పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1

  పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1

 నవంబర్ ఇరవై తేదీన ఉయ్యూరు లోఎ.సి. శాఖా గ్రంధాలయానికి మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్తాపన చేయటానికి మంత్రి శ్రీ పార్ధ సారధి గారి తో బాటు రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ,సీనియర్ పాత్రికేయులు శ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారు విచ్చే శారువుయ్యూరు శాఖా గ్రంధాలయం మొదటి అంతస్తు శంకుస్థాపన ..ఆ సమయం లో ఖాళీ సమయం లో నాతో చాలా సేపు పిచ్చా పాటీ మాట్లాడారు పద్మశ్రీ గారు .వారు ఇటీవలే రచించిన తమ ఆత్మ కధనం ‘’నాకలం -నా గళం  ‘’పుస్తకాన్ని సంతకం పెట్టి అందించారు .అందులోని విశేషాలు ఈ తరం వారికి చాలా తెలీవు .వాటిని సాహితీ బంధువులకు సూక్ష్మం గా అందజేస్తున్నాను ఇది సమీక్ష కాదు కాని ఆవిష్కరణ .

           తుర్ల పాటి వారి జీవితం లో చాలా భాగం కృష్ణా జిల్లా గన్నవరం లో నే గడిచింది .ఒకసారి ప్రధాని నెహ్రు విజయవాడ లో ఉపన్యాసం చేస్తున్నాడు .ఆయన ఇంగ్లీష లో చెప్పినదాన్ని అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవ రెడ్డి గారు తెలుగు లోకి అనువాదం చేస్తున్నారు .నెహ్రు ‘’కోల్డ్ వార్ ‘’అని వాడిన మాటకు రెడ్డి గారు పొరపాటో గ్రహపాటో తెలియకో ‘’శీతల యుద్ధం ‘’అని తెలుగు చేసి చెప్పాడు .అప్పుడు కుటుంబ రావు గారు ‘’ప్రజా పత్రిక ‘’తెలుగు వార పత్రిక ఎడిటర్ .ఈయన వెంటనేప్రెస్ గాలరీ నుంచి లేచి ‘’శీతల యుద్ధం కాదు –ప్రచ్చన్న యుద్ధం ‘’అనాలి అని అరిచారట .ప్రధాని ముఖ్య మంత్రి వైపుకు ,ఆయన వీరి వైపుకు చూసారు .రెడ్డి గారు కొంచెం చిన్న బుచ్చుకోన్నారట .

             1947 లో దేశం స్వాతంత్ర్యాన్ని పొంది ప్రధమ మంత్రి వర్గం నెహ్రు నాయ కత్వాన ఏర్పడి నప్పుడు ఒక్క ఆంధ్రునికి కూడా మంత్రి వర్గం లో స్థానంనం లేదట .ఈ విషయాన్ని ‘’స్వతంత్ర భారతం లో ఆంధ్రులకు అన్యాయం ‘’శీర్షిక తో ఆంద్ర ప్రభలో ఒక లేఖ రాసి తుర్ల పాటి అందరి దృష్టికి తెచ్చారు అది గొప్ప సంచలనాన్నే కల్గించింది .అప్పటి నుంచి కుటుంబ రావు గారి కలానికి ,గళానికి బలం పెరిగింది .ఇంకో సారి అప్పటి గవర్నర్ జెనరల్ రాజాజీ ఏదో సభలో భారత దేశం లో ఉత్తమ భాషలు గా హిందీ ,బెంగాలీ తమిళాలనే పేర్కొని తెలుగును పట్టించు కోలేదట .ఈ విషయం తెలిసిన తుర్ల పాటి రాజాజీ తప్పును చూపుతూ  ఆయనకే జాబు రాసి తెలుగు గొప్పదనాన్ని జే.బి.హాల్డేన్ లాంటి పాశ్చాత్యులే మెచ్చిన  వైనాన్ని జ్ఞాపకం చేశారు .దానికి సమాధానం రాస్తూ వీరిని ‘’నా ప్రియ మైన తెలుగు భాషా రక్షకుడా (గార్డియన్ ఆఫ్ తెలుగు )అని సంబోదిన్చారట .అది యాదృచ్చికమే నని తెలియ జేశారట .

