బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సాధారణ ప్రజలకు ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు. వారితోపాటు పని చేసిన వారికి ఒక అనుభవజ్ఞుడైన, అపరిమితమైనటువంటి జ్ఞానంతో వందలాదిమంది తన సహచర ఉపాధ్యాయులకు గురువుగా, వేలాదిమంది శిష్య బృందాలకి మహా మహోపాధ్యాయుడిగా సుపరిచితం!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఉయ్యూరు ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఎందరో మహానుభావులకు, ఆలవాలంగా అలరారుతోంది. అటువంటి ఉయ్యూరు పట్టణంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గబ్బిట దుర్గాప్రసాద్ గారు తమ విశ్రాంత జీవనాన్ని అవిశ్రాంత సాహిత్య సేవకునిగా సాహితీ రచనలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సాహితీ మిత్రులకు సాహితీ బంధువుగా తెలుగు సాహిత్యం పై, కథపై, సంస్కృతిపై, సాంప్రదాయాలపై, సాంకేతిక విద్యపై ఇలా అనేక రంగాలలో విశేషమైన కృషి చేస్తూ సమాజం కోసం సాహిత్య సేద్యాన్ని చేస్తూ విలువైన అనితర సాధ్యమైన ప్రాచీన సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం రూపు రేఖ విలాసాలు ఎలా మార్చుకుందో కథ, కవిత, వ్యాసం, ఉపన్యాసం, గేయం, గీతం, కథానిక చారిత్రక అంశాలు, శాస్త్రజ్ఞుల జీవన ప్రస్థానం మొదలుగా గల అనేక విషయాలలో కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో గల సాంకేతిక ప్రజ్ఞ కలిగిన ఎందరో మహానుభావుల సంక్షిప్త చరిత్రను తనదైన శైలిలో ఎన్నో పుస్తకాల రూపంలో సామాన్యుల నుంచి విశేష ప్రతిభావంతుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ చేరువలో ఉండేలా తన వంతు కృషిని కొనసాగిస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు అనడం కంటే సాహితీ వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్నారు అని అనడం సబబుగా అనిపిస్తుంది!
ఇక శ్రీ దుర్గాప్రసాద్ గారి ప్రస్థానం గురించి ఒక్కసారి సింహావలోకనం చేస్తే, వారు ఎనిమిది పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు తనదైన శైలిలో నేటి ఆధునిక మాధ్యమాలైనటువంటి ముఖ పుస్తకం, వాట్సప్, యూట్యూబ్ మొదలైన వాటి సహాయంతో తన యొక్క సాహితీ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఉగాది పురస్కారాల మహోత్సవం కార్యక్రమం ఈనాటిది కాదు… అనేక సంవత్సరాలుగా వారు ఇటువంటి సంఘ హితమైన, భావితరాలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చే విధంగా ప్రఖ్యాతి పొందిన అద్భుతమైన సాహిత్య ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, సంఘ సేవకులను, ప్రపంచవ్యాప్తంగా గల ఆయా దేశాల జాతీయ స్థాయిలో స్ఫూర్తి ప్రదాతల జీవన విశేషాలను, వివిధ రకాల కళారూపాలలో ప్రావీణ్యత చూపిన ఎందరో పెద్దలను తమదైన శైలిలో ప్రతి ఉగాదికి సరస భారతి ఉగాది పురస్కారాలు పేరున సత్కరించడంతో వారిని గౌరవించడం మనందరికీ ఎంతో సంతోషదాయకం!
సరస భారతి, ఉయ్యూరు వారి శ్రీ విశ్వావసు ఉగాది పురస్కారాల మహోత్సవ కార్యక్రమంలో, వారణాశి సాహితీ వారధి తరఫున పాలుపంచుకోవడం, మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అదేవిధంగా మేము నిర్వహించిన దీపావళి కథల పోటీల లో బహుమతి పొందిన కథల సంకలనం బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు మరియు శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం ఒక గొప్ప జ్ఞాపకంగా మా మదిలో కలకాలం నిలిచిపోతుంది.
కృతజ్ఞతలతో, నమస్కారములతో బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి సభక్తి పూర్వకంగా సమర్పణం! 🌸🙏🌸
— వెంకట కృష్ణమూర్తి వారణాశి, శ్రీనివాసు వారణాశి, ఫణి వారణాశి
(వారణాశి సాహితీ వారధి, హైదరాబాదు)
