రాతార్జునీయం-.15      దశమ సర్గ -1            

రాతార్జునీయం-.15

దశమ సర్గ -1

తెల్లవారగానే అర్జునుని ప్రలోభ పెట్టటానికి అప్సరసలు అందరూ బయల్దేరారు .రాత్రి సంభోగం తో వచ్చిన కొత్త అందం తో ,మాంచి అలంకరణతో మన్మథ విలాసాలు వెదజల్లుతూ వెళ్ళారు .స్తన ,పిరుదుల భారం తో నెమ్మదిగా నడవాల్సి వచ్చింది .లత్తుక పాదాలలతో స్త్రీలు ముందు నడువగా ,నేలపై గడ్డి దర్భ వంటి నల్లని గడ్డి లాక్షారవం అంటుకొని వర్షాకాలం లో వ్యాపించే యెర్రని కీటకాలు నేలంతా వ్యాపించాయా అన్నట్లున్నది .మొలనూలు కాలి గజ్జల సందడి ఇద్రకీల గుహలలో ప్రతిధ్వనించింది .హంస, సారసాలు అరవగా మనోహర ధ్వని వ్యాపించింది .ఫలపుష్పాలతో ఉన్న చెట్లవద్ద క్రూర మృగాలైన సి౦హాలతోపాటు ,సాదువులైన లేళ్ళు  కూడా కలిసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .మనసు ఉద్విగ్నత చెంది,అర్జునముని స్తావరం దగ్గరే ఉందని తెలుసుకొన్నారు .-‘’అభిద దురభితో మునిం వదూభ్యః –సముదిత సాధ్వస విక్లబం  చచేతః ‘’.రాజర్షి అర్జునుడున్న చోట అప్సర గంధర్వులకు ధైర్యం సన్నగిల్లింది .పరమ ప్రభావంతో ఉన్న తాపసులకు అసాధ్యం ఉండదు కదా –‘’ఉపహిత పరమ ప్రభావ ధామ్నాం –నహి జయినాం తపసా మలంఘ్య మస్తి ‘’  .ఇసుకలో అర్జునుని కాలి గుర్తులు కనిపింఛి భయపడ్డారు .ఆ అడుగుల్లో అతిమానుష ధ్వజం ,చక్రం మొదలైన గుర్తులు కన్పించాయి .

‘’స చకిత మివ విస్మయాకులాభిహ్ –శుచి సికతా స్వతిమానుషాణితాభిహ్ –క్షితిషు దద్రుశిరే పదాని జిష్నో-రుపహిత కేతురథాంగలా౦నాని’’.అక్కడి ఋతు సమృద్ధికి అర్జునముని ప్రభావమే కారణమని గ్రహించారు .-‘’రుతురివతారు వీరుధాం సమృధ్యా-యువతి జనైర్జ గృహేముని ప్రభావః ‘’.అక్కడి అశోకం బాగా ఆదరాన్ని కల్గించింది దానికొమ్మపై నీరు కారున్న ముని వస్త్రం ఆరేయటం తో అది వంగింది .అందుకే రాపిడి వల్ల చిగురాకులు నేల వ్రాలాయి .గొప్పవారి సేవవలన గొప్పతనమే వస్తుంది..అచ్చరలు కూడా ప్రభావితులయ్యారని భావం  –‘’బహుమతి మదికాం యయావ శోకః –పరిజనతాపి గుణాయ సద్గుణానాం’’.  యమనియమాదు లతో కృశించినా,బలిష్టమైన అంగాలు ,ఆయుధాలు ఉన్న ఆర్జునుడిని చూశారు. అథర్వణ వేదం లో చెప్పిన మంత్రాలలో అభ్యుదయం కోసం శాంతాన్ని ,అభి చారిక క్రియ కోసం అంటే శత్రు సంహారం కోసం క్రీడి ఆయుధాన్ని ధరించటం వాళ్ళు చూశారు.శాంతమూర్తి అయినా ఉగ్రత్వమూ తగ్గలేదని గ్రహించారు –‘’యమనియమ కృశీకృత స్థిరా౦గః –పరి దదృశేవిధృతాయుధః స తాభిః-అనుపమశమ దీప్తితా గరీయాన్ –కృత పద పంక్తి రథర్వణేవ వేదః ‘’

