కిరాతార్జునీయం-12

వేద వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’నీ శత్రువులు అపకారం చేసినాఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండటం వలన  నీ ప్రజ్ఞా సౌశీల్యాలు లోకానికి తెలిశాయి .వాళ్ళు అట్లా అపకారం చేసి ఉండకపోతే లోకానికి నీ గొప్పతనం  తెలిసేది కాదు .కనుక వాళ్ళ అపకారం నీకు ఉపకారం అయింది అంటే శత్రువులుకూడా ఒక్కోసారి ఉపకారులౌతారన్నమాట .శత్రువులకు చిక్కిన రాజ్యం పరాక్రమం తో తిరిగిపొందటం సాధ్యంకానీ ,వేరే దానివలన సాధ్యంకాదు .ప్రబల శత్రువును చంపాలంటే అంతకంటే బలపరాక్రమ౦ , సాధన సంపత్తి కావాలి .అస్త్రబలాదిక్యత ,వీరత్వం ఉంటేనే సాధ్యం .కనుక ముందు ఈప్రయత్నం చేయాలి మీరు .

‘’ముందుగా శత్రువుల ఆదిక్యం చెబుతా విను .అక్కడ భీష్ముడున్నాడు .అంతటి యుద్ధపాటవం ఎవరికీ లేదు .అతని గురువు పరశురాముడు 21సార్లు రాజులను చంపిన వీరుడు .అస్త్ర విద్యకు మూల విరాట్టు.అతడే భీష్ముని చేతిలో ఓడిపోయాడు .శౌర్యాది గుణాలు  ఆశ్రయ పురుషుని ఆధిక్యాన్ని బట్టి వస్తుంది .అలాంటి భీష్ముని పరాక్రమాన్ని   ఎదిరించటం సాధ్యమా.ఆయన్ను ఓడిస్తేకాని నీకు రాజ్యం రాదు .ఆయన్ను ఓడించే సమర్ధుడు నీ పక్షాన ఎవరున్నారో చెప్పు .స్వచ్చంద మరణ వరం పొందిన ఆయన్ను చూసి యముడే  సంహరించేశక్తిచాలక పరాభూతుడౌతున్నాడు  . జగదేక వీరుడు రౌద్రమూర్తియై యుద్ధం లో ధనుస్టంకారం చేస్తే వీరులంతా గడగడ వణకాల్సిందే .మరి అతన్ని నిర్జించే యోదుడెవరున్నారు నీవైపున !

‘’లోకాలన్నీ కబళించే ప్రళయాగ్నిజ్వాలలుగా ,మహాఘోరాకారం తో బాణ జాలాన్ని పుంఖాను పు౦ఖ౦ గావర్షింఛి ,సైన్యాన్ని సర్వ నాశనం చేసే ద్రోణాచార్యుని ఎదుర్కొనే సత్తా ఉన్న వాడు మీలో ఎవరున్నారో చెప్పు .

‘’నిరక్ష్య  స౦రంభ నిరస్త ధైర్యం –రాధేయమారాధిత జామదగ్న్యం

అసంస్తు తేషు ప్రసభం భయేషు –జాయేత మృత్యోరపి పక్షపాతః ‘’

కోపంతో రౌద్రమూర్తియై చూడంగానే ధైర్యాన్ని పోగొట్టేవాడు , ,పరశురాముని సేవించి నిఖిలాస్త్రశస్త్రాలు పొందిన  , కర్ణుని చూసి మృత్యువే భయపడి పారిపోతుంది .అలాంటి కర్ణ పరాక్రమాన్ని అడ్డగించి ,నిర్జించే మొనగాడు మీకు ఎవరున్నారో చెప్పు .భీష్మ ద్రోణ కర్ణులు ముగ్గురూ ముగ్గురే .దివ్యాస్త్రాలున్న వారుసామాన్యులచే జయి౦ప బడరు .కనుక వారిని  జయించాలంటే  దివ్యాస్త్రాలు సంపాదించాలి .దానికి ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి శివునికి తపస్సు చేయాలి.అందుకే అర్జునునికి మంత్రోప దేశం చేయాలని పిస్తోంది .మంత్రోపదేశం పొందకుండా తపస్సు ఫలించదు ,కనుక అర్జునునిచే శివుని తపస్సు చేయించి ,పాశుపతం మొదలైన అస్త్రాలు ,వరాలు పొందితే భీష్మాదులను చంపటం తేలిక .అలాంటి మంత్రం ఉపదేశించటానికే ఇక్కడికి వచ్చాను .ఆమంత్రం మహా ప్రభావం కలది. దాన్ని జపిస్తే అన్నీ లభిస్తాయి .ఇంద్రాది దేవతలుకూడా అనుగ్రహిస్తారు .ఆమంత్రాన్ని స్వీకరించటానికి నువ్వుతప్ప ఇతరులకు అర్హత లేదు .వీత స్ప్రుహుడవైన నువ్వే అర్హుడవని నీకుపదేశించాలని నేనే స్వయంగా వచ్చాను .ఆమంత్రం ఉపాశించి అభీష్ట సిద్ధి పొంది ,దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ చేసి రాజ్యాన్ని సాధించి సుఖభోగాలు అనుభవించు .’’అని చెప్పిన వ్యాసమహర్షి మాటలకు స్పందించి ధర్మరాజు అర్జునుని పిలిచి వ్యాసమతానుసారం ప్రవర్తిచమని కోరాడు .అర్జునుడు అన్నమాట ఔదలదాల్చి అత్యంత వినయంతో వ్యాసర్షి ని సమీపించాడు.

