ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -156

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -156

 60-జర్మన్ సంగీత స్రష్ట ,ఆర్గాన్  నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్(Albert Schweitzer)-2

30వ ఏట స్క్వీజర్ నాటకీయం గా ఒక నిర్ణయం తీసుకొన్నాడు .భూమధ్య రేఖపై ఉన్న ఆఫ్రికాకు డాక్టర్ గా వెళ్ళాలనే కోరికతో మెడిసిన్ లో చేరాడు .అతని స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు .ఎలాగైనా అతని ప్రయత్నం మాన్పించాలని ఒక ముఖ్య స్నేహితుడు ‘’యూరప్ లో నువ్వు పాత ఆర్గాన్స్ ను రక్షించావు .ఇప్పుడు ఆఫ్రికాలో పాత నీగ్రోలను రక్షిస్తావా ?”’అని అడిగాడు .స్క్వీజర్ కు ఈ ఆలోచన చాలా కాలం నుంచే మనసులో మెదులుతోంది .విద్యార్ధిగా ఉండగానే బాధలతో యే బాదర బందీ లేని జీవితం గడపాలన్నది అతని  ఆకాంక్షగా ఉండేది .ఇరవై రెండవ ఏట ఒక సారి అకస్మాత్తుగా ‘’నేను ముప్ఫై వ ఏడు వచ్చేదాకా ఆర్ట్ కోసం శ్రమిస్తా .ఆతర్వాత నాజీవితాన్ని మానవ సేవలో గడుపుతాను ‘’అని ఒక నిర్ణయానికి వచ్చాడు .జీసెస్ చెప్పిన ‘’who se ever would save his life shall lose ,it ,and whosoever shall lose his life for My sake shall save it ‘’ దానిలో అర్ధాన్ని వెతికే వాడు , ఆ ధోరణిలో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలను కొనే వాడు మూత్తం మీద అర్ధాన్ని పట్టుకొన్నాడు .బాహ్యానందం తోపాటు ఇప్పుడు మానసికానందాన్ని పొందుతున్నాను అను కొనేవాడు .

     యూరప్ వెళ్ళటానికి ప్లాన్ ఏమీ తయారు చేసుకోలేదు కాని ,ముందుగా తలిదండ్రులకు దూరమైన బాలల భవ్య భవితవ్యం కోసం తపించి విద్యాబుద్ధులు నేర్పించి శ్రమించాడు .ఆయనకు అనాధ శరణాలయ సంస్థలేవీ సహకరించ లేదు .కనుక తనదారేదో తానే వెతుక్కోవాలని పించి విడుదలైన ఖైదీలలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు అదీ ఫలించలేదు .పారిస్ మిషనరీ సొసైటీ కి చెందిన ఒక మేగజైన్ లో కాంగో కాలనీకి ఉత్తరాన ఉన్న గాబన్ లో డాక్టర్ల అవసరం ఉంది అన్న ప్రకటన చూశాడు .ఇది ఒక వరంగా అనిపించింది .జీసస్ మాటల్ని అందరూ చెబుతారుకాని ఆచరణలో పెట్టేవారు బహు అరుదు అని గ్రహించాడు తన ఆలోచనలకు తగిన అవకాశం అని ,తనను చూసి నవ్విన వారి నాప చేను పండేట్లు చేసే సదవకాశం అను కొన్నాడు .

