ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -185
70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-2
వివాహ సమయం లో రూజ్ వెల్ట్ కొలంబియా లా స్కూల్ లో చదువుతున్నాడు .రెండేళ్ళ తర్వాత ‘’అడ్మిరాల్టి లా’’(దళాధిపతి చట్టం )ను స్పెషలైజ్ చేద్దామనుకొన్నాడు .బార్ కౌన్సిల్ లో చేరాడు .ఇంతలో తండ్రి చనిపోతే హైడ్ పార్క్ లో ఆతిధ్య బాధ్యతలు చేబట్టాడు ఇక్కడే ఇద్దరు పిల్లలు పుట్టారు .స్థానిక రాజకీయాలలో ప్రవేశించి బలపడి స్టేట్ సెనేట్ కు నామినేట్ అయ్యాడు .ఆయన పేరు మంత్రం ముగ్ధం అయి విపరీతమైన పేరు ప్రఖ్యాతులొచ్చాయి .రిపబ్లికన్ లకు బలమున్న చోట డెమొక్రాట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు .సివిల్ వార్ తర్వాత ఇక్కడి నుంచి ఎన్నికైన ఏకైక డెమోక్రాటిక్ సెనేటర్ రూజ్ వెల్ట్ ఒక్కడే .ఈ సవాలును ధైర్యంగా ఎదుర్కొన్నాడు .నిలువెత్తు మనిషి, నీలి కళ్ళతో అందమైన జుట్టుతో బలమైన ముక్కు, దవడలు తో అందగాడు .’’ఆయన అంత ధన సంపన్నుడు కాక పోయి ఉంటె ,ఆ పర్సనాలిటీ సినిమా ఇండస్ట్రిని ఏలుతూ ఉండేది ‘’అని న్యూయార్క్ హెరాల్డ్’’ రాసింది .అననుకూల పరిస్థితులలో, ఓడిపోతాడనే జోష్యాలతో ఉక్కిరి బిక్కిరౌతూ కూడా ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందే అని నిర్ణయించుకొన్నాడు .ఈ సందర్భం లోనే ‘’there is nothing I love so much as a good fight ‘’అన్నాడు .తీవ్రమైన ప్రచారం తో ప్రత్యర్ధిని ఆత్మ రక్షణలోకి తోసేసి ,వ్యంగ్యం తో,నయనా భయానా బెదర గొడుతూ ,పల్లెలు పట్టణాలు కారులో తిరిగి చుట్టేస్తూ ,ఇదివరకు యే పార్టీ అభ్యర్ధీ తిరగని మారు మూల ఊళ్ళన్నీ చుట్ట బెడుతూ అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ దారికి తెచ్చుకొంటూ న్యు యార్క్ రాష్ట్రం అంతా కలయ తిరిగాడు .రూజ్ వెల్ట్ కు తప్ప అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా గెలిచి తన సామర్ధ్యమేమిటో రుజువు చేసుకొన్నాడు .లా ఫర్మ్ వదిలి ఆల్బనికి చేరాడు .
స్టేట్ సెనేటర్ గా లిబరల్ దృక్పధం తో పనిచేశాడు.అభివ్రుద్ధికరమైనవాటిని స్వాగతించాడు .స్త్రీ వోటు హక్కు ఆ నాడు వివాదాస్పదమైనదే అయినా సమర్ధించాడు .ఉడ్రో విల్సన్అభి వృద్ధి విధానాలను మెచ్చుతూ 1912డెమోక్రాటిక్ సమావేశం లో విల్సన్ నామినేట్ అవటానికి ఎక్కువ కృషి చేశాడు .విల్సన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగానే 31 ఏళ్ళ రూజ్ వెల్ట్ ను నేవీ కి అసిస్టెంట్ సెక్రెటరి ని చేశాడు .దీనితో తనుఇన్నాళ్ళు కన్నకల నెరవేరింది .మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు నౌకారంగం పై ఉన్న అనుభవం సామర్ధ్యం తెలివి తేటలు ప్రదర్శించటానికి బాగా దోహదమయింది .రహస్యంగా నౌకా సంస్థలను ,సబ్ మేరీన్లను సమర్ధవంతంగా అధ్యయనం చేసి జర్మనీ వాళ్ళ జలాంతర్గాములను తుత్తునియలు చేసే విధానాలు ప్రయోగించాడు .లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో పని చేశాడు .38 వ ఏటవిపరీతమైన ఆర్ధిక మాంద్యం ఉన్న కాలం లో శాన్ ఫ్రాన్సిస్కో లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సు జరిగి౦ది .యుద్ధం లో జయం లభించి౦ది కాని శాంతి నష్ట పోయింది .ప్రెసిడెంట్ విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ప్లాన్ సెనేట్ చేత తిరస్కరింప బడింది .గుండెపోటు వచ్చి విల్సన్ చావు బతుకుల్లో ఉన్నాడు .ఒహాయో రాష్ట్రానికి చెందిన జేమ్స్ ఏం .కాక్స్ ను రాజీ అభ్యర్ధిగా ప్రెసిడెంట్ పదవికి ,రూజ్ వెల్ట్ ను వైస్ ప్రెసిడెంట్ పదవికి నిర్ణయించారు .ఇద్దరూ కలిసి ప్రచారం చేసినా రూజ్ వెల్ట్ 800కు పైగా ఉపన్యాసాలిచ్చి దున్నేసినా రిపబ్లికన్ అభ్యర్ధులు హార్డింగ్ ,కూలిడ్జ్ చేతుల్లో ‘’మళ్ళీ యధాస్థితి కి ‘’అన్న వాళ్ళ ఆకర్షణీయమైన స్లోగన్ తో పరాజయం పొందారు .
