ప్రణబ్‌తో ప్రయాణం

ప్రణబ్‌తో ప్రయాణం


ఎ.కృష్ణారావు

మన జాతీయ జెండాలో మూడు వర్ణాలు ఉంటాయి. రాష్ట్రపతి అయిన ప్రణబ్ లోపల కూడా ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒకరు విజ్ఞానవంతుడు. ఇంకొకరు రాజనీతిజ్ఞుడు. మరొకరు దేశభక్తిపరుడు. ఈ ముగ్గురి సమాహారమే.. ప్రణబ్‌ముఖర్జీ. దేశ అత్యున్నత పదవిని నిర్వహిస్తున్న ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనలను తెలుసుకునేందుకు.. ఇటీవల కొందరు పాత్రికేయులకు అరుదైన అవకాశం దొరికింది. ఆ పర్యటనలో పాల్గొన్న ఒక తెలుగు పాత్రికేయుని అనుభవాలే ఇవి.. 

రాష్ట్రపతీజీ.. ఒకప్పుడు మీరు ఇదే కాలేజీలో పాఠాలు చెప్పారు. ఆ రోజులు మీకు గుర్తుకొస్తున్నాయా? ఆ మధురానుభూతుల్ని ఎప్పుడైనా తలుచుకుంటుంటారా? మీకు రాజకీయాలు నచ్చాయా.. లేక అధ్యాపక వృత్తి నచ్చిందా? చెప్పండి.
జనవరి 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని విద్యానగర్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఆయనపై ఈ ప్రశ్నల వర్షం కురిపించారు.
అది చాలా వెనుకబడిన జిల్లా. సరైన రోడ్లు లేవు. అక్కడక్కడ మాత్రమే పక్కాభవనాలు ఉన్నాయి. రాష్ట్రపతి, ఆయన బృందం ప్రయాణించిన మూడు హెలికాప్టర్లు దిగడం కోసం వాయుసేన ఎన్నో రోజుల పాటు అక్కడ కష్టపడాల్సి వచ్చింది. ఆ హెలికాప్టర్లు దిగుతుంటే చూసేందుకు వందలాది జనం గుమిగూడారు. హెలికాప్టర్లు దిగుతున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు వచ్చే దుమ్మును వాళ్ళు సంతోషంగా భరించారు.

ఎందుకంటే.. తమ ఊరికి వచ్చింది భారత రాష్ట్రపతి. దేశానికి రాష్ట్రపతే అయినా వారికి ఆయన భూమి పుత్రుడు. బెంగాలీతనాన్ని నరనరాల్లో నింపుకున్న వారి బిడ్డడు. రాష్ట్రపతి హెలికాప్టర్ దిగుతుంటే, వారికోసం చేతులూపుతుంటే, కార్లలో వారి మధ్య నుంచి వేగంగా వెళుతుంటే వారి ఆనందం చెప్పనలవి కాదు. ‘ప్రణబ్‌దా.. ప్రణబ్ దా..’ అంటూ త్రివర్ణపతాకాలు ఊపుతూ ఆత్మీయ స్వాగతం చెప్పారు.