  అర్జునుడు చంద్రునిలా ఆహ్లాదం కలిగించే కిరణ సముదాయం చుట్టూ కలిగి ఉన్నాడు .ఇంద్రకీల పర్వతం లో ఒక శిఖరాన్ని మాత్రమే నివాసంగా చేసుకొన్నా ,పర్వతం మొత్తం ప్రభావితం చేస్తున్నాడు –‘’శశధర ఇవ లోచనాభి రామై-ర్గగనవిసారిభి ర౦శుభిః పరీతః –శిఖర నిచయ మేక సాను సద్మా –సకల మివాపి దధన్మహీధరస్య ‘’.గంగాతీరం లో తపస్సు చేస్తూ యెర్రని జటలతో  యజ్ఞం లో హవిస్సులు వ్రేల్చినపుడు పైకి లేస్తున్న అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తున్నాడు –‘’సురసరితి పరం తపోధిగచ్ఛన్-విధృత పిశంగ బృహజ్జటాకలాపః –హవిరివ వితతః శిఖాసమూహైః-సమభి లష న్నుపవేది జాత వేదాః’’.శరీరానికి తగిన ప్రయత్నం ,దానికి తగ్గ క్రియ ,అందుకు తగ్గతపస్సు ,దానికి విజయమే ఫలంగా శ్రద్ధా అర్జునుడు చూపిస్తున్నాడు .’’సదృశ మతను మా కృతేఃప్రయత్నం –తదనుగుణా మపరైఃక్రియ మలంఘ్యా౦ –దధత లఘు తపః క్రియాను రూపం –వియతీం చ తపః సమాం సమృద్ధిం’’.నియమాలతో క్షీణించినా ,ఇంకా పర్వత బలం తో ఉన్నాడు .శాంతం ఉన్నా ఇతరులకు లొంగని వాడు .ఏకాంతం లో ఉన్నా మంత్రులతో కల్సి ఉన్నట్లే ధైర్యంగా ఉన్న అర్జునుడు,ఇంద్ర సమాన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు –‘’చిర నియమ కృశోపిశైల సారః –శమనిరతోపిదురాసదః ప్రకృత్యా-స సచివ ఇవ నిర్జనే పి తిష్ట-న్మునిరపితుల్య రుచి స్త్రిలోక భర్తుః’’.

 లోకాలన్నిటి పరాక్రమ తేజస్సులను తిరస్కరించేది ,త్రిలోక రక్షణకు సమర్ధమైన అర్జున శరీరాన్ని చూసి అప్సరసలు ,విజయం కోసం విజయుడు చేసే తపస్సు  నిష్ఫలం అనుకొన్నారు అంటే ముల్లోకా విజేతకు ఇంకా తపస్సు ఎందుకు అని భావం .-‘’తను మవజిత లోక సారధామ్నీం –త్రిభువన గుప్తి సహాంవిలోక యంత్యః –అవయయు రమరస్త్రియోస్య యత్నం –విజయ ఫలే విఫలం తపోధికారే ‘’ .సాధారణ తాపసుల్ని ,దానవుల్నీ మాకొంగుల్లో ముడేసుకొన్నాం.ఇప్పుడు ఇంద్రుడు ముల్లోక విజేత అయిన ముని ని వశం చేసుకోమని నియమించాడు మమ్మల్ని .మా శక్తి చాటుకోవటానికి మ౦చి అవకాశం వచ్చింది అనుకొన్నారు దేవ వేశ్యలు .-‘’ముని దనుతనయాన్ విలోభ్య సద్యః –ప్రతను బలాన్యధి తిష్ట తస్త పా౦సి-అలఘుని బహుమేదిరే చ తాఃస్వం-కులిశ భ్రుశావిహితం పదేనియోగం ‘’

  అర్జునుడి ని ప్రలోభ పెట్టె కృత్రిమ ప్రయత్నం చేస్తున్న వారిలో వెంటనే మన్మథుడు ఆవేశి౦ చాడు. యవ్వన మాధుర్య శోభ  మనసుని హరిస్తుంది .వీళ్ళు యువతులు .అతడు మాంచి యవ్వనం లో ఉన్నాడు .అంటే అతన్ని చూడగానే వీళ్ళే మదన కా౦క్షలో పడ్డారని భావం .

‘’అథ కృతక విలోభనం విధిత్సౌ-యువతి జనే హరి సూను దర్శనేన –ప్రసభ మవతతార జిత్త జన్మా-హరతి మనో మధురా హి యౌవన శ్రీః’’.మన్మధుడు ఆవేశించాగానే అప్సరలు గంధర్వుల వైపు సాభిప్రాయంగా చూడగా, వాళ్ళు వీణ మృదంగాలతో మనసు హరించే ధ్వనిని ఆకాశం  నిండేట్టు పలికించగా ,అక్కడ ఋతు శోభ ఏర్పడింది .ఆకాశం నీటి మేఘాలతో ఆవృతమైంది. మెరుపులకాంతి వ్యాపించింది .ఎడబాటు లో దంపతులను ఏకం చేసేట్టు ఉరుములురిమినాయి –‘’వ్యవహిత రతి విగ్రహైర్వితేనే-జలగురుభిః స్తని తైర్దిగంత రేషు ‘’

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.