దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12 త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -12
త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -4
మలబారు రాజ గాయకులు
ప్రాచీన ద్రావిడ గానపద్ధతిని తిరువాన్కూర్ లో ‘’సోపానం ‘’అంటారు .ఇది ఆర్య సంగీతం తోపాటు ప్రచారం లో ఉంది .పాటలు ,పదాలు కధకళి నృత్యం,’’ పట్టు’’అనే జాతీయ గీతాలలో ఉన్జాల్ ,తుల్లాల్ ,వంజి ,తిరువత్తుర,భద్రకాళి అనే గీతాలలో బాగా వాడబడింది .చాలా ద్రవిడ రాగాలు పది ,ఇందాశ,ఇందాళ౦,పురాణి,కన్న కురంజి పేర్లతో ఉన్నాయి .’’తేవార భక్తి గీతాల’’లో 20రాగాలు వాడారు .అవే –నాటపదై-నాటరాగం ,పజం పంజరం –శంకరాభరణం ,సాదారి-పంతువరాళి ,కౌశిక్-భైరవి పేర్లతో 11వ శతాబ్దం లో వాడబడ్డాయి .మన వీణ కు సమానమైన ‘’యాళి’’అనే తంత్రీ వాద్యం అక్కడ ఉంది .
తమిళం లో సప్తస్వరాలకు పేర్లు –స-కురల్,రి-తుట్టం ,,గ –కై క లై ,మా-ఉజాయ్ ,ప-ఈశం ,ధ-విలారి ,ని-తారం .ఆర్యులగమక చిహ్నాలు తమిళులకు ఉత్తేజమిచ్చాయి ,మలబారు లేక కేరళలో ఆర్య, ద్రావిడ సంపర్కం ఉండివిచార గీతాలు, దీర్ఘపు చుట్లు కనిపిస్తాయి .18శతాబ్ది కార్తిక తిరునాళ్,స్వాతి తిరునాళ్ రాజులు ఈ శైలిలోగీతాలు రాశారు.క్రమంగా త్యాగరాజ ,దీక్షితార్ లప్రభావం వలన కొత్త గాన రీతులేర్పడ్డాయి
1-స్వాతి తురునాళ్((1820-47)
తిరువాన్ కూరు మహారాజా స్వాతి తిరుణాల్ త్యాగరాజస్వామి సమ కాలికుడు .గానవిద్యా కౌశలం తో కళాపోషణ చేశాడు .కులశేఖరాల్వార్ అనుయాయి .రాజులలో గాన సామ్రాట్ ,సమ్రాట్టులలో గాన చక్రవర్తి .ఈఘనత మొత్తం ఆ రాజవంశానికి కూడా చెందుతుంది .స్వరాక్షరాలైన సరిగమ లను సముచితంగా ఇమిడ్చి అర్ధగౌరవం చెడకుండా రాయటం ఈయన ప్రత్యేకత .నేర్చుకోనేవారికి సులభశైలిలో కొన్ని రాశాడు .కొన్ని గాయకుల గాత్ర పటిమకు పరీక్షలాగా చాలా కఠినం గా ఉంటాయి .భక్తిగీతాలు సోపానవిధానం లో మృదు మధుర శైలిలో రాశాడు .ఈ రెండుతరగతుల పద్ధతులలోని లోపాలను సవరించి ఆర్య ,ద్రావిడ గానాన్ని మిళితం చేశాడు .ప్రఖ్యాత ఆంగ్లకవి చాసర్ సులభ శైలి, శ్రావ్యత స్వాతి తిరుణాల్ లో భణుతులలో కనిపిస్తుంది .ఒకరకంగా పల్లెటూరి పదాలను గుర్తు చేస్తాయి .కీర్తనలలో ఉత్కృష్ట రసస్పూర్తి ఉంటుంది .నిరుపమానమైన భాషా పా౦డిత్యమున్న గాయక రాజు .ఆస్థానగాయకుడు పరమేశ్వర భాగవతార్ కఠినస్వర కల్పనా చేయగా ,వాటికనువైన గీతాలు రాసిన విద్వత్తున్నవాడు .
27సంవత్సరాల అల్పాయుష్కు డైనా అనేక రకాల కీర్తనలు రాశాడు .ఈయనరాసిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఇప్పటికీ దసరా పండుగలో పాడుతూనే ఉన్నారు .రాజవంశం లో వైష్ణవమతస్తుడు స్వాతి తిరుణాల్ ఒక్కడే .నృత్యం ,కథాకళి లోకూడా గొప్ప ప్రవేశమున్నవాడు.హిందూస్థానీ గానాభి వృద్ధికోసం ఉత్తర ప్రదేశ్ నుంచి హలావతి, సులేమాన్ లను రప్పించాడు .ఆగర్భ శ్రీమంతుడైన౦దువల్ల ‘’శాక్తన్ రాజా ‘’అంటారు .తానురాసినవి త్యాగయ్యగారికి పంపి ,అభిప్రాయం కోరిన సహృదయుడు .శ్రీ అనంత పద్మనాభ స్వామియే తన కులదైవం అని పూజించి శాసించి ప్రజలనమ్మకం కోసం ‘’పద్మనాభ దాస వంచిపాల ‘’బిరుదుపొందాడు .స్వామి తరఫుననే తనరాజవంశం పాలించాలనేది అభిప్రాయం .
సంగీత ప్రత్యేకతలు -శ్రావ్యత ,మాధుర్యం భావగర్భిత ఈయన ప్రత్యేకతలు .కృతులు మనోహరత్వం తో మనసును దోచుకొంటాయి .పద్మనాభ స్వామికి అంకితమిచ్చిన కృతులన్నీ ఉత్తమ భక్తిభావ౦ ఉత్కృష్ట శైలిలో ఉంటాయి .ఈయనరాసిన హిందూస్థానీ కృతులు తాన్ సేన్ సదారంగ్ వంటి గాయక కృతులనే మరపిస్తాయిని బుధజనాభి ప్రాయం .’’స్వాతి తిరుణాల్ సంగీతోత్సవం ప్రతిఏడాది జనవరి 4నుంచి 13వరకు మహావైభవంగా తిరువాన్కూర్ లో నిర్వహిస్తారు .ఆయన రాసినవి, హిందూస్థానీ గీతాలే పడాలి .ఆయనపేర పురస్కారం అందిస్తారు .
ఈయన ఆస్థాన గాయకులంతా గొప్ప పేరున్నవారే .వారిని గురించి వివరగా తర్వాత తెలుసుకొందాం .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-20-ఉయ్యూరు ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.