సూత శౌనకులు
ప్రతి పురాణం ‘’సూతముని శౌనకాది మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల ఆలోచ్చించి ప్రయత్నించినా మనకు లభించే విషయం చాలా స్వల్పమే .ఇదొక నిరుత్సాహం .నాకూ న్తవరకు ఆ ఆలోచన రాలేదు ఇవాళ బల్బ్ వెలిగి తెలుసుకొనే ప్రయత్నం చేశాను .నాకుదోరికిన సమాచారం మీకూ అందిస్తున్నాను .ఇంతకంటే అదనపు సమాచారం ఎవరి దగ్గర ఉన్నా పంపించి దీన్ని నిరభ్యంతరంగా పరిపూర్ణం చేయవచ్చు .
సూత ముని
పృధు చక్రవర్తి పితామహ సంబంధమైన యజ్ఞాలు చేస్తుండగా శ్రీమహా విష్ణువు వచ్చి పౌరాణికుడై సూతుడు అనే పేరుతొ పిలువబడ్డాడు .ఆతర్వాత అతని సంతతి వారందరికీ ఈపేరేవచ్చింది అని బ్రహ్మాండ పురాణ౦లో ఉన్నది .
పృధు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలను చేద్దామను కొని బ్రహ్మావర్త దేశం లో సరస్వతీ నదీ తీరాన 99పూర్తి చేసి ,నూరవది మొదలు పెట్టగా, ఈర్షతో ఇంద్రుడు యాగాశ్వం అపహిరించి తీసుకు వెళ్ళగా ,అతడి కొడుకు ఇంద్రుని జయించి గుర్రాన్ని తెచ్చాడు .ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకు పోయాడు పృధువుకు కోపం వచ్చి విల్లు బాణాలతో యుద్ధానికి బయల్దేరాడు .యాగం మధ్యలో వెళ్లరాదని మునులు చెప్పగా విరమించాడు .బ్రహ్మ వచ్చి ‘’మీరు ఏ దేవుని కోసం యాగం చేస్తున్నారో ఆయన అంశ ఉన్నవాడు ఇంద్రుడు కనుక వధార్హుడు కాడు.పృదువుకు 101యాగాల ఫలితం నేను అందిస్తున్నాను .ఇతడు నారాయణ అంశ సంభూతుడు .ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు ‘’అని చెప్పగా సంతృప్తి చెంది ,ఇంద్రునితో స్నేహం పాటించాడు .పరమేశ్వరుడు ఇంద్రునితో ప్రత్యక్షమై ‘’సత్పురుషులు దేహాభిమానంతో ఉండకూడదు .మత్సర వికారం పొంద రాదు ‘’అని ధర్మం బోధించి ఆశీర్వ దించారు .అలాగే పృధు చక్రవర్తి ధర్మ బద్ధంగా పాలించి రాజ్యం కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాడు
భాగవతం లో రోమ హర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనీ ఈయనే శౌనకాదులకు పురాణాలు చెప్పాడనీ ఉన్నది .
భారతం ప్రకారం కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసి ,తాను వక్తగా ఉండకుండా నైమిశారణ్యం లో శౌనకుడు మొదలైన మహర్షులు దీర్ఘ సత్ర యాగం చేస్తుంటే ,వ్యాస శిష్యుడు రోమ హర్షణుడు కుమారుడైన సూత మహర్షిద్వారా సత్కాలక్షేపంగా పురాణాలు చెప్పించాడు .
మార్కండేయ పురాణం లో ఇలా పురాణ ప్రవచనం చేస్తుండగా శ్రీకృష్ణుని అన్న బలరాముడు వచ్చాడు .ఆయనను చూసి సూతుడు గౌరవంగా లేచి నిలబడ లేదు .బలరాముడికి కోపం నషాళానికి అంటి క్షణం ఆలోచించకుండా సూతుడిని సంహరించాడు .శౌనకాది మహర్షులు ప్రార్దిస్తే మళ్ళీ సూతుడిని బ్రతికించి పురాణ ప్రవచనం యధేచ్చగా జరిగేట్లు చేశాడు .