‘’నిర్యాయ విద్యాథ  దినాది రమ్యా –ద్బి౦బాదివార్కస్య ముఖాన్మహర్షేః

పార్థాననం వహ్ని కణావ దాతా-దీప్తిస్ఫురత్పద్మ మివాభి పేదే’’

ప్రాతః కాల సూర్య తేజం పద్మలో ప్రవేశించినట్లు ,వినయంగా దగ్గరకొచ్చిన పార్ధునికి మంత్రోప దేశం చేయటానికి వ్యాస రుషి అతనికి ఉపదేశించగా 24తత్వాలరహస్యం తెలిసి , అఖిలాజ్ఞానభంజకమై ,ఉపదేశార్హతకల యోగానికి అర్హతకల అర్జునునికి  మహాతపశ్శాలి వ్యాసమహర్షి వెంటనే తనప్రభావం చేత వశమయేట్లు చేశాడు .మహాభాగ్య సూచకం ,ఉత్సాహగుణంకార్య సమర్ధత కల అర్జునుని చూసి మహర్షి ‘’నేను ఉపదేశించిన మంత్రాన్ని యోగంతో మహాతేజశ్శాలివై ,ఒంటరిగా ఆయుధ హస్తుడవై  జప ఉపవాస స్నానాదులతో ,మహర్షులు చేసినట్లు తీవ్రంగా చేయి .ఇలాంటి తపస్సుకు ఇంద్రకీల పర్వతం శ్రేష్టం .అక్కడికి నిన్ను ఈ యక్షుడు తక్షణమే తీసుకువెడతాడు .అక్కడ ఇంద్రుని గూర్చి నేను చెప్పినట్లు తపస్సు చెయ్యి ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసర్షి .వెంటనే యక్షుడు అర్జునుని సమీపించి నమస్కరించి ,మైత్రీభావం చూఫై తీసుకు వెళ్ళాడు  .

సూర్యుడు రాత్రిభాగం లో నివశించి మళ్ళీ ఉదయి౦చటానికి  మేరుపర్వతాన్ని వదిలేస్తే ,అక్కడ చీకట్లు ప్రవేశించినట్లుగా ,శ్రేయస్సాధనకోసం అర్జునుడు తమల్ని విడిచి వెళ్ళగా ,పాండవులకు నెమ్మదిగా దుఖం ప్రవేశించి అధికమైంది .తాత్కాలికంగా దుఖం పొందినా ,కార్యభారంతో పోగొట్టుకొన్న ,సోదర స్నేహంవలన మళ్ళీ దుఖావేశం వచ్చినా ,వివేకవంతులుకనుక ఆ దుఖం బాధ కలిగించలేదు .విశ్వాసపాత్రుడైన వ్యాసమహర్షి ,ఆయనకు తమశత్రువులపై తీవ్రకోపం ,అర్జునుని  అధిక ప్రతాపం  తెలిసిన సహజ ధైర్యవంతులు కనుక భ్రాతృ వాత్సల్యం చే దుఖం కలిగినా  స్థిరంగా  నిలబడలేదు .సూర్య కా౦తిచేత  పగటిపూట ప్రకాశం పొందిన చీకటి , కృష్ణ పక్షపు రాత్రిని  పొందినట్లు,పాండవులకు కలిగిన దుఖం తాత్కాలికమై ,వాళ్ళను వదిలి  మొత్తంగా ద్రౌపదిని చేరింది .ఆమె దుఖాన్ని ఎలా అనుభవి౦చి౦దో తర్వాత తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ

కార్తీక మాసం మొదటి మంగళ వారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో హరిహరాత్మక దీపాలంకరణ

 

https://photos.google.com/share/AF1QipOTI_TDeOCBv72GTADzuQNPWZPh5WgQIUrkuJafLCOohXD3olgfpeNXlgGlOgadsw?pli=1&key=Y0wwOXhFVEhkZ1Yyd0NEUjdTaElmNDFDZVFCcTNR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కిరాతార్జునీయం- నాల్గవ సర్గ- 2.

కిరాతార్జునీయం-

నాల్గవ సర్గ- 2.

యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జునుడికి అడగకపోయినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి కృతర్ధత లభిస్తుంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తుంది అర్జునా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు శరత్తు   ఎక్కువ కాలం ఉండక పోయినా ఆ ప్రేమను స్థిరం చేస్తుంది-‘’నవైర్గుణ్యై సంప్రతి సంస్తవ స్థిరం –తిరోహితం ప్రేమ ఘనాగమ శ్రియః ‘’

‘’వర్షాకాలం లో తెల్లని కొంగల బారులు ,ఇంద్రధనుస్సుతో ఉన్న మేఘాలు ఆకాశానికి అందం కలిగిస్తాయి ..ఇవేవీ లేకపోయినా శరత్తు నిర్మలాకాశం తో ఆకర్షణీయ శోభ పొందుతుంది.అందమైన వస్తువుకు అల౦ కారసామగ్రి అక్కర్లేదు కదా –‘’తధాపి పుష్ణాతినభః శ్రియం వరాం –న రమ్య మాహార్య మపేక్షతే గుణం’’

 ‘’ఇప్పుడు దిక్కులన్నీ తెల్లబడ్డాయి .నీరు లేకపోయినా మేఘాలు  ఆనందాన్నిస్తున్నాయి .వర్షర్తు అనే భర్త విరహాన్ని భరించలేక దిగ్వదువులు పాలిపోయి తెల్లని రంగుల్ని దుర్బలమైన పాలిండ్లు గా ,జారిన మొలత్రాళ్ళు కృశించినా అందంగానే ఉన్నాయి –‘’’’ఇదం కదంబానిల భర్తు రత్యయే –న దిగ్వధూనాం కృశతా న రాజతే ‘’

