శ్రీ ద్వారకాపతి శతకం-1
విశాఖ జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ వాస్తవ్యులు శ్రీ మదాది భట్ట శ్రీరామ మూర్తి కవి శ్రీ ద్వారకాపతి శతకం రచించి ,కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా శోభనాద్రి పుర అగ్రహార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కాశీ నాధుని సుబ్బారావు గారి ద్రవ్య సహాయం చేత బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షరశాలలో శ్రీ కుందా లక్ష్మీ నరసింహయ్య చేత 1942లో ముద్రించారు .వెల-4అణాలు .
సీస పద్యం లో ఆశీస్సు పలుకుతూ ‘’ఆత్రేయస గోత్రులు శ్రీ కాశీ నాథ నాగ లింగారాధ్య తాత ,శ్రీలలితాంబ పుత్రుడు మల్లయ్యఅన్నపూర్ణ గారి పుత్రుడు సుబ్బారావు ,భార్య మహలక్ష్మి ని వివాహమాడి తాత,తండ్రులు లాగా ధర్మతత్పరతతో దాత అయి ప్రఖ్యాతి పొందాడు వారిని ద్వారకాపతి కాపాడాలని’’ అన్నారుకవి .
పీఠిక లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘’ఈ కవి రాసిన శ్రీమద్రామాయణ గీతమాలికలు అక్కడక్కడ చదివాను. ధార అనర్గళం గా ఉంది .మకార ప్రాసతో కుంటు పడకుండా రసం చెడకుండా రాయటం అసాధ్యమే .మధు వాహిని ప్రవహి౦పజేశాడు .వీరి రామాయణ కీర్తనలు రమ్యాతి రమ్యాలు.సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణానికి వన్నె పెట్టినట్లున్నాయి .ఈకవి రాసిన గీతాకావ్యం, నారాయణ శతకం పాండిత్యానికి ప్రతిభకు నిదర్శనం .క్రమాంత స్వాధ్యాయులైన ఈకవి జ్యోతిష పాండిత్యం లో దిట్ట .ఇలాంటి గుణ గరిష్ఠుడైన ఈ కవి మాటలు గుండెకు సూటిగా తాకుతాయి .ఇదంతా అక్షర సత్యం .’’అన్నారు .ద్వారకాపతీ అనే మకుటం తో ఉత్పల ,చంపక మాలపద్యాలతో శతకం కూర్చి సుగంధాన్ని వెద జల్లారు .
మొదటి పద్యం ఉత్పలమాలలో –‘’శ్రీ రమణీ మనోహర విశేష కృపాకరయాదవాన్వాయో –దార పయోధి శీతకర దానవదూర ,వినమ్ర దాసమం-దార మధాంధ చైద్య ముఖ దర్ప కుఠార,కళింద నందినీ –తీర విహార గోపవర ధీర వశీకర ద్వారకాపతీ’అని స్వామిని స్తుతి౦చాడుకవి .విఘ్నాలుకలిగి౦చవద్దు అని గణపతిని కోరి ,వాణిని తన నాలుకపై నర్తించమని ప్రార్ధించి ,వాల్మీకి వ్యాస కాళిదాసాదులను స్మరించి ,సిరికి తలిదండ్రులకు నమస్కరించి తర్వాత తన వంశాన్ని గురించి చెప్పుకొన్నాడు ౦-భారద్వాజవంశం లో రామయలక్ష్మి తన తాతగారు .అవధాని ,ఉపాధ్యాయుల వెంకటా ర్యుని సుబ్బమ దంపతుల కుమార్తె కాత్యాయని సాటి పాపమ,తల్లీ తండ్రీ .తనపేరు రామమూర్తి అని చెప్పుకొన్నాడు .తర్వాత విశేషాలు రేపు తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-5-6-22-ఉయ్యూరు
