ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——-
లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై ఆంద్ర సభ్యుల తీవ్ర నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై పుస్తకాలు లాగేయటాలూ నాకు పరమ నీచంగా అనిపించి అలా కూర్చుండిపోయా మైకం కమ్మేసిందేమో?తరువాత ఏం జరిగిందో నా మైండ్ రీల్ ను వెనక్కి తిప్పా .అప్పుడు నేను అనుభవించిన రాక్షసానందం మర్చిపోలేను .మీకు చెప్పకుండా ఉండనూ లేను .అదే ఇది-
‘’భయ్యా ఆంధ్రాకు అన్యాయం అంటారు మాటిమాటికి ,బాబు వారానికో తాప ఢిల్లీ వస్తారు అందరి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంతో అంతో రాల్చుకుంటారు .సంతృప్తి పడకుండా అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.ఇప్పుడు ఈ బడ్జెట్ లో జైట్లీ ఏమీ ‘’చేపలేదని’’ఆందోళన నిరసన బందు .అన్యాయాలు ఇంతకు ముందు జరగలేదా ?మాతోనే మొదలైందా ?అని అడుగుతున్నా .విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ చేసిన పెద్ద అన్యాయాన్ని ఎదిరించి మా వెంకయ్యనాయుడూ భాయ్ అండగా నిల్చి’’ ఓట్లేసి గెలిపించండి ,మేము సమన్యాయం చేస్తా౦ ‘’అన్నాం .హోదా అన్నాం పాకేజీ అన్నాం .పోలవరం వరంగా ఇస్తామన్నాం .ఆంధ్రాను భూలోక స్వర్గం చేస్తామన్నాం. జతకట్టాం ,ఓట్లు దండుకున్నాం ,జగన్ మా అంట కాగినా ,బాబు కేజై కొట్టాం .ఇది అన్యాయమా .హస్తిన కొచ్చి నప్పుడల్లా ఎంతో కొంత రాలుస్తునే ఉన్నామ్ గదా .ఇది అన్యాయమంటా డే౦టిమగడా ! ‘’నాయుడు లిద్దరూ’’ ఆంధ్రాను బాగా ముందుకు నడిపిస్తున్నారని సంతోషిస్తూనే లోపల అసంతృప్తితో పెద్దనాయుడిని’’ పెద్ద హోదాలో’’ కూర్చోబెట్టి ,ఆంధ్రా కు అత్యంత గౌరవమిచ్చానని కితాబు పొంది కొంత ఒత్తిడి తగ్గించాను గందామాపార్టీకి ?ఇందులోనూ అన్యాయం చూస్తారా ? వయసు అడ్డం పెట్టి రాష్ట్రపతి కావాల్సిన వాజ్ పాయ్ తర్వాత అంత శ్రమపడ్డ ‘’ముసలాయన్ను’’ ‘’సోమనాధుని ‘’సాక్షిగా కిక్కురు మనకుండా చేశానా లేదా ?ఇది ఎలాంటి న్యాయమో మీకు తెల్దా . బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని అన్యాయం చేయలేదా ? తురుష్కులు ,మహమ్మదీయ పాలకులు మనల్ని అందలం ఎక్కించి గౌరవంగా పూజించారా ?కాంగ్రెస్ ‘’పటేల్ ‘’కు అన్యాయం చేయలేదా వీర సావర్కార్ కు ,హెడ్గేవార్ కుచేసింది అన్యాయం కాదా ?ప్రపంచబ్యాంకు అన్ని దేశాలకూ సమన్యాయం చేస్తోందా ? యుఎన్ వో చేస్తోందా న్యాయం ? అసలు సృష్టిలో సమన్యాయం ఉందా?ఆడా మగా సమానమా ?దేశం లో యుని కోడ్ఉందా?అమలు చేయటానికి ఎంత కష్ట పడాల్సి వస్తోందో తెలీదా ?
పీఠాధిపతులు అందరూ ఒకటిగా ఉన్నారా ?ఒక్కటే చెబుతున్నారా ?మహిళా సాధికారత నీటి మూటకాక యదార్ధమౌతోందా?అంతెందుకు 18 ఏళ్ళు దాటిన వారికే ఓటు హక్కేమిటి ?పుట్టగానే ఓటు హక్కు ఇవ్వరాదా?ఇక్కడ అన్యాయం లేదా ?మంచి చేద్దామని చట్టాలు తెస్తుంటే కోర్టు లు అడ్డుపడటం అన్యాయం కాదా ?అసలు ఇందరు దేవుళ్ళను పూజించటం వాళ్లకు వేర్వేరు దేవాలయాలు వేర్వేరు పూజా విధానాలు ఏమిటి ?అఖండ భారత్ అంటాం కదా ‘’అఖండ భగవాన్’’ ను ఎందుకు పూజించం ? ప్రపంచం లో ఎన్నో దేశాలు ఎన్నో మతాలూ ఎన్నో రంగుల జాతుల మనుషులు ఎందుకున్నారు ?అందరూ ఒకరుగా ఉండటం లేదేమి ?ఇందులో న్యాయం ఉందా?అలాగే ఆంధ్రా విషయం లో మేము చేసి౦ దాంట్లో అన్యాయం మా కాషాయకళ్ళకు కన్పించటం లేదు .మీ పచ్చ,యెర్ర ,మూడురంగుల కళ్ళకు కనిపిస్తుందేమో ?అది మా తప్పా ?దీనికోసం వీధుల్లోకి రావాలా ? మళ్ళీ మళ్ళీ ఢిల్లీ రావాలి మంతనాలు చేయాలి కొద్దోగొప్పో బూడిదో , విభూతో, మట్టో,మశానమో ,నీటి చుక్కలో రాల్చుకు పోవాలి.ఆంధ్రా వాళ్ళు అంటే చెప్పు కింద తేలును నలిపినట్టు కాంగ్రెస్ నలిపేసింది మీకు గుర్తు లేదా ?అప్పుడు మీకు చమ్మగా ఉందా ? మేము ఆప్యాయం కనిపిస్తూ నెత్తికెత్తుకుని కిందకు తోసేసి బురదలో తోక్కేస్తున్నామని బాధగా ఉందా ?ఇదేటి అన్నాయం సెప్మీ.
