ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం
25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి ఎస్ సి పాసై ,1943లో డి ఎస్ సి పట్టా పొందారు ఇండియన్ మెటియోరోలాజికల్ సర్వీస్ లో అసిస్టెంట్ గా 1940లో చేరారు .తర్వాత డైరెక్టర్ జనరల్ అయ్యారు .ఇరాన్ ప్రభుత్వం లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుడుగా ,వాతావరణ సలహా దారుగా 1975నుంచి మూడేళ్ళు ఉన్నారు .ఇండియాకు తిరిగి వచ్చి, విశాఖ ఆంధ్రా యూని వర్సిటి లో మెటిరియోరోలాజికల్ అండ్ వోషనోగ్రఫీ కి గౌరవ ఆచార్యులై 1972నుండి 82 వరకు పదేళ్ళు పని చేశారు .
కోటేశ్వరం గారు 1974లో ఇ౦ డియన్ నేషనల్ సైన్స్ అకాడెమి లో ఫెలో అయ్యారు .ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్స్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ల ఫెలోషిప్ పొందారు .ఇండియన్ మెటియోరోలాజికల్ సంస్థకు అధ్యక్షులై విశేష సేవ లందించారు .వాతావరణ శాస్త్రం లో ఆర్ధిక శాస్త్రం లో వాతావరణ శాస్త్ర వినియోగానికి ముఖ్యమైన పరిశోధనలు చేశారు .1963లోపూనాలోని ఇండియన్ ట్రాపికల్ మెటియోరోలజికి ,1960-65 మధ్య న్యుఢిల్లీ లోని నార్దర్న్ హేమి స్ఫియర్ ఎక్స్ చేంజ్ అండ్ అనాలిసిస్ సెంటర్ స్థాపనకు అద్భుత కృషి చేశారు .ఆయన మార్గ దర్శకత్వం లోనే 1970-73 కాలం లో దేశం లోని తూర్పు కోస్తా వెంబడి తుఫాన్ హెచ్చరిక రాడార్ సిస్టం ఏర్పాటైంది .ఇదే కాదు ఉత్తర భారతం ,మధ్యభారతం లలో వరదలు సృష్టించే నదుల ఆయకట్టు ల వద్ద ఫ్లడ్ మెటిరియోరోలాజికల్ సెంటర్ లను ఏర్పాటు చేసిన ఘనతా ఆయనదే .తన శాఖవారితో ‘’శాటిలైట్ మానిటరింగ్ సెంటర్’’ లు ఏర్పాటు చేయి౦ఛి వాతావరణ సేవలలో ఆధునికత తెచ్చినదీ కోటేశ్వరం గారే .శీతోష్ణస్థితి సంబంధ ప్రయోజనాలు ,ముందస్తు సమాచార సేకరణకు ,గణాంకాల అంచనాలకు మొదటిసారిగా కంప్యూటర్ వ్యవస్థ నేర్పరచి ,దేశీయ వాతావరణ శాస్త్రం లో విప్లవాత్మక మార్పులు తెచ్చి కొత్త అధ్యాయం సృష్టించి ,విదేశాలకు దీటుగా నిలబడేట్లు చేశారు .ఋతుపవనాలు అల్పపీడనాలు తుఫానులు ,వరదలు వాతావరణ మార్పులు పై అవిశ్రాంత పరిశోధన సాగింఛి తమ ఫలితాలను అందరికీ పంచేవారు ’’పంచేటి వారు’’.
వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ ,అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థలకు ఉపాధ్యక్షులుగా 1971నుంచి 75వరకు నాలుగేళ్ళు విలువైన సేవలు అందించారు .ఆంధ్రా యూని వర్సిటి నుండి గౌరవ పురస్కారం అయిన D.S.C.(HON-Cau)పొందారు .1975లో భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ్ ‘’ పురస్కారం అందించి , గౌరవించి,సత్కరించింది . ఢిల్లీ తెలుగు అసోసియేషన్ కు అధ్యక్షులుగా1959నుండి 10ఏళ్ళు 1969 వరకు సేవలందించి ,అక్కడి తెలుగు వారికి విశేషమైన సేవలందించారు .చికాగో లో ఇండియన్ అసోసియేషన్ కు కూడా1955-56లో అధ్యక్షులై ప్రవాస తెలుగు ప్రజలకు అండదండగా ఉన్నారు.
