గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం

మహారాష్ట్ర లో భోసలే వంశ రాజ్య పాలన ప్రారంభించిన శివాజీ జీవితమే ఒక చరిత్ర, స్పూర్తిదాయకం .పరామానందకవి రాసిన’’ శివభారతంకావ్యం ‘’ లో ముప్ఫై ఒక్క అధ్యాయాలలో శివాజీ చరిత్ర సర్వం ఉన్నది .ఆయన జైత్రయాత్రలు విజయ పరంపర అన్నీ విశదంగా వర్ణించాడు కవి .శివాజీ  ‘’పర్ణ పర్వత కోట ‘’ను ఆక్రమించిన వీర గాధను జయరామకవి అయిదు ఉల్లాసాలలో ‘’పర్ణాల పర్వత గ్రబాఖ్యానం ‘’లో వర్ణించాడు .శివాజీ కుమారుడు ‘’రాజరాము’’ని గూర్చి కేశవ పండిట్ జీ కవి ‘’రాజ రామ చరిత్ర ‘’రాశాడు .ఇది అయుదు కాండల కావ్యం .కర్నాటక లో మహా రాష్ట్ర ప్రాభవం విజయ యాత్రలు అన్నీ అభివర్నితాలు .

తంజావూర్ రాజు ఏకోజి లేక వెంకోజి (1675-1680)ఆస్థానం లో మంత్రి బాలకృష్ణ కొడుకు జగన్నాధకవి ‘’రతి మన్మధ ‘’నాటకం రాశాడు .మరో మంత్రి ఆనంద యజ్వుని కుమారుడు శ్రీశైల కవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రాశాడు .

రాజుల కవితా వైభవం

రాజు ఏకోజి కుమారుడు షాహాజి రాజు ‘’చంద్ర శేఖర విలాసం ‘’అనే నాటకం రచించాడు .కుమార సంభవ చంపు ‘’ కూడా రాసి శరభోజి ‘’యుద్ధ దేవత’’ ఆవిర్భావాన్ని తెలియ జేశాడు .శరభోజి నీతి శతక కర్త కూడా .ఏకోజీ మూడవ కొడుకు రాజా తుక్కోజి మనవడు తుల్జాజి రాజు ‘’సంగీత సారామృతం ‘’రాశాడు .

తంజావూర్ సరస్వతి  మహల్ –శరభోజి పుణ్యమే

సర్ఫోజి అనబడే శరభోజి రాజుఏకోజీ రాజు కు రెండవ కుమారుడు .దక్షిణ భారత దేశం లో సంస్కృత గ్రంధ పరి రక్షణ చేసిన మహోదారుడు .ఎన్నో అమూల్యమైన సంస్కృత వ్రాత ప్రతులను సేకరించి  తంజావూర్ లోని సరస్వతి మహల్ లో భద్రపరచి గొప్ప సాహిత్య సేవా చేశాడు .ఆ భవనానికి ‘’తంజావూర్ మహా రాజా సర్ఫాజి సరస్వతి మహల్ గ్రంధాలయం ‘’అని నామకరణం చేశారు .ఎందరో రిసెర్చ్ కోసం ఇక్కడికి వస్తూ దీన్ని సద్వినియోగం చేసుకొంటున్నారు .

శరభోజి రామ కధను పన్నెండుకా౦డల ‘’రాఘవ చరిత ‘’కావ్యం గా రాశాడని అంటారు .దీనికే ‘’సంగ్రహ రామాయణం ‘’అనే పేరు కూడా ఉంది .కాని ఒకానొక రాత ప్రతిలోని రెండవ కాండలో ‘’పంచ రత్న కవి ‘’కృతం అని ఉన్నది .దీన్నిబట్టి అసలు రాసిన వాడు పంచరత్నకవి అని ,తన పోషక రాజు పేరు శరభోజి ని కావ్య కర్తగా పేర్కొని గౌరవించాడని భావిస్తున్నారు .శరభోజి ఆస్థానం లోనేఉన్న  అనంత నారాయణ అనే కవికి పంచరత్న బిరుదు ఉందని తెలుస్తోంది .ఈ అనంత నారాయణ ‘’ఆనంద వల్లి స్తోత్రం ‘’రాసిన చిదంబరకవి కి తండ్రి యే.