‘’ప్రజలు శరత్తు లో మాధుర్యం కోల్పోయి ,నెమళ్ళ క్రీ౦ కారాల పై ఆసక్తి లేకుండా ,మదించిన కలహంసల కూజితాల పట్ల ఆదరం చూపుతున్నారు .గుణం వలన ప్రీతి కలుగు తుందే కానీ ,పరిచయం వలన కాదు ‘’.వరిపొలాల్లో కంకులు బాగా నిండుగా ఉండి,పంటలు సమృద్ధిగా పండాయి పసుపురంగు తిరిగి చేలు పంటబరువుకు ఒంగిపోతున్నాయి .పొలం నీటిలో వికసించిన నల్ల కలువ పూల వాసన చూడటానికా అన్నట్లు వంగాయి .(నాలుగు శ్లోకాలతో ఒకే విషయాన్ని వర్ణించ టాన్ని’’ కలాపం’’ అంటారు).కొలను నీరు పద్మ పత్రాలతో ఆకుపచ్చ గా ఉంది .కమలాల ఎరుపు కాంతి శోభగా ఉంది.నివ్వరి దాన్యకేసరాలతో కలిసి  అటూ ఇటూ ఊగుతూ ఇంద్ర ధనుస్సులా ఉంది –‘’మృణాళినీ నామను రంజితం త్విషా—విభిన్న మంభోజ పలాశ శోభయా –పయః స్ఫుర చ్చాలి శిఖాపి శంగితం –ద్రుతం ధనుష్ఖండ  మివాహి విద్విషః’’

గాలికి చెట్లు ఊగుతున్నాయి వాటి పుప్పొడి పుష్పం లాగా వ్యాపించింది .పువ్వులతో శోభిస్తున్న వృక్షాలు ఆ పుప్పొడిని పట్టు కొంటున్నాయా అని పిస్తున్నాయి .కాముడు కాముని పైట లాగగా ,ఆయువతి క్రీగంట చూసి ,పైట సరి  చేసు కొన్నట్లుగా అందంగా ఉంది –‘’అనా విలోన్మీలిత బాణ చక్షుషః –స పుష్ప హాసా వనరాజీ యోషితః ‘’

‘’అగ్ని లేకుండానే కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు ,తెల్లని మబ్బు తునకలు వ్యాపించి ఎండను అడ్డు కొన్నట్లుగా ఉంది .కొద్దిగా నీటి తు౦పుర్లు కురుస్తుంటే ఆకాశం కమలాల సుగంధం తో వాయువు వ్యాపించింది ..వరిపొలాల్లోని నీటిని వనపంక్తి రూప వనితా జనాన్ని ,ఆకాశ మార్గం లక్ష్యంగా పరిగెత్తే తెల్లని రెక్కల హంసల కలకూజితాలు మేఘాలతో దిక్కులు పరస్పరం మాట్లాడు కొంటున్నట్లు గా ఉన్నది –‘’సితచ్చదానామ పదిశ్య దావతాం-రుతైరమీషా గ్రధితాః పతత్రిణా౦ –ప్రకుర్వతే  వారిద రోధ నిర్గతాః-పరస్పరాలాపమివామలా దిశః ‘’

 సాయం వేళ మేతను౦డి ఇంటికి తిరిగి వచ్చే ఆవులు ఒకదానినొకటి తప్పించు కొంటూ కొట్టాలు చేరుతుంటే  ,తమ దూడలు జ్ఞాపకం రావటం తో పొదుడుగులనుంచి అప్రయత్నంగా పాలు కారి పోతున్నాయి .ఆ పొదుగులు దూడలకు బహుమానంగా ఉన్నాయా అని పిస్తున్నాయి .కోస్టాలు చేరి పాలు, పెరుగు ,వెన్నె నెయ్యి, మొదలైన హోమ ద్రవ్యాలతో పవిత్ర మయ్యేజగత్తుకు కారణమైన ఆ ధేనువులు దూడల్ని కలుసుకొని ఆప్యాయంగా పాలిస్తున్నాయి  .నెమళ్ళ కంటే మధురంగా పాడే గోపికలు పాటలకు అడ లేళ్లు ఆకర్షింప బడి బాగా ఆకలితో ఉన్నా ,మేత మెయ్యాలనే కోరిక లేకుండా ఉన్నాయి .నివ్వరి ధాన్యం బాగా పండి నేలకు ఒరిగి తలయెత్తినిలబడ్డ కమలాలు ఉన్నాయి .పొలాలలో  నీరు ఆరిపోయింది .నివ్వరి ధాన్య నాయకుడు తలవంచి ప్రార్ధించినా, మెత్తపడని కమలం అనే నాయిక ,నాయికా విరహంతో పాలిపోయిన నాయక డి లా ఉన్నారు-‘’ఉపైతి శుష్య న్కలమః సహా౦భసా మనో భువా తప్త ఇవాభి పాండుతాం’’’.కమలాల పుప్పొడి సుగంధం వ్యాపించగా వర్షపు చినుకుల చల్లదనం తో వాయువు చేత ఆకర్షింప బడిన తుమ్మెదలకు  మరో  దారి లేకపోయింది .రాజ భయంతో ఎలా తప్పించు కోవాలో తెలియని  దొంగల్లా ,దోషుల్లా ఉన్నాయి తుమ్మెదలు –‘’ఉపాగమే దుశ్చరితా ఇవా పదా౦ –గతిం న నిశ్చేతు మలం శిలీ ముఖాః’’