వాతావరణ శాస్త్ర పరిశోధనలకు అమెరికాలోని చికాగో,మియామీ లకు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళారు .వీరి సేవలను గుర్తించి ప్రపంచ వాతావరణ సంస్థ గౌరవ అధ్యక్షునిగా ఎంపిక చేసింది .70కి పైగా పరిశోధన వ్యాసాలను దేశీయ విదేశీయ మేగజైన్స్ లో రాశారు .వాతావరణ శాస్త్రం పై ఇంతటి అభి రుచి ఏర్పడటానికి కారణం 1927లో ఆయన 12ఏళ్ళవయసులో వచ్చిన తీవ్రతుఫాను నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసి భీభత్సం సృష్టించి విశేష జనప్రాణ నష్టం కలిగించటమే .తనప్రజలను ఈ తుఫానులనుండి కాపాడాలి అనే సంకల్పం అప్పుడే ఆయన మనసులో బీజ రూపం లో ఏర్పడి వట వృక్షమై ,ఈ విశేష కృషికి దారితీసింది .
వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని డా .పంచేటి కోటేశ్వరం గారు 1997 నవంబర్ 1 న 82ఏళ్ళ వయసులో పంచత్వం చెందారు .ఆయన భార్య శ్రీమతి సరోజినీ .వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు .
పంచేటి వారి రచనలు – Low and high Raman frequencies for water”. , “Additional Raman frequencies for water” ,The Surface Structure of the Tropical Cyclones in the Indian Area, The Easterly Jet Stream over the tropics” ,Study of Pre-monsoon Thunderstorms over Gangetic West Bengal by Radar ,Vertical Development of Precipitation Echoes from Cumulus Clouds near Calcutta during the Pre-monsoon season”., The Upper-tropospheric and Lower-stratospheric Structure of Several Hurricanes, “On the Structure of Hurricanes in the upper Troposphere and lower Stratosphere”.
ఈ శాఖలో పని చేసిన శ్రీ యడవల్లి పరమ శివరావు నెల్లూరు జిల్లాలోనే1920లో జన్మించి కేంద్ర వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ అయిన రెండవ తెలుగు వారుగా (మొదటివారు శ్రీ పంచేటి కోటేశ్వరం )రికార్డ్ సృష్టించారు ,వాతావరణ అబ్జర్వేటివ్ డైరెక్టర్ కూడా అయ్యారు.’’సౌత్ వెస్ట్ మాన్సూన్ ‘’పరిశోధన గ్రంథం రాశారు .
మరో శాస్త్రవేత్త శ్రీటి. ఎస్ మూర్తి (తాడేపల్లి సత్యనారాయణ మూర్తి )1937ఆగస్ట్ 5న జన్మించి చికాగోలో వాతావరణ శాస్త్రం లో పిహెచ్ డి పొంది ,అక్కడే లెక్చర గా చేరి కెనడా వెళ్లి ఓషన్ సైన్సెస్ వారి ఫిషరీస్ లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ అయి ,చికాగో కెనడాలలో లో డిస్టింగ్ విష్డ్ మెడల్, అప్లైడ్ ఓషనోగ్రఫీ ప్రైజ్ పొందారు .ఐతే ఆంధ్రాలో పుట్టినా వీరి సేవలు ఇండియాలో జరగలేదు. మన దేశం కొత్తగా అడుగు లేస్తున్న వాతావరణ శాస్త్రానికి తొలితరం శాస్త్రవేత్త మూర్తిగారు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంధ్రశాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19-ఉయ్యూరు
