ఆర్ద్రములు చేరా స్మృతులు – చలసాని ప్రసాద్‌

ఆర్ద్రములు చేరా స్మృతులు – చలసాని ప్రసాద్‌

Published at: 28-07-2014 07:26 AM

బుధవారం నాడే ఫోనులో పలకరించా. బాగున్నానన్నాడు. కాస్త తమాయించుకున్నా. ఇంతలోనే మీ చేరా పోయాడు అంటూ ఫోను. నిలవలేకపోయా. నిబ్బరం కోల్పోయా.
మా స్నేహానికి యాభై ఏళ్ళు పై బడ్డాయి. అతనొక కమ్యూనిస్టు అభిమాని. విరసం గాఢాభిమాని. విరసంలో లేడుగాని, విరసంతోనే ఉండేవాడు.నేను విరసం వ్యవస్థాపక అసభ్యుడుని అని అంటూండేవాడు. మేమిద్దరం పరస్పరం అయోమయం అని పిలుచుకునేవాళ్ళం. ‘మీ ఇద్దరినీ మరెవ్వరూ ఏమీ అనక్కరలేకుండా చక్కని పేర్లు పెట్టుకున్నారు అంటూ మా విజయ, వాళ్ళ రంగనాయకి హాయిగా నవ్వేవాళ్ళు. మేము ఉత్తరాలు చాలా రాసుకునే వాళ్ళం. ‘ప్రియమైన అయోమయం’ అనే బదులు ‘ప్రియోమయం’ అని వాడవచ్చా? అని అడిగా. ఎందుకు వాడకూడదు? వైద్యుడిని ‘మందువాడు’ అని మన తిక్కన పేర్కొన్నా డు అంటూ భాషమీద చాలాసేపు బోధ చేశాడు. కవితాలోలుడు. ఆధునిక తెలుగు కవిత్వం అంటే పంచప్రాణాలు. కవిని అతిగా పొగిడితే ఎవరయినా ఏద్దేవా చేసేవారు. అలాంటప్పుడు అలిగేవాడు. ‘కవిత్వం జోలి నాకేల? నేను భాషావాదిని’ అని తాత్కాలికంగా అస్త్ర సన్యాసం చేసేవాడు.

కవిత్వం అంటే చాలా చాలా ఇష్టం. కాని తన కృషి భాషా శాస్త్రంలో అని పదేపదే చెప్పేవాడు. ‘చేరాతలు’ సాహిత్యాభిమానులకి మంచి ఊతకర్ర. చక్కటి విమర్శకుడిగా అందరి కళ్ళల్లోనూ వెలుగుతాడు. విడవకుండా కాలమ్‌ రాశాడు.
కొన్నేళ్ళుగా ఒంట్లో బాగోలా. అయినా అస్త్ర సన్యాసం చేయలేదు. సాహిత్య సభలనీ, సంగీత కచేరీలనీ మాత్రం మానేవాడు కాదు. మాటల్లోగాని, చేతల్లోగాని,రాతల్లోగాని పరుషత్వం ఏ కోశానా ఉండేవి కావు. ఒక రకంగా సౌమ్యశీలి అనవచ్చు. స్నేహాలని ప్రాణప్రదం గా కాపాడుకొనేవాడు. ఆడంబరం దర్పం అతనిలో లేవు. కంచుకాగడా పెట్టి వెదికినా కనిపించవు.

రచయిత బుచ్చిబాబు ఎక్కడో రాశాడు- ‘‘మనదేశం ఇంత విశాలంగా ఉండడం చేటు. స్నేహితులు దూరదూర తీరాలకి తరలిపోతారు. పదేపదే కలవాలంటే కుదరదు. బెంగలు పెరిగిపోతుంటాయి. ఆర్ద్రత, అభి మానం, ప్రేమ ఎప్పటికీ ఉండేవే. అవి ఇగిరిపోవు, ఇంకిపోవు, పరిమళాలు వెదజల్లుతూనే వుంటాయి’’
ఏది ఏమైనా స్నేహం మీద ఇంద్రగంటి వారి సూక్తులు అజరామరం.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి
వ్యష్టిజీవము చేదుపానీయమోయి…
– చలసాని ప్రసాద్‌

 

నేను ఒప్పుకుంటాను చేరా గారు… – విమల

Published at: 28-07-2014 07:27 AM

ఎప్పుడు కలిసినా, ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరించే చేకూరి రామారావు గారు ఇక లేరనుకోవడం మనసుకి చాలా కష్టంగా వుంది. విద్యార్థి ఉద్యమాలలో నేను పనిచేస్తున్న ఆ తొలినాళ్ళ నుంచీ ఆయన నాకు తెలుసు. ఆ రోజుల్లో, నేనూ, రంగవల్లీ ఉస్మానియా యూనివర్సిటీ నేరేడుచెట్ల మధ్య నుంచి క్యాంప్‌ త్రీ బస్తీ కలియ తిరిగి, తుప్పలూ, తుమ్మచెట్లూ దాటుకొని, అడ్డదారుల్లో చేరా ఇంటికి వెళ్ళేవాళ్ళం. రంగవల్లికి ఆ ఇల్లొక విడిది. చేరాగారు ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు, రచయిత అన్న విషయాల కన్నా, ఆయన ప్రజా ఉద్యమాలకి సానుభూతిపరుడు అన్న ఒక్క సంగతే ఆరోజుల్లో మాకు ఎక్కువగా అర్థమైన విషయం. అప్పటి నుంచీ, విరసంలో ఓ కార్యకర్తగా పనిచేసిన కాలమంతా ఆయన్ని అనేక సార్లు కలిసేదాన్ని. నన్ను చూడగానే ఆయనకి అర్థమైపోయేది. కాసిన్ని కబుర్లుపోయాక ‘ఏం చేయాలిప్పుడు? ఏం కాగితాలు పట్టుకొచ్చావ్‌?’ అంటూ నవ్వేవారాయన. ఎదురుకాల్పుల హత్యను, అక్రమ అరెస్టులను, ప్రజా ఉద్యమాలపైన, విరసంపైనా పోలీసు దాడుల నుంచీ మొదలుకొని పాలస్తీనా ఇజ్రాయెల్‌ సమస్య, అమెరికా అగ్రరాజ్య దురహంకారం దాకా, అనేక ఖండనల ప్రకటనల పైన ఆయన తొలి సంతకం తీసుకుని, ఇతర మేధావుల దగ్గరికి వెళ్ళటం నా అలవాటుగా ఉండేది. ఆయన మారుమాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. ‘మీ విరసం వాళ్ళు సాహిత్యం కన్నా రాజకీయాల్ని మరీ ఎక్కువ పట్టించుకుంటున్నారు’ అంటూ అప్పుడప్పుడు నెమ్మదిగానైనా విసుక్కునే వారు.

ఏవైనా సభలు జరుగుతుంటే సానుభూతిపరులు, సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు పోగు చేసే మంచి సాంప్రదాయం ఒకటుండేది ఆ రోజుల్లో. అప్పుడు కూడా చేరాగారే నాకు మొదట గుర్తొచ్చేవారు. విరసంలో సభ్యురాల్ని అని ఆయనకు తెలుసుకానీ నేను రాస్తానన్న విషయం ఆయనకి తెలీదు చాలా కాలం. నేనూ చెప్పలేదు. ఎక్కడ చదివారో, ఎవరు చెప్పారో తెలీదు కానీ, నా కవితలు ఒకటి రెండు చదివి నాకోసం కాచుకు కూర్చున్నారాయన. షరా మామూలుగా ఏదో ప్రకటనపై సంతకాల కోసం వెళ్ళానాయన దగ్గరికి. ‘నువ్వు  కవిత్వం రాస్తావన్న విషయం నాకసలు తెలీనే తెలీదు. నువ్వసలు ఎన్నడూ చెప్పనే లేదు’ అంటూ నిష్టూరంగా, కోప్పడి ఇప్పటిదాకా రాసిన కవిత్వం అంతా పట్టుకొచ్చి తనకివ్వమని ఆర్డర్‌ వేసారాయన. నెలలు గడిచినా ఆ విషయం నేను పట్టించుకోలేదు. అప్పుడు నేను పనిచేస్తున్న పార్టీ ఆఫీసులోనే నేను వుండేదాన్ని. పోరాటాలు, పార్టీ పత్రిక బాధ్యతల మధ్య తీరికేలేని, రాసుకున్నవన్నీ జాగ్రత్తగా దాచుకోవాలన్న స్పృహ లేని కాలం అది. చివరికాయన నువ్వు నీ కవిత్వం వినిపిస్తేనే పిటీషన్ల మీద సంతకం పెడతాననే వారు. ఆయన అలా వెంటబడి అడగటాన్ని తట్టుకోలేక, రెండు వంద పేజీల నోటు పుస్తకాల్లో దొరికిన నా కవిత్వం రాసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఎవరినడిగారో, ఎలా కనుక్కున్నారో తెలీదు కానీ, ఓ రోజు సాయంత్రం చేరాగారే స్వయంగా తిలక్‌నగర్‌ బతకమ్మ కుంట వద్ద మేడపైన వున్న విమోచన ఆఫీసుకి వచ్చారు. ‘నీకేం పట్టదు. నువ్వు రావు కదా! నేనే నీకోసం వెతుక్కుంటూ వచ్చా’’నన్నా రాయన. నా కవిత్వం గురించి సాహితీ కారుల టెక్నికల్‌ పరిభాషలో ఆయన చాలా సేపు మాట్లాడారు కానీ, చివరికి విషయం ఏమిటంటే మోడెస్టీని కాస్సేపు పక్కన పెట్టి నా కవిత్వాన్ని సంకలనంగా వేయమని. ఆయన చాలా గట్టిగా చెప్పిన కారణంగానే విరసం ద్విదశాబ్ది సభల సందర్భంగా నా మొదటి కవిత్వ సంకలనం ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ వచ్చింది.

ఆయన నాకో మాట తరచూ చెప్పేవారు. ‘నువ్వు కేవలం రాజకీయ కార్యకర్తవి మాత్రమే కాదు. కవివి అన్న విషయం మర్చిపోకు’ అని. నిజానికి అట్లా మరిచిపోయే అనేక పనులు మాలాంటి వాళ్లందరికీ వుంటుండేవి. నేను కవిత్వం రాయడానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదనేది ఆయనకి నాపై వున్న కంప్లెయింట్‌. చేరాగారూ నేను కూడా వొప్పుకుంటాను మీ మాట.

ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు రాజకీయ పరిస్థితులు, విరసం కార్యక్రమాల మీదా, వస్తు శిల్పాల మీదా చాలా చర్చలే జరుగుతుండేవి. నిజానికి ఆయన్ని వట్టి శిల్పవాది అంటూ అధిక్షేపించేలా మాట్లాడటం పట్ల నాకు ఎప్పుడూ అభ్యంతరం వుండింది. మంచి కవిత్వాన్ని, కొత్త కవుల్నీ ఆయన కనుగొని, ప్రోత్సహించినట్లుగా మరెవరూ చేయలేదు. చేరాతల గురించి, ఆయన సమీక్షల గురించి సాహితీ లోకం అంతా ఎదురుచూసిన కాలం ఒకటుండేది. నీలి కవిత్వం, బూతురాతలు అంటూ స్ర్తీవాద కవిత్వాన్ని ఖండఖండలుగా తెగనరుకుతున్నప్పుడు ఆయన తన రెండు చేతులనీ అడ్డు పెట్టి ఆ కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయన చూపిన సంయమనం గొప్పది. అస్తిత్వవాదనల వేదననీ, ఆగ్రహాన్నీ ఆయన సరిగ్గానే గుర్తించగలిగారు. పాత కొత్తలలో వున్న మంచిని, ప్రగతిశీలతని చూడగలిగిన, ఎల్లవేళలా, బాధితుల పక్షానా, పోరాడేవారి పక్షాన నిలబడిన, వ్యక్తిగత కీర్తికాంక్షల జోలికి పోకుండా వినమ్రంగా, నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోయిన ఆ పాత తరం మెల్లిమెల్లిగా అదృశ్యం కావటం చాలా బాధిస్తోంది.

అప్పుడప్పుడూ ఏ మీటింగుల్లోనో కలిసినప్పుడు ‘ఇంటికి రావచ్చు కదా!’ అని చాలా సార్లు నన్నడిగి విసుగుపుట్టి ‘ఇకనిన్నడగను’ అన్నారు. ఆ మధ్య మళ్ళీ కలిసినప్పుడు ఇంటి గుర్తులు చెప్పి, రమ్మన్నప్పుడు తప్పక వస్తానన్నాను. కానీ నా మాట నేను నిలబెట్టుకోలేదు. ఆయన మళ్ళీ కలవలేని తీరాలకు వెళ్లిపోయారు. ఏం చేయను ‘విప్లవ కవయిత్రి విమలకు అభిమానంతో చేరా’ అంటూ మీరు మీ పుస్తకం మీద రాసిచ్చిన చేరాతని చూస్తూ…
– విమల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మండలికి బుధ మండలి చేసిన ఆత్మీయ అభినందన సత్కారం

2sevayanam 001 3budhanampriya 001 4budhanampriya 001 5budhanampriya 001 6budhanmpriya 001 sevayanam 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు – వెల్చేరు నారాయణ రావు

విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు – వెల్చేరు నారాయణ రావు

Published at: 28-07-2014 07:28 AM

అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా  కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు.

అతను చేరా కాకముందునుంచీ, నేను నారాని అవకముందునించి-ఎప్పటినుంచో చెప్పలేను-చేకూరి రామారావు నాకు స్నేహితుడు. ఇద్దరమూ జీవితంలోనూ, సాహిత్యంలోనూ కలిసి నడిచాం. మొదట మేం ఎప్పుడు కలుసుకున్నమో కూడా చెప్పలేను. విశాఖపట్నంలో అనుకుంటాను, అతను భద్రిరాజు కృష్ణమూర్తి దగ్గర మాండలిక వృత్తిపదకోశం కోసం పనిచేస్తున్నాడు, ప్రేమ కవిత్వం రాస్తున్నాడు. పిఠాపురం హాష్టల్‌ దగ్గిర కూర్చుని గంటలకొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం మేం ఇద్దరం.

నన్ను భాషాశాస్త్రంలోకి పట్టుకొచ్చింది చేరానే. మైసూరులో నాకు మొట్టమొదటి భాషాశాస్త్ర పాఠాలు చెప్పాడతను. ఆ తరువాత హైదరాబాదులో భాషాశాస్త్రంలో డిప్లొమా చేసినపుడు కూడా నాకు పాఠాలు చెప్పింది అతనే. ఆ రోజుల్లో నేను హైదరాబాదులో డిప్లొమా చేస్తూ వాల్తేరులో తెలుగు ఎమ్‌ఎ చదువుతూండేవాడిని.
పేరుకి నాకో గది తార్నాకలో వుండేది. కాని నేను వుండేది ఎప్పుడూ చేరా వాళ్ళ ఇంట్లోనే. రంగనాయకిగారు నన్ను కుటుంబంలో మనిషిలా ఆప్యాయంగా చూసుకునేవారు. నేను కిట్టూ అని పిలిచే క్రిస్టఫర్‌ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఇప్పుడతను శాన్‌ఫ్రాన్సిస్కోలో హిస్టరీ ప్రొఫెసరు.

ఏవో పనులు, ఆలోచనలు, గందరగోళాల మధ్య, నేను హోటల్‌లో తిండి సరిగ్గా తినక విస్తట్లో అన్ని కెలికేసి, తిన్నట్లనిపించుకుని చెయ్యి కడుక్కుంటుంటే చూసి, దగ్గర కూచుని, ‘ఇదిగో ఈ కూర తినొచ్చు, ఈ పచ్చడి బాగుంటుంది’ అని చెప్తూ, సావకాశంగా తినేదాకా కబుర్లు చెప్తూ తను దగ్గిర కూచుని నాచేత మంచి భోజనం చేయించేవాడు చేరా.

తెలుగు సాహిత్యంలో విమర్శకుడుగా, భాషా శాస్త్రజ్ఞుడుగా, వాక్యవేత్తగా పాఠకుల ఆదరణ పొందాడు చేరా. అన్నింటికన్నా మించి కొత్త కవుల్ని, కవయిత్రుల్ని పనికట్టుకుని గుర్తించి, వాళ్ళ పుస్తకాలకి ముందు మాటలు రాసిన వాటికి గుర్తింపు తెచ్చాడు. పుస్తకం పుస్తకానికి చేరా ముందు మాటలు రాస్తూవుంటే నేను వేళాకోళంగా అనే వాణ్ణి కూడా: ‘ఇక్కడ ముందు మాటలు రాయబడును’ అని ఒక బోర్డు పెట్టుకోరాదూ- అని. ఆ పని ఇప్పుడు నేను చేస్తున్నట్లు వుంది.
తన చేరాతల ద్వారా ఎంతోమందిని కొత్తవాళ్ళని సహృదయపూర్వకమైన తన వచనంతో చక్కగా పరిచయం చేశాడు చేరా. తగాదాలు వచ్చినా హుందాగా వ్యవహరించాడు. సున్నితమైన హాస్యంతో, గొప్ప మనసుతో, మంచి అభిరుచి తప్ప మరేదానికి పెద్ద స్థానం యివ్వని సాహిత్య దృష్టితో అందరినీ కలుపుకుంటూనే అయినా తన దృక్పథంలో రాజీ పడని నిష్కర్షతో నిండు కుండ లాంటి పెద్ద మనిషి తరహాతో రామారావు తెలుగులో నిలిచిపోయే వచనం రాశాడు.
వివాదపడితే చేరాతోనే వివాదపడాలి. సంపత్కుమారతో వచన విషయంలో వాదించినా నాతో నగ్నముని కొయ్యగుర్రం గురించి విభేదించినా వాదన అంటే ఇలా వుండాలి అని అనిపించుకునే వాదన చేశాడు. అప్పట్లో వచ్చిన ‘చేరా-నారా సంవాదం’ గురించి ఇదేదో వెల్చేరు రామారావు, చేకూరి నారాయణరావు ఒకరితో ఒకరు వాదించుకున్నట్లుగా వుంది అనేవారు కూడాను.

వాదనల్లో, విమర్శలో ఆయన వాడే వాక్య నిర్మాణంలో ఆలోచనని సంయమనంతో నిబ్బరంగా ప్రకటించడంలో తెలుగుకి ఒక కొత్త ప్రమాణాన్ని యేర్పరిచాడు రామారావు. అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు. ఆ అలవాటుని కొనసాగించగలవాళ్ళు, ఆ పద్ధతుల్ని అనుసరించగలవాళ్ళు అతన్ని సహేతుకంగా కాదనగలవాళ్ళు తెలుగులో ఇప్పటికీ కనబడటం లేదు.

తమతో అంగీకరిస్తే సున్నితంగా నవ్వి ఊరుకునేవాళ్ళూ, తమతో విభేదిస్తే ఉత్సాహంతో వినేవాళ్ళు, నాకు తెలిసి తెలుగులో ఎక్కువమంది లేరు, ఆ చాలా కొద్దిమందిలో రామారావు ఒకడు.
నేను ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వాన్ని అనువదించి సంకలనం చేసే రోజుల్లో అతన్ని ప్రతిరోజు అమెరికానుంచి పిలిచేవాణ్ణి, నిద్ర ఇంకా పూర్తికాని తెల్లవారు ఝామున. నేనడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, నేను అనువదిస్తున్న ప్రతి పద్యాన్ని గురించి తన దృక్పథంతో వివరంగా మాట్లాడి ఎన్ని కబుర్లు చెప్పేవాడే, తను ఇంకా మొదటి కాఫీ కూడా తాగలేదనే సంగతి కూడా మరిచిపోయి.
కంప్యూటరు వచ్చి ఉత్తరాల్ని రాయడాన్ని చంపేసింది కాని చేరా గొప్ప ఉత్తరాలు రాసేవాడు. ఆయన తన మిత్రులకి రాసిన ఉత్తరాలు దొరికినన్ని సంపాదించి వాటిని కలిపి ప్రచురిస్తే తెలుగు సాహిత్యంలో ‘ఉత్తరాయణం’ ఆయన చేతిలో ఎంత గొప్ప స్థాయికొచ్చిందో బోధ పడుతుంది.

తెలుగు సాహిత్యంలో ఒక తరం వెళ్ళిపోతోంది. ఆ తరంలో నా దగ్గర స్నేహితులు చాలా మంది వెళ్ళిపోయారు: శంకరమంచి సత్యం, ముక్తేవి లక్ష్మణరావు, సంపత్కుమారాచార్య, చలమాల ధర్మారావు, ఇప్పుడు చేరా.
వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు. నేనింకా వుండడం ఈ దుఃఖాన్ని అనుభవించడానికి.
– వెల్చేరు నారాయణ రావు

Category:

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

chenchu 001

ప్రబంధ సువాన మరచి వందేళ్ళయింది .ఈ కంప్యూటర్ కాలం లో అంత ఓపిక తో అష్టాదశ వర్ణలతో వాటిని రాసేదెవ్వరు , రాసినా అంత ఓపిక తో చదివే, చదవ గలిగే వారెవ్వరు?అనే ప్రశ్న ఉండనే ఉంది .సరే పండితకవులు మనకేమీ తక్కువ కాదు .చదివే వారూ ఉండనే ఉన్నారు ఉంటారు కూడా .మరి  రాయించే వారెవ్వరూ?రాజులు జమీందార్లు కాల గర్భం లో చేరిపోయారు .ప్రభుత్వ సాహితీ సంస్థలున్నా ,ఆ పేరెత్తితే మీద పడే ‘’వామ భావీయులు ‘’ఏమంటారో నాన్న దడుపు .అందుకే ఎవ్వరూ ఈ వందేళ్ళ నుంచి ప్రబంధం జోలికి పోలేదు .కాని ,కాలం ఎప్పుడు చలన శీలి .ఎన్నో మార్పులు తెస్తుంది .అలాంటి శుభ ఘడియ వచ్చింది ఆంద్ర ప్రబంధానికి .ఆగ్రి గోల్డ్ వారు నిర్వహిస్తున్న ‘’నది ‘’మాస పత్రిక ప్రబంధ రచనకు ఆహ్వానం పలికింది .విశిష్టమైన నగదు బహుమతులను ప్రకటించింది   .ఆసక్తి ,ఆలోచన, సత్తా ఉన్న కవులు కలాలకు పదును పెట్టారు .అద్భుతమైన ప్రబంధ రచనలు చేసి ఆశ్చర్య చకితులను చేశారు .ఈ ఊహించని స్పందనకు నిర్వాహకులే ముక్కు మీద వేలు వేసుకొనే ట్లయింది .మన కవుల  సామర్ధ్యం ప్రబంధ రచనలలో ప్రస్పుటమైంది .సాహిత్య పిపాసువుల దాహార్తి తీర్చింది .అందుకు ఆ ఆలోచన వచ్చి దాన్ని కార్య రూపం లోకి తెచ్చిన ‘’నది ‘’వారిసాహసోపేత నిర్ణయానికి ,అమలు పరచిన తీరుకు  మది నిండుగా   అభినందనలు తెలియ జేస్తున్నాను .ఈ పోటీలో పాల్గొని కవిత్వ మహత్వాన్ని చవి చూపిన కవీశ్వరులకు హృదయ పూర్వక అభినందనలు .అందులో మొదటి మూడు  స్థానాలను దక్కించుకొన్న వారికి మరీ మనః పూర్వక శతాభినందనలు ,వందనలు .ఉత్తమ ప్రబంధం గా శ్రీ గడియారం శేష ఫణి శర్మ గారి ‘’పుత్రోదయం  ,ద్వితీయ ఉత్తమ ప్రబంధం గా డా.రామడుగు వెంకటేశ్వర శర్మ గారి ‘’శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ‘’,తృతీయ ఉత్తమ ప్రబంధం గా శ్రీ చింత పల్లి నాగేశ్వర రావు గారి ‘’నర్మదా పురుకుత్సీయం ‘’ ఎంపికయ్యాయని ,ప్రధమ ,ద్వితీయ తృతీయ ప్రబంధాలకు రు1,75,000,75000,30,000రూపాయల నగదు బహుమతిని అందజేశామని ,ఎవ్వరిని నిరుత్సాహ పరచ రాదనే ఉద్దేశ్యం తో ప్రబంధ రచనలు పంపిన వారందరికీ ప్రోత్సాహకం గా రు 10,000చొప్పున నగదు బహుమతి ప్రదానం చేశామని అగ్రి గోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్  మరియు ,’’నది ‘’మాస పత్రిక సంపాదకులు శ్రీ వీ .ఆర్..రావు అవ్వాస్  తెలియ జేశారు .

ఇంతకీ ఈ సోది అంతా ఎందుకంటె ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్ని గుంటూరు లో ఉంటున్న డా.రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి  పంపాను. అందినట్లు ఫోన్ చేసి చెప్పి ,తన ప్రబంధానికి ద్వితీయ బహుమతి వచ్చిందని ,తనకిచ్చిన కాపీలు అయి పోయాయని ,స్వంత ఖర్చుతో మళ్ళీ ద్వితీయ ముద్రణ తెస్తున్నానని  రాగానే నాకు పంపిస్తానని చెప్పారు .అనుకోన్నట్లే వారు పంపగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అందింది .ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను .చదివి అభిప్రాయం రాయమని కోరారు .పండిత ప్రకాండుల కవిత్వాన్ని బేరీజు వేసే శక్తి సామర్ధ్యాలు నాకు లేవని పూర్తిగా తెలుసు .కాని ఆప్త వాక్యం గా ఏదో రాయాలని ఈ పోటీల గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చునని ,కనుక ఆలోటు పూడ్చినట్లవుతుందని అందులో నాకు నచ్చిన అంశాలను మీతో పాటు పంచుకొందామని రాస్తున్నాను .

డా.రామడుగు వారు తెలుగు ఏం ఏ .పి.హెచ్ డి .భీమవరం ,తాడికొండ ఒరిఎంతల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసుకులుగా ఉద్యోగించి పదవీ విరమణ చేశారు .తొలకరి మెరుపులు ,శ్రీ హనుమదింద్ర కంటి సాహిత్య సమగ్రావలోకనం ,శ్రీ కాశీ కవితా సమారాధనం ,జ్ఞాన తులసి ,తెలుగు సామెతల శతకం ,సాహిత్య వ్యాస మణి మాల,శ్రీ పెంచల కోన నృసింహ శతకం రచించారు. సాహిత్య సేవే పరమావధిగా జీవిస్తున్నారు .తన జీవితం లో అందుకున్న  తోలి అవార్డు ‘’నది ‘’వారిచ్చిన దే నని సంతోషం ప్రకటించారు .

దాదాపు అరవై ఏళ్ళ క్రితం బడులలో వార్షికోత్సవాలకు  ‘’చెంచులక్ష్మి ‘’వేషం వేయించటం ఉండేది .చెంచు భాషలో చెంచీత మాట్లాడటం ఉండేది .చెంచు లక్ష్మి సినిమా మనకు తెలిసిందే .పెంకి పెల్ల్లాం సినిమాలో ఒక సీను కూడా ఈ కద తో ఉందాని జ్ఞాపకం  .’’చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్క గలవా ?’’పాటచెవుల్లో ఇప్పటికీ రింగు మంటూనే ఉంది .మేము సుమారు అరవి అయిదేళ్ళ కిందట ఒక సారి హిందూ పురం నుండి మా చిన్న నాయనమ్మ వాళ్ళను చూడటానికి గుంటూరు వెడితే వాళ్ళ ఇంటి పక్క పిల్లలు ఏంతో హృదయం గా వేషాలు వేసి  ఈ చెంచీత పాటలు పాడటం నాకు గుర్తుంది .అదే కధను తీసుకొని శ్రీ శర్మ గారు ప్రబంధ రచన చేశారు .వారి రచన చదివితే నాకు వారు ‘’raw(రా) ‘’మడుగు కాదు ‘’రసమడుగు ‘’అని పించింది .చాలా మంచి పద్యాలున్నాయి .చెంచు జీవితం యాస, వేషం ,అలవాట్లు అన్నీ పకడ్బందీగా రాశారు .అయిదు ఆశ్వాసాల ప్రబంధం గా తీర్చి దిద్దారు .మొదట ఇష్ట దేవతా స్తుతి చేశారు .దేవుళ్ళందరికి మొక్కారు .గురు పూజ ,మాత్రు పితృ వందనం భక్తిగా చేసుకున్నారు .నివేదన తో పాటు కృతజ్ఞతా నివేదననూ సమర్పించారు .

ప్రధమాశ్వాసం లో ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కశిపుడు హరి స్థంభం లో ఉన్నాడా అని అడిగితె ఉన్నాడని చెబితే గదతో స్తంభాన్ని మోదితే అందులోనుండి

‘’స్తంభోద్భవు డయ్యెను హరి –గంభీర మహాద్భుతైక ఘన తర భయదో –జ్జ్రుంభణదానవ పర్వత –దంభోళిగ నృహరియై ఉదాగ్రోగ్రాత్మన్ ‘’అని ప్రహ్లాద వరదుడు నరసింహ స్వామి అంత భీకరంగా ప్రత్యక్షమై ,కశిపుని కసి తీర సంహరించాడు .చందం అనే మాటతో ఇక్కడ అద్భుత పద్య నీరాజనం ఇచ్చారు కవి .

‘’చందముల కంది,పద్య –చ్చండంబుల కందనంత సంరంభ స్వ-చ్చండ నిరవద్య పద్య గద్య –గ్రంధ ప్రాబంధిక ప్రకాశుం డయ్యెన్ ‘’చందాలంటే వేదాలు వేదాలకే అందుతాడు పరమాత్మ .మామూలు ఛందో బద్ధ పద్యాలకు చేరువ కాడు.కాని ఆ పద్య వేగం తో ఒక ప్రబంధం వచ్చినంత వేగం గా ఆయన కదలిక ఉంది..చిన్న మాటలతో గంభీర భావన .దేవతలంతా వచ్చి జగదాశ్చ ర్య మూర్తిని తిలకించి స్తుతించినా ఆరౌద్రం ఆగలేదు .ప్రహ్లాదుడు భక్తీ స్తుతి చేస్తే  ఉగ్ర నరసింహుడు కొంత శాంత నృసింహుడయ్యాడు .వాత్సల్యం తో ప్రహ్లాదుని శిరసుపై చేయి ఆన్చి ఆశీర్వ దించాడు.కాని ‘’రోషం బిసు మంతైననువీడక ‘’గుండెలు పగిలిపోయే గర్జనలు చేస్తూ గరుడాచలానికి వెళ్ళాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్

ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్

  • 27/07/2014
  • -బి.వి.ప్రసాద్

======== అధ్యయనంలో మనిషికి విద్యకన్నా ఉన్నతమైన, పవిత్రమైన మరో విషయం లేదు. -ప్లేటో ========= కాలగమనంలో సమాజం మారిపోతున్నట్టే చదువు స్వరూపంలోనూ అనూహ్య మార్పు వచ్చింది. రాజుల కాలం నాటి గురుకులాలు అనేక రూపాలుగా మారి విద్యకు కారకత్వంగా ఇంటికి బదులు పాఠశాల పుట్టింది. ప్రాచీన సంస్కృతి నుండి మనకు తెలియని భవిష్యత్ మానవీయ సంస్కృతికి మారడం కోసం అభ్యాసం అనివార్యమైంది. ఒకప్పటి చదువుల తీరు వేరు. గురువులు లేని చదువు, గురువులతో మాత్రమే సాగే చదువు, జీవితకాలం నేర్చుకునే చదువు, ఏమీ నేర్చుకోకుండానే మహానుభావులుగా మార్చిన జీవన చదువు… ఒకొక్కరూ ఒక్కో రీతిన చదివిన వారే గొప్పవాళ్లయ్యారు. స్వాభావికంగా చదువుకు ఒక రూపం ఉన్నా, అది కాలక్రమేణా సమాజ పరిస్థితులు, అవసరాలు, అనివార్యతలతో మారిపోయింది. ఏ దేశ విద్యావిధానమైనా ఆ దేశ చరిత్ర , సంస్కృతులను అనుసరించే ఉంటుంది. విద్యారంగం చరిత్ర దేశ చరిత్రలో అంతర్భాగంగానే ఉంటుంది. భారతీయ విద్యా చరిత్ర కూడా సాంఘిక చరిత్రతో పరిణామం చెందుతూ వచ్చింది. సాంకేతిక విప్లవం… ఆధునిక యుగంలో సాంకేతిక విజ్ఞానం అనూహ్యంగా విస్తరించడంతో ఒక విధంగా నేడు విద్యకు స్వాతంత్య్రం సిద్ధించింది. విద్యార్థి తాను కోరుకున్న సమయంలో ఎంచుకున్న అంశాన్ని నేర్చుకోవడమేగాక, దానిని మూల్యాంకనం చేయించుకునేందుకు, నికషలకు పూర్తి స్వాతంత్య్రం ఇ-లెర్నింగ్ తో సాధ్యమైంది. కఠినమైన పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేక, చదువుల్లో వెనుకబడి మందబుద్ధులై, ప్రగతి సాధించలేక , సమస్యలను, అనుమానాలను తీర్చుకోలేక ముడుచుకుపోయే మూర్తిమత్వంతో సమాజంలో ఏకాకిగా మారిపోతున్న పరిస్థితులను అధిగమించేలా విజ్ఞానాన్ని మనిషి అందిపుచ్చుకున్నాడు. ఇపుడు తనే టీచర్, తనే విద్యార్థి, తన చదువులకు తానే మార్గదర్శి, అనుమానాలను నివృత్తి చేసుకునేదీ తనే. ఇందుకు దోహదపడేదే ఇంటర్నెట్ విప్లవం నుండి వచ్చిన ‘ఇ- క్లాసురూమ్’. దీనినే స్మార్టు క్లాసు అన్నా, స్మార్టు టీచింగ్ అన్నా, ఎలక్ట్రానిక్ క్లాసు అని వ్యవహరించినా.. ఏం పేరు పెట్టినా… దాని లక్ష్యం ఒక్కటే. అధ్యాపకుడూ, విద్యార్థి కలిసి టెక్నాలజీ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునే దిశగా ‘ఇ- క్లాసురూమ్’లు అడుగులు వేస్తున్నాయ. నేడు మారుమూల ప్రాంతాల్లో సైతం డిజిటల్ క్లాసురూములు, ఆడియో విజువల్ సెంటర్లు దర్శన మివ్వడం బోధనలో, అభ్యాసంలో కొత్త పోకడలకు అద్దం పడుతోంది. బోధనలో వైవిధ్యం… ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, సుద్దముక్క, టీచర్లు తయారు చేసే చార్టులు మాత్రమే తరగతి గదిలో కనిపించేవి. ఆ తర్వాత టీవీలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు వంటివి రంగ ప్రవేశం చేశాయి. ఆధునిక సాంకేతిక పరికరాలే ప్రధాన మాధ్యమంగా తరగతి గదిలో బోధన జరిపితే- ‘డిజిటల్ క్లాస్‌రూమ్’ అంటున్నారు. బోధననూ, అభ్యాసాన్ని డిజిటల్ క్లాస్‌రూమ్‌లు మరింత సులభతరం చేశాయి. పాఠ్యపుస్తకాలను పట్టుకుని టీచర్లు పాఠాలు చెప్పడం, వాటిని వినడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం పాత పద్ధతి. దీనికి భిన్నమైన వ్యవస్థే- డిజిటల్ క్లాస్‌రూమ్. ఆధునిక టెక్నాలజీ ప్రవేశంతో బోధన, అభ్యాసం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. సంప్రదాయ బోధనా పద్ధతిలో అధ్యాపకుడు మాట్లాడేది ఎక్కువ, విద్యార్థి మాట్లాడేది తక్కువ. డిజిటల్ క్లాసుల్లో, ఇ-లెర్నింగ్‌లో విద్యార్థి భాగస్వామ్యం పెరిగింది. కఠినమైన పాఠ్యాంశాలను సైతం కంప్యూటర్ స్క్రీన్‌పై సులభ రీతిలో బోధించేందుకు నేడు అవకాశాలు పెరిగాయి. సరికొత్త బోధనా పద్ధతుల వల్ల విద్యార్థిపై ఒత్తిడి కూడా తగ్గుతోంది. అధ్యాపకులతో వీలైనంత ‘ఇంటరాక్టివ్’గా ఉండేందుకు కొత్త విధానాలు దోహదపడుతున్నాయి. బోధనకు అవసరమైన సాంకేతికను జోడించడమే ఇ-లెర్నింగ్‌లో కీలకాంశం. ‘విద్యార్థులకు ఏమి చెప్పాలనేది సిలబస్… ఏ రీతిలో చెప్పాలనేది కరిక్కులమ్’ అని భావిస్తున్న అనేక విద్యాసంస్థలు ఐటి ఆధారిత బోధనోపకరణాలను, సేవలను విద్యార్థులకు అందిస్తున్నాయి. సిలబస్, కరిక్యులమ్‌ల ఆధారంగా బోధనను కొత్తపుంతలు తొక్కించేందుకు టీచర్లతో పాటు సాంకేతిక నిపుణుల సహాయం కూడా నేడు అవసరమైంది. సమాజం నుంచి, సమాజం కోసం.. సమాజం పాఠశాలను నెలకొల్పుతుంది. పాఠశాల సమాజాన్ని తయారుచేస్తుంది. సమాజం, పాఠశాల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ రెండూ ఒకదానితో ఒకటి, ఒకదాని కోసం మరొకటి పనిచేస్తాయి. ఒకదానిపై మరొకదాని ప్రత్యక్ష ప్రభావం కచ్చితంగా ఉంటుంది. సమాజం మంచి పాఠశాలను ఏర్పరిస్తే పౌరులందరికీ మంచి భవిష్యత్ ఉంటుంది. పాఠశాల అనేక విధాల సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నేటి తరం సమాజానికి అనుగుణంగానే ప్రభావితం అవుతూ మార్పును స్వాగతిస్తోంది. ‘అసలు చదువెందుకు..? ఎలాంటి చదువు అవసరం..?’ అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయ. చదువు నిజానికి ఒక జీవాంశం, మరో విధంగా చూస్తే సాంఘికాంశం. నీరు, నీడ, ఆహారం, ప్రత్యుత్పత్తి ద్వారా అభివృద్ధి, విజ్ఞానం వీటన్నింటికీ మూలం విద్య. మానసిక వికాసానికి, మానవత్వం పెంపొందించుకోవడానికి, మంచిని పెంచుకోవడానికి- పోషించుకోవడానికి, మానవుడ్ని ఉన్నతమైన వ్యక్తిగా రూపొందించడానికి చదువు అవసరం. ఎనె్నన్ని మార్పులో… విద్యా బోధన ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు- ఉండకూడదు- ఉండలేదు కూడా. ఎందుకంటే సహజంగానే విద్యకు నిర్ధిష్టరూపం ఉండదు. అది ప్రగతిశీలమైనది. కాలంతో పాటు పరిస్థితుల ప్రభావంతో నిరంతరం అది మారిపోతూ ఉంటుంది. పరిశ్రమలు మానవ సహాయంతో నడిచినపుడు బోధన ప్రక్రియ పలక, నల్లబల్ల, సుద్ద, అచ్చుపుస్తకాలపై ఆధారపడింది. ఒక్కసారి అలా వెనక్కు వెళ్లినట్టయితే క్రీ. పూ. 11వ శతాబ్దం వరకూ ప్రాచీన యుగంగా పరిగణిస్తుండగా- అపుడు హిందూ విద్యావిధానం ప్రముఖ స్థానం పొందింది. క్రీ. పూ. 6వ శతాబ్దంలో బౌద్ధమతం ఆధారంగా బౌద్ధమత సంప్రదాయ విద్యావిధానం ప్రారంభమైంది. తర్వాత మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైన ఇస్లాం మత సంప్రదాయ విద్య ప్రారంభమైంది. క్రీ.శ 17వ శతాబ్దంలో పాశ్చాత్యులు వర్తకం కోసం మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్రిటిష్ వారిది పైచేయిగా మారి క్రైస్తవ మిషనరీల నేతృత్వంలో విద్యా సంస్థలు పనిచేయడం ప్రారం భించాయ. 19వ శతాబ్దం ప్రారంభంలో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, విద్యారంగంలో గొప్ప విప్లవం ఏదీ చోటు చేసుకోలేదు. సుమారు 25 ఏళ్లుగా కొంత మార్పు వస్తోంది. ‘విద్యా సాంకేతికం’ (ఎడ్యుకేషన్ టెక్నాలజీ) అనే పదాన్ని తొలిసారి బ్రేయిన్‌మోర్ జోన్స్ రిపోర్టు – యుకెలో ఉపయోగించారు. 14వ శతాబ్దం వరకూ చూసుకుంటే ముఖాముఖిగా బోధన తప్ప మరో మార్గం లేదు. రాతప్రతులపై ఆధారపడటం మొదటిది. విద్యార్ధుల్లో ఉన్న వ్యక్తిగత వ్యత్యాసాల ప్రేరణను ఈ కాలంలో వారు గుర్తించడంలో విఫలమయ్యారని చెప్పలేం. కానీ, వారు కేవలం ఉచ్ఛారణ, రాత ప్రతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 15వ శతాబ్దంలో ముద్రణ విధానం ఆచరణలోకి వచ్చింది. మతాలకు, వ్యాకరణాలకు సంబంధించిన గ్రంథాల ముద్రణ మొదలైంది. 16వ శతాబ్దంలో ఉన్నత విద్యాస్థాయిల్లో పాఠ్యగ్రంథాలను ప్రవేశపెట్టడం మొదలైంది. 17వ శతాబ్దంలో జాన్ కమేనియన్ చిన్న పిల్లలకు పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారు. 1657లో బొమ్మలతో కూడిన పుస్తకాలను (ఆర్బస్ పిక్చర్స్) కొన్ని వందల సంఖ్యలో ముద్రించారు. తర్వాత రూసో, స్పెన్సర్, ప్రోబెల్ ,పెస్టోలజీ మొదలైన వారు బోధన, విద్యార్థుల అధ్యయనానికి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు చేశారు. తర్వాత జాన్ డ్యూయి విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. థారన్‌డైక్ అధ్యయన సిద్ధాంతాలతో ప్రయోగాలు చేసి తయారుచేశారు. జాన్ ఎడమ్- మూర్తమత్వం అంటే.. అమూర్తత్వం లేకపోవడం అనే ఆలోచన విధానాన్ని ప్రచారంలోకి తెచ్చారు. 20వ శతాబ్దానికి వచ్చేసరికి ఫొటోగ్రఫీ, శబ్దాన్ని రికార్డు చేయడం, ఎడ్యుకేషన్ టెక్నాలజీ లాంటివి పుట్టాయి. ‘విద్యా సాంకేతికం’ విస్తృతి… విద్యారంగంలో తొలి మూడు విప్లవాల గురించి చెప్పుకుంటే- భాషకు లిపిని సృష్టించడం, కాగితం తయారు చేయడం, ముద్రణ ప్రక్రియ. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిణామాల వల్ల ముఖ్యంగా రేడియో, టీవీ, టేప్ రికార్డర్, కంప్యూటర్ల వల్ల నాలుగో విప్లవం వచ్చింది. ఎరిక్ ఎష్‌బి ఈ నాలుగో విప్లవం గురించి చెప్పారు. ఆ విప్లవమే- ‘విద్యా సాంకేతికం’. 1960 ముందు నాటికి ‘విద్యా సాంకేతికం’ అనే పదం దృశ్య, శ్రవణ పద్ధతిలో తరగతి గదిలో బోధనకు ఉపయోగించే బోధన సామగ్రితో ముడిపడి ఉండేది. వేరే మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష బోధన అభ్యసన కోసం ఉద్దేశించిన సామాన్యమైన దృశ్య,శ్రవణ ఉపకరణాల వినియోగమే ‘విద్యా సాంకేతిక’ భావన. కానీ, విద్యా సాంకేతికం బోధనోపకరణాల కంటే భిన్నమైనది. అది బోధనోపకరణాలను వినియోగించుకోవచ్చు కాని, విద్యోపకరణాలకు పర్యాయపదం మాత్రం కాదు. ఆ విధంగానే యంత్రాలు గానీ, సామూహిక ప్రసార సాధనాలైన రేడియో, టీవీ వాడకాన్ని కలిగి ఉండొచ్చు- కానీ వాటికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆధునిక ఇంజనీరింగ్ సూత్రాల ప్రాతిపదికగా విద్యుత్-యాంత్రికత ఉన్న సాధనాల అభివృద్ధి, వాటిని విద్య కోసం వాడటం అనే భావనకు సంబంధించిందే ‘విద్యా సాంకేతికం ’. బోధన , అభ్యసనలకు వ్యవస్థా విశే్లషణ వినియోగమే విద్యా సాంకేతికం అవుతుంది. విద్యా రంగంలో రేడియో, టీవీ, కంప్యూటర్, టేప్ రికార్డర్, చలనచిత్రాలు, స్లైడ్‌లు, హార్టువేర్, సాఫ్ట్‌వేర్‌ల ఉపయోగం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లోని ప్రగతి ఫలమే పురోభివృద్ధి ఫలితమే విద్యా సాంకేతికం. కార్యక్రమయుత బోధన భావన, అభ్యసన సిద్ధాంతాలు, విద్యా సాంకేతిక అర్థానికి, భావనకు కొత్త రూపును సంతరించిపెట్టాయి. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, విద్యా తత్వ శాస్త్రం, విద్యా మాపనం, మూల్యాంకనం మాదిరే విద్యా సాంకేతికం కూడా ఒక నూతన క్షేత్రం. గుణాత్మక అభివృద్ధి… విద్య సాంఘిక ప్రక్రియ. ఈ కారణంగానే జనాభా పెరుగుదల, విద్యలో గుణాత్మకమైన అభివృద్ధి, ఆవశ్యకతల వల్ల 1972-73లో భారత ప్రభుత్వం ఒక విద్యా సంకేతిక ప్రాజెక్టును ప్రారంభించింది. మన దేశంలో విద్యాసాంకేతిక రంగంలో జరుగుతున్న కృషికి కేంద్ర బిందువు ఎన్‌సిఇఆర్‌టి. 1973లో విద్యాసాంకేతిక కేంద్రం (సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ) ఏర్పాటైంది. మన రాష్ట్రంలో 1974-75లో రాష్ట్ర విద్యా సాంకేతిక విభాగం (ఇటి సెల్) స్థాపించారు. 1978లో ఎన్‌సిఇఆర్‌టి దేశంలోని నాలుగు ప్రాంతీయ విద్యాకళాశాలల్లో విద్యా సాంకేతిక విభాగాలను ప్రారంభించింది. గత పదేళ్ల కాలంలో మన దేశంలో కొన్ని వర్శిటీలు ఇటి సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. మద్రాసులోని టెక్నికల్ టీచర్సు ట్రైనింగ్ సంస్థ కూడా గణనీయమైన కృషిని ప్రారంభించింది. సుమారు 15 సంవత్సరాల క్రితం స్థాపించిన ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇనె్వన్షన్’ అనే సంస్థ విద్యా సాంకేతిక రంగంలో అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన విజ్ఞాన విషయాలను దేశం నలుమూలల నుండి సేకరించి విద్యావేత్తలకు అందించేందుకు ఏటా దేశంలో ఒక్కో ప్రాంతంలో సమావేశాలను నిర్వహిస్తూ ప్రశంసనీయమైన కృషి చేస్తోంది. సరికొత్త వారధి… మొత్తం మీద ప్రణాళికాబద్ధమైన కృషినే మనం విద్యగా చెప్పవచ్చు. ఒక పక్క విద్యార్ధి మరో పక్క ఉపాధ్యాయుడు ఉంటారు. దీనిని ద్విధృవ పరిణామ విద్యగా చెబుతాం. వీరిద్దరికీ తోడు సాంఘిక పరిసర ప్రభావం కూడా ఉంటే దానిని త్రిధృవపరిణామ విద్యగా వ్యవహరిస్తాం. విస్తృతార్ధంలో చెప్పాలంటే ‘యధార్థానుభవ జ్ఞానమే విద్య’ అని చెప్పవచ్చు. అంటే ప్రతి అనుభవం విద్యగా చూస్తాం. నియత విద్య, అనియత విద్యతో పాటు యాధృచ్చిక జ్ఞానార్జనకు ఎన్నో మార్గాలు ఇపుడు వచ్చాయి. అందుకే విద్యా సాంకేతికం సంకుచితం కాని అర్థం, విస్తృతమైన భావన కలిగి ఉంది. సరైన సమయంలో తగిన పరికరాల ఉపయోగం, శిక్షణ విధానాన్ని సులువు చేయడంలో ఉపయోగపడి స్పష్టమైన సరైన అవగాహన కల్పిస్తుంది. ఫిల్ముల వంటి జ్ఞానేంద్రియ సాధనాలు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తాయి. శాస్ర్తియ శిక్షణకు, బోధనా కళకు మధ్య ‘విద్యా సాంకేతికం’ సారధి వంటిది. విద్యాసాంకేతికతకు పరిధి, సరిహద్దులు లేవు. సమాజం కోరికలు, విద్యావసరాలు గుర్తించడం వంటి అంశాలను చర్చంచడానికి ఇటి (విద్యాసాంకేతికత) ప్రయత్నిస్తుంది. సమాజంలోని వ్యక్తుల అవసరాలు, కోరికలు తృప్తిచెందడానికి అవసరమైన వనరులను సర్వే చేస్తుంది. విస్తృతమైన విద్యాలక్షాలను, గమ్యాలను కూడా తెలియజేస్తుంది. వ్యక్తీకరించిన లక్ష్యాలు, తయారుచేసిన పాఠ్యప్రణాళికలు, అందుబాటులో ఉన్న వనరులు, వాటికి అనుగుణంగా ఉపయుక్తమైన బోధనాభ్యసన సామగ్రిని తయారుచేయడం అభివృద్ధి చేయడంలో కూడా ఇటి (విద్యాసాంకేతికత)కి సంబంధం ఉంటుంది. ఇంత వరకూ విద్యా సాంకేతిక క్షేత్రంలో జరిగిన అధిక భాగపు పని మాధ్యమ కేంద్రీకృతం- ఉత్పాదనా కేంద్రీకృతం. ఉత్పాదనా కేంద్రకం నుండి ప్రక్రియా కేంద్రకం వైపు ప్రస్తుతం మొగ్గు నడుస్తోంది. ప్రత్యామ్నాయ వ్యూహాలు… వర్తమాన భారతదేశపు విద్యాసాంకేతికవేత్త కేవలం కార్యక్రమయుత పుస్తక రచయిత లేక మాధ్యమ నిపుణుడు మాత్రమే కాదు, విద్యావ్యవస్ధలకు సంబంధించిన అన్ని అంశాల పథక రచన,విధులతో సంబంధం ఉన్న వ్యక్తి. పరికల్పనల నిర్వహణలోనూ, ఆచరణలోనూ వ్యవస్థా విశే్లషణ వినియోగంలోనూ ప్రస్తుతం ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేగాక, సాంకేతిక కాల వినియోగంలో ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించడంలో కూడా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అభ్యాసకుల జీవితానికి సంబంధం కలిగిన దానికి, వాస్తవికత కలిగిన దానిగా విద్యావ్యవస్థను తయారుచేయడానికి,అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం దేశంలో ఒక విప్లవం జరుగుతోంది. ఇందులో విద్యా సాంకేతికంగా చాలా కీలక పాత్రను పోషిస్తోంది. స్వయం అభ్యసనానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇందుకు దోహద పడేదే ఇ-లెర్నింగ్. ప్రత్యక్షంగా తరగతి గదికి వెళ్లకుండానే, అధ్యాపకుడు ఎదుటగా లేకుండానే నచ్చిన విద్యను అభ్యసించేందుకు వీలు కల్పించేదే-ఇ-లెర్నింగ్. భారత విద్యావ్యవస్థను ఒత్తిడి చేస్తున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి వ్యవస్థా పద్ధతి అందుబాటులో ఉన్న అన్ని వనరుల ఉపయోగం, అభ్యసనం ప్రాముఖ్యత- ప్రధాన దారులు చూపేవిగా ఉన్నాయి. విద్యా సాంకేతికం సమర్ధవంతమైన అవిరళ ఉపయోగానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి- 1986లో జాతీయ విద్యావిధానంలో భాగంగా టీవీ, రేడియో ప్రసార నెట్‌వర్కును ఏర్పాటుచేయడం, విద్యాటీవీ చానల్‌ను ఏర్పాటు చేయడం వంటివి. సాంకేతిక పద్ధతుల సమ్మేళనం.. ఈ క్రమంలోనే కంప్యూటర్ అసిస్టెడ్ ఇనస్ట్రక్షన్ (సిఎఐ) వచ్చింది. తర్వాతి దశలో కంప్యూటర్ మేనేజ్డ్ బోధన (సిఎంఐ) వచ్చింది. కంప్యూటర్ అసిస్టెడ్ బోధనలో విద్యార్థి డైరెక్ట్ బేసిస్ మీద కంప్యూటర్ విధానంతో పాలుపంచుకుంటాడు. బోధనా పరికరాలు ఈ పద్ధతిలో నిల్వ చేయబడతాయి. కంప్యూటర్ మేనేజ్డ్ పద్ధతిలో బోధనా తీరును నడిపేందుకు కంప్యూటర్ ఉపాధ్యాయునికి తోడ్పడుతుంది. కానీ, ప్రత్యేకమైన సాంకేతిక సామగ్రి, బోధన సామగ్రి మీద ఇది ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ విధానంతో విద్యార్థి అనుకూలంగా ఉండలేడు. ఆ విధానం సరైన సమయానికి తగిన విధంగా ఉండదు కూడా. బోధనకు సహకరించేందుకు అందించే ప్రక్రియలోనూ మదింపు చేసే పనిముట్లలోనూ, ఉపకరణాలను నిర్వహించడంలోనూ కంప్యూటర్ పాత్ర ఎంతగానో విస్తరించింది. అందించు ప్రక్రియ (డెలివరీ సిస్టమ్ ) ప్రత్యేకంగా అదుపు చేయడంలో, క్లిష్ట పరిస్థితుల్లోనూ బోధనా యంత్రాల శక్తిని కంప్యూటర్ విస్తరిస్తుంది. ఈ సమయంలో విద్యార్థి అసలైన సమాధానంతో సరిపడే రీతిలో జవాబులు తయారుచేయాలి. అది ఈ యంత్రం మారి- మరో దానికి వెళ్లే ముందుగా జరగాలి. బోధనను అందించడంలో తక్కువ ఖర్చుతో కూడిన సింగిల్, యూజర్ పద్ధతిని ఉపయోగిస్తారు. మదింపు చేసే పనిముట్లలో ప్రామాణీకృతమైన పరీక్ష విధానానికి , విడివిడి అంశాల వివరణకు మొత్తం మార్కులకు, పరీక్షకులకు తగిన కార్యక్రమాన్ని కంప్యూటర్‌కు అందించాలి. ఈ క్రమంలోనే తరగతి గదిలో నూతన విధానాలు అమలులోకి వచ్చాయి. తరగతిగదిలో కంప్యూటర్ వినియోగం, వెబ్‌సైట్ ఏర్పాటు, తరగతి గది బ్లాగులు, వికీలు, వైర్ లెస్ క్లాసు రూం, మైక్రోఫోన్లు, మొబైల్ యాప్స్, స్మార్టు బోర్డులు, యునైటెడ్ స్ట్రీమింగ్, టీచర్ ట్యూబ్, అన్‌లైన్ మాద్యమాలు వినియోగం, డిజిటల్ కెమరాలు-వీడియో కెమరాల వినియోగం, ఇంటరాక్టివ్ వైడ్ బోర్డు సాధనాలు, డాక్యుమెంటరీ కెమరాలు, ఎల్‌సిడి ప్రొజెక్టర్లు తరగతి గదిలోకి వచ్చేశాయి. వీటన్నింటి సమ్మేళనమే ఇ-లెర్నింగ్. ఇ-లెర్నింగ్‌కు విధి విధానాలు… ఇ-లెర్నింగ్ రూపొందించాలంటే కొన్ని ప్రమాణాలను విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాల్లో సాధారణ కంటెంట్‌కు ఉండే నియమాలు, ఇ-లెర్నింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ విధి విధానాలు,లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్టం అని ఉంటాయి. ఈ ప్రమాణాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లపై ఎలా రూపొందించాలి? ఎలా పంపిణీ చేయాలనే విషయాలపై ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ నియమాలు లేదా ప్రమాణాలు ప్రస్తుతం విభిన్నమైన నాలుగు వ్యవస్థలు రూపొందిస్తున్నాయి. కమ్యూనికేషన్ ఇంటర్ ఫేస్ లేదా ఎపిఐ వనరులను ఇతర వ్యవస్థలతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయం, ఒక పద్ధతిలో ఇ-లెర్నింగ్‌ను వివరించడానికి మెటా డాటా, వనరులు లేదా రిపోర్టులను ఉపయోగకరమైన బండిల్స్‌లోకి తేవడం ఎలా విషయంపై కంటెంట్ ప్యాకేజింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక మాధ్యమాల కలయక ఇ-లెర్నింగ్ ప్రమాణాలు రోజురోజుకూ కొత్త విషయాలను సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇ-లెర్నింగ్ నేడు సామాజిక మాధ్యమాలతో కూడా పెనవేసుకుని విద్యారంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాందీ ప్రస్తావన పలికాయి. ఇ-లెర్నింగ్ రెండో తరంలో ఇ-క్లాసు రూమ్‌లుగానూ, నేడు ఇ-స్కూళ్లుగానూ ఆవిర్భవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య కోసం సోనెట్, ఇన్‌ఫ్లిబినెట్ వంటి ఇ-లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల విద్యార్థులకు ‘మన టీవీ’ ఉండనే ఉంది. ప్రభుత్వం తరఫున జ్ఞానదర్శన్ టీవీ పనిచేస్తోంది. వీటన్నింటితో పాటు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. అటెండెన్స్, పెరఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్‌తో పాటు మరో అడుగు ముందుకు వేసి అప్‌లింకింగ్ సదుపాయంతో విద్యార్థి తరగతిలో విన్న పాఠానే్న మరోమారు కావాలంటే ఇంట్లో విని దానిని అభ్యాసం చేసేందుకు కూడా వీలు కల్పిస్తున్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో ప్రగతి సమీక్ష నిర్వహించి, అందులో విద్యార్థి పాఠ్యాంశాన్ని చేసుకోవడంలోను, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో తదితరల విషయాలను సైతం క్షణాల్లో విశే్లషించే సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రిపరేషన్‌తో మొదలైన ఎలక్ట్రానిక్ విప్లవం రెండో దశలో ఇ-క్లాసు రూమ్, నేడు ఇ-స్కూళ్లు దశకు చేరుకుంది. ప్రభుత్వం సైతం ఇ-క్లాసు రూమ్‌లకు సిద్ధం అవుతోంది. పాక్షికంగా ఐసిటిని వినియోగిస్తోంది. రానున్న రోజుల్లో విద్యారంగంలో ఇది మరిన్ని విప్లవాలకు దారితీస్తుందనడం నిస్సందేహం. * * విద్యా బోధన ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు- ఉండకూడదు- ఉండలేదు కూడా. ఎందుకంటే సహజంగానే విద్యకు నిర్ధిష్టరూపం ఉండదు. అది ప్రగతిశీలమైనది కాలంతో పాటు పరిస్థితుల ప్రభావంతో మారిపోతూ ఉంటుంది. * విద్యా సాంకేతికం (ఎడ్యుకేషన్ టెక్నాలజీ) అనే పదాన్ని తొలిసారి బ్రేయిన్‌మోర్ జోన్స్ రిపోర్టు -యుకె లో ఉపయోగించారు. * విద్యారంగంలో తొలి మూడు విప్లవాలు చెప్పుకుంటే భాషకు లిపిని సృష్టించడం, కాగితం తయారుచేయడం, ముద్రణ ప్రక్రియ. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిణామాల వల్ల ముఖ్యంగా రేడియో, టివి, టేప్ రికార్డర్, కంప్యూటర్ల ఫలితాల వల్ల నాలుగో విప్లవం వచ్చింది.ఎరిక్ ఎష్‌బి ఈ నాలుగో విప్లవం గురించి చెప్పారు. ఆ విప్లవమే విద్యాసాంకేతికం . సామాజిక బాధ్యత… విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో విద్యారంగం ప్రగతికి అన్ని విధాలా తోడ్పాటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు భారీగా విరాళాలు ఇస్తున్నాయి. మహారాష్టల్రోని పూణె, ఔరంగాబాద్ ప్రాంతాల్లో వంద పాఠశాలల్లో ‘ఇ-లెర్నింగ్’ పరికరాలను అందజేసేందుకు పారిశ్రామిక దిగ్గజమైన ‘టాటా గ్రూపు’ సంసిద్ధత వ్యక్తం చేసింది. పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, సీడీలు వంటివి అందజేస్తారు. విద్యార్థుల్లో పలు రకాల నైపుణ్యాలను పెంచేందుకు వీలుగా ‘ఇ-లెర్నింగ్’ విధానాల్లో తగిన కరిక్యులమ్ రూపొందిస్తారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మెరుగైన బోధనా పద్ధతులను ప్రభుత్వం రూపొందిస్తుంది. వాటిని అమలు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఆర్థికంగా సహకరిస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ‘ఇ-లెర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టేలా ఇప్పటికే మహారాష్టల్రో కొన్ని స్కూళ్లను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలల్లో ‘ఇ-లెర్నింగ్’ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు భారీగా ఆర్థిక కేటాయింపులు అవసరం. ఈ కారణంగానే పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో నిధులను కేటాయించేందుకు ముందుకు వస్తున్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక వాక్య వేత్త -చే రా. -ఐనవోలు ఉషా దేవి