పెద్ద నోట్లు రద్దు చేసి భాండారం నింపేశామనుకున్నాం .తీరా చూస్తె ‘’పేద్ద బొక్క’’.అవాక్కయ్యా .అయినా అన్యాయం అని గీపెట్టలేదే .బుకాయిస్తూనే ఉన్నాం .రామాయణం లో రాజు కావాల్సిన రాఉడికి అన్యాయం జరిగి అరణ్య వాసం చేశాడే ‘’పితృవాక్య పరిపాలన ‘’అంటూ కిక్కురుమనకుండా. భారతం లో పాండవులు అన్యాయం జరిగినాఅరణ్య అజ్నాతవాసాలు చేస్తూ ఓర్పు ,ఓపిక కా పట్టారే .ఎలక్షన్లు అయి ఇంకా నాలుగేళ్ళు కాలేదు అప్పుడే అంత ఆక్రోశమా ?బ్రిటిష్ వాళ్ళు వందల ఏళ్ళు పాలిస్తే కిమ్మనకుండా ఉన్నాం .అప్పుడున్న ఓర్పుఇప్పుడేమైంది ?సహనానికి భూమాత ఉదాహరణ .ఆంధ్రులు ఈ నీతి తెలుసుకోవాలి .శిశుపాలుడి 99 తప్పులను క్రిష్నయ్య కాచలేదా ?చివరికి కదా భరతం పట్టింది ?అంత ఓపిక లేదా మీకు ?భాగవతం లోశ్రీ హరి- జయ విజయుల పీచమణచటానికి ఎన్ని అవతారాలో ఎత్తి ఎంతో సహనం వహించి శిక్షించాడన్న పురాణ కద మర్చిపోయారా ?ఆంధ్రా యాజిటేషన్ లో ‘’కాన్గీలు’’ మిమ్మల్ని పూర్తిగా ము౦చెయ్యలేదా ?ఉద్యమించిన వాళ్ళే అందలాలెక్కలేదా ?ఇది చరిత్ర .కనుక ఏరకంగా చూసినా అంటే చరిత్ర ,పురాణ ఇతిహాసాల ను అర్ధం చేసుకుంటే మీకు సహనం లభిస్తుంది .అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం .నాకు నాలుగు దేశాల పర్యటనఉంది.అర్జెంట్ గా వెళ్ళాలి .ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. సమస్యలు అనంతం వాటి పరిష్కారానికి అనంతుడైన ఆదిశేషుని సహనం మీరు అలవర్చుకోండి .నేను తిరిగివచ్చి అక్కడ ఆ దేశాలవాళ్ళు రాల్చేదేమైనా ఉంటె అందులో నాలుగు రేణువులు మీకూ రాలుస్తా ‘’
కళ్ళంబడి ఆనంద బాష్పాలు రాలుస్తూ జైజై లు కొడుతూ లోక్ సభ ను ఒకసారి కలయ జూశా .అక్కడ స్పీకర్ కాని, మంత్రులు ,అధికార ,ప్రతిపక్ష సభ్యులు కాని పిట్ట కూడా ఎవ్వరూ కనబడ లేదు .ప్రధాని అటెండర్ కుండెడు నీళ్ళతో ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు .ఇదేమిటి ఇంత అద్భుత ప్రసంగానికి అందరూ గైర్ హాజరయ్యారేమిటి అను కొంటు ఉండగా మా ఆవిడ చీపురుమాలక్ష్మి తో ప్రత్యక్షమై ‘’ తెల్లార్లూ ఆ చానళ్ళు మార్చి మార్చి చూడోద్దురా మగడా, ఆ డిస్కషన్లు వినద్దు రా పతి దేవుడా అని నెత్తీ నోరూ పెట్టుకుని మొత్తుకున్నా ప్రయోజనం లేదు .పొద్దున్నే సంధి ప్రేలాపనలలు .ఏం మొగుడో ఏంటో?’’అని సణుక్కుంటూ కళ్ళాపి చల్లటానికి వెళ్ళింది .ఓరి నాయనో ఇదంతా కలా!అని సంబాళించుకుని పక్కమీంచి లేచి కూర్చున్నా .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –9-2-18 –ఉయ్యూరు
