ప్రపంచ దేశాల సారస్వతం
11- జపనీస్ సాహిత్యం -1
జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో సంబంధమేర్పడి ,ఆభాషాపదాలు చాలా ఇందులోకి చేరాయి .ఈభాష నామవాచకాలలో వచనం అనుసరించి మార్పు రాదు .ప్రత్యయాలు చివర్లో ఉండటం చేత విభక్తి సూచకంగా ఉంటాయి .తర తమ విభేదాల పదాలు లేవు .వాక్య నిర్మాణం లో కర్మణి ప్రయోగం కనిపించదు. స౦బ౦ద వాచక ,సర్వనామాలు ఉపయోగి౦ప బడవు. సంఖ్యాగణనం లో జపనీస్ సంఖ్యా వాచాకాలున్నా ,చైనీయ సంఖ్యావాచకాల వ్యాప్తికూడా ఉంటుంది .వాక్యాలలో విశేషణం విశేష్యానికి ముందు ఉండటం ,క్రియాపదానికి ముందు కర్మ ఉండటం వాక్యం చివర్లో క్రియం ఉండటం జపనీస్ భాష ముఖ్య లక్షణాలు .
5వ శతాబ్దం నుండి రాత చైనీస్ లిపిలోనే రాయబడింది .కాని ఆభాషకంటే జపనీస్ భాషప్రత్యయాత్మకం అవటం వలన ,ప్రత్యయాలను వెల్ల డించటానికి చైనీయ లిపి వీలుకానందున ,48ధ్వనులతో కూడిన ఒక కొత్త వర్ణమాలను జపనీస్ పండితులు నిర్మించారు .’’కట,కణ ‘’అనే రెండు పద్ధతులలో ఈ ధ్వనులు లిఖించారు .దీనిలో హిరగణ పధ్ధతి కి వ్యాప్తి ఎక్కువ .చైనీయ చిత్రలిపి కి ప్రక్క ప్రత్యయాలను సూచించటానికి ,ప్రత్యేక ధ్వనులను సూచించటానికి వీటిని వాడుతారు .
క్రీ శ 7వ శతాబ్దికి పూర్వమున్న దాన్ని ఆదిమ యుగం అంటారు .5వ శతాబ్దిలో చైనాలిపి ప్రవేశించే దాకాలిఖితపూర్వక జపనీస్ సాహిత్యం లేదు .కాని కొన్ని కధలు ,గేయాలు ,ప్రార్ధనలు మౌఖికంగా తరతరాలనుంచి ప్రచారమై ఉంటాయని భావిస్తారు .ఇవిగాథల్లా ,పద్యాల్లో వృత్తాలలో వచనరూపంగానే రచి౦ప బడినవే .5,6శతాబ్దాలలో చైనానాగరకత ,బౌద్ధమతం జపాన్ కు చేరి ,జపనీస్ సాహిత్యం లో అభ్యుదయం కనపడింది .
నారా యుగం (700-794).710లో జపాన్ రాజధాని నారా లో ఏర్పాటై 794లో క్యోటో కు మార్చబడింది .ఈకాలం లో బౌద్ధం బాగా వ్యాపించి ,కళాకారుల ప్రోత్సాహం తో వాస్తు శిల్పం మొదలైన వాటిలో పెద్ద మార్పులొచ్చాయి .రాసే విధానమూ మారింది .దీని ఫలితంగా ‘’క’’విధానం అమలైంది .నారాయుగం అంతా పద్య విధానమే లలితమైన పదాలతో ,సూక్ష్మ పరిశీలనతో శక్తి వంతమైన కవిత్వ రచన జరిగింది .ఇలాంటి ఉన్నత శ్రేణికవిత్వం ఆతర్వాత యుగాలలలో రానే లేదని దేశీయవిమర్శకులు అంటారు .ఈ కవిత్వం అంతా ‘’టంకా’’పద్ధతిలో వ్రాయ బడేది .దీనిలో 31అక్షరాలూ ,12నుంచి 20వరకు పదాలు ఉంటాయి .ఇవి ఆవేశపూరిత గీతాలు .మానవుడు ,ప్రకృతి ,ప్రేమ విషయాలుగా వెలువడిన కవిత్వం .కొన్ని కరుణ ,తత్వ మయ గీతాలుకూడా ఉన్నాయి .