ఆధునిక వాక్యవేత్త -అయినవోలు ఉషాదేవి

Published at: 27-07-2014 07:13 AM

ఆచార్య చేకూరి రామారావు మరణం తెలుగు సాహితీ ప్రపంచాన్ని విషాద ంలో ముంచేసింది. ఎంతోమంది ప్రముఖులు, సాహితీ విమర్శకు ఆయన కంట్రిబ్యూషన్‌ గురించి ఎక్కువగా ఫోకస్‌ చేశారు. దీనికి ప్రధాన కారణం సుమారు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన చేరాతల కాలమ్‌ ద్వారా ఆంధ్రజ్యోతిలో నిరాఘాటంగా చేసిన సాహితీ విశ్లేషణలే. చేరాతల కాలమ్‌ తర్వాత భాషాశాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు మసకబారినట్లయిది. అందుకే ఆయనవద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డి చేసిన పరిశోధక విద్యార్థిగా భాషా శాసా్త్రనికి ఆయన సేవలు తెలియజేయడం నా కర్తవ్యంగా భావించి ఈ వ్యాసం రాస్తున్నాను.
చేరాగారు తెలుగు సాహిత్య విద్యార్థిగా ఉంటూనే ‘భాష’ గురిచిన వివేచన చేస్తుండేవారు. చాలామంది తెలుగు శాఖలలోని హేమాహేమీ పండితులంతా ఉస్మానియాలో భాషా శాస్త్ర శాఖ ప్రారంభమైన కొత్తలో ‘ఇదేదో అమెరికా దిగుమతి సరుకు’ అనుకుంటూ, ఆ శాసా్త్రన్ని దూరంగా నెట్టేశారు. దానికి మరో కారణం కూడా ఉంది. ఎల్లి మొదలుకొని, భద్రిరాజు కృష్ణమూర్తిగారి వరకు అందరూ తెలుగును సంస్కృతజన్యం కాదనీ, ద్రవిడ భాష అనీ శాస్ర్తీయ ఉపపత్తులతో విశ్లేషించడమే. భద్రిరాజు కృష్ణమూర్తి వద్ద చదువుకుని, ఆయన వృత్తిపదకోశ ప్రాజెక్టులో విషయ సేకరణతో భాషా వివేచన ప్రారంభించిన చేరా, చిన్నయ్యసూరి బాల వ్యాకరణానికి వీరాభిమాని అని చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళి జెరాల్డ్‌ కెలి పర్యవేక్షణలో తెలుగు నామ్నీకరణం (నామినలైజేషన్‌) పై పీహెచ్‌డీ చేశారు. వాళ్లిద్దరూ తెలుగు గురించి లోతైన చర్చలు చేసుకునేవారు. తెలుగు ధ్వనులపై వారిద్దరి పరిశీలనల గురించి మాకు క్లాసులో ఉదాహరణలతో వివరించి, చిన్న చిన్న ధ్వని భేదాలను ఎలా గుర్తించాలో వివరిస్తే, మేం ఆశ్చర్యంగా విని, ఆ భేదాలను ఆకళింపు చేసుకునేవాళ్లం. ఆయన పీహెచ్‌డీ చేస్తున్న కాలంలో నోమ్‌ఛామ్‌స్కీ రాసిన రెండు గ్రంథాలు ‘సింటాక్టిక్‌ స్ట్రక్చర్స్‌ (1957); ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ సింటాక్టిక్‌ థియరీ (1965) భాషా శాస్త్రంలో ‘విప్లవాత్మక’మైన మార్పులకు దోహదం చేశాయి. వామపక్ష భావజాలం కూడా ఉన్న ఛామ్‌స్కీ విశ్లేషణలు చేరాని ఆకర్షించాయి. ఎంఏ రెండో సంవత్సరంలో ఆయన మాకు ‘వ్యాకరణ సిద్ధాంతాలు’ (గ్రామటికల్‌ థియరీస్‌) అనే పేపర్‌ బోధిస్తూ వివిధ రకాల సిద్ధాంతాలలో ఛామ్‌స్కీది ఎలా మెరుగైనదో విశ్లేషించేవారు; దాని నుంచి ఆవిర్భవించిందే ఆయన తెలుగు వాక్యం. ఇది నా ఎంఏ పరీక్షలు ముగిసే నాటికి పూర్తయింది. మొదటి తెలుగు ప్రపంచ మహాసభలో 1975లో ఆవిష్కృతమైన అనేక గ్రంథాలలో ఇది ముఖ్యమైనది. ఈ పుస్తకాన్ని శుద్ధ ప్రతి (ఫెయిర్‌ కాపీ) చేసి ఇచ్చినందుకుగాను ఆ పుస్తకంలో ఆయన ఆ విషయాన్ని నిక్షిప్తం చేయటం నా జీవితంలో మరచిపోలేని అంశం. దాన్ని బైండ్‌ చేయించి, స్వయంగా మా ఇంటికి వచ్చి నాకు ఒక కాపీ ఇవ్వడం అపురూపమైన ఘట్టం, ఇది ఆయన మౌలిక సైద్ధాంతిక రచన.
ఛామ్స్కీ ప్రతిపాదించిన అంశమూ చేరా తెలుగుకు అన్వయించిందీ ఏంటంటే, భాషా విశ్లేషణకు వాక్యం పునాది అని అప్పటివరకు ప్రపంచంలోని ఏ లిఖిత భాషల్లోని వ్యాకరణాలైనా ప్రధానంగా అక్షరాలు, సంధులు, సమాసాలు, నామ నిష్పన్నాలు, క్రియా నిష్పన్నాలు వివరించేవిగా ఉండేవి. ఇంగ్లీషు వ్యాకరణాలలో సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలను గురించి చేసిన విశ్లేషణే చామ్స్కీ సిద్ధాంతానికి పునాది. పైకి భిన్నాభిన్నాలుగా వ్యక్తమయ్యే అన్ని రకాల వాక్యాలనూ ఒకే ఒక అంతర్నిర్మాణ వాక్య రూపం నుంచి వివిధ పరివర్తన సూత్రాల ద్వారా నిష్పన్నం చేయవచ్చునన్నదే ఆ సిద్ధాంతంలోని ప్రధానాంశం. ఉదాహరణకు కర్త ప్రధానమైన ‘రాముడు రావణుని చంపాడు’ నుంచి కర్మ ప్రధానమైన రావణుడు రాముడి చేత చంపబడ్డాడు అన్నది (ఇదొక్కటే ఉదాహరణగా ఇలాంటివన్నీ) పరివర్తన సూత్రం ద్వారా నిష్పన్నం చేయవచ్చు. అయితే ఇవన్నీ ‘రూపానికి’ సంబంధించిన మార్పులు. అలాగే అనుకృతి వాక్యాల్లో (డైరెక్ట్‌-ఇండైరె క్ట్‌) ప్రత్యక్షం నుంచి పరోక్షంగా వాక్యాన్ని మార్చినా ఉత్తమ పురుష ప్రత్యయం ‘ను’ మారకపోవడాన్ని ఆయన గుర్తించి, దీనిపై (అతను తాను వస్తానన్నాడు). మరింత పరిశోధన జరగాలని చెప్పాడు. సమకాలీన జీవితం నుంచి, సాహిత్యం నుంచి ఉదాహరణలతో ఆయన తన ‘తెలుగు వాక్యం’ రచనను పరిపుష్టం చేశారు. భద్రిరాజు కృష్ణమూర్తి గారి ‘వ్యవసాయ వృత్తి పదకోశం’లోని అనుభవంతో ఆయన నిఘంటు నిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక శాఖ ఏర్పాటుకు కృషి చేసారు. పత్రికా భాషపై ఆయనకున్న అభిమానంతో పత్రికాభాషా నిఘంటువుకు, ఆ తర్వాత ప్రెస్‌ అకాడెమీ నిఘంటువుకు బాధ్యత నిర్వహించారు. అనువాద రంగమన్నా కూడా ఆయనకు విశేషమైన అభిమానం. ఆయన కొన్ని కవితలను అనువాదం చేయటమే కాక, అనువాద శాస్త్రంపై తన అభిప్రాయాలను వివిధ వ్యాసాల్లో వ్యక్తీకరించారు. సాహిత్యాభిరుచి వల్ల ఆయనకు అటు భారతీయ సాహిత్య విమర్శ (ఛందో-అలంకార శాసా్త్రల విషయంలో), పాశ్చాత్య సాహిత్య విమర్శలతో పాటు భాషాశాస్త్ర దృక్పథంలో ప్రారంభమైన శైలి శాస్త్రం – ఈ మూడింటినీ జోడించి సాహిత్య విమర్శ ప్రారంభించారు. అంతకు పూర్వం కోవెల సంపత్కుమారతో ముత్యాలసరాల గురించిన విశ్లేషణ ఉన్నా, దానికి 1980ల తర్వాతే ప్రాధాన్యం ఏర్పడింది. సావిత్రి ‘బందిపోట్ల’ కవితతో ప్రారంభమైన ఆ విశ్లేషణ ఆయన జీవితాన్ని మలుపు తిప్పి, భాషా శాస్త్రం నుంచి ఆయన్ను కొంత దూరం చేసింది. అదే సమయంలో ప్రారంభమైన ‘చేరాతలు’తో ఆయన చుట్టూ తెలుగు కవిత్వ, సాహిత్య లోకం ఆవరించి పోయింది. అదే సందర్భంలో ఆయనలో ఉన్న పద్య కవిత్వ ప్రేమ వెలికి వచ్చి, పద్య ప్రేమికులను ఆయనకు సన్నిహితం చేసింది. భాషా శాస్త్ర విద్యార్థులమంతా ఆయన్నుండి దూరమై, కనుమరుగై పోయాం.
‘తెలుగు వాక్యం’ గురించి ఆయనే ఒక మాట అంటుండేవారు. భాషా శాస్త్రం ఇంగ్లీషులో చదువుకునే వారికి తెలుగు వ్యాకరణం, పరిభాషా తెలియవు కాబట్టి, అందులోని శాస్త్ర పరిభాష అర్థం కాదు, తెలుగు వ్యాకరణాలు చదువుకున్నవారికి పరిభాష అర్థం అయినా, భాషా శాస్త్ర దృక్పథం ఏమిటో అర్థం కాదు అంటే నా పుస్తకం ఎవరికీ అర్థం కాకుండా పోతోంది అని. అయినా తెలుగు వాక్యానికి పునర్ముద్రణలు వచ్చాయంటే దాన్ని చదివి అర్థం చేసుకునేవారి సంఖ్య పెరుగుతోందని అర ్థం చేసుకోవచ్చు. తెలుగు వ్యాకరణాలను సీరియస్‌గా చ దవాలనే దృష్టి నాకు ఆయన బాల వ్యాకరణంపై ఇంగ్లీషులో రాసిన వ్యాసాలే ప్రేరణ. అందువల్ల నేను కేతన రాసిన ఆంధ్రభాషా భూషణాన్ని ఇంగ్లీషులోకి భాషా శాస్త్ర విశ్లేషణతో అనువాదం చేసి చేరాకి అంకితమిచ్చినప్పుడు దానికాయన ఎంతో సంతోషించారు. సమయం మించిపోకుండా సరియైున సమయంలో, సరియైున విధంగా ఆయనకు ఆ పుస్తకాన్ని అంకితమివ్వగలగటం నా అదృ ష్టంగా భావిస్తున్నాను. ఆయన వ్యాసాన్ని మహతిలో చదివి ఆయన వద్ద భాషా శాస్త్రంలో పరిశోధన చేయాలన్న కోరికతో, వరంగల్‌ నుంచి హైద్రాబాద్‌ వచ్చి చదువుకున్న నేను కొద్దిగానైనా దాన్ని సార్థకం చేసుకోగలిగానన్న సంతృప్తే ఆయనకు నేనివ్వగలిగిన నివాళి.
-అయినవోలు ఉషాదేవి
విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా శరధి -దాశరధి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సొంత తమ్ముడికంటే తనను ఎక్కువగా అభిమానిస్తుంది చిత్ర అన్న గాయకుడు నాగూర్ బాబు

సొంత తమ్ముడికంటే ఎక్కువగా అభిమానిస్తుంది’

Published at: 27-07-2014 00:22 AM

బర్త్‌డే స్పెషల్‌

గాయని చిత్ర గురించి నాగూర్‌బాబు

కళామతల్లికి చిత్ర స్వరం.. కిరీటం. సౌమ్యం.. సింధూరం!
చిత్ర పాడిన పాటలు.. అమ్మ చేతి గోరుముద్దలు. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. బావా మరదళ్ల సరసాలు.. స్నేహితుడితో చెప్పుకొనే సర్వస్వాలు.. అన్నిటినీ మించి సుతిమెత్తగా లోకాన్ని తెలియజెప్పే నాన్నల మనసులు… చిత్ర గొంతు ఎల కోయిల. అందుకే తమిళ తంబిలు ‘చిన్న కుయిల్‌’ అని పిలుచుకుంటారు. మలబారు తీరాన పుట్టిన ఈ స్వరమారుతం చిరునామా కమ్మటి పాట. పదుల భాషల్లో ఎన్నో వేల పాటలను వల్లెవేసిన    తేనె ఊట ఆదివారం పుట్టినరోజు జరుపుకొంటోంది. ఆమెతో కలిసి దాదాపుగా మూడు దశాబ్దాల స్వరయానం చేసిన ప్రముఖ గాయకుడు నాగూర్‌బాబు అలియాస్‌ మనో ‘చిత్ర జ్యోతి’తో ‘చిత్ర’ గురించి ప్రత్యేకంగా సంభాషించారు. పాట కడుపున పుట్టిన  ఈ అక్కాతమ్ముళ్ల అనుబంఽధాన్ని చదవండి…
‘‘నిండు కుండ తొణకదు. వడ్డించిన విస్తరి ఎగిరెగిరి పడదు. చిత్ర కూడా అచ్చం అలాంటి వ్యక్తే. ఎంతో నిండుగా ఉంటుంది. ఎంతో హుందాగా ఉంటుంది. ఎక్కడా మాట తొణకదు. ఎవరినీ మాట అని చిన్నబుచ్చదు. కళామతల్లి కిరీటంలో కలికితురాయి ఆమె స్వరం. కళామతల్లి నుదుట బొట్టు ఆమె సౌమ్యం. ఇంతకన్నా చిత్ర గురించి నేనేం చెప్పాలి? 1986లో నేను ఇళయరాజాగారి దగ్గరకు పాడటానికి వెళ్లాను. అప్పటికే చిత్ర అక్కడ ఉంది. పరిశ్రమలో ఆమె నాకు ఆరు నెలల సీనియర్‌.  ఇళయరాజాగారి వద్దకు వెళ్లినప్పుడు నా పేరు నాగూర్‌ బాబు. తమిళంలో నాగూర్‌ హనీఫా అనే వ్యక్తి ముస్లిం గీతాలతో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మా ఇద్దరి పేర్లను జనాలు కన్‌ఫ్యూజ్‌ అవుతారనుకున్నారేమో నన్ను పేరు మార్చుకోమన్నారు. మనోజ్‌ అని అనుకుంటుండగా ఆయనే  ‘మనో అని పెట్టుకో, మనో, చిత్ర కలిసి పాడారు అనే సౌండ్‌ వినడానికి బావుంటుంది. మనో చిత్ర అనేది ఒకే పేరులాగా కూడా వినిపిస్తుంది’ అని అన్నారు. ఏ సుముహూర్తాన ఆయన నామకరణం చేశారోగానీ దాదాపు మూడు దశాబ్దాలుగా మేం కలిసి పాడుతూనే ఉన్నాం.’’
5000లకు పై చిలుకే!
‘‘నేను చిత్ర కలిసి తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలి, అస్సామీ, తుళు, కొంకణీతో పాటు దాదాపు 10-11 భాషల్లో పాడాం. 3900లకు పై చిలుకు పాటలను సినిమాల కోసం పాడాం. భక్తి గీతాల సంఖ్య వెయ్యికి పైమాటే. చిత్ర గొంతులో సామాజిక స్పృహ ఉన్న గీతాలు ప్రత్యేక హుందాతనాన్ని పొందుతాయి. మన దగ్గరి మనిషి మనల్ని నిలబెట్టి బాగోగులు, మంచీ చెడులు చెబుతున్నట్టే ఉంటాయి. ‘మౌనంగానే ఎదగమని..’ పాటను ఇప్పటికి ఎన్ని సార్లు విన్నా అదే భావనతో గుండె నిండిపోతుంది. మేం కలిసి పాడిన పాటల్లో చాలా హిట్లున్నాయి. ‘చుక్కలు తెమ్మన్నా తెంపుకు రానా..’, ‘ప్రియా ప్రియతమారాగాలు..’ వంటి పాటలను ఇప్పటికి వింటున్నా ఫ్రెష్‌గా మన బాధలన్నింటినీ పక్కకు మళ్లించి కాసింత సేదదీర్చేలా అనిపిస్తాయి. ఆమె పాడిన పాటలన్నీ నాకిష్టమే. ఆ దేవుడిచ్చిన స్వరంతో ఆమె జీవితం ధన్యమైంది.’’
ఆమెకు తెలియదు
‘‘మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఆమె కోపాన్ని నేనింత వరకు చూడలేదు. కోప్పడటం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసిందంతా చిరునవ్వే. ఆమెలాగా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఉన్న మనిషిని ఇంకొకరిని నేను చూడలేదు. ఇంత అనుభవం ఉన్న గాయని ఇప్పుడు రికార్డింగ్‌ స్టూడియోలో అడుగుపెట్టినా కొత్తగా వచ్చిన అమ్మాయిలాగా సంగీత దర్శకుడు చెప్పినవన్నీ వింటుంది. నేర్చుకుంటుంది. ఏవైనా సంగతులు తనకు వెంటనే రాకపోతే పట్టుబట్టి ప్రయత్నించి నేర్చుకుంటుంది. అంతేగానీ ‘ఇది నాకు రావట్లేదు. మార్చేయండి’ అని అడగటం నేనిప్పటి వరకు చూడలేదు. పాటనేది తన వెసులుబాటు కోసం పాడేది కాదని, సంగీత దర్శకుడి దృష్టితో పాడితేనే సార్థకమని నమ్ముతుంది ఆమె.  సంగీత దర్శకుడి స్థానానికి ఆమె ఎంత గొప్ప గౌరవం ఇస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.’’
చివరి దాకా
‘‘ఆమెకు సొంత సోదరుడు ఒకరున్నారు. అయినా నన్ను సొంత తమ్ముడికన్నా ఎక్కువగా అభిమానిస్తుంది. సినిమా పరిశ్రమలో అంత గొప్పగా చిత్ర అభిమానం పొందిన తమ్ముడిని నేనేనేమో. ఏనాడూ చిన్న గర్వం కూడా చూపించని వ్యక్తిత్వం ఆమెకు ప్రత్యేక అలంకారం. మేం విదేశాలకు కచేరీలకు వెళ్లినప్పుడు కూడా అంతా పూర్తయ్యేవరకు ఉండి, అక్కడికి వచ్చిన వారితో ఫోటోలు తీయించుకుని, ఆటోగ్రాఫులు ఇచ్చి వెళ్తుంది. అంతేగానీ తన పాట అయిపోగానే అక్కడి నుంచి వెళ్లిపోయే తత్వం కాదు ఆమెది. కుడిచేతిని వాటంగా తిప్పుతూ చిన్నగా కళ్లుమూసుకుని ఆమె పాడుతుంటే ఎంతటి కఠినాత్ములైనా కరగాల్సిందే. అంత గొప్ప స్వరంతో కలిసి దశాబ్దాలు ప్రయాణం చేసినందుకు చాలా గర్వంగా ఉంది.’’

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నల్గొండ చేనేత.. కెనడాలో కేక

శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస అవుతుందన్న నానుడికి నల్లగొండ చేనేత కార్మికుడు శ్రీనాథ్‌ నిలువెత్తు నిదర్శనం. చేనేత రంగంలో కూడు దొరకక ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా, ఉపాధి కరువై, కనీస కూలీ గిట్టుబాటు కాని గడ్డు పరిస్థితులు ఉన్నా ఈయన వెనుకంజ వేయలేదు. డిగ్రీ చదువుకున్నా కులవృత్తిపై అచంచల విశ్వాసంతో ముందుకు కదిలి ఆ రంగంలో తనదైన ముద్ర వేశాడు. విశ్వ వేదికలపై తన కళా నైపుణ్యాన్ని చాటి అనేక బహుమతులు గెలుచుకుని రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కుటుంబాలకు భరోసా కల్పించాడు. ఆయన సాధించిన విశేషాల సహాహార మే ఈ కథనం.

ప్రకృతి రంగులతో ఓ అందమైన పట్టుచీరను తయారుచేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుని తన నైపుణ్యాన్ని చాటాడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇడెం శ్రీనాధ్‌. ఈయనది నిరుపేద చేనేత కుటుంబం. తన తాత తండ్రుల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. శ్రీనాధ్‌ తల్లిదండ్రులు ఇడెం బిక్షపతి, సత్తమ్మలు సైతం చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగించారు. రఆ కాలంలో తాను ఒకవైపు చదువుకుంటునే తీరిక సమయంలో తమ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ చేనేత పనిని అలవరచుకున్నారు. డిగ్రీ వరకు చదివిన ఆయన చేనేత వృత్తినే ఉపాధిగా మలచుకున్నారు.
కెనడా హస్తకళల ఫౌండేషన్‌ సహకారంతో…….
2006లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌ శ్రీనాధ్‌ జీవితాన్ని మార్చింది. అక్కడ కెనడా దేశానికి చెందిన హస్థ కళల ఫౌండేషన్‌ వారితో శ్రీనాధ్‌కు పరిచయం ఏర్పడింది. ప్రకృతి రంగులతో డబుల్‌ ఇక్కత్‌ పద్దతిలో రూపొందించిన వసా్త్రలను చూసి ఫౌండేషన్‌   ప్రతినిధులు అబ్బురపడ్డారు. కెనడాలో నిర్వహించే చేనేత వసా్త్రల పోటీకి ఆయనను ఆహ్వానించారు. ప్రకృతి రంగులతో  నాలుగు నెలల పాటు శ్రమించి 9రకాల పూల డిజైన్‌లతో మొత్తం 854 పూల డిజైన్‌లు 33మెట్లతో ఓ అద్బుతమైన పట్టుచీరను రూపొందించి దాన్ని కెనడాలో జరిగిన పోటీకి పంపించాడు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది హస్తకళాకారులు పాల్గొన్న పోటీలో శ్రీనాధ్‌ రూపొందించిన డబుల్‌ ఇక్కత్‌ వస్త్రం ప్రధమ స్థానంలో నిలిచింది.  అదే సమయంలో ఇక్కడ జరిగిన జాతీయ హస్థకళల పోటీకి సైతం పాల్గొన్నాడు. అక్కడ కూడా విజయం వరించింది. శ్రీనాధ్‌ రూపొందించిన వస్త్రం  2011 జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. జులై 1న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి చేతుల మీదుగా శ్రీనాధ్‌ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు. పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదు బహుమతిని  పొందాడు. మారుమూల కుగ్రామంలో ఓ చేనేతకార్మికుడు రూపొందించిన వసా్త్రనికి జాతీయ స్థాయి పురస్కారం రావడం పట్ల గ్రామప్రజలు, చేనేత కార్మికులు శ్రీనాధ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రభుత్వ పథకాలు నేరుగా కార్మికులకే అందాలి
– ఇడెం శ్రీనాధ్‌

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పూర్తిస్థాయిలో కార్మికులకు అందడం లేదు.  చేనేత రంగంలో ప్రతిభ ఉన్న కళాకారులను ప్రభుత్వం మరింత ప్రొత్సహించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు సైతం నూతన డిజైన్‌లను రూపొందిస్తే చేనేత వసా్త్రలకు మరింత ఆధరణ పెరుగుతుంది. కార్మికులు రూపొందించిన వసా్త్రలకు ప్రభుత్వ సైతం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎగ్జిబిషన్‌లు నిర్వహించి గ్రామీణ స్థాయి కళాకారులకు మరింత ప్రొత్సాహం అందించాలి.

– మధుసూదన్‌, నల్లగొండ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి

 

ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి

1911జులై ఇరవైన జన్మించిన సోహేర్ అల్ కలమావి ప్రసిద్ధ రచయిత సాంఘిక సేవా దురందురాలు .ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ గా నిలిచిన రచయిత్రి .ఈజిప్ట్ సంస్కృతిక రంగాన్ని విద్యా వేత్తగా ,స్త్రీవాద రచయితగా తీర్చి దిద్దిన విదుషీ మణి.కైరో యూని వర్సిటిలో 1929 లో చేరి చదివిన  మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందింది .అరెబిక్ భాష చదివే ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ లో పద్నాలుగు మంది విద్యార్ధులలో ఆమె ఒక్కతే మహిళ.1941లో అరెబిక్ సాహిత్యం లో  పి.హెచ్. డి .సాధించింది .ఆమె ‘’ఆల్ఫ్ లైలా వలేలా ‘’అంటే వెయ్యి న్నోక్క  రాత్రులు(అరేబియన్ నైట్స్)  గ్రంధం పై థిసీస్  రాసి సమర్పించింది .ఈజిప్ట్ లోని మహిళలు ఒంటరి వారు కారని వారి సమస్యలకు వారితో బాటు పురుషులూ బాధ్యుఅని ఆమె అభిప్రాయం .

 

జర్నలిజం లోపని చేయటానికి  మొదటి లైసెన్స్ ఆఫ్ ఆర్ట్స్ ను పొందిన మహిళ సోహేర్ .కౌకాబ్ అల్ షర్క్ ,ది ఓరిఎంట్ స్టార్,ది మెసేజ్ ,ది వాలీ మొదలైన  పత్రికలో పని చేసింది .ఈజిప్ట్ లో మొట్టమొదటి సారిగా 1934లో ప్రారంభింప బడిన రేడియో కార్యక్రమాల నిర్వాహకురాలుగా ఉంది .1936 ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ లెక్చర్ ఇచ్చిన మొదటి స్త్రీ గ గుర్తింపు పొందింది .’’లిటరేచర్ ఆఫ్ డిసిడేన్ట్స్ లో ఏం ఏ .పట్టా పొందింది .1937లో ఫ్రాన్స్ కు పి.హెచ్ డి చేయటానికి వెళ్ళిన తొలి మహిళ కలమావి .జానపద సాహిత్యం లో పి హెచ్ డి .పొందిన ప్రధమ మహిళకూడా .అరెబిక్ లాంగ్వేజ్ డిపార్ట్ మెంట్ లో చైర్మన్ గా ప్రవేశించి పదేళ్ళు పని చేసి అంచెలంచెల మీద ఎదుగుతూ అసిస్టంట్ ప్రొఫెసర్  అయింది .1959’’యూని వర్సిటి వుమెన్  గ్రాడ్యుయేట్ యూనియన్ కు ముఖ్య అధికారి అయింది .1959లొ జానపద సాహిత్యం లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందింది .విజ్ఞాన సర్వస్వం నిర్మాణం లో చీఫ్ డిప్యూటీ గా నియమించ బడింది .ఆడిస్ అబాబా లో 1960లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు అధ్యక్షురాలిగా ఎన్నుకో బడింది .జానపద కళాసదస్సుకు ప్రధాన పాత్ర దారి  గా ఉన్నది . సినిమా  నాటక కళలకు ఈజిప్షియన్ జెనరల్ అధారిటీ కి ఉన్నతాధికారిగా పదవీ బాధ్యతలు చే బట్టింది .బాలల సాంస్కృతిక సంఘానికి ,ఆర్ట్స్ మేగజైన్ కు ప్రధాన అధికారి గా సమర్ధ వంతం గా బాధ్యతలను నిర్వహించింది ఆమె సమర్ధతను గుర్తించి ప్రభుత్వమే ఇన్ని విధాల ఆమె సేవలను సద్విని యోగం చేసుకొన్నది .

ఆమె దాదాపు ఎనభై పుస్తకాలు రచించింది .’’ది టాక్స్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ ,వెయ్యిన్నొక్క రాత్రులు ,డిసిడేన్ట్స్ లిటరేచర్ ,దివరల్డ్ ఇన్ ఏ బుక్ ,డెవిల్స్ ప్లె అండ్ డాన్స్ మొదలైన వెన్నో ఆమె రచనా పటిమకు నిదర్శనాలు .షేక్స్ పియర్ రాసిన ‘’టేమింగ్ ది షూస్ ‘’ ,చైనా భాష లోని వండర్స్ బుక్ మొదలైన వి అరెబిక్ భాషలోకి అనువదించింది .సమకాలీన ఆరబ్ సంగీతం డ్రామా సినిమా లపై ఏంతో లోతైన పరిశోధన చేసి అపూర్వమైన వ్యాసాలూ రాసింది బడ్జెట్ లో అయిదు శాతం బాల సాహిత్యాభి వృద్ధికి బాలల సృజనకు  కేటాయించేట్లు చేసింది .విజ్ఞాన శాస్త్ర సర్వస్వ నిర్మాణానికి తన వంతు సహకారాన్నందించింది .ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో అంకిత భావం తో కృషి చేసిన మహిళ సోహేర్ .

ఆమె వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు ,రివార్డులు అందుకొన్నది .అరెబిక్ లాంగ్వేజ్ అవార్డ్ ను ‘’అరేబియన్ నైట్స్ ‘’పై రాసిన దానికి పొందింది .స్టేట్ మెరిట్ అవార్డ్ ,నాజర్ అవార్డ్ ,మెడల్ ఆఫ్ ది రిపబ్లిక్ ,అందుకొన్నది.కైరో లోని అమెరికన్ యూని వర్సిటి ‘’గౌరవ డాక్టరేట్ ‘’నిచ్చి సత్కరించింది .మహిళా దినోత్సవం నాడు కైరో ప్రభుత్వం అభినందన సన్మానం చేసింది  .ఇన్ని విశిష్టతలు కలిగిన సోహేర్ ఆల్ కలమావి 1997మే నాలుగవ తేదీన 86ఏళ్ళ వయసులో చనిపోయింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్

ఫాతిమా రిఫాత్ ఈజిప్ట్ లోని సంచలన రచయిత్రి .అలీఫా రిఫాత్ అనే మారుపెరుతోనే రచనలు చేసింది .గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ లో స్త్రీల డైనమిజాన్ని  ,బాంధవ్యాలను కోల్పోవటాన్ని రచనల్లో ప్రతిఫలింప జేసింది .మతం లో ఇవి తీవ్ర  ధోరణులే అయినా ఆమె కు మతం పట్ల పూర్తీ విశ్వాసమే ఉంది .ఆమె రాసిన కధలలో  పితృస్వామ్య వ్యవస్థలో మగ వాళ్ళ బాధ్యతా రాహిత్యాన్ని ,మతం పట్ల వారి నిబద్ధత లేని జీవిత విధాలను ,స్త్రీల యెడల చూపే అలసత్వాన్ని ఎత్తి చూపింది .తనకుటుంబ సభ్యుఅల నుండి ఇబ్బందులు రాకుండా ఉండటానికే మారు పేరుతో రాసింది .

ఫాతిమా అబ్దుల్లా రిఫాత్ 1930 జూన్ అయిదున  ఈజిప్ట్ లోని కైరో లో జన్మించింది .తండ్రి ఆర్కిటెక్ట్ .తల్లి గృహిణి .మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వారుగా ఆమె కుటుంబీకులు గొప్పలు చెప్పుకొనే వారు .గ్రామీణ ప్రాంతం లో బాల్యం గడవటం వలన ఆమె కధలన్నిటికీ అదే నేపధ్యం అయింది .తోమ్మిదవ ఏటనే కవిత్వం రాసింది .అందులో గ్రామీణ స్త్రీల నిస్పృహను తెలియ జేసింది .ఇది చదివిన కుటంబం లోని వారందరూ ఆమెకు శిక్ష విధించారు .మిశ్రాల్ జదీడా ప్రైమరీ స్కూల్ లో చదివి ,కల్చరల్ సెంటర్ ఫర్ వుమెన్ లో ఇంటర్ చదివింది .కైరో లోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ లో 1946నుండి మూడేళ్ళు ఇంగ్లీష్ భాష అభ్యసించింది .ఫైన్ ఆర్ట్స్ కాలేజిలో చేరి చదువుదామని అనుకొంటే తండ్రి బలవంతాన పెండ్లికి ఒప్పించిఆమె కజిన్ అయిన పోలీస్ ఆఫీసర్ కిచ్చి  పెళ్లి చేశాడు .

ఈజిప్ట్ సంస్కృతిలో మగవాళ్ళే రచయితలూ గా ఉండాలి అనే సంప్రదాయం ఉంది .ఆమె భర్త భార్యను మారు పేరుతోకధలు ,కవితలు రాయటానికి ఒప్పుకొని ప్రోత్సహించాడు కూడా .1955-60కాలం లో ఆమె రాసిన వన్నీ ప్రచురితమయ్యాయి .తర్వాత భర్త పెట్టిన తీవ్ర ఒత్తిడి తో రాయటం ఆపేసింది .14 ఏళ్ళు ఏదీ రాయకుండానే ఉండిపోయింది ఈ కాలం లో సాహిత్యం ఖగోళం ,చరిత్రలను అధ్యయనం చేసింది .తన సమాజం లో జరుగుతున్న అన్యాయాలకు  మౌన ప్రేక్షకురాలిగా ఉండిపోవటం ఆమెకు అసాధ్యం గా ఉంది .1973లో ఆమెకు తీవ్రమైన జబ్బు చేసింది .భర్త మనసు మార్చుకొని మళ్ళీ రాయమని ప్రోత్సహించాడు .ఆ ప్రోద్బలం తో ఉత్సాహం గా కధలు నవలలు  రాసి ప్రచురించింది .ఫాతిమా రాసిన ‘’మై వరల్డ్ ఆఫ్ అన్ నోన్ ‘’కద విశేషం గా ప్రాచుర్యం పొందింది .1979లో భర్త మరణించాడు .భర్త కు తరచూ జరిగే బదిలీలలో గ్రామ జీవితాన్నే హాయిగా అనుభవిస్తూ ,అతని మరణం తర్వాతకూడా ఈజిప్ట్ లోనే ఉండిపోయింది .

1981లో మక్కా కు హాజీ పవిత్ర యాత్ర చేసింది .ఇంగ్లాండ్ టర్కీ జర్మని మొరాకో , ఆస్ట్రియా మొదలైన వాటిని తిరిగి చూసింది .ఫెడరేషన్ ఆఫ్ ఈజిప్షియన్ రైటర్స్ ,షార్ట్ స్టోరి క్లబ్ ,దార్ –అల్  –ఉదాబా మొదలైన సాహితీ సంస్థలలో జీవిత కాలం అంతా సభ్యురాలుగా ఉంది .1984లో ఇంగ్లాండ్ లో జరిగిన మొదటి ‘’అంతర్జాతీయ మహిళా పుస్తక మహోత్సవం ‘’కు వెళ్ళింది ..అక్కడ ఈజిప్ట్ లోని మహిళా హక్కుల గురించి ,అక్కడ ఉన్న బహు  భార్యాత్వం గురించి గంభీరం గా ప్రసంగించింది .1984లో ఫాతిమా ‘’ఎక్సేలేన్సి అవార్డ్ ‘’ను మోడరన్ లిటరేచర్  అసెంబ్లీ ‘’నుండి పొందింది .అరవై అయిదేళ్ళ వయసులో ఫాతిమా  రిఫాత్  1996 జనవరిలో మరణించింది .ఆమెకు ముగ్గురు మగ పిల్లలు .వివిధ భాషల్లో ఆమె రచనలు వందకు పైగా అనువాదాలైనాయి .

ఫాతిమా రాసిన వన్నీ అరెబిక్ భాషలోనే రాసింది .మొదట్లో శృంగారం రంగరించే ఎక్కువ గా రాసింది .జేనీస్ జాన్ డేవిస్ అనే అనువాదకుడి తో పరిచయం అయిన తర్వాత అతని సలహా తో సాంఘిక సమస్యలపై,మరింత సరళం గా వాడుక భాషలో  రాయటం మొదలెట్టింది .ఆమె నవలలు ,కధలు ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, జెర్మని ,స్వీడిష్ భాషల్లోకి తర్జుమా అయ్యాయి .ఇంగ్లీష్ లోకి అనువదింప బడిన ఆమె చిన్న కధలు మహా గొప్పగా ప్రచారమై మంచి  పేరును గుర్తింపును తెచ్చి పెట్టాయి .ఈజిప్ట్ లోని మిగతా స్త్రీ వాద రచయిత్రులకు భిన్నం గా ఫాతిమా మాతా చారం పాటించే స్త్రీల గురించే ఎక్కువగా రాసింది .తన జీవిత చరిత్రలో తండ్రి తనను ప్రేమగా చూడ లేదని అందుకే సాహసం తో కొత్త మార్గాన్ని పట్టాల్సి వచ్చిందని చెప్పింది .తండ్రులు కూతుళ్ళ యెడల ప్రవర్తించే హింసా విధానం పై రాయాల్సి వచ్చింది అన్నది .మగాళ్ళకు కావాల్సింది జల్సాయే నని గుర్తించానని అందుకే తన రచనల్లో ఆడవారిపై మగవారు ప్రేమ చూపించాలనే  సందేశం  ఉంటుందని చెప్పింది .భార్యా భర్తలు పవిత్ర భావన తోనే శృంగార కార్యం జరుపుకోవాలని కోరింది .అప్పుడే భగవంతునిపై విశ్వాసం పెరుగుతుందని చెప్పింది .

ఈజిప్ట్ లోని పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలను భవిస్తున్న ఒంటరితనాన్ని ఆవ హేళలను,బాధలను కధల్లో చిత్రించింది .ఈ కధల్లో సెక్స్ ,చావు ,పెళ్లి మాస్టర్బెషన్ ,జననేంద్రియ వర్ణన ,ప్రేమ ,పెళ్ళికాని యువతుల్లో గర్భధారణ,,వితంతు వ్యధ  మొదలైన  తార్కిక సమస్యల ను వివరించింది .ఆమె కాలం లో వీటిని గురించి మాట్లాడమే నేరం. బరి తెగించి ఆడది ప్రవర్తిస్తే సమాజం పతన మవుతుందని భావన ఉండేవి .స్త్రీల సెక్స్ కోరికలను అణచి వేయటాన్ని ఆమె వ్యతిరేకించింది .కాని తాను మాత్రం చక్కని కుటుంబ వ్యవస్థలో సనాతన  మత విశ్వాస జీవితమే ఆదర్శం గా గడిపింది .కురాన్ పితృస్వామ్యాన్ని ప్రబోదించినా మతానికి వ్యతిరేకం గా ‘’మ్రుగాడు ‘’సంచరించటం ఆమె హర్షించలేదు .మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడదాని బతుకు బుగ్గి చేయరాదని నిష్కర్ష గా చెప్పింది .ఇన్ని చెప్పినా ఆమె కధల్లో వివాహాతేర సంబంధాలు మచ్చుకైనా కని  పించవు .నీతి నిజాయితీ భార్యా భర్తలిద్దరికీ ఉండాలనే బోధించింది .’’డిస్టంట్ వ్యూ ఆఫ్ ఏ మినరెట్ ‘’ ‘’బాహియ్యా అనే ఆమె కదలు జగత్ ప్రసిద్దాలైనాయి . మొత్తం మీద ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతీ లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి ,ఎలుగెత్తి చాటి ,సరిదిద్దుకోమని ముందుకు వచ్చి  ధైర్యం గా చెప్పి ,రాసిన అలీఫా రిఫాత్ అభి నందనీయురాలు .

