మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు చేసింది .ఇక్కడ రాష్ట్ర అంటే జాతీయ అని అర్ధం .దీనిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లో భాగం అని భావిస్తారు .కాని ఈ సంస్థ స్వచ్చంద సర్వ స్వతంత్ర మహిళా సంస్థగా వాళ్ళు పేర్కొంటారు . ఏ పేరుతొ పిలిచినా అది మహిళాభి వృద్ధి సాధనకు ఏర్పడిన సంస్థ అన్నది నిర్వివాదం .లక్ష్మీ బాయ్ కేల్కరే దీని స్థాపకురాలు .

ఈ సంస్థను ఏర్పరచటానికి ముందు కేల్కర్ ఆర్. ఎస్. ఎస్. స్థాపక అధ్యక్ష నాయకుడు డా. హెడ్గెవార్ ను 1933 లో కలిసి సంప్రదించింది .ఆయనతో మూడు సార్లు భేటీ అయి సుదీర్ఘం గా చర్చలు జరిపింది. తనమనసులోని భావాలను నిస్సంకోచంగా ఆయన కు తెలియజేసింది .ఆర్ ఎస్ ఎస్ లో మహిళలకు కూడా చోటు కలిపించాలని తన రాష్ట్ర సేవికా సంస్థ ఆర్ ఎస్ ఎస్ లో మహిళా పక్షం గా ఉంటుందని వివరించింది .హెడ్గెవార్ మాత్రం తమ సంస్థ పురుషులకు మాత్రమె ప్రవేశం కల్పిస్తుందని స్త్రీలకు దానిలో చోటు లేదని స్పష్టంగా తెలిపాడు .కాని లక్ష్మీబాయ్ సేవా దృక్పధానికి మనో నిశ్చయానికి అబ్బురపడి రాష్ట్ర మహిళా సమితి ని సర్వ స్వతంత్ర స్వచంద సంస్థగా తీర్చి దిద్ది స్త్రీ సంక్షేమం కోసం కృషి చేయమని ప్రోత్సహించాడు .ఈ సంస్థకు తానూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడుతానని హామీ ఇచ్చాడు .లక్ష్మీ బాయ్ ఆయన హామీలకు సంతృప్తి చెంది ‘’రాష్ట్ర మహిళా సమితి’’’ని వార్థా లో 25-10-1936 ‘’స్థాపించి సర్వ స్వతంత్ర స్వచ్చంద సంస్థగా తీర్చి దిద్దింది .

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరి రక్షించే అత్యంత ప్రభావితమైన సంస్థగా ‘’రాష్ట్ర మహిళా సమితి ‘’వృద్ధి చెంది అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచింది.సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల నెన్నిటినో అమలు జరిపి మహిళలకు చేదోడువాదోడు గా సంస్థ నిలిచింది .ప్రజలలో దేశభక్తి ,సాంఘిక జాగృతి కలిగించటం లో కేల్కర్ ఈ సంస్థ ద్వారా చేసిన కృషి ప్రశంసనీయం . భారత దేశం లో అనేక ప్రాంతాలలో అనేక స్థాయిలలో అనేక సార్లు శిక్షణా తరగతులు నిర్వహించి అవగాహన కలగ జేయటానికి నిర్విరామ కృషి చేసింది .

ప్రతిపట్టణం లో మహిళా శాఖలను ఏర్పరచి ఉదయం యోగ, దేశ భక్తి గీతా లాపన చేయించింది .తరచుగా చర్చా వేదికలను నిర్వహించి వారిలోని సందేహాలను నివృత్తి చేసి అవగాహన ను మరింత పెంచింది .ప్రస్తుతం ఈ సమితికి దేశం మొత్తం మీద 5,215 సెంటర్లు ఉన్నాయి .అందులో 875 సెంటర్ లలో నిత్య శాఖ జరుగుతుంది .మొత్తం మీద ఒక లక్ష నుంచి పది లక్షల దాకా ఇందులో సభ్యులున్నారు .ఇండియాకు వెలుపల సుమారు 10 దేశాలలో ‘’హిందూ సేవికా సమితి ‘’పేరుతో ఈ సంస్థ మహిళాభ్యుదయానికి కృషి చేస్తోంది .

ఇండియాలో కుల ,ప్రాంత ,భాష లకు అతీతంగా అందరు పేదలను ,ఉపేక్షకు గురైనవారినీ ,స్త్రీబాల వృద్ధులకు అండగా నిలబడి సేవ చేస్తున్న సంస్థ ఇది .సేవలను విద్యాలయాలకు గ్రంధాలయాలకు ,అనాధ శరణాలయాలకూ,శిక్షణా శిబిరాలకు కూడా విస్తరింప జేసి ప్రజలందరి విశ్వాసం సంపూర్తిగా పొందుతోంది ఈ సంస్థ .సమాజం లో మహిళలు తాము అభి వృద్ధి చెంది ,నాయకత్వం వహించి, సమాజాభి వృద్ధికి తోడ్పడేట్లు చేస్తున్న సంస్థ ఇది .ఇందులోని మహిళలు శిక్షణ పొందినవారు ,శిక్షకులు అందరూ ‘’మాతృత్వ ,కర్తృత్వ నేతృత్వం ‘’అనే మూడు మాటలను మంత్రాలుగా మననం చేసి ,అనుసరించి సార్ధకం చేస్తారు .ధనాత్మక దృక్పధ౦, ,ఆలోచనలతో ఉంటె మహిళలు సాధించరానిది ఏదీ ఉండదు అని ఈ సంస్థ నమ్మకం కలిగించింది .భారత దేశం ఇండియా ,పాకిస్తాన్ లుగా విడిపోయి స్వాతంత్ర్యం పొందిన తర్వాత కేల్కర్ పాకిస్తాన్ రాజధాని కరాచీ సందర్శించి అక్కడ శాఖనేర్పరచి ,అక్కడి భారతీయ మహిళలకు ధైర్యం విశ్వాసం, నమ్మకం కలిగించి , వారిపై దౌర్జన్యాన్నిపూనుకొనే వారి ప్రయత్నాలను అడ్డగించి అరికట్టే ప్రయత్నం చేసి వ౦దనీయురాలైంది .

రాష్ట్ర సేవికా సమితి సంస్థాపకురాలు లక్ష్మీ బాయ్ కేల్కర్ 1936 నుండి,1978 లో చనిపోయేవరకు ఈ సంస్థ కు అధ్యక్షురాలుగా ఉంటూ బహు ముఖ సేవలు అందించి చిరస్మరణీయురాలైంది .ఆమెను ‘’మావాషి కేల్కర్’’అని కూడా అంటారు .ఈమె తర్వాత సరస్వతీ ఆప్టే ,ఉషాతాల్ చాతి,ప్రమీలా తాయ్ మీధే వరుసగా అధ్యక్షులయ్యారు.ప్రస్తుతం వి. శాంతకుమారి 2012 నుండి ఈ నాటి వరకు అధ్యక్ష బాధ్యత వహించి లక్ష్మీబాయ్ కేల్కర్ ఆశయాలకు కార్యరూప సేవలందిస్తోంది .

                                                                                                                              – గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.