‘’పగడం లాగా ఎర్రగా ఉన్న నోళ్ళతో పసుపు రంగు పండిన నివ్వరి ధాన్యం కంకులను పట్టుకొన్న శిరీష పుష్పం లాంటి పచ్చని చిలుకలవరుస అనేక రంగులతో ఇంద్ర ధనుస్సులా ఉన్నది –‘’ముఖై రసౌ విద్రుమ భంగ  లోహితైహ్-శిఖాఃపిశంగీహ్ కమలస్య విభ్రతీ-శుకావలి ర్వ్యక్త శిరీష కొమలా –ధనుహ్ శ్రియః గోత్ర భిదోను గచ్ఛతి’’’’అని యక్షుడు అర్జునునికి శరత్ శో వర్ణించి చెప్పాడు .ఇంతలో సూర్యుని కూడా కప్పి వేసేంత ఎత్తులో హిమాలయ పర్వతం చూశాడు .అది కాంతివంతమైన మేఘ సముదాయంగా ఉంది .అరణ్యాలతో నల్లని రంగు పొంది ,ఉన్న ఆ ప్రాంత భూమి ,పైన తెల్లని మంచు కప్పిన శిఖరాలతో ఉన్న అక్కడికి చేరి అర్జునుడు మదిర మత్తు వదిలిన బలరాముడిని స్మరించాడు .ఆయనా తెల్లని వాడే ఆయన ధరించిన వస్త్రం మాత్రం నల్లనిది .కనుక బలరాముడి లా పర్వతం ఉ౦దనే భావన .’’తమతను వనరాజి శ్యామితో –నగముపరి హిమానీ గౌరమాసాద్య జిష్ణుహ్-వ్యపగత మదరాగస్యాను సస్మార అక్ష్మీ –మసిత మధర వాసో బిభ్రతః సీర పాణేహ్’’

సశేషం

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

కిరాతార్జునీయం నాల్గవ సర్గ .

పాశుపాతాస్ర సాధనకోసం అర్జునుడు యక్షుని తోడుగా తీసుకొని ఇంద్ర కీలాద్రి చేరాడు .అక్కడ కనిపించిన ప్రకృతి  సౌందర్య వర్ణననమే చతుర్ధ సర్గలో మహాకవి భారవి వివరించాడు.ఆ  అందాలు అనుభవిద్దాం

చెలికత్తెల సముదాయం లో యవ్వనం లో ఉన్న ప్రియురాలిని నాయకుడు చేరుకున్నట్లు ,లోకులకు ఇష్టుడైన అర్జునుడు పచ్చగా పండి వరి కంకులతో ఉన్న పంటపొలాలు, వ్యవసాయ దారులు ఉన్న చోటికి వచ్చాడు –

‘’తతః సకూజత్కలహంస మేఖలాం –సపాక సస్యాహిత పాండుతా గుణం –ఉపాస సాదోప జనం జనప్రియః –ప్రియామి వాసాధిత యౌవనాంభువం .

గ్రామ సమీపంలోని భూములు చూసి సంతోషించాడు .బాగా పండి ఒరిగి న వరికంకులతో అందమైన పొలాలు ,బురద తేరి నిర్మలమైన నీటిలో కమాలాలున్న గుంటలు ఆగ్రామ సీమలు శరదృతువు సంపదనంతా అర్జునునికి బహుమానంగా ఇస్తున్నాయా అన్నట్లున్నాయి .చూచి ఆనదించాడు ఫల్గుణుడు .నీటి కుంటలలోని చేపలు గంతు లేయటం మనసును ఆకర్షించింది .చేపలు అటూ ఇటూ తిరుగుతుంటే నీటి కమలాలే విచ్చుకొన్న కళ్ళతో ఆశ్చర్యంగా ఆర్జునుడిని చూడాలని ఆత్రం గా ఉన్నాయి .వాటి చేష్టలు ప్రియురాలి చూపులోని విలాస చేష్టలను కూడా మై మరపించేవిగా మనోహరం గా ఉన్నాయి .

‘’హృత ప్రియా దృష్టి విలాస విభ్రమా –మనోసృజహ్రు శఫరీ వివృత్తహ

నీటి మడుగులలో కమలాలు ,నివ్వరి ధాన్యం అందం బాగా ఆకర్షించాయి .అందు బాటులో ఉండని సుందర దృశ్యం ఎవర్ని ఆకర్షించదు ?’’సుదుర్లభే నార్హతి కోభి నందితుం-ప్రకర్ష లక్ష్మీ మనురూప సంగమే ?

బాగా ఎత్తుగా ఎగిరే చేపలు పొర్లటం తో కమలాలనిండా ఆవరించిన నురుగు తొలగి పోయింది .కమల కిన్జిల్కాలు స్పష్టంగా కనిపించి మెట్ట తామరలా అనుకొన్న అతని అనుమానం తీరిపోయింది .నదుల ఇసుకలు చూసి ఆనందించాడు. రోజూ తగ్గిపోతున్న నీటితో ,నీటి వేగం తగ్గి తీరం లో ఇసుక లో తరంగాల గుర్తులేర్పడ్డాయి .తెల్లని ఇసుక నదులు కట్టుకొన్న పట్టు వస్త్రాల్లాగా ఉన్నాయి.వాటిని చూసి  సముద్రుని భార్యలైన నదులు పట్టు వస్త్రాలు ధరించాయా   అనిపించాయని భావం –‘’నిరీక్ష్య రేమే స సముద్ర యోషితాం –తరంగిత క్షౌమ విపాండు సైకటం ‘’