ఒకప్పటి మాస్టారు…
ప్రణబ్‌కు ఆ ఊరు అంటే ఎంతో ప్రేమ. విద్యానగర్ కాలేజీలో 1963-68 మధ్య చరిత్ర, రాజకీయ శాస్త్రం అయిదేళ్లు బోధించిన తర్వాతే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. పాఠాలు చెప్పడమంటే ఆయనకు చాలా ఆసక్తి ఉండేదట. ముప్పావుగంట క్లాసు తీసుకోవాల్సి వస్తే అది దాదాపు గంటన్నరకు పైగా గడిచేదట. ప్రణబ్ పాఠాలు చెబుతున్నంతసేపూ ఒక్క విద్యార్థీ క్లాసు నుంచి బయటకు కదిలేవారే కాదట. ఆయన తర్వాత పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు కూడా క్లాసు బయటే నుంచునేవారట. ప్రణబ్ ఆ కళాశాలకు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కావడమే కాదు, ఆయన మేధోసామర్థ్యం పట్ల వారికున్న అపార గౌరవం అది. కళాశాల అయిపోయాక అధ్యాపకులకు శిక్షణ నిచ్చే బాధ్యతను కూడా ఆయనే తీసుకునేవారు. “నాకున్న చెడ్డ అలవాట్లలో ఒకటి- ఏదైనా చెప్పేటప్పుడు సమయాన్ని అస్సలు పట్టించుకోకపోవడం. నేను చెప్పడం మొదలుపెడితే అవతలి వ్యక్తికి సమయం ఉందా? లేదా? అనేదే ఆలోచించను..” అని ప్రణబ్ ముఖర్జీ ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మాతో అన్నారు.
జనవరి 17-20 తేదీల మధ్య ప్రణబ్‌తో కలిసి నాలుగురోజులు ప్రయాణించే అవకాశం అయిదుగురు ఢిల్లీ విలేఖరులకు దక్కింది. వారిలో నేనొకడ్ని. ఆయన వెళ్లిన చోటుకల్లా వాయుసేన విమానంలోనూ, హెలికాప్టర్లలోనూ తిరిగాం.

అలుపన్నదే ఎరుగరు…
తొలుత హైదరాబాద్ వెళ్లాం. అక్కడ గంట అయినా ఆగలేదు. వెంటనే కోల్‌కతా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఊపిరి సలపకుండా రకరకాల చోట్లకు తిప్పారు. మేమన్నా అలిసిపోయామేమో కాని 78 ఏళ్ల ఆ వృద్దుడి ముఖంలో అలసిన ఛాయలేవీ కనిపించలేదు. ఇంతకీ విద్యార్థులకు ప్రణబ్ ఏమి జవాబు చెప్పారనుకున్నారు?
“నాకు బాల్యం అంటే ఎంతో ఇష్టం. అయినా బాల్యం ఎవరికి ఇష్టం ఉండదు? కాని ఎవరైనా బాల్యంలో ఆగిపోతారా? ప్రవాహం ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగిపోతే అది మురికి కాలువగా మారుతుంది. మనం ఎప్పుడూ గతంలోనే ప్రయాణించలేం. గతంలోంచి వర్తమానంలోకి ప్రయాణిస్తూ భవిష్యత్తుపైదృష్టి సారించాలి… ” అని విద్యార్థులకు జవాబిచ్చాడు ప్రణబ్.

“రాజకీయాలు, బోధనారంగం ఇందులో మీకు ఏదంటే ఇష్టం అని మీరడిగితే ఏమి చెప్పను? రాజకీయాల్లో ప్రవేశించాలని, దేశానికి ఏమైనా చేయాలని మా అమ్మ చెబుతుండేది. మా కళాశాల సంస్థాపక అధ్యక్షుడు హరేంద్రనాథ్ మజుందార్ కూడా రాజకీయాల్లోకి వెళ్లమని నన్ను ప్రోత్సహించేవారు. అధ్యాపక వృత్తి వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు ఏది ఇష్టమో మీకు వేరే చెప్పాలా?” అని ఆయన నవ్వుతూ జవాబిచ్చారు.

