గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
334–నిగమాగమ వేత్త -జగద్గురు సదానంద శివ యోగి)(800
ద్వాపర యుగానికి చెందిన స్కంద సంహిత లో సదానంద శివయోగి గురించి ఉందట .ఆయన నిగమాగమ వేత్త .శ్రీశైల క్షేత్రవాసి .వీర శైవ గురుపీఠాధ్యక్షుడు .శివునికై తపస్సుచేసి సిద్ధులు సాధించాడు .భస్మధారణ రుద్రాక్షలు ధరించి చేతిలో శివ లింగం తో సంచరించేవాడు .హరిప్రియుడు అనే బ్రాహ్మణుడు తన కొడుకుతోపాటు కుష్ఠు వ్యాధి గ్రస్తుడైన స్వేతను శివ యోగి వద్దకు పంపితే అతని వ్యాధిని భస్మలేపనం తో నివారించి వీరశైవం బోధించి ఇద్దరినీ శిష్యులను చేసుకొన్నాడు .
335-ఆకాశ గామి -మల్లికార్జున శివాచార్య (900
విశ్వ ఆరాధ్య పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య అతీంద్రియ శక్తులున్న మహాయోగి .ఆకాశ గమనంతో సంచారం చేసేవాడు .కారాధ్యసిపాలకుడు జయ నందన రాజు వీరి శక్తికి అబ్బురపడి కర్దమేశ్వర్ కు గంగ కు మధ్య ఉన్న 800 పరగణాలను రాసిచ్చాడు . ఆ దాన న పత్రం ఇప్పటికీ లభ్యమే .ప్రయాగ ,నేపాల్ ఢిల్లీ లలో వీర శైవ మఠాలు లు నిర్మించాడు .నేపాల్ వెళ్లి రాజు విశ్వ మల్ల కు వీరశైవం బోధించగా రాజు 300 మూరిభుల భూమిని దానం చేశాడు .ఆ భూమి ఇప్పటికీ భట్టగాఁ గ్రామం లో జగంబుహారీ శైవ మఠాధీనంలోనే ఉంది
336- బ్రహ్మ సూత్ర భాష్యకర్త -శ్రీపతి పండితారాధ్యుడు (1060 )
శ్రీపతి పండితారాధ్యుడు 1060 లో ఆంద్ర దేశం లో ఉన్నాడు .వేద వేదాంగ నిష్ణాతుడు బ్రహ్మ సూత్రాలకు శ్రీక భాష్యం రాశాడు .దీనికి అందరు విపరీతంగా ఆయనను శ్లాఘించారు ఆయనకు అతిమానవ శక్తులెన్నో ఉండేవి .ఒక సారి శాస్త్రార్థ చర్చలో శివ ప్రసాదం అగ్నికంటే పవిత్రమైనది అని ప్రకటించాడు .దీనిపై పెద్ద గందర గోళమే రేగింది .ఆయనను ఎవరూ సమర్ధించలేదు .కోపావేశంతో పండితారాధ్యుడు అగ్నిని మూటకట్టి శమీ వృక్ష కొమ్మకు వ్రేలాడ దీశాడు .దీనితో ఆ ప్రాంతం లోని అగ్ని హోత్రాలన్నీ ఆరిపోయి ఇళ్లల్లో వంటా వార్పూ లేకుండా పోయింది .ప్రజలందరూవచ్చి తమ తప్పును మన్నించమని ప్రసాదమే అగ్నికంటే పవిత్రం అని నమ్ముతామని ప్రాధేయపడ్డారు .అప్పుడు కనికరించి అగ్నిని విడుదల చేశాడు .
