విశ్వ పుత్రిక తోరూ దత్-4

విశ్వ పుత్రిక తోరూ దత్-4
మైకేల్ మధుసూదన దత్ హిందూకాలేజిలో చదివి ప్రిన్సిపాల్ రిచర్డ్సన్ కుప్రియశిష్యుడైనాడు .అంతకు ముందు కాశీప్రసాద్ ,రాజనారాయణ అక్కడే చదివారు .మధు 1883లో క్రైస్తవం తీసుకొని ,కొద్దికాలం కలకత్తా బిషప్ కాలేజిలో పని చేసి ,1849లో మద్రాస్ వెళ్ళాడు..మొదట్లో ఇంగ్లీష్ లో తర్వాత బెంగాలీలో రాసి కవిగా నాటకకర్త గా ప్రసిద్ధుడయ్యాడు .1876లో తోరూ తన ఇంగ్లీష్ స్నేహితురాలికి జాబురాస్తూ మధుసూదన్ దత్తు గురించి రాసింది .అప్పుడే అచ్చయిన తన ‘షీఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’ను బెంగాలీ పత్రికలో చక్కగా విమర్శించారనీ ,విద్యావంతుల్లో కూడా వ్యక్తం కాని సంస్కృతి అందులో కనిపించిందనీ ,తాను  మధు కుటుంబానికి చెందినదానిని అని పొరబాటు పడ్డాడని తెలిపింది .అతడు జేస్సూర్ జిల్లా సాగర్ దారీ గ్రామం వాడని కూడా రాసింది .
   1851లో తోరూపినతండ్రి హరిచందన దత్ ‘’ఫ్యూజిటివ్ పోయెమ్స్ ‘అనే కావ్యం రాసి ప్రచురించాడు .ఆధ్యాత్మిక నీతి కవితాత్మక రచనలు కూడా చేశాడు .ఇంకో పినతండ్రి గిరీష్ చందర్ ‘’చెర్రీ బ్లాసమ్స్’’కావ్యం రాశాడు .వీళ్ళు ‘’దత్ ఫామిలి ఆల్బం ‘’లో తరచురాసేకవులు .దీన్ని 1870లో తోరూ దత్ తండ్రి గోవిన్ చందర్ దత్ ప్రచురించాడు .ఆయన మేనల్లుడుఉమేష్ దత్ పద్యాలూ ఇందులో ఉన్నాయి .దీన్ని లాంగ్ మన్ అండ్ గ్రీన్ సంస్థ ప్రచురించింది .ఇది చాలామంది బెంగాలీ కవులను ఉత్తేజితం చేసి,సాహిత్యపు విలువ పెంచింది .ఒకరకంగాఇది  బెంగాలీల మొదటి ఆంగ్ల కవితా సంపుటి .బెంగాలీల పాత రచనకు ప్రాతినిధ్యం వహించింది కూడా .మధు సూదన్ రాసిన ‘’కాప్టివ్ లేడీ ‘’కూడా ఇలాంటిదే .డి.ఎఫ్.ఎ.లో తోరూవికాని, చెల్లెలు ఆరూ వికానీ కవితలు లేవు .1873లో వీళ్ళు ఇండియాకు తిరిగివచ్చాకనే తమరచనల ప్రచురణ గురించి ఆలోచించారు .అప్పటినుంచి బెంగాల్ పత్రికకు రాస్తూనే ఉన్నారు .ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించేవారు .
  డి.ఎఫ్.ఎ.అంటే దత్ ఫామిలి ఆల్బం లో తొరూ తండ్రి 66కవితలురాశాడు .ఆయన శైలి 17వ శతాబ్దికి చెందినదిగా వింతగా ఉండేది ..ఉమేష్ 73రాశాడు .ఈపుస్తకం ప్రతిభా పూర్ణమైన ఒక కుటుంబానికి స్మృతి చిహ్నంగా మాత్రమె కాక ,కలకత్తాలో ఉన్నత ఆంగ్ల విద్య ను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందన పత్రం లాగా కూడా ఉండేది .తోరూ కు ఈ గ్రంథం అంటే విపరీతమైన ఇష్టం .ఆమె స్నేహితుతాలు మేరీ ఈపుస్తకం పై విమర్శరాసి క్వీన్స్ మేగజైన్ కు పంపితే ప్రచురణకు స్వీకరించ లేదు .వాళ్ళు అంతేలే అని సరిపుచ్చుకోన్నది .ఆకుటుంబం లో మరో కవి శశి చంద్ర దత్ ‘’విజన్ ఆఫ్ సుమేరు ‘’మరికొన్నికవితలు 1878లో రాసి ప్రచురించాడు .ఇతని పినతండ్రి గోవిన్ దత్ బంధువు రమేష చంద్ర దత్ ఆకుటు౦బ కవులలో  మహా గొప్పకవి .ఈయన తొరూ ఆరూలకవిత్వాలను మెచ్చేవాడు .
   19వ శతాబ్దం ఇంగ్లీష్ ప్రవేశపెట్టటం తోపాటు వైజ్ఞానిక సంస్కరణలు మత సంబంధ గుర్తింపుతో ప్రసిద్ధికెక్కింది .అప్పుడే యూరోపియన్లు భారతీయ విజ్ఞానానికి బాగా ఆకర్షితులయ్యారు .ఇంతకు  కొద్దికాలం క్రితమే  కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ పుట్టి సర్ విలియం జోన్స్ ,జాన్ విల్సన్ ,సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ,సర్ విలియం హంటర్  మొదలైన వారు భారతీయప్రాచీన విజ్ఞానానికి పూర్తిగా ఆకర్షితులయ్యారు .ఇలాంటి సారవంతమైన సృజనాత్మకమైన కాలం లో తోరూజీవించి ,దేదీప్యమానంగా వెలిగి ,పుట్టిన వందేళ్ళ తర్వాతకూడా సాహిత్యరంగాన్ని వెలిగిస్తూ ధ్రువ తారగా నిలిచింది .
   సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.