విద్యార్థులు అంతటితో ఊరుకోలేదు. “మీరు ప్రధానమంత్రి కాలేకపోయారు కదా? రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక అయినా ఆ పదవిని చేపడతారా?” అంటూ మరొక ప్రశ్న వేశారు.
ప్రణబ్ ఏమాత్రం తడుముకోకుండా “నాకు వయసు మీద పడింది. నేను చదవాల్సిన పుస్తకాలు, రాయాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రపతి పదవి పూర్తయ్యాక అధ్యయనం, రచనా వ్యాసంగంపై దృష్టి కేంద్రీకరిస్తాను. ఎప్పుడూ వృద్ధులే అంటిపెట్టుకోకూడదు. కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలి..” అన్నారు.
రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర ఇలాంటి విషయాలే ప్రణబ్‌కు తెలుసనుకుంటాం కాని ఆయనకు కీట్స్, షెల్లీల రొమాంటిక్ పొయెట్రీ చాలా ఇష్టమని తెలిసింది. ఒక టీచర్ ఆయనను “మీరు కవితలు చదువుతుంటారా” అని అడిగినప్పుడు “నాకు కీట్స్,షెల్లీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, బుద్దదేవ్ బసు, శక్తి ఛటోపాధ్యాయ, సుధీంద్రనాథ్ దత్తా, విష్ణు డే కవితలు ఎంతో ఇష్టం. అయితే ఇప్పటి ఆధునిక కవిత్వం గురించి నాకంతగా తెలీదు” అని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

అన్నీ గుర్తుంటాయి..
ప్రణబ్ ముఖర్జీకున్న గొప్ప లక్షణాల్లో ఒకటి- ఆయనకున్న అసమాన జ్ఞాపకశక్తి. రాష్టపతి పదవికి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ అవసరమైంది. తన కుమారుడు ఈ సర్టిఫికెట్ ఎక్కడో పోగొట్టారట. దీంతో ఆయన స్కూల్ ప్రిన్సిపల్‌కు ఫోన్ చేసి క్లాసులో తన రోల్ నెంబర్, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ చెప్పి సర్టిఫికెట్‌ను సంపాదించడం సులభతరం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే విలేకర్లతో చెప్పి ఆశ్చర్యపరిచారు. చరిత్రలో జరిగిన అనేక కీలక ఘట్టాల్ని తేదీలతో సహా చెప్పగల దిట్ట ప్రణబ్. ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు.. ఈ విషయం అర్థమవుతుంది. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇందిరాగాంధీ మొదలైన జాతీయ నాయకులు ఏఏ తేదీల్లో ఏఏ నిర్ణయాలు తీసుకున్నారు? చరిత్ర ఏఏ తేదీల్లో మలుపు తిరిగింది? దేశ విభజన సమయంలో ఏ రోజు ఏమి జరిగింది? అవన్నీ ఆయన చెబుతుంటే నోళ్లు తెరుచుకుని విన్నాం మేమంతా. విద్యానగర్ కాలేజీలో తనతో పాటు పనిచేసిన అధ్యాపకుల పేర్లన్నీ ఆయనకు ఇప్పటికీ గుర్తున్నాయని.. ఆయన వారి గురించి ఆరా తీస్తుంటే తెలిసింది.

బిజీలోనూ పుస్తకాలు తిరగేస్తూ…
ఆయన మరో అద్భుత లక్షణం- పని రాక్షసుడు కావడం. సాధారణంగా రాష్ట్రపతితో పర్యటనకు వెళ్లడానికి విలేకరులు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రిలాగ రాష్ట్రపతి కార్యకలాపాల్లో హడావుడి ఉండదు. రోజుకు ఒకటి రెండు కార్యక్రమాలు ఉంటే మహా ఎక్కువ. ఆ తర్వాత విలేకరులు స్వేచ్ఛగా తిరిగేందుకు, మంచి మంచి ప్రదేశాలు చూసేందుకు అవకాశం దొరుకుతుంది. అయితే ప్రణబ్ అంతకు భిన్నమైన వ్యక్తి అని ఆ నాలుగు రోజుల్లోనే అర్థమైంది. ఉదయం తొమ్మిదింటికి కోల్‌కతా రాజ్‌భవన్ చేరుకుంటే రాత్రి ఎనిమిది వరకు ఆయనతో పాటు తిరగడమే పని. తిరిగొచ్చిన తర్వాత కూడా ప్రణబ్.. రాత్రి 12 గంటల వరకు న్యాయమూర్తులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో సహా ఎవర్నో ఒకర్ని రోజూ కలుస్తూనే ఉండేవారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరోజు రాత్రి 9 గంటలకు వచ్చి ప్రణబ్‌తో కలిసి విందు స్వీకరించి, దాదాపు రెండు గంటలుండి వెళ్లారు. ఈ నాలుగురోజుల్లో ఆయన కేంద్రం నుంచి వచ్చిన ఎన్నో ఫైళ్లపై తన అభిప్రాయాలు రాసి పంపించారు. కోల్‌కతాలో ఉన్నప్పుడే ఆయన జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇవి చాలవన్నట్లు ఏ మాత్రం వీలున్నా పుస్తకాలు తిరగేస్తూనే ఉన్నారు ప్రణబ్. సుభాష్ చంద్రబోస్‌పై సుగతాబోస్ రాసిన ‘హిస్ మెజిస్టీస్ అప్పోనెంట్’ అనే పుస్తకం గురించి చెబుతూ… “నేను ఈ పుస్తకాన్ని రెండురోజుల్లో చదివేశాను. చాలా ఆసక్తిగా ఉంటుంది. మీరు కూడా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది” అని ఆయన పాత్రికేయులకు సూచించారు.