202-రామ భద్ర దీక్షితులు

చతుర్వేదీయ యజ్వన కుటుంబ౦  లో తమిళనాడు లోని కుంభ కోణం దగ్గర ఖంద్ర మాణిక్యం గ్రామం లో రామ భద్ర దీక్షితులు జన్మించాడు .తండ్రి యజ్న రత్న దీక్షితులు వ్యాకరణం లో మహా పండితుడు .సోదరుడు ర్రామచంద్ర ప్రముఖ హాస్య కవి .బాల కృష్ణ ,చొక్క నాధ ల వద్ద సాహిత్య వేదాంతాలు చదివాడు .చొక్కనాద కుమార్తెను పెళ్లి చేసుకొన్నాడు .నీలకంఠ మహా కవిపై వీరాభిమానం ఉండేది .ఆయన ప్రేరణ వలననే కవిత్వం లో ప్రవేశం కలిగింది .కీర్తి దశ దిశలా వ్యాపించి తంజావూర్ రాజు షాహాజీ (1684-1711)చెవిన పడింది. ఆహ్వానించి కవితా ప్రతిభకు మెచ్చి రాజు ‘’షాహాజీ రాజ పురాగ్రహారం ‘’కానుకగా అందించాడు .అక్కడే హాయిగా స్తిరనివాసమున్నాడు రామభద్ర .శిష్యులు  అభిమానం తో i’’అయ్యా ‘అని అయ్య దేక్షితులు  అని గౌరవంగా పిలిచేవారు .శ్రీరామునిపై పరిపూర్ణ భక్తీ ఉండేది .పద్దెనిమిదవ శతాబ్ది తొలి భాగం లో రామభద్ర కాలం చేశాడు.

దీక్షితీయ దక్షతీయం

రామభద్ర దీక్షితులు ‘’పతంజలి చరిత్ర ‘’రాశాడు .ఆయన ఆదిశేషుని  అవతారం గా పేర్కొన్నాడు .ఒక తెర అడ్డం గా ఉంచి దాన్ని తీయవద్దని ,చెప్పకుండా బయటికి వెళ్లరాదని కొన్ని నియమాలు పెట్టి మహా భాష్యాన్ని శిష్యులకు బోధిస్తుంటే గురువుగారి నోటినుంచి మాటలు రాకుండానే శిష్యులకు గ్రంధం అర్ధమై పోతోంది .గురువు ఏంచేస్తున్నాడో అనే ఉత్కంఠ తో  వెయ్యి మంది శిష్యులలో ఒక్కడుతప్ప అందరూ తెర పైకెత్తి చూశారు. గురువు కంటి మంటకు కాలి మసైపోయారు ఒక శిష్యుడు చెప్పకుండా బయటికి వెల్లడుకనుక బతికి పోయాడు క్రమ శిక్షణ  ను ఉల్లంఘిస్తే బ్రహ్మ రాక్షసి అవమని శపించాడు .చంద్ర గుప్త (పతంజలి )అనేవాడు ఆ బ్రహ్మ రాక్షపై జాలికలిగి అడవిలో చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసి కి తానె శిష్యుడిగా   మహా భాష్యం నేరుస్తూ దాన్ని రావి ఆకులపై నిక్షిప్తం చేశాడు .ఒక రోజు దాహంగా ఉందని ఆకుల్ని మూటగట్టి వెడితే మేక వచ్చి కొన్ని ఆకులు నమిలేసింది .మిగిలిన మహా గ్రంధమే మనకు లభించే ‘’పతంజలి మహా భాష్యం ‘’మేక నవిలిన భాగాన్ని ‘’అజ భక్షిత ‘’అంటే మేక మింగిన భాగం అంటారు .ఈ చంద్రగుప్తుడే ఉజ్జయిని వెళ్ళాడు .అక్కడ గ్రంధస్తం చేశాడు అదే పతంజలి యోగ శాస్త్రం గా పిలువ బడుతోంది .చంద్ర గుప్తుడు ముగ్గురు భార్యలను వివాహం చేసుకొన్నాడు .వారికి పుట్ట్టిన వారే వరరుచి ,విక్రమార్క ,భర్తృహరి .ఆదిశంకర ఆవిర్భావం తో అయన జైత్రయాత్రలతో కద నడిచి చివరి శంకరులు కంచి కి చేరే దాకా కదా ఉంటుంది .

రామభద్ర జానకీ పరిణయ ‘’అనే నాటకం కూడా  రాశాడు శృంగార తిలక లేక ‘’అయ్య భాణం’’కూడా రాశాడు .వీటిలో మధుర రాజు  భుజంగ శేఖరుని  సాహసాలు వర్ణించాడు .ఇతని స్నేహితుడు అమ్మనా చార్య అనబడే వరదాచార్య దీనికి వ్యతిరేకం గా ‘వసంత తిలక భాణం ‘’లేక అమ్మై భా ణంరాశాడు .రామభద్రకవి ‘’రామ భాణస్తవం ‘’’’రామ చాప స్తవం ‘’,రామాష్ట ప్రాస ‘’,ప్రాసస్తవం ‘’,విష్ణు గర్భ స్తవం ‘’,పర్యాయోక్తి నిష్యందం ‘’,తూణీర స్తవం ‘’రామ  భద్ర శతకం ‘’మొదలైనవెన్నో శ్రీరాముని పై రాసి తన అనన్య భక్తిని చాటుకొన్నాడు రామ భద్రకవి ‘’.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-15-ఉయ్యూరు

 

,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.