గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 )
న్యాయ ,వేదాంత ,ఆంగ్లలలో ఎం ఏ ,కావ్యతీర్ధ శ్రీరాం దవే 22-9-1922 రాజస్థాన్ సందాది జిల్లా బడ్మేర్ లో జన్మించాడు .కరాచి హై స్కూల్ టీచర్ .మణి శంకర ద్వివేది ,ధర్దేవ్ జైట్లీ ల శిష్యుడు .19 గ్రంథాలు రచించాడు అందులో భారత్యాభరణం ,రాజ్యలక్ష్మీ స్వయం వరం ,శకట స౦గరం ,సౌందర్య లీలామృతం ,వియోగ శతకం ఉన్నాయి .రాజస్థాన్ సంస్కృత అకాడెమి ,అవార్డ్ ,మాఘ పురస్కార గ్రహీత .
262-ఆది శంకరాచార్య నాటక కర్త –అనంత గోపాల దేశ పాండే (1930 )
15-8-1930 బొంబాయిలో పుట్టిన అనంత గోపాల దేశపాండే గోదాలహరి కావ్యం ఆది శంకరాచార్య నాటకం సంస్కృతం లో రాశాడు
263- రసిక వినోదం కర్త –ఉమా శరత్ చంద్ర దేశపాండే (1944 )
బరోడాలో 1944 ఆగస్ట్ 26 జన్మించి జర్మన్ భాషలో డిప్లోమో ,ఎం ఏ పి హెచ్ డిపొందిన ఉమాశరత్ చంద్ర దేశపాండే గుజరాత్ లో టీచర్ .డా.అరుణోదయ జాని ,సురేష్ చంద్ర కంటావాలా వద్ద విద్య నేర్చాడు .ఒకే ఒక పుస్తకం ‘’రసిక వినోదనం స్వానుభూతిః హస్త లిఖిత గ్రంధ ద్వయస్య ప్రకాశనం ‘’రాశాడు .
26 4- గాంధీ సూక్తి ముక్తావళి కర్త –కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి సి .డి.దేశ్ ముఖ్ (1896-1982 )
అందరికి పరిచయమైన పేరు సి డి దేశ ముఖ్ అసలుపేరు చింతామణి ద్వారకానాద్ దేశ్ ముఖ్ 14-1- 1896 మహారాష్ట్ర పోర్ట్ రాయగడలో జన్మించి బొంబాయి లో చదివి ,మొదటి జగన్నాద శంకర సేథ్ స్కాలర్షిప్ సంస్కృతం లో సాధించి గణన కెక్కాడు .1915 లో ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జి లో నాచురల్ సైన్సెస్ లో డిగ్రీ తీసుకుని ,బాటనీలో స్మార్ట్ ప్రైజ్ పొంది ,1918 లో ఐ సి ఎస్ పరీక్షలో సర్వో త్క్రుస్టంగాలండన్ నుంచి పాసైన ఏకైక భారతీయుడిగా వినుతి కెక్కాడు .1920 లో ఇండియా తిరిగి వచ్చి బీహార్ మధ్య పరగణాలలో డిప్యూటీ కమీషనర్ ,సెటిల్మెంట్ ఆఫీసర్ మొదలైన హోదాలలో పని చేసి ,1931 లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు సెక్రెటరి జనరల్ గా ఉండి ,తర్వాత ఫైనాన్స్ ,పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరి అయ్యాడు .భారత ప్రభుత్వ విద్యా ఆరోగ్య శాఖ జాయంట్ సెక్రెటరి గా పని చేసి ,కొంతకాలం కస్టోడియన్ ఆఫ్ ఎనిమి ప్రాపర్టి గా ఉన్నాడు .