‘’మన్యోషూ’’అనేది జపనీయ సాహిత్యం లో 8వ శతాబ్దిలో వచ్చిన అత్యంత ప్రాచీన సంకలిత గ్రంథం.పరిమితి గుణాలలో ఇది ఘనమైన గ్రంథం.ఇందులో కకినమొటో,నో హిటో మరో,యమబే నో ,అకాహి టోమొదలైన 450కవులు రాసిన 4,500పద్యాలున్నాయి .చైనాలో ఉన్న ఈపద్ధతిని చూసి జపాన్ వారు అలా సంకలితం చేసి ఉంటారు .ఇందులో నూటికి 90 ‘’టంకా’’ పద్యాలే .మిగిలినవి ‘’చోకా ‘’అనే దీర్ఘ కావ్యాలు .చోకా రచన తర్వాత కాలం లో వెనకబడి పోయింది .ఈకాలంలో వచ్చిన వచనగ్రంథాలలో8వ శతాబ్దికి ము౦దేవచ్చిన కోజికో ,నిహాన్ షోకి అనే జపాన్ చరిత్రలు ముఖ్యమైంవి .సారస్వతంగా వీటికి ప్రాధాన్యం లేకపోయినా ,ఆదేశ పౌరాణిక గాథలు తెలుసుకోవటానికి వీలుకలిగించాయి .
హెయియాన్ యుగం (794-1192)-ఈ యుగం లో ఉదాత్తమైన జపనీస్ సాహిత్యం వచ్చింది .నారాయుగం లో జపాన్ లో అధికారం చక్రవర్తి చేతుల్లోంచి మారి ‘’ఫుజి వారా ‘’కుటుంబం వారికి దక్కింది .ఈ కుటుంబ పెద్ద యేదేశ రాజు .ఆస్థానం లో ఉన్నతోద్యోగాలు ఇతర సభ్యులు పొందారు .ఈయుగ సాహిత్యమంతా ఈకుటుంబంవారు సృస్టి౦చి౦దే .వీరిలో మహిళలపాత్ర కూడా ఎక్కువే ..ఆకాలపు స్త్రీలు రాజకీయ చక్రం బాగానే త్రిప్పారు .ఈకాల వాజ్మయంలో ఉన్నత వ్యక్తుల గుణాలన్నీ ప్రతిఫలించాయి .లాలిత్యం తక్కువే .భోగ వైభవం నీతి ధర్మాలపై ఉపేక్ష ఈ యుగకవిత్వ లక్షణం .
11వ శతాబ్దిలో మురసకి షికులు అనే రచయిత్రి ‘’గెంజిమోనో గతరి’’అనే గ్రంథం రాసింది .ఇది గెంజి రాకుమారుడు ,అతనికొడుకులు .మనవళ్ళ ప్రణయ జీవితాలను వర్ణించే నవల .ఇదే జపనీస్ సాహిత్యం లో మొట్టమొదటి నవల .హెయియాన్ రాజాస్థాన జీవితం అంతా కళ్ళకు కట్టినట్లు చేసింది .ప్రపంచ వాజ్మయంలో ఈనవలకు అత్యున్నత స్థానమే లభించింది .ఇది తర్వాత తరానికి చెందిన రచయితలను బాగా ప్రభావితం చేసింది .ఈ కాలపు ఇతర రచనలలో ముఖ్యమైనవి-టకెటారి మొనోగతరి ,ఇసే మెనోగతరి లు .నీషో నాగాన్ అనే ఆమె మురసకి కి సంకాలికురాలు .ఈమె గ్రంథం ‘’ముకుర నోసోషి ‘’అంటే’’ తలగడ తలపులు ‘’.రాజాస్థాన దర్బారు జీవితం ,వ్యాసాలూ లేఖా వృత్తాంతాలు ఉంటాయి .జపాన్ భాషలో వచ్చిన ‘’జహి యిట్సు’’అనే వ్యాసానికి ఇదే ప్రేరణ .
ప్రాచీన –ఆధునిక కావ్యాలతో కూడిన ‘’కాకన్స్షు’’అనే సంకలనగ్రంథంఈ యుగంలోని కినోట్సు రయుకి ,కినోటో మొనారి,ఒచికోచివో మిట్సునె,మిలునొతడ మినే అనే నలుగురు రచయితలు సంకలనం చేశారు .దీని ప్రధాన సంపాదకుడు ‘’డైనట్సు రయుకి’’రాసిన పీఠిక-కావ్య విమర్శనాత్మక వ్యాసాలకు ఒజ్జబ౦తి గా విశ్లేషకులు భావించారు .దీనిలో వెయ్యి కావ్యాలున్నాయి .అందులో అయిదు దీర్ఘ కావ్యాలు .మిగిలినవన్నీ టంకా పద్యాలతో రాసినవే .’’ట్సురయుకి టోసానిక్కి’’935లో దినచర్యాగ్రంధం అంటే డైరీ రాశాడు .హాస్యం తో యాత్రికుని జీవితాన్ని వర్ణించే రచన ఇది .’’యెంగి షికి’’అనే గ్రంథం రాజ కొలువులో ఉండే నియమాలు ,కార్యకలాపాలు తెలియ జేసే చైనాభాషలో 905-27మధ్య రాయబడిన పుస్తకం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ 23-1-20-ఉయ్యూరు
