మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8

· 23-మార్కండేయ విజయ నాటకం ,స్వీయ చరిత్ర కర్త ,శ్రీశైల దేవాలయ పాలక వర్గ సభ్యుడు,కవి చకోర చంద్రోదయ కళాప్రపూర్ణ –శ్రీ పైడి లక్ష్మయ్య

· పైడి లక్ష్మయ్య (Paidi Lakshmayya) (1904 – 1987) ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు.

జీవిత విశేషాలు
లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్ర పట్టాను సంపాదించి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.

వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1952 సంవత్సరంలో అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి మొదటి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1] పార్లమెంటులో వివిధ విషయాలపై చర్చలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఉత్తమ రాజకీయవేత్తగా పేరుపొందారు.1956లో రష్యా దేశంలో పర్యటించి భారతదేశంలో వ్యవసాభివృద్ధికి కొన్ని సూచనలు ఇచ్చారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యులుగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యులుగా వుండి ఉన్నత విద్యావ్యాప్తికి తమవంతు కృషి చేశారు[2].

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1957లో వీరిని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమీషనరుగా నియమించారు. ఆ కాలంలో వివిధ దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో ఆలయ, మండపాదుల పునర్నిర్మాణానికి ఎంతో కృషిచేశారు. శ్రీశైల దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా కూడా కొంతకాలం పనిచేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు.

రచనలు
నాటకాలు

  1. మార్కండేయ విజయం
  2. మహాత్మ కబీర్
  3. సంసార నౌక
  4. సాయి లీలలు
  5. హేమారెడ్డి మల్లమ్మ లేక శ్రీశైలమల్లికార్జున మహాత్మ్యము
  6. శ్రీశైలీయము
  7. శ్రీరామాశ్వమేధము
  8. లుబ్ధాగ్రేసర
  9. తారాశశాంక

శతకము

  1. సద్గురు శ్రీ సోమనాథ శతకము

స్వీయ చరిత్ర

  1. జ్ఞాపకాలు – వ్యాపకాలు

బిరుదములు
· ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరికి కళా ప్రపూర్ణ గౌరవం ఇచ్చి సత్కరించింది.

· కవిచకోరచంద్రోదయ అనే బిరుదును శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రదానం చేశారు

· 24-వీరాంజనేయ విలాస ,మంత్రి త్రయ కర్త ,తాను రాసిన పుస్తకం పై తానె పరీక్ష రాసిన మరో పుట్టపర్తి ,ఆర్ష విద్యా విశారద –శ్రీ జోస్యం జనార్దన శాస్త్రి

· జోస్యం జనార్దనశాస్త్రి రాయలసీమకు చెందిన కవిపుంగవులలో ప్రముఖుడు.

జీవిత విశేషాలు
జోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లా, పాణ్యంలో 1911, అక్టోబరు 2వ తేదీకి సరియైన విరోధికృతు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు అన్నపూర్ణమ్మ, వేంకటరామయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు ములకనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. కౌండిన్యస గోత్రజుడు. ఇతని తల్లిదండ్రులు ప్రాచీనార్షసాంప్రదాయానికి చెందిన సాత్వికులు. ఇతడు ప్రాథమిక విద్యను 12 సంత్సరములలో ముగించి మేనమామల వద్ద పూర్వపద్ధతులలో సంస్కృతాంధ్రములలో కావ్యనాటక అలంకారములను నేర్చుకున్నాడు. 1933లో ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటి నుండి అనంతపురం జిల్లా, తాడిపత్రిలోని మునిసిపల్ హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశాడు. తరువాత కూడా తాడిపత్రిలోనే స్థిరపడ్డాడు. ఇతడు ప్రైవేటుగా 1942లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు వ్రాసినప్పుడు ఇతనికి ‘మంత్రి త్రయము’ అనే పాఠ్యగ్రంథం ఉపవాచకంగా ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఈ మంత్రి త్రయం వ్రాసింది ఇతడే. మరో విశేషం ఏమిటంటే ఈ పరీక్షను ఇతనితోబాటు ఇతని కుమార్తె సుబ్బలక్ష్మమ్మకూడా అదే సంవత్సరం వ్రాసింది. ఇతడు 20కి పైగా రచనలు చేశాడు. నాలుగు అష్టావధానాలు కూడా చేసి పండితుల మెప్పు పొందాడు. ఇతడికి జ్యోతిషము, వైద్యములలో కూడా ప్రవేశం ఉంది. ఇతని కుమారుడు జోస్యం విద్యాసాగర్ కూడా రచయితగా పేరుగడించాడు. జోస్యం జనార్దనశాస్త్రి తన 87 యేట పింగళ నామ సంవత్సర మార్గశిర బహుళ ద్వాదశినాడు అనగా 1997, డిసెంబరు 25వ తేదీన తాడిపత్రిలో మరణించాడు.