337-వేదాంత పరమార్ధ గీత వ్యాఖ్యాత కర్త -నిజగుణ శివ యోగి
వీర శైవం లో నిజగుణ శివ యోగి గొప్ప భక్తుడు .కర్ణాటకలో జన్మించినతమిళనాడు కోయంబత్తూర్ జిల్లా ,కొల్లెగల తాలూకా సమ్మెబాట లింగం గట్ట రాజు .శాస్త్రాలు చదివి అర్ధం చేసుకున్నవాడు .రాజ్యం పై కాంక్ష నశించి పర్వతాలకు వెళ్లి శివునికై తపస్సు చేశాడు.సంస్కృతం లో ఆరుగ్రంధాలు రాశాడు .అందులో వేదాంత వ్యాఖ్యానం ,పరమార్ధ గీత మాత్రమే లభించినా ఇవి బహుళ వ్యాప్తి చెందాయి
338-మహా మహిమాన్వితడు -మల్లికార్జున శివ యోగి (1600
కాశీ విశ్వారాధ్య జగదురువు మల్లికార్జున మహాయోగి ఔరంగ జేబు పాలనలో ఉన్నాడు .ఎల్లప్పుడూ జగంబుహారీ మఠం ని శివలింగం పై దృష్టిపెట్టి శివ ధ్యానం లో గడిపేవాడు .ఒకసారి మహా ధ్యాన సమాధిలో ఉండగా ఔరంగ జేబు వచ్చి సైన్యం తో మఠాన్ని కూల్చేశాడు .సమాధినుంచి బయటికొచ్చిన శివయోగి కి విషయం తెలిసి ద్వారం దాకా వచ్చి విపరీతమైన కోపం తో మంత్రోచ్చారణ చేయగా సైన్యం చెల్లాచెదురై పారిపోయింది ఔరంగజేబు చక్రవర్తి నేలపై మూర్ఛపోయి పడిపోయాడు .జేబు యోగిని విపరీతంగా ప్రాధేయపడి తప్పు కాయమని కోరగా క్షమించాడు .తన సైన్యం కూల్చేసిన ప్రదేశాన్ని అంతటినీ మఠానికి రాసిచ్చేశాడు జేబు .దానపత్రం కాశీలో జగంభారి మఠం లో భద్రంగా ఉంది .దానపత్రం లో ‘’మఠం దగ్గరకు చేరేసరికి అక్కడి నల్లటి శివలింగం కళ్ళ లో నుంచి కాలాగ్ని విజృంభించి భూమ్యాకాశాలను కప్పేసింది .భయం తో కంపించి నిలుచుండిపోయి నిశ్చేస్టు డనై ఇక్కడికొచ్చి ఆశ్రయం పొందాను అందుకే ఈ భూమిని భక్తితో దానంగా రాసిస్తున్నాను ‘’అని ఉంది .శివ యోగి భక్తి తత్పరతకు రేవా రాజు భావ సింగ్ దేవా ,అవధ్ సింగ్ దేవా లు మఠ నిర్వహణ కోసం ఒక గ్రామాన్ని దానం చేశారు .ఈ దాన పత్రమూ ఆ మఠం లో చూడవచ్చు .
339-తిరుమూల మంత్ర రచయిత-తిరుమూలర్
భగవాన్ యోగీశ్వర్ ,పరమహంస స్వామి సిద్ధ ,మహాత్మా అని పిలువబడే తిరుమూలారు హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసి స్వగ్రామం తిరిగివచ్చాడు .హిమాలయాల నుండి యోగిపుంగవుడు వచ్చాడని బాగా ప్రచారమైంది .ఒకరోజు మూలన్ అనే పశువులకాపరి పశువులనుమేపి సాయంత్రం వాటిని ఇంటికి తోలుకొచ్చి కట్టేశాడు భార్య కు అతనిలో ఏదో వింత శక్తి కనిపించింది .తరువాత మూలన్ ఒక మఠం చేరి కళ్ళు మూసుకొని ధ్యానం లో గడిపాడు .భార్య ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయం వచ్చి చూసింది అదే ధ్యాన భంగిమలో ఉండిపోయినట్లు గమనించింది .ఆయన కళ్ళ నుంచి వింత కాంతి వెలువడుతున్నట్లు గుర్తించి అందరికి విషయం తెలియజేసింది అందరూ వచ్చి ఆశ్చర్యం గా చూశారు .కళ్ళు తెరిచాక స్వగ్రామం రమ్మని ప్రార్ధించారు ఒప్పుకోలేదు .సాతనూర్ నుంచి తిరువావా దూతురై వెళ్ళాడు .భార్య ఏడుస్తూ వెళ్ళింది అప్పుడు అసలు విషయం చెప్పాడు ఆమె భర్త మరణిస్తే తానూ ఆయన శరీరం లో ప్రవేశించాడు .ఆవులు తనను అతని ఇంటికి తీసుకు వెళ్లాయి .అక్కడ ఆ శరీరాన్ని దాచాడు .మళ్ళీ వచ్చి చూస్తే ఆదికనపడలేదు .ఇది శివ లీలగా భావించి తానూఅగస్త్య మహర్షిని కలవటానికి హిమాలయాలనుంచి వచ్చానని ,దారిలో కాశి ,నేపాల్ తిరుకదారం కంచి మొదలైన క్షేత్ర సందర్శనం చేసి ఇక్కడికి వచ్చానని చెప్పగా అతని వింత ప్రవర్తన అర్ధమైంది .తిరిగి వచ్చినందుకు వారంతా సంతోషించారు ఆయన సంస్కృత శైవ ఆగమాలు తమిళం లోకి అనువాదం చేశాడు .మళ్ళీ హిమా లయాలకు వెళ్ళాడు.అక్కడ మూడువేలనలభై ఏడు తిరుమూల మంత్రాలు రచించాడు .
