గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం
మా తలిదద్రులు కీ .శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,కీ .శే..శ్రీమతి భవానమ్మ దంపతులకు
నాన్న అమ్మ
మా తండ్రిగారు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారుక్రీ శ 1900, వికారి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా ఉయ్యూరు లో శ్రీ గబ్బిట దుర్గా పతిశాస్త్రి ,శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు .మాది వైదిక తెలగాణ్య శాఖ . గౌతమస గోత్రం ఆంగీరస ,అయాస్య ,గౌతమ త్రయార్షేయం.మా తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని రామారావు గూడెం అగ్రహారం .బాగా స్థితి పరులైనఅగ్రహారీకులు .అక్కడ మాకు ఒక భక్తాంజనేయ స్వామి వారి చిన్న దేవాలయం ఉంది .మా నాన్నగారు జన్మించిన కొద్దికాలానికే తండ్రిగారుచనిపోయారు. ఆస్థికూడా తగ్గి పోయింది .మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి శ్రీ గుండు లక్ష్మీ నరసి౦హావధానులు గారు ఉయ్యూరు నివాసి.అందుకని మా నాయనమ్మగారు భర్త మరణం తో తండ్రి వద్దకు కుమారునితో సహా ఉయ్యూరు చేరారు .దౌహిత్రుడైన మా నాన్న గారికి,మాతామహులు ఉయ్యూరులోని ఆయన పొలం ,ఇల్లు ,స్థలం రాసి ఇచ్చి అల్లారు ముద్దుగా పెంచారు .మా మామ్మ అక్క చెల్లెళ్ళలో అప్పటికిఎవరికీ సంతానం లేనందున అందరూ మా నాన్నగారిని అతి గారాబం గా చూసుకోనేవారు .చిన్నప్పటి నుంచే సంగీత ,నాటక,సాహిత్యాలపైపరిచయం బాగా ఉండేది .ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఉయ్యూరు ఆస్థినంతా దౌహిత్రుడుగా మా నాన్న గారికి ,మా నాయనమ్మగారితండ్రి శ్రీ లక్ష్మీ నరసింహా వదానులు గారి ద్వారా సంక్రమించినదే .ఇది కాక రామారావు గూడెం లో పిత్రార్జితమూ మా నాన్న గారికి దక్కింది .మా అమ్మ గారు శ్రీమతి భవానమ్మగారు గుండు వారి ఆడబడుచు .ఉయ్యూరులో మా ఇంటి ప్రక్కనే ఉత్తరాన వారి ఇల్లు ఉంది .తలిదండ్రులు శ్రీగుండు సింగిరి శాస్త్రి ,శ్రీమతి దుర్గ .మాఅమ్మగారు తన 12 వ ఏటనే మా నాన్నగారిని వలచి వరించటంవలన ,పెద్దలు అనుమతి౦ఛి ఇద్దరికీవివాహం జరిపించారు .
చదువు ఉద్యోగం
మా తండ్రిగారు విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై ,బ్రహ్మశ్రీ చెరుకుపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి మొదలైన గురువులవద్ద వేద,వేదా౦తాలను,కావ్యాలను అభ్యసించి సంస్కృత ,ఆంధ్రాలలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు .కవిత్వమూ బాగానే అబ్బింది .ఉయ్యూరు లోని సి. బి.ఎం.స్కూల్ లో తెలుగు పండితులుగా కొంత కాలం పని చేశారు .ఆ తర్వాత అనంత పురం జిల్లా లోని హిందూ పూర్ లో ఉన్న ఇ.సి.ఎం.హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా చేరి ,22 సంవత్సరాలు అక్కడే పని చేశారు .మా బాల్యం లో కొంత భాగం అక్కడే గడిచింది.మాంచి రేషన్ కాలం లోను పేద విద్యార్ధులకు మా ఇంట్లో వారాలు ఇచ్చి చదువుకొనే విద్యార్ధులను ప్రోత్సహించారు .ఇంటి వద్ద ఉచితంగాతెలుగు బోధించేవారు .రాయల సీమ ప్రాంత కవి పండితులైన శ్రీ కల్లూరి సుబ్బారావు మొదలైన వారితో ప్రత్యక్ష పరిచయం ఉండేది .ఆంద్రప్రాంతం నుండి ఉపన్యాసాలకై హిందూ పురం వచ్చే కవిపండితులకు, గాయకులకు, హరి కధకులకు మా ఇంట్లోనే వసతి ,భోజన సౌకర్యంకల్పించేవారు . ఇలా ఆతిధ్యం పొందిన వారిలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ,శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ,శ్రీ జటావల్లబులపురుషోత్తం ఉన్నారని మా అమ్మ చెప్పింది .నాన్నగారి నాటకం, సంగీతకచేరీలు మహా ఇష్టం .ఎంతదూరమైనా వెళ్లి చూసి వచ్చేవారట .బ్యాడ్మింటన్ బాగా అడేవారట .ప్రసిద్ధ హరికధకులు శ్రీ పిల్లలమఱ్ఱి రామ దాసు గారి హరికధలు నెలల తరబడి హిందూ పూర్ లో జరిగేవి .దీనికినాన్నగారి ప్రోత్సాహమే కారణం అని చెప్పేవారు .హిందూ పుర వైశ్య ప్రముఖులు గొప్ప వదాన్యులు,వితరణ శీలురు కూడా. వీరందరికీనాన్నగారంటే మహా గౌరవం ..కవి పండితులను ఆహ్వానించి ఘన సన్మానం చేసేవారు .వీటన్నిటికి వెనుక నాన్నగారి చేయూత ఉండేది .
ఉయ్యూరుకు బదిలీ
కృష్ణా జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా శ్రీ కాకాని వెంకట రత్నం గారున్నప్పుడు ,మా నాన్న గారిని హిందూ పురం మునిసిపల్ హైస్కూల్ సర్వీస్ తోకృష్ణా జిల్లా జగ్గయ్య పేట హై స్కూల్ కు జిల్లామార్పు ప్రాతి పదిక మీద తీసుకొని వచ్చారు .ఆ తర్వాత ఉయ్యూరు ఉన్నత పాఠ శాలకు బదిలీఅయి ,1954 లో పదవీ విరమణ చేశారు .పిమ్మట తాత్కాలిక ప్రాతిపదికపై ఉంగుటూరు హైస్కూల్ లో రెండేళ్ళు పని చేశారు . రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీ పుచ్చా శివయ్యగారు ,శ్రీ అన్నే హనుమంత రావు గారు అనే లెక్కల మేష్టారు కలిసి స్థాపించిన శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజిలో 5 సంవత్సరాలు తెలుగు పండితులుగా పని చేశారు .ఎక్కడ పని చేసినా నాన్న గారు అద్భుతంగా పాఠాలు బోధిస్తారనే పేరుండేది .కృష్ణాజిల్లాలో ఆంద్ర , సంస్కృతాలలో అంతటి పండితుడు ఆనాడు
…