 తర్వాత మూడు శ్లోకాలో పంట పొలాలు కాపాడే స్త్రీల వర్ణన ఉన్నది –పంటలను కాపాడే కాంత పువ్వు లోని పరాగం పొడితో ముఖం అలంకరించుకొని అందమైన ,కనుబొమల మధ్య మంకెన పువ్వు అలంకరించు కోవటం తో కింది పెదవి ఎర్రబడి చిగురాకు శోభ లా ఉంది .ఎత్తైన పాలిండ్ల చుట్టూ లేత ఎండతో ఎరుపు రంగు పొందిన ఎర్రతామర పుప్పొడి అలదుకొని పని చేస్తున్నందున చెమట తో తడిసి మరీ ఆనందాన్ని కల్గిస్తోంది .చెవులకు అలంకారంగా పెట్టుకొన్న కలువ ను తన కంటి చూపుతో అలంకరిస్తూ ఉన్న కాపు భార్యను చూసి అర్జునుడు శరదృతువు వైభవం సఫలమై౦దను కొన్నాడు .ఈ ఋతు సంపదంతా ఈ గోపికను అల౦క రించిందని భావం –

‘’కపోల సంశ్లేషి విలోచన త్విషా-విభూష యంతీ మవతంస కోత్పలం –సుతేన పా౦డో హ్కమలస్య గోపికాం –నిరీక్ష్య మేనే శరదః కృతార్ధతా

రాత్రిఅయి చాలా సేపు అవటం తో త్వరగాకోస్టాలకు వెళ్ళలేక ,దూడల్ని తలుచుకోవటం వలన పాలుకారుతున్న విశాలమైన పొదుగులున్న ఆవుల మందలు అర్జునునికి ఉత్సుకత కలిగించాయి .తనకు ప్రతి కక్షి అయిన మరో బలిసిన ఎద్దు ను జయించి , తనకు ఎరేలేదన్న విజయ గర్వం తో  అమ్భారవం చేస్తూ ఒక వృషభం కొమ్ములతో నదీతీరాన్ని పెకలిస్తోంది .గర్వం రూపు దాల్చిందా అన్నట్లు శరత్తులో మంచి పచ్చికమేసి బలిసిన ఆ ఎద్దు ఆకర్షణం గా ఉందన్న మాట –‘’పరీత ముక్షావ జయేజయశ్రియా –నాదంత ముచ్చై క్షత సింధు రోధసం-  దదర్శ పుష్టిం దధతం  సశారదీం  -స విగ్రహం దర్ప మివా ధిపం  గవాం’’

మంచు కురిసి తెల్లగాశుభ్రం గా ఉన్న ఆలమందలు మెల్లగా తమస్థావరాలకు వెడుతుంటే,శరత్కాలపు నదీ తీరం లో ఇసుక తిన్నెలు మొలనుండి జారిపోతున్నవస్త్రాలున్న పిరుదులు కల శోభగా అనిపించింది –‘’శరన్నదీనాం పులినైహ్ కుతూహలం –గళ ద్దుకూలైర్జఘనై రివాదధే’’

 ఆలకాపరులు పశువులతో తమ సోదర బందుత్వాన్నిచూపిస్తూ ,ఆడవుల్లోనూ, ,ఇళ్ళల్లో ఉండే ప్రేమ భావాన్నే కలిగిస్తున్నారు. రుజుమార్గం లో ఆవులను అనుకరిస్తున్నారా అని పిస్తోంది –‘’గతాన్పశూనాం సహజన్మ బంధుతాం-గృహాశ్రయం ప్రేమ ,వనేషు బిభ్రతః –దర్శ గోపా ను పధేను పాణ్డవః –కృతానుకారానివ గోభి రార్జవే ‘’

 తర్వాత శ్లోకాలలో గోపాలికల వర్ణన ఉంది..గోపికలు కదుల్తున్న తుమ్మెద వంటి ముంగురులతో ,చిరునవ్వు తో వెలసిన కేసరాల వంటి దంతాలతో ,కదిలే చెవి కుండలాలకాంతితో ,ఉదయపు ఎండలో వికసించిన పద్మముఖాలతో ఉన్నారు .పెరుగు చిలికే రైతు స్త్రీలు ఊపిరి పీల్చి వదులుతుంటే రెండు పెదవులు కదులుతూ ,చిగురాకుల తీగల్లా అందంగా ఉన్నారు.కవ్వపు  తాడు అటూ ఇటూ లాగుతుంటే పిరుదులు తమాషాగా కదుల్తున్నాయి –‘’వ్యపోధపార్శ్వైరపవర్తి తత్రికా –వికర్షణ్ఐ పాణి విహార హారిభిహ్’’

స్త్రీలు పెరుగు చిలుకుతుంటే ,ఇరుగు కుండలలో మద్దెల మోట వంటి ధ్వని వినిపిస్తోంది అది విని ఆడ నెమళ్ళుమేఘ గర్జన అనుకోని ఉన్మాదం తో నర్తిస్తున్నాయి –‘’వ్రజా జిరేష్వ౦బు ద నాద శంకినీహ్ –శిఖండినా మున్మదయత్సు యోషితః –ముహుహ్ ప్రణు న్నేషుమధాం వివర్తనై –ర్నదత్సు కుమ్భేషు మృదంగ మందరం’’

