గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్ ‘’

‘’సుమన్ జీ’’ అని అందరూ గౌరవం గా పిలిచే సురేంద్ర ఝా సుమన్ సుప్రసిద్ధ మైధిలీ కవి ,రచయిత ,పబ్లిషర్ ఎడిటర్ ,శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు .మైధిలి సంస్కృతిని పరిరక్షించి వ్యాప్తి చేసిన వాడు .40దాకా మైధిలి భాషలో పుస్తకాలు రచించాడు .సంస్కృతం హిందీ ,మైధిలి పుస్తకాల కు సంపాదకత్వం వహించాడు .అనేక ప్రభుత్వపాలనా సంస్థల లో సభ్యుడై సేవలందించాడు .

సురేంద్ర ఝా 10-10-19 10 నబీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా బల్లిపూర్ గ్రామం లో జన్మించాడు .తండ్రి భువనేశ్వర్ ఝా ప్రసిద్ధ ఆయుర్వేద భిషక్ .కుటుంబం తరతరాలుగా సంస్కృత పండితులకు నిలయం .ముజఫర్ నగర్ లోని ధర్మరాజ సంస్కృత కళాశాల లో చేరి చదివి సాహిత్యాచార్య (డిగ్రీ ) బెంగాలీ భాషలో’’ కావ్య తీర్ధ ‘’ పాసైనాడు .25 వ ఏట బెగూ సరాయ్ కి  చెందిన గంగాదేవిని వివాహమాడి ఒకకుమారుడికి ఇద్దరు  కుమార్తెలకు తండ్రి అయ్యాడు .దర్భంగా ఎల్.యెన్ .ఎం.యు .యూని వర్సిటీ లో మైధిలీ భాష చార్యుడుగా రిటైర్ అయ్యాడు .6 వ లోక్ సభకు దర్భంగా నుంచి జనతా పార్టీ టికెట్ పై ఎన్నికయ్యాడు .

సుమన్ జీ గద్య పద్యాలలో సవ్య సాచి .బహుభాషా కోవిదుడు .అందువలననే ఆ నాటి రాష్ట్ర పతి డా. రాజేంద్ర ప్రసాద్ గారి చేత పురస్కారం అందుకొన్నాడు .1981 లో సాహిత్య అకాడెమీ అవార్డ్ ,పాట్నాలోని మైధిలీ అకాడెమి నుంచి ‘’విద్యాపతి ‘’పురస్కారం పొందాడు .

సాహిత్య అకాడెమీలో మైధిలీ భాష ప్రతినిధిగా ,మైధిలి సలహా సంఘ సభ్యుడిగా ఉన్నాడు .అఖిలభారత మైధిలీ సాహిత్య పరిషత్ కు అధ్యక్షుడై ఆ భాషకు విలువైన సేవలు అందించాడు .దర్భంగా లోని వైదేహి సమితి తో సన్నిహిత సంబంధాలున్నాయి .ఆధునిక మైధిలి భాషలో సర్వోత్కృష్ట స్థానం సుమన్ జీ కి ఉన్నది .వర్ణనలు అలంకారాలతో ఆధునిక మైధిలీ  సాహిత్యాన్ని  సు సంపన్నం చేసిన ఏకైక రచయితగా గుర్తింపు పొందాడు .

సుమన్ ప్రకృతి అందాలు ,అద్భుతమైన భావనా పటిమ  సరళత ,గ్రామీణ సౌందర్యవర్ణన లతో  రచించిన 25 కవితల సంపుటి ‘’పయస్విని ‘’1971 లో సాహిత్య అకాడెమి అవార్డ్ ను పొందింది .అందులో రూపకాలంకారం పై గొప్ప ప్రయోగాలు చేసి అద్భుతః అనిపించాడు .కవిత్వాన్ని పాడి ఆవుతో పోలుస్తూ అధర్వ వేదం లోని పృధ్వీ సూక్తం ,బృహదారణ్యక ఉపనిషత్ లోని ‘’వాగ్ధేనువు’’ను  ‘’పర బ్రహ్మం ‘’తో పోల్చినట్లు రచించాడు .ఇందులో వర్ష ఋతువు తామసి లాగా మంచిదని ,మృత్యుంజయ ,పాడి ఆవు ,నది లను రసవంతి అంటే అందమైన కృశించిన స్త్రీతో ను ,పర్వతాన్ని ముసలివాడు,యువకుడు ,చిన్నపిల్లవాడితోను పోల్చాడు  ,

1962 లో రాసిన ‘’దత్తావతి ‘’చైనా ఇండియా యుద్ధాన్నివర్ణిస్తే ,’’భారత్ వందన్’’అంతర్నాద్’’ ల లో దేశభక్తి కనిపిస్తుంది .మహా భారతం లోని ‘’ఉత్తర ‘’పై ఖండ కావ్యం రాశాడు .ఆయన కవిత్వం లో సంస్కృత పదాడంబరం ,ఉపమ,ఉత్ప్రేక్ష అలంకార వైభవం ప్రాచీన సంస్కృత కావ్యాల ఛందస్సు  ఉన్నట్లు దండిగా ఉండటం ప్రత్యేకత .వృక్షం పై మహాద్భుత భావ గీతం రాశాడు .ఇది ప్రపంచ సాహిత్యం లో ఉన్న గొప్ప కవితలతో సరి తూగు తుంది అని విశ్లేషకుల అభిప్రాయం . ఇస్మాయిల్ కవి ‘’చెట్టు నా ఆదర్శం ‘’కవిత ఇక్కడ మనకు గుర్తుకు రావటం సహజమే .

బెంగాలీ ,సంస్కృత భాషా రచనలను సుమన్ జీ అనువదించాడు .మైధిలి కవిత్వం పై సంస్కృత ప్రభావం అనే పుస్తకం రాశాడు .వైదేహి పత్రికకు సంపాదకుడై అస్సామీ మైధిలీ బెంగాలే మణిపూరీ ,నేపాల్ ఒరియా రచనలను ఆంగ్లీకరి౦చాడు .92ఏళ్ళ వయసులో 5-౩-2002 న దర్భంగా లో సుమంజీ మరణించాడు .ఆయన గౌరవార్ధం ఆచార్య సుమన్  చౌక్ ను దర్భంగా లో ఏర్పాటు చేశారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-16 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.