శౌనక మహర్షి
శౌనక మహర్షి శనకమహర్షి కుమారుడు .శనకుడు గృత్స్నమదుడు అనే ముని కుమారుడు .శౌనకుని కుమారుడు ‘’బహ్వ్రచ ప్రవరుడు ‘’ . శౌనకుడు నైమి శారణ్యం లో పన్నెండు సంవత్సరాలు సత్రయాగంనిర్వహించాడు .యాగ సమయం లోసూతముని చేత పుణ్య కథా శ్రవణం చేయించాడు పురాణ శ్రణమూ చేసిన ధన్యజీవి .అని భాగవత పురాణం లో ఉన్నది .
భారతం లో శౌనకుడు కపి గోత్ర రుషి .ఇతడూ ,కక్ష సేన వంశం వాడైన ‘’అభి ప్రతారి ‘’అనే ముని కలిసి భోజనానికి కూర్చోగా ఒక బ్రహ్మ చారి భిక్షకు వచ్చాడు .వచ్చినవాడికి ‘’సంసర్గ విద్య ‘’ అంటే సాంఘిక శాస్త్రం లో నిష్ఠ ఉందో లేదో తెలుసుకొందామని వీరిద్దరూ భిక్ష ఇవ్వలేదు .అతడు శౌనకునితో ఆ విద్య పై వాదం చేశాడు .సంతృప్తి చెంది భిక్ష ఇచ్చారు .
మహా భారతం లోనే మరో విషయం కూడా ఉన్నది .పాండవులు అరణ్య వాసం చేస్తూ గంగాతీరం చేరి అక్కడ ఒక వట వృక్షం క్రింద ఒక పూట గడిపి వెడుతుంటే ,అక్కడి బ్రాహ్మణులు తమ అగ్ని హోత్రాలు తెచ్చుకొని పాండవులతో పాటు వనవాసం చేస్తామని వచ్చారు .అప్పుడు ధర్మరాజు ‘’మహాశయులారా !నేనురోజూ బ్రాహ్మణులకు మృస్టాన్న భోజనం తో సంతృప్తి పరచేవాడిని .ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు.ఏమీ ఇవ్వలేను పోషించలేను మాతో రావద్దు ‘’అని బాధ పడ్డాడు .అక్కడికి వచ్చిన శౌనకమహర్షికి ధర్మరాజు కు సుహృత్ వాతావరణం లో సంవాదం జరుగుతుంది .
ఋగ్వేద రక్షణ కోసం శౌనక మహర్షి 1-అనువాకానుక్రమణి 2-అర్షాను క్రమణి 3-చందోను క్రమణి 4- దేవతాను క్రమణి 5-పాదానుక్రమణి 6-సూక్తాను క్రమణి7-రుగ్విదానం 8-బృహద్దేవతా 9-ప్రాతి శాఖ్యం 10-శౌనక స్మృతి రాశాడు .ఇందులో మొదటి 7’’అనుక్రమణిక వాజ్మయం’’లోకి చేరతాయి .
జిజ్ఞాసువైన శౌనకమహర్షి అంగీరస మహర్షిని దర్శించి ‘’ఏది తెలుసుకొంటే అన్నీ తెలిసినట్లు ఔతుంది ?’’అని అడిగాడు .పర, అపరా విద్యలున్నాయి. పరా విద్య పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేది .అపరా విద్య లౌకిక ధర్మాలను వివరించేది .మొదటిదే గొప్పది .అది తెలిస్తే సంసార బంధ విముక్తి కలుగుతుంది ‘’అని ముండక ఉపనిషత్తు బోధించాడు .శౌనక మహర్షి ‘’ చరణ వ్యూహం ‘’అనే ధర్మశాస్త్ర కర్త కూడా .
పద్మ పురాణ లో ఒక రోజు ఒక మహర్షి శౌనకాశ్రమానికి వచ్చి విష్ణు కథా శ్రవణం చేస్తుంటే సూతమహర్షివచ్చాడు .అక్కడి వారందరికీ సూతమహర్షి ‘’పద్మ పురాణం ‘’అంతా వినిపించి వారిని బ్రహ్మానందపరచి ,తానూ బ్రహ్మానంద భరితుడు అయ్యాడని పద్మపురాణం లో ఉన్నది .ఇంతటి ఘన చరిత్ర ఉన్నవారు మన సూత శౌనక మహర్షులు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ 24-5-20-ఉయ్యూరు c