అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

అవధూత శ్రీశేషాద్రి స్వామి చరిత్ర -4

పెళ్లిచేద్దాం సరే పిచ్చివాడికి పిల్ల నెవరిస్తారని మధనపడ్డాడు బాబాయ్ .తనకు పెళ్లి చేసుకోవాలని ఉంటె చెప్పనా  నిర్బంధం చేస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నాడు బాబాయ్ తో .ఇక మాట్లాడ లేదు బాబాయ్ ..కామకోటి శాస్త్రిగారి తర్వాత వేదం లో అంతటి ఘనుడు పరశురామ శాస్త్రి ఒకరోజు అనుకోకుండా ఇంటికి వస్తే  శేషాద్రి  పెళ్లి విషయం లో నచ్చచెప్పమని కోరగా ,దానికోసమే వచ్చానన్నాడాయన .జపతపాలు ముగించిన శేషాద్రిని శాస్త్రి ‘’స్మశానం లో శాస్త్ర విరుద్ధంగా జపం చేస్తున్నావట’’అని గద్దిస్తే చేస్తేతప్పులేదన్నాడు శేషాద్రి .’’నేను నైష్టిక బ్రహ్మ చారిణి ఉపాసకులకు దేశకాలాలతోనిమిత్తం లేదు ‘’అనగా మాట్లాడ లేకపోయాడు ఆఘనాపాఠీ .శ్మశానం  నుంచి సరాసరి గృహస్తుల ఇంటికి రాకూడదు ‘’అనిఆయన అంటే ‘’మంచిది ‘’అని వెళ్ళిపోయాడు మళ్లీతిరిగి రాలేదు .ఏ గుడిలోనో ఉంటాడులే అని బాబాయ్ గుండె దిటవు చేసుకొన్నాడు .

ఒక రోజు శేషాద్రి గుడికి వెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే నలుగురు శిష్యులతో అపర దక్షిణా మూర్తిగా అనిపించే గౌడ  సన్యాసిని  శేషాద్రి  చూసి ,భావోద్రేకం కలుగగా ఆయన ‘’మా శుచః ఉపవిష ‘’అనగా అరుగుపై కూర్చోగా  ఆయన చూపులేఈయనకు దీక్ష అయ్యాయి .ఆయన విశేషాలను పట్టన్న అనే అతని ద్వారా తెలుసుకొని ,ఆయన బాలాజీస్వామి అని ,హరిద్వారం నుంచి రామేశ్వరం వెడుతూ కంచికి  వచ్చారని చెప్పగా స్వామికూడా శేషాద్రి వివరాలను అతని ద్వారాతెలుసుకొన్నారు .ఇద్దరూ శాస్త్ర చర్చ చేశారు .ఆయనకు సపర్యలు వీరిద్దరూ చేశారు .స్వామి వెళ్ళిపోతూ పట్టన్నకు దేవీ మంత్రం ,శేషాద్రికి సన్యాస దీక్ష ఇచ్చి వెళ్ళిపోయాడు .దీక్షగా సాధన చేశాడు శేషాద్రి .

  తండ్రి తద్దినం వచ్చింది .శేషాద్రిని ఎలాగైనా ఇంటికి తీసుకొని వచ్చి ఆయన తండ్రి తద్దినం పెట్టించాలనిరామస్వామి వెదకటం మొదలు పెట్టి పట్టుకోనివిషయం చెప్పి ఇంటికి రమ్మంటే ‘’నేను సన్యాసిని .కర్మలు ఎప్పుడో పోయాయి .నేనురాను ‘’అని చెప్పినా వినకుండా బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి గదిలో పెట్టి తాళం వేశాడు .తద్దినం పూర్తీ చేసి పితృ శేషం తిని వెళ్ళచ్చు అని తాళం చెవి రొ౦టిలో దోపుకున్నాడు .శేషాద్రి తమ్ముడు నరసింహ శ్రార్ధకర్మ నిర్వహించాడు .పిండాలకు నమస్కారం చేసే సమయం వచ్చింది  .రామస్వామి గది తాళం తీశాడు .శేషాద్రి గదిలో లేడు .అవాక్కయ్యాడు .ఊరంతా గాలించినా కనపడ లేదు .యోగశక్తితో గదినుంచి మాయంయ్యాడని గ్రహించారు అందరూ.అతడిని సామాన్యుడిగా భావించటం తమ తెలివి తక్కువ తనం అని గ్రహించారు .