చదువుకునే రోజుల్లో ప్రతి రోజూ గంటల తరబడి చరిత్ర, రాజనీతి, అర్ధ శాస్త్రం, ఆధునిక సంస్క­ృతి, నాగరికతకు సంబంధించిన పుస్తకాలతో పాటు కవితా సంపుటాలనుకూడా చదివే వారట. చదవడమే కాక, వాటన్నిటినీ కంప్యూటర్‌లా మెదడులో భద్రపరుచుకున్నారు. ఆ అలవాటును ఆయన ఇప్పటికీ మానుకోలేదు. ఇన్ని పనులు చేస్తున్న ఆయన ఎప్పుడు నిద్రిస్తారు? అని అడిగితే ప్రణబ్ రోజుకు ఐదు గంటలే నిద్రిస్తారని, చాలా స్వల్ప పరిమాణంలో ఆహారం తీసుకుంటారని ఆయన సహాయకులు చెప్పారు. ఆయన రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్ళాక తాము విశ్రాంతి తీసుకోవచ్చని భావించామని.. కాని ఆయన ఎక్కడైనా సరే పని చేయకుండా ఉండరన్న విషయం అర్థమైందని వారు చెప్పారు.

ప్రణబ్ ఆర్థికమంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగి ఉంటే జైపూర్‌లో జనవరి 18-20 తేదీల మధ్య జరిగిన పార్టీ మేధోమధన సదస్సులో కీలక పాత్ర పోషించి ఉండేవారు. పార్టీ చర్చించే పత్రాలను ఆయనే రూపొందించేవారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో కీలకపాత్ర పోషించారాయన. కాని ఈసారి ఈ మేధావి లేకుండానే ఆ సదస్సు జరిగింది. అదే సమయంలో ఆయన కోల్‌కతాలో తన ప్రజల మధ్య ఇన్నాళ్లూ తాను కోల్పోయిన సంబంధాలను వెతుక్కుంటూ, రాష్ట్రపతి హోదాను కూడా పట్టించుకోకుండా చిన్న చిన్న సమావేశాల్లో మాట్లాడుతూ, తనవారిని ఆప్యాయంగా పలకరిస్తూ గడిపేశారు. అయినాసరే, జైపూర్‌లో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ప్రకటించడంపై ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్‌లో కొత్త కాదు.. ఏ పరిణామమైనా ఇలాగే జరుగుతుంది” అంటూ మోతీలాల్ నెహ్రూ 1919లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ వారసత్వ చరిత్రను వివరించారు.

జాతీయవాది..