1939 లో రిజర్వ్ బాంక్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సెక్రెటరి అయి , డిప్యూటీ గవర్నర్ అయి గవర్నర్ అయ్యాడు.1943 లో రిజర్వ్ బాంక్ గవర్నర్ అయి డిప్యూటీ గవర్నర్లు గవర్నర్ స్థాయి పొందిన ఇద్దరిలో ఒకడు అయ్యాడు , ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పరేషన్ ఏర్పాటులో చురుకైన పాత్ర వహించి గ్రామీణ అప్పులు ఇవ్వటానికి కృషి చేశాడు .500 రూపాయల నోట్ల రద్దు చేసి బాంకింగ్ సిస్టం ను సరైనమార్గం లో నడిపిన ఘనత పొందాడు .బాంకుల జాతీయీకరణకు వ్యతిరేకించినా బోర్డ్ మీటింగ్ లో పాల్గొన్నాడు .దేశ్ ముఖ తర్వాత 1949 లో బెనెగల్ రామారావు రిజర్వ్ బా౦క్ గవర్నర్ అయ్యాడు.బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్ కు ఇంటర్నేషనల్ బాంక్ ఆఫ్ రి కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ కు భారత దేశం తరఫున వెళ్ళిన అయిదుగురు ప్రతినిధుల బృందం లో ఒకడు . అందులో చర్చకు దారిద్ర్యాన్ని అభి వృద్ధిని చేర్చటానికి కృషి చేసి సఫలీ కృతుడయ్యాడు దేశ్ ముఖ్ .వీటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబరయ్యాడు
భారత స్వాతంత్ర్యానంతరం దేశ్ ముఖ్ ప్లానింగ్ కమిటి సభ్యుడై ,1950 జాన్ మత్తయ్ స్థానం లో ఆర్ధిక మంత్రి అయ్యాడు .పంచ వర్ష ప్రణాళికల అమలుకు ఎంతో సాయం చేశాడు .కేంద్ర ఆర్దికమంత్రిగా 5 బడ్జెట్లు ఒక ఇక ఇంటీరియం బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత పొందాడు .1956 లో ఆర్దికమంత్రిగా రాజీనామా చేసి యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు.విశ్వ విద్యాలయాల అభి వృద్ధికి కీలక పాత్ర పోషించాడు .195 7 లో నేషనల్ బుక్ ట్రస్ట్ కు వ్యవస్థాపక అధ్యక్షుడు.1962- నుండి 1967 వరకు ఢిల్లీ యూని వర్సిటి వైస్ చాన్సలర్ .ఫోర్డ్ ఫౌండేషన్ ను ఆహ్వానించి గ్రంధాలయ అభి వృద్ధికి ఒక మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయమని కోరాడు .1953 లోఆంధ్రుల ఆడబడుచు మహిళాభ్యుదయానికి నిర్విరామ కృషి చేసిన శ్రీమతి గుమ్మిడిదల దుర్గా బాయ్ ను వివాహమాడి ఆంధ్రా అల్లుడై ఆమెను’’ దుర్గాబాయ్ దేశ్ ముఖ్’’ ను చేశాడు .1974 లో ‘’ది కోర్స్ ఆఫ్ మై లైఫ్ ‘’పుస్తకం రాశాడు .2-2-1982 హైదరాబాద్ లో 86 వ ఏట సిడి దేశముఖ్ మరణించాడు .భర్త జీవిత విశేషాలను దుర్గాబాయి ‘’చింతామణి అండ్ ఐ ‘’పుస్తకంగా రాసింది .
దేశ్ ముఖ్ సంస్కృతం లో గాంధీ సూక్తి ముక్తావళి ,సంస్కృత కావ్య మాలిక లను రాశాడు అని చాలామందికి తెలియదు ..మేఘ దూతం ను సంస్కృతం నుండి మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు ,
265 –భారతీయ సాహిత్య శాస్త్రం కర్త –గణేష్ త్రయంబక దేశ పాండే (1809 )
1809 లో జన్మించిన గణేష్ త్రయంబక దేశ పాండే డి లిట్.సాహిత్య తత్వ శాస్త్రాలలో నిష్ణాతుడు .సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత .రెండు గ్రంధాలు –భారతీయ సాహిత్య శాస్త్రం , సాంఖ్య కారికా స్పందన కారిక ,అలంకార ప్రదీప తోపాటు అభినవ గుప్తుని పై మోనోగ్రాఫ్ రాశాడు .
