ఆంగ్లపదాల ‘’మువ్వల’’ సవ్వడి హోరులో సామాజిక వెలుగుల ‘’జ్యోతి ‘’కథలు
ఈ నెల 18 మంగళగిరి లైబ్రరీలో పరిచయం చేసుకొని , ప్రొఫెసర్ సుశీలమ్మ ,స్వర్గీయ సోమేపల్లి వారి సతీమణి ,వారబ్బాయి వశిష్ట లతో గ్రూపు ఫోటోలో చొరబడిన శ్రీమతి మువ్వలజ్యోతి తన కథలపుస్తకం ‘’అరవింద ,మరికొన్ని కథలు ‘’ పుస్తకం నాకు అందజేసింది .తాను బెంగుళూరులో ఉంటానని ,నా సెల్ నంబర్ కూడా తీసుకొన్నది .ఆమెను వినటం, చూడటం అదే మొదటిసారి.
ఇందులో ఉన్న 19కథలు వివిధ సామాజిక అంశాలు ఉన్నవి .మంచి కథకురాలని పించింది .మొదలుపెడితే చివరిదాకా చదివించే నడక వున్నది .ఇవాళేచదివి స్పందిస్తున్నాను .ఇవన్నీ వివిధ పత్రికలలో ముద్రణ భాగ్యం పొందినవే .
ఫేస్ బుక్ లో ఉన్న ఫోటో మార్ఫింగ్ చేస్తానని గురువుగారి కూతుర్నేబెదిరించి,మానసిక క్షోభ కలిగించిన శిష్యుడినిపోలీసులకు పట్టించినకావ్య .ఇక చస్తే ఫేస్ బుక్ జోలికి వెళ్లనని లెంపలేసుకొని కుటుంబానికి క్షమాపణ చెప్పిననిరంజన్ కథ’’అవివేకం ‘’ .భర్తను అర్ధం చేసుకోలేక ఆడంబరాలకు ఎగబడి ప్రశాంత జీవితాన్ని పాడుచేసుకొని తప్పు తెలుసుకొని భర్త అనిల్ కు క్షమాపణ చెప్పి ,జీవితాన్ని గాడిలో పెట్టుకొన్న పద్మ ‘’అందని ద్రాక్ష ‘’కథ .అమెరికాలో ఉంటూ అమ్మకు చెల్లికి లేనిపోనివి ఎక్కించి మనసులు విరిచి దూరం పెట్టగా తల్లిజబ్బుతో ఉండి కొడుక్కి బుద్ధి చెప్పగా ఆ చెల్లి వదిన కడుపుతో ఉందని తెలిసి ఇండియానుంచి అమ్మకు మందులు, వదినకు స్వీట్స్ కొరియర్ చేసి సౌమ్య అతి సౌమ్యంగా ప్రవర్తించటం ‘’అపోహ ‘’కథా కమామీషు ..ప్రేమించమని వెంటపడి ససేమిరా అంటే అరవింద మొహం పై యాసిడ్ పోసి వికృతను చేసినా మొక్కవోని ధైర్యంతో ఆదర్శవంతంగా ఎదిగి తనలా జీవితాన్ని కోల్పోయిన అభాగ్య స్త్రీలకు ,భర్తచనిపోయి మానసిక కుంగిన వారికి ఆర్దిక సాయం చేస్తూ ,ఆమె అందాన్నికాక ఆదర్శాన్ని ప్రేమించి పెళ్ళాడిన నీరజ్ కత అరవింద.ఇదే పుస్తకం శీర్షిక కూడా .
పిల్లలు ఉంటేనే ఆ సంసారం మజాగా ఉంటుందని తప్పు తెలుసుకొని భర్త రోహన్ ఇష్టప్రకారం తానూ మారి సత్య సాయంకాలాలలో త్వరగా ఇంటికి వచ్చి పిల్లల ఆలనా పాలనా చూసుకొంటూ ఉండగా ఫిజికల్ గా సాయం చేయలేకపోయినా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలనుకొని సంజీవ్ కూడా పంధా మార్చుకొని హాయిగా కాపురం చేస్తున్న ‘’మజిలీ ‘’కథ .పిల్లలు ఇంట్లో ఉంటె గోల భరించలేక,పిల్లలు ఏం కోల్పోటారో తెలీక హాస్టల్ లో పడేస్తే, వాళ్ళు వృద్ధాప్యం లో తలిదండ్రులను వోల్డేజ్ హోమ్ లో చేర్చే పరిస్థితి బూమెరాంగ్ అవటం ‘’మేలుకొలుపు ‘’విషయం . .ఆస్తీపాస్తీ ఉంటేనే తలిదండ్రులను దగ్గరకు తీస్తారు కొడుకులు కూతుళ్ళు .సుందరయ్యగారు ఇది గ్రహించి భార్యతో హాయిగా బతుకుతూ భార్య చనిపోగానే తనకు మిగిలిన ఒక్క ఇంటిని వృద్ధాశ్రమానికి రాసేసి హాయిగా ఊపిరి పీల్చుకొన్నాడు ‘’తండ్రి తీర్పు ‘’లో .పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని ,దేవుడిచ్చిన అవకాశాలను మనమే దుర్వినియోగం చేసుకొని మరిన్ని తప్పులు చేసి నింద ఆనీలకంఠు ని మీద వేసేదే’’ప్రాయశ్చిత్తం ‘’కహానీ . మంచి జీతం గొప్ప ఉద్యోగం ఉన్నప్పుడు గౌరవం అంటూ దర్జా పోయిన , కలిసిఉండాలని ఆరాట పడిన భార్య సత్యవతిని పురుగును చూసినట్లు చూసిన భర్త చివరకు తప్పు తెలుసుకొని ఆమెతో కలిసి ఉండాలని భావించినా ,కోర్టు లో జడ్జి అడిగిన దానికి ‘’గౌరవం అ౦టూ బతుకును బలి చేసుకొనే ఆ నికృష్టజీవితం నాకు వద్దు .విడాకులు ఇప్పించండి ‘’అని కరాఖండీ గా చెప్పిన సత్యవతి నిర్ణయమే కొత్త మలుపు .ఇలా మిగిలినవీ మెరుపుతీగల్లా కనిపిస్తాయి ఇందులో .అన్నీ అన్నే .అయితే తెలుగు తక్కువ ఇంగ్లీష్ పదాల హోరు ఎక్కువ అనిపించింది .అందుకే శీర్షిక అలాపెట్టాను .
సాఫ్ట్ వేర్ రంగం లో తలమునకలౌతూ ,కవితలురాస్తూ ,కథల్లోనూ పట్టు సాధించి నెట్ లో కూడా దూకుడుపెంచి దూసుకు పోతున్న మువ్వలజ్యోతి కి అభినందనలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-26-ఉయ్యూరు .