 

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కర్మయోగి కొడాలి – కొడాలి ఆంజనేయులు -ఈ రోజు కృష్ణా జిల్లా కొడాలి లో కొడాలి వారి విగ్రహావిష్కరణ

కర్మయోగి కొడాలి – కొడాలి వేంకటాచలం

కొడాలి ఆంజనేయులు గారు 1897లో కృష్ణాజిల్లా దివి తాలూకాలోని కొడాలి గ్రామంలో జన్మించారు. బందరు హిందూ హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకటశాసు్త్రలు గారి దగ్గర విశ్వనాథ సత్యనారాయణ గారితో కలసి చదువుకున్నారు. తరువాత వీరిద్దరూ ‘సత్యాంజనేయ కవులు’ పేరుతో జంట కవులుగా కొంతకాలం కవిత్వం చెప్పారు.  తరువాత ఆంజనేయులు స్వాతంత్య్ర సమరంలోకి దూకగా, విశ్వనాథవారు సాహిత్యరంగంలో నిలదొక్కుకున్నారు. అనంతర కాలంలో విశ్వనాథవారు తన ‘రామాయణ కల్పవృక్షం’ అవతారికలో కొడాలి వారిని గుర్తుచేసుకుంటూ ‘అతడె తోడు కల్గినను అచ్చముగ కలకండ అచ్చులుం పోతలు పోసియుండెదము పోతనగారి విధాన’ అని కూడా ఉద్ఘాటించారు. అంతేకాదు, తన ‘వేయిపడగలు’లో కొడాలివారిని రాఘవరావు అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేయించారు కూడా. పీకలదాకా స్వాతంత్య్ర సంగ్రామంలో కూరుకుపోయిన ఆంజనేయులు గారు అడపాదడపా రాసిన ఖండకావ్యాల్లో జాతీయోద్యమ సువాసనలు గుబాళించేవి. 1922-25 మధ్యకాలంలో గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేసినందువల్ల ఆంజనేయులు గారు ‘సాహితి’ సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యంలో పెద్ద సంచలనం సృష్టించిన చలం కథలను తొలిసారిగా ప్రచురించిన సాహసం, ఘనత కొడాలి వారికే దక్కుతాయి. సాహితిలోనే కాక భారతి, శారద, సఖి, జ్వాల, ప్రతిభ, వీణ, కృష్ణా పత్రికలకు కూడా ఆయన కవితలు రాశారు. అనేక సంకలనాల్లో ఆయన కవితలు స్థానం సంపాదించుకున్నాయి. న్యూయార్క్‌లో ప్రచురితమైన ‘ఇండియా లవ్స్‌ పోయెమ్స్‌’లో కాళిదాసు, భర్తృహరి, క్షేత్రయ్య, అల్లసాని పెద్దన వంటి మహాకవుల కవితలతో పాటు ఆంజనేయులుగారి ఖండకావ్యం ‘పెళ్ళి కూతురు’ కూడా ‘టు ది బ్రైడ్‌’ పేరుతో ప్రచురితమైంది. 27 సంవత్సరాల పాటు స్వాతంత్య్రసమరంలో కష్టాలు భరిస్తూ, ఏడేళ్ళపాటు సి క్లాసు జైలు శిక్షను అనుభవించినా, స్వాతంత్ర్యానంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఆంజనేయులుగారు జీవితాంతం ఆశాజీవే. ఏ పనిచేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన కర్మయోగి ఆయన

– కొడాలి వేంకటాచలం
(ఆంజనేయులుగారి జన్మస్థలం కొడాలిలో నేడు ఆయన విగ్రహావిష్కరణ)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చే రా .-భాష్యకారుడు ,మాస్టారు

భాష్యకారుడు (సంపాదకీయం)

చేరా వెళ్లిపోయారు. భాషా శాసా్త్రనికి, సాహిత్య విమర్శకు ఎనలేని సేవ చేసి తెలుగు సమాజపు బౌద్ధికరంగంలో ముఖ్య పాత్ర నిర్వహించిన చేకూరి రామారావు నిరాడంబరమైన జీవితం గడిపి నిష్క్రమించారు. ఆయనతో పోలిస్తే అంగుష్ఠమాత్రులుగా ఉన్నవారు కూడా అందలాలు ఎక్కినా ఆయనను పదవులూ హోదాలూ పలకరించలేదు. ఆయనా అందుకు తాపత్రయపడలేదు. కేవలం అక్షరాలా అక్షరాల మనిషిగా జీవించారు. ఆధునికత, ప్రగతిశీలత, సంయమనం, అపారమైన పాండిత్యం, గాఢమైన కవిత్వ ప్రేమ- ఇన్ని లక్షణాలు ఒకచోట చేరితే చేరా. ఎనభై ఏళ్ల వయస్సులో చేరా మరణం కాలధర్మమే కావచ్చును కానీ, ఆయన అక్షరం ఇంకా సాహిత్య ప్రపంచపు జ్ఞాపకంలో తాజాగానే ఉన్నది. చేరా మరణవార్త అందుకే దిగ్ర్భాంతిని, తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తున్నది.

భాషా శాస్త్రం ఆయన అధికారిక అధ్యయన రంగం. సాహిత్యం ఆయన అభిరుచి రంగం. భాషాశాస్త్ర పరిశోధనలో కొత్త దారి తొక్కి, తెలుగు వాక్య నిర్మాణ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. అమెరికాలోని కోర్మెల్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధన చేసిన రామారావు నోమ్‌ చామ్‌స్కీ సుప్రసిద్ధ ‘ట్రాన్స్‌ఫర్మేషనల్‌ గ్రామర్‌ సిద్ధాంత’ పరికరాలను తెలుగు వాక్యానికి అన్వయించి విశ్లేషించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన ఆయన పుస్తకం ‘తెలుగువాక్యం’ తెలుగు వాక్యానికి నవీన వ్యాకరణం వంటిది. దురదృష్టవశాత్తూ, చేరా భాషాశాస్త్ర ఆవిష్కరణలను కానీ, భాషా సంబంధి రచనలను కానీ తెలుగు సమాజం ప్రయోజనవంతంగా వినియోగించు కోలేకపోయింది. ఒకరిద్దరు తప్ప, ఆ రంగంలో ఆయనతో సంభాషించిన వారు కానీ, ప్రధాన స్రవంతి చర్చలలోకి ఆ అంశాలను తీసుకువచ్చినవారు కానీ లేకపోయారు.

ఆధునిక తెలుగువాక్యాన్ని చేరా వ్యవహర్తల సంభాషణల నుంచి, ప్రసిద్ధ వచన రచనల నుంచి నమూనాలుగా తీసుకుని విశ్లేషణలు, వ్యాఖ్యలు చేశారు. రాసే తెలుగుకి, మాట్లాడే తెలుగుకి అంతరం ఉండి తీరుతుందని, రాసే భాష ప్రయోజనాలు భిన్నమయినవని, బౌద్ధిక వచనం సూటిగా అలంకార రహితంగా ఉండాలని ఆయన వాదించేవారు. నిర్విచక్షణగా ఆలంకారిక వచనం కానీ, కవిత్వ వచనం కానీ ఉపయోగించకూడదని చెప్పేవారు. చేరా వచనశైలి శాస్త్ర వచనానికి ఉదాహరణ ప్రాయంగా ఉండేది. వాక్యనిర్మాణానికి సంబంధించి తన శాసీ్త్రయ సూత్రాలనే చేరా వచన కవిత్వ విశ్లేషణకు కూడా వినియోగించుకున్నారు.

తెలుగు సాహిత్య ప్రపంచంతో నిత్యసంబంధంలో ఉన్నప్పటికీ, చేకూరి రామారావుకు విస్తృతమైన ప్రసిద్ధిని అందించింది ఆయన ‘చేరాతలు’ కాలమ్‌. అంతకు ముందే నగ్నముని ‘కొయ్యగుర్రం’ దీర్ఘకవితను ‘ఆధునిక మహాకావ్యం’ అని చేరా అభివర్ణించడంపై పెద్ద చర్చ జరిగింది. 1986 నుంచి 1994 దాకా ఎనిమిదేళ్ల పాటు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఆయన నిర్వహించిన ‘చేరాతలు’ కాలమ్‌ నాటి సాహిత్యలోకంలో ఒక సంచలనం. ప్రధా నంగా సమకాలిక కవిత్వ విశ్లేషణగా సాగిన ఆ కాలమ్‌, కొత్తగా రాస్తున్న కవులకు ప్రోత్సాహ కరంగా ఉండేది. రూపరీత్యా కవిత్వ నిర్మాణ పద్ధతిని వ్యాఖ్యానిస్తూ చేరా రాసిన వ్యాసాలు, అప్పటికి తెలుగు సమాజానికి అలవాటైన వస్తు విమర్శకు పూర్తి భిన్నమైనది. చేరా ప్రగతిశీల అభిప్రాయాలు కలవారని, ప్రజావ్యతిరేక కావ్యవస్తువును సమ్మతించేవారు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కానీ, కవితా నిర్మాణం మీద కేంద్రీకరించిన తీరు ఆయనకు ‘రూపవాది’ అన్న విమర్శను తెచ్చిపెట్టింది. వస్తువుతో ఏకీభావం ఉన్నప్పుడు, విమర్శించ వలసింది రూపాన్నే కదా- అని ఆయన సమాధానం. రాజకీయంగా, సాహిత్యోద్యమాల పరంగా కీలకమయిన కాలంలో చేరాతలు, పదునైన వ్యక్తీకరణ, మునుపటి కంటె భిన్నమయిన కవితానిర్మాణం చేయగలిగిన కవి తరాన్ని, తరాల్ని ఆవిష్కరించడానికి దోహదం చేశాయి. కవిత్వం రాయడానికే కాదు, కవిత్వాన్ని ఆనందించడానికి కూడా కొంత శిక్షణ, సహాయమూ కావాలని చేరాతలు నిరూపించాయి. తొలి అడుగులు వేస్తున్న కవులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి కవిత్వాన్ని అర్థం చేసుకోగలిగిన పాఠకులను కూడా అవి రూపొందించాయి.

చేరాతలు కాలమ్‌ చేరాకు ప్రఖ్యాతితో పాటు, అనేక సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఆయన కాలమ్‌లో కనిపించిన కవులకు సాహిత్యరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో, చేరా ఎంపికపై విమర్శలు వచ్చాయి. తన నిర్మాణ సూత్రాలను అన్వయించి వ్యాఖ్యానించడానికి అనువైన పాఠ్యాలు కావడం వల్లనేమో, చేరా సీ్త్రవాద కవిత్వానికి పెద్ద పీట వేశారు. వస్తువు మంచిచెడ్డల జోలికి పోకపోయినా, ఆయన చేసిన రూపవిమర్శ కూడా ఆ ధోరణి కవిత్వానికి ఆసరాగా నిలిచింది. విప్లవ, దళితవాద కవులను కూడా చేరా అప్పుడప్పుడు పరామర్శించారు. ఏ కోవలోకీ చేరకుండా ఉన్న కవులను కూడా ఆయన వారి వ్యక్తీకరణ బలాబలాల ప్రాతిపదికన తరచు కాలమ్‌లో పరామర్శించారు.

చేరా ఆసక్తులు ఆధునిక వచన కవిత్వానికి మాత్రమే పరిమితమైనవి కావు. చిన్ననాడు స్వయంగా కవి అయిన చేరా, కవిత్వం మీద గాఢమైన అభిమానంతో తన సర్వశక్తులను కవిత్వ విమర్శ మీద కేంద్రీకరించారు. భాషాశాస్త్రంతో పాటు, ఛందస్సు కూడా చేరాకు ఇష్టమ యిన రంగం. ముత్యాల సరం మీద, వచనపద్యం లక్షణాల మీద సుదీర్ఘమైన చర్చలు చేశా రు. పత్రికలకు పనికివచ్చే ‘ఇంగ్లీషు-తెలుగు పత్రికా పదకోశం’ కూడా ఆయన నిర్మించారు. నేటి సమాచార సాధనాల్లో ఉపయోగించే తెలుగుని ఆయన  నిశితంగా పరిశీలించేవారు.

2003 దాకా పదహారు పుస్తకాలు (అధికం సాహిత్య విమర్శే) ప్రచురించిన చేరాను ఖమ్మం సాహితీమిత్రులు (సాహితీ స్రవంతి) 2004లో ఆయన 70వ జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు. దీర్ఘకాలం తెలుగు భాషా సాహిత్య వేదికల మీద వెలిగిన చేరా, పదేళ్ల నుంచి తెరచాటుకు వెళ్లిపోయారు. అనారోగ్యం ఆవరించిన మాట నిజమే కానీ, ఆయన బహిరంగ జీవిత నిష్క్రమణకు అదొక్కటే కారణం కాదు. కవిత్వపు సరిహద్దులు విస్తరింపజేసినందుకు తన కృషి మీద ఆయన సంతృప్తిగానే ఉన్నారు. కానీ ‘చేరాతల’కు లభించిన కొన్ని ప్రతిస్పందనలపై ఆయన నొచ్చుకున్నారు. శేష జీవితానికి ఒక కొత్త ప్రయోజనాన్ని, కొత్త సంకల్పాన్ని చెప్పుకుని నిశ్శబ్దంలోకి జారిపోయారు. కవిత్వంతో తన రొమాన్స్‌ ముగిసిందని, అది దారితప్పిన ప్రయాణమని, భాషా వ్యాకరణాల అధ్యయనంలో పూర్తికాలం వెచ్చించాలనుకుంటున్నానని పదేళ్ల కిందట చేరా బహిరంగ ప్రకటనే చేశారు. ఆ కృషి ఎంత వరకు సాగిందో ఇంకా తెలియవలసి ఉన్నది.

మన చేరా మాస్టారు – ఓల్గా

Published at: 26-07-2014 01:11 AM

తెలుగు రచయితలందరికీ చేరా  గారితో తమవైన ప్రత్యేకమైన       అనుభవాలు ఉండి ఉంటాయి.  ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.

గత శతాబ్ది చివరి రెండు దశాబ్దాలు (1980లు, 1990లు) సీ్త్రవాద సాహిత్య వికాస దశాబ్దాలు. ఆ వికాసంలో ప్రధాన పాత్ర చేకూరి రామారావు గారిది. సీ్త్రవాద కవిత్వాన్ని అర్థం చేసుకో నిరాకరిస్తున్న అనేక మంది కవుల, మేధావుల, విప్లవకారుల ఆలోచనలను సరియైున దారిలో పెట్టడానికి ఆయన విమర్శలు ఉపయోగపడ్డాయి. కవయిత్రుల కవిత్వం అచ్చవగానే ఆ తాజాదనాన్నీ, వస్తు శిల్పాల కొత్తదనాన్నీ ‘చేరాతలు’ రాసి సాహిత్య ప్రేమికులకు పంచిపెట్టే వారు. రామారావు గారి చేరాతల చేయూత లేకుంటే ఆ దశాబ్దాల నడక సీ్త్రవాదులకు మరింత కష్టమై ఉండేది. ఆ రోజుల్లో కవిత్వం కథలు రాయటం మొదలుపెట్టిన కవయిత్రులందరికీ ఆప్తమిత్రుడు చేరా.

ఔను, ఆయన చాలా గొప్ప భాషా శాస్త్రవేత్త. భాషా శాస్త్రంలో ఆయనతో దీటుగా శాస్త్ర చర్చలు చేయగలవాళ్లు అతి తక్కువ మంది. సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు. విశ్వవిద్యాలయ ఆచార్యుడు అందంగా, హుందాగా, ఎదుటివారి గౌరవాన్ని కమాండ్‌ చేయగలిగిన వ్యక్తి. కానీ నిష్కల్మషమైన మనసుతో, మాటతో, చిరునవ్వుతో అందరినీ స్నేహితులుగా చేసుకునేవారు. ఒకటి రెండు కవితలు రాసిన వాళ్లు కూడా వచ్చి ఆయనతో సమానస్థాయిలో కూర్చుని మాట్లాడగలిగిన వాతావరణాన్ని ఆయన కల్పించారు. ఆయనతో స్నేహం అంటే పోసుకోలు కబుర్లు కాదు. లేనిపోని ప్రగల్భాలు కాదు. అసూయలూ, ఆడిపోసుకోవడాలూ కాదు. నేర్చుకోవటం. కవిత్వాన్ని ఎలా చదవాలో, ఎలా ఆనందించాలో, ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవటం. తెలుగు వాక్యరీతుల సొగసుల్ని అర్థం చేసుకోవటం. తెలుగు వ్యాకరణమంటే భయం పోగొట్టుకోవటం. తెలుగు ఛందోరీతుల మీద మమకారం పెంచుకోవటం. ముత్యాల సరాన్ని ముద్దాడేటంతగా ప్రేమించటం. ఇవన్నీ నేను ఎంతో కొంత చేరా గారితో స్నేహంలో నేర్చుకోగలిగాను. నాలాగే ఎంతో మంది నేర్చుకుని ఉంటారు. అధ్యాపకుడిగా ఆయన బోధన నేను వినలేదు. కానీ ఒక సాహితీ మిత్రునిగా ఆయన నాకు ఎంతో బోధించారు. అలాగే సీ్త్రవాదం గురించి ఓపికగా ఎంతో విన్నారు. నేనిచ్చిన పుస్తకాలు చదివారు. దాదాపు నలభై సంవత్సరాల కాలంలో ఆయన మీద గౌరవం పెరుగుతూ వచ్చింది. చేరా గారితో స్నేహం చెయ్యటమంటే ఆయన కుటుంబంలో ఆప్తులుగా మారిపోవటమే. రంగనాయకి గారు, అమ్మాయి సంధ్య కూడా మమ్మల్ని ఎంతో స్నేహంగా చూసేవారు. ఆయన మనవడు హేమంత్‌ కూడా మాకు దగ్గరయ్యాడు.

వ్యక్తిగతంగా ఆయన నాకు చేసిన మేలు మర్చిపోలేనిది. నాకేదో అపకారం జరుగుతుందని ఒకరోజు సాయంత్రం యూనివర్సిటీ నుంచి జూబ్లీహిల్స్‌కు బస్సులో వచ్చి నాకు జాగ్రత్తలు చెప్పి, అసలు పరీక్షా సమయంలో పక్కనే పెద్ద అండగా ఉండి నాకు ధైర్యాన్నిచ్చారు. నాకూ, కుటుంబరావుకూ మర్చి పోలేని మహోపకారం ఆయాచితంగా చేశారు. ఆ తరువాత దాని గురించి ప్రస్తావనే లేదు. నేనింత సహాయం చేశాను అని పదే పదే గుర్తుచేసే చిన్న మనసు కాదాయనది. నిజంగా 1980వ దశకం చివరి సంవత్సరాలలో నాకు గొప్ప వ్యక్తుల, మేధావుల స్నేహం లభించింది. నేను ‘ఈనాడు’ ఆఫీసులో పనిచేస్తుండేదాన్ని. పక్కనే ఉన్న ఒక భవనంలో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు పనిచేసింది. అక్కడికి చేరా వచ్చేవారు. కేతు విశ్వనాథరెడ్డి గారు, చలసాని ప్రసాదరావు గారు, శివలింగప్రసాద్‌ గారు, నేనూ, కుటుంబరావు తరచూ అక్కడ కలిసేవాళ్ళం. అంబేద్కర్‌ యూనివర్సిటీ తెలుగు సిలబస్‌ గురించి చర్చలు నడిచేవి. సాహిత్య, సామాజిక, రాజకీయ విషయాల గురించిన చర్చలు జరిగేవి. రామారావు గారు రాసిన పాఠాలు నిజంగా మార్గదర్శకాలు. సావిత్రి గారి కవితను ఆయన వివరించి విశ్లేషించిన తీరు ఎంతో ఆధునిక మైనది. మాట్లాడటంలో, వివరించటంలో, స్నేహం చెయ్యటంలో, ఒక సంప్రదాయ ధోరణిని ఒదిలించుకోటానికి, కొత్త భావాలనూ, రీతులను అర్థం చేసుకోటానికీ రామారావు గారు కనిపించకుండా నాపై వేసిన ప్రభావం ఎంతో మాటల్లో చెప్పలేను.

1983లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం ఎగ్నెస్‌ స్మెడ్లీ కథలను ‘సామాన్యుల సాహసం’ పేరుతో అనువదించాను. అను వాదంలో అది నా తొలిప్రయత్నం. సంపాదకుడుగా చేరా ఉన్నారు. కథలు పంపిస్తే తప్పులుంటే ఆయన వ్యాఖ్యలు రాసి, సవరించి తిరిగి పంపించవచ్చు. కానీ ఆయన ఒక రాత్రంతా నిద్ర లేకుండా నేనా కథలు చదువుతుంటే విని వెంట వెంటనే స్పందించారు. నేను, గీత, కె.లలిత, కుటుంబరావు ఆ రోజు లలితా వాళ్ళింట్లో గడిపిన రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను. రామారావు గారు ఇచ్చిన కొన్ని సలహాలు నాకు ఇవాళ్టి వరకూ ఎన్ని అనువాదాలో చేయగల శక్తినిచ్చాయి. సాహిత్యం, రాజకీయాలు, సాంఘిక శాస్త్ర విషయాలు- ఎంత క్లిష్టమైన వస్తువునైనా తేలికగా అనువాదం చేయగలుగుతున్నాను.

2002లో మా ఇద్దరికీ మహాభారతంలో విరాటపర్వం చదవాలనే కోరిక కలిగింది. కలిసి చదివితే ఇంకా ఎక్కువగా ఆస్వాదించవచ్చు ఆనందించవచ్చు అనుకున్నాం. రెండు నెలల పాటు రోజూ ఉదయం తొమ్మిది గంటలకు చేరా గారింటికి వెళ్ళేదాన్ని. ఆయన, హేమంత్‌ స్కూలుకి వెళ్ళాక తన పనులు ముగించుకుని ఉండేవారు. రెండు గంటల పాటు తిక్కన గారి కవిత్వపు రీతులలో, లోతులలో మునిగితేలేవాళ్ళం. తిక్కన వాడిన భాష గురించి ఎన్ని విశేషాలు చెప్పేవారో. నేను గమనించి చెప్పిన కవితా విశేషాలనూ ఆయన ఆనందించి నన్ను మెచ్చుకునేవారు. వేగుంట మోహన ప్రసాద్‌ గారి కవితలను అర్థం చేసుకోవటం నేర్పింది కూడా మాస్టారే. తెలుగు రచయితలందరికీ చేరా గారితో తమవైన ప్రత్యేకమైన అనుభవాలు ఉండి ఉంటాయి. ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.

రెండు మూడు సంవత్సరాలుగా చేరాగారు మరింత పరధ్యానంగా, డిటాచ్‌డ్‌గా కనిపిస్తూ వచ్చారు. ఐతే ఆయన సాహిత్య ప్రపంచంతో తన సంబంధాన్ని మాత్రం ఒదులుకోలేదు. ప్రతి రోజూ నగరంలో జరిగే సభలకు హాజరయ్యేవారు. అందరినీ చూసేవారు. సభలో కాసేపు కూచుని వెళ్లిపోయేవారు. వేదిక మీద కూర్చుని విలువైన మాటలు మాట్లాడాల్సిన వ్యక్తి సభలో ఎక్కడో ఓ చోట నిశ్శబ్దంగా కూర్చుని వెళ్తున్నారే అని బాధ కలిగేది. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఒక డిటాచ్‌మెంట్‌ని అభ్యాసం చేసి తను వెళ్ళిపోయే మార్గాన్ని సుగమం చేసుకున్నట్లున్నారు. ధ్యానంలో అనాయాసంగా ఈ ప్రపంచాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకోగలగటం ఆయన జీవిత గమనం లాగానే గౌరవంగా హుందాగా జరిగిందనిపిస్తుంది.

 ఓల్గా

Category:

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామర్ల కోట కుర్రాడి సాలరి కోటిన్నర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బళ్ళారి రాఘవపై తూష్ణీ భావమా?! – పోతుల బాలకోటయ్య

బళ్ళారి రాఘవపై తూష్ణీ భావమా?! – పోతుల బాలకోటయ్య

‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటారు పెద్దలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దీ అలాంటి బుద్ధేనేమో… ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఒక్కో అడుగు అలాంటి బుద్ధితోనే వేస్తున్న దుస్థితి. రాష్ట్ర విభజన నేపథ్యంలో… పోలవరం ముంపు మండలాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్‌, ఉద్యోగుల విభజన, హైదరాబాద్‌ శాంతి భద్రతలు వంటి అంశాలపై వివాదాస్పద నిర్ణయాలతో పాటు ఆఖరికి సచివాలయంలో ఇనుప కంచె, ఏపీఎన్జీవోలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడం, కట్టడాల కూల్చివేత, రెండు ప్రధాన టీవీ చానళ్ళ ప్రసారాల నిలిపివేత ఈ కోవలోనివే.
ఇప్పుడు తాజాగా తెలుగు ప్రజలకు గర్వకారణమైన నాటక రంగ మహా నటుడు బళ్ళారి రాఘవ గారిపై కేసీఆర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, డైలాగులు కూడా అలాంటివే. మొత్తం నాటకరంగ కళాకారులను, కళాప్రియులను కించపర్చేవే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మహా కవి దాశరధి జయంత్యుత్సవ కార్యక్రమంలో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌పై ఏర్పాటు చేసిన విగ్రహాల గురించి ప్రస్తావించారు. బళ్ళారి రాఘవ లాంటి పనికిమాలిన విగ్రహాలు అక్కడ పెట్టారని, ఆయన గురించి బడి పిల్లలకు కూడా తెలియదంటూ వ్యాఖ్యానించారు. ‘నేనేది మాట్లాడినా మీడియా వాళ్ళు వివాదాస్పదం చేస్తారని అంటూనే…. ఇది పనికిమాలిన పని కాదా?’ అంటూ మీడియా వాళ్ళనే ప్రశ్నించారు.
నిజానికి బళ్ళారి రాఘవ విగ్రహం హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌పై 1985 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ళ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో… హైదరాబాద్‌ పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా చట్టరూపం దాల్చిన పరిస్థితులలో.. కేసీఆర్‌ బళ్ళారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? ప్రాంతాలకతీతంగా తెలుగు కళా వైభవానికి వన్నెలు దిద్దిన నటులను దూషిస్తే, తెలుగు వైభవానికి మంచి జరుగుతుందా?
బళ్ళారి రాఘవ గురించి ఇప్పటి బడి పిల్లలకు తెలియకపోవచ్చునేమో… కానీ, కేసీఆర్‌కు తెలియకపోవడం క్షమార్హం కాదు. 1880 ఆగస్టు 2న బళ్ళారిలోని తాడిపత్రిలో నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులు తొలి సంతానంగా రాఘవ పుట్టారు. బళ్ళారి మునిసిపల్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ చదివిన రాఘవ మద్రాసులో 1905లోనే న్యాయ శాస్త్ర పట్టా పొందారు. ఆయనకు మొదటి నుంచీ కళలంటే ఇష్టం. కథలంటే ఇష్టం. పాటలంటే ఇష్టం. ఈ ఇష్టంతోనే తెలుగు, కన్నడం, హిందీ, తమిళం భాషలతో పాటు ఆంగ్లంలోనూ ఆయన నాటకాలాడారు. దుర్యోధన, వృద్ధ రైతు, మంత్రి, గిరీశం వంటి చలన చిత్రాలలోనూ నటించారు. షేక్‌స్పియర్‌ నాటకంలో షైలాక్‌ పాత్ర పోషిస్తే, ఆ నాటకం చూసిన ప్రఖ్యాత ఇంగ్లీషు నాటక రచయిత బెర్నార్డ్‌ షా తెగ మెచ్చుకున్నాడట. రాఘవ ఇంగ్లండులో పుట్టినట్లయితే, షేక్‌స్పియర్‌ అంతటి ఖ్యాతి లభించేదని ప్రశంసించాడట. విశ్వకవి రవీంద్రుడు తన ‘పోస్టాఫీస్‌’ నాటకంలో రాఘవ నటనను చూసి ఉత్తమ శ్రేణికి చెందిన అఖిల భారత స్థాయి కళాకారునిగా కీర్తించాడట. బెంగళూరులో రాఘవ నాటక ప్రదర్శనను తిలకించేందుకు మహాత్మా గాంధీని ఆహ్వానిస్తే, పది నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేనని చెప్పిన గాంధీ దాదాపు 80 నిమిషాలు దాటినా కన్నార్పకుండా రాఘవ నాటకాన్ని తిలకించాడంటారు. ఈ రోజుల్లోనే భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసినవాడు రాఘవుడు. స్ర్తీ పాత్రలను స్ర్తీలే ధరించాలని చెప్పి, విద్యాధికులైన స్ర్తీలను రంగ స్థలం ఎక్కించి వాస్తవికతకు అద్దం పట్టిన విప్లవ నటుడు ఆయన. జాతి ప్రగతికి, మూఢాచార నిర్మూలనకు నాటక రంగం అత్యంత ప్రధానమైన ప్రచార అస్త్రంగా నమ్మి, నాటకాల ద్వారా సామాజిక చైతన్యాలను వెలిగించిన జ్యోతి. అలాంటి మహా నటుడు మిగుల్చుకున్నది ఏదీ లేదు. మొత్తం జీవితాన్నే నాటక రంగానికి రంగరించి మరీ వినియోగించారు. వ్యక్తిగా ఆయన కుల మతాలకు వ్యతిరేకి. ‘ఆచారి’ని తన పేరు నుంచి తొలగించి, కేవలం బళ్ళారి రాఘవ తనను తాను సంస్కరించుకున్న ఘనుడు. ఒకానొక నాటకంలో తల్లి చనిపోయిన ఘట్టంలో సహజత్వం కోసం కడవల కొద్దీ నీళ్ళను తలపై కుమ్మరించుకొని, ఆ తరువాత జబ్బు చేసి మరణించాడు. బళ్ళారి ఘన చరిత్ర గురించి కేసీఆర్‌కు తెలియకపోవడం చిత్రం కాదేమో…
– పోతుల బాలకోటయ్య
సీనియర్‌ జర్నలిస్ట్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషాశాస్త్ర ఆకాశ చంద్రుడు చే.రా.

భాషాశాస్త్ర ఆకాశ  చంద్రుడు చే.రా.

అవును వాళ్ళిద్దరూ భాషా శాస్త్ర ఆకాశానికి  సూర్యుడు,చంద్రుడు .సూర్యుడు శ్రీ భద్రిరాజు కృష్ణ మూర్తి గారైతే ,చంద్రుడు శ్రీ చేకూరి రామా రావు గారు .ఇవాళ ఆ ఆకాశం ఇద్దరినీ కోల్పోయి శూన్యమై పోయింది  .నేను తెలుగు  ఏం .ఏ . ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి ప్రైవేట్ గా పరీక్ష రాస్తున్నప్పుడు భాషా శాస్త్రం మాకొక సబ్జెక్ట్ .దానికి భద్రిరాజు వారు చే. రా. గారు రాసిన పుస్తకాలే మార్గ దర్శకాలు .అవే చదివి ,ఆ భషా కీకారణ్యం లో వారిద్దరి వెలుగు లతో దారి చూసుకుని ప్రయాణించి పాస్ అయ్యాను .నాతో పాటు మా ఇంటి వద్ద చదివిన స్వర్గీయ టి.ఎల్.కాంతారావు ను కూడా జ్ఞాపకం చేసుకొంటానేప్పుడూ .భద్రి రాజు వారిని హైదరాబాద్ లో అనేక సభల్లో చూశాను .వారి విద్వత్తుకు తెలుగు దేశం జోహార్ చేసింది .హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటి ఏర్పడిన తర్వాతమా పెద్దబ్బాయి శాస్త్రి అక్కడ చదివినపుడు భద్రి రాజు గారే ప్రిన్సిపాల్ .  తెలుగు ను ప్రాచీన భాష గా కేంద్రం గుర్తించిన సందర్భం గా కృష్ణా జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన సభలో వారి ప్రసంగించారు .అదే చివరి సారి వారిని చూడటం .ఆయన రాసిన పత్రికా వ్యాసాలన్నీ చదివాను .ఆయనంటే ఒక క్రేజ్ కూడా .కారణం ఆయన విశ్వ నాద గారి ముఖ్య శిష్యుడు అవటం కూడా . తెలుగుకు ప్రాచీన హోదా సాధించటం లో భద్రి రాజు వారి పాత్ర ఎంతో ఉంది .అయన ఇచ్చిన  ప్రెజెంటేషన్ వల్లనే అది సాధ్యమైంది .ఉద్యమాలు ,ఉపన్యాసాలకు ఇది మరింత ఊపు నిచ్చింది .

చే.రా.తలు ప్రతి వారం చదివే వాడిని .యువ కవుల వెన్ను దట్టి వారి కవిత్వాన్ని విశ్లేషించి మెచ్చి మెరుగులు దిద్ది ఎంతమందిని పైకి తెచ్చారో చే రా లెక్కించనికే వీలు లేదు .సృజన అంటే ఆయనకు అంత ఇస్టమూ తపనా కూడా .ఆ రాతలు పత్రికకే హై లైట్ గా ఉండేవి .వాటిని చదవటానికే పత్రిక కొనే క్రేజ్ ను సృష్టించారు చే .రా..అవసరం వచ్చింప్పుడు చీల్చి చెండాడేవారు. అందులో సరుకు ఉంటె అక్కున చేర్చుకొనే వారు .యెంత పెద్ద రచయిత అయినా చే రా విమర్శ చెరుకు గానుగలో నుంచి సారం,రసం  వస్తేనే గుర్తింపు అన్నట్లుండేది .శ్రీ కోవెల సంపత్కుమారాచార్య కు చే రా.కుఏళ్ళ తరబడి జరిగిన ఛందో చర్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాని ఒకరంటే ఒకరికి ఉన్న ఆత్మీయత ,ఆరాధన మాత్రం మరువ లేనిది .ఒక సారి  సంపత్కుమార  పెదముత్తేవి శ్రీ లక్ష్మణ యతీంద్రులు పై రాసిన  ‘’అంతర్మధనం ‘’అనే కావ్యాన్నిగురించి రాశారు అందులో ఆయనకు నచ్చిన పద్యాలను అన్నీ పేర్కొని ఇలా సంపత్కుమార మాత్రమె రాయ గలరు అన్నారు .ఆవ్యాసం చదివిన నేను ఆ పద్యాలను జాగ్రత్తగా రాసి పెట్టుకున్నాను .పెదముత్తేవి లో యతీంద్రుల పుత్రులు శ్రీ సీతారాం గారు ,ఒరిఎంటల్ స్కూల్ వార్షికోత్సవానికి కాని ,వారి తండ్రిగారి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కాని నన్ను ఆహ్వానిస్తే వెళ్ళినప్పుడు యతీండ్రు లను సంస్మరిస్తూ సంపత్కుమార రాసిన పద్యాలను చదివి సభను మెప్పించే వాడిని .దీనికి మార్గ దర్శి చే .రా.యే కదా నాకు  .సంపత్కుమార బెజవాడలో ,వరంగల్ లో రాజమండ్రి సభల్లో కలిసి నప్పుడు ఈ విషయం చెప్పాను .ఆయన ఏంత ఆనందించారు .’మేమిద్దరం భాషా ప్రేమికులం .అభిప్రాయ భేదాలుంటాయి కాని అంతరంగాలు ఒక్కటే ‘’అని ఆచార్య  అంతం వారిద్దరి సంస్కారానికి ఉదాహరణ .సంపత్కుమారాచార్య తానూ రాసిన ఒక పుస్తకాన్ని చే రా .కు అంకితమిచ్చారు .అదీ ఆదర్శం అంటే   .యతీంద్రుల వారిపై తానూ రాసిన ఆ పుస్తకాన్ని నాకు తర్వాతా పోస్ట్ లో తన సంతకం పెట్టి పంపారు .చే రా. ఆ పుస్తకం పై రాయక పొతే అమూల్య సంపద నాచే జారి పోయేదికదా .చే .రా గారినీ హైదరాబాద్ సభల్లో చూశాను కాని పరిచయం మాత్రంకలిగించుకోలేదు .వారితో పరిచయం కలిగించిన వారు మా మైనేని గోపాల కృష్ణ గారు .

మేము మూడవ సారి 2008మే లో  అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లోని డెట్రాయిట్ దగ్గరున్న ‘’స్టెర్లింగ్ హైట్స్’’కు మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మైనేని గారితో ,అంతకు ముందు నాలుగేళ్ల నాడు ఉయూరు ఏ సి లైబ్రరీ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చినప్పుడు మొదటి సారి ఏర్పడిన పరిచయం గాఢం అయింది .రోజూ ఫోన్లు ,మెయిల్స్ ,ఆయన పుస్తకాలు పంపటం చదివి నేను జవాబు రాయటం ప్రముఖ ఆర్ధిక వేత్త మా ఉయ్యూరు వాసి శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారి తో ఫోన్ ద్వారా మైనేని గారు నాకు పరిచయటం చేయటం జరిగింది .మేము అక్టోబర్ లో తిరిగి వచ్చే ముందు చేకూరి రామా రావు గారు తనకు ఆప్త మిత్రులని ఇద్దరూ కలిసి అమెరికా యూనివర్సిటీ లో చదువుకొన్నామని ఒకే రూమ్ లో ఉండేవారమని ,వారానికో సారైనా ఫోన్ లో మాట్లాడు కొంటా మని అమెరికా వస్తే తమ ఇంటికి తప్పక వచ్చేవారని ఆయన భార్యకూ తన భార్యకు మంచి పరిచయం ఉందని చెప్పి చే .రా గారి అడ్రస్ ,ఫోన్ నంబెర్ నాకు ఇచ్చి తప్పకుండా హైదరాబాద్ లో వారిని కలిసి ఉయ్యూరు వెళ్ళమని ,నేను వచ్చి కలుస్తున్నట్లుగా వారికి తెలియ జేయటం కూడా జరిపించారు మైనేని .అంత పెద్ద వాడు ఆయన దగ్గరికి నేను వెడితే ఎలా చూస్తారో అని నాకు అనుమానం .కాని మైనేని ఆజ్ఞ సుగ్రీవాజ్న నాకు . .మా పెద్దబ్బాయి వాళ్ళు హబ్సి గూడా లోనే ఉన్నారు కనుక వెళ్లి చూద్దాం అను కొన్నాను .

2008 నవంబర్ 1 ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం .ఆ ముందు రోజు సాయంత్రం కేంద్ర ప్రభుత్వం తెలుగు ను ప్రాచీన భాష గా గుర్తిస్తూ ప్రకటన చేసింది .తెలుగుతో బాటు కన్నదానికీ ఆ హోదా ఇచ్చింది .కనుక అలాంటి రోజున చే .రా.వారి ని సందర్శిస్తే మంచిది అనుకొన్నాను. మా నాలుగో అబ్బాయి రమణ బైక్ మీద ఇద్దరం ఉదయమే చే .రా .గారింటికి చేరాం .అప్పటికే మైనేని గారు  రాక ను గురించి వారికి ఫోన్ చేసి చెప్పారు నాకోసమే వారూ చూస్తున్నారు .నేను ఆ రోజు ఉదయమే వారిని చూడటానికి వస్తున్నానని  ఫోన్ లో చెప్పానుకూడా .మా ఇద్దరినీ చే. రా దంపతులు ఏంతో ఆప్యాయం గా పలకరించి మర్యాద చేశారు . రాష్ట్ర అవతరణ,ప్రాచీన హోదా శుభాకాంక్షలు అంద జేసుకోన్నాం .క టిఫిన్లుపెట్టి కాఫీ దగ్గరుండి అందజేశారు  .గోపాల కృష్ణ గారితో ఉన్న పరిచయాన్ని ఎన్ని సార్లో గుర్తు చేసుకుని మురిసి పోయారు ఆ దంపతులు .గళ్ళ లుంగీ ,చేతుల బనీను తో తెల్ల జుట్టు తో నల్లటి దేహ చ్చాయతో ,పెద్ద అద్దాల కళ్ళ జోడుతో పడక కుర్చీ లో సాదా సీదాగా చే రా గారుంటే  అంత కంటే కంటే సామాన్య గృహిణి గా వారి శ్రీమతి కనిపించారు .ఎక్కడా హంగూ ఆర్భాటమే లేదు .ఆయన రాసుకొనే గది, చదువుకొనే ప్రాంతం చూపించారు. ఆమె మైనేని గారి భార్య శ్రీమతి సత్య వతి గారి సౌజన్యాన్ని ఎంతో పొగిడారు .మైనేని గారి కోరికపై ,వారి ఖర్చుతో ఉయ్యూరులో డిసెంబర్ ఇరవై ఒకటిన శ్రీ ఆరిక పూడి ప్రేమ్చంద్ గారికి సన్మానం చేస్తున్నామని ,ఆహ్వాన పత్రిక పంపిస్తానని తప్పకుండా రావలసిందని ఆహ్వానించాను .తనకు అప్పుడు రెండు చోట్ల పురస్కారాలను అందు కొనే  కార్యక్రమాలున్నాయని ఒకటి ఏలూరు లో గుప్తా ఫౌండేషన్ వారు భాషా శాస్త్రేం లో తన సేవలకు లక్షన్నర రూపాయల పారితోషికం ఇచ్చి సత్కరిస్తున్నారని చెప్పారు .ఒకరకం గా జ్ఞాన పీఠపురస్కారం తో ఇది సమాన మైనదని సంతృప్తిగా చెప్పారు .రెండవది పిఠా పురం లో శ్రీ ఆవంత్స సోమ సుందర్ ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తనకు ఈ ఏడాది అంద జేస్తున్నారని దానికి హాజరు కావాల్సి ఉందని తెలియ జేశారు .వారితోను వారి శ్రీమతి గారి తోను ఫోటోలు దిగాం .రమణ బాగా ఫోటోలు  తీశాడు .చాలా హుషారుగా నవ్వుతూ మాతో గడపటం చే. రా గారి వ్యక్తిత్వానికి నిరూపణ .ఏదో తెలుగు ఏం. ఏ గిలికాను కాని ఆయన ముందు నిలిచి మాట్లాడే అర్హత నాకేమి ఉంది? అది చూడకుండా ఆత్మీయతను ప్రదర్శించారు .తాను రాసిన దాదాపు పది పుస్తకాలను జాగ్రత్తగా  ఒక సంచిలో పెట్టి నాకు ఇచ్చారు .ఇది నేను ఊహించ నిది .వారికి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాం .

ఉయ్యూరు తిరిగి వచ్చి తీరు బడిగా చే రా .గ్రంధాలన్నీ చదివి కృతజ్ఞతలు తెలియ జేస్తూ ఉత్తరం రాశాను ఫోనూ చేశాను .అప్పటి నుండి సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ మైనేని వారి కోరిక పై చే. రా గారికి  పంపిస్తూనే ఉన్నాను .ఈ ఉగాదికి ప్రచురించిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకం కూడా పంపాను .

చే రా .భాషా శాస్త్రం లో మాత్రమె కాదు అనేక సాహితీ ప్రక్రియలపై సాధికారత ఉన్న వారు .తెలుగు భాషా సాహిత్యాలలో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఏం ఏ .డిగ్రీ పొందారు .అమెరికాలో కోర్నెల్ యూని వర్సిటి నుండి భాషా శాస్త్రం లో ఏం ఏ.పి హెచ్ డి సాధించారు .ధిల్లీ సెంట్రల్ యూని వర్సిటిలో ప్రేఫేసర్ గా చేరి ,ఉస్మానియా తెలుగు విశ్వ విద్యాలయాలలో భాషా శాస్త్ర బోధన చేశారు .భాషా శాస్త్ర పరిశోధనా రంగం లో అగ్రగామిగా ఉన్నారు .ఆయన భాషా వైదుష్యం ఎదురు లేనిది .అనేక సాహితీ సంస్థలు ఎన్నో సన్మానాలు సత్కారాలు చేసి పురస్కారాలన్దించాయి .ఆయనది సంకుచితం లేని మనస్సు .భాషా శాస్త్రం లో నవ్యవిప్లవ  మార్గ గామి అయిన ‘’నాం చా విస్కీ ‘’ అయన ఆరాధ్య గురువు .ఆ ఒరవడిలోనే చే రా .తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్తదనానికి దారి చూపాడు .దేశ విదేశాలలో ఎన్నో యూని వర్సిటీ లలో విజిటింగ్ ప్రొఫెసర్ గా  భాషా శాస్త్రం  పై అధ్యాపనం చేశారు . ఆయన రాసిన ‘’స్మ్రుతి కిణాంకం ‘’గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి లభించింది .మొదటి ప్రపంచ తెలుగు సభల కలం లో ఆయన రాసిన ‘’తెలుగు వాక్యం ‘’అందరిని ఆ కట్టుకొన్నది ఆయన చివరి రచన ‘’భాషా పరి వేషం ‘’అయన గ్రంధాలన్నీ పునర్ముద్రిటాలే .మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు చే. రా .ఆయన భార్య శ్రీ మతి రంగ నాయకి .కుమారులు శ్రీ సారధి ,శ్రీ క్రిస్టోఫర్ .కుమార్తె శ్రీమతి సంధ్య .భాషా సాహిత్యాలపై పదహారు గ్రంధాలు రాసిన అసమాన భాషా శాస్త్ర వేత్త చేకూరి రామా రావు గారు 24-7-14గురువారం సాయంత్రం 78వ ఏట హైదరాబాద్ హబ్సి గుడా లో స్వగృహం లో మరణించారు .వారి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను .గురువు భద్రి రాజు గారు మరణించిన రెండేళ్లకే శిష్యుడు చే .రా .మరణించారు .ఈ ఇద్దరు లేని లోటు తీరేది కాదు . .శూన్యాన్ని మిగిల్చి  వెళ్ళారు ఈ  సూర్య చంద్రులు . మన ‘’కబోది ప్రభుత్వాలకు’’ వీరిద్దరి భాషా సేవ కని పించనే లేదు. ఏ పద్మ పురస్కారాన్ని వారికి అందించక పోవటం ప్రభుత్వాలకే తల వంపులు కాని ఆ సూర్య చంద్రులకు కాదు .

 

Inline image 1        Inline image 2  

 

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-14-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

లండన్‌లో గాంధీ విగ్రహం కోసం ట్రస్టు

లండన్(ఏజెన్సీస్): వచ్చే ఏడాది పార్లమెంట్ స్క్వేర్ వద్ద ప్రతిష్టించనున్న మహాత్మా గాంధీ విగ్రహం కోసం ఒక స్వచ్ఛంద సంస్థ సుమారు 10 లక్షల పౌండ్లను విరాళంగా సేకరించనున్నది. బ్రిటన్‌కు చెందిన ఛారిటీ కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన గాంధీ స్టాచ్యూ మెమోరియల్ ట్రస్టును ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ ఏర్పాటు చేశారు. వచ్చే వారం నుంచి ప్రజల నుంచి విరాళాలను సేకరించనున్నారు. మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం కోసం దాదాపు 10 లక్షల పౌండ్లు అవసరమవుతాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎంత తక్కువ మొత్తమైనా విరాళంగా ఇవ్వవచ్చు. ఇది ప్రజా విగ్రహం’’ అని మేఘనాథ్ దేశాయ్ మంగళవారం సాయంత్రం లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ సమావేశంలో ప్రకటించారు. ‘‘విగ్రహానికి తామే మొత్తం నిధులిస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. కాని ఏ ఒక్క కోటీశ్వరుడో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో పేరు ప్రతిష్టలకోసం పాకులాడకూడదు. అది ప్రజల ఆస్తి కావాలి’’ అని లండన్ కు చెందిన విద్యావేత్త, రచయిత అయిన దేశాయ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని 2015 జనవరి 30న మహాత్ముని వర్ధంతి నాడు ఆవిష్కరించాలని యోచిస్తున్నట్లు దేశాయ్ చెప్పారు. ‘‘నరేంద్ర మోడి(భారత ప్రధాని) ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాను’’ అని కూడా ఆయన చెప్పారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ

బడే గులాంఅలీఖాన్ చివరి మజిలీ

రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్ అంటే ఇప్పుడు చాలా మందికి స్థిరాస్తి వ్యాపారానికి అనువైన చోటు అని మాత్రమే అర్థం అవుతుంది. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ఎవరిది అన్న చర్చ తీవ్రంగా మాత్రమే కాదు జుగుప్సాకరంగా కూడా సాగింది. మేం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం కనక మాకూ దాని మీద హక్కు ఉందని వాదించిన చరిత్ర జ్ఞాన హీనులకు కొదవే లేకుండా పోయింది. వారి దృష్టిలో హైదరాబాద్ అభివృద్ధి అంటే స్థలాల, ఇళ్ల వ్యాపారం, ఆ వ్యాపారంలో వారి దురాశకు తగ్గట్టుగా స్థలాల ధరలు పెరగడమే. ఇదంతా భౌతిక సంస్కృతిలో మాత్రమే భాగం అని వారికి తట్టదు.  సంస్కృతి కేవలం ఆస్తుల రూపంలో ఉండదని వాళ్లకు చెవికెక్కదుగాక ఎక్కదు. సంస్కృతికి రెండో పార్శ్వం ఒకటి ఉంటుందనీ దాన్ని బౌద్ధిక సంస్కృతి అంటారని తెలియదు గాక తెలియదు. హైదరాబాద్ భౌతిక సంస్కృతికి ఎంత ప్రతీతో బౌద్ధిక సంస్కృతికి అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి చెందింది. దేశానికి రెండో రాజధాని కావడానికి సకల అర్హతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాట సంస్కృతిని కాసుల్లో కొలిచే వారికి ఎలా గుర్తుంటుంది?ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రభావం దక్షిణ భారతదేశంలో అంతగా లేకపోయినా హైదరాబాద్‌లో ఆ పోరాట రణన్నినాదాలు తుర్రెబాజ్ ఖాన్ రూపంలో ప్రతిధ్వనించాయని స్థిరాస్తి వృద్ధే అభివృద్ధి అనుకునే వారికి ఎలా అర్థం అవుతుంది? కోఠీలో ఉన్న ఉస్మానియా విశ్వ విద్యాలయ మహిళా కళాశాల గోడ వార తుర్రెబాజ్ ఖాన్ రోడ్ అనే ఒక “నామ ఫలకం” ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా ఉమెన్స్ కళాశాల కుంచించుకు పోయిన తర్వాత ఆ నామఫలకం నిశానీ కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ అది లేకపోలేదు, ఉంది. కాని ఏదో రహస్యాన్ని దాస్తున్నట్టు కోఠీ చౌరస్తాలో ఆర్టీసీ బస్ టర్మినల్ కు ఆనుకుని ఉన్న మూడు సింహాల స్థూపాన్ని కాపాడడం కోసం నిర్మించిన కంచె లోపల దాక్కుని తుర్రెబాజ్ ఖాన్ రోడ్ అని పరిశోధకులకు మాత్రమే కనిపించేట్టుగా ఉంది. ఇలాంటి నామఫలకాలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి. కాని ఆ వీధులను ఆ పేరుతో ఎవరూ పిలవరు. పండిత్ మోతీరాం మార్గ్, బడే గులాంఅలీఖాన్ మార్గ్ లాంటివి అలా అనామకంగా మిగిలిపోయిన నామ ఫలకాలే. ఇంతకీ పండిత్ మోతీరాం, బడే గులాం అలీ ఖాన్ హైదరాబాదీలు కారు. కాని హైదరాబాద్ సంస్కృతిలో వారి కీర్తి ప్రతిష్టలూ భాగమే. దాయరా మీర్ మోమీన్బడే గులాంఅలీ ఖాన్(ఏప్రిల్ 1902 – 25 ఏప్రిల్ 1968) ప్రసిద్ధ పాకిస్తానీ గాయకుడు. భారత-పాకిస్తాన్ దేశాల సరిహద్దులను నిర్ణయించడానికి రాడ్‌క్లిఫ్ అవిభక్త భారత్ చిత్రపటంపై గీసిన గీత భారత్-పాకిస్తాన్ అని రెండు దేశాలను సృష్టించగలిగింది కాని రెండు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను విడదీయలేక పోయింది. సంస్కృతి బీటలు వారేట్టు చేయడం రాడ్‌క్లిఫ్ ఎర్రపెన్సిల్‌కు సాధ్యమే కాలేదు. బడే గులాంఅలీ ఖాన్‌కు హైదరాబద్‌తో విడదీయరాని సంబంధమే ఉంది. ఆయన పటియాలా ఘరానాకు చెందిన హిందుస్తానీ గాయకుడు. బ్రిటిష్‌వారి ఏలుబడిలోని పంజాబ్‌లోని కసూర్‌లో బడే గులాంఅలీ ఖాన్ జన్మించారు. దేశ విభజన పుణ్యమా అని కసూర్ పాకిస్తాన్‌లో భాగమై పోయింది. దేశ విభజన కారణంగా ఖాన్ పాకిస్తానీ అయిపోయాడు. కాని ఆయన ఏనాడూ దేశ విభజనను అంగీకరించలేదు. “దేశంలో ప్రతి ఇంట్లోనూ ఒకరికి హిందుస్తానీ సంగీతం నేర్పితే దేశ విభజన అయ్యేదే కాదు” అని ఖండితంగా చెప్పే వారు. ఖాన్ ఎక్కువ కాలం పాకిస్తాన్‌లో నివసించ లేదు. శాశ్వతంగా భారత్‌లో ఉండి పోవాలని నిర్ణయించుకుని భారత్ వచ్చేశారు. అప్పటి బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ సహకారంతో ఆయన భారత పౌరసత్వం కూడా సంపాదించారు. బొంబాయిలోని మలబార్ హిల్‌లో ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో ఖాన్ ఉండే వారు. అయితే ఆయన లాహోర్, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్‌లో కూడా నివసించారు. బడే గులాంఅలీ ఖాన్ తండ్రి అలీ బక్ష్ ఖాన్ ప్రసిద్ధ గాయకుడు. ఏడేళ్ల వయసులోనే బడే గులాం అలీ ఖాన్ తన పినతండ్రి కాలే ఖాన్ దగ్గర సారంగి, పాటలు పాడడం నేర్చుకున్నారు. 21 ఏళ్ల వయసులో బెనారస్ వెళ్లి హీరాబాయి గాత్రానికి సారంగీ సహకారం అందించేవారు. ఖాన్ చాలా వరకు మహిళల గాత్రానికి సారంగీ సహకారం అందించినా ఆ తర్వాత తన పిన తండ్రి పాడిన గీతాలను గానం చేసే వారు. ఉస్తాద్ అఖ్తర్ హుసేన్ ఖాన్, ఉస్తాద్ ఆషిక్అలీ ఖాన్ శిష్యరికం కూడా చేసిన తర్వాత కలకత్తాలో సొంతంగా మొదటి సంగీత కచేరీ చేసిన బడే గులాంఖాన్ కీర్తి ప్రతిష్ఠలు పెరిగిపోయాయి. శాస్త్రీయ సంగీతంలో సుదీర్ఘ ఆలాపనలే అందం అని ఖాన్ అంగీకరించేవారు. కానీ దీర్ఘ ఆలాపనలను ఆస్వాదించే ఓపిక శ్రోతలకు ఉండడం లేదు కనక వారి అభిరుచి మేరకు ఆలాపాన్ని తగ్గించానని ఖాన్ చెప్పేవారు. గాయకుడిగా ఎంత ప్రసిద్ధుడైనా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. బలవంతం మీద నౌషాద్ సంగీత దర్శకత్వంలో 1960లో మొగల్-ఎ-ఆజం సినిమాలో రెండు పాటలు పాడారు. అప్పట్లో లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వారు ఒక్కో పాట పాడడానికి రూ. 500 పారితోషికం తీసుకుంటుండగా బడే గులాం అలీ ఖాన్ మాత్రం ఒక్కో పాటకు రూ. 25,000 పారితోషికం అడిగారు. 1962లో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మభూషణ్ ప్రదానం చేశారు. ఖాన్ భార్య అల్లా జివాయ్ 1932లోనే మరణించడంతో ఆయన సంతానం లేని విధవరాలు అల్లారఖీని పెళ్లాడారు. సబ్రంగ్ అనే కలం పేరుతో బడే గులాం అలీ ఖాన్ అనేక గీతాలను కూర్చారు. చివరి రోజుల్లో ఖాన్ కు పక్షవాతం సోకింది. అయినా కొడుకు మునవ్వర్అలీ ఖాన్ సహాయంతో సంగీత కచేరీలు చేస్తూనే వచ్చారు. బషీర్ బాగ్ పాలెస్‌లో 1968లో ఆయన మరణించారు.  ఖాన్ శిష్యుడు మల్తీ గిలాని ఇప్పటికీ బడే గులాంఅలీ ఖాన్ స్మారక సంగీత కచేరీలు నిర్వహిస్తూనే ఉంటారు. బడే గులాం అలీ ఖాన్ సమాధి పాత బస్తీలోనీ హరీబౌలీలోని దాయరా మీర్ మోమీన్‌లో ఉంది. ఆ వాస్తవం ఇప్పటికీ అనేక మంది సంగీత ప్రియులకు కూడా తాజా వార్తే. మరి స్థిరాస్తే అభివృద్ధి అనుకునే వారికి హైదరాబాద్ బౌద్ధిక సంస్కృతి తలకెక్కక పోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది.
9676282858
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రెండు లక్షలు సరసభారతి వీక్షకుల సంఖ్య

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ రోజు  24-7-20014మధ్యాహ్నం రెండు గంటలకు సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య అక్షరాలా రెండు లక్షల మూడు వందల అరవై ఎనిమిది(2,00368) .బ్లాగ్ ఏర్పరచిన మూడున్నర ఏండ్లలో ఇంతటి అపూర్వ అఖండ విజయాన్ని సాధించింది అంటే నమ్మ శక్యం కావటం లేదు .ఈ విజయం అంతా సాహితీ బంధువుల ,సాహిత్యాభిమానులదే నని సవినయం గా మనవి చేస్తున్నాను .శ్రీ సువర్చలాంజ నేయ  బ్లాగ్ఇదే సమయానికి నలభై ఎనిమిది వేల నూట అయిదు మంది వీక్షకులను స్పృశించింది (  48,105) .రెండు బ్లాగులకు మొత్తం వీక్షకులు 2,00368  +48,105=2,48,473అని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది . నిజం గా ఇది ఊహించని అపూర్వ విజయం .ఈ విజయాన్ని సాహితీ సుమనస్కులందరికి అంకిమిస్తున్నాను .. మరిన్ని విజయాలను చేకూర్చ వలసిందని కోరుతూ ,మరింత ఆసక్తి జనకం గా బ్లాగులను నిర్వహించటానికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను .నా కుటుంబం ఇస్తున్న సహకారమే నన్ను ప్రోత్సహిస్తోంది .  మా స్వామి కృప కటాక్షమే మాకు మీకు అండా  దండా అని తెలియ జేస్తున్నాను మరొక్క  సారి అందరికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను -మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-14-గురువారం

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంస్కృతం జనని సమస్త భాషలకు అని చెప్పిన హెబ్బార్ నాగేశ్వర రావు-ఆంద్ర భూమి

‘జనని సమస్త భాషలకు..’’

  • – హెబ్బార్ నాగేశ్వరరావు
  • 24/07/2014
TAGS:

ఆగస్టు నెల రెండవ వారంలో ‘సంస్కృత భాషా సప్తాహం’ జరపాలని ‘కేంద్రీయ ఉన్నత విద్యామండలి’ వారు నిర్ణయించడం హర్షణీయ పరిణామం. కేంద్రీయ ఉన్నత విద్యామండలి- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- ఆధ్వర్యంలో పదిహేను వేల అధికార పాఠశాలలు నడుస్తున్నాయట! ఈ పాఠశాలలన్నింటిలోను సంస్కృత భాషా వారోత్సవం జరిపించడం ద్వారా యువజనులలో సంస్కృత భాషా వినిమయం పట్ల మక్కువను మరింతగా పెంపొందించాలని ‘కేంద్రీయ ఉన్నత విద్యామండలి’- సిబిఎస్‌ఇ-వారు భావిస్తున్నారట! ఇలా మక్కువ పెంపొందడం వల్ల ‘సిబిఎస్‌ఇ’కి అనుబంధంగా ఉన్న వేలాది ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలలో సంస్కృత భాషను అభ్యసించే విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య పెరగవచ్చు! కానీ హిందీ వలె, ప్రాంతీయ భాషలవలె సంస్కృత భాషను మొదటి భాషగా మొదటి తరగతి నుండి అభ్యసించే వసతి అన్ని ‘సిబిఎస్‌ఇ’ పాఠశాలలలోను లేదు! అన్ని భారతీయ భాషలకు సంస్కృతం మూల భాష! ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలోని భాషలకు కూడ సంస్కృత భాష మాత్రమే మాతృక! ఆంగ్లేయులు, వారి మానసపుత్రులు, వారి ఔరసులు కాదని చెప్పినంత మాత్రాన, కృత్రిమ భాషా చరిత్రలను మన నెత్తికెత్తినంత మాత్రాన అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషా రూపాంతరాలు కాకుండాపోవు! తెలుగు, తమిళ, హిందీ, అస్సామీ, కశ్మీరీ, మరాఠీ, సింహళ, బోటీ భాషలతో సహా కొలంబోనుండి కైలాసం వరకు గాంధారం నుండి కామరూప వరకూ విస్తరించిన భారతీయ భాషలన్నీ సంస్కృత భాషకు రూపాంతరాలే! అందువల్ల సంస్కృత భాషను అభ్యసించడంవల్ల అధ్యయనం చేయడంవల్ల ఆయా ప్రాంతీయ భాషలలో మన ప్రావీణ్యం మరింత పెరుగుతుంది! అందువల్లనే రాజ్యాంగ పరిషత్‌లో భారత రాజ్యాంగ రచన జరిగిన సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృత భాషను కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ప్రకటించాలని కోరారు! ఆయన కోరిక నెరవేరి ఉండినట్టయితే ప్రస్తుత భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యమై ఉండేది!
భాషను ఒకటవ తరగతి నుంచి అభ్యసించినప్పుడు మాత్రమే భాషా పరిజ్ఞానం విద్యార్థి మనస్సులో వ్యవస్థీకృతవౌతుంది! ‘సిబిఎస్‌ఇ’ పాఠ్యక్రమం- సిలబస్‌లో సంస్కృత భాషను మొదటి భాషగా ఒకటవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు అభ్యసించడానికి వీలుంది! కానీ ‘సిబిఎస్‌ఇ’ పాఠ్యక్రమం బోధిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు అందుకు వీలు కల్పించడం లేదు. అధ్యాపకులను నియమించడం లేదు. ఇలాంటి అవకాశం ఉందన్న విషయాన్ని ఒకటవ తరగతిలో తమ పిల్లలను చేర్చే తల్లిదండ్రులకు చెప్పడం లేదు. ఫలితంగా ‘సిబిఎస్‌ఇ’ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఇంగ్లీషును హిందీని కాని, ఇంగ్లీషును ప్రాంతీయ భాషను కాని మొదటి రెండు భాషలుగా ఎంపిక చేసుకొని ఒకటవ తరగతి నుంచి చదువుతున్నారు! ఐదవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే మూడవ భాషగా కొంతమంది విద్యార్థులు సంస్కృత భాషను చదివిన లాంఛనాన్ని పూర్తిచేస్తున్నారు. తొమ్మిదవ తరగతి నుంచి ఈ చదివిన సంస్కృతాన్ని మరచిపోతున్నారు! సంస్కృత భాషా వారోత్సవాలను నిర్వహించడం వల్ల సంస్కృత భాషను ఇష్టం ఉన్న విద్యార్థులు మొదటి భాషగా ఒకటవ తరగతి నుంచి నేర్చుకొనటానికి వీలైన వ్యవస్థ ప్రతి ‘సిబిఎస్‌ఇ’ అనుబంధ పాఠశాలలోను తప్పనిసరిగా ఏర్పడాలన్న ధ్యాస పెరిగితే ఉత్సవాలకు సార్థకత ఏర్పడుతుంది!
సంస్కృత భాషా మాధ్యమంగా బోధించే విద్యావ్యవస్థ రూపుకట్టకపోవడం స్వతంత్ర భారతదేశం అమెరికాలాగా బ్రిటన్ లాగా స్వరూప స్వభావాలను సంతరించుకొని ఉండడానికి ప్రధాన కారణం! భాషను భాషగా మాత్రమే నేర్చుకొనడంవల్ల అది సాహిత్యానికి లేదా గ్రాంథిక రూపానికి పరిమితమైపోతుంది. సర్వజీవన రంగాలలో భాషా ప్రభావం ప్రస్ఫుటించాలంటె ఆ భాష బోధనా మాధ్యమంగా వికసించాలి! బోధనా మాధ్యమంగా అనేక తరాలుగా దేశమంతటా వ్యవస్థీకృతం అయింది కనుకనే అన్ని రంగాలలోను ఆంగ్లభాషా ప్రభావం ప్రస్ఫుటిస్తోంది! విదేశాలనుంచి వ్యాపించిన భాషలు మన దేశంలో బోధనా మాధ్యమాలుగా చెలామణి అవుతుండడంవల్ల ఆయా భాషలలో భౌతిక, సామాజిక, విజ్ఞాన, సాంస్కృతిక శాస్త్ర విషయాలను అభ్యసిస్తున్న వారి మానసిక ప్రవృత్తి సహజంగానే ఆయా విదేశాల పట్ల మక్కువ కలిగి ఉంటోంది! విద్యావంతులు స్థానికతకు భారతీయ జీవన పద్ధతులకు దూరం కావడానికి ఇది దశాబ్దులపాటు దోహదం చేసింది! భారతీయుల అస్తిత్వ సంక్షోభానికి ఇది ప్రధాన కారణం!! ఈ దేశంలో లక్షలాది ఏళ్లపాటు ఉన్నత విద్యాబోధన సంస్కృత భాష మాధ్యమంగా కొనసాగడం చరిత్ర! అందువల్లనే సంస్కృత భాషా మాధ్యమంగా అద్వితీయ సనాతన సంస్కృతి ఈ దేశమంతటా వికసించింది! బ్రిటిష్‌వారి భౌతిక దురాక్రమణ బౌద్ధిక దురాక్రమణను కూడ వ్యవస్థీకరించింది! ఈ కొత్త వ్యవస్థ నడికొనే వరకు ఈ దేశంలోని అన్ని ప్రాంతాలలోను సంస్కృత భాష మాధ్యమంగానే ఉన్నత విద్యాబోధన జరిగింది! క్రమంగా సంస్కృత భాషా స్థానాన్ని ఆంగ్ల భాష ఆక్రమించడం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దినాటి భారతీయుల చరిత్ర! ఈ ‘దురాక్రమణ’ ఇప్పటికీ తొలగలేదు! కనీసం మిగిలిన భారతీయ భాషలలోవలె సంస్కృత భాష మాధ్యమంగా సైతం విద్యాబోధన జరిపించే పద్ధతి కూడ ఆరంభం కాలేదు! అందువల్లనే సంస్కృత భాష కేవలం కావ్య భాష- క్లాసికల్ లాంగ్వేజ్- అన్న అపప్రధ తొలగడం లేదు. ‘సంస్కృత భారతి’వంటి అఖిల భారత వ్యాప్త సంస్థలు సంస్కృత భాషను వ్యవహార భాష- కమ్యూనికేటివ్ లాంగ్వేజ్-గా పునరుద్ధరించడానికి కృషిచేస్తున్నాయి. లక్షలాది మంది దేశంలో సంస్కృత భాషలో నిత్య వ్యవహారం సాగిస్తున్నారు. సంస్కృత భాషామాధ్యమ వ్యవహార గ్రామాలు అవతరించాయి! ఆ గ్రామాలలోని ప్రజలందరూ నిరక్షరాస్యులు సైతం సంస్కృత భాషలోనే పరస్పరం సంభాషించుకొంటున్నారట! వ్యవహారం సాగిస్తున్నారట! కానీ ప్రాథమిక విద్యాబోధన కాని ఉన్నత విద్యాబోధన కాని సంస్కృత భాషామాధ్యమంగా సాగే వ్యవస్థ మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు!
మన దేశంలో భాషల వికాసం వైవిధ్య భరితమైన వైవిధ్య పరిరక్షకమైన హైందవ జాతీయ స్వభావానికి అనుగుణంగా ఉంది! ‘‘ఒక జాతికి ఒక భాష, ఒక భాషకు ఒక జాతి’’అన్న భాషా జాతీయత అనేక ఇతర దేశాలలో పెంపొందింది. అలాగే, ‘‘ఒక మతం ఒక జాతి, ఒక జాతికి ఒకే మతం’’ అన్న మత జాతీయతలు కూడ పుట్టుకొచ్చాయి! సంకుచిత సమిష్టి స్వభావం, తమది కాని దానిని సహించలేని ఉన్మాద చిత్తవృత్తి ఇలాంటి ‘ఏకరూపత’కు కారణం! భారత జాతీయ సనాతన సంస్కృతి బహుళ రూపాలలో ఏకాత్మతత్త్వాన్ని గుర్తించిన విలక్షణ జీవన పద్ధతి! అనాదిగా అందువల్లనే వైవిధ్యాలు భారత జాతీయ సాంస్కృతిక భూమికపై వికసించాయి! వైవిధ్యాలను వికసింపచేయడం హైందవ జాతీయ సకల భావ సహిష్ణుతకు, సకల తత్త్వసమన్వయబుద్ధికి అనుగుణమైన సహజ పరిణామక్రమం! అతి పెద్ద దేశాలలో ఒకే ప్రధాన భాష ఉంది! చిన్న దేశాలలోను ఒకే ప్రధాన భాష ఉంది. కాని భారతదేశంలో మాత్రం అనాదిగా అనేక ప్రధాన భాషలు వికసించాయి. ఒకప్పుడు దేశంలోని మొత్తం ప్రజలు సంస్కృత భాషను మాట్లాడేవారు. ఆసేతుశీతనగం సంస్కృత భాషలోనే జనజీవన వ్యవహారం కొనసాగింది! కానీ అప్పుడు సైతం వివిధ ప్రాంతాలలో వివిధ సంస్కృత భాషా ప్రాంతీయ రీతులు విలసిల్లాయి! ఈ ప్రాంతీయ రీతులు క్రమంగా ప్రాకృత భాషలుగా పరిణతి చెందాయి! అనేక మతాల మధ్య సమన్వయం కొనసాగినట్టే అనేక భాషల మధ్య కూడ సమన్వయం కొనసాగింది. ఈ సమన్వయం పేరు మళ్లీ సంస్కృత భాష! వైవిధ్యాలను సహించలేక ఇతరుల ‘వాటిని’ విధ్వంసం చేసిన చరిత్ర హైందవ జాతికి లేదు, భారతదేశానికి లేదు! అందువల్లనే సంస్కృత భాష ఒకటిగానే ఉండిపోలేదు, వివిధ భాషలుగా విస్తృతిని సంతరించుకుంది!
ఇలా అనేక ప్రాంతీయ భాషలు సంస్కృతంలో సమాంతరంగా కొనసాగినప్పటికీ దేశంలోని ప్రజలందరూ సంస్కృత భాషను కూడ మాట్లాడారు! ఇది చరిత్రలో ఒక దశ! ఇలాంటి దశ త్రేతాయుగంనాటి రఘురాముని కాలంలో ఉన్నట్టు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి! సీతారాములు చరిత్రలో భాగం… సీతను వెదకడంకోసం లంకకు వెళ్లిన హనుమంతుడు ఆ యమ్మతో ఏ భాషలో మాట్లాడాలి? అన్న మీమాంసకు గురయినట్టు వాల్మీకి మహాకవి వివరించాడు. సంస్కృత భాషలో ప్రసంగించవచ్చు. కానీ అలా ప్రసంగించినట్టయితే సీతమ్మ తనను మారువేషంలో ఉన్న రావణాసురుడని భ్రమించి భయపడే ప్రమాదం ఉందని హనుమంతుడు నిర్ధారించాడు. లంక విదేశం, భారతదేశపు దక్షిణతీరం నుండి దక్షిణంగా ఐదువందలమైళ్ల- వందయోజనాలు- సముద్రము దాటిన తరువాత ‘లంక’ఉంది. కానీ అక్కడ కూడ సంస్కృత భాష ఆ కాలంలో చెలామణిలో ఉంది. ప్రపంచమంతటా ఒకప్పుడు సంస్కృత భాష చెలామణిలో ఉండేదన్న పిఎన్‌ఓక్ వంటి చరిత్రకారుల నిర్ధారణ. అందువల్ల, అతార్కికం కాదు! సీతమ్మ ఇలా భ్రమించరాదన్న తలంపుతోనే ఆంజనేయుడు ‘‘ప్రాకృత భాషలోనే మాట్లాడ్డం ఆవశ్యకం’’- ‘‘అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్..’’అని నిర్ధారించాడు. సంస్కృత భాష ప్రాకృత భాషలు సమాంతరంగా ఆ కాలంలో కొనసాగాయి!!
కలియుగంలో మూడువేల ఏళ్లు గడిచిన నాటికి, క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దునాటి మహాకవి కాళిదాసు నాటకాలు రచించేనాటికి సంస్కృత భాషను సాధారణ ప్రజలు మాట్లాడడం లేదు! నేర్చుకున్న పండితులు మాత్రమే, ఇప్పుడు ఇంగ్లీషును నేర్చుకున్న పండితులవలె, సంస్కృత భాషను మాట్లాడారు. అందువల్లనే కాళిదాసుని నాటకాలలో కొన్ని పాత్రలు సంస్కృతంలోను, మరికొన్ని పాత్రలు ప్రాంతీయ భాషలోను ప్రసం గిస్తాయ. పాలనాభాషగా, పండితుల భాషగా, విద్యాబోధనా మాధ్యమ భాషగా, వివిధ ప్రాంతీయ భాషల మధ్య అనుసంధాన భాషగా సంస్కృత భాష బ్రిటిష్‌వారు మన దేశంలో చొరబడిపోయేవరకు ఉపయోగపడింది!!
బ్రిటిష్‌వారు అంచెలంచలుగా సంస్కృత భాషను ఈ అన్ని ‘విధుల’నుండి తొలగించి ఆంగ్లభాషను ఆయా విధులకు వినియోగించడం చరిత్ర! తమ అధికార బలంతో బ్రిటిష్‌వారు ఇలా సంస్కృతాన్ని తొలగించి ఆంగ్లాన్ని వెలిగించారు! అందువల్లనే ఈ దాస్య చరిత్రను రద్దుచేయాలని సంస్కృత భాషను మళ్లీ వెలిగించాలని అంబేద్కర్ మహాశయుడు ప్రయత్నించారు! ఆ ప్రయత్నం అప్పుడు నెరవేరలేదు! నెరవేరి ఉంటే ఇప్పుడు ఇంగ్లీషులో నడుస్తున్న మొత్తం వ్యవహారం సంస్కృత భాషలో నడిచి ఉండేది! రష్యావారు, చైనావారు తమ భాషలలో ‘‘నడిపించు’’కుంటున్నారు! భారతదేశపు మాతృభాష సంస్కృత భాష!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి 64వ సమావేశం –శ్రావణ మాసం –నోములు –విశిష్టత

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

                         64వ సమావేశం –శ్రావణ మాసం –నోములు –విశిష్టత

                                      ఆహ్వానం

        శ్రావణ మాసం సందర్భం గా సరస భారతి ప్రత్యెక కార్యక్రమాన్ని 29-7-14 మంగళ వారం సాయంత్రం 6-00గం .లకు శ్రీ సువర్చలాంజనేయ స్వామి  వారి దేవాలయం ‘’మహిత మందిరం ‘’లో నిర్వహిస్తోంది .ప్రముఖ ధార్మిక సేవకురాలు ,ఉపాధ్యాయిని శ్రీమతి వేదాంతం శోభశ్రీ ,మరియు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు శ్రీ దీవి చిన్మయ గార్లు‘’శ్రావణ మాసం –నోములు –విశిష్టత ‘’అంశం పై ప్రసంగిస్తారు .ఈ కార్యక్రమానికి సాహిత్య ,  సాంస్కృతికాభిమాను లందరూ విచ్చేసి జయ ప్రదం చేయ వలసిందిగా ప్రార్ధన .

 జోశ్యుల శ్యామలా దేవి – మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ –గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు              కార్య దర్శి                 కోశాధికారి              అధ్యక్షులు –సరస భారతి

              తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా ఇంట్లో ,మా గుడిలో అల్లుడి మాన్యు సూక్త పఠనం ,హైదరాబాద్ లోని మా రెండో అబ్బాయి శర్మ ఇంట్లో మనవళ్ళ ,మా వాళ్ళ సందడే సందడి

మా ఇంట్లో ,మా గుడిలో అల్లుడి మాన్యు సూక్త పఠనం ,హైదరాబాద్ లోని మా  రెండో అబ్బాయి శర్మ ఇంట్లో మనవళ్ళ ,మా వాళ్ళ సందడే సందడి

DSCN9011 DSCN9012 DSCN9013

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అభినందన సభ -27-7-14ఆ దివారం ఉదయం 10 గం ఐ వి పాలెస్ -విజయవాడ

 

buddha prasad abhinandana 001 4buddha prasad 001 3buddha prasad 001 2buddha prasad 001

 

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ

ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ

అమెరికా  ప్రముఖ నవలా రచయిత  ఎర్నెస్ట్ హేమిగ్ వే రాసి నోబెల్ ప్రైజ్ సాధించిన  నవలే ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లిటరరీ కంపానియన్ వాళ్ళు దీనిపై ప్రసిద్ధ విమర్శకుల చే వ్యాసాలూ రాయించి ప్రచురించారు .అది నా కంట బడి లైబ్రరి నుండి తెచ్చి చదివాలు .చాలా విలువైన వ్యాస సంపుటి అది .హెమింగ్ వే లోని అంతర్మధనాన్ని బాగా వెలువరించారు .’’the old man;s philosophical musings on the meaning of life of life and death ,and his role on both ,provide a fascinating back drop for his straight forwarding tale .Delbert E.Wylder దాన్ని ‘’sea fable ‘’అన్నాడు .అంతే కాక హెమింగ్ వే లోని సరికొత్త ధోరణి పూర్తిగా అభి వృద్ధి చెందిన కద.ఒక రకం గా చిన్న నవల .ఇందులో హీరో అయిన ముసలాడి’’ ప్రయాణ దాహం’’ గోచరిస్తుంది .సాటియాగో అనే ముసలి సముద్ర జాలరి  ప్రత్యెక చేప  వేట కు వెళ్లి శక్తి నంతా ధార పోసి అది పూర్తిగా దక్కక దాని అస్తిపంజరాన్ని మాత్రమె ఇంటికి తెచ్చుకొంటాడు .ఒక రకం గా ఇది ముసిలాడి ఓటమే .అయితే అతనిలోని పోరాట పటిమకు నిదర్శనం గా నిలుస్తుంది .అందుకే ‘’ it is a romantic attempt on the part of a champion to test the gods of the universe ,perhaps ,it is even an attempt at regeneration ‘’burning out ‘’of the ego in the god like attempt and the ultimate defeat on the way back to community of men ‘’అని నవలలోని ఆంతర్యాన్ని బయట పెట్టారు .

ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ‘’సముద్రం లో మంచి చెడు అనే  ద్వంద్వాలున్నాయి .అది మనకు కావలసినవి ఇస్తుంది ..క్రూరం గా ప్రవర్తిస్తుంది కూడా .ముసలాడు ఒక రోజు అందరు  వేట గాళ్ళను వదిలి ఒంటరిగా సముద్రం లో చాలా దూరం వెళ్ళాడు .దాన్నే ‘’across the threshold into the world of gods ‘’అన్నాడు విమర్శకుడు  మార్లిన్ అనే ప్రత్యెక చేప ను వల పన్ని పట్టుకోవటమే అతని ధ్యేయం .85వ సారి ‘’over an axis ‘’చేస్తున్న ప్రయత్నం ఇది .ఆతను వేసిన ఏర ఆ చేప నోట్లో గుచ్చుకుంది .అది ముసలాడి పడవను ఆగ్నేయ దిశకు లాక్కెళ్ళింది .దేవతలతో యుద్ధం అంత ‘’వీజీ కాదు ‘’అని అప్పుడు తెలిసింది .అతడు ఎన్నుకున్న మార్గం అతని స్వంత ‘’treachery ‘’.అప్పుడు అతని మనసులో ‘’my choice was to go there to find him beyond all people .Beyond all people in the world No one to help either one of us ‘’.అంటే ఆటను మానవ పరిదిలన్నీ దాటి వెళ్ళాడని భావం .ఒక విధం గా మన ‘’గజేంద్ర మోక్షం ‘’కదఇక్కడ మాత్రం .చివరికి ముసలాడు శక్తి నంతా ఉప యోగించి ‘’హార్పాన్ ‘’తో  చేప ను  పొడిచాడు .అది నెత్తురు కక్కి సమూద్రపు నీరంతా యెర్ర సముద్రమే అయింది .అతని పరిస్తితీ క్షీణించి పోయింది .అలసి మూర్చ వచ్చేంత పని అయింది జబ్బు చేసినట్లని పించింది .ఇక్కడే దీన్నిప్రముఖ అమెరికన్ నవలా రచయిత  ‘’హెర్మన్ మెల్ విల్లీ ‘’రాసిన ప్రఖ్యాత నవల ‘’మోబీ డిక్ ‘’తో పోల్చారు .మోబీ డిక్ లో ‘’అహబ్ ‘’లో’’mono manial dream ‘’ఉంటె ఇందులో వ్రుత్తి పరం గా ముసిలాడికి సముద్ర వేట సంసారానికి ఆహార సంపాదన కోసమే .ఇది ఇతని మానవ విధి,  బాధ్యత .ఆ పనినే శక్తి వంచన లేకుండా చేస్తున్నాడు .’’కర్మణ్యేవ కాదికారస్తే –మా ఫలేషు కదా చనా ‘’అన్న గీతా వాక్యం ప్రకారమే చేస్తున్నాడన్న మాట .ప్రయత్నం నీది ఫలితాన్ని ఆశించ కు అని సారాంశం .’’keep my  head clear ‘’ he said against the wood of the bow .’’I am a tired old man but I have killed the fish which is my brother and now I must do the slave work ‘’అనుకొంటాడు .ఈ చేప చుట్టూ షార్క్ చేపలు వెంట పడతాయి .దాన్ని తినటం ప్రారంభిస్తాయి .చూస్తూనే ఉన్నాడు .తాను ఓడిపోవటానికి వీలు లేదనుకున్నాడు ‘’a man can be destroyed ,but not defeated .”’I am sorry that I killed the fish though ‘’అని అనుకొన్నాడు .అతనిలో అంతర్మధనం జరుగుతోంది .

‘’it is silly not to hope .Besides I believe it is a sin .Do not think about sin ,he thought .There are enough problems now without sin also I have no understanding of it ‘’అని వితర్కిం చు కున్నాడు .’’perhaps it was a sin to kill the fish .I suppose it was even though I did it tokeep me alive and feed many people .But then every thing is a sin ‘’అని నిర్ణయానికి వచ్చేశాడు .కాని మనసు పీకుతోంది .తను చేసేది తప్పా ఒప్పా తేల్చుకోలేక పోతున్నాడు .చివరి గా మళ్ళీ మనో మధనం సాగించాడు ‘’you killed him for pride and because ,you are a fisherman .you love him when he was alive and you love him after .If you love him it is not a sin to kill him .Or is it more?’’.గీతలో కృష్ణుడు చెప్పినట్లే వీడూ చేశాడు .అప్పటిదాకా అర్జున విషాద యోగం లో ఉన్న వాడు సందేహాలన్నీ తీరి చీకటి తొలగి  అజ్ఞానం  నశించి కార్యోన్ముఖుదయ్యాడు .అప్పుడు దేహం మనసు ప్రశాంతత ను పొందాయి .’’గజేంద్రుడు మొర పెట్టుకొన్నట్లు ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగ’’ అనుకొన్నాడు .చివరికి కర్తవ్యం చేసి మోక్ష ప్రాప్తి సాధించాడు .హెమింగ్ వే చాల చక్కగా వివరించాడు ‘’hope is replaced by something else .The old man;s head was clear and good now and he was full of resolution but he had little hope ‘’అన్నాడు వాడి పట్ల సాను భూతి చూపిస్తూ .

ముసలాడు ఇంటికి తిరిగోస్తున్నాడు .మళ్ళీ మధన మొదలైంది ‘’I wish it were a dream and that I had never hooked him .I am sorry about, it fish అని చెబుతూ  సానుభూతిగా అన్నాడు .’’It makes every thing wrong .I should not have gone out so far .,fish –Neither for you not for me .I am sorry fish ‘’అంటూ తనను ఆ చెప్పాను అనున యించుకొన్నాడు ఓల్డ్ మాన్ .తన తోటి మిగిలిన జాలరులంతా విచారిస్తారేమో .తానుమంచి పట్నం లోనే ఉంటున్నాడు కదా అనుకున్నాడు .తన వారందరూ తనకోసం యెంత ఆరాట పడుతున్నారో ఎదురు చూస్తున్నారో అని ఆలోచించాడు .తానూ పట్టుకున్న  చెప్పాను  షార్క్ చేపలు తినేయ్యం గా మిగిలింది సగం చేప మాత్రమె .అదీ ఆస్తి పంజరమే మిగిలింది  మిగిలిన దంతా షార్కు లు పళ్ళ ఫోర్కులతో నంజుకు తినేశాయి .’’I ruined us both .But we have killed many sharks you and I and ruined many others ‘’అంటూ తానూ ,ఆ చేపా చేసిన పాపాల చిట్టా విప్పాడు .

తిరుగు ప్రయాణం లో ముసలాడు ముగ్గ్గురితో యుద్ధం చేయాల్సి వచ్చింది .మొదటిది ‘’మాకో’’ అనే షార్క్ తో .రెండోది ‘’గాలనాస్ ‘’తో .ఇదే లూజింగ్ బాటిల్ .తన దగ్గరున్న చేపల్ని చంపే పరికరాలన్నీ అయిపోయి నిస్సహాయుడయ్యాడు .చివరి పోరాటం లో సాధించిన విజయ చిహ్నం చేప . .చీకటి పడుతోంది మళ్ళీ ఆశ పెరిగింది కాని ఎవరితోనూ పోరాడా రాదనుకున్నాడు .తానూ ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలచినది .షార్కు లన్నీ మీద పడుతున్నాయి .అప్పుడనుకున్నాడు ‘’man is not created for defeat .’’అని జీవిత పరమార్ధం గ్రహించాడు .చివరగా తానూ దెబ్బతిన్నానని ,దానికి చికత్స లేనే లేదని తెలిసింది .సముద్రం మీద నుంచి కొత్త మనషి గా బయటకు రావాలను కొన్నాడు .సముద్రం గాలి మొదలైనవి తనకు పూర్తిగా సహకరిస్తాయని విశ్వ సించాడు .అవీ శత్రుచ్చేదనం లో పాల్గొని తనకు చేదోడు గా ఉంటాయనుకొన్నాడు .కాని ‘’I was beaten by my own treachery ‘’అనుకొన్నాడు .ఇక్కడే చాలా ఫిలసాఫికల్ గా అనిపిస్తాడు రచయితా హెమింగ్ వే ‘’I t is not society that is to guide and save the creative hero ,but precisely the reverse .And so every one  of us shares the supreme ordeal –carries the cross of the redeemer –not in the bright moments of his tribes great victories, but the sincere of his personal despair ‘’అంటే తను తెచ్చిన చేప ఆస్తి పంజరమే ‘’spiritual symbol of his victory ‘’అంటే ‘’క్రాస్ ‘’అని అర్ధం .ఇంటికి రాగానే అక్కడ మానోలిన్ అనే కుర్రాడు తాత కోసం ఎదురు చూస్తూ కని  పించాడు .వాడితో ‘’they beat me Manolin they truly beat me .physically the sharks beat me ‘’అన్నాడు షార్కులు సముద్ర ఆవాస జీవులు అక్కడే వాటి జీవనం మనుగడ వాటి జోలికి వెళ్ళటం నేరమే .అవి సముద్రం లో శక్తి సంపన్న జీవులు .ఈ విషయాన్నే విమర్శకుడు ‘’they emphasize the symbolic aspect of the treachery within the sea on the way home ‘’.ముసలాడి మాటలకు కుర్రాడు ‘’he did not beat you nor the fish ‘’ అని అంటే ’’’no-it was after wards ‘’అంటాడు ముసిలి .సముద్రం తో చేసిన ద్వంద్వ యుద్ధం లో ముసలాయన ఒడి పోయాడని భావం

‘’heroic character of man kind can be formed ,it is through the recognition of man;s ultimate defeat –which he endures with resolution and courage and which brings him into an acceptance of reality ,that a conditional victory is won ‘’అని ముగిస్తాడు వ్యాఖ్యాత .ఈ కధలో హీరో ఐన ముసలాడు  శాంటిగో యే రచయిత  ఎర్నెస్ట్ హెమింగ్ వే .అతని జీవితం లో చివరి ది ఈ నవల .

సశేషం

31-10-2002 నాటి నా అమెరికా( హూస్టన్  ) డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని

‘’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని

ఫిబ్రవరిలో శ్రీ రామనాశ్రమాన్ని సందర్శించినపుడు అక్కడి పుస్తక శాలలో కావ్య కంఠ గణపతి ముని సంస్కృతం లో రాసిన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రం ‘’కొన్నాను .దానికి తెలుగు అర్ధ తాత్పర్య ,వివరణలను శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ తేలిక భాష లో రాశారు .ఈ నెలలో ఒక వారం కిందటే చదవటం మొదలు పెట్టాను .బ్రాహ్మణ స్వామి అని పిలువా బడే ఆయనకు ‘’భగవాన్ రమణ మహర్షి ‘’అని పెట్టి ,మహర్షి చేత ‘’నాయన ‘’అని అందరిచేతా నాయన గారు అని పించుకున్న గణపతి ముని శ్రీ రమణా స్థాన కవీశ్వరులు .అమ్మవారి పరమ భక్తులు .ఇరవై రోజుల్లో ఉమా సహస్రం రాస్తానని చెప్పి రాయటం మొదలు పెట్టి ,మూడు వంతులు రాసి ,కుడి చేతి బొటన వ్రేలికి వ్రణం ఏర్పడటం వలనకొద్ది రోజులు ఆగి ,ఆపరేషన్ జరిగి కట్టుకట్టటం వల్ల మళ్ళీ ఆగి ,ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండటం రాయాల్సిన శ్లోకాలు 250శ్లోకాలు ఉండటం వలన చివరి రోజు5గురు లేఖకులను ఏర్పరచుకొని ,మహర్షి తన వెనుక ఆశీనులవ్వగా , అయిదుగురికి వరుసగా శ్లోకాలు చెప్పగా వారు రాస్తూంటే అర్ధ రాత్రికి ముందే కావ్యాన్ని ముగించిన అఘటన ఘటనా సమర్ధులు గణపతి ముని .సాకక్షాత్తు వినాయకుని అవతారమే .వెనక ఉన్న భగవాన్ సమాధి స్తితి నుండి లేచి ‘’నేను చెప్పిందంతా రాశావా?’’అని అడిగి ఆశ్చర్యం కలిగిస్తే ,’’అలాగే గ్రహించి గ్రంధాన్ని రాశాను ‘’అని వినయం గా సమాధానం చెప్పారట .ఇదొక అపూర్వ సన్ని  వేశమే .

 

image of Vasistha Ganapathi Muni  Inline image 1

గణ పతి ముని పుస్తకాన్ని ప్రధమ మొదలైన శతకాలుగా   శతకం లోని  భాగాలను ‘’స్తబకము ‘’లు(పూల గుత్తులు ) గా పేరు పెట్టి ఒక్కొక్క స్తబకం లో 25శ్లోకాలుం డేట్లు ,ప్రతి స్తబకం కధాంశాన్ని బట్టి ఛందస్సును ఉపయోగించి ఎంతో ఛందో వైవిధ్యాన్ని పాటించారు . బహుశా అమ్మవారి దివ్య సుందర విగ్రహాన్ని మనోలోకం లో దర్శించి రాసి ససమర్పించిన భక్తీ తాత్పర్య సుమాలివి .మునికి  వేదం ఉపనిషత్ ,శాస్త్ర ,దర్శన పురాణాది గ్రంధాలపై ఉన్న అపారమైన పాండిత్య ప్రతిభకు నిదర్శనం  .అమ్మకు ఛందో రూప కదంబ పూల మాల ఇది .మొదటి  శతకం మొదటి స్తబకం లో శ్రీ ఉమా మహేశ్వర తత్వావిష్కరణ నన్నెంత గానో ఆకర్షించింది .ఆ వివరాలే మీ ముందుంచుతున్నాను .

మొదటి స్తబకం

మొదటి స్తబకం లో అమ్మ వారి మహా శక్తి తత్త్వ వివరణ వేదోపనిషత్  స్పర్శగా ఉంది .ఆ శక్తి అన్నిటా అవిచ్చిన్నం గా వ్యాపించి ఉంది .యోగం లో కూడా ఆశక్తి తరంగాలు గోచరిస్తాయి .కాని యదార్ధ స్వరూపం కాన రాదు .శక్తి తరంగాలు అంటే శక్తి వివర్తనాలు అంటే  రూపాంత రాలు .మనకంటికి కని పించేవి కనిపించని తరంగాలు గా .అనుభవేక  వేద్యమే కాని దృష్టికి గోచరించేవి కావు .ఆ మహా శక్తి సత్ స్వరూపుడు ,సర్వ వ్యాపకుడు అయిన పరమేశ్వరుని తపశ్శక్తియే .ఆయన నుండి వేరు చేయటానికి వీలు లేని చిచ్చక్తియే .ఆ శక్తే లీలా దేహ ధారిణి అయిన హైమవతి .అదే మనదేహం లోని కుండలినీ శక్తి .

సత్య స్వరూపుడైన పరమ పురుషుడు ,అన్నిలోకాలకు నాభి యై ,కేంద్రమై సత్యలోకం అన బడ్డాడు . ఆయన నుండి వెలువడి ,అంతటా వ్యాపించే ఆయన సూక్ష్మ శక్తియే తపోలోకం .అఖండ వ్యాపన శీలుడు అని చెప్పటానికే ,అన్నిటికీ ఆద్యుడు అని వివరించటానికే ‘’లోక ‘’శబ్దాన్ని వాడారు .బండి చక్రం నాభి నుండి ఆకులు(కడ్డీలు) చుట్టూ వ్యాపించి ఉన్నట్లు పరమ పురుషుడైన సత్య లోకం లో సర్వ లోకాలు ప్రతిష్టితాలై ఉన్నాయి .వృత్తానికి మధ్య భాగం దాని కేంద్రం అయినట్లే అన్ని లోకాల సముదాయానికి కేంద్రం సత్య లోకం .అదే పరమ పురుషుడు .ప్రాణి నుండి ప్రాణాన్ని వేరు చేయటానికి వీలు లేనట్లు ,పరమ పురుషుని నుండి శక్తిని వేరు చేయటానికి వీలు లేదు .సత్య స్వరూపుడు ,శక్తుడు అయిన పరమ పురుషుని సహజ మైన సూక్ష్మ శక్తి యే తపస్సులేక తపోలోకం .అగ్ని నుండి పొగ వచ్చి అన్ని వైపులకు వ్యాపించి నట్లు పరమ పురుషుని నుండి వ్యక్తం అయ్యే గూడార్దాలన్ని వెలుపలికి వచ్చి అయన శక్తి తరంగాలన్నీ అంతటా వ్యాపిస్తాయి .ఇదే జనో లోకం .గూడార్ధాలు అంటే అవ్యక్త స్తితి లో నుండి పుట్టే ,పుట్టిన ,పుట్ట బోయే అన్ని రకాల జగత్ జీవ ఉపాధులకు ఉపాదాన కారణాలైన పదార్ధాలు అని అర్ధం .పరమ పురుషుని నుండి వాని ఆవిష్కారం ధూమం లాగా ఉంటుంది .అది పరమ పురుషుని తపో జ్వాలల  యందంతటా వ్యాపించి జనోలోక మైంది .జనో లోకం అంటే జన్మించే లోకం అని అర్ధం .

పరమ పురుషుని శక్తి సహజ సిద్ధం .దాని స్వభావం కూడా ఆయన లోపల రహస్యం గా ఉన్న పదార్ధాలను ఆవిష్కరింప చేయటమే కనుక జన ,తప ,సత్య అనే మూడు పేర్లుగల త్రిలోకాలు వేరు చేయటానికి వీలు లేవని భావం .వేదాంతులు చెప్పే సత్ చిత్ ఆనంద లక్షణాలు ఏకం ,అద్వితీయం అయిన పరబ్రహ్మ సృష్టి సంబంధం దృష్ట్యా మూడు లోకాలు గా ఉంటాయని గణపతి మునికవి వ్యాఖ్యానించారు .కనుక సత్ –సత్యం ,చిత్ –తపశ్శక్తి ,జనం –ఆనందం .దీని తర్వాతా దక్ష స్వరూపాన్ని ,దాక్షయిణీ జన్మ రహస్యాన్ని దక్ష యాగం కధలో ఉన్న అంతరార్ధాన్ని కవి గొప్పగా వ్యాఖ్యానించారు .వైదిక భాషలో ఉన్న పార్వతీ శబ్దానికి అపూర్వమైన అర్ధాన్ని ఆవిష్కరించారు గణపతి ముని . మొదటి స్తబకం లోని ఇరవై అయిదు శ్లోకాలు ‘’ఆర్యా వృత్తం ‘’లో రాసి అమ్మవారి మహాత్యాన్ని ‘’ఆర్యా మహాదేవతా ‘’అన్న సత్యాన్ని ప్రతిష్టించారు . ఆ విభాగాన్ని తనివి తీరా దర్శిద్దాం .

‘’అఖిల జగన్మాతోమా తమసా తాపేన చాకులా నస్మాన్ –అనుగ్రుహ్నా త్వను కంపాసుదార్ద్రయా హసిత చంద్రికయా ‘’అని ప్రధమ శ్లోకం తో అన్ని లోకాలకు తల్లి అయిన ఉమాదేవి చీకటి,అజ్ఞానం చేత ఆధ్యాత్మిక ఆది దైవికాలన బడే మూడు తాపాల చేత పీడింప బడే మమ్మల్ని దయామృతం తో చల్లనయిన నవ్వు వెన్నెలతో అనుగ్రహించాలి అని ప్రార్ధించారు గణపతి ముని .తర్వాత  సమస్త వస్తువుల్లో యెడ తెగ కుండా ప్రవహిస్తూ దేశ కాల పరిమితుల్లేని ఆలోచన కల యోగం లో దర్శింప తగిన తరంగాలుకలిగి జరామరణ ములకు అతీతమైన ,ఇలాంటిది అని వివరించటానికి వీలు లేని మహా శక్తికి నమస్కరించారు .ఆ శక్తి పర మేశ్వరుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తియే అని ఆమె యే లీలా స్వరూపం లో హైమవతి –పార్వతి అయిందని ,ఆమెయే కుండలినీ శక్తి అని కీర్తించారు .పొగ మధ్య ఉన్న వేడిమి వంటి శుద్ధ జ్వాలతో సమానమైన శక్తినే కొందరు స్వర్గం అన్నారు .పొగ లాంటి జనోలోకం అవధులు లేనిది .ఈజనోలోకాన్నే వ్యోమం ,అంతరిక్షం ,గగనం అనే పేర్ల తో పిలిస్తారు .