  కొంతకాలానికి శేషాద్రి కంచికి ఇరవైమైళ్ళ దూరం లో ఉన్న కావేరీ పాకం లో ఉన్నట్లు వార్త వచ్చింది. అకక్కడ అతడి పెద్దమ్మ సుందరంబాళ్ ఉంటుంది ఆమె పదేళ్ళకొడుకు శేషు ఇతడిని చూసి తల్లితో చెప్పగా  వెళ్లి ఇంటికి రమ్మనగా ,రాను అంటే ఆమె రోజూ నుంచీ ఆహారం తెచ్చిచ్చేది.ఒక రోజు శేషాద్రీ, శేషు గుడి ప్రదక్షిణం చేస్తుంటే ,ఉత్తర ప్రాకారం గోడ దగ్గర పొన్న చెట్టుకింద ఒక పెద్ద పాము కనిపిస్తే ,పిల్లాడు భయపడి అరిస్తే పాము దగ్గరకుశేషాద్రి  వెళ్లగా ఆపాము అతనిపై ప్రాకి మెడ చుట్టూ మూడు సార్లు చుట్టుకొని ,శిరస్సును పడగతో కప్పేసింది .శేషాద్రికి పాముకరిచిందని ఏడుస్తూ వీధిలోకి శేషు పరిగెత్తాడు .జనం పోగయ్యారు నిశ్చలంగా భుజంగ భూషణుడుగా శేషాద్రి కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు .శేషాద్రి ఇక్కడ ఉన్నాడని తెలిసి బాబాయి పిన్నీ చూడటానికి వచ్చారు .సమాధిలో ఏడు భూమికలు ఉంటాయి అవి శుభేచ్చ ,విచారణ ,తను మానసీ ,సత్వాపత్తి,సమసక్తి ,పదార్ధ భావన ,తుర్యగ.నాల్గవ భూమికలో ఉన్నవారిని బ్రహ్మ విదులనీ , అయిదు ఆరు ఏడు భూమికలలో ఉన్నవారిని బ్రహ్మ విద్వర ,బ్రహ్మ విద్వరీయ ,బ్రహ్మ విద్వరిష్టు లు అంటారు .సంకల్పం తో సమాధిలోకి వెళ్లి మళ్ళీ బయటికి రావటం అయిదవ భూమిక .ఇతరుల సాయం తో వస్తేఆరవ భూమిక .స్వేచ్చగాకానీ ఇతరులసాయం తోకానీ జాగృతి లోకి రాకపోవటం ఏడవ భూమిక .ఇప్పుడు శేషాద్రి ఆరవ భూమిక లో సమాధిలో ఉన్నాడు .

