మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33

మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -33

33-పొట్టను బుజాలపై వేలాడే బొందుల పాంట్ కుక్కి , మెడలో స్టెతస్కోప్ తో నవ్వించే –డా .శివరామ కృష్ణయ్య

సుమారు నలభై ఏళ్లకు పైబడిన విషయం జ్ఞాపకం వస్తోంది .మాపెద్ద క్కయ్యలోపాముద్ర, బావ కృపానిధి గారి ఇంటికి మద్రాస్ వెళ్లాను .వాళ్ళుండేది షినాయ్ నగర్ . అప్పటికి మా మేనల్లుడు మేనకోడళ్ళు చిన్న వాళ్ళు .ఏమీ తోచక ఒక రోజుఉదయం షినాయ్ నగర్ లో సిటి బస్ ఎక్కి తాంబరం లో దిగి అక్కడ లోకల్ ట్రెయిన్ ఎక్కి సరదాగా అది ఎక్కడిదాకా వెడితే అక్కడికి టికెట్ తీశాను .పది నిమిషాలు దాటగానే కుడివైపు ఇళ్ళల్లో ఒక ఇంటి వసారాలో గావంచా కట్టి పైన తువాలు తో ఒక భారీకాయం బాదం ఆకు విస్తళ్ళు కుడుతున్నట్లుగా చూశాను .ఎక్కడిదీ శాల్తీ అని ఆలోచిస్తే ఆయన సినిమాలో హాస్య వేషాలు వేసే డాక్టర్ శివరామ కృష్ణయ్య అని గుర్తుకొచ్చింది .ఇంటికి వచ్చాక ఆ విషయ౦ మా అక్కయ్యకు చెబితే నిజమే ఆయనే అని చెప్పింది .విజయవాడలో ఇంటర్ చదివేటప్పుడు విజయ టాకీస్ దగ్గర సిగరెట్ కాలుస్తూ ఉన్న సి ఎస్ ఆర్ ను చూశాను మళ్ళీ ఇప్పుడు ఈయన్ని చూశాను .అదేదో గర్వంగా ఉండేది .

సుమారు ఏడెనిమిది ఏళ్ల క్రితం బెంగుళూర్ లో ఉండే కవన శర్మ అనే కందుల వరాహ నరసింహ శర్మగారు రచన మాసపత్రికలో ఒక కాలం నడుపుతూ శివరామ కృష్ణయ్యగారు తమ బంధువే అని ఆయన గురించినతన జ్ఞాపకాలు రాస్తే ,నేను ఆయన మెయిల్ అడ్రస్ కు పైన రాసిన మద్రాస్ విషయ౦ రాశాను .వెంటనే ఆయన స్పందించి జవాబిచ్చారు .అప్పటినుంచి మా ఇద్దరిమధ్యా మెయిల్స్ ‘’మొయిళ్ళు’’ లాగా కొంతకాలం నడిచాయి .శర్మగారు ప్రముఖ సైంటిస్ట్ .సైంటిఫిక్ రచనలు, కధలు మహా బాగా రాసేవారు .అవంటే నాకు బాగా ఇష్టం కూడా .ఒకసారి బందరులో కృష్ణా యూని వర్సిటి తెలుగు శాఖకు కు మా సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు (అమెరికా)విరాళంగా అందజేసిన 20 వేల రూపాయల చెక్ ను వైస్ చాన్సలర్ గారికి అందజేయటానికి మా దంపతులం ,శ్రీ వైబిజి రావు గారు వెళ్లి వేదికపై శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతులమీదుగా వైస్ చాన్సలర్ మైనేని దుర్గా ప్రసాద్ గారికి సరసభారతి ద్వారా అందజేశాను .అప్పుడు లంచ్ బ్రేక్ సమయం లో కవన శర్మగారితో పరిచయమైంది. చాలా సౌమ్యంగా ఆప్యాయంగా మాట్లాడారు .శర్మగారు శ్రీకాకుళం లోని కారా మాస్టారి కదా నిలయంతో గొప్ప అనుబంధమున్నవారు తరచుగా అక్కడికి వెళ్లి వస్తూండేవారు .

శివరామ క్రిష్ణయ్యగారి అసలుపేరు డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య (1899 – ) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు.[1]

తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామ వాస్తవ్యులు. వీరు వైద్యవిద్యలో పట్టభద్రులు.

వీరు కొంతకాలం కొంగర సీతారామయ్య గారు స్థాపించిన నాటక సమాజంలోను, రామవిలాస సభ లోను వివిధ పాత్రలు పోషించారు. దుర్యోధనుడు, రామదాసు, కబీరు, చాణక్యుడు, హిరణ్యకశిపుడు, కాశీపతి మొదలైన పాత్రలు ధరించి పేరుపొందారు.

వీరు మొదటగా నటించిన చలనచిత్రం భలే పెళ్ళి (1941). జీవన్ముక్తి (1942) సినిమాలో కథానాయకుడిగా కూడా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. వీరు స్థూలకాయం కలిగివుండడం మూలంగా ఎక్కువగా హాస్య పాత్రలు ధరించేవారు.

చక్రపాణి సినిమాలో నాగేశ్వరరావు అక్క చాయాదేవి భర్తగా శర్మ భలే చలాకీగా నటించారు .పింగళిగారి మొదటిసినిమా భలేపెళ్లి ,పెళ్లి చేసి చూడు లో రామారావు తండ్రి సివివి పంతులుగా ,తోడు దొంగలు లో డాక్టర్ గా , ,కే ఎస్ ప్రకాశరావు దర్శకత్వం లో వచ్చిన అంతేకావాలి లో ,యోగానంద్ డైరెక్షన్ లో వచ్చిన ఇలవేల్పులో ,పెళ్లినాటి ప్రమాణాలు లో నందాజీగా ,వి మధుసూదనరావు డైరెక్షన్ లో ఆరాధనలో ,దక్షయజ్ఞం లో ,లవకుశలో రేలంగి మామగా ,పరమానందయ్య శిష్యులకధలో విరూపాక్షయ్యగా ,ప్రాణమిత్రులు లో ,బాపు దర్శకత్వం లో సాక్షి లో , కెవిఎస్ కుటుంబరావు డైరెక్షన్ లో రాజనాల కాళేశ్వర రావు అంటే రాజనాల ,విజయనిర్మల నటించి చెళ్ళపిళ్ళ సత్యం అంటే సత్యం సంగీతం కూర్చిన ఒకనారి వంద తుపాకులు అనే 1973లో వచ్చిన సినిమాస్కోప్ చిత్రం లో శివరామ కృష్ణయ్యగారు కొత్వాల్ కోటి లింగం గా నటించారు . గబగాబగా మాట్లాడటం ,నోటిలో పైప్ ,అవతలివాడు చెప్పేది వినకపోవటం వంటి లక్షణాలు ఆయన నటన వలన ఆరోగ్యమైన హాస్యాన్ని కురిపించింది .నిజమైన సినీ డాక్టర్ శివరామకృష్ణయ్య .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.