జనోలోకం లో ఆకాశం అనే ఉపాధి సంపర్కం తో ఇలాంటి వాడు అని నిర్వచించ టానికి వీలు లేని అవ్యక్తుడైన పరమ పురుషుడి కంటే వేరుగా చెప్ప బడే స్వాభిమానం గల ఒక వ్యక్తీ జన్మించాడు .కాంతి మార్గం అయిన జ్వలించే ఆకాశ రూపం అయిన ఈ జనోలోకామే దక్షుడు అని గూఢ భాషలో చెప్పారు .ఆ దక్షుడి గర్భాన జనించిందే దాక్షాయణి .జ్వలిత ఆకాశం దక్షుడు అయ్యాడని చెప్పటానికి ‘’అదితేర్దక్షో  అజాయత దక్షాద్వాదతిః పరి ‘’అని వేదమే చెప్పింది .అదితి నుండి దక్షుడు పుట్టాడు దక్షుడి నుండి అదితి జన్మించింది .పరమేశ్వరుడికి అభిమాని అయిన శక్తి  దక్షాత్మ ప్రకాశానికి ముందు కూడా ఉంది .ఈ విషయాన్నీ ‘’సత్యా ‘’అనే మాట తో చెప్ప బడింది శ్లోకం లో .సతీ శబ్దం కూడా సర్వదా ఉంటుంది అని సత్యా శబ్దం లానే అర్ధాన్ని చెప్పింది .నిజం గా దక్షుడనే పేరు గల ఆకాశానికి జనని అయిన శక్తి లక్షణా వ్రుత్తి చేత పుత్రిక వుతుంది .ఈ విధం గా అదితి నుండి దక్షుడు ,దక్షుడి నుండి అదితి జన్మించాయని చెప్పిన వేద వచాన్ని సమర్దిన్చాడుకవి .జనని అయిన శక్తికి  లక్ష్యార్ధం ‘’ సుత ‘’అంటే పుత్రిక అవుతుంది

‘’జగతాం మాతా పితరౌ సతీ భవౌ కేపి పండితాః ప్రాహుహ్ –అదితి ప్రజా పతీ తావ పరేషాం భాషయా  విదుషాం ‘’అని పద మూడవ శ్లోకం లో స్తుతించారు ముని .అంటే లోకాలకు జననీ జనకులు దాక్షాయణీ శివులు అని కొందరు పండితులు చెప్పగా ,మరి కొందరు ఆ జగజ్జననీ జనకులే అదితి  కశ్యపులని పురాణ కధనం గా చెప్పారని అర్ధం .కేన ఉపనిషత్ చెప్పిన దాన్ని శ్లోక బద్ధం చేసి లోకం లో కళ్ళున్న వాళ్ళలో దేవేంద్రుడు ధన్యుడని కారణం  ఆది మహిళ అయిన ఉమా దేవిని మొదటి సారి చూడ గలిగాడని మిగిలిన దేవతలేవ్వరికీ ఆ భాగ్యం కలగ లేదని చెప్పారు .ఇంకో శ్లోకం లో ఉత్తమ సౌందర్య స్త్రీలలో మొదట గా చెప్ప దగినది గౌరీ దేవి అని కొందరు అంటే ,హిమాలయం దేవతాత్మ అని కాళిదాస మహాకవి కుమార సంభవం లో చెప్పాడన్నారు .

వేద భాషలో మేఘాన్ని పర్వతం గా భావించారు .ఆ పర్వతం నుండి వచ్చిన గంభీర ఘోష కల సహింపరాని విద్యుచ్చక్తి జనించింది .నిరుక్తం లో మేఘానికి ఉన్న ముప్ఫై పేర్లలో పర్వతం  అనే పేరు కూడా ఉంది . అంత రిక్షం  తన రేణు సమూహం నుండి ఆహారాన్నిస్తోందని కాని పరమేశ్వరుడికి ఇవ్వటం లేదని దక్ష యజ్న పరం గా ఇరవై ఒకటవ శ్లోకం చెప్పారు గణపతి ముని .దీనికి వివరణ –ఆకాశమే దక్షుడు .దక్షుడి నుండే అన్నీ పుట్టాయి .అన్ని ఆయన్నుంచే వచ్చాయి ఈ సామగ్రి సృష్టికే ఇవ్వ బడుతున్దికాని పరమ పురుషుడైన ఈశ్వరునికి ఇవ్వ బడదు అని దక్ష యజ్ఞం లో శివుడికి దక్ష ప్రజాపతి హవిర్భాగాన్ని ఇవ్వక పోవటాన్ని సమర్శించారు కవి ముని .శక్తి అంతా వ్యాపించి ఉన్నా అది రహస్యం గా  ఉంటుంది కనుక మామూలు దృష్టికి గోచరం కాదు .నష్టం అయినట్లు కనిపిస్తుంది .అందు చేతనే దక్ష యజ్ఞం లో సతీ అంటే దాక్షాయణి నిర్యాణం చెప్ప బడింది అంటారు ముని –‘’వ్యాప్తాపి యన్నిగూఢా బహి రీక్షక బుధ్యపేక్ష్య యా –శక్తిర్యాగే తస్మిన్నవసానం తదుదితంసత్యాః ‘’అని శ్లోకం లో ఆ రహస్య భావాన్ని బంధించారు .

‘’పర్వత నామనో వైదిక భాషాయాం యదియ మతి బాలా శక్తిహ్ –ఘనతో భవతి వ్యక్తా తదభిహితం పార్వతీ జననం ‘’అంటారు .అత్యంత బలం ఉన్న ఈ శక్తి వేద భాషలో పర్వతం అని పేరుగల మేఘం నుండి పుట్టింది ,అదే పార్వతీ జననం అన్నారు .పర్వతం నుండి పుట్టిన్దికనుక పార్వతి పర్వతం అంటే మేఘం కనుక మేఘం నుండి పుట్టిన శక్తియే  ఉమా దేవి అనే పార్వతీదేవి అని భావన .అంటే ఆమె విద్యుత్కాంతి స్వరూపిణి అన్న మాట .భూలోక వాసులమైన మన బోటి వారిని అనుగ్రహించటానికే హిమాలయ పర్వతం లో పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై ఉన్నారని .ఇది భక్తులను అనుగ్రాహించటానికి వారు చేసిన లీలా విలాసం అని గణపతి ముని ‘’తే జోమ్షతః శివా విహా హిఆచలేనుగ్రహాయ భూమి జుషాం –దత్తోయ త్సాన్నిధ్యం లీలా చారిత్ర మాన్య దిదం ‘’అని ఇరవై నాలుగవ శ్లోకం లో చెప్పారు .ఇరవై అయిదవది అయిన మొదటి స్తబకం లోని చివరి   శ్లోకం లో ‘’ఆర్యా వృత్తం ‘’ లో రచింప బడిన ఈ శ్లోకాలు వేదాది శాస్త్ర సమ్మత మైన భావాన్ని తెలుసుకున్న వారు శివుని పట్టపు రాణి జగన్మాత అయిన ఉమా దేవి స్వరూపం గానే తెలుసుకొంటారు అని ముగించారు ‘.

‘’ఏ తేషామార్యాణాం జానం తః శాస్త్ర సమ్మతం భావం –జానీయు ర్భవ మహిషీం భువనానా మంబికాం దేవీం ‘’

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-4-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – అన్న ఆ నాటి ”పొట్టేలు పున్నమ్మ ”నటి ,నేటి ”దృశ్యం” డైరెక్టర్శ్ శ్రీ ప్రియ

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – శ్రీప్రియ

Published at: 22-07-2014 00:29 AM

‘‘చాలా మంది ‘ఆ.. రీమేకే కదా’ అని ఈజీగా
మాట్లాడేస్తుంటారు. కానీ ఒరిజినల్‌ స్టోరీని
తెరకెక్కించడం కంటే రీమేక్‌ చేయడమే చాలా క్లిష్టమైన
వ్యవహారం. హిట్టయిన ఒరిజినల్‌తో రీమేక్‌ను పోల్చి
చెబుతుంటారు కాబట్టి దాన్ని బాగా తీయాల్సిన ఒత్తిడి
ఎప్పుడూ ఉంటుంది’’ అని చెప్పారు శ్రీప్రియ. వెంకటేశ్‌,
మీనా జంటగా డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి
సంయుక్తంగా నిర్మించిన ‘దృశ్యం’ సినిమాను ఆమె
డైరెక్ట్‌ చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం
విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా
సోమవారం ఆమె పత్రికలవారితో సంభాషించారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
మీనా, నదియా నాకు చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి వారితో పనిచేయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నేను పెద్ద పెద్ద హీరోలతో కలసి నటించా. ఒక డైరెక్టర్‌కి వెంకటేశ్‌ వంటి హీరోతో పనిచేయడం ఎంత ఈజీనో. నన్ను ఓ డైరెక్టర్‌గా ఎంతో గౌరవభావంతో చూశారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన రాంబాబు పాత్రకు తెలుగులో ఆయనకంటే బెస్ట్‌ చాయిస్‌ ఇంకొకరు ఉండరు. ఆ పాత్రను గొప్పగా చేశారు. ‘దృశ్యం’కు సంబంధించి నాకు పాత్రలకు సరిగ్గా సరిపోయే ఆర్టిస్టులు దొరికారు. పైగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు మంచి ప్రొడక్షన్‌ టీమ్‌ ఉంది. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో మంచి ప్రతిభావంతులు ఉండటంతో నా పని సులువయ్యింది. అనుకున్నవిధంగా చాలా త్వరగా సినిమాని పూర్తి చేయగలిగాం.
కన్నీళ్లొచ్చాయి
ఒక డైరెక్టర్‌గా ఈ సినిమాని తీసింది నేనే అయినా సినిమాని చూస్తుంటే నాకే కళ్లవెంట నీళ్లొచ్చాయి. అంతగా ఈ సినిమాలో భావోద్వేగాలు పండాయి. ప్రేక్షకులనూ అవి కదిలిస్తున్నాయని సినిమాకి వస్తోన్న ఆదరణ తెలియజేస్తోంది. మంచి సినిమా అయితే అది ఏ తరహా సినిమా అయినా చూస్తామని తెలుగు ప్రేక్షకులు గతంలో ఎన్నోసార్లు రుజువు చేశారు. జానపద చిత్రాలను ఆదరించిన వారే ‘శంకరాభరణం’ వంటి క్లాసిక్‌నూ అమితంగా ఇష్టపడ్డారు. ఇప్పుడు ‘దృశ్యం’ వంటి ఫ్యామిలీ థ్రిల్లర్‌ను హిట్‌ చేశారు. సాధారణంగా రీమేక్‌ అంటే నేటివిటీని మిస్‌ కాకుండా సినిమా తియ్యడం ఓ సవాలు. తెలుగువాళ్ల, తమిళుల సంస్కృతితో పోలిస్తే మలయాళీల సంస్కృతి భిన్నం. అయితే ‘దృశ్యం’ అనేది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. ఏ భాషలో తీసినా స్ర్కిప్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. తెలుగులోనూ పెద్దగా మార్పులు చెయ్యకుండానే ఒరిజినల్‌ స్ర్కిప్టు ప్రకారమే వెళ్లాం. మంచి ఫలితం సాధించాం.
డైరెక్షన్‌ డిఫికల్ట్‌
నేను సినీ ఇండసీ్ట్రలో అడుగుపెట్టి ఇది 42వ సంవత్సరం. తెలుగులో కృష్ణ, మురళీమోహన్‌, మోహన్‌బాబు వంటి హీరోల సరసన చేశాను. ఇప్పుడు వెంకటేశ్‌ను డైరెక్ట్‌ చేశాను. నటన, దర్శకత్వంలో ఏది సులువంటే నటన అనే చెబుతాను. ఒక రచయిత రాసిన సన్నివేశాన్ని, దర్శకుల సూచనల ప్రకారం నటించడంలో పెద్ద కష్టమేమీ ఉండదు. కానీ దర్శకత్వం అలా కాదు. అన్ని శాఖలనూ సమన్వయపరుస్తూ, సినిమా బాగా రావడానికి బాగా కష్టపడాలి. తెరపై సన్నివేశం పండినా, పండకపోయినా డైరెక్టర్‌దే బాధ్యత. అందుకే డైరెక్షన్‌ అనేది చాలా డిఫికల్ట్‌ జాబ్‌. నేను నటించే కాలంలోనే డైరెక్టర్‌ చేసే పనిని పరిశీలిస్తూ ఉండేదాన్ని. ప్రాక్టికల్‌గా నేను డైరెక్షన్‌ నేర్చుకుంది దాసరి నారాయణరావుగారి వద్దే. ఆయన ‘స్వప్న’ సినిమా తీస్తున్నప్పుడు నెల రోజుల పాటు ఆయన వద్ద డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. ఆ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ‘దృశ్యం’తో కలిపి ఇప్పటికి ఆరు సినిమాలు డైరెక్ట్‌ చేశా.
ఆమె నా రోల్‌మోడల్‌
డైరెక్టర్‌గా నాకు రోల్‌మోడల్‌ విజయనిర్మల గారు. ఒక లేడీ డైరెక్టర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకున్న ఆమె అంటే నాకెంతో గౌరవం. ఆమెతో కలసి పనిచేశాను కూడా. తెలుగులో ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్‌ అంటే ఇష్టం. ‘మగధీర’లో రామ్‌చరణ్‌ అన్నా ఇష్టమే. నిత్యా మీనన్‌ నాయిక గా నేను డైరెక్ట్‌ చేస్తోన్న ‘మాలిని 22’ షూటింగ్‌ కొద్దిగా మిగిలుంది. ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌ నెలలో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

తిమిరంతో సమరం సాగించిన మా అన్నయ్య – దాశరథి రంగాచార్య అంటున్న తమ్ముడు రంగా చార్య :

దాశరథి మహాకవి, ఆయన చేసిన సాహిత్య సృష్టి అనితర సాధ్యం. అంగారాన్నీ, శృంగారాన్ని రంగరించినవాడు. తెలంగాణను సాహిత్యంలో ప్రవేశపెట్టిన తొలి యోధుడు దాశరథి.కాలానికి కరుణ లేదు. కాలం కర్కశం అయింది. కాలం మా అన్నయ్య దాశరథిని 1987 కార్తీక పౌర్ణమి నాడు కబళించింది. తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మా అన్నయ్య పర్వదినాన పరమ పదించారు. ఆ రోజు వ్యాస పూర్ణిమ. గురునానక్‌ జన్మదినం. దివాజుద్దీహుం షరీఫ్‌. నిండు పున్నమి నాడు పోయాడు. మమ్ములను కారు చీకట్లలో ముంచి పోయాడు. కాలాన్ని మించిన వేగం కనిపించదు. అప్పుడే రెండేళ్ళు గతించాయి.
దాశరథి మహాకవి, బహు భాషావేత్త, పండితుడు, అచంచల దేశభక్తుడు, మహావక్త, మంచి మిత్రుడు, మనసున్నవాడు, అన్నింటీనీ మించి గొప్ప మానవతామూర్తి, దాశరథిని గురించి కానీ, వారి రచనలను గురించి కానీ తెలియని వారు అరుదు. అతడు సాహిత్యంలో చేసిన కృషి అలాంటిది. అతడు చేసిన సాహిత్య సృష్టి అనితర సాధ్యం. అంగారాన్నీ, శృంగారాన్ని రంగరించినవాడు. తెలంగాణను సాహిత్యంలో ప్రవేశపెట్టిన తొలి యోధుడు దాశరథి. దాశరథి జీవితంలో దాపరికాలు లేవు. అతని జీవితం తెరచిన పుస్తకం. అన్నదమ్ములంగా మాది సుమారు అరవై యేళ్ల అనుబంధం. మాకు అరమరికలు లేవు. అన్యోన్యంగా జీవించాం. ఆ ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా తరగవు. కొన్ని పాత విషయాలు కొత్తగా ప్రస్తావిస్తాను.
మా పూర్వులది భద్రాచలం. రామానుజుని అంతరంగ శిష్యుల్లో దాశరథి ఒకరు. మాది వారి వంశం అంటారు. మా పితామహులు లక్ష్మణాచార్యులవారు విద్వాంసులు, వైద్యులు. వారికి భద్రాచలంలో ఇల్లూ, వైద్యం, ఆలయంలో ఉద్యోగం, కూనపరాజు పర్వలో భూములూ ఉండేవి. వారికి సంతానం కలగడం, పోవడం జరుగుతుండేది. మా నాయన పుట్టగానే వారిని తీసుకొని మా నాయనమ్మ బుచ్చమ్మగారు వాళ్ల చిన్న గూడూరులోని తమ్ముని ఇంటి కి చేరుకుంది. మా తాతగారు భద్రాచలంలో అన్నీ వదులుకొని చిన్న గూడూరు చేరారు. ఆస్తిపాస్తులు ఆర్జించారు. మా నాయన గారి చదువుకోసం మద్రాసు చేరి, వైద్యం చేసి మద్రాసు యూనివర్సిటీ విద్వాన్‌ చేయించి మద్రాసులో వైద్యం వదులుకొని మళ్లీ చినగూడూరు చేరారు. మా తండ్రిగారు వెంకటాచార్యుల వారు సంస్కృత ద్రావిడాల్లో ఉద్దండ పండితులు. వారు తమిళం నుంచి అనేక ప్రబంధాలను తెనిగించారు. మా మాతామహులు భట్టర్‌ దేశికులకు సంస్కృతాంధ్రాల్లో మంచి ప్రవేశం ఉండేది.
మా అన్నయ్య కృష్ణమాచార్యులు 1925లో చినగూడూరులో జన్మించారు. వారి విద్యాభ్యాసాన్ని గురించి చాలా తర్జనభర్జనలు జరిగాయి. మా తాతలిద్దరు మ్లేచ్ఛ విద్య అంటే ఉర్దూ చదువు పనికిరాదన్నారు. మా నాయన వారితో ఏకీభవించలేదు. కాలాన్ని అనుసరించాలన్నారు.
నిజాం నవాబు ఒక పద్ధతి ప్రకారం తెలుగు భాషను, సంస్కృతిని ధ్వంసం చేస్తున్న కాలం అది. ఉర్దూ బోధన భాష రాజకీయ భాష అయింది. తెలుగు చెప్పే వీధి బడులు నడిపించడానికి కూడా సర్కార్‌ అనుమతి అవసరం చేశారు. తెలుగు మాట్లాడాలన్నా, రాయాలన్నా, తెలుగుదనం కనబరచాలన్నా బుగులుపడుతున్న రోజులవి.
చినగూడూరు పేరుకు చిన్నది. ఊరు పెద్దదే. ఆ రోజుల్లో మదర్సా, పోలీసు నాకా, టప్పాకానా ఉండేవి. మా నాయన పట్టుదలతో అన్నయ్యను మదర్సాలో చేర్చారు. ఉగ్గంపల్లి పటేల్‌ ఇస్మాయిల్‌ ఇంట్లో చ దువు చెప్పేవాడు. మా నాయన సంస్కృతం కూడా ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న తహతాన్యాలో నాలుగో తరగతి పూర్తి అయింది. అన్నయ్య చదువు కొనసాగించడానికి మా నాయన ఖమ్మం మారారు. అన ్నయ్య ఫౌఖాన్యా అంటే హైస్కూల్లో చేరారు.
మా అన్నయ్యకు తొలి నుంచీ తెలుగు ఆరాటం మెండు. ఇంటి పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. మా నాయన సంస్కృతం, ద్రావిడం తప్ప మిగతావి భాషలే కావనే వాడు. తెలుగు ఒక భాష కాదని వారి అభిమతం. అందుకే ఇంటి దగ్గరే అన్నయ్యకు ద్రావిడ, సంస్కృతాలు బోధించారు. అన్నయ్య 15 ఏండ్ల ప్రాయంలోనే తిరుప్పావై కాలక్షేపం సాయించారు.
ఇంటి స్థితి ఇది. స్కూల్లో సాంతం ఉర్దూ. అంటే ఉర్దూ మీడియం తెలుగు చదవదలచివారికి మూడు నుంచి ఏడవ తరగతి దాకా బోధించారు. ఆ తర్వాత తెలుగు ఆప్షనల్‌ విషయం. ఎనిమిదో తరగతి తెలుగు ఆప్షనల్‌ క్లాసులో మా అన్నయ్య ఒక్కడే ఉండినట్లు గుర్తు. తెలుగు చదవడానికి        జంకేవారు.
ఇంత వ్యతిరేకత ఉన్నా అన్నయ్య తెలుగు తృష్ణ తగ్గలేదు. మా అమ్మకు తెలుగులో మంచి విద్వత్తు ఉండేది. చాటుగా అమ్మ దగ్గరే అన్నయ్య అప్పకవీయం, కావ్యాలూ చదివాడు.
అన్నయ్య తెలుగు ఆర్తికి ఖమ్మం వాతావరణం ఎంతగానో ఉపకరిచింది. విజ్ఞాన నికేతనం, విద్యార్థి సంఘం గ్రంథాలయాలు దాశరథికి ఎంతో తోడ్పడ్డాయి. దాశరథి పుట్టుకతో కవి. అతడు చాలా చిన్నతనం నుంచే పెద్దలు మెచ్చే కవితలు  చెప్పేవాడు.
కారణాంతరాల వల్ల మేము గార్ల జాగీరుకు మారాల్సి వచ్చింది. దాశరథి కవి కావడానికి ఖమ్మం వాతావరణం తోడ్పడ్డట్టే, అతనిలో విప్లవ జ్వాలను రగిల్చింది గార్ల జాగీరులోని కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రమహాసభ పోరాటాలు! దాశరథి అనేక పోరాటాలు నిర్వహించారు. అడవుల్లో తిరిగారు. కోయలతో పాటు ఉన్నారు. జబ్బులు తెచ్చుకున్నారు. అవి చివరిదాకా వారిని వదల్లేదు.
దాశరథి సభల్లో అగ్గి కురిపించాడు. కవితలు చదివి నిప్పులు ఉముసేవాడు. ఆనాటి నిజాం రాజ్యంలో ఉండి నవాబులను ‘ముసలి నక్క జన్మ జన్మాల బూజు’ అనడానికి సాహసం కావాలి. ఒక సభలో కవితలు చదివిన సందర్భంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే, చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు.
దాశరథి తరువాత కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయాడు.
దాశరథిలో సంప్రదాయ సిద్ధం అయిన పాండిత్యం ఉంది. మార్స్కిస్టు అవగాహన ఉంది. అందుకే ప్రపంచంలో ఏ మూల అన్యాయం జరిగినా తిమిరంతో సమరం సాగిస్తాడు. దాశరథి కాయాన్ని కాలం కబళించింది. కానీ ‘నాస్తి తేషాం యశఃకాలే జరామరణజం భయం’.
– దాశరథి రంగాచార్య
(1989 నవంబర్‌ 6న ‘ఆంధ్రజ్యోతి’లో          ప్రచురితమయిన వ్యాసం దాశరథి కృష్ణమాచార్య
జయంతి సందర్భంగా పునర్ముద్రణ)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

కవితా శబ్ద శిఖరాలు -2(చివరి భాగం )

తెలుగు కవులలో అవకాశం పొందిన ఆలిండియా రేడియో మాజీ స్టేషన్ డైరెక్టర్ డా.ఆర్ .అనంత పద్మనాభ రావు ‘’బీడు వారిన నేల’’కవిత .బీడు వారిన గుండెతో రైతు రోదిస్తున్నాడని ,యాత్రలన్నీ మానవ మనో మాలిన్యక్షాళన మానస సరోవరాలు కావాలని ,మానవ మస్తిష్కం లో ఆలోచనా శిఖరాలు చిగురించాలని ,కేదార్ దారుణానికి మానవ తప్పిదమే కారణమని ‘’నింగీ నేలా నీరు పదిలంగా వాడుకొందాం –నింగి కెగసే ఆలోచనలతో సమైక్యతా గీతం పాడుకొందాం ‘’అని భావ గర్భితమైన ,తమ అనుభవ పూర్వకమైన సందేశం ఇచ్చారు .’’దాగిన అంతరాన్ని’’ బోడో భాషా కవి శ్రీ శరత్ చంద్ర బోరో కవితను శ్రీ సుధామ కవితానువాదం చేశారు .హృదంత రాళం చేదించుకు  చిమ్ముకు రానిఅసలు దుఖిన్చేందుకు కాని కన్నీళ్లు నిజమైనవి కావని ,మలినపు మరక అంటిన నవ్వు హాయిగా నవ్వినా నవ్వు కాదని ,సృష్టికే మూలాధారం లేని ప్రణయం ,నిర్మితి లేని ప్రేమ అస్తిత్వానికి అనర్హమని ,తిరిగి పొందాలనుకుని ఇచ్చే దానం ,ప్రశంసలకోసమమే ఇచ్చే కానుక ఉదారతకు నిదర్శనం కాదు అని మనసులో దాగిన ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు కవి .గర్భస్థ శిశువు ఆవేదనను తల్లికి చెప్పుకునే  ‘’ఏ పేరూ లేకుండా ‘’ కవితను కన్నడం లో డా.జయశ్రీ సి.కంబర్ చెప్పిన దానికి డా కే బి లక్ష్మి తెనుగు అనువాదం చేశారు .’’ప్రేమరహిత ,నిరభిమాన భావనలు నన్ను గట్టిగా తడుతున్నట్లని పిస్తోందని ,తల్లి గొంతుకను,తీపి రాగాలను  తానూ అనుకరించగలనని ,కాని తానూ చీకట్లో జారిపోతున్నానని తన ఆశలు అడుగంటి పోయాయని ,తెగిన గాలి పటం లా చిద్రమై పోతున్నానని తీవ్ర ఆవేదన చెందుతుంది .చివరికి ‘’ఏ పేరూ లేకుండా నిస్సహాయం గా స్రవిస్తున్నాను –ప్రవహిస్తున్నాను –వేగం గా ఎర్రగా ‘’అని ఆడపిల్లని కన కుండా గర్భ చ్చేదం చేసుకున్నప్పుడు కడుపులోని శిశువు చెందే ఆవేదనే ఇది .

‘’ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బావి అడుగున అంధకారం లో నీళ్ళున్నాయి –నీళ్ళలో అందకారముంది –పదిలం ప్రియ తమా పదిలం –నీ మది అంచున లోతైన బావి ఒకటి ప్రవహిస్తోంది ‘’అనే హెచ్చరికతో ‘’అగాధాల బావి ‘’ని డా నాళేశ్వరం శంకరం ,కొంకణి భాషలో రాసిన శ్రీ పరేష్  నరేంద్ర కామత్ కవితను అనువదించారు .శ్రీ ఉదయ నారాయణ సింగ్ మైధిలి భాషలో తన ఊరిని ,అక్కడి జీవన పరిస్తితిని ,పరిసరాల్ని మట్టి వాసన తో  అక్షర బద్ధం చేస్తే డా .అనుమాండ్ల భూమయ్య ‘’ఎన్నాళ్ళ కేన్నాళ్ళకు ‘’అని తెలుగు చేశారు .’’నేను ముళ్ళ దారిలో నడవక తప్పదు –యదార్ధమనే అగ్ని ని పట్టుకొని తరువాతి తరానికి అంద జెయ్యాలని ఆరాట పడ్డారు’’యదార్ధ వాదం ‘’లో  ప్రో.వసంత అబాజీ దహకే మరాఠీ లో .తెలుగు చేశారు శ్రీ నగ్న ముని .

రాక్ష ప్రవ్రుత్తి భూమి మీద రాజ్యం చేస్తోందని నిర్జన ప్రదేశాలను సైతం కబళించేస్తోందని ,హింసాత్మక మానవ మనస్తత్వాన్ని , స్వార్ధాన్ని  సంపూర్ణం గా సాధించాలనే ఉబలాటం పెరిగిందాని ,ఇవన్నీ గమనిస్తున్న నక్షత్రాన్ని ‘’ఎవరి తోనూ ఏమీ చెప్పకు నక్షత్రమా ‘’అంటూ ప్రాధేయపడ్డారు నేపాలీ భాషలో శ్రీ భూపేంద్ర అధికారి .’ డా .టి గౌరీశంకర్ తెలుగులో చెప్పారు ..’’తన దేహం కాగితం గా మారిందని ,దానిపై తన  అస్తిత్వకావ్యాన్ని రాయమని ,కాగితాన్ని తేలిగ్గా తీసుకో వద్దని అనేక ప్రక్రియల్లో అది తయారైందని ,కావ్యమంటే సారం లేని శబ్ద విహారం కాదని ,కవిత్వమంటే ప్రేమ ఉద్వేగ హస్తం తో లలాటాన్ని స్పృశిస్తే సృష్టి సమస్తం ప్రేమ సంభరితం అవుతుందని ,అది హృదయం మీద రెపరెప లాడే మమతల మనోజ్ఞ పతాకం అని ,రక్త జ్వలిత సంగీతమే కవిత్వమని అది రక్తదానం చేసేవారినీ స్వీకరించే వారినీ నిత్య నూతనం గా పరవశింప జేస్తుందని నిర్వచించారు పంజాబీలో శ్రీ స్వరణ్ జీత్ సవి –తెలుగులో  వెలుగులు తెచ్చారు డా .యెన్ .గోపి .

‘’ ప్రశ్న కోసం అన్వేషిస్తూ ‘’-సింధీలో డా. విమ్మి సదరంగ్గణి వెతుకుతుంటే తెలుగులో డా. కొలక లూరి ఇనాక్ ‘’ అ అమ్మాయొకనైట్ క్వీన్ ,పగలు మౌనం రాత్రి గాఢ చంచలం అవుతుందని ,ఆమె  తన అగ్నిలో దహించుకు పోయే సూర్యుడని ఆమె ఒక స్వప్నం –దుప్పటికప్పుకుని నిద్ర పోయినట్లు నటిస్తుందని ,ఆమె ఒక కాగితప్పడవ అనాలోచనం గా ఎవరి చేతిలోకో ప్రవ హించి పోతుందని ,అ అమ్మాయి ఏడాదికో పక్షం మాత్రమె పుష్పించి మిగిలిన కాలమంతా మోడై మిగిలే ‘’బ్రయడల్ క్రీపర్ ‘’అని ,ఆమె ప్రశ్న కోసం అన్వేషించే జవాబు ‘’అని కమ్మని తెలుగులో నర్మ గర్భం గా పలికారు .దేశ రక్షణ చేసే జవాన్ ను కీర్తిస్తూ సందాలీ భాషలో ‘’కుమారి దమయంతి మేశ్రా’’గానం చేస్తే తెలుగులో డా .అమ్మంగి వేణుగోపాల్ ‘’జై జవాన్ ‘’అంటూ అతని నిండు యవ్వనం దేశానికీ ప్రజలకు అంకితమని ,అతని సుఖ దుఖాలు మాత్రం భూస్తాపితమని ,అతని మహా ప్రస్థానాన్ని దశ దిశలా ప్రతిధ్వనిస్తూ తుపాకులు పేలి గౌరవ వందనాన్ని సమర్పిస్తాయని అమర జవాన్ జ్యోతి దేదీప్యమానం గా ప్రజ్వరిల్లుతూ మహా వెలుగై యావత్ జాతిని ఆవహిస్తుందని ,జవాన్ అసమాన త్యాగం హ్రుదయాలనుండి చెదరిపోదని నివాళులర్పించారు .సరైన సమయం లో సరైన కవితను రాసి జాతిని రక్షించే జవాన్ కు జై కొట్టటం ఏంతో  శ్లాఘనీయం .,సందర్భ శుద్ధి ఉన్న కవిత .హాట్స్ ఆఫ్

కవిత్వం లో కని  పించకుండా పోయిన మాటకోసం తమిళ కవి శ్రీ ఈరోడ్ తమిళన్ బన్ వెతుకుతూ వజ్రాపు తునకను ,ఇంద్ర ధనుస్సు ముక్కను,పువ్వును అందమైన అమ్మాయిని పెడితే కవిత్వపాదాలు హర్షించక చిట పటమన్నాయ్ .కాని తన పసికందు తిరిగోచ్చినప్పుడు కనిపించకుండా పోయిన మాట వాడి చిట్టి కళ్ళల్లో జిగేల్ మంది ‘’అని తెనిగించారు డా .వనమాలీ .చిన్నపిల్లల అవసరం మాలిమి లో ఆనందం  సంతృప్తి వెల్లి  విరుస్తుందని తెలియ జెప్పిన కవిత ‘’ఆ మాట ‘’.

‘’కవిత నీకు రసగంగ –వాళ్లకు సట్టాబజార్ జీన్స్ –వాళ్లకు కెరీర్ జోన్ –నల్ల డబ్బు ఆసాముల తెల్ల దనం –కాని నాకు ఇంటి నుంచి బజారుదాకా ఒక సామూహిక ఉద్యమం ‘’అని హిందీ లో అన్న శ్రీ విష్ణు శర్మ కవితను శ్రీ నిఖిలేశ్వర్ తెలుగులో ‘’నా కోసం కవిత ‘’గా పల్ల  వింప జేశారు .వీరుకాక మిగిలిన కవులూ తమ భాషల్లో కవిత్వం చెప్పారు ,వాటికి మన వాళ్ళు తెనుగు చేశారు .కాని గుర్తుంచుకో దగ్గ కవిత్వం లేదని పించింది .సరుకుల చిట్టా గా కొందరు రాస్తే ,తికమకల అడ్డా గా  కొందరి కవిత లుండటం జాతీయ కవి సమ్మేళనానికి శోభ స్కరం  కాదని పించింది .ఇంత  ఖర్చుతో ,రంగ రంగ వైభవం గా నిర్వహించిన సమ్మేళనం లో పదికాలాల పాటు నిలువ ఉండే కవిత లేక పోవటం బాధాకరమే .మననం చేసుకొనేలైన్లు ,ఆలోచింప జేసే వాక్యాలు ,మనసులోపలికి చొచ్చుకు పోయే భావాలు ,గుండె తడిని తట్టే కవితలు ,కళ్ళు చెమర్చే పదాలు లేక పోవటం ఈ హంగామా లో వెలితిగా ఉందని చెప్పక తప్పదు .

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పుస్తకం లో ఒకే ఒక్క  తప్పు మాత్రం దొర్లింది.అది కవర్ పేజీ దాటిన తర్వాత వచ్చిన టైటిల్ పేజీ లో కవి సమ్మేళనం జరిగిన తేదీ 2014ఫిబ్రవరి 9 అని పొరబాటున పడింది .మిగతా అన్ని చోట్ల జనవరి 9 అని సరిగ్గానే అచ్చు అయింది .ప్రమాదో ధీమతా మపి .

ఇంత గొప్ప కార్యక్రమాన్ని హైదరా బాద్ లో నిర్వహించి, తెలుగు కవితలను పుస్తక రూపం లోమొదటి సారిగా  ముద్రించి అందరికి ‘’అమూల్యం ‘’గా అంద జేసి, భాగ్య నగరాన్ని కవితా సౌభాగ్య నగర్ గా ఆరోజును తీర్చి దిద్దిన ఆత్మీయులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారిని మరొక్క సారి అభినందిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-14 –ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే! (యెన్ టి ఆర్ )అన్న మణిమాల అనే గీతాంజలి

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే!

Published at: 21-07-2014 16:15 PM

తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరిపించి, మురిపించిన నాటితరం నటీమణులలో గీతాంజలి ఒకరు. హీరోయిన్‌గా ప్రవేశించి హాస్యనటిగా స్థిరపడిన గీతాంజలి తన నట జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నాటి జ్ఞాపకాలను ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నెమరువేసుకున్నారు…

ఆర్కే : మీరు హీరోయిన్‌గా చేశారు, కమెడియన్‌గా చేశారు? ఎందుకలా కెరీర్‌ జిగ్‌జాగ్‌గా వెళ్లింది?
గీతాంజలి : మా నాన్నగారే కారణమండి. మంచి టైంలో ఎల్వీప్రసాద్‌గారి ఇల్లాలు సినిమా చేశాను. ఆ టైంలో పద్మనాభంగారు దేవత సినిమా తీస్తున్నారు. అందులో హీరో రామారావుగారు, హీరోయిన్‌ సావిత్రి. పద్మనాభం పక్కన నన్ను అడిగారు. మా నాన్నను ఒప్పించడంతో కాదనలేకపోయాను. అది నా పెద్ద డ్రాబ్యాక్‌. అక్కడి నుంచి డైవర్షన్‌ మొదలయింది. కొన్ని చిత్రాల్లో వ్యాంప్‌ క్యారెక్టర్‌లు కూడా వేశాను. కామెడీ పాత్రలు చేశాను. దాంతో మంచి పాత్రలకు నన్ను తీసుకోవడం తగ్గిపోయింది.

ఆర్కే : మీకు బాగా బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా  ఉన్నాయా?
గీతాంజలి : చాలా ఉన్నాయి. మా ఆయన చనిపోయినపుడు శోభన్‌బాబు వచ్చారు. గీతాంజలి చాలా జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు సెలయేరులాంటి దానివి. నీకు కష్టమంటే తెలియదు. ఎవ్వరైనా హర్ట్‌ చేస్తే తట్టుకోలేవు. నువ్వు హైదరాబాద్‌ వెళ్లొద్దు అన్నారు. ఏంటి శోభన్‌బాబు గారు అలా అంటారు అనుకున్నాను. కానీ అలానే జరిగింది. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోయాయి. అయినా మీకేంటమ్మా సంపాదించిన డబ్బులు బాగా ఉన్నాయని అనే వారు.

ఆర్కే : బాలనటిగా మేకప్‌ వేసుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలు అవుతోంది. ఎలా అనిపిస్తోంది?
గీతాంజలి : చాలా అద్భుతంగా ఉంది. నేను ఊహించని జీవితం ఇది. మా నాన్న గారికి నేను పెద్ద స్టార్‌ అవ్వాలని కోరిక ఉండేది. ఆయన ప్రోత్సాహం మేరకే నేను నటినయ్యాను.
ఆర్కే : జీవితం మొత్తం సంతృప్తికరంగానే సాగిందా? ఎలాంటి కష్టాలు ఎదురవ్వలేదా?
గీతాంజలి : మాది కాకినాడ. సినిమా అవకాశాల కోసం మద్రాసు వచ్చాక కొద్దికాలం కష్టపడ్డాను. స్వశక్తితో పైకి వచ్చాను. నాలుగైదు సినిమాల్లో చిన్న వేషాలు వేశాను. బి.ఎ.సుబ్బారావు గారి సినిమా రాణీరత్నప్రభలో వెంకటసత్యం గారు ఒక డ్యాన్స్‌ అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో పెద్దయ్యగారు చూశారు. (రామారావుగారిని పెద్దయ్యగారు అని పిలుస్తాను) పెద్దయ్యగారు నన్ను చూసి చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. సీత పాత్రకు సరిగ్గా సరిపోతుంది, అవకాశం ఇద్దాం అని ఆఫీసుకి పిలిపించారు. అప్పటికప్పుడు అగ్రిమెంట్‌ పూర్తయిపోయింది. ఖాళీ సమయాల్లో పెద్దయ్యగారి ఇంట్లోనే ఉండేదాన్ని. ఆయనతో అంత చనువు పెరిగింది. ఆ ఇంట్లో అందరూ నన్ను సీతమ్మ అనే పిలిచేవారు.
ఆర్కే :మీ నాన్న గారు ఏం చేసేవారు?
గీతాంజలి : కాకినాడలో వడ్డీవ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారంలో యాభైవేలు నష్టం వచ్చింది. దాంతో మా అమ్మాయిలు కష్టపడి సంపాదించుకుంటారు. నా కష్టాలను తీరుస్తారు. నాకన్నీ వాళ్లే అని ఎవరినీ అప్పు అడగకుండా మమ్మల్ని తీసుకుని మద్రాసుకు వచ్చేశారు. మా నాన్న ఆశలన్నీ నాపైనే.
ఆర్కే : నీపైనే ఆశలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? మీరు చిన్నప్పటి నుంచే డ్యాన్సులు చేసేవారా?
గీతాంజలి : ఐదేళ్ల నుంచే డ్యాన్సులు చేసే దాన్ని. చదువంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడూ డ్యాన్స్‌ చేసే దాన్ని.
ఆర్కే :మీ అసలు పేరేంటి?
గీతాంజలి : మణి. ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నా పేరు మణి అనే ఉంటుంది. అయితే పారస్‌మణి అనే హిందీ సినిమా కోసం నన్ను తీసుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌ పేరు మణి. కాబట్టి నా పేరు మణి అని ఉండకూడదు అని డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ గారు గీతాంజలి అని మార్చారు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూసే అవకాశం రాలేదు.
ఆర్కే : సినిమా ఇండసీ్ట్రలో గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారేనా?
గీతాంజలి : మా నాన్న తరువాత నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే. వారి పిల్లలు ఎంతో అభిమానం చూపిస్తారు. వాళ్లు చూపించే అభిమానానికి చాలా ముచ్చటేస్తుంది. పెద్దయ్యగారి పిల్లలంతా ఆప్యాయంగా పలకరిస్తారు.
ఆర్కే : రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
గీతాంజలి : పెద్దయ్యగారు వాళ్ల బిడ్డలతో సమానంగా మమ్మల్ని సమానంగా చూశారు. ఆయన మమ్మల్ని సినిమా ఆర్టిస్టులుగా ఎప్పుడూ చూడలేదు. అటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మేం లేకపోతే ఎలా?
ఆర్కే : ఎప్పుడైనా పెద్దయ్యగారు కోప్పడ్డారా?
గీతాంజలి : ఒకరోజు మహావిష్ణువు పాదాలను లక్ష్మీదేవి నొక్కుతున్న సీన్‌ ఉంటుంది. ఆ సమయంలో దేవతలు వచ్చి భూలోకంలో ఉన్న సమస్యల గురించి విన్నవించుకుంటారు. ఆ సమయంలో మహావిష్ణువు దేవీ నువ్వు వెళ్లాలి. భక్తులు కష్టాల్లో ఉన్నారని అంటారు. అందుకు సమాధానంగా నేను ఒక పద్యంలో నా డైలాగ్‌ చెప్పాలి. కానీ ఐదారు టేకులు తిన్నా ఓకే కాలేదు. అప్పుడు పెద్దయ్యగారికి కోపం వచ్చింది. ఏం డైలాగ్‌లు నేర్చుకోలేదా? బాగా నేర్చుకోవాలి అని అన్నారు. అలా అనేసరికి సెట్‌లోనే ఏడ్చేశాను. కానీ ఆ తరువాత ఆయనే నన్ను ప్రోత్సహించి టేక్‌ ఓకే అయ్యేలా చేశారు.
ఆర్కే : అప్పట్లో హీరోయిన్‌కు ఎంత ఇచ్చేవారు?
గీతాంజలి : ఇరవైవేలు ఇచ్చేవారనుకుంటా. సరిగ్గా తెలియదు. డబ్బుల వ్యవహారాలన్నీ నాన్నే చూసుకునే వారు.
ఆర్కే : పద్మనాభం, మీ కాంబినేషన్‌ బాగా హిట్‌ అయింది కదా?
గీతాంజలి : అలా ఏం లేదండి. పద్మనాభంగారిని చూస్తేనే నవ్వొస్తుంది. ఆయన పక్కన నేనెలా సూటవుతానని ఎంపిక చేశారో తెలియదు. నేను సూటవ్వను. కానీ నా చేతుల్లో ఏముంది. నా దురదృష్టం. సినిమాలన్నీ మా కాంబినేషన్‌లోనే వచ్చాయి.
ఆర్కే : అంటే, ఇష్టం లేకపోయినా చేసుకుంటూ వచ్చారా?
గీతాంజలి : చేస్తూ వచ్చాను. ఏం చేయను. ఇతర కమెడియన్లతో చేయలేదు. ఒక్క పద్మనాభంగారితోనే కామెడీ పాత్రలన్నీ వచ్చేవి. ఆయన పదకొండు సినిమాల్లో నేను నటించాను.
ఆర్కే : ఆ సమయంలో మీకు చేయకూడదని అనిపించలేదా? నాన్న గారితో చెప్పలేదా?
గీతాంజలి : చెప్పాను. కానీ ఇల్లుగడవాలి కదా. అందుకోసం చేయక తప్పదనేవారు. ఇల్లాలి సినిమా తరువాత ఎలాంటి సినిమాలు చేయాల్సిందానివి ఎలాంటివి చేస్తున్నావు అని చాలా మంది అడిగేవారు. కానీ అప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇల్లాలు సినిమా రిలీజ్‌ సమయంలోనే వీలునామా సినిమా వచ్చింది. అందులో మోడ్రన్‌ డ్రెస్‌లు, క్లబ్‌ డ్యాన్స్‌లు. రెండు సినిమాలు ఒకే సమయంలోనే రిలీజ్‌. పోస్టర్లు చూసి ఎల్వీ ప్రసాద్‌గారు ఏంటమ్మ ఇది. నీపైన నమ్మకంతో ఇల్లాలు సినిమా చేశాను అని బాధపడ్డారు. నిజానికి వీలునామా ముందుగా ఒప్పుకున్న సినిమా. కానీ రెండు ఒకేసారి విడుదలకొచ్చాయి. అలా జరుగుతుందని ఊహించలేదండీ అని నాన్న వివరణ ఇచ్చుకున్నారు.
ఆర్కే : రామకృష్ణగారితో లవ్‌ఎఫైర్‌ సినిమాలో మాదిరిగా జరిగిపోయిందా?
గీతాంజలి : లవ్‌ఎఫైర్‌ అని అనకండి సార్‌. నేను అందరితో సరదాగా ఉంటాను. కానీ ఎదుటి వాళ్లు దాన్ని వేరేగా ఊహించుకునే వారు. రామకృష్ణతో సినిమాలు చేసే సమయంలో మా నాన్న గారితో కబుర్లు చెప్పేవారు. మా నాన్న గారిని బాగా కాకా పట్టి పెళ్లికి ఒప్పించారు. చాలా మంది మాది లవ్‌ మ్యారేజనే అనుకుంటారు.
ఆర్కే : పెళ్లి తరువాత సినిమాలు ఎందుకు ఒప్పుకోలేదు?
గీతాంజలి : పెళ్లి తరువాత సినిమాలు చేయకూడదనే కండీషన్‌ పెట్టారు. రామకృష్ణతోపాటు మా నాన్న, ఆమ్మ కూడా సినిమాలు వద్దన్నారు. దాంతో మానేశాను. అప్పుడే భానుమతి గారి సినిమాలో ఆఫర్‌ వచ్చింది. ఫోన్‌ చేసి సారీ అమ్మ పెళ్లి కుదిరింది. మా ఇంట్లో వాళ్లు సినిమాలు వద్దంటున్నారు అని చెప్పాను. ఇంట్లో వాళ్ల మాటకు కట్టుబడి సినిమాలు ఒప్పుకోలేదు.
ఆర్కే : సినిమా మానేయమంటున్నారని పెద్దయ్యగారికి చెప్పలేదా?
గీతాంజలి : లేదండీ! అప్పటికే ఆయన హైదరాబాద్‌కి వచ్చేశారు.
ఆర్కే : సినిమాలు మానేయమన్నందుకు మీరేమీ బాధపడలేదా?
గీతాంజలి : చాలా బాధపడ్డాను. అన్నేళ్లు సినిమాలు చేసి మానేయడం కష్టమనిపించింది. 24 గంటల్లో 20 గంటలు సెట్‌లో ఉండేదాన్ని. వాటన్నిటికీ దూరమై ఇంటికి పరిమితం కావడం కష్టమనిపించింది.
ఆర్కే : సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన చాలా మంది చివరి రోజుల్లో తినడానికి తిండిలేక కష్టాలు పడిన సంఘటనలున్నాయి? మరి మీరు ఎలా ప్లాన్‌ చేసుకున్నారు?
గీతాంజలి : ఆర్థిక వ్యవహారాలన్నీ మా నాన్నగారే చూసుకునే వారు. ఆయన ప్లానింగ్‌ మూలంగానే జీవితంలో స్థిరపడినామని చెప్పవచ్చు. మా నాన్న తరువాత రామకృష్ణగారు కూడా అంతే ప్లానింగ్‌తో ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బీరువా తాళాలు తనదగ్గరే పెట్టుకుంటారు. డబ్బులు కావాలని అడిగితే ఇస్తారు. దానధర్మాలు చేస్తారు. కానీ చాలా మందికి తెలియదు. ఆయన ఎప్పుడూ
గతాన్ని మర్చిపోలేదు.
ఆర్కే : రామకృష్ణగారు చనిపోయి ఎంతకాలమయింది?
గీతాంజలి : ఎనిమిదేళ్లవుతోంది. కేన్సర్‌తో చనిపోయారు.
ఆర్కే : మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు?
గీతాంజలి : మూడు, నాలుగు సినిమాల్లో నటించాడు. హీరోగా చేసిన మొదటి సినిమా తగిన పబ్లిసిటీ లేక ఆడలేదు. బ్రేక్‌ కోసం చూస్తున్నాడు. మేం ఇద్దరం కష్టపడి పైకొచ్చాం. మా అబ్బాయి సినిమాల్లో సెటిలయితే మాకు హ్యాపీ.
ఆర్కే : స్వంతంగా ఓ సినిమా తీసి దెబ్బతిన్నట్టున్నారు?
గీతాంజలి : అవునండీ! కన్నడంలో పెద్దహిట్‌ అయిన సినిమా చూసి మీరు తీయాలని పట్టుబట్టాను. దాంతో రామకృష్ణగారు ఒప్పుకున్నారు. రామకృష్ణ, సుజాత హీరోహీరోయిన్లుగా సినిమా మొదలయింది. ప్రారంభోత్సవానికి పెద్దాయనను ఆహ్వానించాం. కానీ మీకెందుకు సినిమా నిర్మాణం అని తిట్టారు. అదేంటి పెద్దాయన అలా అన్నారు అని రామకృష్ణ బాధపడ్డారు. చివరకు పెద్దాయన రాకుండానే సినిమాను పూర్తి చేశాం.
ఆర్కే: పెద్దాయన డిస్కరేజ్‌ చేసినా వినలేదా?
గీతాంజలి : అప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయింది. డేట్స్‌ ఇచ్చేశారు. సబ్జెక్ట్‌ రెడీ అయింది. అంతా ప్లానింగ్‌ అయిపోయింది. దాంతో ఆపలేకపోయాము.
ఆర్కే : 18 ఏళ్ల తరువాత ఇప్పుడు ముఖానికి మళ్లీ ఎందుకు రంగు వేసుకోవాలని అనిపించింది?
గీతాంజలి : నేను వేసుకోవాలని అనుకోలేదు. వాళ్లే వచ్చి అడిగారు.
ఆర్కే : అవకాశం ఎలా వచ్చిందో చెప్పండి?
గీతాంజలి : డైరెక్టర్‌ మదన్‌గారు వచ్చి మీరు నాయనమ్మ క్యారెక్టర్‌ వేయాలని అడిగారు. కోట శ్రీనివాసరావు మీరు కాంబినేషన్‌ అని చెప్పారు. నేను కుదరదంటే కుదరదని చెప్పాను. తల్లి పాత్ర పర్వాలేదు కానీ  మరీ నాయనమ్మ పాత్ర ఏంటయ్యా? అని అన్నాను. లేదు బాగుంటుంది మీరు చూడండి. ఈ పాత్రకు మీరైతేనే సూటవుతారని పట్టుపట్టి ఒప్పించారు. అయితే ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. దాంతో మరో ఇరవై సినిమాల వరకు అవకాశం వచ్చింది.
ఆర్కే : ఈ తరం హీరోయిన్లను చూస్తుంటే ఏమని                పిస్తోంది?
గీతాంజలి : మీకు తెలిసిందే మాకు తెలుసు. ప్రత్యేకంగా నే ను ఏం చెప్పగలను. మేం స్వర్ణయుగంలో గడిపాం. పెద్దలంటే గౌరవం ఉండేది.
ఆర్కే : ఇప్పుడు మీరు హీరోయిన్‌గా ఎంటర్‌ అయితే ఇమిడేవారా?
గీతాంజలి : లేదు. ఈ పరిస్థితుల్లో నా మనస్తత్వానికి ఇమడలేకపోయేదాన్ని.
ఆర్కే : ఇప్పటి తరానికి మీరిచ్చే సలహా ఏంటి?
గీతాంజలి : పెద్దవాళ్లను గౌరవించండి. మంచిగా, కట్టు,బొట్టుతో లక్షణంగా ఉండండి.
ఆర్కే : మీ డబ్బింగ్‌ మీరే చెప్పుకుంటారు కదా? అన్ని భాషలు ఎలా నేర్చుకున్నారు?
గీతాంజలి : తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషల్లో నా డబ్బింగ్‌ నేనే చెప్పుకునేదాన్ని. నేర్చుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే నేను అన్ని భాషలు నేర్చుకోగలిగాను. పాటలు కూడా పాడతాను.
ఆర్కే : మీలో ఉన్న ప్లస్‌ ఏంటి?
గీతాంజలి : ఉన్న దానితో సంతృప్తి చెందుతాను. పెద్ద పెద్ద ఆస్తులు కొనాలని ఉండదు. కష్టపడి పైకి వచ్చాం. హ్యాపీగా ఉన్నాం చాలు అని అనుకుంటాను.
ఆర్కే : మీకు బాగా సంతోషం కలిగించిన సంఘటన ఏంటి?
గీతాంజలి : నేను దేన్నీ సీరియస్‌గా తీసుకోను. సంతోషంగా ఉంటాను. అన్నీ మరిచిపోతాను. ప్రతి సంఘటన నాకు సంతోషాన్ని కలిగించేదే. నావల్ల పది మందికీ సహాయం అందింది. అదే సంతోషం.
ఆర్కే : మీకు మిగిలిపోయిన కోరిక ఏంటి?
గీతాంజలి : మా అబ్బాయి మంచి పొజిషన్‌కు రావాలి. రామకృష్ణ, గీతాంజలి సాధించిన పేరు వాడు సంపాదించుకోవాలి. వాడి భవిష్యత్తు బాగుండాలి. అదే నా కోరిక.
ఆర్కే :  మీ అబ్బాయి మంచి పొజిషన్‌కు రావాలని మేము కోరుకుంటున్నాం. థాంక్యూ గీతాంజలి గారు.