గోపకా౦తల ఉన్నత స్తనాలు  ఇటూ అటూ కదులుతూ శ్రమతో కళ్ళు అలసిపోయాయి చిలకటం లో వారు అప్పుడే నాట్యం ఆపిన వారకాంతల్లా కనిపించారు అర్జునుడికి .గ్రామాలు దాటి ముందుకు వెడుతున్నాడు .దారులు వర్షరుతువులోని వంకర టింకరలు పోగొట్టుకొని ,మధ్యమధ్యలో నీరు నిలవటంచేత  వంకరగామారి ,ఆరిపోయినచోట చక్కగా ఉన్నాయి. బళ్ళు నడుస్తున్నాయి కనుక రెండు చక్రాల దారి కనిపిస్తోంది. రాకపోకలెక్కువై బురద ఆరి, నేల గట్టిపడింది .ఇళ్ళముందు చక్కని అలంకారాలతో పూల చెట్ల తో అల్లుకున్న పందిళ్ళలో జనం కూర్చుని ఉన్నారు .అదవి ముని ఆశ్రమాలులా  ఉన్నాయి . పల్లె ప్రజలు కల్లాకపటాలు లేకుండా మునులు లాగా సాధారణ వేషధారణలో మనసు విప్పి మాట్లాడు కొంటున్నారు .ఇళ్ళల్లోనూ పూలు పండ్ల చెట్లు పెంచుతున్నారు. ఆదరంగా ఇవన్నీ చూస్తూ అర్జునుడు ముందుకు వెడుతున్నాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహా భక్తులు  -2 1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

మనమెరుగని మహా భక్తులు  -2

1-కోటం రాజు నాగేశ్వర దాసు -2(చివరి భాగం )

తగిన వధువుతో దాసుకు వివాహం చేసి కొత్త ఇల్లు కట్టించి అందులో గృహప్రవేశం చేయించారు శాస్త్రి దంపతులు .గృహ కృత్యాలమీద ఆసక్తి లేని దాసు భార్యను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి చేరేవాడు .కొంతకాలానికి శాస్త్రి చనిపోయాడు .కుటుంబ భారం దాసుపై పడినా పెద్దగా పట్టించుకోలేదు .రేపల్లె ,భట్టిప్రోలు వైశ్యులు ఆకుటుంబ భారం తామే వహించారు .రాం భజన చేస్తూ దాసు కాలం  వెళ్ళ బుచ్చుతున్నాడు .దాసు భార్య గర్భవతి అయింది .ఆమెకు భట్టిప్రోలు వైశ్యులు ఆమెకు  చీని చీనా౦బరాలు సమకూర్చి ఒక బ్రాహ్మణుడికిచ్చి పంపారు. దాసుకు ఆబ్రాహ్మణుడు దారిలో కనిపిస్తే అవి తీసుకొని తానె ఇంటికి వెళ్లి భార్యకిస్తానని చెబితే నమ్మి ఇచ్చేశాడు ఆబాపడు .ఆమూట నెత్తిమీద పెట్టుకొని రామభజన చేస్తూ ఇంటికి వస్తుంటే దారిలో ఒక చెట్టు కింద నిండు చూలాలైన భిల్లస్త్రీ కనిపిస్తే ‘’అమ్మా నన్ను సోదరునిగా భావించి వీటిని తీసుకో’’అని నెత్తిపైఉన్న మూటను ఆమెకిచ్చేసి బ్రహ్మానందం పొందుతూ ఎక్కడెక్కడో తిరిగాడు .ఈ విషయం తెలిసిన భట్టిప్రోలు ప్రజలు మళ్ళీ అన్నిటినీ సమకూర్చి స్వయంగా తామే ఇంటికి వెళ్లి దాసు భార్యకు  ఇచ్చి సంతృప్తి చెందారు .కొడుకు పుట్టగా రామారాయుడు అనే పేరు పెట్టారు .

  పుత్ర జననానికి సంతోషించి ,భక్తజనాలతో కలిసి గ్రామాలు తిరుగుతూ భజనలు ఉపన్యాసాలతో ప్రజలలో ఆధ్యాత్మిక భావ వ్యాప్తి చేశాడు దాసు .గుంటూరులో శిష్యులు చాలామంది చేరారు .ఒకసారి రేపల్లె ఏడాది కాలంగా వర్షాలేలేవు .జనం బాధ పడుతుంటే అనుకోకుండా అక్కడికి వచ్చిన దాసు ‘’భయం వద్దు .ఒక మూడు గంటలలో వర్షం కోసం రామాజ్ఞ అయింది ‘’అని చెప్పి స్వగ్రామం వెళ్ళాడు .దాసు మాట నమ్మని ప్రజలు శివాలయం లో సహస్రఘటాభిషేకానికి ఏర్పాట్లు చేశారు .సరిగ్గా దాసు చెప్పిన సమయానికే బ్రహ్మాండమైన వర్షం కురిసి అందరికి ఆనందం కలిగి దాసు మాట కు విలువ పెరిగి౦ది.

  శిష్యులతో కలిసి దేశ సంచారం చేస్తూ శ్రీరామనవమికి భద్రాచలం చేరి సీతారామ కల్యాణం కనులారా చూస్తూ భజన చేద్దామనుకొంటే పందిళ్ళలో ఇసుక వేస్తె రాలనంత భక్తజనం ఉండటం చూసి ,ఆలయ ముఖమండపం చేరి తాళాలు త౦బు రాలతో ఆనంద భైరవి రాగం ఆట తాళం లో ‘’కనులకు కనపడవేమి శ్రీరామా ?రామయ తండ్రీ !ఇంత కన్నడ సేయ గ కారణమేమి ?’’

