స్వాతంత్రోద్యమఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

భూలా భాయి జీవంజీభాయి దేశాయ్ 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో   అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద  కుటుంబ లో పుట్టాడు .తండ్రి ప్రభుత్వ ప్లీడర్ .స్వగ్రామ౦ లో చదువు ముగించి బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజిలో చేరి ప్రధమ శ్రేణిలో పట్టా పొంది ,ఎం ఏ పాసై ,అహ్మదాబాద్ కాలేజిలో  హిస్టరీ ప్రొఫెసర్ అయ్యాడు . రెండేళ్ళు పని చేసి ,ఎల్.ఎల్ .బి.చేసి ,బాంబే హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరాడు .అక్కడ అందరూ బారిస్టర్లే.స్వదేశీ న్యాయవాదిగానే ఉంటూ భూలాభాయ్ ,వాదనా సామర్ధ్యం తో త్వరలోనే అద్వితీయ న్యాయవాది యై ,ప్రభుత్వం దృష్టిలోపడి ,1923లో వైస్రాయ్ కార్యవర్గ పదవి ని స్వీకరించమని కోరినా నిరాకరించి, అనేకసార్లు ,హై కోర్ట్ న్యాయమూర్తి పదవికిఆహ్వాని౦చినా తిరస్కరించి ,1926లో తాత్కాలికంగా అడ్వొకేట్ జనరల్ పదవి మాత్రం స్వీకరించాడు .

  మితవాదిగా రాజకీయం లోకి ప్రవేశించి,అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం లో  భూలాభాయ్  పని చేసి విస్తృత ప్రచారం తెచ్చాడు .అప్పుడే గాంధీజీ వల్లభభాయ్ పటేల్ లతో పరిచయం కలిగింది .1928 బార్డోలీ సత్యాగ్రహం  చరిత్రాత్మకమై సైమన్ కమీషన్ బహిష్కరణ లో దేశం ఊగిపోయింది .ప్రజలు అనేక కస్టనష్టాలు  ఎదుర్కొంటూ అత్యంత ధైర్య సాహసాలతో ‘’సైమన్ గోబాక్ ‘’నినాదాలతో దేశాన్ని అట్టుడికి౦చారు .అప్పుడే బార్దోలీలో రీ సెటిల్ మెంట్ విషయంలో పన్నుల నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది .ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది .1930లో గాంధీ –ఇర్విన్ ఒడంబడిక జరిగి ,లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సభకు గాంధీకి ఆహ్వానం వచ్చింది .గాంధీ నిరాకరించాడు .బార్డోలీ పన్నుల విషయం లో ఒక ప్రత్యేకకోర్టు పెట్టి విచారిస్తామని ప్రభుత్వం తెలియజేయగా గాంధీ లండన్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు .1931లో బార్డోలీ విచారణ సంఘం ఏర్పడింది .

 1928లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రూం ఫీల్డ్ కమిటీ ముందు  రైతులపక్షాన భూలాభాయ్ వాదింఛి,1931 బార్డోలీ విచారణ సంఘం  ఎదుట కూడా వాదించాడు  1932సత్యాగ్రహ ఉద్యమం లో గాంధీతో పాటు పాల్గొన్నాడు .ఈ మహోద్యమానికి ముఖ్యకారణం లార్డ్ విల్లింగ్టన్ వైఖరే .గాంధీ లండన్ నుంచి రాగానే నెహ్రూను అలహాబాద్ లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను పెషావర్ లోనూ దేశవ్యాప్తంగా వేలాది సత్యాగ్రహులను  అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .కలకత్తాలో ఆర్డినెన్స్ పెట్టారు .దేశమంతా నానా భీభత్సంగా ఉన్నది .గాంధీ వైశ్రాయికి ఒక టెలిగ్రాం పంపిస్తూ ఆయనతో మాట్లాడాలని ఉందని తెలిపాడు .రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విషయాలుతప్ప ,ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదని జవాబు రాగా, గత్యంతరం లేక కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటానికి దిగాల్సి వచ్చింది .

 ఉద్యమం జయప్రదంగా సాగుతుంటే వైస్రాయ్ ఆరు వారాలలో అణచి వేస్తానని  ప్రగల్భాలు పలుకగా ,,ఉద్యమం ఉవ్వెత్తున రెండేళ్ళు నడిచింది .1921ఉద్యమం లో 30వేల మంది 1930ఉద్యమం లో 60వేలమంది ,1932లో లక్ష ఇరవై వేలమంది  ప్రజలు స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు  ,1932లో సత్యాగ్రహ ఉద్యమంలో భూలాభాయ్ పాల్గొని ఒక ఏడాదిజైలు శిక్ష  అనుభవించి ,10వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాడు .విడుదలై 1933లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సభలో కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యాడు .

  వ్యూహం మార్చి కాంగ్రెస్ శాసనసభ ఆక్రమణకు దిగింది .శాసనసభా బహిష్కరణ కు వత్తాసు పలికిన పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యకారకుడు భూలాభాయ్ .గుజరాత్ నుంచి కేంద్ర శాసన సభ సభ్యుడుగా భాయ్ ఎన్నికయ్యాడు .కాంగ్రెస్ పక్ష నాయకుడయ్యాడు .శ్రీ ఎస్ సత్యమూర్తి ఉపనాయకుడు .పండిత మోతీలాల్ నెహ్రూ చనిపోయాక అంతటి ప్రతిభాశాలి శాసన సభలో కరువయ్యారు .ఆకొరత తీర్చటానికి భూలాభాయ్ ని పార్టీ ఎంపిక చేసింది .అప్పటికి ఈయనకు  అందులో  అనుభవం లేదు..స్వయం కృషితో అనుభవం సాధించి 1936లో ప్రభుత్వ విధానాలకు అసమ్మతి తెలుపుతూ  అసెంబ్లీ నుంచి పార్టీ సభ్యులతో మొదటి సారిగా వాకౌట్ చేసి భూలాభాయ్ చరిత్రసృస్టించాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.