మూడొత్తుల’’ ప్రమిద ‘’
తెలుగు భాషా సాహిత్యాలలో నాలుగు దశాబ్దాలుగా అవిరళ కృషిచేస్తున్నఒక విభిన్నమైన ‘’ప్రమిద ‘’పత్రికా సంపాదకులు శ్రీ బులుసు కామేశ్వరరావు గారు బందరు నుంచి జూన్ 26 న చాలాకాలం తర్వాత మా ఇంటికి వచ్చి ప్రమిద 76,77,78 సంచికలు అందించారు .వీటిపై సూక్ష్మ౦గా నా స్పందన .
76 వ సంచిక శ్రీ రావి రంగారావు గారి’’ సాహిత్య స్వర్ణోత్సవ సంచిక’’2022నవంబర్ లో వెలువడింది .మినీకవితను ఊరూరా ఊరేగించిన రావి వారు మచిలీ బందరులో సాహితీ మిత్రులుగా పాతుకుపోయి ,అనేక యువకవులను తయారు చేసిన సంగతి తెలిసిందే .అక్కడి నుంచి మకాం గుంటూరు మార్చి అక్కడా తనదైన శైలిలో అవిరళ కృషి చేస్తున్నారు .ఈ సంచికలో ఆయనపై సర్వశ్రీ శివారెడ్డి ,ఎంకే సుగం బాబు ,మండలి ,ఆచార్యగోపి ,రాపెల, బీరం మొదలైన లబ్ధ ప్రతిష్టులైన అనేకమంది కవుల రచయితల అమూల్య వ్యాసాలున్నాయి .అన్నీ అన్నే .రావి వారి ప్రతిభకు దివిటీలే .పుస్తకం వెల యాభై రూపాయలు .కావాల్సిన వారు రావి వారిని సంప్రదిస్తే పంపిస్తారు .
రెండవ సంచిక పాతకొత్తల మేలు కలయికగా11మంది బందరు కథకుల కథా తోరణం .అందులో నాకు అత్యంత ఆప్తులు శ్రీ రాజనాల శివ రామ కృష్ణ మూర్తి -అదే నండీ ఆర్. ఎస్ .కే .మూర్తి గారి కత ఉండటం నాకు మహదానందం కలిగించింది .
మూడవ సంచిక 2023 ఉగాది స్పెషల్.ఇందులో వేటూరి సుందరరామ మూర్తిగారి ‘’విశ్వనాథాష్టకం ‘’హైలైట్ అయిన ‘’రసగుళిక ‘’.ఇది కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గురించి.ఆయనకు వేసిన శంకరాభరణం .వెల్లాల ఉమామహేశ్వర శర్మగారి సన్మానం కత సత్ మానమే .
ఇలా పట్టువదలని విక్రమార్కునిలా బులుసు వారి సాహితీ ప్రమిద వెలుగులను తమదైన శైలిలో వెలిగిస్తూనే ఉన్నారు .వారి స్నేహాభి రుచికీ ,సాహితీ కృషికి అభినందనలు .ఇంతకీ వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి మేనల్లుడు అని చెప్పక పోవటం నా దోషం అవుతుందేమో –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-23-ఉయ్యూరు .