ఎక్కడనున్నావో నాస్వామి నాకి౦కెవరయా దిక్కు సర్వాంతర్యామి ‘’

గుహుడు కడిగిన పదము లేవి ?జనకకూతురు కూర్చున్న వామాంక మేది?పయిడి ముగ్గుల గొలుసు లేవీ ?చేత బట్టిన మంచి తీరు కమానులేవీ ?మంచి పచ్చల పోగులేవీ ?తళుకు మించిన నీ వ్రేళ్ళ యుంగరము లేవీ ?ఘంట మొలనూలుఏదీ ? బొజ్జ గదల తళుకు మను కౌస్తుభమేదీ ?ముద్దులు గులుకు మోమేదీ ,జగన్మోహనమైన మీచిరు నగవేదీ ?వరదుడిచ్చిన హారమేదీ ?తూము నరసింహు డర్చించు చరణము లేవీ ?శ్రీ భద్రాచల విహార ,తులసీ దళ హార ,హే సింధు గంభీర ,పరమ దయారస పూర ,నాగేశ్వర దాస మందార జగదేక వీరా ‘’అని తన్మయం లో కీర్తి౦చగానె ,కల్యాణం లోఉన్న విగ్రహాల షోడశ కళలను లేపి ,దాసు ముందు ఆవహి౦ప జేసి ఆన౦దించాడు కళ్యాణ రాముడు .అది కనులారా చూసిన దాసు కాఫీ రాగం ఆట తాళం లో –‘’నాపాలి భాగ్య మేమందు ,రఘునాధుడు కనిపించే ముందు ,పాపము లెల్ల బాపు శ్రీరాముల రూపము కనులకు రూది గా గనిపించే ‘’అని భక్తీ తన్మయం లో గానం చేశాడు .ఈ విషయం తెలిసిన తూము నరసింహ దాసు స్వయంగా వచ్చి దాసును సగౌరవంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొని వెళ్లగా ఆవిగ్రహాలు మళ్ళీ షోడశ కళలతో విరాజిల్లాయి .నాగేశ్వర దాసు మహాత్మ్యాన్ని అక్కడి వారందరూ గ్రహించి అపూర్వం గా సత్కరించి గౌరవించారు .

 భద్రాచలనుంచి మళ్ళీ తీర్ధ యాత్రలు చేస్తూ శ్రీరంగం చేరి రంగడిపై శతకం రాసి అంకితమిచ్చాడు నాగేశ్వర దాసు .ఇల్లు వదిలిన ఎనిమిదేళ్ళకు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు .మర్నాడే దాసు గారబ్బాయి అకస్మాత్తుగా చనిపోయాడు .హరి భజన చేస్తూ పుత్ర శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్లి ఖననం చేసి ,నిర్విచారంగా ఇంటికి తిరిగి వచ్చాడు దాసు .బంధువులు ఓదారుస్తుంటే ‘’రుణాను బంధ రూపేణ పశు పత్ని సుతాలయః ‘’అన్న వాక్యం బోధించి ,రామనామం చేయించాడు .

  ఒక సారి తండ్రి తద్దినం రోజున భోక్తలను పిలవటానికి వెడుతుంటే ,ఒక బీద వర్తకుడు తనషాపులోని చెన్నూరు పుట్నాలను ఇస్తే ,తింటూ ,పురోహితుడు ధర్మ సూరి ఇంటికి వెళ్లి తద్దినానికి ఆహ్వానిస్తే వినీ విననట్లు నటించి ‘’దాసుగారు ఏదో భుజిస్తున్నారే ?”’అన్నాడు .’’తడవర్తివెంకయ్య శ్రేష్టిభక్తితో సమర్పించిన’’ తప్త చణక శకలాలు ‘’భక్షిస్తున్నా. ఇవాళ మానాన్న గారి ఆబ్దికం .భోక్తకు రమ్మని ప్రార్ధన ‘’అన్నాడు .’’తండ్రి తద్దినం రోజున కొమటిచ్చిన  సెనగపప్పు తింటూ నన్ను భోక్తకు పిలుస్తావా ?నేనే కాదు ఊళ్ళో ఏ బ్రాహ్మణుడు మీ ఇంటికి  భోక్త గా రాడు’’అని కటువుగా చెబితే బ్రతిమాలినా వినిపించుకోకపోతే ,చేసేది లేక ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పి వంట చెయ్యమన్నాడు రామాజ్ఞతో అంతా సవ్యంగా జరుగుతుందని భరోసా ఇచ్చాడు దాసు .ఆమె అలాగే అని వంట చేసింది .ఇంతలో ఇద్దరు దూరాధ్వగులైన-అంటే దూర దేశం నుంచి వచ్చిన బాటసారు లైన  బ్రాహ్మణులు వస్తే వారినే భోక్తలుగా నియమించి తద్దినం పూర్తి చేశాడు దాసు .ఇలాంటి అతి మానుష కార్యాలు చేసిన భక్త నాగేశ్వర దాసు 72వ ఏట పునరావృత్త రహిత శాశ్వత బ్రహ్మలోకం చేరారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమెరుగని మహాభక్తులు -1 1-కోటం రాజునాగేశ్వర దాసు -1

మనమెరుగని మహా భక్తులు  -1

1-కోటం రాజు నాగేశ్వర దాసు -1

భాస్కర మంత్రి శాయమాంబ లకు పుత్రుడు కోటం రాజు నాగేశ్వర దాసు చిన్నప్పుడే తల్లీ తండ్రీ చనిపోయారు .పోషించే వారు ఎవరూ లేకపోవటం తో సదా చార సంపన్నుడు రామభక్తుడు ఎల్లేపెద్ది పాపన్న శాస్త్రి తీసుకొని వెళ్లి పెంచాడు .పరమ సాధ్వి అయిన అతని భార్య సుబ్బ మాంబ పిల్లాడిని చాలా ప్రేమగా పెంచింది .ఒక ఏడాదికి అ దంపతులకు ఒక కొడుకు కూతురు పుట్టారు .ఇదంతా నాగేశ్వరుని  చలువే అని పొంగిపోతూ మరింత జాగ్రత్తగా నాగేశ్వరదాసును  పెంచారు .