340-స్తోత్ర రత్న కర్త -యామునా చార్యులు (916-1024 )
శ్రీ నాథ ముని మనవడైన శ్రీ యామునాచార్యులు వైష్ణవ మాతా చార్యులలో పేరెన్నికగన్నవాడు . తమిళనాడు లో వీర నారాయణ పురం అంటే నేటి మదురై లో 916 లో జన్మించాడు .చిన్నప్పుడే శాస్త్రాలన్నీ 12 ఏళ్లకే నేర్చిన బాలమేధావి .శ్రీమద్ భాష్యాచార్యుల శిష్యుడు .ఆ కాలం లో కోలాహలుడు అనే గర్విష్టి పండితుడుతుండేవాడు అతని చేతిలో వాదం లో ఓడిపోయినవారిచేత పన్ను కట్టించే వాడు యామునుని గురువుకూ ఇది తప్పలేదు .కొన్నేళ్లు పన్ను కట్టలేక పోయాడు .ఒక రోజు కోలాహాలుని శిష్యుడు వచ్చి పన్ను చెల్లించమని ఒత్తిడి చేశాడు . 12 ఏళ్ళ యామయునాచార్యులు కొహలుడిని తనతో శాస్త్రార్థ చర్చ చేసి గెలవమని సవాలు విసిరి పంపించాడు . నిజమైన సవాలా ఉత్తుత్తి సవాలా అని మళ్ళీ పంపగా యామునుని గురువు శిష్యుని పక్షాన ఉండి గట్టి సవాలే నని జవాబు పంపాడు .
రాజాస్థానం లో చర్చ రసవత్తరంగా సాగింది. రాణి మాత్రం ఈ బాలుడే గెలుస్తాడని చెప్పగా రాజు కోలాహలుడి హల్ చల్ చేసి గెలుస్తాడని చెప్పాడు .ఇద్దరూ పందెంకాశారు దర్బారులో .కుర్రాడు ఓడిపోతే తాను రాణీ దాసికి దాసికి దాసిగా ఉంటానని అంటే రాజు కుర్రాడు గెలిస్తేతన అర్ధ రాజ్యాన్ని అతనికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు .యమునుడు మూడు వింత ప్రశ్నలను కోహాలునిపై సంధించాడు. వాటిని కాదు అని తిరస్కరించామన్నాడు 1-మీ అమ్మ వంధ్య కాదు 2-పాండ్యరాజు మత నమ్మకం లేనివాడు 3-రాణి సతీ సావిత్రి వంటిది .కొహలుడి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది కక్కా లేక మింగా లేక నిశ్శబ్దంగా ఉన్నాడు . ఈ ప్రశ్నలకు యామునాచార్యులనే సమాధానం చెప్పమనగా అతి సునాయాసంగా చెప్పి అందరి మన్ననలు అందుకొని వాదం లో విజేత అయ్యాడు .రాణి ఈ బాలుడిని ‘’మహా బాగా మెప్పించావు ఆళ్వాన్దర్ ‘’అన్నది .అప్పటినుంచి యామునా చార్యులకు అలవందర్ అనే పేరు స్థిర పడింది .అన్నమాట ప్రకారం పాండ్యరాజు రాజ్యం లో సగ భాగాన్ని యమునా చార్యులకు రాసిచ్చాడు .ఆరాజ్యాన్ని చాలా సమర్ధవంతంగా పాలించి ప్రజలకు సకల సౌకర్యాలు కలిగించి ప్రజారంజక పాలన చేశాడు .రాజ్య పాలనలో ఇంటిని మర్చిపోతాడేమోనని తాత నాదముని మనవడిపై ఓ కన్నేసి ఉంచమని శిష్యుడు రామ మిశ్రాకు చెప్పాడు .
యమునాచార్యులకు 35 ఏళ్ళు రాగా మిశ్రా ఆయనను శ్రీరంగం లోని శ్రీ రంగనాధ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు .స్వామి దర్శనంతో మనో నేత్రం విచ్చుకొని . తన జీవిత పరమార్ధం గ్రహించి రాజ్యాన్ని వదిలేసి స్వామి సేవలో, గ్రంథ రచనలో జీవితం గడిపాడు .ఇక్కడే రామానుజా చార్యులు ఈయన శిష్యుడయ్యాడు .యామునాచార్యులవారు సంస్కృతం లో 1-స్తోత్ర రత్నం 2 ఆగమ ప్రామాణ్యం 3-సిద్ధిత్రయం 4-గీతార్ధ సంగ్రహం రాశారు .ఇందులో స్తోత్ర రత్నం చంపు కావ్యం .శ్లోకాలు వచనము ఉంటాయి .నాలుగింటిలో ఇది ఉత్కృష్టంగా భావిస్తారు వైష్ణవులు . యామునా చార్య కథను శ్రీ కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యద కావ్యం లో పరమాద్భుతంగా వర్ణించాడు .యామునుడు రాజుగా ఉన్నప్పుడు చేసిన సంస్కరణలను అమలు పాల్రాచిన రాజనీతిని గొప్పగా వివరించాడు .దీన్ని ఆధారంగా చేసుకొని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు ‘’యామునుని రాజనీతి ‘’అనే పుస్తకం రాసి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితమిచ్చారు . శర్మగారు ఆపుస్తకాన్ని నాకు రాజమండ్రిలో తమను సందర్శించినప్పుడు నాకు ఆత్మీయంగా అందజేశారు
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా
