గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి
కుటుంబ నేపధ్యం
తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన గుడ్డ గా అదే వైదుష్యాన్ని సాధించి గబ్బిట వారి వంశ కీర్తిని ఉత్తరాదిన వెదజల్లుతున్నాడు .ముగ్గురూ ముగ్గురే .ఆ తండ్రీ తనయుల అనుబంధం ,సంస్కృత విద్యా వైశిష్ట్యం ఎంత చెప్పుకున్నా తరగని గని .ఆంజనేయ శాస్త్రి గారి ముగ్గురు కుమారులలో చివరివాడైన శ్రీనివాస శాస్త్రి గీర్వాణ కవితా గీర్వాణ విశేషాలను తెలుసు కొందాం .
జనన విద్యాభ్యాసాలు వివాహం
గబ్బిట శ్రీనివాస శాస్త్రి శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,శ్రీమతి పద్మావతి దంపతులకు 19-4-1987 న జన్మించాడు .శాస్త్రిగారిది కృష్ణా జిల్లా యలమర్రు స్వగ్రామం .తండ్రిగారు వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్ గా ఉండటం వలన శ్రీనివాస్ విద్య కూడా అక్కడే ఆరంభమైంది .2001 లో ‘’పూర్వ మధ్యమ’’ (టెన్త్ )సంపూర్ణానంద్ సంస్కృత విశ్వ విద్యాలయం లో చదివి ఉత్తీర్ణు డయ్యాడు.2005 లో’’ ఉత్తర మధ్యమ ‘’(12)ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి అందుకొని ,2008 లో కొత్త ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి శుక్ల యజుర్వేదం లో ‘’శాస్త్రి ‘’(బి ఏ .) డిగ్రీ ప్రధమ శ్రేణి లో పొందాడు .శుక్ల యజుర్వేదం లోనే 2010 లో ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి ‘’ఆచార్య ‘’(ఎం .ఏ .)’’నూ 20 15 లో వేదం లో ‘’విద్యా వారిది ‘’(పి.హెచ్ .డి.)ని కాంచీపురం డీమ్డ్ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచి అందుకున్నాడు .కంచి కామకోటి పీఠాధి పతుల వద్ద వేద విద్యనూ అధ్యయనం చేశాడు .శ్రీమతి శ్రీకళను శ్రీనివాస శాస్త్రి వివాహమాడి సంతానం గా శ్రీ యజ్ఞ సరస్వతి అనే కూతురును పొందాడు .
. శాస్త్రి గురువులలో ముఖ్యమైన వారు తండ్రి శ్రీఆంజనేయ శాస్త్రి గారితో పాటు , శ్రీ దెందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారు ,శ్రీ కాశీ కృష్ణ మూర్తి ఘనాపాఠీగారు , శ్రీ ఆర్.వెంకట రామ ఘనాపాటీగారు , ,శ్రీ కె. వి .యెన్ .అవధాని గారు ,ఎం .స్వామి నాధన్ గారు (వేద భవన్ . గీర్వాణ రచనా సామర్ధ్యం
తిరుపతి వేద విశ్వ విద్యాలయం లో జరిగిన అంతర్జాతీయ వేద సభ లో ‘’ప్రాతిశాఖ్యానం –పరిచయః ‘’పై పరిశీలన పత్రాన్ని రచించి ప్రచురించాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం –అఖిల భారతీయ శాస్త్ర సంగోస్టి ఫాకల్టి లో’’’’కృష్ణ యజుర్వేదే అర్ధ వాద వ్యాఖ్యానం ‘’అనే పత్ర సమర్పణ చేశాడు . వారణాసి బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ‘’సంస్కృత విద్యా పత్రిక ‘’లో ‘’శ్రౌత స్మార్త కర్మాణి ‘’శీర్షిక తో వ్యాసాలను,’’మీమాంస సార౦ ’’ పైనా రాశాడు .ఇవి గాక ’’ఆపస్తంభీయ పంచ దశ కర్మాను క్రమణిక ‘’ రచించాడు .
పురస్కారాలు
2000 సంవత్సరం లో 15 వ ఏటనే లక్నో లోని ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ వారి ‘’వేద పండిత పురస్కారం ‘’,రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణు కాంత శాస్త్రి గారి చేతులమీదుగా శ్రీనివాస శాస్త్రి అందుకొన్నాడు. వారణాసి లోని దేవాలయ ,మఠాలలో నిత్య వేద పారాయణ చేస్తున్నాడు ,కృష్ణ యజుర్వేద క్రమాంత పరీక్ష మొదటి తరగతిలో కృష్ణా జిల్లా మచిలీ పట్నం బృందావన పురం లోని కామ కోటి శంకర మఠంనుండి ఉత్తీర్ణుడయ్యాడు .తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రిని వేద పారాయణ దారునిగా నియమించగా అందులో పని చేస్తూ ఉన్నాడు ..
ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి తండ్రిగారికి సహాయంగా వారణాసి లో ఉంటూ శ్రౌత స్మార్త కర్మలను ఆచరిస్తున్నాడు .
శ్రీ శ్రీనివాస శాస్త్రి ఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-17 –ఉయ్యూరు

