన భక్తి గీతాలను ‘’దేవర నామాలు ‘’అని చెప్పి పాడేవాడు .తన సంతకాన్ని ‘’రంగ విఠల ‘’అని చేసేవాడు . ఆయన రాసిన భక్తిగీతం ;;భూషణకే భూషణ ‘’అందరి నాలుకలపై నర్తిస్తుంది. కోలార్ జిల్లా ముల్ బగాయ్ తాలూకా నరసింహ తీర్ధలో ఆయన ‘’బృందావనం ‘’ను లక్షలాది భక్తులు దర్శిస్తారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
