ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -172
65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -2
ఉగ్రవాద పాలన(రీన్ ఆఫ్ టెర్రర్ ) 1930లో మొదలైంది .రెడ్ ఆర్మీ జనరల్ స్టాఫ్ కు చెందిన వేలాది మంది ,చిన్న రైతులు ,స్టాలిన్ ను విమర్శించేవారు అందరూ చంప బడ్డారు .అ౦తకు రెట్టింపు మంది ని జైల్లో పెట్టారు .లెనిన్ అనుకూలురులలో చాలామందిని ప్రక్షాళన చేశారు .జినోవీవ్ తర్వాత వచ్చిన సెర్జీ కిరోవ్ హత్య చేయబడ్డాడు .కొద్దికాలానికి తూతూ మంత్రంగా విచారణ(పర్జ్ ట్రయల్ ) 1937దాకా జరిపించారు .లెనిన్ అనుచరులు ,అభిమానులు ,రివల్యూషన్ లో పాల్గొన్నవారు ,ప్రచారకులు ,ఉన్నతాధికారులు అందరూ అవినీతి బూర్జువాలకు తొత్తులని ,నాజీ జర్మనీతో చేతులుకలిపి దేశం లో కేపిటలిజం తెచ్చే కుట్ర చేస్తున్నారని అభియోగం మోపారు .దేశ భక్తితో రివల్యూషన్ లో పాల్గొన్న వారిని ,వారి కుటు౦బాలవారినీ ద్రోహులని ,దేశం లో అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని నిందమోపి,విచక్షణా రహితంగా ఏరి పారేస్తున్నారు .ప్రముఖ సైనికాదికారుల్ని ఉరితీస్తున్నారు .లక్షలాది ప్రభుత్వ అధికారుల్ని ,పార్టీ సభ్యులని కుట్రదారులు ,ఫాసిస్ట్ లూ అని ముద్రవేసి చడీచప్పుడూ కాకుండా చంపేసి (కోల్డ్ బ్లడేడ్ మర్డర్ ),ప్రవాసంలోకి చాలామందిని పంపేశారు .విచారణలన్నీ చాలా రహస్యంగా జరిగేవి .నేరాన్ని బలవంతంగా ఒప్పుకోనేట్లు చేసే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి .ట్రోట్స్కి నిఆయన పరోక్షం లో విచారణ జరిపి ,ఆయన్ను ,విధానాలను ఖండించారు .బోల్షెవిక్ విప్లవాన్ని మోస్తున్నట్లు ,సోవియట్ పాలనమొదలైనట్లు భ్రమ కలిగించి దేశ ద్రోహుల సాయం తో దేశద్రోహులకోసం నాటకమాడారని ‘’న్యూయార్క్ టైమ్స్ రాసింది ‘’.’’మిత్రత్వం ‘’(బ్రదర్ హుడ్ )అనేమాట పరిహాస పదమై పోయింది .వర్గ రహిత సమాజం అన్నది పగటికలే అయింది .కొన్ని ప్రక్షాళన విచారణల తర్వాత సమాజం లో అన్ని తరగతులవారు భయం ,క్రూరత్వం హింసలకు గురైపోయారు .
ఈ హింసా దౌర్జన్యాలన్నీ స్టాలిన్ చేయి౦చినవే అని నమ్మకం కలిగినా ,ఆయన్ను చూస్తే మాత్రం అంతటి రక్త పిపాసి అని అనిపించడు.ముఖం లో ఆభావాలేవీ వ్యక్తీకరించడు .సాదుస్వభావమైన గుండ్రని ముఖం తో,తీగాల్లాంటి జుట్టుతో ,ప్రీతిపాత్రమైన వాల్రస్ లాంటి మీసం తో ,అయిదు అడుగుల ఆరంగుళాలు మాత్రమే ఉన్న ఎత్తు తో బలిష్టంగా దాదాపు 190పౌండ్ల బరువుతో ఉండేవాడు .చేతులు ఆయన బుర్ర అంత గట్టిగా పొడవుగా ఉండేవి ..’’ఆకర్షణీయం కాని మనిషి .కాని కళ్ళల్లో ఏదో వెలుగు ,ముఖంలో స్పష్టత కనిపిస్తాయి .పొడగరికాకున్నా మహా బలవంతుడు అనిపిస్తాడు .ఆ మొగానికి నల్లని కళ్ళే అందం, ఆకర్షణ .అన్ని వేళలలోనూ సామాన్య సైనికుడి దుస్తులనే వేసుకొనేవాడు .చాలా చౌక రకం పైప్ నె పీల్చేవాడు .చదరంగ ఘనాపాటి స్టాలిన్ .ఆట విడుపుకోసం చెస్ ఆడేవాడు .కాని ఆప్యాయత ప్రేమ ఉన్న తండ్రి. తన పిల్లలను సామాన్య పిల్లల్లాగానే పెంచాడు .’’స్టాలిన్ ఇంట్లో ఒక బెడ్ రూమ్ ,ఒక డైనింగ్ హాల్ ,పని చేసుకొనే గది ,స్నానాల గది మాత్రమె ఉన్నా డాబుసరిగా ఉంది ‘’అని చర్చిల్ చెప్పాడు .