సత్కారాలు
· త్యాగరాజకళాసమితి, హైదరాబాదు వారిచే 11-04-1983వ తేదీన ప్రముఖ కవి దాశరథి చేతుల మీదుగా కనకాభిషేకం.

· రచన సాహిత్యవేదిక, కడప వారిచే గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక అవార్డుతో సత్కారం.

· 1993లో అనంతపురంలో కల్లూరు సుబ్బారావు అవార్డు.

· 1992లో తాడిపత్రి పురపాలక సంఘం వారిచే పౌరసన్మానం మొదలైనవి.

బిరుదులు
· అభినవ వేమన

· ఆర్షవిద్యా విశారద

రచనలు

  1. కన్నతల్లి
  2. ప్రకృతి కన్నతల్లి
  3. కన్నీటి చుక్కలు
  4. కృతిపతి
  5. ఉన్నమాటలు
  6. పసిడిపంట
  7. దుర్గా సప్తశతి (ఆంధ్రీకరణము)
  8. సీతమ్మ (ఖండకావ్యము)
  9. వీరాంజనేయ విలాసము
  10. రామలింగ సుప్రభాతము
  11. విజయజ్యోతి
  12. వీరశ్రీ
  13. రామలింగ సుప్రభాతము
  14. కథామంజరి
  15. చంపకాలు నూటపదార్లు
  16. శాంతలహరి
  17. భావసపర్య
  18. ఆనందలహరి
  19. పురుషోత్తమ శతకము (అనువాదము)
  20. శృంగారలహరి
  21. కైంకర్యం
  22. శ్రీ మల్లేశా (శతకము)
  23. మంత్రిత్రయము (చాణక్యుడు, యుగంధరుడు, తిమ్మరుసు)
  24. భాషాముకురము
  25. విద్యార్థి కల్పతరువు మొదలైనవి

రచనల నుండి ఉదాహరణలు
ఇతడి కృతిపతి కావ్యంలో గువ్వల చెన్నుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన సంభాషణను పాత్రోచితంగా గ్రామ్యభాషలో ఈ విధంగా వ్రాశాడు.

భార్య:- మామా! యేంతిక్కోనివి?
ఆ మారాజే అడక్క ఆకడె మిస్తే
నీ మన్సెంబడి తుంటా
నే మోజుగ అడుగు తుంటె యీరా దేమే?

చెన్నుడు:- పిల్లా! దాని గ్గాదే
యిల్లాలికి సొమ్ములేంటికే! యెరి మొగమా!
యిల్లూ, వాకిలి, మొగుడూ,
సల్లగ తిననీకి వుంటే సాల్లేదేమే?

నాపాలి పున్నె మాయని,
ఆ పెద్దయ్యకు దయొచ్చి ఆయన కాయ్నే
ఆ పద్యాల్మూలాన్నే
నా పేర్నిలబెట్టు సంతు నాక్కలిగించెన్

పోయే! అయియేకము దా
నా! యేపాటి సుగాలుగాని యేం సాస్వత మౌ
తాయా? యివన్ని యెంటొ
స్తాయా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.