ప్రణబ్ ముఖర్జీ జాతీయవాది అని ఆయన సంభాషణల ద్వారా, అక్కడ ఆయన చేసిన ప్రసంగాల ద్వారా అర్థమవుతుంది. అది చిన్న కార్యక్రమమైనా సరే అందులో జాతీయ ప్రయోజనం ఉంటేనే అంగీకరిస్తారాయన. “నాకు జాతీయవాదం పట్ల అభిమానాన్ని ఏర్పరచింది వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లు” అని ఒకసారి చెప్పారు. తన రాజకీయ గురువు అజయ్ ముఖర్జీ’ అని ఆయనను కాంగ్రెస్ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడం చాలా బాధించిందని చెప్పారు. ఆరోజుల్లో జరిగిన విశేషాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. 1960 దశకంలోనే పశ్చిమబెంగాల్ రాజకీయాలు కాంగ్రెస్, కాంగ్రెసేత ర శిబిరాలుగా విడిపోయాయి. వామపక్షాలు ప్రవేశిస్తున్న రోజులవి. పదమూడేళ్లుగా కేబినెట్ మంత్రిగా ఉన్న అజయ్ ముఖర్జీ కాంగ్రెస్‌లో ప్రవేశిస్తున్న విలాసవంతమైన ధోరణులను తీవ్రంగా విమర్శించారు. ఆకలితో బాధపడుతున్న వేలాది మంది ప్రజలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు.

కాంగ్రెస్ డబ్బున్నవారికి దాసోహం అయిందన్నారు. దీనితో ఆయనను బయటకు పంపించారు. హుమయూన్ కబీర్, అరుణా అసఫ్ అలీ వంటి హేమాహేమీలు ఆయనతో గళం కలిపారు. యువ ప్రణబ్ ముఖర్జీ కూడా వెనుకాడలేదు. అజయ్ ముఖర్జీ ప్రారంభించిన బంగ్లా కాంగ్రెస్‌లో చేరారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో బెంగాల్‌లో దిగజారిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిపై ఆయన రాసిన పత్రాలు, తీర్మానాలు, కరపత్రాల వల్లనే గొప్ప రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. 1967లో బెంగాల్‌లో అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన మొట్టమొదటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కూడా ప్రణబ్ కీలకపాత్ర పోషించారు. ఈ యువ మేధావిని రాజ్యసభకు పంపించేందుకు అప్పుడు వామపక్షాలు సైతం సహకరించాయి.

ప్రణబ్ వాక్ప్రతిభ, రాజనీతిజ్ఞతే ఆయనను భూపేన్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా, మీనూ మసానీ, నంబూద్రిపాద్, కృపలానీ వంటి దిగ్గజాలకు సన్నిహితం చేసింది. ఇందిరాగాంధీ సంగతైతే చెప్పనక్కర్లేదు. కామరాజ్, మొరార్జీ వంటి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఇందిరాగాంధీ మళ్లీ అజయ్ ముఖర్జీని దరి చేర్చుకోవడంతో బంగ్లాకాంగ్రెస్ కాంగ్రెస్‌లో విలీనం కావడం, ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, 36 ఏళ్ల వయస్సులో కేంద్రంలో మంత్రిగా చేరడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచీ ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.

రాజీవ్ హయాంలో ఒకసారి కాంగ్రెస్‌ను వదిలిపెట్టాల్సి వచ్చింది కాని మళ్లీ కాంగ్రెస్‌కు ఆయన అవసరం కలిగింది. ప్రణబ్ రక్తంలో కాంగ్రెస్ వ్యతిరేకత నరనరాల్లో జీర్ణించుకుని ఉన్నదా అనిపిస్తుంది ఒక్కోసారి. కాంగ్రెస్‌లో ఏర్పడిన రుగ్మతలను ఆయన సహించలేకపోయేవారు. తర్వాత తర్వాత భరిస్తూ వచ్చారు. ఆయనలోని జాతీయవాది అలాగే ఉండిపోయారు. దేశ సమస్యలను జాతీయవాద దృష్టితో చూసే అరుదైన నాయకుల్లో ఒకరుగా ఉండిపోయారు. ఆయన మేధావిత్వమే ఆయనను ప్రధానమంత్రి పదవికి అనర్హుడిగా మార్చిందనేవారు కూడా ఉన్నారు.