ఒక ఏడాది తర్వాత మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించి ,పెద్ద ప్రాణాంతక మహా విపత్తుకు గురైనాడు .1921ఆగస్ట్ లో కుటుంబం అంతా కాంప్ బళ్లో ఐలాండ్ లోని న్యు బ్రన్స్ విక్ లోసెలవులు గడుపుతుండగా రూజ్ వెల్ట్ ఒక రోజంతా విపరీతంగా బే లోని మంచు నీటిలో ఈతకొడుతూ పూర్తిగా అలసిపోయాడు .చలి ,వణుకు తో జ్వరం ప్రారంభమై పాక్షిక పక్ష వాతం వచ్చింది .డాక్టర్లు సరిగ్గా రోగ నిర్దారకం చేయక పోవటం తో ‘’పోలియో మైలేటిస్’’వ్యాధికి గురైనాడు .పూర్తిగా వికలాంగుడై ,కాళ్ళను కదల్చలేక బ్రేసులు, క్రచ్ లూ లేకుండా ఒక అడుగు కూడా నడవలేని స్థితికి వచ్చాడు .ఎంతో కస్టపడితేకాని , సహాయకుడు ఎవరైనా ఉంటేకాని కుర్చీలోంచి లేవగలిగే వాడు కాదు . నిలబడటానికి ఎవరో ఒక ఆసరా లేక ఒక కర్ర ఉండాల్సోచ్చేది .దీనితో రూజ్ వెల్ట్ ప్రజా జీవితం సమాప్తం అనుకొన్నారు అందరూ .పదవికి పనికి రానని చెప్పి రిజైన్ చేసి హాయిగా హైడ్ పార్క్ ఇంట్లో విశ్రాంతి తీసుకోమని తల్లి సలహా ఇచ్చింది .పరాజయాన్ని రూజ్ వెల్ట్ ఏనాడూ అంగీకరించలేదు .ఒక ఏడాది ఈ బాధ తోనే ఉంది మళ్ళీ తన పని ప్రారంభించాడు .
జార్జియాలోని వార్మ్ స్ప్రింగ్స్ లో ఒక రిసార్ట్ లోపూర్తిగా మినరల్ సాల్ట్ లు, ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటిఉన్న ఒక బేదింగ్ పూల్ ను కనుక్కొని నిత్య స్నానం చేస్తూ మూడేళ్ళకు బిగుసుకు పోయిన అవయవాలకు కొద్దికొద్దిగా చలనం వచ్చేట్లు చేసుకొన్నాడు .ఆ తర్వాత ఏడాదికి రెండు సార్లు ఇక్కడికి వచ్చేవాడు .ఈ చికిత్స కోసం మిలియన్ డాలర్లలో నాలుగో వంతు డబ్బు ఖర్చయింది .డబ్బు పెట్టి దీన్ని కొని లాభ నష్టాలు లేని విధానం లో తన లాంటి వ్యాధి గ్రస్తులకు ఉపయోగ పడేట్లు చేశాడు. 42వ ఏట న్యు యార్క్ లో డెమోక్రాటిక్ పార్టీ సదస్సుకు క్రచేస్ సాయం తో హాజరవ గలిగాడు .నాలుగేళ్ల తర్వాత ,టెక్సాస్ లోని హూస్టన్ సభకు క్రచేస్ లేకుండా తుంటి నుండి పాదం వరకు స్టీల్ బ్రేసేస్ తో దర్జాగా హాజరై అందర్నీ ఆశ్చర్య పరచాడు .
