కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1

కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు -1
తల్లికి కె ఎన్ కేసరి(కోట నరసింహం –కోట లో కె,నారా మాత్రం ఉంచుకొని సింహం బదులు కేసరి అని మార్చుకొని  కె.ఎన్ .కేసరి అయ్యారు )గారొక్కరే సంతానం .ఆడపిల్ల లేని కొరత తీర్చుకోటానికి అమ్మాయి వేషం వేసి ఇరుగంమలకు పోరుగంమలకు చూపించి ముచ్చట తీర్చుకొనేవారు .అయిదవ ఏటనే పిచ్చయ్య గారి వీధి బడిలో చేరారు .ఆయనకు చదువు చెప్పే సత్తా లేకున్నా ,బెత్తం తో వీపులు చీరేసి భయపెట్టేవాడు .నెలజీతం లేదు పిల్లలు భోజన పదార్దాలైన పరిగలను కాయగూరాలని పిల్లలు తెచ్చిచ్చే వారు .అవి సమర్పించిన వారికి దెబ్బలు ఉండేవికావు .పిల్లల సంఖ్యను బట్టి ప్రభుత్వం సంవత్సరానికి కొంత గ్రాంట్ ఇచ్చేది .దానికోసం ఎదురుచూస్తూ బడిలో ఆయన పిల్లల్ని చేర్చుకోనేవాడు .కొత్తపిల్లలు చేరితే పప్పు బెల్లాలు పంచిపెట్టేవాడు .జీతం వరహా అంటే నాలుగు రూపాయలు .కానీ ఇవ్వగల సమర్ధులు ఉండేవారుతక్కువే  .ఈ జీతాలు వగైరాలే వలననే ఆయన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది .పూరిపాకలో బడి జరిగేది .
  గుంత ఓనమాలు నేర్చి తర్వాత కొయ్యపలకలపై రాసేవాళ్ళు పిల్లలు .పలకకు నీలిమందు దోసాకు పసరు పట్టించి బాగా రుద్ది ఎండలో పెట్టేవారు .అప్పుడు బలపాలతో రాస్తే బాగా కనిపించేది .బలపం కోపులు అనే తెల్లటి రాళ్ళు ఉండేవి .వాటిని తెచ్చి రంపం తో సన్నగా కోసి రాసేవారు .నాలుగైదేళ్ళ చదువు తర్వాత పెద్ద పుస్తకం అంటే రామాయణం ,భారతం భాగవతం పట్టించి చది విన్చేవారు .సరస్వతి పూజ చేయించి పంతులుగారు రామాయణం పట్టించేవారు .అది అయ్యాక పప్పు బెల్లాలు పంచి సెలవిచ్చేవారు .ఆ బడిలో ఈ పెద్ద పుస్తకం తో చదువు పూర్తయ్యినట్లే . పేద కేసరి గారికి పంతులు దెబ్బలు తప్ప చదువు అబ్బలేదు .ఇంటి వద్ద తల్లికి సాయం చేయాల్సి ఉండటం తో బడికి కూడా క్రమంగా వెళ్ళే వాడు కాదు .పొద్దున్నే గుండ్లకమ్మ నదికి వెళ్లి ,కాలకృత్యాలు తీర్చుకొని ,చిన్న కావడిలో రెండు తప్పాలలతో ఇంటికి నీరు తెచ్చేవాడు .చద్దన్నం తిని ఎవరిపోలం లోకైనా వెళ్లి వంకాయలో గో౦గూరో ,దోసకాయలో మెరపకాయలో ,జొన్న కంకులో సజ్జ కంకులో లో అడిగి తెచ్చుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవాడు
ఇంటి దగ్గరున్న ఉప్పలవారి మర్రి చెట్టు పెద్ద  ఆకులు కోసి విస్తరాకులు కుట్టి అందులో తినేవారు .ఒకసారి చెట్టు ఎక్కి కళ్ళు తిరిగి దిగలేకపోతే ఎవరో వచ్చి పగ్గం తో దించారు .తర్వాత చెట్టు ఎక్కటం మాని దోటీ తో ఆకులు కోసి తెచ్చి విస్తళ్ళు కుట్టేవాడు .జొన్నదంటు ఈనెలను సన్నగా చీల్చి ,విస్తళ్ళను మహా నాజూకుగా కుట్టేవాడు .మిషన్ కుట్టు లాగా ఉండేదని తల్లితో సహా అందరూ మెచ్చేవారు .తల్లి రవికలు కుట్టటం లో మహానేర్పరి ఆడవాళ్ళు వచ్చి కుట్టిన్చుకోనేవారు .సాదారవికకు ముక్కాలు అణా,పూలు వేసి కుడితే అణా తీసుకొనేవారు .తేళ్ళు మండ్రగబ్బలు పక్షులబొమ్మలు వేసి కుడితే రెండు అణాలు అంటే బెడ ఇచ్చేవారు .అప్పటి నాజూకు వస్త్రాలు పాలచాయ కోకలు , నల్లచాయ రవికలు ,గువ్వకన్ను నెమలికన్ను అద్దకం రవికలు .అట్లతద్దినాడు స్త్రీలు ఈ అలంకారాలతో కొప్పు నిండా బంతి పూలతో సిన్గారించుకోనేవారు .కోలాహలంగా ఉయ్యాలలు ఊగేవారు .అప్పటివి జాతీయ క్రీడా వినోదాలు దేహానికి పుష్టినిచ్చేవి .తల్లి రవికకలు కుట్టి సంపాదించింది కుటుంబానికి బోతటా బోటిగా సరిపోయేది .
  సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.