స్టాలిన్ వ్యక్తిగత జీవితం రహస్యమైనది .మొదటిభార్య ఎకటారినాస్వా౦డిజ్ ఒక కొడుకు జాకబ్ ను కన్నది .ఆతను రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మన్ వార్ ప్రిజనర్ అయ్యేదాకా అతని గురించి లోకానికి తెలియనే తెలియదు .1907లో భార్య చనిపోతే పన్నెండు ఏళ్ళ తర్వాత నాడ్యాఅలిలూయేవా ను రెండో పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఆయన తో రివల్యూషన్ లో పాల్గొన్న సహచరుని 19ఏళ్ళ అమ్మాయి .వీరికి పుట్టిన కొడుకు వాసిలి సోవియెట్ ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ జనరల్ .అందమైన ఎర్ర జుట్టు కూతురు స్వెత్లానా .రెండోభార్య 1932లో మిస్టరీ గా ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది .మూడో భార్య కగనోవిచ్ గురించి లోకానికేమీ తెలియదు .
జరిగిన, జరుగుతున్నా హింస దౌర్జన్యాలకు స్టాలిన్ పైనే నెపం వేసినా , స్టాలిన్ వ్యతిరేకులు కూడా ఆయన కొన్ని మంచి పనులు చేశాడని అంటారు .పీటర్ ది గ్రేట్ తర్వాత సోవియెట్ యూనియన్ ను అంతగా అభి వృద్ధి చేసిన వారెవరూ లేరు .ఒక్క స్టాలిన్ మాత్రమే ఆపని చేయ గలిగాడు .పంచ వర్ష ప్రణాళికలు రచించి చక్కగా అమలు పరచి క్రూర అనాగరిక .దేశాన్ని సాంఘిక ఆర్ధిక రంగాలలో అభివృద్దిపరచి ఆధునిక రష్యాగా మార్చాడు .లెనిన్ కోరినట్లుగా విద్యుత్ అవసరాన్ని గుర్తించి ,వెయ్యిమంది నిపుణులతో అధ్యయనం చేయించి దాని సారాంశాన్ని కాచి వడపోసి ,టెక్నీషియన్ ల తో పని చేయించి గొప్ప విద్యుత్ ప్రణాళిక తో పారిశ్రామిక దేశంగా రష్యాను నిలబెట్టాడు .ఊసర క్షేత్రాలను సస్య శ్యామలం చేశాడు .ఎద్దుల బదులు ట్రాక్టర్ వ్యవసాయం ప్రవేశ పెట్టి ,పూర్వం డజన్ ఎకరాలలోపాత పద్ధతులలో పండేపంటను ఆధునిక విధాన అవలంబన వలన ఒక్క ఎకరం లోనే పండేట్లు చేస్సి సస్య విప్లవమూ తెచ్చాడు. సమైక్య వ్యవసాయ నినాదం తో ముందుకు సాగుతూ దీన్ని వ్యతిరేకించే భూస్వామ్య ,రైతు ,వ్యవసాయ దారులను కఠినంగా శిక్షించాడు .వారి భూములను పేదరికం తోఅలమటిస్తున్న బడుగు రైతులను ఆక్రమించి దున్నుకోమన్నాడు .విద్యా ,మిలిటరీ విధానాలలో సమూలమైన మార్పులు తెచ్చాడు .జార్ రాజుల పాలనలో 79 శాతం ఉన్న నిరక్షరాస్యతను 10శాతానికి తగ్గించగలిగాడు .సాంకేతికత ఇస్తున్న సత్ఫలితాలకు ఆకర్షి౦ప బడి జనం సైన్స్ చదవటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు .1916లోరష్యాలో కేవలం 200లాబరేటరీలు మాత్రమె ఉండేవి .ఇరవై ఏళ్ళ తర్వాత వాటి సంఖ్య గణనీయంగా 2,0 00 కు పెరిగింది .విప్లవ అభ్యుదయం శాంతిని ఇవ్వదు అని భావించి యుద్ధానికి సన్నద్ధయ్యాడు స్టాలిన్ .