        ‘’వీడేవడ్రాబాబూ !ఆఫ్రికాకు ఎగరేసుకొంటూ పోతానంటున్నాడు.మిషనరీగా కాదుట డాక్టర్ గా నట.వీడికి  పిచ్చా వెర్రా ‘’అను కొన్నారు స్నేహితులు .వాళ్లకు సమాధానంగా ‘’నేను డాక్టర్ అవాలనుకోన్నాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా .ఇప్పటిదాకా ఏదో ఒకటి జనాలకు చెప్పీ చెప్పీ విసిగి వేసారి పోయాను .ఇప్పుడు ఈ కొత్త అవతారం లో నాకు మాట్లాడే అవకాశం కోసం చూడను .క్రీస్తు చెప్పిన ప్రేమ మతాన్ని అవలంబించి సేవ చేస్తాను ఇదే నా నిర్ణయం దీనికి తిరుగు లేనే లేదు ‘’అన్నాడు .తర్వాత ఏడేళ్ళు మెడిసిన్ పై ద్రుష్టి కేంద్రీకరించి చదివాడు .వైడర్ తోకలిసి బాష్ ఆర్గానిక్ సంగీతం పై మొదటి అయిదు విప్లవాత్మక భావ పరంపరగా గ్రంధాలు ,జీసెస్ క్రీస్తు చారిత్రకత పై పుస్తకం రాశాడు .ఉష్ణమండల ప్రాంత వ్యాధుల గురించి 37వ ఏట పరిశోధన చేశాడు .హాస్పిటల్ లో ఇంటర్ షిప్ పూర్తీ చేసి , హేలీన్ బస్లావు అనే చారిత్రకారుని కుమార్తెను పెళ్లి చేసుకొని ,కొత్త పెళ్ళాం తో ఆఫ్రికా లోని లామ్బార్నే సెటిల్ మెంట్ కు చేరాడు .మెడికల్ ప్రాక్టీస్ కు కావలసిన బిల్డింగ్ నిర్మాణం పూర్తీ కాలేదు అక్కడి పరిస్థితులు పరమ దారుణంగా ఉన్నాయి .అతని కన్సల్టింగ్ రూమ్ పాడు పడ్డ చిన్న గది మురికివాసన .అక్కడి ఉష్ణోగ్రత భరింప రానిదిగా ఉంది .మొదట్లో అతనికి దుబాసీలుగా సహాయకులుగా ఉండే స్థానికులు ఎవరూ దొరకలేదు .మొదటి సారిగా తమ దగ్గరకు ఒక డాక్టర్ వచ్చాడని తెలుసుకొని దాదాపు రెండు వందల మైళ్ళు కాలినడకన నడిచి వచ్చి జబ్బు పడ్డ వారు వచ్చేవారు .స్క్వీజర్ మలేరియా కే కాకుండా స్లీపింగ్ సిక్ నెస్,విరేచనాలు ,అక్కడ బాగా ప్రబలి ఉన్న కుష్టు వ్యాదికీ  చికిత్స చేశాడు .అవసరమైతే హీర్నియాకు అల్సర్,  బోదకాలు కు కూడా శస్త్ర చికిత్స చేశాడు .డాక్టర్ ఆఫ్ డివినిటి అయిన ఆల్బర్ట్ పేషెంట్ లు ఇచ్చిన  బహుమతులను తీసుకోలేదు .మతాధికారులు అతన్ని దుబాసీ సహాయం తోమత బోధ చేయమని కోరేవారు .ఇదొక కొత్త అనుభవం అనిపించింది .యేసు క్రీస్తు పవిత్ర బోధనలను అక్కడఏమీతెలియని కొత్త వారికి  ప్రచారం చేయటం లో విపరీతమైన ఆనందాన్ని పొందాడు .ఖాళీ సమయం లో బాష్ పై మిగిలిన చివరి మూడు బ్భాగాలు రాశాడు  .తనకున్న ఆర్గాన్ సంగీతానికి మెరుగులు దిద్దుకొంటూ స్వయంగాతాను రూపొందించిన పియానో పై పలికించాడు .

     స్క్వీజర్ ,కు అతని భార్య తనకు నర్సుగా  లేఖకురాలిగా సహాయం చేసింది .ఆఫ్రికా  చేరిన ఏడాది లోపే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది .ఫ్రాన్స్ అధీనం లో ఉన్న జర్మనీకి చెందినవాడుకనుక ఆల్బర్ట్ ను విదేశీ శత్రువుగా భావించారు .తెల్లవాళ్ళు తెల్లవాల్లను ఖైదీలుగా చేసి నల్ల సైనికుల  అధీనం లో ఉంచటం స్థానికులకు ఇబ్బంది గా ఉండేది అని ‘’ఔట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ధాట్’’పుస్తకం లో రాశాడు .నాగరిక దేశాలు యుద్ధం పై మొహరించినకాలం లో స్క్వీజర్ డాక్టర్ గా తన పని తానూ చేసుకు పోతున్నాడు .వింత పరిస్థితులలో ఇరుక్కున్న రెండు రోజుల తర్వాత ‘’ఫిలాసఫీ ఆఫ్ సివిలి జేషన్ ‘’రాయటం మొదలు పెట్టాడు .16 నెలల తర్వాత స్క్వీజర్ ను వంద మైళ్ళ దూరం నదికి ఎగువన   జబ్బుతో ఉన్న ఒక మిషనరీ భార్యను చూసి వైద్యం చేయటానికి  అనుమతించారు .డెక్ మీద కూర్చుని తనకు అంత వరకు తెలియని కొత్త ఆలోచనలేవో మది నిండా ముసురు కాగా,యే వేదాంత గ్రంధం లోని లేని వినూత్న ఆలోచనలను పేజీలకు పేజీలు  రాసేశాడు .మూడు రోజుల తర్వాత ఖడ్గ మృగాల మధ్యలో ఉన్న అనుభవం ఏదో కలిగింది .మనసులో మెరుపులా ‘’రివరెంస్ ఫర్ లైఫ్’’అనే పదం తన్నుకొచ్చింది .అప్పటిదాకా ఉన్న ఇనుప తెరలు తొలగి పోయి ,దారి సుగమంగా దర్శన మిచ్చింది .ప్రపంచ స్థితి ,నైతికత ప్రక్క ప్రక్కనే ఉంటాయి .కనుక కనిపించే భౌతిక ప్రపంచం ,జీవితం నాగరకత తో కలిసి పోవటం తన ఆలోచనలకు మూలం అన్నాడు ఆల్బర్ట్ స్క్వీజర్ .

 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-16-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.