 

Posted in సినిమా | Tagged | Leave a comment

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం-అంటున్న డాక్టర్ వేటూరి ఆనంద మూర్తి

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం! – డా. ఎస్‌కే ఎండీ గౌస్‌ బాషా

Published at: 21-07-2014 12:23 PM

తాళ్లపాక సాహితీపూదోటలో కొత్త కుసుమాల కోసం వెతుకుతున్న నిత్యాన్వేషి, వేటూరి ప్రభాకరశాసి్త్ర గారి కుమారుడు ఆనందమూర్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతిగా 1990లో
పదవీవిరమణ చేసిన ఆయన, తంజావూరులో మూలన పడి మూలుగుతున్న తాళపత్ర గ్రంథాలను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ‘వివిధ’తో పంచుకున్న జ్ఞాపకాలు, పరిశోధన విశేషాలు..

మీరు ఎప్పటి నుంచి తాళ్లపాక వంశస్థులపై పరిశోధనలు చేస్తున్నారు?
చిన్నప్పటి నుంచే తాళ్లపాక వంశస్థులపై అవగాహన, ఆసక్తి వున్నాయి. మాటల్లో ప్రభాకరశాసి్త్ర గారు నిత్యం వీటిని గురించే చెబుతుండేవారు. సాహిత్యశోధన, యోగసాధన, తాళ్లపాక వంశ పరిశోధనల కారణంగా ఆయనలో ఆధ్యాత్మికత మరింత పెరిగింది. తాళపత్రాల్లో, రాగిరేకుల్లో ఆయన చదివిన, తెలుసుకున్న విషయాలను చెబుతుండేవారు. ఆ ప్రభావం నాపై వుంది. నాపదేళ్ల నుంచే తాళ్లపాక వారిపై పరిశోధన చేస్తున్నట్లే లెక్క.

అన్నమయ్యపై వేటూరి ప్రభాకరశాసి్త్రగారి పరిశోధనలు ఎక్కడ ఆగిపోయాయి? మీరెక్కడ నుంచి ప్రారంభించారు?
ఈ ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పాల్సి ఉంటుంది. 1888వ సంవత్సరంలో కృష్ణాజిల్లాలో జన్మించిన శాసి్త్రగారు 1910 లో యిప్పటి చెన్నైలోని ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్ట్‌ లైబ్రరీలో కాపీయిస్టుగా పని చేశారు. అప్పటి నుంచే ఆయన పరిశోధనలను తీవ్రతరం చేశారు. ఎన్నో తాళపత్ర గ్రంథాలను పరిష్కరించి ప్రచురించేందుకు ప్రయత్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పిలుపు మేరకు, తాళ్లపాక వంశ జీవిత పరిశోధనల పై వున్న ఆసక్తితో 1939లో తిరుపతికి మకాం మార్చారు. ఆ తరువాత ఆయన తాళ్లపాక కవుల వాఙ్మయ పరిశోధనపై దృష్టి సారించారు. శాసి్త్రగారి జీవితానికి, తాళ్లపాక వాఙ్మయానికిదొక పెద్ద మలుపు అనే చెప్పుకోవచ్చు. అప్పటికే తాళ్లపాక వారి వాఙ్మయంపై సాధు సుబ్రమణ్యశాసి్త్రగారి కృషితో, పండితులైన వి.  విజయరాఘవాచార్యులు, జి.ఆదినారాయణ పరిష్కరణలో మూడు సంపుటాలు ప్రచురితమయ్యాయి. 1925-35 ప్రాంతంలో ఇది జరిగింది. అన్నమయ్య లఘుకృతులు, శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు వేర్వేరు సంపుటాలుగా ముద్రించారు. అయితే సరైన పరిశోధన జరగకపోవడం, ప్రచురణలో లోపం తదితర కారణాల వల్ల అవి అర్ధంతరంలోనే నిలిచిపోయాయి. దాంతో వాటిని ఎడిట్‌ చేయాలని తితిదే వారు ప్రభాకరశాసి్త్రగారిని కోరారు. అయితే రేకుల మూలంలో ఏముందో తెలుసుకోకుండా ఎడిట్‌ చేయడం సరికాదన్న ఉద్దేశంతో అన్నమయ్యనాటి రాగిరేకులు కావాలని అడిగారు శాసి్త్రగారు. కానీ అవి కనిపిస్తే గా? వెతగ్గా వెతగ్గా ఓ గదిలో కుప్పగా పోసివున్నాయవి. మొత్తం సుమారు 2500 రాగిరేకులు దొరికాయి. మరో 10 రాగిరేకులు కనిపించకుండాపోయాయి. ఇప్పటికీ అవి దొరకలేదు. వాటన్నింటినీ పరిశీలించి, పరిశోధించి విభాగాలుగా గుర్తించి 4వ సం పుటం పీఠికలో శాసి్త్రగారు ప్రకటించారు. అవి అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఆయన కుమారుడు చిన తిరుమలాచార్యులు రాసినవని తేల్చారు. అన్నమయ్య కాలంనాటి రాగిరేకుల మందం వేరు, వాటి బరువు వేరు. ఇక మిగిలిన ఇద్దరి కాలం నాటి రాగిరేకుల మందం వేరు. అంతేగాక అన్నమయ్య నాటి రాగిరేకులకు రంధ్రం ఒకలా, మిగిలిన యిద్దరి రాగిరేకులకు మరో విధంగా వున్నాయి. అంతేనా, వాటిపై సూక్ష్మంగా వారి పేర్లను సూచించే చిహ్నాలూ వున్నాయి. వీటన్నింటినీ పరిశోధించి వేరు చేశారు. మళ్లీ యిందులో శృంగారపరమై న కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలుగా వేరు చేశారు. ఆనక ఎడిట్‌ చేసి 1949లో వాటిని ముద్రించారు. 4వ సంపుటం సగభాగం ఎవరో చేశారు. 5వ సంపుటం మాత్రం పూర్తిగా శాసి్త్రగారి కృషి ఫలితమే. అదేవిధంగా ఆధ్యాత్మిక సంకీర్తనలు కూడా. అన్న మయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరిత్ర’ గ్రంథాన్ని పరిష్కరించి ప్రచురించారు. అప్పటి నుంచే అన్నమయ్య జీవితం, సాహిత్యం, సంకీర్తనలు బాగా వెలుగులోకి వచ్చాయి. అప్పుడే అన్నమయ్య మూర్తి సాక్షాత్కరించింది. తద్వా రా వెంకటేశ్వరుని మహాత్మ్యం కూడా దశదిశలా వ్యాపించింది. మహామహా పండితులకు తప్ప వేరెవ్వరికీ తెలియని అన్న మయ్య, ఆయన సాహిత్యం ఈరోజు సాధారణ ప్రజానీకానికి కూడా బాగా తెలిసొచ్చిందంటే అందుకు ప్రధాన కారణం ప్రభాకరశాసి్త్రగారే. రాగిరేకులపై సంకీర్తనలు లభించాయి. కానీ స్వరా లు లేవు. రాగతాళాలు మాత్రమే తెలియజేశారు. దాంతో విద్వాంసుల చేత వాటిని పాడించేందుకు ప్రయత్నించారు. సంపుటాల్లోని కొన్ని పాటలను తీసి ఒక పుస్తకంగా వేసి గాయకుల చేత పాడించారు. మొట్టమొదట అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభించింది ఆయనే. అప్పట్లో ఒక రోజు చంపక ప్రదక్షిణం వద్ద రెండు రాళ్లు కనిపించాయి ఆయన శిష్యగణానికి. వాటిపై ఏవో అక్షరాలున్నట్లు వారు చెప్పడంతో అక్కడికెళ్లి చూసి, వాటిని తెప్పించుకున్నారాయన. అవి ఇప్పుడు తిరుమల మ్యూజియం వద్ద వున్నాయి. ఆ రాళ్లపై వున్న అక్షరమాలను పరిష్కరించా లనిఆయనెంత తపనపడ్డారో చెప్పలేను. ఏడడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు, తొమ్మిదంగుళాల మందం కలిగి వున్నాయవి. ఒకదానిపై ‘2’ అంకె, మరో దానిపై ‘4’ అంకె వేసి వున్నా యి. రెండవ దానిపై 94 పంక్తులు, నాల్గవ దానిపై వంద పం క్తుల వరకూ వున్నాయి. అవి స్వరంతోటి, సాహిత్యంతోటి కలిసి వున్నాయి. అలా స్వరసాహిత్యాలు కలిసి వున్న ఆ శిలల్లోని సం గీతం బయటకు రాలేదు. వాటిని పరిష్కరించి ప్రకటిస్తామని 1949లో శాసి్త్రగారు చెప్పారు. సంగీత శాసనం బయటకు తెచ్చా రు. కానీ అందులోని సంగీతం బయటకు రాలేదు. అందు కోసం తర్వాత కూడా ప్రయత్నాలు జరిగాయి. అన్నమయ్య సంకీర్తనల్లో 6,7 సంపుటాలకు ఆయనే కాపీ రాయించారు. కానీ అవి ముద్రిం చే లోపే 1950లో పరమపదించారు. అప్పటికి నా వయసు ఇరవయ్యేళ్లు.
ఆ రెండు శాసనాలు అపరిష్కృతంగానే వుండిపోయాయి. నేను ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా, తెలుగు విభాగాధిపతిగా వున్నప్పుడు కూడా ఆ శాసనాల పరిష్కారం కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఆఖరికి 1994లో పురావస్తుశాఖతో కలిసి పని చేశాం. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు కఠోరమైన తపస్సు చేశాం. నాతో పాటు మరో నలుగురు విద్వాంసులు, నిపుణులు కలిసి పనిచేశారు. ఎట్టకేలకు వాటిని పరిష్కరించాం. ఆ కృషి ఫలితమే ‘‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’’ గ్రంథం. దీనిని తితిదే సహకారంతో 1998లో ముద్రించాం. నాన్నగారు సంకల్పించిన పని పూర్తి చేయడానికి 49 ఏళ్లు పట్టింది. ఆ రోజు నాన్నగారు వదిలేసిన దానిని మేం పూర్తి చేశామన్న ఆనందం మాటల్లో చెప్పలేను. ఆ శాసనాల మీద వున్నది ‘సూళాది’ రచనలే. వాటిల్లో దశావతారాలకు సంబంధించిన పది పాటల్ని సీడీ రూపంలోకి తీసుకొచ్చాం.

మీ మాటల్ని బట్టి 20వ శతాబ్దంలో అన్నమాచార్య సారస్వత సాహిత్యమూర్తిత్వం వ్యక్తమైంది సరే! మరి ఆయన సంగీతమూర్తిమత్వం వ్యక్తమవ్వడం ఎలా?
ఇది 21వ శతాబ్దంలో సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. అందుకు ‘‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’’ దోహదపడిందని భావిస్తున్నాను. నిజానికి దీనికి ముడిసరకు తిరుమలలో లేదు. తంజావూరులోని సరస్వతీమహల్‌ లైబ్రరీలో వుంది. నేను అక్కడున్న పెద తిరుమలాచార్యుని స్వరసహితములైన సంగీత ప్రబంధాలను వెలుగులోకి తీసుకొచ్చాను. తంజావూరులోని తాళపత్రాల్ని ఏపీ ప్రభుత్వం మైక్రోఫిల్మ్‌ చేయించింది. వాటిల్లోనే నాకు పెద్ద తిరుమలాచార్యుని స్వరసహిత ఝొంబడ ప్రబంధాలు లభించాయి. సంగీత లక్షణకారులు 24 రకాల ఝోంబడ ప్రబంధాలున్నట్లు రాశారు. కానీ ఉదాహరణలు దొరకలేదు. వారికి ఇంచుక తరువాతి కాలంలో వచ్చిన పెదతిరుమలాచార్యుని ఝోంబడ రచనను నేను విశిష్టంగా గుర్తిస్తున్నా. ఇది 25వ రీతి ఝోంబడంగా భావిస్తున్నా. దానిని ‘శ్రీ వెంకటేశ్వరుని ఝోంబడ ప్రబంధం’ అంటాను నేను. ఇలాంటివెన్నో తంజావూరు లైబ్రరీలో పుంఖానుపుంఖాలుగా వున్నాయి. అవి వెలుగులోకి వచ్చినప్పుడు అన్నమయ్య సంగీతమూర్తిమత్త్వం వ్యక్తమవుతుంది.

అన్నమాచార్య ‘చరిత్ర’లో ఆయనకు సంబంధించిన సమగ్ర సమాచారముందని భావిస్తున్నారా?
లేదు. అందులోనే గ్రంథపాతాలున్నాయి. వాటికై మైనంపాటి వారు, వీఏకే వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నమాచార్యులు, వ్యాసయోగి, వల్లభాచార్యులు ముగ్గురూ సమకాలికులు. అన్నమయ్య జీవితచరిత్ర చిన్నన్న రాసినట్లే తక్కిన ఇద్దరి జీవితాలకు కూడా కావ్య రూపాలు వచ్చాయి. వాటిపై తులనాత్మక పరిశోధన జరగాల్సి వుంది.

అన్నమయ్య ఎక్కడ పుట్టాడో, ఎక్కడ తనువు చాలించాడో మీ పరిశోధనల్లో తేలిందా?
ఆయన మాడుపూరులో పుట్టి, తాళ్లపాకలో కన్ను మూసి వుంటారని భావించవచ్చు. అన్నమయ్య జీవితంపై ఎంతో పరిశోధన చేసిన వీఏకే రంగారావుగారూ ఇదే భావాన్ని ప్రకటించారు.

తిరుపతిలో ప్రభాకరశాసి్త్రగారు నివసించిన నివాసం ఇప్పటికీ వుందా?
తిరుపతిలో రాములవారి ఉత్తరమాడ వీధిలో మేం వుండేవారం. అక్కడే శాసి్త్రగారు తుదిశ్వాస విడిచారు. మేం హైదరాబాద్‌కు మకాం మార్చిన తరువాత ఆ నివాసాన్ని చాలామంది కొనుగోలు చేశారు. ఆ నివాసాన్ని జాతీయ స్మారకమందిరంగా, ప్రదర్శనశాలగా మార్చేందుకు తరువాతి కాలంలో నేను ప్రయత్నించాను. కానీ ఆ యింటిని విడివిడిగా చాలామంది కొనుగోలు చేయడం వల్ల అది సాధ్యం కాలేదు. అయితే అదృష్టవశాత్తు ఆ యింటిలోని ఓ భాగాన్ని ప్రభాకరశాసి్త్ర మిత్రమండలి వారు కొనుగోలు చేశారు. మిత్రమండలి పేరుతోనే రిజిస్టర్‌ అయి వుంది. ఆ ఇంటిని స్మారకమందిరంగా చేయాలనేది నా కోరిక. ప్రభుత్వం తలచుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇక ప్రభాకరశాసి్త్ర జీవిత సన్నివేశాలకు సంబంధించి మొత్తం 15 వీడియోలు తీశాం. కానీ అవీ బయటకు తీసుకురాలేకపోయాం.2012లో శాసి్త్రగారి జన్మస్థలమైన పెదకళ్లేపల్లిలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పుట్టి పెరిగిన నివాసాన్ని లైబ్రరీగా మార్చాలని తితిదే భావించింది. కానీ ఆ యింటి యజమాని దానిని నేలమట్టం చేసేశాడు. దాంతో ఆ ఇంటిని స్మారకమందిరంగా చేయలేకపోయాం. అయితే అక్కడ వేదపాఠశాల పెట్టేందుకు తితిదే ప్రయత్నిస్తోంది. ఆ వూరు సంగీతజ్ఞాని సుసర్ల దక్షిణామూర్తి గారి జన్మస్థలం కూడా కాబట్టి అక్కడ సంగీత పాఠశాల పెట్టేందుకు కూడా తితిదే ప్రయత్నిస్తోంది. ఇతర కవుల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రభాకరశాసి్త్రగారి పేరుతో కూడా నిర్వహిస్తే బావుంటుంది. మేం ఏర్పాటు చేసిన ట్రస్టును తితిదేకే అప్పగించాం. అందువల్ల తితిదే వారే వాటిగురించి చర్యలు తీసుకుంటే బావుంటుంది.

భవిష్యత్తులో దేనిపై పరిశోధనలు చేయబోతున్నారు?
ముందే చెప్పినట్లు అన్నమయ్య సంగీత సారస్వతం వెల్లడి కావాల్సి వుంది. తంజావూరు లైబ్రరీలోని తాళపత్రాలు దానికి మంచి ఆధారమవుతాయి. అక్కడ మనం ఎవ్వరం చూడని, ఎప్పుడూ చదవని చరితను చెప్పే వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటి దుమ్ము దులిపిన రోజున అన్నమయ్య సంగీత సరస్వతి బయల్పడుతుంది. దానికోసం శక్తి మేరకు ప్రయత్నం చేస్తా. మద్రాస్‌ యూనివర్శిటీలోని ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్ట్‌ లైబ్రరీలో కూడా చాలా తాళపత్ర గ్రంథాలున్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని భాషల వారీగా, ప్రాంతాల వారీగా చూడకుండా జాతి సంపదగా ప్రభుత్వాలు భావిస్తే అవి భద్రంగా వుంటాయి. కానీ ఆ నమ్మకం కనిపించడం లేదు.

ఇంటర్వ్యూ :

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’

హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాన్యులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు తమ కేంద్రం ఆధ్వర్యం లో ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవ సందర్భం గా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు అనువాద కవితలను ‘’శబ్ద శిఖరాలు ‘’పేరిట ముద్రించి నాకు ఒక కాపి ని పంపగా ఈనెల పదిహేడున అందింది .దాన్ని నిన్న అంటే ఇరవయ్యవ తేదీ న చదివేశాను .ఇలా జాతీయ కవి సమ్మెళన కవితల్ని ఆకాశ వాణి పుస్తకం గా ముద్రించటం ఇదే ప్రధమం .ఈ పూనిక ,ఆలోచన ,శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి వచ్చినందుకు బహుదా అభినంద నీయులు .నాకు తెలిసి నంత వరకు జాతీయ కవి సమ్మెళన.తెలుగు అనువాద కవితలను శ్రీ సాగి కమలాకర శర్మ గారు తమ ‘’మూసీ ‘’మాస పత్రిక లో ,ప్రతిఏడాది ఫిబ్రవరి సంచికలో ప్రచురించే వారు .ఇప్పుడిది  ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రానికి దక్కింది .కొత్త గా ఆలోచించటం నవ్య మార్గాలను పాత విధానాలపై నిర్మించిటం,అనుక్షణ పరిశోధన ల  లో ఆయన అందె వేసిన చెయ్యి .సంగీత సాహిత్య సంపన్నులైన వారి కీర్తి కిరీటం లో ఇది కలికితురాయి .నా మీద ఉన్న ప్రత్యెక అభిమానం తో నాకు పంపినందుకు వారికి కృతజ్ఞతలు అంద జేస్తూ ఇందులోని విశేషాలను ‘’కవితా ‘’శబ్ద శిఖరాలు ‘’శీర్షిక తో మీకు అందజేస్తున్నాను .

 

 

 

 

 

2014గణ తంత్ర దినోత్సవ జాతీయ కవి సమ్మేళనం హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి ఆధ్వర్యం లో హైదరాబాద్ లో జనవరి తొమ్మిదవ తేదీ బాగ్ లింగం పల్లి లోని ఏ.పి ఎస్.ఆర్ .టి.సి.కళా భవనం లో జరిగింది .22 భారతీయ భాషలకు చెందిన వివిధ కవులు సమర్పించిన కవితలను 22మంది కవులు హిందీలోకి అనువాదం చేయగా ,సుప్రసిద్ధులైన 22 మంది తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు .మొత్తం 66మంది కవీశ్వరుల భువన విజయం లాంటి ఈ బృహత్తర కార్య క్రమాన్ని  మాన్యులు శ్రీ మంగళ గిరి వారి చొరవ సాహసం అంకిత భావం తో దిగ్విజయం గా నిర్వహించి ఢిల్లీ అధికారులను మెప్పించటమే కాక స్థానికులు ,సాహిత్యాభిమానులు అశేషం గా విచ్చేసి కవితా సోయగాలకు మురిసి అభినందించారు .సాహసం చొరవ ,దీక్ష ,ఆలోచన ,ఆచరణలో అద్వితీయులైన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధతకు నిదర్శనం గా ఈ కవి సమ్మేళనం న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగిందని వార్తా మాధ్యమాలు బహుదా ప్రశంశా వర్షం కురిపించాయి .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఇ .ఎస్. ఎల్.నరసింహన్ ,సభాధ్యక్షులుగా ఆలిండియా రేడియో న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ .వెంకటేశ్వర్లు వేదికను సుసంపన్నం చేయగా ,చెన్నై ఆలిండియా రేడియో అడిషనల్ డైరెక్టర్ శ్రీ కే.పి. శ్రీనివాసన్ శుభాకాంక్షలు తెలిపారు .హైదరాబాద్ ఆకాశ వాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు  ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ప్రస్తావన చేసి శోభ తెచ్చి ఆ కాంక్షను వివరించారు .’’ఇది అత్యంత అరుదైన కార్యక్రమమని ‘’న భూతో గా ‘’నిర్వహించిన హైదరాబాద్ కేంద్రం ,నిర్వాహకులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సమర్ధ బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు ‘’అని ఆనందం గా చెప్పారు శ్రీ  వెంకటేశ్వర్లు .ప్రసంగం కొనసాగిస్తూ ‘’మానవీయ విలువలను ఒక తరం నుండి మరో తరానికి అందించే అద్భుత సాధనం సాహిత్యం అని ,భిన్నత్వం లో ఏకత్వాన్ని ప్రశంసిస్తూ ,సమాకాలీన సామాజిక సమస్యలకు సున్నితం గా స్పందిస్తూ హృదయ స్పర్శిగా ఉన్న ప్రతి కవితా ఖండికా చీకట్లను పార దోలే చిరు దీప కళిక అన్నారు .మొట్టమొదటి సారిగా జాతీయ కవి సమ్మేళనం వేదిక పై ప్రాంతీయ భాషాను వాదాలు అంటే’’ మన తెలుగు’’ అనువాదాలు సమర్పించటం అద్భుత ప్రయత్నమని ,వీటిని పుస్తక రూపం లో తీసుకు రావటం అభినంద నీయమని దీనికి ప్రేక్షకుల స్పందన అత్యద్భుతం గా ఉండటం కొనియాడ దగిన విషయమనీ అన్నారు .శ్రీ శ్రీనివాస్ ‘’జాతీయ సమైక్య వేదిక పై ,భాషాఐక్యత ,సామరస్యం వెళ్లి విరిశాయి.పరస్పర అవగాహనకు తోడ్పడింది .’’అని కీర్తించారు .

శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ తమ ప్రస్తావనలో ‘’ఈ రోజు ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర చరిత్రలోనే కాకుండా ,దేశ వ్యాప్తం గా ఉన్న ఆకాశ వాణి వ్యవస్థలోనే ఒక అపూర్వ ఘట్టం అని ,సాధారణం గా ఆతీయ కవి సమ్మేళనాలు ఉత్తర హిందూ దేశ ఆకాశ వాణి కేంద్రాలలో నిర్వహించటం ఆన వాయితీ గా వస్తోందని ,అక్కడ హిందీ అనువాదాలకే స్తానం ఉండేదిని ,ఈ వేదిక పై తెలుగు అనువాదాలకు చోటు కల్పించమని డైరెక్టర్ జనరల్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని కోరిన వెంటనే అనుమతించటం మరువ రాని అనుభూతి అని ,గవర్నర్ గారు అన్నిటిలో దిట్ట అని వారి రాక అందరికి ఆనంద దాయకమని జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ సి నారాయణ రెడ్డి గారు సభా ప్రారంభాకులుగా విచ్చేయటం సభా గౌరవాని ఇనుమ డింప జేసిందని ,తమ సిబ్బంది అహరహం కష్టించి దీన్ని దిగ్విజయం చేశారని ,పని దినం లో నిర్వ హించిన ఈ కవి సమ్మేళనానికి అనూహ్యం గా  యువత ,రసజ్న ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోహాజరవటం చిరస్మరణీయం ‘’అని  ఆనడాను భూతులతో   కృతజ్ఞతలు తెలియ జేశారు .

మొదటి కవిత ‘’కేదార విలయ తాండవం ‘’ప్రో .జి ఎస్.ఆర్ కృష్ణ మూర్తి సంస్క్రుత కవితకు డా..తాడేపల్లి పతంజలి గారి తెలుగు అనువాదం .ఛందో గర్భితమైన పద్యాలివి .ఎందరినో పొట్ట పెట్టుకున్న కేదార నాద్ వరద భీభత్సం దీనికి నేపధ్యం .కంటిముందే తండ్రి తల్లి అన్నా చెల్లీ అందరూ ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయి విగత జీవులై పోతుంటే గుండెలు పిందించే దృశ్యాన్ని కవులిద్దరూ భావ గర్భితం గా దృశ్యమానం చేశారు .’’నట్టింటిలో ప్రాణముల్ అల్లల్లాడేది వేల వారి తుది వాన్చాకార మేమౌనోకో “”అని బాధ పడ్డారు .శివుడికి ఆశుతోషుడు అనే పేరుంది .అంటే సుఖాలను ఇచ్చేవాడు కాని ఇక్కడ దుఖాన్ని కలిగించాడు .’’వేల్పుల దేవర యాశుతోషుకున్ కేలిది మొక్కినంశివుడు కీడును గోడును ఆప లేదు ‘’అని వ్యధ చెందాడుకవి .’’వికారాళ భీకర విద్యుల్లతా దంస్ట్రాo కురమ్ములముల దండ దాల్చే ‘’పద్యం విలయ తాండవానికి  శాబ్దిక  స్వరూపమే .ఈ కవిత సమకాలీన స్పృహకు నిదర్శనం

‘’వ్యాఖ్యాన రహితం ‘’కవితను డా కరబిదేక హజారికా అస్సామీ భాషలో రాస్తే డా.దేవరాజు మహారాజు తెలుగు సేత చేశారు .’’కొన్ని సంబంధాలకు పేర్లు ఉండవని ,కొన్ని వర్దిల్లటానికి ఇల్లు కూడా ఉండవని ,అలా నగర మంతా చుట్టి గోధూళి లో వెనుదిరుగుతారని ఎండు టాకుల పరుపుల మీద మేనువాల్చి సంకల్పం సంశయం ,నిస్సహాయాల భూమికల్ని మరుసటి రోజు కోసం చుట్టిపెడతారని’’ అన్నారు .’కొందరు ఎలాంటి వారంటే ‘’వాళ్ళను చూస్తూనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి –వాళ్ళకు గుక్కెడు   నీళ్ళిచ్చే  వారుండరు .వేల వేల సంబంధాల విచిత్ర సమ్మేళనం ఇది .అయినా వారి పేరు ఏ పట్టిక లోను ఉండదు ‘’అని అనామకుల గురించి ఆవేదన చెందుతాడు కవి .కాని ఒక హెచ్చరిక మాత్రం చేస్తాడు ‘’అస్తిరమైన క్షణాలపై నిఘా పెడుతూ –దూరం నుంచి కాలం చూస్తూ ఉంటుంది ‘’ జాగ్రత్త కోసం హితవు తో కూడిన హెచ్చ్చరిక ఇది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-14-ఉయ్యూరు

 

Posted in రేడియో లో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

పిబరే కృష్ణ .ర.సం.-6(చివరి భాగం )

అలా కొండలు బండల వెంబటి తిరుగుతున్న మనకు మరో మోసగాడు ఎడురౌతాడు .చీటీలు కట్టమని పెద్దయ్యను అడిగితె చీదరించిపోమ్మంటే ,ఆయన అటు పోంగానేభార్య నారాయనమ్మను బుట్టలో వేసి డబ్బు దొబ్బి ‘’నీ యట్ల పెద్దమ్మల్ని దద్దమ్మలని ఇబుటికి ఎందర్ని సూసిం ట్ని’’అని  మనసులో అనుకోని ఉడాయిన్చాడొకడు ‘’నింగి నిజాము ,దొంగ యాసము ‘’కత లో .వ్యవసాయం దండగ కాదు పండగ అని ‘’రైతు కళాచారం ‘’(సంస్కృతీ )లో పొలం పనులు అందరూకలిసి కట్టుగా చేసుకోవటం ,ఆ ఫలితాన్నీ హుషారుగా పంచుకోవటం లో ఉన్న సంతృప్తిని వ్యక్తం చేసే కధ .నీతితి పుస్తకాలు గీత పుస్తకాలకంటే ‘’నేల ఉనికి నాకు బాగా తెలుసు నాయునికి ఈ నేల మన్నని దాన్నిన్కనే నాకు మన్ను పైన ఇష్టం .మన్ను పని ఇంగా ఇష్టం .ప్రపంచానికే అన్నం పెట్టె ఈ అన్న పూర్ణమ్మ బిడ్డను నేను .మీ బిడ్డను కాలేను .మీరు పొండా’’అని గదిరిన నేల పుత్రుని ఆరాధన .రైతు కళాచారం .శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు .ఉన్నదంతా పోగొట్టుకుని తిండికి లేక ఏదో బతుకు తెరువు దారి చూపించమని ఒక ‘’తెలివప్ప’’ను అడిగితె వాడు హోసూరు కొండపైకి తీసుకెళ్ళి చెత్తలో పడి ఉండే దిష్టి బొమ్మ బయటికి తీసి ,ఎండి కుళ్ళి పడున్న నిమ్మకాయలు ఏరి ఒక వేప కొమ్మకు దిష్టి బొమ్మ తగిలించి వేప చెట్టుమీద దిష్టి దేవుడున్నాడని తానూ కొండా కింది వాళ్ళదగ్గర ప్రచారం చేస్తానని జనం వచ్చి మొక్కు తీర్చుకునేట్లు  చేస్తానని నిమ్మకాయల్ని వాళ్ళ చుట్టూ తిప్పి  దిష్టి పోయిన్దని చెప్పమని బోధిస్తాడు .ఇంతకంటే వాళ్ళేమీ చేసి చావలేరని ఊహిస్తాడు .ఊళ్ళో ప్రచారం బాగా జరిగి జనం రావటం నిమ్మకాయల దిష్టి తీయటం పెద్ద ప్రహసనం గా తయారై పోయింది .మనిషికి రూపాయి ఫీజు .పదేళ్ళయినా తర్వాత తెలివప్ప వచ్చి చూశాడు .తన కళ్ళను నమ్మలేక పోయాడు .అక్కడ ఒక గుడి వెలిసింది .జనం సముద్రం లావచ్చి వెడుతున్నారు .దిష్టికి పది రూపాయల రేటు పెరిగింది .దంపతులు తెలివప్పను గుర్తించి అంతా ఆయన చలవే నన్నారు .దిష్టి కోసం పదేక రాల నిమ్మ తోట పెంచానని దిష్టి బొమ్మల ఫాక్టరీ పెట్టానని ,మంచి ఇల్లు కట్టుకున్నామని చెప్పి మర్యాద చేసి రెండు నిమ్మకాయలు దిష్టితీశారు ఆయనకు .’’ అమంత్రము నాకే ఏసిరి ‘’అని తెలివప్ప తెలివి తప్పి పడిపోయాడు .దేశం లోని వెర్రి వెంగలప్పల స్వభావికి నిజ రూపమే ఇది .

అమ్మా కావాలి ఆలీ కావాలి యెట్లా?కొడుక్కు సంకటం వచ్చింది .గోడ  ఉపాయం చెప్పింది .’’మీ అమ్మ అలిగితే దానిమాటలు పట్టుకుంటావా? నేను నీ బిడ్డ నమ్మా అను .అమ్మ అర్ధం చేసుకుంటుంది .నీ భార్య అలిగితే ‘’మీ అమ్మ తిట్టిన్దనుకో .నేను అందర్లా అమ్మ కొడుకుని కాను నేను నా పెండ్లాము దాసుడిని అను సర్దుకు పోతుంది’’ అని’’ అమ్మా ఆలీ’’ తగువు తీర్చింది గోడ .ఇంతేనా దీనికే తానూ ఇదైపోవాలా అనుకోని ఆ వెర్రి పీనుగు నాటకాలు సురూ చేశాడు ఇద్దర్నీ మెప్పించాడు .ఇంతే కద .గోడకు మొర పెట్టుకోమంటారు సామెత గా .అదే ఇక్కడ నిజమైంది .’’కష్టపడే వాళ్లకు కావలైతే నేమి బీడు అయితే నేమి ‘’అని యదార్ధాన్ని చెప్పిన కథ ‘’ఓణీ సేను ‘’ఇంట్లో డబ్బుకు కట  కట .చేను అమ్మితే కాని పరిష్కారం కాదు .భార్య కు పుట్టింటారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం (ఓణీ సేను )అమ్మాడు. తరువాత వరస పెట్టి అన్నీ అమ్ముకోవాల్సోచ్చింది .చిన్నకొడుక్కి రాయి రప్పా ఉన్న చేను వచ్చింది .భార్యతో కస్టపడి అంతా చదును చేసి సాగు చేస్తే బంగారప్పంట పండింది .పంట కోయటానికి అమ్మనోచ్చి పూజ చేయమని కోరాడు .’’బంగారు పండే బూముల్ని అమ్మి నిన్ను ఆ కావలిలా కష్ట పడే మాద్రి సేస్తిని .నేనొచ్చి యేమని పూజ సేస్తును సిన్నా ‘’అని ఏడ్చింది తల్లి .మర్నాడు అందరూ చేలోకి వెళ్ళారు .పినతండ్రి పంటను చూసి కుశాలయ్యాడు ‘’ఓణీ సేను ని మించి పంట పండిం డావే .కొడుకంటే వీడమ్మా ‘’అని బుజం తట్టి తల్లినీ మెచ్చుకోనేట్లు చేశాడు .

 

మనం తినే కూడును కూడా మిషన్ల లాగా తిన కూడదు పండ్లను ఉపయోగించి నవలాలి అని చెప్పేదే  ‘’గువ్వల్ని సూసి నేర్వాల ‘’కత .ఇక్కడి వారికి మబ్బూ దేవుడే పొద్దూ దేవుడే .మనకి కూడా అంతే కదా .ఒక పెళ్ళాం  మొగుడిని పక్కింటి గౌడు ను చూసి భయమూ భక్తీ నేర్చుకోమంటుంది .గౌడు పొద్దున్నే లేచి ఆవులకు మేతేసి కడిగి దణ్ణం పెడతాడు సూర్యుడికి నమస్కరిస్తాడు .సాములోల్లలా గౌడు లా ఉండాలే  మనుష్యులని భార్య భావం కొన్నేళ్ళకు సాములోల్లకు గౌడుకు పెద్ద తగాదా అయింది .కొడుకు తనకు పుట్టలేదని గౌడు ఇంట్లోంచి వాణ్ని గేట్టేసాడు నువ్వు చచ్చావు అని కూతురికి పిండం పెట్టారు .అప్పుడు భర్త ‘’ఏమే వాళ్ళ మాదిరిగా నన్ను ఉండమాన్నావా “అని అడిగితె నెత్తీ నోరు కొట్టుకొని తప్పు తెలుసుకుని ‘’మీరు ఇట్లే ఉండండ ‘’అని ఆప్యాయం గా బువ్వ వడ్డించిన భార్యా భర్తల కథ ఏ ‘’అంతా పుంగు మొకానికి రంగు ‘’.బాహ్యాడంబరాలు కాదు మనసు కావాలి అని తెలియ చెప్పే కధ..పాత తరం మాటలు అర్ధం కాక తల్లికేదో పెద్ద జబ్బు అని డాక్టర్ వసంత దగ్గరకు తీసుకొస్తే ఆమె మాటల్లో అర్ధం గ్రహించి జబ్బు కాదు డబ్బు దాచిన మనేద అని ముక్క దొబ్బులు పెట్టిన ‘’అంశంకి ‘’కద.జీవితం అర్ధం పరమార్ధం ‘’జీవించటమే ‘’అనే నీతి ,ఒక సాములోరు ఊళ్లోకి వచ్చి సుద్దులు చెబుతుంటే ఒక అవ్వశ్రీరామునికాలం లోనే శంబూకుడు రాముడిని ఎలా ఎదిరించాడని అడిగితె సామి ‘’ఈ ముండకి ఇసయం ఎలా తెలిసే ‘’నని ఆశ్చర్య పోతాడు .అర్జునిడికంటే ఏకలవ్యుడు గొప్ప విలుకాడైనా విలువ నివ్వని శాస్త్రాలను కడిగేసింది అవ్వా .’’మీరు ఒగ నాదన్నా మా ఇండ్లల్లా సెయి కదిగిండారా/’’అని నిలేస్తే అవాక్కయ్యాడు సాములోరు .శాస్త్రాలను దుల్లి సేస్తే చెదలు కూడా మిమ్మల్ని ముట్టవు ‘’అని శాపనార్ధాలు పెట్టాడు .కోపం తారస్తాయికి చేరిన అవ్వ ‘’సేదల్లా  (చెదలు )పుట్టి సేదల్లా పెరిగే వాళ్ళం మేము .మమ్మల్ని చెదలు ముట్టవా ?మీ సేమడాలు ఒలిసి సెప్పులు కుట్టునాని .మీరే అమ్మకి అబ్బకీ కాకుండా అగ్గికి పుట్టినోళ్ళ మాద్రి అగ్గిలా కాలి బూడిదవుతారు .మీ బూడిదని సేదలు బొంగులా కూడా పెట్టుకోవు ‘’అని ఝాడించి పారేసింది అవ్వ .’’’ఎట్లేట్లా ‘’అనే చివరి కద లో

ఇవన్నీ జీవితాన్ని పరచిన కథలే .చదివే ఓపిక ఉండాలి కాని అన్నీ భారత భాగవత రామాయణాలు చెప్పే నీతి  కధలే .భూమిని నమ్ముకున్న వారి కతలే .చెట్టూ పుట్టాకధలే. వాటి నిస్వార్ధాన్ని విడమర్చే వే .క్రుతజ్ఞాతకు పట్టం కట్టేవే .మనో మాలిన్యాన్ని ఊడ్చిపారేసేవే .డాక్టర్ వసంత్ ప్రతిదాన్ని సాన పట్టి చిత్రిక పట్టి మెరుగులు తీర్చినట్లున్న కధలే .దీనికోసం ఆయన పడిన తపన ,శ్రమ అందరూ మెచ్చాల్సిందే చదివి తీరాల్సిందే .పెద్దాయన శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’రచయితా వైద్యుడు కా బట్టి ఆయన వ్రుత్తి నైపుణ్యాన్ని అంతా ఈ కతల్లో నిమ్పిరి .కొన్ని తావులలో చేదు మందులు మింగిస్తారు .కొన్ని తావులలో చురుక్కుమని సూదితో పొడుస్తారు .కొన్ని తావులలో గాయ పడిన మనసుకి మెల్లగా మలాము పూసి మెత్తటి కట్టు కడతారు .కతలంతా ఈ గుణాలను నింపి మన ముందు వడ్డించిరి వసంత్’’అని మనస్పూర్తిగా చెప్పిన మాటలు చదివిన వాళ్లకు పచ్చి నిజాలని పిస్తాయి .ఈ పుస్తకం లో వసంత్ఎన్నో సామెతల ఆమెతలు గుది గుచ్చి సందర్భాన్ని బట్టి వాడాడు .పల్లె ప్రజ మాట్లాడే బూతులూ రాశాడు .అది నేటివిటి అని వదిలేయచ్చుమనం. ఏ ప్రాంతం లో నైనా జీవ భాష లో రాస్తున్నప్పుడు అవి  దొర్లి వచ్చి కూర్చున్డటం సహజం .వాటిని పంటి కింద రాళ్ళు అనుకోనక్కర్లేదు .ఇప్పుడు సామేతాల వైభోగం చూద్దాం

ముత్తయిదుల తావ ముండకేం పని?,సారాయి సోర్గము సేద్యము నరకము రామ సేంద్రా ,తిత్తిరి బిడ్డను కంటే ఎలకెత్తుకుని పోయి ఎంనులా పెట్టె నంట ,సింత లేని సివంగి సంత కోక బిడ్డను కనింది ,motuku pula vana 001 vendi moyillu 001

చివరగా వాళ్ళ భాషలోనే ‘’మీరంతా ఈ రెండు పోత్తాలు సదు ఉండ్రి.కతలు ఇనుకొండ్రి.అందులోని సారాంశం అర్తము సేసుకోనాకి  రాండా  బేగి రాండా’’అని పిలుస్తూఇది అధిక్షేపణ కాదని మనవి చేస్తూ  కృష్ణ రసం ను పానం  చేయ  వలసినది గా కోరుతు సెలవ్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-5

పిబరే కృష్ణ .ర.సం.-5

‘’ మోతుకు పూల వాన’’ లో తడిశాం కదా ఇప్పుడు’’ వెండి మబ్బుల్లో ‘’విహరించి  ‘’బండ బతుకులకు’’ చూసి సాను భూతి ప్రకటిద్దాం .డాక్టర్ శ్రీ   యెన్ .వసంత్ –‘’అగరం వసంత్ ‘’అనే మారు పేరుతో రాసిన 54కదల సమాహారమే పై శీర్షిక .వ్రుత్తి రీత్యా డాక్టర్ అయినా వసంత్ ప్రవ్రుత్తి రీత్యా సాహిత్య కారుడు .నాడి పట్టుకొని రోగ నిదానం చేసి చికిత్స చేసినట్లు ,చూపులతో లోకాన్ని ఆరసి ,లోపాలను కని పెట్టి సాహితీ చికిత్స చేయగల పరేంగితావ గాహి .ఎందరి హృదయాలలోనో పరకాయ ప్రవేశం గా దూరి వారి ఆంతర్యాన్ని వెలువరించిన హృదయ పరిశీలకుడు .హోసూరు ప్రాంత కొండా కోనా ,చెట్టూ పుట్టా వివరాలేరిగిన .వాడుబండ బతుకుల ఆంతర్యం తెలిసిన వాడు .జబ్బును డబ్బు జబ్బునూ కనిపెత్తటగాలాడు .న్యాయం గా ఆయన భాష సంస్కార వంతమైనది .కాని మట్టిని నమ్మిన వాడు .అందులో బతుకుతున్న వాడు .మరి ఆ భాష లో రాస్తే నే అది చరితార్ధమౌతుందని నమ్మి ,తన ప్రాంతం వారు మాట్లాడే భాషను విని తెలుసుకొని అధ్యయనం చేసి అలవర్చుకుని ఆ భాషను సంపన్నం చేయటానికే రాశాడు .ఈ పుస్తకానికి  శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘’పత్రికల తెలుగు అద్దాల అరల్లో అందాల బొమ్మ అయితే తావు (నేటివ్)తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ .తెలుగు తల్లి కనిన గారాల బిడ్డ మా హోసూరు తెలుగు ‘’అంటూ రాసిన  ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు సత్యాలే .కొంచెం ఓపికతో చదవటం ప్రారంభిస్తే వదల లేము .ఇవన్నీ పూర్తిగా కదా కృతిలో లేక పోవచ్చు గల్పిక మాదిరీ ఉండచ్చు .కాని చదివించే కండ గల కతలు .ఇందులోని ముఖ్య విషయాలే మీ ముందుంచుతున్నాను .

హోసూరు లాంటి చలవ ప్రాంతాల్లో తెల్ల జొన్నలు ,ఏడాకుల జొన్నలు తింటే ఉడుకు పుట్టి ఆరోగ్యానికి మంచిది .ఆనపకాయలు అంటే సోరకాయల్ని ఉడకేసుకుని తింటే ఒంటికి మంచిది .సంక్రాంతికి ,కజ్జాయలపండక్కి  (దీపావళి  )తప్పక సొరకాయలు ఉడకేసి తినాలి .దొంగ సాములోరు దేవుడినే దొంగిలించే కద ‘గవి గుట్ట ‘’.కడుపు లో నులి పురుగులు పడి బడికుర్రాడేడుస్తుంటే వాణ్ని నానా అల్లరి పెట్టి ‘’జగిని లోడు ‘’అని నిక్ నేం పెట్టి న సావాసగాళ్ళ భరతం పట్టింది బడిలోనే వాళ్ళమ్మ –కైవారం తాతగారి పాట ‘’తోక పురుగులు మూడు పాళ్ళు నిండి ఉంది నీచు నీళ్ళు ‘’పాడి బుద్ధి చెప్పింది ‘’జగిని గోడు ‘’అంటే నులిపురుగులున్నవాడు .అని అర్ధం .బియ్యం మరలో మోసాన్ని బయటపెట్టాదొక రైతుకొడుకు పాలేరు చేయని సాహసం చేసి దొబ్బిన బియ్యాన్ని తిరిగిపొండాడు ఆ మూటను వాడి పెద్దమ్మకిస్తే వాడి ‘’ఆపెకారానికి ‘’అంటే ఆపేక్షకు మురిసిపోయింది .కడుపులో పురుగులు పడకండా అపుడపుడు బెది మందుగా బెది నూనె అంటే ఆముదం తాగించటం ఇంకా అక్కడ ఉంది .మనకు అవుట్ ఆఫ్ ఫేషన్ అయింది .

