హైదరాలీ ,టిప్పు సుల్తాన్ ల హిందూ దైవభక్తి
క్రీ.శ.1761-1782మధ్య మైసూరు రాజ్యాన్ని పాలించిన హైదరాలీ హిందూ దేవాలయాలలకు అనేక మొక్కుబడులు చెల్లించాడు .
హైదర్ లింగం
మైసూరులో నంజన గూడా అనే చోట నంజు౦డేశ్వర ఆలయం లో హైదరాలీ ఒక శివ లింగాన్ని ప్రతిష్ట చేయవలసినదిగా అక్కడి స్థానాపతులనుకోరి డబ్బు పంపించి,వారిచే లింగ ప్రతిష్ట చేయించాడు .ఆలింగాన్ని ‘’హైదర్ లింగం ‘’అని ఇప్పటికీ పిలుస్తారు .నిత్యదూప దీప నైవేద్యాలకు సరిపడా ధనం ఇచ్చి ఆలయాన్ని కట్టించాడు .
హైదరాలీ కట్టించిన ఆలయ గోపురం
మైసూరురాజ్యంలో శ్రీరంగ పట్నం లో ఉన్న శ్రీ రంగనాధస్వామి ఆలయ౦ చాలా పురాతనమైనది దాని గోపురం చాలా పెద్దది .హైదరాలీ కాని కొడుకు తిప్పు సుల్తాన్ కానీ ఎన్నడూ తమపాలనలో ఈ ఆలయం కు ఎలాంటి హాని కలగ జేయలేదు . ఆలయానికి కొద్దిదూరంలో సర్కార్ వారి ఫిరంగులకు కావాల్సిన మందుగుండు తయారు చేసీ కార్ఖానా ఉంది .ఒకసారి ఆకార్ఖానాకు నిప్పు అంటుకొని బ్రహ్మాండమైన ప్రేలుడుతో కార్ఖానా ధ్వంసం అయింది .ఆ అదటుకు దగ్గరలో ఉన్న రంగనాధస్వామి దేవాలయం గోపురం విరిగి కింద పడింది .వెంటనే హైదరాలీ సైనికులను పంపించి గోపురాన్ని మళ్లీ కట్టించాడు .
హైదరాలీ సమర్పించిన రత్నహారం
హైదరాలీ కి అత్యంత ఇష్టమైన ఒక ఏనుగుగున్న కంటికి జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా ఎందరు వైద్యులు వైద్యం చేసినా జబ్బు తగ్గలేదు .కన్ను పోతుందనే భయం కలిగింది హైదరాలీకి .ఎవరో ఆయనకు నంజున్దేశ్వర స్వామికి మొక్కుకుంటే గున్నయేనుగు కన్ను బాగు పడుతుందని సూచించారు .సరే అని మొక్కుకోమన్నాడు .కొద్దిరోజుల్లోనే గున్న కన్ను బాగుపడింది .నవరత్నాలు పొదిగిన హారాన్ని స్వామికి కానుకగా హైదరాలీ సమర్పించాడు .
చాము౦డేశ్వరికి ఆభరణాలు
మైసూరులో ఒకకొండమీద శ్రీ చాముండేశ్వరి ఆలయం ఉంది .ఇక్కడే మహిషాసుర మర్దనం జరిగిందని నమ్మిక .మహిషాసురుని బొమ్మకూడా కొండపైన కనిపిస్తుంది .మైసూరుపాలకులు హైదరాలీ ,కొడుకు టిప్పు సుల్తాన్ ఈ అమ్మవారికి చాలా విలువైన వస్త్రాలు ఆభరణాలు భక్తిగా సమర్పించారు .ఇప్పటికీ దసరాల్లో పండుగలలో ఆ ఆభరణాలను అమ్మవారికి అలంకరించటం ఆచారంగా వస్తోంది .
టిప్పు సుల్తాన్ –శృంగేరి మఠం
హైదరాలీ తర్వాత కొడుకు టిప్పు సుల్తాన్ 1782 -1799వరకు మైసూరు రాజ్యాన్ని పాలించాడు .తండ్రి ,కొడుకులు ఇద్దరు శృంగేరి పీఠాథిపతిని గౌరవించేవారు .ఒకసారి మరాటీ మూకలు శృంగేరిమీద దాడి చేసి ఊరినీ ఆలయాన్నీ పూర్తిగా దోచుకున్నారు .పీతాదిపటికి ఆశ్రమ వాసులకు అన్నవస్త్రాలే కరువయ్యాయి .ఈ విషయం టిప్పూ సుల్తాన్ కు తెలియగానే ఆహారపదార్ధాలు ధనం ,వస్త్రాలు వెంటనే పంపించాడు .మళ్లీ దాడి జరగకుండా కొంత సైన్యాన్ని అక్కడే కాపలా ఉంచాడు .శృంగేరి స్వామికి టిప్పు సుల్తాన్ కు మధ్యజరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పటికే భద్రంగానే ఉన్నాయి .ఈ తురకరాజులు హిందూ మతాచార్యులపట్ల ఎంత మర్యాద తో ప్రవర్తిన్చించిందీ మనకు అర్ధమౌతుంది .ఇదీ ఆదర్శం .
జపాలు చేయించిన టిప్పు
ఒకసారి తనపై శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ,అప్పటిదాకా హిందువులపై ,బ్రాహ్మణులపై నమ్మకం లేని టిప్పు వందమంది బ్రాహ్మణుల చేత జపాలు చేయించాడు .జపదీక్ష వహించి భోజనాలు తినకుండా ఫలహారం మాత్రమె చేస్తూ ,కావేరీ నది నీటిలో ,పెద్ద చెరువుల్లో మొలలోతు నీళ్ళల్లో నిలబడి దీక్షగా నిలబడి మంత్రాలు చదువుతూ చేతులలోని ఉదాకాన్ని స్పృశిస్తూ ,సుల్తానుకు కార్య సిద్ధికలగాలని తదేక నిష్టతో జపం చేసేవారు ఇలాంటి జపాలు చాలా సార్లు టిప్పు సుల్తాన్ చేయించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు .
ఆధారం –మాన్యశ్రీ దిగవల్లి వేంకట శివరావు గారి ‘’కధలు –గాధలు ‘’-2వ భాగం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-24-ఉయ్యూరు