మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

గాంధీజీ వ్యక్తిగత డాక్టర్ ,కేంద్ర ఆరోగ్య మంత్రి,తొలి మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

సుశీల నాయర్ గా పిలువబడే శ్రీమతి సుశీలా నయ్యర్ గాంధీ మహాత్ముని ఆంతరంగిక కార్యదర్శి ప్యారేలాల్ కు చిన్న చెల్లెలు.గాంధీ జీకి వ్యక్తిగత డాక్టర్ .

ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లోని కుంజా లో 1914 లో జన్మించింది .యవ్వనం లో ఢిల్లీ కి వచ్చి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజి లో మెడిసిన్ లో చేరింది.1939 లో అన్న ప్యారేలాల్ కు సాయ పడటానికి సేవాగ్రా౦ వచ్చి, గాంధీ జీ వ్యక్తిత్వానికి ,దేశ సేవకు ఆకర్షితురాలై ,సన్నిహితురాలైంది .ఆమె వచ్చిన కొద్ది కాలానికే వార్ధా లో కలరా తీవ్రంగా వ్యాపించి జనాలను కబళించింది .అప్పుడు యువ డాక్టర్ సుశీలా నయ్యర్ తానొక్కతే రాత్రిం బవళ్ళు అంకిత భావం తో కస్టపడి కలరా వ్యాప్తిని అరికట్టగలిగింది.గాంధీ జీ ఆమె సేవానిరతిని మెచ్చి అభినందించాడు .డాక్టర్ బి .సి. రాయ్ ఆశీస్సులతో మహాత్ముడు ఆమెను తన వ్యక్తిగత డాక్టర్ గా నియమించాడు .1942 లో ఎం .డి. పూర్తీ చేసి ,మళ్ళీ మహాత్ముని సేవలో పాల్గొని ,ఆనాడు దేశమంతా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న క్విట్ ఇండియా ఉద్యమం లో గాంధీతో పాటు పాల్గొన్న దేశాభక్తురాలు నాయర్ . అందరు ప్రముఖ దేశభక్తులతోపాటు అరెస్ట్ అయి ,పూనాలోని ఆగా ఖాన్ పాలస్ లో బందీ గా ఉంది.

1944 లో సేవాగ్రాం లోనే నాయర్ ఒక చిన్న డిస్పెన్సరి ప్రారంభించింది . ఆమె పై ఉన్న నమ్మకం తో ప్రజలు విపరీతంగా వచ్చి వ్యాధి నివారణ పొండుతున్నందున ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలుగుతోందని గ్రహించింది .వార్ధా లో బిర్లా ఏర్పాటుచేసిన ఒక గెస్ట్ హౌస్ లోకి ఆస్పత్రిని మార్చింది . 1945 లో ఈ చిన్న హాస్పిటల్ బాగా వృద్ధి చెంది కస్తూర్బా హాస్పిటల్ అయింది .ఇప్పుడు మరింతగా అభి వృద్ధి చెంది మహాత్మా గాంధి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా పిలువబడుతోంది .ఆ కాలం లో అనేక కుట్రలు ,కుతంత్రాలు జరిగి మహాత్ముని ప్రాణాలకే ఎసరు పెట్టె సంఘటనలు జరిగాయి . అందులో గాంధీ ని హత్య చేసిన నాధూరాం గాడ్సే జరిపిన దాడులూ ఉన్నాయి .వీటన్నిటికి ప్రత్యక్ష సాక్షి సుశీలా నయ్యర్ .1944 లో పంచగని లో నాధూ రాం గాడ్సేగాంధీజీ పై బాకు తో దాడికి ప్రయత్నం చేశాడన్న ఆరోపణపై విచారిస్తున్న కాన్పూర్ కమీషనర్ ముందు1948లో సుశీలా నాయర్ హాజరై సాక్ష మిచ్చింది .

1948 లో ఢిల్లీ లో గాంధీ మహాత్ముని హత్య జరిగిన ఆతర్వాత సుశీలా నయ్యర్ అమెరిక వెళ్లి జాన్ ఆప్కిన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో రెండేళ్ళు చదివి పబ్లిక్ హెల్త్ లో రెండు డిగ్రీలు పొందింది .1950 లో ఇండియా కు తిరిగి వచ్చి తోటి గాంధీ అనుయాయి శ్రీమతి కమలాదేవి చట్టోపాద్యాయ్ తో కలిసి సహకార విధానం లో ఢిల్లీ కి వెలుపల మోడల్ టౌన్ షిప్ గా ఉన్న ఫరీదాబాద్ లో టి .బి.శాని టోరియం ప్రారంభించింది .గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ నూ నడిపింది .