ఈలోగా స్టాలిన్ పూర్తీ నియంత అయ్యాడు .ఖచ్చితమైన ఆటవిక సెమి ఒరిఎంటల్అయ్యాడు .ఆయన్ను అప్పుడు ‘’టెలిఫోన్ ఉన్న చెంగిజ్ ఖాన్ ‘’అన్నారు .రెం ప్ర.యు.వస్తుందని ఊహించి రష్యా దానిలో భాగ స్వామి కాకూడదని నిర్ణయించాడు .నాజీల బెదిరింపులు చూసి ,తన దౌత్యవేత్తలను పిలిపించి హిట్లర్ తో చర్చలు జరిపించి పరస్పర ఆక్రమణ దాడులకు స్వస్తి చెప్పే ఒడంబడిక పై సంతకం చేశాడు .కాని హిట్లర్ దీన్ని అతిక్రమించి అతి వేగం గా రష్యా పై దాడికి దిగటం తో జర్మన్లను ఆపటం అసాధ్యం అని గ్రహించాడు .హిట్లర్ వరుసగా నగరం తర్వాత నగరం ఆక్రమిస్తున్నాడు .రష్యా గుండెకాయ మాస్కో ముంగిట్లో వాలి దాడికి సిద్ధమయ్యారని తెలిసి అత్యంత ప్రతిభావంతంగా చురుగ్గా బెదురు లేని యుద్ధ నిపుణుడుగా అవతారం ఎత్తాడు .ప్రభుత్వం రక్షణకోసం కూబి షేవ్ కు వెళ్ళగా స్టాలిన్ కొద్దిమంది అధికారులతో క్రెమ్లిన్ లోనే ఉండి పోయాడు . జర్మన్లు శీతాకాలం లో గోతులు త్రవ్వటానికి ముందే భూమిని మండించే విధానం అవలంబింప జేసి ,వాళ్లకు నిలువ నీడ లేకుండా చేసి గత్యంతరం లేక జర్మనీ సైనికులు వెనక్కి తిరిగి వెళ్లి పోయేట్లు గొప్ప వ్యూహం పన్ని దాదాపుగా నెపోలియన్ అనుభవించిన పరాజయ పరాభవాన్ని హిట్లర్ కూ జర్మనీకి కలిగించి బుద్ధి చెప్పాడు .రెండేళ్ళ తర్వాత హిట్లర్ కొత్త బలగాలతో స్టాలిన్ గ్రాడ్ ను చుట్టూ ముట్టాడు .ఎన్ని ఇబ్బందు లెదురైనా తన సైన్యాన్ని వెనకడుగు వేయవద్దని చాలా కఠినంగా ఆదేశించాడు దాదాపు మూడు లక్షల జర్మన్ శత్రు సైన్యం పై మెరుపు దాడులు జరిపి వెనక్కి నెట్టేసి స్టాలిన్ ప్రపంచ చరిత్రలోనే మహాద్భుత యుద్ధ విజయాన్ని సాధించాడు .ఈ విజయమే ఆ తర్వాత సంకీర్ణ దేశాల యుద్ధ విజయానికి దారి చూపింది .చరిత్రలో స్టాలిన్ ఉక్కు మనిషి అని నిరూపించుకొన్నాడు మళ్ళీ .హిట్లర్ పప్పులు స్టాలిన్ ముందు ఉడకలేదు .
‘’బిగ్ త్రీ ‘’అనబడే మూడు దేశాల ప్రెసిడెంట్ లు టెహ్రాన్ ,యాల్టా,పాట్స్ డాం లలో జరిపిన చర్చలు ఫలించి పరస్పర సైన్య ఆర్ధిక సహకారం తో భవిష్యత్తులో కలిసిపని చేయాలని ఉక్కు తెరరష్యా మిగిలిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి .అలానే కలిసి పోరాడి జర్మనీ దాని అక్ష దేశాలపై పోరాటం జరిపి హిట్లర్ పతనాన్ని తెచ్చి నాజీ నియంతృత్వానికి మంగళ గీతం పాడాయి .యుద్ధం తర్వాత వీరిలో వీరికి పరస్పర అనుమానాలు అపనమ్మకం ఏర్పడి నమ్మకాలు సడలి చర్చిల్ చెప్పినట్లుగా రష్యా ‘’ఇనుప తెర’’ను వేసుకొని మిగిలినవారికి ప్రవేశం లేకుండా చేసింది .పశ్చిమ దేశాల శక్తి తోచేతులు కలపలేదు .తర్వాత సోవియెట్ రష్యా అమెరికాతో యాల్టా సమావేశం లో కలిసి రష్యాకు పూర్తీ వీటో హక్కు ఇవ్వాలని స్టాలిన్ గట్టి పట్టు పట్టాడు .దాన్ని సాధించి తరచుగా వీటో పవర్ తో గేములాడి అమెరికా ముందరి కాళ్ళకు బందం వేసి దాని అభి వృద్ధికి ఆటంక పరచాడు .ఇతర దేశాలపై అమెరికా దాని అనుచర దేశాలు అనవసరదాడులకు దిగకుండా కట్టడి చేయగలిగాడు .ప్రపంచ సమస్యలపై సహకార విధానానికి అడ్డుగా నిలిచాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-16-ఉయ్యూరు