               ఆంద్ర కేసరి ప్రకాశం గారికి నంజు వ్యాధి ఉండేదట .దానికోసం డాక్టర్ల సలహా మేరకు రోజు రాత్రి పడుకో బోయే ముందు ఒక ఔన్సు బ్రాందీత్రాగే వారట .అలా చేయక పోతే తెల్లారే సరికి కాళ్ళు అరటి స్తంభాలలా లావై పోయేవి ఒక సారి ప్రకాశం గారికి బ్రాందీ కొన టానికి చేతిలో అయిదు రూపాయలు కూడా లేవట .అప్పుడు వారి రెండవ కొడుకు హను మంత రావు కుటుంబరావు గారి నడిగాడట .వీరు ఇచ్చి పంపారట .

             విజయ వాడ మునిసిపల్ చైర్మన్  డాక్టర్ టి.వి.ఎస్.చల పతి రావు గారికి అమెరికా సందర్శనకు ఆహ్వానం వచ్చింది .అప్పటి ఉప ముఖ్య మంత్రి , హోమ్ మంత్రినీలం  వారు డాక్టర్ గారికి పాస్ పోర్ట్ రాకుండా అడ్డు పడ్డారట .ఈ విషయాన్ని సంజీవ రెడ్డి గారికే లేఖ రాసి సంచలం సృష్టించారు తుర్ల పాటి వారు .అప్పటి నుంచి నీలం వారికి పద్మ శ్రీ గారికి యెడ మొహం , పెడ మొహం .

         కుటుంబ రావు గారికి ప్రఖ్యాత నర్తకి కృష్ణ కుమారి గారికి వివాహం జరిగింది .దీనికి అప్పటి రైల్వే పత్రిక ఎడిటర్ పర్వత నేని ఉపేంద్ర పౌరోహిత్యం వహించి జరిపించారట .అంటే ఇరు వైపులవారితో మాట్లాడి ఒప్పించారట .

            మరో సారి నెహ్రు ఎన్నికల ప్రచారానికివిజయ వాడ వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి తో టాప్ లేని జీప్ లో  వెడుతుంటే ఆయన చేతిలో ని గులాబీ దండలను జనం మీదకు విసిరేస్తుంటే ఒక బాలుడు దండ కోసం జీప్ వెంట పరిగెత్తాడు .రెడ్డి గారు చేత్తో వాడిని తోసేస్తే కింద పడి పోవటం  నెహ్రు చూసి కోపం తోసంజీవ రెడ్డి వీపు మీద ఒక్క చరుపు చరవటం తుర్ల పాటి వారు చూశారట .      

            ఆంద్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరా హార దీక్ష చేస్తున్నారు మద్రాస్ లో .నెహ్రు మొకాలడ్డుతున్నాడు .దీనికి తోడు రాజాజీ వంత పాడుతున్నాడు .శ్రీ రాములు గారి ఆరోగ్యం క్షీణించి పోతోంది .నెహ్రు నుంచి రోజు కొ రక మైన వార్త వస్తోంది .దాన్ని నెమ్మదిగా ఆయన చెవిలో చెబుతున్నారు .కాని ఆయన ‘’నెహ్రు ఆంద్ర రాష్ట్రం ఇస్తా నన్నాడా /’’అని అడిగే వారట .లేదని వీళ్ళ సమాధానం .దీక్ష విరమించనని ఆయన పట్టు దల .రాజాజీ నెహ్రూకు ఒక రహస్య నివేదిక పంపాడట .అందులో శ్రీ రాములు గారు పగలు నిరాహార దీక్ష చేస్తూ ,రాత్రిళ్ళు ‘’మర్రి ఊడల రసాన్ని తాగుతున్నారని’’ తెలిపాడట .ఆ రసం లో ఎన్నో పోషకవిలువలున్న  పదార్దాలున్నాయని అందు వల్ల ఆయన మరణించరని కా బట్టి ఆయన దీక్ష ను లెక్క చేయాల్సిన పని లేదని నక్క జిత్తుల రాజాజీ లేఖ సారాంశం .ఇది అర్ధం చేసుకోక నెహ్రు రాష్ట్రం ఇచ్చే విషయం లో జాగు చేస్తున్నాడట .

          ఇలాంటి మరికొన్ని విషయాలు మరో సారి

              సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.