1952 లో రాజకీయాలలో ప్రవేశించి ఢిల్లీ శాసనసభకు సభ్యురాలుగా ఎన్నికైంది.1952 నుంచి 55 వరకు నెహ్రు మంత్రి వర్గం లో ఆరోగ్య శాఖ మంత్రి గా పని చేసింది .1955 -56 లో ఢిల్లీ విధానసభ స్పీకర్ గా నాయర్ ఉన్నది . తొలి మహిళాస్పీకర్ సుశీలా నాయర్ .1957 లో లోక్ సభకు ఎన్నికై 1971 వరకు సేవలందించింది . కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా నాయర్ నియమింపబడి 1962 నుండి 1967 వరకు అయిదేళ్ళు ప్రజాసేవలో ధన్యురాలైంది .కాంగ్రెస్ పాలనలో విధానాలు నచ్చక ,పార్టీని వదలి జనతా పార్టీలో చేరి ప్రతి పక్ష నాయకు రాలైంది .ఇందిరా గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయం సాధించిన జనతాపార్టీ ఆధ్వర్యం లో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం లో కొద్దికాలం బాధ్యతలు చేబట్టి౦ది నాయర్ .తర్వాత రాజకీయాలనుంచి విరమించి గాంధీ సిద్ధాంత వ్యాప్తికిఅంకిత భావం తో కృషి చేసింది .1969 లో మహాత్మా గాంధీ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించి ,దాని అభివృద్ధికి జీవితాంతం కృషి చేసింది .3-1-2001 న 87 వ ఏట గుండె పోటు తో సుశీలా నయ్యర్ మరణించింది .

గాంధీ సిద్ధాంతాలపై అచంచల విశ్వాసం ఉన్న సుశీలా నయ్యర్ ఆ భావ వ్యాప్తికి అవిరళ కృషి చేసింది .ముఖ్యంగా మద్య నిషేధం ఖచ్చితంగా అమలు జరగాలని కోరేది .దేశాభి వృద్ధికి జనాభా నియంత్రణ అవసరమని కనుక కుటుంబ నియంత్రణ చేబట్టటం ప్రభుత్వ ,ప్రజల బాధ్యత అని హితవు చెప్పేది .స్త్రీలకూ సమానహక్కులు ఉండాలని ,పేద స్త్రీల హక్కుల రక్షణ బాధ్యత కు ప్రభుత్వం చేబట్టాలని కోరేది .వ్యక్తిగతం గా అత్యంత క్రమ శిక్షణతో ప్రవర్తిస్తూ , యువత లో స్పూర్తి నింపుతూ ,వారిలో మణి పూసగా వెలిగిన నాయకు రాలు నాయర్ .ఎవరి సహాయ సహకారాలూ లేకుండా ఏక వ్యక్తిగా తన తెలివితేటలూ, సామర్ధ్యం ,ముందు చూపులతో మగవారితోపోటీ పడి,అన్ని అర్హతలు, గౌరవాలు పొందిన మహిళా మాణిక్యం ఆమె . గాంధీ లాగా ఆమె కూడా ఏ పనీ నీచమైనది కాదు అని నమ్మేది అలానే ఆచరించి ఆదర్శ ప్రాయమైనది .ముఖ్యంగా వైద్య వృత్తిలో అంకిత భావం చాలా ముఖ్యం అని భావించేది .సేవ ,అంకిత భావం ,త్యాగం ,నిరంతర కృషి ,అభి వృద్ధి సుశీలా నయ్యర్ మహనీయ గుణగణాలు.

గొప్ప రచయిత్రి అయిన సుశీలా నయ్యర్ మహాత్మా గాంధీ పై 7 ,కస్తూర్బా గాంధీపై 1, ఇద్దరిపై 1, కాక కుటుంబ నియంత్రణ పై 1 ,మద్య నిషేధం లో మహిళల పాత్రపై 1 పుస్తకాలు ఇంగ్లిష్ లో రచించింది .అందులో కొన్ని- ది స్టోరీ ఆఫ్ బాపూస్ ఇ౦ప్రి జన్ మెంట్ , కస్తూర్బా గాంధి –ఎ పర్సనల్ రెమినిసెన్సేస్ ,ఫామిలీ ప్లానింగ్ ,రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ప్రొహిబిషన్ ,మహాత్మాగాంధీ –సత్యాగ్రహ ఎట్ వర్క్ ,మహాత్మా గాంధీ ప్రేపేరింగ్ ఫర్ స్వరాజ్ ,ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడం ,మహాత్మా గాంధి –ది లాస్ట్ ఫేజ్ .

– గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.