1928 లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆల్ఫ్రెడ్ స్మిత్ ,న్యూయార్క్ గవర్నర్ గా రూజ్ వెల్ట్ ను ,ఆయన సహాయకుడిగా హెర్బర్ట్ లె మాన్ ను ఎంపిక చేశారు .తీవ్రంగా జరిగిన పోటీలో స్మిత్ ఒడి పోయి ,రూజ్ వెల్ట్ గవర్నర్ గా ఎన్నికయ్యాడు .ఈ ‘’గూబర్ నేటోరియల్ పోస్ట్ ‘’లో నాలుగేళ్ళు ఉన్నతరువాత1932 ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఎంపికయ్యాడు .ఇంకా కొంతకాలం గవర్నర్ పదవీకాలం ఉంది ,కాని దేశం అతి తీవ్రమైన డిప్రెషన్ లో కొట్టు మిట్టాడు తున్నప్పుడు ఆయన ‘’మరువ బడిన మనిషి ‘’అని భవిష్యత్ వాణిగా చెప్పాడు .వ్యవస్థ మళ్ళీ వైభవం లోకి రావాలంటే సంస్కరణలు పై నుంచి కాక అట్టడుగు నుంచి ప్రారంభం కావాలని నొక్కి వక్కాణించాడు .’’ఆర్ధిక పిరమిడ్ లో అట్టడుగు మనుషులను మర్చి పోయారని వారి సంక్షేమం దేశ ప్రగతికి గతి అన్నాడు .యాభై వయసులో అయన ఉపన్యాసాలలో దీనినే మరీ మరీ చెప్పి ప్రజల దృష్టికి తెస్తూ ప్రెసిడెంట్ పదవీ ప్రచారం చేశాడు .అమెరికన్ ప్రజలకోసం ‘’న్యు డీల్ ‘’ను అందజేస్తానని ప్రతిజ్ఞ చేశాడు .ప్రతి పౌరుడు బాగా సౌకర్యాలతో ఆర్ధిక పుస్టి తో జీవించాలని అన్నాడు .అమెరికా పారిశ్రామిక వ్యవస్తలు,వ్యావసాయక యంత్రాంగం బాగా ఉత్పత్తి చేస్తూ తగినంత మిగిల్చాలి .ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలు ,రాజకీయ నాయకులు ,ఆర్ధిక వేత్తలు అందరూ తగినంత ఉత్పత్తి చేసి మిగల్చాలి ..దేశం లో అంతులేని వనరులున్నాయని ,15 మిలియన్ల జనం వీధుల్లో తిండిలేక అవమానకరంగా అడుక్కు తింటున్నారని ,పూరిగుడిసేల్లో ,అట్టముక్కల ఇళ్ళల్లో ఉంటూ దిక్కూ మొక్కూ లేక బతుకుతున్నారని ,వారి పరిస్థితి దయనీయంగా ఉందని .వీళ్ళందరి జీవితాలలో ఉషోదయం రావాలంటే ధైర్యంగా నిరంతర ప్రయోగాలు చేయాలని ,దీనికి చాలా కామన్ సెన్స్ కావాలని ,ఒక వేళ ఈ ప్రయోగాలలో అపజయం పాలైతే ధైర్యంగా ఒప్పుకోవాలని ,మరొక ప్రయోగం చేయాలని చెప్పాడు .మిలియన్ల మంది పేద ప్రజలు తమకు రావాల్సినవి తమ దగ్గరకు రాకపోతే ఇక ఉపేక్షిస్తూ ఊరుకొంటారను కొంటె పొరబాటని గట్టిగా అన్నాడు .తమకిప్పుడు ఏం కావాలో ఆయన మాటల్లోనే ‘’we need enthusiasm ,imagination ,and the ability to face facts ,even unpleasant ones bravely .We need to correct by drastic means ,if necessary ,the faults in our economic system from which we now suffer .We need the courage of the young ‘’.
ఇలాంటి ధైర్య వచనాలు ,నివేదనలు ఆ సమయం లో బాగా ప్రభావం చూపాయి .రూజ్ వెల్ట్ అయస్కాంత ఆకర్షణ వ్యక్తిత్వం ,దేశపు దుస్థితి రూజ్ వెల్ట్ చాలా సరైన దిశలోనే ఆలోచిస్తున్నాడని అర్ధం చేసుకొన్న జనం ఆయన్ను విపరీతంగా ఆరాధించారు అభిమానించారు .ప్రజా బలం తో దేశాన్ని దారుణ సమ్మెలు ,విప్లవ స్థితులనుండి కాపాడాడు .అదొక గొప్ప నాటకీయ సమయమై ఆయనకు బాగా కలిసొచ్చింది .దీని ఫలితంగా అతి భారీ మెజారిటి తో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .ఎనభై ఏళ్ళ అమెరికా చరిత్రలో ఆరు రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలోను మెజారిటీ సాధించి న డెమోక్రాటిక్ అభ్యర్ధిగా రికార్డ్ సాధించాడు .హోవర్ కు కేవలం 59 ,రూజ్ వెల్ట్ కు 472 ఎలెక్టోరల్ వోట్లు వచ్చాయి .అదీ రూజ్ వెల్ట్ వీరవిజయ గాధ.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-16-ఉయ్యూరు