266-అభినవ రాఘవం నాటక కర్త –పి ఎస్ దేవనాధా చార్య (1922 )
21-5-1922 తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా మధురాంతకం తాలూకా పైయంబాడి లో జన్మించిన పి ఎస్ దేవనాధా చార్య మీమాంస ,సాహిత్య ,విశిస్టాద్వైతాలలో శిరోమణి .రంగ రామానుజ మహా పెరిక ,శ్రీవత్స సంఘ చారియార్ ల శిష్యుడు .అభినవ రాఘవ నాటకం ,మాత్రమె రాశాడు .
267-కవితా సుధానిధి కర్త –దేవీ ప్రసాద్ (1888-1931 )
1888 లో కాశీలో పుట్టి 53 వయేట 1931 లో మరణించిన దేవీ ప్రసాద్ ప్రాచీన న్యాయ,వ్యాకరణ ,సాంఖ్య యోగ ,మీమాంస ,ధర్మ శాస్త్ర సాహిత్య శాస్స్త్రాలలో మహా పండితుడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .కవితా సుధానిధి ,శారదా పచ్చీసి రాసిన కవి చక్రవర్తి బిరుదాంకితుడు ,మహామహోపాధ్యయుడు .
268-నామకరణ సంస్కార కర్త –వేద ప్రకాష్ దిన్దోరియా (1978 )
18 -12-1978 లో హోషియార్పూర్ లో జన్మించిన వేద ప్రకాష్ దిన్దోరియాపిహెచ్ డి చేసి ,హోషియార్పూర్ కాలేజి లెక్చరర్ అయ్యాడు .2009 లో ఉపనయన సంస్కారం ఒక్కటే రాశాడు .
269- గోపాల బంధు కర్త –హరినారాయణ దీక్షిత్ (1936 )
గోపాల బంధు ,భీష్మ చరితం ,మేనకా విశ్వామిత్రం ,ఉపదేశ శతి మొదలైనవాటి కర్త హరినారాయణ దీక్షిత్ ఉత్తరప్రదేశ్ జలూన్ జిల్లా పడ్కూల లో 13-1-1936 పుట్టి ,ఉత్తరాఖండ్ కౌమాన్ యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .50 పుస్తకాలు రాసిన బహు గ్రంథ కర్త.రాసిన వాటిలో రాష్ట్రీయ కావ్య లేఖన్ మంచి గుర్తింపు నిచ్చింది .ప్రెసిడెంట్ అవార్డ్ ,సాహిత్య అకాడెమీ అవార్డ్ ,వనభట్ట పురస్కారం పండిట్ గౌరీ శంకర ద్వివేదీ పురస్కారం ,వాచస్పతి పురస్కారం విద్యారత్న పురస్కారాలతో పాటు ,సరస్వతి సమ్మాన్ పొందాడు .
270-మాధవ కరుణ విలాస కర్త –చిదంబర మార్తాండ దీక్షిత్ (1916 )
చిదంబర మార్తాండ దీక్షిత్ నవ్య న్యాయ విద్వాన్ ,పూర్వ మీమాంస విద్వాన్ . 1916 జూన్ 1 బెల్గాం లో పుట్టాడు .దారార్ సంస్కృత కాలేజి లెక్చరర్ .పర్యాయ శబ్ద రత్నం ,గురు వచన సుధ ,మాధవ కరుణావిలాస కావ్యం రాశాడు కర్నాటక రాష్ట్ర అవార్డ్ ,కంచి సమ్మాన్ తోపాటు రాష్ట్ర పతి పురస్కారం పొందాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –15-2-18 –ఉయ్యూరు