చేను పక్కల వాళ్ళు దొంగతనం గా గోడల మేత కోసుకోవటం గొడ్లను మేపటం సాధారణం గా జరిగేదే .దొరికితే దొంగ దొరక్క పొతే దొర .పక్క చేలో మేస్తోంది గా మనకేం అని ఏ రైతైనా అనుకుంటే రేపు వాడి చేలో మేయ్యవని గ్యారంటీ లేదు అందుకే ఒక రైతు పక్క చేలల్లో పడిన పక్కూరి ఆవుల మందను బయటికి తోలి ఊరందరి మెప్ప్పు పొందాడు .జండా పార్టీ ఓళ్ళు అంటే నక్స లైట్లు గ్గ్రామాల్లో వేలుగుతెద్దామనుకొంటే గ్రామస్తులు పాత దోరణిలోనే సాగటం వాళ్లకు విసుగు తెప్పించింది .చేను పక్క కల్లు కాచి తాగుబోతులకు పోసి వీరంగం సృష్టిస్తుంటే తెలివైన రైతు ఆ కల్లు కుళ్ళిన అరటిపళ్ళూ కుక్క తలకాయ తో కాచారని ప్రచారం చేసి వారిని హడల కొట్టి అక్కడ దుకాణం లేకుండా  చేశాడు పాక పీకెట్లు చేశాడు .అపాయానికి ఉపాయం ఉన్న వాడే తెలివైన వాడు జొన్న చేలల్లో ఆవులు దొంగతనం గా పది మేస్తుంటే ఒక యజమాని బామ్మర్ది వాటికి జొన్న కంకుల్లో గుండు సూదులు గుచ్చ్చాడు అవి తిని ఆవులు చచ్చిపోయాయి .ఈ పాపం తనదే నని భావించి ఆ రోజు నుంచి కొంత మేత కోసి గట్టు మీద పడేసి కావాల్సిన వాళ్ళు తీసుకుని పోయేట్లు చేశాడు ఆసామి .మేతలు లేని వాళ్ళు హాయిగా తీసుకెళ్ళి మేపుకుంటున్నారు .సోషలిజం అంటే ఇంతకంటే ఎక్కడుంది స్వామీ?

ఆ ఊళ్ళో కాపులకు .మాల వాళ్లకు  బ్రాహ్మలకు విడి విడిగా బావులున్నాయి .ఒకరి నూతినీరు ఇంకొరు తాగరు .బావులు తవ్వేటప్పుడు మొట్టమొదట నీళ్ళ రుచి చూసినవాడు తాత .ఏదో మాటల సందర్భం గా ఈ మాట బయట పెట్టాడు తాత .’’అయితే ఈ ఊర్లా మూడు బాయిల్నీ ముందర ఎంగిలి సేసింది నువ్వేనా తాతా ‘’అని నవ్వాడు  బాపన కుర్రాడు .అందరూ నవ్వుకున్నారు .అంతే బాపనోళ్ళ బాయి ఎంగిలైందని మూసేసి బోరు వేసేసుకున్నారు మర్నాడే .అప్పుడు తాత ‘’మనుషులు మారి నట్లున్దారుకాని వాళ్ళ మనసులు మారలేదురా .ఆళ్ళ పిల్లోడు ఇని ఆల్లకు సేప్పింటాడు .అందుకే ఇంతపని సేస్తిరి ‘’అన్నాడు తాత మనవడితో .

ఆ ఊళ్ళో వీరుల గుడి ఉంది .అక్కడికెళ్ళి మొక్కితే వీరత్వం తన్నుకోస్తుందని నమ్మకం .ఆ గుడిలో నిధి ఉందని దొంగలు తవ్వటం ఒక కుర్రాడు అనుకోకుండా చూసి గుడిలో దణ్ణం పెట్టుకొని వీరత్వం విజ్రుమ్భించి వాళ్ళని చితక బాది తోలేశాడు .అప్పటి నుంచి వాడిని ‘’వీర గాడు ‘’అన్నారు .కన్నడ వాగ్గేయ కారుడు పురందరదాసు చెప్పాడని ఒక పకీరు సాయిబుల పండక్కి వచ్చిన అందరి విస్తళ్లలో ఉమ్మేస్తున్నాడు .అందులో నే భోజనాలు వద్దిన్చుకుని  మహా  ప్రసాదం గా తింటున్నారందరూ .రచయిత ఇలా చేయటం బాగాలేదన్నాడు .అప్పుడు పకీరు పురందరదాసు చెప్పిందే తానూ ఫాలో అవుతున్నానని చెప్పి కావాలంటే పెద్దవాళ్ళను కనుక్కోమన్నాడు ఒక పెద్దాయన ‘’తురు కరు కరిదరే ఉన్నబహుదన్నా-తురుకరు  వెంజలు అతి పుణ్యవయ ‘’అని చదివాడు .ఇది విన్న రచయిత పగల బడి నవ్వాడు అసలు అర్ధం తెలీకుండా ఇంతకాలం మూఢం గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని గ్రాహించాడు  లోతు విచారించి అందరికి అందులోని గూడార్ధం వివరించాడు .ఒక సారి ఒక తురక రాజు  పురందర దాసుకు ఎదురై  తురకల మీద ఒక పాటకాని పద్యం కాని చెప్పమన్నాడు .చెప్పక పొతే నరికేస్తానని బెదిరించాడు .అప్పుడు చెప్పిన పద్యం ఇది .ఇందులో రెండు రకాల అర్ధాలున్నాయి .మొదటిది –తురకలు పిలిస్తే భోజనానికి వెళ్ళాలి .వాళ్ళ ఎంగిలి చాలా పుణ్యం అని .రెందోఅర్ధం ఆవుదూడ పిండితే లేక పాలు ఇస్తే తినోచ్చు  తాగొచ్చు .ఆవుదూడ ఎంగిలి మహా పుణ్యం మొత్తం మీద ఆవుపాలు తాగొచ్చు ఆవు దూడ ఎంగిలి మహా పుణ్యం అని .అర్ధం .తురక రాజు దాసుగారు తన్ను పొగిడాడు అనుకోని ఆయనకు మొక్కి వెళ్ళిపోయాడు ఆ రాజులాగే ఈ పకీరు ,పకీరులాగే మూర్ఖ జనాలు ప్రవర్తించారని బుద్ధి చెప్పాడు .అందరూ దూ దూ అని ఉమ్మేస్తూ వెళ్ళిపోయారు .ఇలాంటిపకీర్లను చూసే హోసూరు ప్రాంతాపు తత్వ వేత్త ,కవి, బోధకుడు,అందరికి ఆరాధ నీయుడు  స్వర్గీయ కైవారం తాత గారు ‘’లలాట శూన్యము ,కంట కుల్లావి ,మెడ నిండా దారాలు ,మణి పూసలుకొన్ని ,ఒడ్డు పొడుగునా పెద్ద గడ్డాలు పెంచుక లుంగీ కట్టుకుని గంజాయి పొగ దీసి అల్లా నెరుగని కల్ల కాజీ పకీరుల్లారా ‘’అని యెగతాళి చేశాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కధలు దొరక్క పోవట మే దర్శకుడు నాగి రెడ్డి సమస్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కొదమ పల్లె లో ఓ వెన్నెల రాత్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి

రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి

Published at: 20-07-2014 03:31 AM

మనపై గౌరవం తగ్గేందుకు కారణం మనమే
గౌరవం డిమాండ్‌ చేస్తే రాదు.. ప్రజలు ఇవ్వాలి
గెలిచే వరకే పార్టీలు.. తర్వాత అందరి కోసం పనిచేయండి
ప్రజాప్రతినిధుల అవగాహన తరగతుల్లో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

హైదరాబాద్‌, జులై 19(ఆంధ్రజ్యోతి): ‘గరుడ పక్షి… రాబందు రెండూ ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతాయి. రెండూ పక్షి జాతికి చెందినవే. కానీ గరుడ పక్షికి మనం ఇచ్చే గౌరవం ఎక్కువ. అది దేవుడి వాహనం. రాబందుకు ఆ గౌరవం లేదు. అది మృత కళేబరాల్లో మిగిలిపోయిన మాంసం కోసం తిరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నిత్యం మననం చేసుకోవాలి. మనం గరుడ పక్షిలా ఉండాలా.. లేక రాబందులా మిగిలిపోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ప్రజల కోసం పనిచేసేవారికి గరుడ పక్షిలా ప్రజల మనన్న దక్కుతుంది. ప్రజల మీద బతికేవారిని రాబందుల్లా చీదరించుకుంటారు. లక్షల మందిలో మీకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి’ అని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక్కడ నిర్వహిస్తున్న అవగాహన తరగతుల్లో భాగంగా శనివారం ఆమె ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాప్రతినిధులకు ఇటీవలి కాలంలో ఎందుకు గౌరవం తగ్గుతోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వేసిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పారు.

’దానికి కారణం మనమే. గౌరవం డిమాండ్‌ చేసి తెచ్చుకొనేది కాదు. ప్రజలు వారంతట వారు ఇవ్వాలి. మీలాగా నేనూ రాజకీయవేత్తనే. నా నియోజకవర్గానికి మీలో ఎవరైనా వెళ్లి నేను తప్పు చేశానని విమర్శిస్తే చాలా మంది ప్రజలు ఖండిస్తారు. నాపై వారిలో ఉన్న సదభిప్రాయానికి అది నిదర్శనం. అందుకే నేను నా నియోజకవర్గంలో 8 సార్లు గెలిచాను. మీరూ ఆ స్థాయికి ఎదగాలి. మెజారిటీ నేతలు ఇలా ఉంటే తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది’ అన్నారు. ప్రజల ముందు గొప్పగా కనిపించాలని తాపత్రయపడవద్దు. మీరు గొప్పవారని ప్రజలు అనుకోవాలని సుమిత్రా మహాజన్‌ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ప్రజలు మీకు ఎంత ఇచ్చారో వారికి అంతకు రెట్టింపు ఇవ్వండి. అప్పుడు మీరు మంచి నాయకులు, మంచి ప్రజా ప్రతినిధులు అవుతారు’ అని వివరించారు.

గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు పార్టీలను పక్కనపెట్టాలి. అందరి మనిషిగా ఎదగాలి.. అలాగే ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ‘నేనూ రాజకీయవేత్తనే. నా వద్దకు నాకు ఓటు వేసినవారు…వేయనివారు ఇద్దరూ వస్తారు. అందరినీ ఒకేలా అక్కునచేర్చుకుంటా. 360 డిగ్రీల కోణం అంటే మొత్తం చుట్టూ చూడటం. ప్రజాప్రతినిధి పనితీరు ఆ రకంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన సుమిత్ర అందరికీ ధన్యవాదాలు అంటూ తెలుగులో ముగించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ఈ సమావేశంలో ప్రసంగిస్తూ మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్రను గుర్తు చేసుకొన్నారు. ఏపీ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి జ్ఞాపక శక్తి తనను ఆశ్చర్యపరిచిందని, 1984లో ఢిల్లీలో తాను ఏ నెంబర్‌ ఇంటిలో.. ఏ రోడ్డులో ఉన్నానో ఆయన చెప్పారని.. ఆ విషయం తనకే గుర్తు లేదని ఆమె వ్యాఖ్యానించారు. అతిథులకు మెమొంటోలు బహుకరించే సమయంలో ఆమె తన కోసం ఎంపిక చేసిన నెమలి బొమ్మను కాదని వెంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న జ్ఞాపికను అడిగి తీసుకొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ. ర.సం -3

పిబరే కృష్ణ. ర.సం -3

పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ  చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు అందరికి మాలిమయింది .నల్లావు పొట్ల గిట్టలా దగ్గరకు చేరనివ్వటం లేదు. ఇంటిల్లి పాదీ దాన్ని చూసి భయపడుతున్నారు .మేత నీళ్ళు  పెట్టటానికీ  భయమే .బుసలు కొడుతుంది .తెల్లావు దూడను పెట్టి మరీ కుటుంబానికి దగ్గరయింది .నల్లావును వదిలించుకోవాలని పెద్దాయన ప్లాను .రెండు ఆవులుల్ని తీసుకుని  నల్లావునమ్మి తెల్లావు జతకు ఇంకోదాన్ని తెచ్చుకుందామని సంతకు వెళ్ళాడు .ఒంటి ఆవును కొనం అని  బేరగాళ్ళు అందరూ అన్నారు .గత్యంతరం లేక ఇష్టం లేక పోయినా   నల్లావుతో బాటు తెల్లావునూ  అమ్మాల్సోచ్చింది .తెల్లావు ‘’అంబా అంబా ‘’అని కన్నీరు కారుస్తూ కొన్నవాడితో వెళ్ళింది .వాళ్ళ యదలనిండా అబ్బుకున్న మబ్బు వాళ్ళకన్నా ముందే వాళ్ళ ఊరు పోయి తబ్బుకొని ఉంది .ఇంటికి చేరేసరికి ‘’అరవై నాళ్లుగా అలక్కుండా ఇడి సేసిన పొయ్యి గడ్డ మాదిరి గా ఉంది మా ఊరు ‘’అంటాడు యజమాని దుఖం తో .యజమాని తల్లి కొడుకును ‘’బొమ్మలు ఆడించే వాడు పై నున్నాడు ఆయప్ప యెట్లా ఆడిస్తే అట్లాంటా ఆడాలప్పా ‘’అని ఓదార్చింది .’’దానిని అమ్మినబుడు అది నన్ను సూసిన సూపును మరిసేకి కాదమ్మో ‘’అని కన్నీరు ధారగా కార్చాడు .పేగు గ బంధం కన్నా గొడ్డు బంధం బలీయమైనట్లని పించింది .మూడు రోజులతర్వాత తెల్లావు ఎలా బయట పడిందో సరాసరి ఇంటికొచ్చేసి సావిట్లో నుంచుంది .’’యెంత గాపకమే మా మీద కూతురా .ఇన్ని మైళ్ళు ఎట్లోస్తివి కూతురా ‘’అని ఆప్యాయం గా తెల్లావును కావలించుకొని ఆనందం తో కన్నీరు కార్చాడు యజమాని .ఆవు గాయాలకు మందు రాసి కట్టు కట్టి మేత వేశాడు ఆప్యాయం గా .తెల్లావును కొన్న ఆసామికి వాళ్ళ కాసులు వాళ్లకి మర్నాడు సంతలో ఇప్పించేశాడు ఋణం ఉంచుకోకుండా .చాలా ఏళ్ళు తెల్లావు కామ దేనువులా ఇంట్లో లక్ష్మీ దేవిలా వెలిగి బిడ్డల్ని కని  చనిపోయింది .చేలో గుంత తవ్వి గౌరవం గా కృతజ్ఞతగా పూడ్చేశారు .సంక్రాంతికి తీసిన తెల్లావు ఫోటో ను ఫ్రేం కట్టించి ఇంట్లో దాచుకున్నారు .అదీ అనుబంధం రక్త బంధం కంటే బలీయమైంది .చెప్పిన విధానం బాగుంది .

పల్లె టూరి వాళ్ళు గొర్రెల మాదిరి అనుకోని నలుగురు బయటి వాళ్ళు వచ్చి ఆయిలింజన్లకు లోనిస్తోంది ప్రభుత్వం అని చెప్పి అందర్నీ ఒక చోట చేర్చి ఒక్కొక్కరి దగ్గర అరవై రూపాయలు వసూలు చేసి ,పంగనామాలు పెట్టి డబ్బుతో హోటల్లో హాయిగా మెక్కు తుంటే సప్లైయర్  ‘’ఈలల కేవుల్లో సరైన గొర్రెలు సిక్కి పోయిరి .ఇంగోక నెల నాల్లన్నా మసాల్దోసేలు తినిందే తినింది’’అని నవ్వుకుంటాడని ‘’ఆ నలుగురు ‘’కద చెప్పి  ముగించారు శ్రీ జూజు వాడిజయరాం .

అతన్నేవరో స్నేహితుడినని చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి హోటల్లో కాఫీ తగించి బిల్లు కట్టేసి ,సెల్ నంబర్ ఇమ్మంటే నాలుగు రోజుల కిందటే చేశాగా ఆనంబర్ కే చెయ్యి అని చెప్పి చెయ్యిచ్చి ఇంతలో అతనికి ఫోన్ వస్తే ఆందోళన గా మాట్లాడి వాళ్ళ బావకు సీరియస్ అని చెప్పి ఆటో ఎక్కి వెళ్లి పోయిన వాడెవడో అసలు గుర్తుకే రాని స్తితిలో ఉన్నాడు ‘’ఆతడేవడో “’కద లో రచయిత శ్రీ తాడేపల్లి శ్రీనివాస ప్రసాద్ .

హోసూరు సాహితీ పితామహుడు శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘తెలుగు తావు ‘’కత లో భాషాభిమానం లేని వారందర్నీ ఉతికి ఆరేసి దెయ్యాల్ని చేసి చెట్లకు వేలాడ దీశాడు .హోసూరు సాహితీ క్షేత్రం లో రెడ్డి గారొక దొడ్డ రచయిత .స్పూర్తి ,ప్రేరణ ,పెద్దన్న .తెలుగు ప్ప్రేతాలకు అరవ ,కన్నడ ప్రేతాలు నిలవ టానికి నీడ కూడా ఇవ్వట్లేదని నర్మ గర్భం గా తెలుగు వారికి తమిళ కన్నడ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయాన్ని అన్యాప దేశం గా చెప్పిన సరదా దెయ్యాల కద.తెలుగు మాటలు మర్చి పోయి ఆంగ్ల పదాల వ్యామోహం లో పడ్డ వారని చురుకైన వ్యంగ్య కొరడాలతో దెబ్బ తీశాడు పెద్ద రెడ్డి గారు .

ఉబ్బు లింగాలు ఎలా బోల్తాపడి దెబ్బతిని సర్వస్వం కోల్పోతారో వ్యసనం యెంత దుస్తితి కల్గిస్తుందో  చెప్పేశ్రీమతి యెన్ సురేఖ రాసిన  నీతి కద ‘’యసనం ‘’.హనుమంత రావు కు పొగడ్తలంటే ఇష్టం పొగిడితే యెంత పనైనా చేస్తాడు .ఎంతైనా ఖర్చూ చేస్తాడు .డ్రామా పిచ్చి కూడా ఉంది.డబ్బు  పెట్టి నాటకాలాడించి ,మద్రాస్ వెళ్లి సినిమా తీయాలని ఉన్న దంతా ఊడ్చిపారేశాడు .పెండ్లాం తీరూ అంతే ‘’అల్పునికి అధికార మిస్తే అర్ధ రేతిరి గొడుగు పట్ట మనే టైపు .మొగుడు ఆమె పేర పెట్టిన ఆస్తి నంతా అమ్మి పుట్టినింటి వారికీ  కట్ట బెట్టింది .వాళ్ళు పనికిమాలిన ప్లాటు ఒకటి ఆవిడకు కొని మిగాతాదంటే నొక్కేశారు బొక్కేశారు .ఆవిడా మొగుణ్ణి వదిలి పట్నం చేరింది .ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మొతగా ఉన్న హనుమంతం చివరికి చిప్ప  చేతికొచ్చి అడుక్కు తింటూ బతికాడు .ఈ కద తన పిల్లలకు చెప్పిందో ఇల్లాలు .పిల్లలు తెలివిగా ‘’హనుమంతప్పను ఇంట్లో వొళ్ళు బయటోళ్ళుఇడిసేశారు మంచోల్లుగా ఉండటానికి ఇదా ఫలితం ?’’అని అడిగారు .దానికామె ‘’హనుమంతప్ప మంచోడు అయినందుకు సేడిపోలేదు యాసనాల జోలికి పోయి సేడిపోయాడు ,మంచిగానే మనం ఉండాల’’అని సందేహాన్ని తీర్చింది .

చిన్న తనం లో పిల్లలు ఆడే చిన్న అబద్ధాలను ,తప్పించుకోటానికి వేసే ఎత్తు గడలను అవి బెడిసి కొడితే వచ్చే అపాయాన్ని ‘’సావన బెలుగు సామి ‘’(శ్రావణ బెలగోళ స్వామి )కధలో శ్రీ నా వేం అశ్వద్ధ రెడ్డి సరదాగా పిల్లల మనస్తత్వాన్నిఆవిష్క రిస్తూ చెప్పాడు .సినిమా హాల్లో కి అబద్ధం ఆడి వెళ్లీ  లాగూ చొక్కా కూడా విప్పెయించి కొట్టిన దెబ్బలకు బెంబేలెత్తి పోయాడోక పిల్లాడు  .వాడి  ఉనికి తెలుసుకున్న అత్తయ్య ,అత్త కూతురు వచ్చి దిగంబరం గా దిశ మొలతో ఉన్న వాడిని ‘’యేమిరా సావన బెలుగు సామి నిలిసి నట్లా నిలిసుండావు’’అంటున్న అమ్మలక్కలను కసిరి ఇంట్లోంచి ఒక చెడ్డీ తెప్పించి మేనల్లుడికి తొడిగించి మానం కాపాడింది అత్త .వాడి ఇంటికి తీసుకు పోయి’’రే తరకల నా బట్టా!నీపైన ఎతబెట్టుకుని నిన్నట్నింకా  ఒగ కడి కవళ మైనా ముట్ట లేదురా ఈల్లిద్దరూ ‘’అంది అత్త .అమ్మంటే అప్పుడే విలువ తెలిసింది వాడికి .ఆవిడ కూడా కొడుకును పొదివి పట్టుకుని ‘’ఏలమ్మా నా కొడుకు నట్లా ఏడిపిస్తావు ‘’అని అత్తను కసిరి వాడికళ్ళు’’ ఉజ్జీ ‘’ తబ్బు కొనింది వాని యమ్మ .చిన్న కధలో ఎన్నో భావోద్వేగాలు ఆప్యాయత ప్రేమ ,ఆదరణ ,బుద్ధి చెప్పటం దార్లో పెట్టటం అన్నీ కల బోసిన కత .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం -4.

పిబరే కృష్ణ .ర.సం -4.

శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న  రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత  పెంచాడు .రెందోకొడుకు మీద   ఆశ పెట్టుకున్నాడు. వాడికి చదవు అబ్బలేదు .కానిచిత్తూరు లో ’’ గుడ్డ లంగడి’’పెట్టి అనుభవం లేక అప్పులు చేసి తలెత్తుకు తిరగ లేకుండా చేశాడు .తన చిన్నప్పుడు తండ్రి  చేసేదిలేక కూరగాయల గంప నెత్తి  కెత్తుకొని సంతలో కంటే ఇంటింటికీ తిరిగి అమ్మితే డబ్బు లేక్కువోస్తాయని  తిరుగుతున్నాడు .దీన్ని చూడ లేక పోయాడు  చిన్నాడు .ఆ మాటే అమ్మతో అన్నాడు ‘’ఇంకొన్నాళ్ళు మనకీ అగసాట్లు తప్పవు .అన్న సదివి ఉద్యోగం రాగానే ఈ ఇక్కట్లుండవు ‘’అని సముదాయించింది .అప్పుడు కడుపు లో తిండి లేకుండానే తల్లీ తండ్రి పొలం పనులు చేసుకొంటూనే ఉన్నారు .

ఇవన్నీ ఫ్లాష్ బాక్ లాచిన్నకోడుక్కు గుర్తుకొచ్చి ‘’కస్టపడే వాళ్లకు కడ కన్నా సుకం దొరకతా దంటారు .మా నాయనకు కడా వరకు అగసాట్లే మిగిలినాయి .మా బతుకులు సిన్గారించాలని ఆయన బతుకును ఎండ బెట్టుకున్నాడు .ఆయన నెత్తిన పెట్టుకుని మోసి మోసి అమ్మింది కూరగాయలూ ,కూరాకులూ కాదు –ఆయన నెత్తుర్నీ చమట నూ అమ్మి నలుగురు బిడ్డలా కడుపు నింపాడు .ఆ నెత్తురూ ,ఆ చమటే మా అన్న చేతిలో బడి పుస్తకమైంది .అవే మా అక్కోల్ల మెడలో తాళి బొట్టయింది .అవే చిత్తూర్లో నా పేరిట గుడ్డ లంగడి అయింది ‘’అని నిర్వేదం చెందుతాడు .ఇప్పుడు ‘’సంపారిస్తా ‘’(సంపాదిస్తా)నెమ్మది గానే ఉన్నాడు .నాయన్ని కడుపు కింత ముద్ద పెట్టి చూసుకో గలడు.అయితే’’ ఆ ముద్ద తినేకి నాయన లేడిప్పుడు’’ అని దుఖిస్తాడు .గుడ్డల యాపారం లో తానూ అంతా పోగొట్టుకున్నందుకు తన్ను చూసి వేదన పడిపడి’’లక్క వాయి ‘’కొట్టి అపుడే తీరిపోయినాడు . కొడుకుగా తండ్రి రుణాన్ని తానేట్లా తీర్చుకో గలను ?అంటూ వేదనకు గురైనాడు .

ఇందులో ప్రతి మాట అర్ధ వంతం గా రాశాడు రచయిత .అంతా జీవిత అనుభవ సారమే .పేదోళ్ళ నిరాశా నిస్ప్రుహలె .కదా కధనం లో మంచి పట్టు సాధించాడు ‘’పూతల పట్టు ‘’.

పల్లె టూరి సింగిల్ టీచర్  బడి భాగోతమే ‘’కోడి గుడ్ల మేస్టరు’’.అయ్యవారు ఇస్కూల్ కి రాగానే కాళ్ళు బల్ల మీద పెట్టి కుర్చీలో హాయిగా గుర్రెట్టి పడుకుంటాడు .’’ఇంట్లో వాళ్ళ రావిడి పడలేక ‘’బడి కోస్తాడు గురూ గారు .పిల్లలూ దేవాన్తకులే మేస్టారి ని బురిడీ కొట్టించే ఘనులే .చదువు చెబితే మాత్రం గోడకు సున్నం అతికి నట్లు మనస్సులో నాటుకు పోతుంది .చెప్పాలిగా .సందేహం వచ్చి నిద్ర లేపి అడిగితే ‘’చిత్రాన్నమూ బెల్టు బువ్వా’’ తిని పిస్తాడు .అంటే వాయిన్చేస్తాడన్న మాట .మేస్తురికి కోడి గుడ్లు లంచం ఇస్తే ఇంకేమక్కర్లేదు. అందుకే ఆయన ‘’కోడి గుడ్లు మాస్తురు ‘’అయ్యాడు .కొట్టకుండా ఉండాలంటే కోడి గుడ్డు చదివిన్చాల్సిందే అయ్యవారికి అదే లంచం ఆయనకు .త్రిక సంధి సూత్రం తెలియదని విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేసిన మేనక లా ఒకమ్మాయి అడిగితే ,ఆమె పుస్తకం లోని చిన్నయ సూరి సూత్రం చదివింది .చిర్రున కోపం వచ్చింది మేస్టారికి ‘’ఆంధ్రా వాళ్లకి ఏమీ ‘’పంగ ‘’లేదు .అట్లా మాటల్లో రాయక పొతే అందరికి తెలిసేట్లు తెలుగు లో రాస్తే ఏమి ?’’అని విసుక్కుని తన పద్ధతిలో తేట తెల్లం గా ‘’అ ,ఈ ,ఏ లను మూండ్లు అంటారు .మూండ్ల మీది ఒంటి హల్లు జంట హల్లుగా మారుతుంది .జంట హల్లు అయినప్పుడు ముందరి పొడవచ్చు పోట్టిదవుతుంది .నేను పాటము రాసింటే ఇట్లే రాసి ఉందును .తెలుగు చిన్నోల్లకు నోళ్ళు తిరగని మాటలతో పుస్తకాలు నింపేసి చదువుమంటే యట్లా ?పాట మంటే యెట్లుం డాల.మేస్తురు చెప్పక పోయినా చదివితే చాలు తానుగా తెలిసి పోవాల ‘’అని పాటం తో బాటు గొప్ప హితవూ చెప్పాడు అయ్యవారు .అయ్య వారికి కొడుగుడ్డు నజరానా ఇస్తే గబుక్కున గోడకు కొట్టి సోనంతా నోట్లో పోసుకుని గుటుక్కున మింగుతాడు .కదా రచయిత శ్రీ రాజన్న గారి శ్రీకాంత్ .సరదా గా ఉన్నా యదార్ధానికి ఆయువు పట్టు ఉన్న కథ .

శ్రీ మతి రామక్క గారి సుమ రాసిన ‘’సమసి పోయిన తాళి బొట్టు ‘’లో తల్లి తాళి బొట్టు తూటు పడి ,నల్ల పూసలు మాసిపోయి యెర్ర గుండ్లు సమసిపోయి కనిపించాయి ఆడపిల్లలకు. అదే వాళ్ళు చూడటం మొదటిసారి. అయ్యో అని ఏడుస్తున్నారు ‘’బిడ్డలో బిడ్డలో అని అంతా బిడ్డలకే చేసి పెట్టి ,తన కోసం ఇంతైనా యోచన చేయకుండా బతికేస్తోంది ‘’తల్లి అని తెలుసుకున్నారు .దుఖాన్ని ఆపుకో లేక పోతుంటే ఆయమ్మ ‘’అయ్యో కోతి బిడ్డల్లారా ఎందుకే అట్లా ఏడుస్తారు .ఇది మా అత్తకి వాళ్లత్త యేసిన తాళి బొట్టు .నా పెండ్లపుడు మెరుగు పెట్టించి వేసిరి .అందుకే పాతదయి సమసి పోయింది .ఏడ వద్దు కల కుండా ఉండండి ‘అని ఓదార్చింది ఆ దొడ్డ ఇల్లాలు కూతుళ్ళను .కొత్త తాళి బొట్టు తెచ్చి పెడతానని పెద్దకోడుకన్నాడు .’’వద్దు కొడకా .ఈ బంగారును ఏమైనా ఎత్తుకు పోతానా .రాజమ్మ కొడుకులు చేసి నట్లు చేయకుండా ఊళ్ళో నామర్యాద ఊరోళ్ల ముందర నిలబెట్టండి కొడకా అంతే చాలు ‘’అని అడ్డు చెప్పింది .తల్లిపై గౌరవం పిల్లలపై ఆపేక్షా ఏదీ కావాలనుకొని పెద్దరికం ,మర్యాద బతుకు కోసం తపన మనకు కని  పిస్తాయి .ఒక కూతురు తాళి బొట్టును పసుపు దారానికి కూర్చి అమ్మ మేడలో వేయగా  సంతృప్తి పడ్డారందరూ .గుండెలోతులను తడిమే కద.

చివరికద  ‘’కృష్ణ రసం ‘’ కు స్పూర్తి ప్రదాత ,సారధి సచివుడు ,నేస్తం ,ప్రేరణ ’ప్రళయ కావేరి ‘’వంటి అద్భుత జీవిత వాస్తవ కధలను రాసిన శ్రీ సా వేం .రమేష్ రాసిన ‘’ఎందుండి వస్తీవి తుమ్మెదా “’.ఇందులో  కొడుకు వస్తాడని అందరికి చెబుతూ ఎదురు చూస్తా,వాడేదో కాగితం రాసినట్లు చెబుతూ ,వెతుక్కుంటూ ,వాడిరాకను ఈమె వాయిదాలు వేస్తూ వాడు  రాక పోవటాన్ని జీర్ణించుకోలేక తాగుడు కు అలవాటు పడి దమ్ము కొడుతూ’’ఎందుండి వస్తీవి తుమ్మెదా ‘’పాట పాడుకుంటూ  బిచ్చ గత్తే లాగాతిరుగుతూ పెట్టింది తింటూ బతికే ఒక ముసిలి కద..రచయిత కనపడ్డ ప్పుడల్లా ‘’కొడుకా నువ్వే నా కొడుకువి ‘’ అనేది .ఆమె చనిపోయిన సంగతి చాలా కాలానికి తెలుసుకున్న రచయిత అవాక్కయ్యాడు .

ఇలా ‘’మోతు(దు)కు పూల వాన ‘’కదా గుచ్చం ఆద్యంతం అలరిస్తుంది .ఆ పూల వాన లో తడిసి ముద్దవుతాం గుండెలను తట్టుతుంది .మనసును ఆలోచింప జేస్తుంది .కలవర పెడుతుంది .సాను భూతి చూపిస్తుంది .ఇవన్నీ హోసూరు ప్రాంత నిసర్గ భాషా సౌందర్యానికి వన్నె చిన్నేలే .వారి కతలే ,వెతలే ,మట్టి గుబాళిం పులే .ఇందులో వాడిన కొన్ని మాటల కు అర్ధాలు తెలుసుకుని ఆ భాషా మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం . కృష్ణ రసాన్ని పానం  చేద్దాం .

మొయిలు –మబ్బు ,బానము –ఆకాశం ,మీజు –ఈత ,మచ్చు –కత్తి,కొర –మంచు ,మొరము –చేట ,ఆనె రాళ్ళు –వడగళ్ళు  ,బూబమ్మ పురుగులు –సీతా కోక చిలకలు ,తలవరు –పంచాయితీ ప్రెసిడెంట్ ,శాన బోగుడు –కరణం,కారే దారుడు –మునసబు ,దిట్టము –పధకము ,చేపలుకి –సెల్ ఫోన్ ,పోల్లరి –టైలర్,అరిది –చోద్యం ,సమసిపోవు –అరిగి పోవు .

దీని తర్వాత శ్రీ అగరం వసంత్ రాసిన ‘’వెండి మొయిళ్ళు –బండ బతుకులు ‘’కదా సంపుటి లోని కదా వివరాలు తెలియ జేస్తాను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆ హీరో” నాగయ్య” గారి I జీవితమే సందేశం

ఆ హీరో జీవితమే సందేశం

  • 06/07/2014
  • |

  • -బుద్దా మురళి

పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే మా పేదోళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే అంటూ ఆ ముసలి తండ్రి ఆయసంతో దగ్గుతూ డైలాగులు చెబుతాడు. మనసులేని ఇలాంటి వాళ్లను ఎంత బతిమిలాడినా వారు కరగరు నాన్నా వాళ్లకు మనుషులు, మానవత్వం కన్నా డబ్బే ముఖ్యం అంటూ పేదింటి అమ్మాయి తన వంతు డైలాగులు వినిపిస్తుంది. చివరకు ఆ పెద్దింటి ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. మనిషికి కావలసింది డబ్బు కాదు, మనను ప్రేమించే మనుషులు అని తెలుసుకున్నాను, నా కళ్లు తెరిపించారు అంటూ ఆ పెద్దింటాయన వారిద్దరి పెళ్లి జరిపిస్తాడు. చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమిది. డబ్బు ముఖ్యం కాదు అని ఎన్ని సినిమాల్లో ఎంత మంది రచయితలు ఎన్ని పాత్రలతో చెప్పించినా అది నిజం కాదు. డబ్బు అన్నీ సమకూర్చకపోవచ్చు కానీ ఏది కావాలన్నా డబ్బు కావలసిందే. డబ్బు లేకుండా దొరికేవి కొన్ని ఉండొచ్చు కానీ చాలా అవసరాలకు మాత్రం డబ్బు కావలసిందే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కాకపోవచ్చు కానీ చాలా సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బుకు ఏమాత్రం విలువ లేదని చాటి చెప్పే సినిమా ను తీయాలన్నా బోలెడు డబ్బు కావాలి. డబ్బుకు విలువ లేదని డైలాగులు రాసే రచయిత డబ్బు కోసమే ఆ పని చేస్తాడు. డబ్బు ముట్టిన తరువాతే హీరో ఆ డైలాగులు చెబుతాడు…. డబ్బుచెల్లించి సినిమా చూసే మనలాంటి సగటు ప్రేక్షకుడు మాత్రం జీవితంలో డబ్బుకు విలువ లేదని ఎంత చక్కగా చెప్పారు అని ఆలోచిస్తూ ఖాళీ అయిన జేబులతో దియోటర్ నుంచి ఇంటికి వెళ్లాలి. అన్నింటికీ డబ్బు కావలసిందే. మనిషికి డబ్బు జబ్బు ప్రమాదకరమే కావచ్చు కానీ డబ్బు లేకుండా జబ్బులు వస్తే మనిషి జీవితం మహా ప్రమాదంలో పడ్డట్టే.
సినిమా కథల్లో డబ్బు విలువ గురించి చాలా తక్కువగా చెప్పినా చాలా మంది సినిమా వాళ్ల వాస్తవ జీవితాలు డబ్బు విలువను చాటి చెప్పే విధంగా ఉంటాయి. నా జీవితమే నా సందేశం అంటూ మహాత్మాగాంధీ తన ఆత్మకథ రాసుకున్నారు. ఒక రకంగా చిత్తూరు నాగయ్య జీవితానికి సైతం ఈ ట్యాగ్ బాగా సరిపోతుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన తొలి సూపర్ స్టార్. అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడు. 1948 అంటే మహామహానటులే నెలకు మూడు వందలు నాలుగు వందల రూపాయల జీతంతో సినిమాల్లో నటించిన కాలం అది. ఆ సమయంలో చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా? సరిగ్గా లక్ష రూపాయలు. అంటే ఆ కాలంలో ఒక సినిమాకు చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషికంతో మద్రాసులోనో, హైదరాబాద్‌లోనూ కొన్ని వందల ఎకరాల భూములు వచ్చేవి. చిత్తూరు నాగయ్య అదే చేసి ఉంటే ఇప్పుడాయన ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యేది. అలా చేయలేదు కాబట్టి స్వయంగా ఆయనే చివరి దశలో అపాత్రదానం చేయవద్దు. నా జీవితం మీకు ఒక పాఠం కావాలి అని హితవు పలికారు తప్ప తన పరిస్థితికి ఎవరినీ నిందించలేదు. 1948లో లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న ఆ మహానటుడు. అవసాన దశలో 1970 ప్రాంతంలో కేవలం కడుపు నింపుకోవడానికి వందల రూపాయల పారితోషికానికి సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేస్తూ, అద్దె ఇంటిలో నివసించారు. ఇప్పటి హీరోలు విలన్ల కన్నా ఎక్కువ బీభత్సం సృష్టిస్తున్నారు. చిత్తూరు నాగయ్య హీరోగా వచ్చిన కాలంలో అన్ని సాధు పాత్రలే… ఆ పాత్రల ప్రభావం సినిమా షూటింగ్ వరకే ఉంటే బాగుండేది. కానీ ఆయన జీవితంపై సైతం ప్రభావం చూపించాయి. పోతన పాత్రలో జీవించిన ఆయన ఆయన లానే ధాన ధర్మాలు చేస్తూ పోయారు. రామదాసు సినిమాతో బాగా నష్టపోయారు. దానికి తోడు దాన ధర్మాలకు అంతు లేదు. ఆయన స్టూడియో నిత్యాన్న దాన సత్రంగా వెలుగొందేది. 1938 నుంచి 1973 వరకు చిత్తూరు నాగయ్య దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు. భక్తపోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య అని నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఈ సినిమాల ప్రభావం నాగయ్యపై బాగా పడింది. వాస్తవిక జీవితంలో అందులోనూ సినిమా రంగంలో నమ్మించి మోసం చేసేవారు ఎలా ఉంటారో, విజయం దక్కినప్పుడు కాటేసే పాములు ఎలా పొంచి ఉంటాయో ఆ సాధు స్వభావి గ్రహించలేకపోయారు. అంతా అయిపోయిన తరువాత ఇక్కడ గోముఖంతో ఉండే పులులు చాలా ఉన్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన వద్ద ఏమీ మిగలలేదు. 1947లో నాగయ్య నటించిన యోగివేమన నటించిన సినిమా చూసి ముమ్మడివరానికి చెందిన బాలుడు బాలయోగిగా మారారు. తెలుగునాట తొలి తరం హీరో, సంగీత కర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆ కాలంలో ఎంతో పేరు గడించారు. దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హీరో. చిత్తూరు నాగయ్య జీవితం సినిమా వారికే కాదు సంపాదనపై అవగాహన కలిగించడానికి, సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి చిత్తూరు నాగయ్య జీవితం ఏ కాలం వారికైనా ఏ రంగం వారికైనా ఒక పాఠంగా ఉపయోగపడుతుంది.
చిత్తూరు నాగయ్య తన తరువాత తరం వారికి నటనలోనే కాదు సంపాదన, జాగ్రత్తలపై కూడా తన జీవితం ద్వారా చాలా బలంగా పాఠం నేర్పించారు. ఈ తరం సినిమా వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటి వారి జీవిత చరిత్రలే కారణం. ఈ పాఠాలు సినిమా వారికే కాదు అందరికీ ఉపయోగకరమైనవే.
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముని ”మాణిక్యం ”-రుక్కు తల్లి

నవలా పరిచయం: వి.రాజారామమోహనరావు
 

‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు
తమదైన ప్రత్యేకతగల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు. నిఖార్సైన, సంసారపక్ష హాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని తక్కువ మందికి తెలుసు. ఆ నవలలు, ఆయన హాస్య కథలలా కాక, చాలా గంభీరంగా, లోతుగా ఉంటాయని మరీ తక్కువ మందికి తెలుసు. 

ఈ నవలను 1958లో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. రాజమండ్రి వారు అచ్చు వేశారు. సాంఘిక నవలలు పూర్తి విషాదభరితంగా రాయటం అప్పటికి తెలుగులో తక్కువ. గంభీరమైన వస్తువుని తీసుకుని పాఠకులని రంజింపజెయ్యటం కత్తిమీద సాములాంటిది. కావాలనే మునిమాణిక్యంవారు ఈ ప్రయత్నం చేపట్టారనిపిస్తుంది. మృధువైన సరస శృంగారం, సున్నితమైన హాస్యం కాంతం కథల అంతర్వాహిని. ఆ వాహిని అడుగున, హాస్యాన్ని పండించే ఆ బలం వెనుక, ఓ గంభీరత, జీవితపు మౌలికత వున్నాయి. ఆ మూల శక్తి నవలా రూపమే “రుక్కు తల్లి”. ఈ నవలా శిల్పం విషయంలోనూ కొత్త పద్ధతి అవలంభించారు మునిమాణిక్యంవారు. రుక్కుతల్లి స్మృతి గ్రంథంలా వుంటుంది. రుక్కుతల్లి గురించి కుటుంబ సభ్యులు అందరూ చెప్పుకునే స్మృతులుగా నడుస్తుంది కథ. 

రుక్కమ్మ తండ్రి ఆరంభించినట్టు కథ మొదలవుతుంది. 

‘అది ఆశ్వయుజ బహుళ అమావాస్య. బైట అంతా చిమ్మ చీకటి. మునిసిపల్ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. బొంయ్‌మంటూ గాలి వీస్తున్నది. ఆ గాలి దొడ్లో చెట్లను, ఇంటికప్పును కౌగలించుకుని ఏడ్చి, మైదానంమీదపడి ఏడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయింది. చీకటి పడింది’ ఇదీ నవల ఆరంభం. నవలాంశంలోని విషాదం ప్రకృతిలో ప్రతిబింబించేలా ఆరంభించారు. 

భార్య పోయిన వెంటనే, ఆ ఇంటికి కూతురు రుక్కుతల్లి ఎలా ఇంటిపెద్దయి బాధ్యతలు స్వీకరించిందో చెప్పాడాయన. తోడబుట్టిన వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవటం, తండ్రికి కావాల్సిన సదుపాయాలు కూర్చటం, వంటావార్పూ చూసుకోవటం… చెపుతుంటే ఉట్టిమాటలేకానీ, చేతల్లో అదో పెద్ద బాధ్యత, ఎంతో అనుభవం వున్న ఇల్లాలు చెయ్యగలిగిన పని. రుక్కు తల్లికి పధ్నాలుగేళ్ళు మాత్రమే. ఆ కబుర్లు అలా సాగుతుండగా, రుక్కుతల్లి బామ్మ… “ఇదంతా ఎందుకర్రా, రాధాయకు జ్వరం వచ్చినప్పుడు రుక్కు పడిన యాతన ఇంతా, అంతానా! చూచిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు” అంది. ఆ విషయాలు వివరంగా చెప్పమన్నారు చుట్టూ వున్నవాళ్ళు. ఆవిడ చెప్పటం ఆరంభించింది. 

రాధాయకు పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. మామూలుగా చూపించే డాక్టరు చలపతిరావు గారికి చూపించారు. నూటనాలుగు, నూరు అయిదు డిగ్రీలు. వారం అంతా అలాగే గడిచింది. రెండో వారం జ్వర తీవ్రత ఇంకా హెచ్చింది. పసివాడు చాలా నీరసించిపోయాడు. రుక్కు హడలిపోయింది. ఒక్క నిమిషమైనా వాడిని వదిలి వుండేది కాదు. ఎప్పుడూ రాధాయ పక్కనే పడుకునుండేది. పక్క వదిలి లేచిందో రాధాయ కెవ్వున కేకవేసి ఏడ్చేవాడు. అక్కని కదలనిచ్చేవాడు కాదు. డొక్కలో దూరి పడుకునేవాడు. అన్నం తినటానికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. 

సరిగ్గా అదే సమయంలో రుక్కుతల్లి చెల్లెలు సుశీల పెళ్ళి. పెళ్ళికి తెనాలి అలాగే జబ్బు పిల్లాడితో వెళ్ళారు. పెళ్ళి సమయం అంతా రుక్కుకి తమ్ముడి ఆందోళనే. ఆ తర్వాత ఆ జ్వరం మరీ పెరిగింది. పిల్లాడికి రక్త విరోచనాలు ఆరంభమయ్యాయి. పరిస్థితి చెయ్యి జారిపోతుందేమో అనిపించే సమయంలో నిష్టగా రుక్కు దేవీ పూజ చేసింది. అద్భుతం జరిగినట్టు రాధాయకి జ్వరం, అనారోగ్యం తగ్గుముఖం పట్టాయి. రుక్కుతల్లి కఠోరశ్రమ, గురి రాధాయని బ్రతికించాయని అందరూ అనుకున్నారు. తల్లి లేకుండా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి ఆందోళన చెరోవైపు దిగలాగుతున్నా, ఎంతో పెద్ద తరహాగా రుక్కుతల్లి చూపించిన నిబ్బరం అందరికీ అబ్బురమైంది. ఇక్కడ మునిమాణిక్యం నరసింహారావు గారు ఉత్తరం రూపంలో రాసిన మాటలు గుండెల్ని పట్టుకుంటాయి. ఓ పధ్నాలుగేళ్ళ పిల్ల పెద్ద తరహాలో మాట్లాడే ఆ పలుకులు ఏ మాత్రం అజాగ్రత్తగా రాసినా, ముది పేరక్క కబుర్లైపోయే ప్రమాదం వుంది. 

“ప్రతివాళ్ళూ వచ్చి రాధాయ బుగ్గగిల్లి, మా తండ్రే! ఎంత పాటు పడ్డావురా నాయనా! ఆ భగవంతుడు సరిగ్గా చూశాడు అని ముద్దు పెట్టుకుని పండో, ఫలమో వాడి చేతుల్లో పెడుతున్నారు. వాడు మళ్లీ నలుగురిలో పడ్డందుకు ఎంతో సంతోషంగా వుంది” తెనాలి నుంచి రుక్కు తండ్రికి రాసిన ఉత్తరంలో మాటలు ఇవి. 

ఈ మాటల్లో నుడికారం మొత్తం దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తుంది. తమ్ముడు చచ్చి బ్రతికిన ఆనందం, నలుగురి ఆదరం, తండ్రితో ఇదంతా ఉత్తరం ద్వారా పంచుకోవటం… ఇవన్నీ ఏక కాలంలో, కొద్ది వాక్యాలలో సాధించారు రచయిత. 

రాధాయ దగ్గర్నుంచి జ్వరం రుక్కుతల్లికి అంటుకోవటం, అది న్యూమోనియాగా మారటం, రుక్కుతల్లి యాతన, ఆమె మేనమామ సత్యం ఆవేదన, తండ్రి నరక యాతన, ఆ ఇంటి పెద్ద సత్యం అత్తగారు రాజమ్మగారి సూటిపోటి మాటలు, తల్లిలేని పిల్ల రుక్కుకి తలదువ్వేవారు లేక విపరీతంగా పేలు పట్టి, కొద్దిగా మిగిలున్న ఆ పిల్ల రక్తాన్ని పీల్చటం, మంచం మీదికి చీమలు రాకుండా, మంచం నాలుగు కోళ్ళు, నీళ్ళు పోసిన పళ్ళాలలో పెట్టడం లాంటి ఎన్నో సూక్ష్మాతిసూక్ష్మ విషయాలు వివరించాడు రచయిత. జ్వరంపడిన మనిషిమీద ప్రేమ, ఇంటినంతా రోగగ్రస్తం చేస్తుంది. ఆ దిగులు కనిపించకుండా అందరినీ కమ్ముకుంటుంది. రోగం వచ్చిన వాళ్ళ చుట్టూ వుండేవాళ్ళ ప్రవర్తన మానవత్వానికి గీటురాయిగా తీసుకోవచ్చు. ఇలాంటి అంశాలవల్లే ఇంత దిగులు. కథా ఆసక్తిగా చదువుతాం. చూపులనుంచి జారిపోయే జీవితం చూపించటం ఓ కళ. నిత్యం కళ్ళముందు కనిపిస్తున్న మన మనసుకి ఎక్కని విషయాల్ని హత్తుకునేలా రాయటం రచనా ప్రక్రియ బలం. 

సహజంగా మన నమ్మకాలకి ఆవల వుండే విషయాలు కొన్ని ఈ నవలలో వున్నాయి. చనిపోయిన రుక్కు అమ్మగారు రుక్కుకి కనపడటం. రుక్కుకి జబ్బుగా వున్నప్పుడు వచ్చి పక్కలో కూచోవటం, రుక్కు తండ్రికి కూడా ఇలాగే భార్య కనిపించిన భావన. దేవతని ప్రార్థించి రుక్కు తమ్ముడి జ్వరాన్ని తను తీసుకోవటం, తమ్ముడు రాధేయ చావుని తనమీద వేసుకోవటం లాంటి దైవిక సంఘటనలున్నాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలు కొందరిలో వున్నాయి. ఇలాంటి ఈ రకం రచనాతీరు, ఈ నవలకి సాంద్రతని కూర్చిందేకానీ, పలచన చెయ్యలేదు. సెంటిమెంట్‌లా తోచే ఎన్నో సంఘటనలు “రుక్కుతల్లి”లో వున్నాయి. 

రుక్కు తన మేనమామ గురించి చెబుతూ… “పదిహేనేళ్ళ కిందట మొదటిసారి నేను కళ్ళు తెరిచినప్పుడు, ముందుగా చూచింది మామయ్యనే! నేను తల్లి గర్భంలోంచి మామయ్య చేతుల్లో పడ్డానుట! అప్పటినుండి మామయ్యకు నామీద ప్రేమ, నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే మామయ్య నన్ను ఎత్తుకు ఆడించాడు. నాకు ప్రాణాధారమైన అన్నం తినటం నేర్పింది కూడా మామయ్యే! ఒక్కటే కోరిక ఉందమ్మా. మామయ్యను చూస్తూనే పోవాలని ఉంది” 

“దేవి, ఆజ్ఞ! నా ప్రాణం కానుకగా ఇచ్చాను! నేను ఉంటే మామయ్య నాకు సహాయం చేయటం, ప్రేమ వర్షించటం మానడు. ఇది చూసి మామయ్య అత్తగారు రాజమ్మగారు దుఃఖపడక మానదు. తద్వారా మామయ్య కాపురంలో కలతలు. నేను లేకపోతే ఇవన్నీ ఏవీ ఉండవు. దేవీ ఆజ్ఞ ప్రకారం ఎట్లాగో పోవాల్సిందే. ఇది కూడా కలిసొస్తుందని సంతోషిస్తున్నా” ఇవీ రుక్కుతల్లి భావాలు. 

