కిరాతార్జునీయం-.19      పదకొండవ సర్గ -2

 

కిరాతార్జునీయం-.19

పదకొండవ సర్గ -2

 ఇంద్రుడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ప్రాణుల్ని చంపి చంచలమైన సంపదలు పొందేవాడు నదులకు సముద్రం ఆశ్రయం అన్నట్లుగా ఆపదలకుఆశ్రయమౌతాడు .-‘’ఉదన్వానివ సి౦దూనామాపదామేతిపాత్రతాం .’’సాధన సంపత్తు ఉంటేనే సంపదలు లభిస్తాయి .దాన్ని రక్షించుకోవటానికి చాలా శ్రమపడాలి .భయాలు పెరుగుతాయి. సంపదను మించిన విపత్తు, దుఖం మరొకటి లేదు .ఆపదల భయాలే భేద౦ ,భయం .సాధన సంపత్తి తో ఆపదలు దూరమౌతాయి .-‘’యా గమ్యాఃసత్సహాయానాం యాసు భేదో  భయం యతః –తాసాం కిం యన్న దుఖాయ విపదామివ సంపదా౦’’.పొందరాని విశ్వాసం తో కలిగిన సంతోష రూప సుఖం తో క్రూరుడైన శత్రువు ధనాన్ని పాము పడగలతోసమానమైన దాన్ని పొందిన ధనవంతుడికి ఏ కష్టాలైనా దుర్లభాలు కావు .అంటే భోగ లాలసలతో మునిగిన ధనవంతుడు సులభంగా ఆపదలు పొందుతాడు .విష సర్పం ఎవడి వల్లనైనా చావాల్సింది . అలాగే డబ్బాశ ఉన్న వాడుకూడా .-దూర సదా నరీ నుగ్రాన్ ధృతే ర్విశ్వాస జన్మనః –భోగాన్భోగాని వాహే యాన ధ్యాస్యాపన్న దుర్లభా ‘’.సంపత్తుకు భేద భావం ఉండదు .దానికి ఇష్టమైన వారు అంటూ ఉండరు .మూర్ఖులు మాత్రం అనురక్తులు కాని స్త్రీల యందు అనురక్తు లైనట్లు సంపద కోరుతారు .ప్రాణులు వామశీలం కలవారవటం సహజం కదా .-‘’నాంత రజ్ఞాః శ్రియో జాతుప్రియై రాసాం న భూయతే –ఆసక్తా స్తా స్వమీ మూఢా వామశీలా హి జ౦తవః’’.చెడు స్వభావం ఉన్న వారిని  సంపదలు వదిలేస్తాయి .ఇవి చంచలమైనవి  అనటం లో తప్పే లేదు.అర్ధం పురుషార్ధం కాదు .- ’సాధు వృత్తానపిక్షుద్రా విక్షి పంత్యేవసంపదః ‘’.ప్రాణుల స్థితి కూడా చంచలమైనదే.ధర్మనాశనం చేయద్దు .సజ్జనులు న్యాయాన్నే ఆశ్రయిస్తారు .అంటే సజ్జనులు కూడా హత్యలాంటివి చేస్తే లోకం లో సజ్జనత్వం ఉండదు .-‘’భావాన్మా స్మవధీ న్న్యాయ్యంన్యాయాదారా హిసాధవః ‘’.యుద్ధ ప్రయత్నం మాను .ముక్తి నిచ్చేతపస్సును చెరపకు .జనన మరణ బంధాన్ని వదలాలంటే శాంతాన్ని ఆశ్రయించాలి .-అంటే విజయం పొందాలనే కోరిక వదిలెయ్యి అనిభావం –‘’విజహీహి రణో త్సాహం మా తపః సాధునీనశః –ఉచ్ఛేదం జన్మనః కర్తు మేధి శాంతస్తపో ధనః ‘’.

 ముందు అంతఃశత్రువులను జయించు .వాటిని జయిస్తే లోకాలన్నీ జయించి నట్లే .-‘’జీయంతా౦ దుర్జయా దేహే రిపవ శ్చక్షురాదయః –జితేషునను లోకోయం తేషు కృత్స్నస్త్వయా జితః ‘’.జితేంద్రియుడు కాని వాడు కార్య సాధకుడు కాలేడు.పరాధీనుడు నీచ ప్రవృత్తికలవాడు సిగ్గులేని వాడవుతాడు .పశువులాగా లోకుల్ని అనుసరిస్తాడు .-‘’అవిధే యే౦ద్రియః పుంసాం గౌరి వైతివిధేయతాం’’.ఇవాల్టి సుఖం రేపు గుర్తుకు తెచ్చుకోనేదే అవుతుంది. దాని అనుభవం పొందలేవు .విషయ సుఖాలు స్వప్నాల వంటివి .దానికి లొంగక పోవటం మంచిది .-‘’ఇతి స్వప్నోపమాన్ మత్వా కామాన్ మా గాస్తదంగతాం’’.కోరికలువిశ్వాస ఘాతుకాలే కాక వంచిస్తాయి .ప్రేమ చూపినా దుఖాన్నే కల్గిస్తాయి ఇంద్రియ లోలత్వం వలన స్వయంగా వదిలి పోతాయి .వదిలించుకోవాలన్నా వదలవు .ఇవి పెద్ద కష్టాన్ని తెచ్చే శత్రువులు .-‘’సుదుస్త్యజా స్త్యజంతో పికామాఃకస్టాహిశత్రవః ‘’.త్వరలోనే నీకు ఇంద్రకీలం ముక్తి నిస్తుంది .ఈ ప్రదేశం గంగానది అంతటి పవిత్రం .అయుధాలు మాత్రం వదలాలి .-వివిక్తే స్మిన్నగే భూయః ప్లావితే జహ్ను కన్యయా –ప్రత్యా సీదతి ముక్తిస్త్వాం పురా మా భూరుదాయుదః ‘’.ఇలా ఇంద్రుడు చెప్పగానే ఇంద్ర తనయుడు వినయం తో మధురంగా ఇలా అన్నాడు ‘’మహర్షీ !నీ వాక్యం సరళ సుగమం .మనోహరం .సమాస లాలిత్యం ఓజో గుణం ఉన్న శబ్దాలు పలికావు .గంభీరార్ధం కలమాటలవి .కొద్దిమాటల్లో అన౦త భావాన్నిచ్చేవి పరస్పరా కాంక్ష కల్గి౦చేవి కూడా.అధ్యాహారాదులు లేకుండా తాత్పర్యం పూర్తిగా వెలువరించాయి –‘’ప్రసాద రమ్యమోజస్విగరీయో లాఘవాన్వితం –సాకా౦క్ష మనుపస్కారం విష్వగ్గతి నిరాకులం ‘’.నీమాటలు యుక్తిసారాలు .ప్రతివాదులు కూడా ఖండించటానికి వీ  ల్లేనివి. అనుమానాదుల తో బాధించనివి .వేద వాక్య సమానాలు.-‘’న్యాయ నిర్ణేత సారత్వాన్నిరపేక్షమివాగమే –అప్రకంప్యతయా న్యేషామామ్నాయ వచనోపమం ‘’.నీమాటలు ఇతరులు కాదనటానికి వీల్లేనివి .సాగర మంత లోతైనవి. పరమ పురుషార్ధాలు.మునుల మనసులాగా పరమ శాంతమైనవి –‘’అల౦ఘ్యత్వా జ్జనైరన్యైః క్షుబితోదన్వ దూర్జితం-ఔదార్యా దర్ద సంపత్తేః శాంతం చిత్తమృషేరివ’’.

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.