తెలుగుకు వెలుగు

తెలుగుకు వెలుగు

 

కొద్దిగా ఆలస్యమే అయినా, రాష్ట్ర పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముదావహమే. పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్‌లో, డిగ్రీ కళాశాలల్లో తెలుగు పేపర్‌ను నిర్బంధం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక తెలుగు భాషేతరులు కూడా తెలుగును రెండవ లేక మూడవ భాషగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, బీటెక్ వంటి డిగ్రీలను అందించే సంస్థలతో సహా ఇంటర్మీడియట్ కళాశాలలన్నిటిలో మూడవ భాషగా తెలుగు తీసుకోవడం అనివార్యమవుతుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సెకండరీ, ఉన్నత విద్యాశాఖాధికారులు నిర్దిష్ట నిబంధనలను రూపొందించడంలో నిమగ్నమైపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలల్లో తెలుగును నేర్చుకోవడం తప్పనిసరి కాదు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటి వరకూ తెలుగుకు బదులుగా స్పెషల్ ఇంగ్లీషును తీసుకునేందుకు వీలుండేది. కానీ, తాజా ప్రతిపాదనతో వారు తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని పాఠశాలలన్నిటిలోనూ తెలుగు, ఇంగ్లీషు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ నిబంధనల్లో సవరణలు తీసుకు రావడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఒకటి నుంచి పదవ తరగతి చదువుతున్న సుమారు 1.29 కోట్ల మంది విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ స్కూళ్లన్నిటికీ ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిస్తాయి. తెలుగును నేర్చుకోని పక్షంలో మార్కులు, ర్యాంకుల్లో కోత ఖాయం.

ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌తో సహా పలువురు పాఠశాల స్థాయిలో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను చేశారు. ఈ మేరకు చేసిన ఓ తీర్మానం సభ ఆమోదం పొందింది కూడా. ఆ తరువాత కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రతిపాదన చేశారు. ముఖ్యమంత్రి అందుకు వెంటనే అంగీకరించారు. తెలుగును మృత భాషల జాబితాలో చేర్చాల్సిన ప్రమాదం ముంచుకొస్తోందంటూ కొన్నేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తెలుగును మాట్లాడే యువతీ యువకులు, విద్యార్థుల సంఖ్య 27 శాతానికంటే తక్కువగా ఉన్న పక్షంలో ఈ భాష మృత భాషగా మారడానికి ఎంతో కాలం పట్టదని కూడా తెలిపింది. ఇక రాష్ట్రంలో 40 ఏళ్ల లోపువారిలో అధిక శాతం మంది తెలుగు మాట్లాడడానికి బిడియపడుతున్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సహజంగానే ఈ ధోరణి రాష్ట్రంలోని విద్యావేత్తలు, భాషాభిమానుల్లో ఆందోళన కలిగించింది.

వాస్తవానికి 2003 జూలైలో చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పదవ తరగతి వరకూ తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాషకు పూర్వ వైభవం కల్పించడం, రాష్ట్రంలో దీనికి మొదటి అధికార భాషగా గుర్తింపు లభించేలా చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని అప్పటి విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ప్రకటించారు. త్రిభాషా సూత్రం కింద ఉర్దూ మీడియం స్కూళ్లల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయడం జరుగుతుందని అప్పట్లో ఆయన తెలిపారు. అయితే, ఆ ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో తెలుగును విద్యాసంస్థల్లో తప్పనిసరి చేయడం హర్షణీయమైన పరిణామమే కానీ, ఇందులో కొన్ని సమస్యలు కూడా ఇమిడి ఉన్నట్టు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉన్న పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఇతర రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థులకు స్థానికంగా ఇబ్బందులు రావచ్చు. సరిహద్దు రాష్ట్రాలు ఇటువంటి నిర్ణయం పట్ల ఏవిధంగా స్పందిస్తాయన్నది ఆలోచించాల్సిన విషయమే. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ అమలు జరుగుతుందన్నది కూడా సందేహమే. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల మీద ప్రభుత్వానికి అదుపూ అజమాయిషీ లేదనేది నగ్నసత్యం. ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ…’ అనే గీతాన్ని ఉదయం వేళ రాష్ట్ర గీతంగా గానం చేయాలనే ప్రభుత్వ నిబంధన ప్రైవేట్ పాఠశాలల్లో అమలు జరగడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. పాఠ ్య ప్రణాళిక దగ్గర నుంచి సెలవుల వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు సొంత నిర్ణయాలనే అమలు చేస్తుంటాయి. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పాఠశాలలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఎంత వరకూ అమలు జరుగుతాయన్నది కూడా సందేహాస్పదమే.

అంతేకాక, కేంద్రీయ విద్యాలయాలు, సి.బి.ఎస్.ఇ, ఐ.సి.ఎస్.ఇ విద్యాసంస్థలలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే వర్తిస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. సెంట్రల్ బోర్డు కింద పనిచేసే పాఠశాలలు రాష్ట్రంలో 3,000 పైచిలుకే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి కాదు. ఇక్కడ ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని పాఠశాలల్లో తెలుగు భాషా బోధన లేదు కూడా. కొన్ని సమస్యలున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతుల పునరుజ్జీవనానికి తెలుగు బోధనను తప్పనిసరి చేయడం, ఇళ్లల్లో తెలుగు మాట్లాడడం తప్ప గత్యంతరం లేదు. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఉత్తర్వులను అమలు చేయడం అవసరం.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.