చివరి దశలో సత్యం రుక్కుతల్లి తలని తన తొడపై పెట్టుకున్నాడు. అది మామయ్యనే నమ్ముకుంది. మామయ్య దేముడనుకుంది. మామయ్య చేతుల్లోనే అది పుట్టింది. మామయ్య చేతుల్లోనే ఉంది. 

రుక్కుతల్లి అలాగే పరలోకాలకు తరలిపోయింది. మేనమామ మేనకోడళ్ళ ఆప్యాయ బంధం, తండ్రీ కూతుళ్ళ బంధాన్ని మించి కనపడటం “రుక్కు తల్లి” నవలలో చూస్తాం. ఇదో భిన్న సంప్రదాయాంశం. 

ఓ పధ్నాలుగేళ్ళ పిల్లని కథానాయికనిచేసి, ఆ పిల్ల త్యాగాల్ని, దైన్యాల్ని రసభరిత రచనగా తీర్చి దిద్దగలగటం గొప్ప విషయం. ఈ నవలలోని ఓ ప్రతిపాదన కలకాలం నిలిచేది. ‘బిడ్డలను ప్రేమతో పెంచటానికి స్త్రీయే కావాలి. స్త్రీ చేసిన త్యాగం పురుషుడు ఎప్పుడూ చెయ్యలేడు. స్త్రీ చూపగల ఓర్పు, సహనము పురుషుడికి తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. స్త్రీ ప్రేమ స్వరూపిణి’. 

ఈ ప్రతిపాదనకి తగినట్టుగానే ‘రుక్కు తల్లి’ నవల రూపకల్పన జరిగింది. 

‘బిడ్డలు కన్నతల్లులారా! మీరు పదిమంది చేరి మాట్లాడుకొంటున్నప్పుడు రుక్కు తల్లి పేరు ఒకసారి తలవండి. బుద్ధి తెలిసిన ఏ పిల్లయినా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను ప్రేమతో చూడకపోతే రుక్కు కథ చెప్పండి’ అంటూ గురజాడవారి పూర్ణమ్మని గుర్తుతెచ్చేలా ఈ నవల ముగించారు నరసింహారావుగారు. 

కుటుంబంపట్ల ఆడపిల్లకి ఉండే అపరిమిత అనురాగం రుక్కు తల్లి నవల. ఆనాటి కుటుంబ సంప్రదాయంలోని బలం అర్థం చేసుకోవటానికి ఈ నవల చదివి తీరాలి. 

హాస్య రచయితగా పేరుపొందిన ముణిమాణిక్యం నరసింహారావుగారి గంభీర చింతన, నవలా రచనలోని నవ్యరీతి, జీవితపు పొరల్లోని మానవతా చ్ఛాయల్ని ఆయన పట్టుకున్న తీరు విలక్షణమైంది. విషాదభరిత రస కావ్యం ‘రుక్కు తల్లి’.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనందయోగ మార్గమిదే! క్షేమేచార భిక్

Published at: 18-07-2014 00:33 AM

భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు.    మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీగుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీవనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే అంటారు సిద్దార్థ బుద్ద విహార ట్రస్ట్‌ ఛైర్మన్‌  వెన్‌. ఖేమాచార భిక్కు …   

మన దేశంలో సుప్రసిద్ధ బౌద్ధ గురువుల్లో వెన్‌ దీపాంకర ఒకరు. ఆయన ఒక సారి టిబెట్‌లో దమ్మతత్వం మీద ప్రసంగించటానికి వెళ్లారు. ఆయన తనతో పాటుగా ఒక వంట మనిషిని కూడా తీసుకువెళ్లాడు. ఆ వంట మనిషికి వంట సరిగ్గా రాదు. పైగా పేచీకోరు. అది గమనించిన కొందరు భక్తులు- ’మీరు ఎందుకు ఆ వంటమనిషిని భరిస్తున్నారు? అతనిని వెనక్కి పంపేయండి. మీ అవసరాలు మేం చూసుకుంటాం’ అని దీపాంకర వద్దకు వచ్చి ప్రశ్నించారు. అప్పుడు దీపాంకరుడు- ’’ అతన్ని నేను ఒక నౌకరుగా చూడటం లేదు. ఒక గురువుగా భావిస్తున్నాను. అతని అసమర్థత, పేచీకోరుతనం నాకు ప్రతి రోజూ పాఠాలు నేర్పుతూ ఉంటాయి. నాలో సహనాన్ని, నిబ్బరాన్ని పెంచుతూ ఉంటాయి..’’ అని సమాధానమిచ్చాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటంలోనే మనిషి అసలైన సమర్థత దాగి ఉంటుంది.

జీవితం ఒక ఆనంద సీమ అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ, చాలా మంది జీవితం ఎందుకంత నిర్లిప్తంగా ఉంటోంది?- ఎందుకంటే మన జీవితంలో దేనికి స్థిరత్వం లేదు. ఏదీ శాశ్వతం కాదు. అయితే పరిణామక్రమంలో పరిణితి ఒక ప్రక్రియ. నిరంతరం చైతన్యశీలంగా ఉండటమే ఈ ప్రక్రియకున్న ఏకైక మార్గం. వ్యక్తుల అంతరంగాలు అనునిత్యం కొత్తదనాన్ని సంతరించుకోవాలి. అప్పుడే అవతలి వ్యక్తుల్లోని భిన్నత్వాన్ని, వ్యతిరేక తత్వాన్ని కూడా జీర్ణించుకోగలుగుతారు. కానీ ఆధునిక ప్రపంచంలో ఇది జరగడం లేదు. కొత్తదనాన్ని సంతరించుకోని వారిలో స్వార్థం పెరుగుతూ వెళ్తుంది. సర్వ అశాంతులకూ, సమస్త సంఘర్షణలకూ అదే కారణమవుతుంది.  స్వార్థశక్తులకు, మార్పునకు మధ్య జరిగే ఘర్షణ వల్లే అశాంతి ఏర్పడుతుందంటాడు బుద్ధుడు.
తోటలో పువ్వుల్లా…
ప్రపంచంలో అందరూ ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బతకగలిగితే ఇన్ని సమస్యలు ఉండవు. ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ ఒక సంఘంలో నివసిస్తున్నప్పుడు సహజీవనం అనివార్యమవుతుంది. ఇతరుల దృక్పథాల్ని, అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది. పరమ విరుద్ధమైన ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మనతో ఏకీభవించేవారితో కలవటానికే మనం ఇష్టపడతాం. కానీ దాని వల్ల వృద్ధి ఉండదు. అభిప్రాయాల మధ్య ఘర్షణ, ఆలోచనలలో రాపిడీ ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇతరుల వాదనలో ఉన్న సత్యాన్ని గ్రహించి, దానిని ఆచరించగలిగితే కొత్త మార్గాలు మన కళ్ల ముందు గోచరమవుతాయి.  ఇతరులతో  స్నేహంగా  ఉండడం అంటే ప్రకృతితో స్నేహంగా, ఉండడమే.  శరీరం కాలిపోయేంతటి ఎండలోనూ మనం జీవిస్తాం. దానికి పరమ విరుద్ధంగా  ఉండే చలిలోనూ జీవిస్తాం.    నిలువెల్లా తడిపి  ముద్దచేసే  వర్షంలోనూ జీవిస్తాం.  వాటిలో మనం దేన్నీ ద్వేషించం.   పరమ విభిన్నమైన వాతావరణ  పరిస్థితుల్లో జీవించడానికి  మనం  సిద్ధమైనట్లే విభిన్నమైన వ్యక్తుల మధ్య జీవించడానికి   కూడా  మనం సిద్ధంగా  ఉండాలి. మనం  మన శత్రువుల్ని   ప్రేమించగలంతటి   ఉన్నతులం కాకపోవచ్చు.   కానీ,   మన ఆరోగ్యం , మన సంతోషం కోసమైనా కనీసం  వారిని మన్నించి మరిచిపోవాలి. సాధారణంగా అందరికీ వైరుధ్యం అంటే ఒక వ్యతిరేకత ఉంటుంది. దాని నుంచి దూరంగా జరిగిపోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానిని అర్థం చేసుకుంటే గొప్ప సత్యాలు తెలుస్తాయి.
దాంపత్యంలో….
పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. కానీ దాంపత్యం సరిగ్గా లేకపోతే ఆ జీవితాలు నరకకూపాలవుతాయి.  దంపతుల హృదయాలలో కేవలం స్వార్థం మాత్రమే ఉంటే- ఆ బంధం ఎంతో కాలం నిలబడదు. అడుగడుగునా తలెత్తే  వైరుధ్యాలను అర్థం చేసుకొని,  అసూయ, ఆగ్రహం, అనుమానం వంటి మానసిక స్థితులకు అతీతంగా ఉండటానికి సహనం కావాలి.  ఔన్నత్యం మనిషిని  దేవుడిగా మారుస్తుంది. హీనత్వం  మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఇక్కడ మనం దేవతలంటే ఎవరో కూడా తెలుసుకోవాలి. దేవతలంటే సకల సద్గుణ సంపన్నులు అని కాదు.  ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు  కాదన్న సత్యాన్ని  గుర్తించి వ్యవహరించే వారని అర్థం. ఇలాంటి ఔనత్యాన్ని కలిగినప్పుడు దాంపత్యం సజావుగా సాగిపోతుంది.
మూలాలు పెకిలిస్తేనే…
అవగాహన, సహనం- ఈ రెండు గుణాలతో వైరుధ్యాలను అధిగమించవచ్చు. ఇది సాధ్యం కానప్పుడు అశాంతి ప్రబలుతుంది. ప్రస్తుతం మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మునుపెన్నడూ లేనంతగా మనం శాంతి కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఏర్పడిన అంశాంతి అంతా భౌతిక సంపద కోసం వెంపర్లాటం వల్ల వచ్చేదే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన అగ్ర రాజ్యాలు కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నాయి. భౌతికమైన పురోగతి మనిషిని సంతోషపెట్టలేదనే సత్యాన్ని మానవాళి విస్మరించింది. దానికి మూల్యం చెల్లిస్తోంది. జ్ఞానం- దాని వల్ల సంక్రమించే నీతి,  ఉదాత్తత, ఇవి మాత్రమే శాశ్వతమైనవని  గ్రహించిన రోజు శాశ్వతంగా శాంతి ఏర్పడుతుంది. ఆ  శాంతి సాధనకు పునాదిగా నిలిచే జ్ఞానాన్ని సముపార్జించటానికి ధ్యానం తోడ్పడుతుంది.                 

. నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ

బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు!

Published at: 17-07-2014 01:06 AM

‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్‌ అప్పీల్‌ వచ్చింది. ఐడియాని నమ్మి   సినిమా చేసి హిట్‌ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం లేదు. బడ్జెట్‌ ఎన్ని కోట్లు అనే అడుగుతున్నారు. ‘ఐస్‌క్రీమ్‌’లాంటి సినిమాలు అలాంటి పరిస్థితుల్లో మార్పులు తెస్తాయి. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని వర్మ చేసిన ప్రయోగం ఫలించింది. కొందరు కలిసి యూనిట్‌గా అయి సినిమా చేసి, లాభాలు వచ్చిన తర్వాత ఎవరి వాటాను వారు తీసుకోవడం చాలా బావుంది. ఇలాంటి ఆల్టర్నేటివ్‌    సినిమా లేకపోతే పరిశ్రమ మనుగడ కష్టం. రూ.50 కోట్లు ఖర్చుపెట్టిన సినిమాకు రూ.51 కోట్లు వస్తే అది లాభం కింద లెక్కకాదు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘ఐస్‌క్రీమ్‌’కు పెట్టిన ఖర్చుకు దాదాపు 20 రెట్లు లాభాలను చవిచూశాడు. ‘ఐస్‌క్రీమ్‌2’ను వెంటనే మొదలుపెట్టడం బావుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఐస్‌క్రీమ్‌’ విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. దాసరి నారాయణరావు   పాల్గొని చిత్ర యూనిట్‌కు పారితోషికాలను చెక్కుల రూపంలో అందజేశారు. నవదీప్‌, తేజస్వి జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘ఐస్‌క్రీమ్‌’. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘ముందు రూపాయి లేకుండా సినిమా చేద్దామని, సినిమా విడుదలయ్యాక మాత్రం అందరికీ పారితోషికం తప్పకుండా ఇవ్వాలని, మోసం చేస్తే పైకి రాలేనని వర్మ చెప్పారు. దానికి తగ్గట్టే సినిమాను ప్లాన్‌ చేశాం.

రూపాయికి రూపాయి మిగిలింది. ఈ సినిమాతో నా టీమ్‌ అంతా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. చక్కటి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని నవదీప్‌ అన్నారు. వర్మ మాట్లాడుతూ ‘‘ఎంతోమందికి సినిమా తీయాలని ఉంటుంది. అందుకు డబ్బులు అవసరం లేదు. ఐస్‌క్రీమ్‌ తీసిన సిస్టమ్‌లో ఎవరైనా సినిమా తీసి అవతలివారిని మెప్పించగలిగితే తప్పకుండా సినిమాలను విడుదల చేసి లాభాలను చవిచూడవచ్చు. కాకపోతే సమష్టిగా పనిచేయాలి. అదే జరిగితే పరిశ్రమతో పనిలేకుండా ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా సినిమాలు చేయొచ్చు. ఇప్పటి వరకు అందరూ వర్మ స్కూల్‌ అని అంటుంటారు. నిజంగా నాకు స్కూల్‌ లేదు. కానీ ఈ టెక్నిక్‌ల గురించి వీడియోల ద్వారా వివరించాలని ఉంది’’ అని అన్నారు.
నాది కుక్కబుద్ధి: ఇటీవల రివ్యూలు రాసిన వారిని ‘చీకట్లో అరిచే కుక్కలు’ అన్న వర్మ దాని గురించి మాట్లాడుతూ ‘‘అమితాబ్‌బచ్చన్‌ని కూడా ట్విట్టర్‌లో బూతు మాట అన్నవాడిని నేను. అయినా ఆయన దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఆయనకు నా గురించి తెలుసు. స్పాంటేనియస్‌గా మాట్లాడటం నాకు అలవాటు. అలా కాకుండా ఏదో మొహమాటానికి మాట్లాడితే అది నేను మాట్లాడినట్టు ఉండదు. నేను రాసిన లేఖలో మీడియా మొత్తాన్ని కించపరచలేదు. ఒక వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్‌ రివ్యూ  రాసిన వ్యక్తినే అన్నాను. అతని విషయంలో ఇంకా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మిగిలిన వాళ్లను ఉద్దేశించి అన్నట్టు అనిపిస్తే సారీ. నాది కూడా కుక్కబుద్ధే’’ అని వివరించారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

స్మృతిపథంలో బసవపున్నయ్య –

స్మృతిపథంలో బసవపున్నయ్య

Published at: 18-07-2014 01:11 AM

పార్టీ కార్యకర్తల్లో పిడివాదం పెగరకుండా కృషిచేసిన అరుదైన కమ్యూనిస్టు నాయకుడు మాకినేని  బసవపున్నయ్య. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆయనది ప్రధాన పాత్ర. బసవపున్నయ్య సంస్కారం ఉన్నతమైనది.

ఇది సీపీఎం ప్రముఖ సిద్ధాంతకర్త కీ.శే. మాకినేని బసవపున్నయ్య (యం.బి.) శతజయంతి సంవత్సరం. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ‘కొత్తగా సీపీఎం ఉమ్మడి సీపీఐ నుంచి విడివడి ప్రత్యేక పార్టీగా ఏర్పడినప్పుడు యం.బి.ని పార్టీ ప్రథమ జాతీయ కార్యదర్శిగా మహాసభ ఎన్నుకుంటుందని నేను భావించాను. సీపీఐలో అంతర్గత పోరాటంలోనూ, సీపీఎంకు ప్రత్యేక పార్టీగా సైద్ధాంతిక అస్తిత్వాన్ని ఇవ్వడంలోనూ ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే కొత్త పార్టీకి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్న నాయకుడు కావాలని నన్ను ఎన్నుకున్నారు’ అని రాశారు. అంటే యం.బి.కి సీపీఎంలో ఉన్న ప్రాధాన్యం అర్థం అవుతుంది. అంతేకాదు, యం.బి. కూడా తనతో పాటు, పార్టీ కేంద్రంలో ఉండి పార్టీకి సైద్ధాంతికంగా, నిర్మాణరీత్యా సహకరిస్తేనే తాను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి అంగీకరిస్తానని స్పష్టం చేశానని కూడా సుందరయ్య చెప్పారు.

యం.బి.ది పార్టీ వాద ప్రతివాదాల్లో ఒక విలక్షణమైన, ఆకర్షణీయమైన శైలి! సీపీఎం ఏర్పడిన కొత్తలో పత్రికల వాళ్లు ఆయనను ‘సీపీఐ కమ్యూనిస్టు పార్టీ కాదా?’ అని అడిగితే ఆయన వెంటనే ‘వాళ్లు కమ్యూనిస్టులయితే మరి నేనెవర్ని?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు మిగిలిన కమ్యూనిస్టు పార్టీలను వాటి వాటి పేర్లతోనే పిలుస్తున్నారనుకోండి! 1980-81లో అనుకుంటా సూర్యాపేటలో ఒక ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ ‘నా బట్ట తలపై వెంట్రుకలైనా దట్టంగా రావచ్చు గానీ, ఇందిరాగాంధీ గెలవడం కల్ల!’ అని యం.బి. అన్నారు. సీపీఎం అభిమానులు బ్రహ్మాండంగా చప్పట్లు చరిచారు. తీరా ఆ ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘనవిజయం సాధించారు. ఆ తదుపరి ఒకసారి యం.బి. కలిసినప్పుడు ‘అదేంటండీ, అంత ఘంటాపథంగా ఇందిరాగాంధీ ఓడిపోతుందని అన్నారు…?’ అని అడిగాను. ‘భలేవాడివయ్యా నా సైన్యాన్ని ఎన్నికల యుద్ధంలోకి దింపుతున్నాను. ఆ సందర్భంలో నాకు ఇందిరాగాంధీ గెలుపు ఖాయమనిపించినా, ‘ఇందిరా గాంధీ గెలుస్తుంది – మనం ఓడిపోతామని’ చెబితే – మనవాళ్లు ఇక గోడలమీద రాతలు కూడా మొదలెట్టరు’ అని అన్నారు (అప్పుడు ప్రధాన ప్రచారం గోడలపై రాతలే – ఫ్లెక్సీలు రాలేదు).

యం.బి.కి చిన్నతనం నుంచి హేతువాద దృక్పథం ఉండేది. వాళ్ల ఊళ్లో రచ్చబండ వద్ద ‘పోతరాజు’ (గ్రామ దేవత – ఒక కర్ర ముక్క పాతిపెట్టి పుసుపు కుంకుమ పూసి)కు, కొలుపులు, జాతర్లు జరిగేవట. పోతరాజు మహిమల కథలు! ఒకరోజు ఒక కుక్క ఆ పోతరాజుపై కాలుపైకెత్తి మూత్రం పోయడం యం.బి. చూశారట! అంతలావు పోతరాజు ఆ మాత్రం కుక్కనే ఏం చేయలేకపోయాడని ఈయన తనకాలితో పోతరాజును తన్నాడట! ఇది ఆయన బంధువులెవరో చూసి ‘వేలెడంత కూడా లేవు ఎంత పొగర్రా నీకు, ఉండు ఇంట్లో చెప్తానని’ కేక వేశాడట! అందుకు ఇంట్లోంచి పారిపోతే, తెనాలిలో వారి ఊరు వాళ్లెవరో గుర్తించి, వాళ్ల ఊరు తీసుకెళ్లారట! కందాళం హనుమంతరావు గారని అప్పుడు కొల్లూరులో ఒక హెడ్‌ మాస్టర్‌ బాగా మంచి పేరున్న ఆయన. తన స్కూల్లో యస్‌.యస్‌.యల్‌.సి. విద్యార్థులకు ఫైనల్‌ పరీక్ష ముందు పరీక్ష పెట్టి, కొంతమందిని పరీక్షలో నెగ్గలేరని డిటెయిన్‌ చేశారట! ఆ డిటెన్‌షన్‌ విధానానికి వ్యతిరేకంగా యం.బి. నాయకత్వాన విద్యార్థులు సమ్మె చేశారట! అప్పుడు యం.బి. రాయించిన నినాదం ఏమంటే ‘ఎట్లాగూ కృతార్థులయ్యే విద్యార్థులను పాస్‌ చేయించడంలో కందాళం వారి గొప్ప ఏముంది – అలా చదువులో వెనుకబడిన విద్యార్థులను పాస్‌ అయ్యేలా చేయిస్తేనే గదా ఆయన ప్రతిష్ఠ!’ అని. అది చదివి హెడ్‌ మాస్టర్‌ తన స్కూలు విద్యార్థుల ముందు ఆ నినాదాన్ని మెచ్చుకున్నారట. అప్పుడు మా నాన్నగారు కొల్లూరు హైస్కూలు విద్యార్థి.

గోర్బచేవ్‌ సోవియట్‌ యూనియన్‌లో తొలిసారి గ్లాస్‌నాస్త్‌ (బహిరంగంగా వాస్తవ పరిస్థితిని వెలిబుచ్చడం) ప్రవేశపెట్టాడంటారు. కానీ యం.బి. దాన్ని, అంతకుముందే అవలంబించేవారు. ఢిల్లీలో కేంద్ర రాజకీయ పాఠశాల జరిగింది. మన రాష్ట్రం నుంచి కొరటాల సత్యనారాయణ, వి.యన్‌. రెడ్డి, టి.వి.ఆర్‌. చంద్ర, నేను అక్కడికి విద్యార్థులుగా వెళ్లాం. యం.బి. ‘1951 ఎత్తుగడల పంథా’ గూర్చి పాఠం చెప్పారు. అయిపోయిన తర్వాత మేము ముగ్గురమూ (కొరటాల రాలేదు) యం.బి.ని విడిగా కలిసి మా సందేహం అడిగాం. ‘మన భారత విప్లవ పంథా రష్యా మార్గమా, చైనా మార్గమా అన్న చర్చ…’ అని నేను ప్రశ్న పూర్తి చేయకుండానే ‘అసలు మీకు ఒక విషయం చెప్పాలి! క్లాసులో సీరియస్‌గా పాఠం చెప్తే ఆ విషయం చెప్పలేదు కదా!’ మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దిగబడ్డాం! ఇప్పుడు మీరు మా గురించి, మార్క్సిజంలో నిష్ణాతులం అనుకున్నట్లే మేమప్పుడు పార్టీ కేంద్రం  బొంబాయిలో ఉన్న డాంగే, రణదివే, అజయ్‌ఘోష్‌ల గురించి వాళ్లకు మార్క్సిజం వేళ్ల కొసలపైన ఉంటుందనీ, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలరని అనుకునేవాళ్లం. ఇక్కడ మాకు ఆ సాయుధ పోరాటం సందర్భంగా ఏదైనా సమస్య వస్తే బొంబాయిలో వాళ్లకి ఆ సమస్య గురించి రాసి వారిని పరిష్కారం చూపమని అడిగేవాళ్లం. వారు పరిష్కారం రాసి పంపేవారు. ఆ పరిష్కారం మాకు అతికేది కాదు. అదే విషయం ‘కామ్రేడ్స్‌ మీ పరిష్కారం ఇక్కడ మాకు అన్వయం కావడం లేదు’ అని మళ్లీ వారికి పంపేవాళ్లం. వాళ్లు దానికి ‘ఎందుకు కుదరదు కామ్రేడ్స్‌ – అని లెనిన్‌ ఇలాంటి సందర్భంలో అంటూ ఒక రెండు పేజీల లెనిన్‌ కొటేషన్‌ జోడించి సమాధానం ఇచ్చేవారు. వీళ్లతో అయితే మేం చర్చించగలం గానీ, లెనిన్‌తో చర్చించ గల స్థాయి మాకు లేదు కదా! అందుకని మావో కొటేషన్‌ ఏదన్నా మాకు అనుకూలంగా వున్నది వెలికితీసి ఒక మూడు పేజీల కొటేషన్‌తో వారికి మళ్లీ రాసేవారం. ఇలా వారిది రష్యా మార్గం అయింది, మాది చైనా మార్గం అయింది. నిజానికి వారికి రష్యా మార్గమూ, మాకు చైనా మార్గమూ క్షుణ్ణంగా తెలిసింది కాదు’ అని చెప్పారు. అయినా నేను పట్టువదలని విక్రమార్కుని మాదిరి ‘ఇంతకీ మీరు ఏం చెప్పాలని’… ‘అని ప్రశ్న వేయకముందే’ సరే! క్లాసులో నా పాఠమే కాదు ఇప్పటి నా వివరణ సారాంశం కూడా మీకు అర్థం కాలేదన్న మాట అని ఆయన నవ్వారు. అప్పుడు గానీ మాకు తట్టలేదు. మేమూ పకపకా నవ్వాము.

ఇంకోసారి విడిగా మాట్లాడేటప్పుడు- ‘అదిగో, ఆ మావోగారి కాళ్లు, గడ్డమో పట్టుకుని ఇక్కడకు తీసుకువచ్చి ‘మంగళాపురం’ (చండ్ర రాజేశ్వరరావు గారి ఊరు)లో రహస్యంగా వుంచి, ఇక్కడ విప్లవం తీసుకురమ్మని ప్రాధేయపడదాం! ఆయన వల్ల అవుతుందేమో చూద్దాం – అయినా మన దేశం – మన భౌతిక పరిస్థితి – మన ప్రజల చైతన్యం – ఇవి ప్రధానం గానీ, ఏ నాయకుడినో కాపీ కొడితే కుదురుతుందా?’ అని అన్నారు. ‘ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో, మా చైనా చూడండి, అక్కడ తిండిలేని వాడు లేడు, బట్టలేని వాడు లేడు, ఇల్లు లేనివాడు లేడు, నిరుద్యోగి ఉండడు – అంటూ చేతులు బారజాపుతూ ఉపన్యసిస్తాను.’ అది సరేసారు, ‘మన చైనాలో అధ్యక్షుడు లీ షాల్‌ చీని 10 సంవత్సరాలు జైల్లో పెట్టి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా చంపారట కదా అని ఎవరన్నా లేచి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అయితే అలా అడగరు ఎవ్వరు – అసలు నాయకులకు ఎదురు ప్రశ్న వేస్తే ఊరుకుంటామా – మన వాలెంటీరే కర్ర చూపించి కూర్చోపెడతాడు’ అని ఇంత బాహాటంగానూ అనేవారు. మావో ప్రసిద్ధ రచన ‘ఆన్‌ కాంట్రడిక్షన్స్‌’ (వైరుధ్యాలపై) విమర్శిస్తూ ఆ మావో, మిత్ర వైరుధ్యం అంటారేమిటి? వైవిధ్యం కాదు. వైరుధ్యంలో మళ్లీ మిత్రత్వం ఏమిటి? మైసూరు పాకు తింటూ పచ్చి మిరపకాయ నంజుకున్నట్లు అని అనడమే గాక, దానిపై ఒక విమర్శనాత్మక పుస్తకమే రాశారు. ఓంకార్‌ను సీపీఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యవర్గం తొలగించింది. ఆ తర్వాత యం.బి. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికొచ్చారు. ఆయన ఓం కార్‌ బహిష్కరణ విషయంలో రాష్ట్ర కమిటీలో ‘బహిష్కరించడమేనా మరో మార్గం లేదా? ఒక్క ఓంకార్‌ తిరిగి పార్టీకి లభించాలంటే ఎంత కష్టం! ఓంకార్‌ మీ దృష్టిలో తప్పుచేసి ఉండొచ్చు. కానీ ఓంకార్‌ తప్పులేనా చేసింది. సాయుధపోరాటంలో ఆ తర్వాత వరంగల్‌ జిల్లా పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర ఏమిటి? ఆయనపై చర్య తీసుకునే ముందు ఓంకార్‌తో ఒకసారి నేను మాట్లాడే అవకాశం కల్పించి ఉండవలసింది. ఇక మీ ఏకగ్రీవ నిర్ణయానికి ఇప్పుడు చేసేదేముంది?’ అని తన అసంతృప్తిని వినిపించారు.

ఇలా చాలామంది కంటే పార్టీలో ఓపెన్‌ మైండ్‌తో ఉండడమే గాక, కొంత వరకూ పార్టీ కార్యకర్తలలో గుడ్డివిశ్వాసం, పిడివాదం పెరగకుండా కృషి చేయాలని భావించే అరుదైన నేతలలో ఆయన ఒకరు. భగవతీ చరణ్‌ వర్మ రాసిన ‘చిత్రలేఖ’ నవల నాకు నచ్చింది. ఆయనకు ఇచ్చి మీరు చదవండి అని అడిగాను. ఆయన చదివి ‘బాగుంది దీనిపై మన ప్రజాశక్తిలో సమీక్ష చేయమన్నారు.’ ‘ఎందుకులెండి  విఠల్‌ గారికి ఇప్పుడు ఈ వేశ్యల, రాజుల, రంగప్పల నవల ఎందుకు నచ్చిందో అని మన కార్యకర్తలు విస్మయపడతారు’ అన్నాను. ‘సరేనయ్యా వాళ్లు ఏది కావాలంటే అది ఇవ్వడమేనా మన పత్రిక చెయ్యాల్సింది. వాళ్లను అట్లా అయినా ఆలోచింపనియ్యి’ అని ప్రోత్సహించారు. ఇలా ఎంతని చెప్పగలం? ఏది ఏమైనా మనదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలలో సిద్ధాంత వేత్తలలో ఆయనది ప్రధాన పాత్ర. ఆయనదొక విలక్షణమైన శైలి! తాను సీపీఎంలో నిర్వహించిన అంతర్గత పోరాటం సందర్భంగా యం.బి. తనతో కలిసి రాలేదన్న అసంతృప్తి సుందరయ్యకు ఉండేది. ఆయన తన రాజీనామా లేఖలో కూడా ఆ విషయం ప్రస్తావించారు. జలంధర్‌ మహాసభలో యం.బి., ఇ.యం.యస్‌.లు కేంద్రకమిటీ తరపున తయారుచేసిన డాక్యుమెంట్‌కు సుందరయ్య గారు ప్రత్యామ్నాయ డాక్యుమెంటు పెట్టారు. యం.బి., సుందరయ్యగారి ప్రత్యామ్నాయ డాక్యుమెంటును తీవ్రంగా విమర్శించారు. కానీ సుందరయ్య మరణానంతరం ఆయన సంతాప సభలో మాట్లాడుతూ ‘ప్రపంచ వ్యాప్తంగా నాకు తెలిసిన ఐదుగురు మార్క్సిస్టు అగ్ర నేతల్లో సుందరయ్య ఒకరు’ అని ఎంతగానో ప్రసంశించారు. ఆయన సంస్కారం ఉన్నతమైనది.

– డా. ఎ.పి. విఠల్‌

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! అంటున్న మహిళా మణులు

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు!

Published at: 18-07-2014 00:38 AM

మహిళలపై లైంగిక వేధింపులు ఈ నాటివి కావు. ఆ బాధలను బయటికి చెప్పుకోలేక మనసులోనే ఆవేదన చెందే అభాగినులు ఎందరో! కానీ తరం మారింది, బాధిత మహిళలందరూ కలిసి అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొంగు బిగించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందుకు నిదర్శనం సికింద్రాబాద్‌ రైల్వేవర్క్‌షాప్‌ మహిళా సంఘం…

తీవ్ర అనారోగ్యంతోపాటు ప్రమాదాల్లో అర్ధాంతరంగా భర్తలు మరణిస్తే, దిక్కుతోచని పరిస్థితుల్లో పిల్లల ఆలనా పాలన కోసం ఇంటికే పరిమితమైన వారి భార్యలు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో వచ్చిన ఉద్యోగాల్లో చేరారు. ఒంటరిగా జీవన సమరం సాగిస్తున్న ఆ మహిళా ఉద్యోగినులకు కొందరు అధికారులు, ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఆరంభమయ్యాయి.
రైల్వే ఉద్యోగి అయిన భర్త కేన్సర్‌తో మరణించాడు. దీంతో అత్తింటివారు కోడలితోపాటు ముగ్గురు పిల్లల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. పిల్లల్ని తీసుకొని కారుణ్య నియామకం కింద రైల్వేవర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందిన ఆ మహిళ మొదటిసారి వంటింటి నుంచి బయటకు వచ్చింది. ఆ ఒంటరి మహిళకు ఆఫీసులో వేధింపులు ఎదురయ్యాయి. ఆమె గురించి కొందరు మగవాళ్లు అవాకులు చవాకులు పేల్చేవారు. అంతటితో ఆగకుండా ఓ పురుష ఉద్యోగి మరో అడుగు ముందుకేసి ఓ రోజు బలవంతపెట్టే మాటొకటి అన్నారు. అంతే! కన్నీటిపర్యంతమైన ఆ మహిళ ధైర్యం తెచ్చుకొని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వేధించిన ఉద్యోగిపై బదిలీవేటు పడింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో ఉద్యోగంలో చేరిన మరో మహిళకు అడుగడుగునా ఇవే సమస్యలు. ఇలాంటి వారంతా కలిసి ఒక్కటవ్వాలని నడుం బిగించారు. వర్క్‌షాప్‌ మహిళలను సంఘటితం చేసి ఈ ఏడాది ఆరంభంలో మొదట స్ర్తీశక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశమయ్యారు. ఇలా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇకపై పురుషులకు చెప్పుకోలేని సమస్యలను మనకు మనమే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ మహిళలు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు.
అందరి భద్రత కోసం..
రైల్వే వర్క్‌షాప్‌లో మహిళా శక్తిని బలోపేతం చేస్తూ ‘వర్క్‌షాప్‌ మహిళ’కు ఈ ఏడాది ఏప్రిల్‌ 17న శ్రీకారం చుట్టారు. ముందుగా మహిళా ఉద్యోగినుల్లో చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. వర్క్‌షాప్‌ మహిళ ఆవిష్కరణానంతరం మొదటిసారి మహిళా ఉద్యోగినులను బస్సుల్లో అనంతగిరిహిల్స్‌లో విహారయాత్రకు తీసుకువెళ్లారు. మరోసారి జహీరాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో పర్యావరణ విహారయాత్రలోనూ పలువురు మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. ఇలా విహారయాత్రల్లో అందరినీ మాట్లాడించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడం కార్యక్రమ ఉద్దేశం. పురుషులు వేధిస్తే తామే తప్పు చేస్తున్నామన్న భావన వీడి ధైర్యంగా ముందుకొస్తే చర్య తీసుకుంటామంటోంది సంఘం కార్యదర్శి విష్ణువందన.
కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు..
వర్క్‌షాప్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినికి ఓ అధికారి ఏడాది కాలంగా ద్వందార్ధపు మాటలతోపాటు… తీక్షణపు చూపులు, వెకిలిచేష్టలతో వేధిస్తుండే వాడు. పదిరోజుల క్రితం సదరు అధికారి ఓ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికే ఏకంగా ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ సంఘటనతో ఆ మహిళా ఉద్యోగిని కుటుంబంలోనూ చిచ్చు రేగింది. దీంతో బాధితురాలు చేసిన ఫిర్యాదుతో వర్క్‌షాప్‌ మహిళలు మూకుమ్మడిగా కలిసి సదరు ఇంజనీరు కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కాలరు పట్టుకొని బయటకు రప్పించి నిలదీశారు. ‘‘నీ భార్యకు ఎవరైనా ఇలా ఫోన్‌ చేస్తే నీకెలా ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఇంట్లో జరుగుబాటు లేక ఉద్యోగానికి వచ్చిన మహిళలను ఇలా వేధిస్తావా? అంటూ ఘెరావ్‌ చేసి చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజరుకు ఫిర్యాదు చేశారు వాళ్లు. మహిళలంతా కదిలివచ్చి నిలదీయటంతో భయపడిన అధికారి క్షమాపణలు చెప్పారు. మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ఇంజనీర్‌పై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. మరో మహిళా ఉద్యోగినిని వేధించిన మరో ఉద్యోగిని కూడా మహిళలు నిలదీసి, ఆయనతో క్షమాపణలు చెప్పించారు. సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ వర్క్‌షాప్‌లో  పనిచేస్తున్న అయిదునెలల గర్భిణి బరువులు మోయడం వల్ల కడుపులో నొప్పి వస్తోందంటే, ఓ అధికారి వెటకారంగా మాట్లాడారు. దీంతో ఆ అధికారి వద్దకు మహిళలు వెళ్లి నిలదీశారు. రైల్వే ఉన ్నతాధికారులతో మాట్లాడి గర్భిణికి మెటిర్నిటీ లీవు ఇప్పించామంటున్నారు సంఘం నాయకురాలు సావిత్రి.
‘‘మా నాన్న హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తే చదువుకుంటున్న నాకు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ ఆలోచించి వేధింపులను ధైర్యం తెచ్చుకొని ఎదుర్కొన్నాను.. ’’ అన్నారు మరో ఉద్యోగిని చంద్రకళ.

కీచకుల భరతం పడతాం
సికింద్రాబాద్‌లోని అన్ని రైల్వే వర్క్‌షాప్‌లలో మా మహిళా సంఘం ప్రతినిధులు తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళల సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్‌ చేపడుతున్నాం. పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తే సహించేది లేదు. కీచక అధికారుల భరతం పడతాం. చట్టప్రకారం వారిపై జీఎంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– విజయ జగదీశన్‌, ఛైర్‌పర్సన్‌, వర్క్‌షాప్‌ మహిళ, సికింద్రాబాద్‌

నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిబరే కృష్ణ .ర.సం.-2

పిబరే కృష్ణ .ర.సం.-2

కన్న పేగు విలువ తెలియ జెప్పే కద ను శ్రీ ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాశారు .తల్లికి షుగర్ ఎక్కువై ఇన్సులిన్ మీద బతుకుతోంది .దాన్ని తెమ్మంటే తాత్సారం చేస్తున్నాడు కొడుకు .వాడి పరిస్తితీ అస్తవ్యస్తం గానే ఉంది .చేతిలో డబ్బు ఆడటం లేదు .పెళ్ళాం పేరుకు ‘’వనిత’’ కాని ఆ లక్షణాలు లేనిది .వాడికి అప్పే దొరకటం లేదు .మధ్యలో నలిగిపోతున్నాడు .వాడు స్నానం చేస్తుంటే వాడి చిన్నపాప మిద్దె మీది  నుంచి జారి కిందపడి చెవిలోంచి నెత్తురు కారుతోంది .వనిత ఏడుస్తూ మొగుడ్ని పిల్చింది .ఇంతలో  వాడి తల్లి వచ్చి ‘’’’దేవుడా !నా కొడుక్కిన్ని అగచాట్లు ఎందుకు పెడతాఉన్నావు ?పాపిస్తోడా యేమిరా ఈ బాదలు ,అప్పా దేవుడా కనికరము చూపించి కాపాడు తండ్రీ ‘’అని గోడు గోడున ఏడుస్తూ ,పాపను సముదాయిస్తూ ముద్దాడుతోంది .స్నేహితులెవరో కారు తెచ్చారు.పిల్లను హాస్పిటల్ కు తీసుకెళ్ల టానికి .వాడు పిల్లతో కారెక్క బోతుంటే ‘’కొడకా ఇద్దో ఈ నూర్రాపా యలు ఉంది నా తావున .తీసుకో ‘’అని వాడి చేతిలో నలిగిన నోట్లను పెట్టింది ఆ అమ్మ .కన్నపేగు విలువ మరి ఆ తల్లికి కాక ఎవరికి తెలుస్తుంది ?

శ్రీ కలువ కుంట నారాయణ తన ఊరి జ్ఞాపకాలను గుది గుచ్చి చెప్పాడు .పూర్వం అంతా నడకే నని ఇప్పుడీ కార్లు బస్సులు వచ్చి నడక మర్చిపోయారని  ‘’గేపకం ‘’చేసుకొన్నాడు .ఊర్లోని బండా గుండూ,చప్పితోడు ,పోట్టబ్బవంటి మారు పేర్లున్న మనషులు గుర్తుకొచ్చారు .’’బాపన చీమలు ,మాల కాకులు ,కుమ్మరి పురుగులు వడ్రంగి పిట్టలు ,సాలె పురుగులు ,దేవాంగ పిల్లులు ,గొల్ల భామలు ,దాసరి పాములు గుర్తుకొచ్చి ప్రపంచం లో ఏ భాషలో కూడా ఇలా కులం పేర్లున్నాయా ?ఇక్కడే ఈ ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తాడు .కప్పల్లాగా వానకు సంబర పడే జీవి లేదని చెబుతాడు .వాటిల్లో కోమటికప్పలు ‘’బేరం సారం ‘’ అని కంసాలి కప్పలు ‘’టక్కుం బిక్కుం ‘’అని ధ్వని చేస్తాయని బాపన కప్పలు ‘’నెయ్యి పప్పూ ‘’అంటా యని చిన్నప్పుడు పెద్ద వాళ్ళు చెప్పింది జ్ఞాపకం వస్తుంది .తండ్రి ని ఊళ్ళో అంతా  ‘’ఆయవారా ‘’అని పిలవటం ఆయనే తనకూ గురువవటం ,నాటకాలు ప్రాక్టీస్ చేయటం ,నరసయ్య నాయుడు నిద్ర పోతూకూడా మద్దెల దరువు లయ తప్పకుండా వాయించటం గుర్తుకొచ్చి మురిసి పోతాడు .ఇప్పుడు వేసే నాటకాలలో గందర గోళం ఉందని బాధ పడతాడు .’’నా చిన్న నాటి అనుభవాలు గుత్తులుగా మొలసుకొని వస్తున్డాయి .అందరితో పంచుకోవానే తహ తహ నన్ను  ‘’నీ గేసుకొన్న(దార బోసుకున్న ) గ్యాపకాలు ‘’రాయిన్చిందని ముగిస్తాడు .

శ్రీ కారు పల్లి నరసింహ మూర్తి ‘’అమ్మే ఆపేకారము ‘’పేరు తో రాసిన కధలో తల్లి అనాకారితనానికి  లొట్ట కన్నుకు కొడుకు చీదరించుకొంటూ దూరం గా పోయి పెద్దింటి పిల్లను పెళ్ళాడి సంపన్నుడై కూడా ఊరికి రాకుండా వచ్చినా తల్లిని చూడకుండా పుట్టిన పిల్లల్ని నాయనమ్మ కు చూపకుండా ఉంటాడు .ఒక సారి వాడు కుటుంబం తో ఊర్లో జరిగే ‘’తేరు ‘’ను చూడటానికి వచ్చాడు  .పిల్లలు ముసలి అవ్వ ఫోటో తీశారు ఫ్రెండ్స్ కు చూపిద్దామని .కొడుకును  గుర్తుపట్టిన తల్లి వాడికి కనపడకుండా వెళ్ళిపోయి ఊరి కారణం  చేత ఒక ఉత్తరం కొడుక్కి రాయించి వాడెక్కడున్నా కని  పెట్టి ఉత్తరం ఇమ్మని కోరింది .అలానే అడ్రస పట్టుకొని వాడి చేతిలో ఉత్తరం పెట్టాడు .చదివిన కొడుకు నిలువునా నీరై కన్నీరు కాలువలు కట్టేట్లు గా ఏడ్చాడు .తన తప్పు తెలుసుకొన్నాడు .తల్లి రాసిన ఉత్తరం లో ‘’చని పోయేముందైనా నీకు నిజం తెలియాలని రాస్తున్నా.నాకన్ను ఎలా లొట్ట బోయిందో ఊళ్ళో కరణానికి (శాన బొగులు )నాకే తప్ప ఎవరికీ తెలియదు .నీ చిన్నప్పుడు ఒక ఆబోతు  రంకె లేస్తూ వీధిలో వీరంగం చేస్తోంది .అది అక్కడే నుంచున్న నీ మీదకోస్తుంటే దాన్ని నేను అదిలిస్తే అది రెచ్చిపోయి నా పై బడి కుమ్మేసింది .నాకన్ను లొట్ట బోయింది .మొహమంతా గీక్కు పోయి వికారం గా మారింది  .నీకూ దెబ్బలు తగిలాయి .నిన్నూ నన్నూ కారణం  పట్నానికి తీసికెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాడు .నా గాయాలు మూడ్రోజుల్లో తగ్గాయి .నీజ్వరంనెల్లాళ్ళ దాకా  తగ్గ లేదు .మీ నాన్న గుర్తుగా జాగ్రత్త గా  పెట్టుకున్న తాళి బొట్టూ, కమ్మలూ అమ్మి ఆసుపత్రికి కట్టి నిన్ను బతికిన్చుకొన్నా . నువ్వు బతికి బాగుండాలని  తపన పడి సాకి పెద్దోన్ని చేశా .కూలి నాలి చేసి కరణం ఋణం కూడా తీర్చేశాను .ఇక మిగిలింది నాకు నేనుండే ఇల్లు అది నీ పేర రాసి కరణానికిచ్చి  దస్తావేజు పంపిస్తున్నా .నా కొడుక్కోసం పోగొట్టుకున్న కన్ను నా కొడుకును   దూరం చేసింది .ఒక సారి ఇంటికొచ్చి నన్ను అమ్మా అని పిలు చాలు ‘’.ఆ ఫోటో లో ఉన్నదే నాయనమ్మ అని వాళ్లకు ఏడుస్తూ చెప్పాడు .తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు .

పిల్లాడు తీసిన అమ్మ ఫోటో ను తీసుకొని కుటుంబం తో పల్లెకొచ్చి ,ఇంటిని స్కూల్ పేర రాసి అందులో డెవలప్ చేసిన అమ్మ ఫోటో పెట్టి ‘’నా ఎట్లా కొడుకు ఇంగేవారికి ఈయద్దుదేవుడా !’’అని అందరికి వినబడేట్లు మొక్కి వెళ్ళిపోయాడు .కళ్ళు చెమర్చే పేగు బంధం కల మరో కద. దృక్కోణం మాత్రం వేరు .

యువకదా రచయిత శ్రీ కేంచప్ప గారి మునిరాజు ‘’ఎనుముపోతు  పండుగ ‘’లో పిల్లలకు దున్నపోతును అమ్మవారికి బలివ్వటం ఇష్టం ఉండదు .దాన్ని కాపాడాలని అనుకొంటారు వారి వల్లకాదు .’’సప్పలమ్మ తల్లి దీపాల పండుగ ‘’నాడుదాన్ని తెగేసి బలిస్తారు .మాంసాన్ని  ఊరంతా ప్రసాదం గా తీసుకొని వండుకొనే రివాజు .పిల్లలకు కడుపు తరుక్కు పోతూ ఉంటుంది జంతు హింస .కాని ‘’కోసిన పాపం తింటే పోతుంది’’అనే సామెత చెప్పాడో మారెప్ప .సరే నను కొంటారు .దున్నను నరికే వాడి చేతులు పడిపోవాలని కోరుకుంటారు .కాని ఏమీ చేయలేని నిస్సహాయా స్తితి వారిది .చివరికి ఒక్కేటుతో ఎనుమును నరకడం మాంసంఅమ్మవారికి నైవేద్యం పెట్టటం  వండుకు తినటం ఆ మసాలా కంపు కు పిల్లలు మురిసి పోవటం జరిగి అమ్మవారు శాంతించి జల్లు కురిపించిందని సంబర పడతారు .ఈ తంతులో జరిగే ప్రతి విషయాన్ని వివరించాడు రాజు .పిల్లల మనస్తత్వమూ మనకు తెలుస్తుందింది ఇందులో .

శ్రీ గోనోళ్ళ సురేష్ రెడ్డి ‘నల్ల రగ్గు ‘’కధలో మంచి సస్పెన్స్ ఉంది .పెద సావు కారు బుచ్చయ్య   ,కస్టపడి చేను చేసుకొనే రాజన్నఅనుకోకండా హత్యలకు గురి అవుతారు .ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. రక రకాల ఊహా గానాలు రేగుతాయి .నల్ల రగ్గు కప్పుకొన్న వారెవరో ఈ హత్యలు చేశారని అందరూ అనుకొంటారు .బుచ్చయ్యను రాజన్న చంపాడని రాజన్నను భార్య నరసమ్మ చంపిందని కధనాలు పుకార్లు షికార్లు చేస్తాయి .ఎవరికి అర్ధం కాక బుర్రలు పగల కొట్టుకొంటున్నారు  .’’ఏయ్ పుంగు మాట లేలరా .సంపినప్డు సూసినోడేవరూ లేరు .సంపినోడేవడో ఆడికే ఎరిక మనకేలరా “’అను కొంటారు .చివరి వాక్యం లో ‘’ఉతికి ఎండేసి మడిసి పెట్టిండే నల్ల రగ్గు ను తీసి బిడ్డల మీద కప్పుతా కసిగా నగు కొనింది సావుకారి పెండ్లాము బయ్యమ్మ ‘’అని ముగిస్తాడు రచయిత . ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధానం గా ఉండి హత్యకు కారణాలౌతాయని మనకు చివరికి తెలుస్తుంది .ఈ హత్యలు చేసింది షావుకారు బుచ్చయ్య భార్య బయ్యమ్మే నని నమ్మాల్సి వస్తుంది .

శ్రీ మతి కొమాండూరు కృష్ణ కళా వతమ్మ’’ పుట్టింటి బెమ ‘’లో పుట్టింటి సంప్రదాలకు భిన్నం గా అత్తింటి పద్ధతులను అలవర్చుకోవటం మొదట్ల్ కష్టం గా ఉన్నా చివరికి రాజీ పడి అత్తగారి విధానాలనే ఆచరించిన ఒక కోడలి మనస్సు వివరణ ఉంది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-7-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment