’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5

మొవ్వవారి కావ్యం లోని వర్ణాలను విశ్లేషిస్తూ ఆచార్య తుమ్మపూడి కొన్ని విషయాలు  స్పృశించారు .’’కావ్యం  వర్ణనాత్మకం కావటం వలననే ప్రాధాన్యం పొందింది .ఇందులో కవి భావనాశాక్తీ ,అలంకారాలు ఔచిత్యం ఉంటాయి దీనికి ‘’తొడుగు ‘’గా పద్యం ఉంటుంది .శబ్దౌచితి –ప్రౌఢ సమాస కల్పనా మొదలైనవి అంగాలు .వీటిని విడివిడిగా చూస్తూ ,అన్నిటినీ సమన్వయము చేయటమే విమర్శ శాస్త్రం ,కళా ఔతుంది .విశ్లేషణ శాస్త్ర సమన్వయమే కళ.ఆనెగొంది ,విజయ నగర౦ మొదలైన నాలుగు నగర వర్ణనలున్నాయి రాయకావ్యం లో .అనేక రాజవంశాల చరిత్ర త్రవ్వి పోశారుకనుక నగర వైవిధ్యం తోబాటు ,వర్ణనా వైదగ్ది కూడా అవసరమౌతుంది .ప్రాచీనకావ్యాల్లో ఉన్న వర్ణనలకు ఏమాత్రం తీసిపోకుండా ఈకవి వర్ణనలు  ఉత్క్రుస్టంగా  చేశారు .

హంపీ,విజయనగరాలను పాశ్చాత్య చరిత్రకారులు గొప్పగా వర్ణించారు .వీటిని కవి స్వయంగా చూశాడుకనుక ఆ వర్ణలను మహా భేషుగ్గా చేయగలిగారు .లాంగ్ హారేస్ట్ లేక పేయస్ అనే చరిత్రకారుడు ‘’అచ్యుతరాయలు రామాలయం ప్రక్కనే తుంగభద్రానది ఒడ్డున ఉన్నకొండ ( రాయలవారి అంతఃపురం  వెనకాల ) నెక్కి నగరాన్ని చూస్తే ,అంతటి అందమైన పట్టణం ప్రపంచం లో లేదు .’’ రోమ్ నగరం కంటే చాలా అద్భుతనగరం ‘’అన్నాడు .కనుక ఈకవి వర్ణించిన పద్యం అతిశయోక్తి కాదు .చారిత్రక  సత్యమే .

‘అంతటి సుందరభూమి విశ్వా౦నతరాళ -మందు లేదన గడు నొప్పు ,నట్టి చోట

రమ్యమగు రాజధాని నిర్మాణమునకు –బూనుకొని రా సహోదరుల్ పోతుగడ్డ’’

తెనాలి రామకృష్ణుడు తళ్ళికోట యుద్ధం లో విజయనగరం ధ్వంసమైనతర్వాత రాయలపాలన

లోని నగర వైభవం  చూశాడు . పాండురంగ మహాత్మ్యం లో అగస్త్యుడు తన అనుభవాన్నిఈ ప్రాంతానికి వచ్చినప్పు చూసి వర్ణించాడు. అంటే కాలవ్యత్యాసాన్ని కూడా పరిగణించ కుండా  ఆ నగర సౌందర్యం ఎంతటిదో తెలుస్తోంది .ఆ పద్యాలు  చదివి అనుభవించిన వారికి ఆ గత స్మృతులు చరిత్రలో కనిపించిన వ్రాతలతో సమన్వయము చేసుకొని పులకా౦కి తులమవుతున్నా మంటారు తుమ్మపూడి .మనమనసులలో స్థిరముద్ర వేసిన ఆ అంశాలు రాసే కవి అనుభవాలు ఎంతలోతులో ఉంటాయో ఊహించమన్నారు .ప్రౌఢదేవరాయల పాలన వర్ణిస్తూ కవి రాసిన పద్యం పెద్దనగారి మనుచరిత్రలో రాయల వంశావతారం వర్ణనలో ఉన్న పాలనా మాధుర్యాన్ని గుర్తుకు తెస్తోందన్నారు –

‘’బలవత్ప్రౌఢధరాదినాధుడు ధరంబాలింప ముక్కారులన్ – బొలముల్ బండెను ,ధాత్రిపై నెల నెలన్ ముమ్మారు వర్షించె,ను

జ్జ్వల సౌఖ్యంబుల జొక్కె భూమి ,ప్రజ విశ్వాసంబుతో ,మంత్రి వ –ర్యులు సామ్రాజ్య మహాభి వృద్ధి కొరకుద్యోగింప నుత్కంఠ తోన్.’’

‘’ఆరవీడు వంశం ‘’లో’’ ఫాదర్  హీరాన్ ‘’’’ఆనాటి ప్రజలు రాత్రిళ్ళు గుండెపై చేయి వేసుకొని ఆరుబయట నిర్భీతితో నిద్రించేవారు ‘’అని రాసిన చారిత్రిక సత్యాన్ని వృషాద్రి పతికవి స్త్రీపరంగా అన్వయించి రాసాత్మక౦గా చెప్పారు –

‘’అపరాత్రంబని ,అర్ధరాత్రమని శంకాల్పంబు లేకుండభీ –తి పరాదీనలు గాక ,పంకజముఖుల్ ,దీరాయత స్వా౦తులై

అపురూపంబుగ సంచరించెద రనన్య స్వేచ్చానిచ్ఛా విహా-రపరత్వంబున నొంటిగా గృతయుగ ప్రారంభ సంస్తుత్యమై ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-7-18 –ఉయ్యూరు

‘’

 

 

 


 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.