 చుట్టూ చేరినవారు ‘’నమః పార్వతీ పతయే హరహర మహా దేవ’’అని ఉచ్చైస్వరం తో పలుకగా శేషాద్రి కళ్ళు తెరిచాడు .పిన్నీ బాబాయి ‘’నాయనా !నీమహిమ తెలుసుకోలేక అపచారం చేశాం .నువ్వు ఇంటిపట్టున ఉంటేచాలు ‘’అని దుఖి౦చగా  వాళ్ళనే ఓదార్చి ఇంటికి పంపించేశాడు శేషాద్రి స్వామి .అప్పటి నుంచి ఆయనది అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితి .అదే జీవన్ముక్త స్థితి .ఆయన అందరి వాడే పశుపక్షాదులకు కూడా .ఆయన పాద ధూళి భవ బంధక విమోచనం అయింది .కావేరీ పాకం లో నెలరోజులు ఉండి,జనం పెరిగిపోగా ,ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి మూడు నెలలు ఎవరికీ ఆయన ఆచూకీ తెలియలేదు  .వందల వానిలో, చెంగల్పట్టు లో ఉన్నాడని వద౦తులొచ్చాయి .తర్వాత దిండీ వనం లో కనిపించాడు.మౌన దీక్షలో ఉన్నాడు .శివాలయం లోని యాగ శాలలో ఒక గది ఆయనకిచ్చారు .తాను నెలరోజులు ఆగదిలో ఉంటానని తలపు తాళం వేసుకోవచ్చనీ రాతపూర్వకంగా  చెప్పారుస్వామి .అలాగే చేశారు అర్చకులు అయిదు రోజులు గడిచాక ,ఆయన ఆగదిలో చనిపోతే సంప్రోక్షణ చేయాల్సి వస్తుందని భయపడి తాళం తీస్తే స్వామి నిశ్చల సమాధిలో కనిపించారు .ఇక ఇక్కడ లాభం లేదని శేషాద్రి స్వామి తిరువన్నామలైకు బయల్దేరి వాలాజీపేట ,వేలూరు అంబూరు ,తిరువత్తూరు ,జవ్వాజిమలె ,కన్నియం బాడి,పోరూరు మొదలైన ఊర్ల మీదుగా 1888లో పంచలింగ క్షేత్రం తిరు వన్నామలై చేరారు శేషాద్రిస్వామి తిరిగి తిరిగి అరుణా చలం లో స్థిరపడ్డారు .

వ్యాస మహర్షి అరుణా చలం గురించి –‘’లలాటే త్రై పున్డ్రీ నిటల ధృత కస్తూరి తిలకః –స్ఫురన్మాలాధారఃస్ఫురిత కటి కౌపీన వసనః –

దధానో దుస్తారాం శిరసి ఫణి రాజం శశి కలాం-ప్రదీపు స్సర్వేషాం అరుణ గిరి యోగీ విజయతే ‘’అనే ప్రసిద్ధ శ్లోకం రాశాడు .ఈ శ్లోఆన్ని రోజూ పారాయణ చేస్తే ముక్తిఖాయం అన్నారు శేషాద్రి స్వామి .

  అన్ని చోట్లూ వదిలేసి అరుణా చలం లో ఎందుకు స్థిరపడ్డారని శేషాద్రి స్వామిని అడిగితె ‘’ఇక్కడే కదా శివ ,శక్తులు మోక్షం మేము ఇస్తామంటే మేమిస్తాం అని పందాలు వేసుకొంటారు ‘’అన్నారు .అరుణా చలేశ్వరుని ఆలయం వెనక వేణుగోపాలస్వామి ఆలయం ఉంది .ఆయన వేణుగాన లహరిలో పరవశించి అరుణాచలుడు అచలుడు అయ్యాడని ఊహిస్తారు .ఈ క్షేత్రం లో ఒక చోటునే ఉండకుండా అంతటా తిరిగారు శేషాద్రి .ఆయనది నడక కాదు పరుగే .పగలూ రాత్రీ సంచారమే .సన్నిధి వీధిలో మొదటి ఇల్లు సూర్య నారాయణ శాస్త్రి గారిది .ఆయనకు స్వామి వివరాలు తెలుసు .స్వామి ఇక్కడికి వచ్చారని తెలిసి వెదకటం మొదలుపెట్టారాయన .ఒక రోజు మండపం వద్ద కలుసుకొన్నారు .దగ్గరలో ఏడు గాడిదలు మేస్తున్నాయి .వాటిని తాకి కళ్ళకు అద్దుకున్నారు స్వామి .ఎందుకు అలా చేశావ్ శేషాద్రీ అని శాస్త్రిగారు ప్రశ్నిస్తే ‘’ఇవి గాడిదలు కావు సప్తర్షులు ఇది వసిష్టుడు ఇది ఆస్త్యుడు ‘’అని చూపిస్తూ నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు శేషాద్రి .స్వామిని ఇంటికి రమ్మంటే ‘’ఫోఫో ‘’అని అదిలించారు .అది బాలోన్మత్తపిశాచవత్ స్థితి .ఆయన్ను పిచ్చివాడుఅని ఎవరూ అనుకోలేదిక్కడ .

   సశేషం –

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-21

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.