వివేకానందుడంటే భక్తి..
కోల్‌కతా ప్రయాణంలో ప్రణబ్‌ముఖర్జీ పాల్గొన్న వాటిలో ఒకటి- వివేకానందుడి 150వ జయంతి వేడుకల కార్యక్రమం. జాతీయస్థాయిలో వివేకానంద జయంతి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. రాష్ట్రపతి కాకముందు వరకూ కమిటీకి ఆయనే చైర్మన్. ఇప్పుడు వెనకుండి కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ప్రణబ్‌తో పాటు వివేకానందుడు నివసించిన ఇల్లును సందర్శించే అవకాశం మాకు దక్కింది. దైవశక్తి కంటే మానవ శక్తి ఎంత గొప్పదో వివేకానందుడు చెప్పిన తీరును ప్రణబ్ అద్భుతంగా వివరించారు. ప్రాచీన సంస్కృతిని, విలువలను గౌరవిస్తూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లో పతనమవుతున్న విలువలను కాపాడుకోవాలని చెప్పారు. కోల్‌కతాకు 25 కిలోమీటర్ల దూరంలోని బారక్‌పూర్‌లోని రామకృష్ణ మిషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు రాష్ట్రపతి. బారక్‌పూర్‌లోనే 1857లో తొలిస్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్‌పాండే బ్రిటిష్ కమాండర్‌పై తిరుగుబాటు చేశారు.

పోరాటయోధులను మరిచిపోలేదు…
ప్రణబ్ పర్యటనలో మరో ప్రధాన ఘట్టం- స్వాతంత్య్ర సమరయోధులతో సంబంధం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం. తన గురువు అజయ్ ముఖర్జీ ఒకప్పుడు బ్రిటిష్ వారితో పోరాడి విముక్తం చేసిన తామ్రలిప్త (తమ్లుక్) ప్రాంతాన్ని సందర్శించారు. తూర్పు మిడ్నపూర్‌లోని తమ్లుక్‌లో ఉన్న నిమ్‌తౌరి వద్ద ఉన్న స్మృతి సౌధలో ఆయన అజయ్ ముఖర్జీతో పాటు మరో ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ స్మ­ృతిసౌధలో ఎక్కడ చూసినా వందలాది స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు కనిపిస్తాయి. వారి త్యాగాల చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో వారు జరిపిన పోరాట ఘట్టాలు గుర్తు చేసే అనేక స్మృతి చిహ్నాలు ఉన్నాయక్కడ. దీన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి.

నిజానికి బెంగాల్‌లో ఏ మూల పర్యటించినా దేశభక్తి, జాతీయవాదం, సాహిత్యం, సంగీతంపట్ల అభిరుచి గుబాళిస్తాయి. ఇదే ప్రణబ్‌ను తీర్చిదిద్దిందేమో అనిపిస్తుంది. ఏ ట్రాఫిక్ లైట్ వద్ద నైనా రవీంద్రుని సంగీతం మనకు వినిపిస్తుంది. మమతా బెనర్జీ కృషి ఫలితం ఇది. ప్రణబ్ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ రవీంద్ర సంగీతం, దేశ భక్తి గీతాలు వినబడి మనసును పరవశింప చేశాయి.

నేతాజీ జ్ఞాపకాలు..
కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివసించిన ఇల్లును కూడా ప్రణబ్ బృందంలో భాగంగా సందర్శించడం మరో సదవకాశం. ఇదే ఇంట్లో నేతాజీని బ్రిటిష్ వారు గృహ నిర్బంధంలో ఉంచారు. 1941లో ఆయన ఇక్కడి నుంచే మాయమై బెర్లిన్‌లో ప్రత్యక్షమయ్యారు. సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో చివరిసారి ప్రయాణించిన కారును కూడా ఈ ఇంట్లో చూడవచ్చు. ఇప్పుడు అక్కడ ఆయన కుటుంబీకులు ఒక రీసర్చ్‌బ్యూరోను నడుపుతున్నారు. బోస్ సోదరుడు శిశిర్ కుమార్ బోస్ కుమారుడైన ప్రముఖ చరిత్రకారుడు సుగతా బోస్ రచించిన ‘హిస్‌మెజిస్టీస్ అపోనెంట్ బెంగాలీ’ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమంలోనూ ప్రణబ్ పాల్గొన్నారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు జర్మనీ నుంచి వచ్చిన నేతాజీ కూతురు అనితా పఫాఫ్, ఆమె జర్మనీ భర్త మార్టిన్‌ను చూడగలిగాము. ఆయన జర్మనీలో మాజీ ఎంపి. నేతాజీ వియన్నాలో ఉన్నప్పుడు తనకు కార్యదర్శిగా పనిచేసిన ఎమిలీ అనే ఆస్ట్రియన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి సంతానమే అనిత. తిరుగు ప్రయాణంలో ప్రణబ్ నేతాజీ కుటుంబం గురించి పుంఖానుపుంఖాలుగా తేదీలతో సహా చెప్పుకొచ్చారు. “వారిది జాతీయ భావాలుగల విద్యావంతుల కుటుంబం. నేతాజీదే కాదు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిదీ గొప్ప చరిత్ర..” అని చెప్పారు ఆయన.

మీడియా ఎలాంటిదంటే..
చాలా సమావేశాల్లో ప్రణబ్‌రాసుకున్న ఉపన్యాసాలను పక్కన పడేసి.. చరిత్రను అభివర్ణిస్తూ భావోద్వేగంతో ప్రసంగిస్తున్నప్పుడు వినితీరాల్సిందే! కోల్‌కతా ప్రెస్‌క్లబ్‌లో ఇండియన్ జర్నలిస్టు అసోసియేషన్ 90వ వార్షికోత్సవంలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏ కాగితమూ చూడకుండా ఏకధాటిగా ప్రసంగించారు. “పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు ఉన్న సంబంధం.. నీటికీ చేపలకూ ఉన్న సంబంధం లాంటి ది. మీడియా లేకుండా రాజకీయం ఎక్కడిది?” అని ఆయన చమత్కరించారు. “అదే సమయంలో మీ అభిప్రాయం స్వేచ్చగా చెప్పండి.. కాని వాస్తవాలను ఉన్నదున్నట్లు వివరించండి..” అని ఉద్బోధించారు.

చివరిగా ఢిల్లీ వచ్చే ముందు.. కోల్‌కతాలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్మించిన ‘సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ టెర్మినల్’ భవనాన్ని ప్రారంభించారు ప్రణబ్. బడా పారిశ్రామిక సంస్థలు వేలకోట్లు ఖర్చుపెట్టి అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తున్న ఈ రోజుల్లో అంతకు ఏమాత్రం తీసిపోకుండా అత్యద్భుతమైన స్థాయిలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ దాన్ని నిర్మించడం చూసి ఆయన అచ్చెరువొందారు. దేశ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో ప్రైవేట్ రంగాన్ని ఉపయోగించుకోవడం అవసరమే కాని ప్రభుత్వ రంగం కూడా తలుచుకుంటే అద్భుతాలు చేయగలదని వ్యాఖ్యా నించారాయన.

చివరగా ఒక్క మాట. ప్రణబ్‌తో ప్రయాణించడమంటే ఒక సజీవ చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు, మేధావితో ప్రయాణించడమే! ‘కలలు కనండి..’ అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సందేశమిస్తే ‘కాలే కడుపుకు కలలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన తొలి రిపబ్లిక్ డే సందేశంలో ప్రశ్నించారు. అదే ఆ ఇద్దరికీ తేడా.

ఎ.కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.