  అయిదవ ఏట నే బడిలో వేశారు .లౌకిక విద్యలపై ఆసక్తి లేక నాగేశ్ ఒకపూటమాత్రమే బడికి వెడుతూ ,రెండో పూట ఏకాంతం గా ధ్యానం చేసేవాడు .ఎవరితోనూ ఆడుకోకుండా ముద్దుమటలతో పెంచినవారికి ఆనందం పంచకుండా నిరంతర భగవధ్యానం లో గడిపే అతడిని చూసి పాపన్న పిచ్చి పట్టిందేమో నని అనుమానం తో మందూ మాకు ఇప్పించాడు .ప్రయోజనం శూన్యం .ఎక్కడెక్కడో తిరిగే అతడిని వెదికితెచ్చి భోజనం పెట్టేది తల్లి .ఎనిమిదవయేట ఉపనయనం చేశారు .సంధ్యావందనం చేయటానికి గురువు వద్దకు పంపిస్తే ,గురువు సుబ్బావధానులు కూడా శ్రద్ధగా కూర్చోబెట్టి సంధ్యావందనం చేయించేవాడు .ఆమంత్రాల అర్ధం చెప్పమనేవాడు ఇప్పుడు కాదు అని ఆయన అంటే అర్ధం లేని చదువు వ్యర్ధం అని అంటే అర్ధ తాత్పర్యాలు బోధించేవాడు .ఒకరోజు ‘’అన్ని వేళలా దేవుడిని స్మరించేవాడు పవిత్రుడు కదా?’’అని అడిగితే ఆచారాలు పాటించకపోయినా ,తననే నమ్మితే అతడే సదా చారం కలవాడని కృష్ణ పరమాత్మ చెప్పాడని గురువు వివరించాడు .మరో సారి భగవన్నామ జప మహా భాగ్యం ఉంటె మంత్రాలతో పని లేదనీ చెప్పాడు .ఆమాటకు చిరునవ్వు తో సంధ్యావందన మంత్రాలు పూర్తిగా చెప్పమని కొరగా ఆశ్చర్యం  తో నేర్పాడు .ఆకాశాత్పతితం తోయం ‘’శ్లోకానికి తాత్పర్యం అడిగితె చక్కగా వివరించాడు గురువు .ఇక తనకు మంత్రాలతో పని లేదని చెప్పి ,అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగేశ్వరుడు .ఈ విషయమంతా వెళ్లి పాపన్న శాస్త్రికి గురువు చెప్పేశాడు

  నిత్యం సంధ్యావందన జపహోమాలు చేసే పాపన్న శాస్త్రి  రోజూ ఆధ్యాత్మ రామాయణం పారాయణం చేసేవాడు .ఒక రోజు దానికోసం వెదికితే కనపడకపోతే ‘’పిచ్చినాగన్న పనే ‘’అయి ఉంటుందని కొడుకునుపంపి వెదికింఛి నాగేశుని ఇంటికి పిలిపి౦చి ఆపుస్తకం ఏమైంది అని అడిగితే తనదగ్గరున్న సంస్కృత తాళపత్ర గ్రందాన్నీ ,దానికి తెలుగులో పద్యరూపంగా అనువాదం చేసిన కొత్త రచనను తండ్రికిచ్చాడు .రెండవదాన్ని ఎవరు రాశారని అడిగితే‘’శ్రీరామ చంద్ర మూర్తి ‘’అని బదులిచ్చాడు .అప్పుడు అతడి పరమభక్తికి సంతోషించి అతడి పద్యానువాదానికి అబ్బురపడి గట్టిగా ఆలింగనం చేసుకొని ఆనందించాడు శాస్త్రి .ఎంతకాలం నుంచి రాస్తున్నావు ?’’అని అడిగితె ‘’నిన్న రాత్రి రామాజ్ఞ అయినప్పటి నుంచి ‘’అన్నాడు దాసు .పాపన్న ఆన౦దానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది .

  ఒకరోజు నాగేశు తండ్రితో ‘’బాల అయోధ్య కాండలు పూర్తయ్యాయి .అరణ్యకాండ రాయాలి.దానికి దానికి నాలుగు రోజులు ఏకాంతం  కావాలి .మన ఇంట్లో ఒక గదిలో నేను కూర్చుని రాస్తాను .ఎవరూ వచ్చి నన్ను ఆటంక పరచవద్దు. నాకు వీలైనప్పుడు వచ్చి భోజనాదికాలు చేస్తాను. అనుజ్ఞ ఇవ్వండి ‘’అని కోరాడు .అలాగే అని ఒకగదిలో అతడిని ఏకాంతంగా ఉంచి అతనికోరికప్రకారమే గదికి బయట తాళం వేసి ముద్రకూడా వేసి రోజూ పని చేసే న్యాయస్థానికి వెళ్ళాడు పాపన్న శాస్త్రి .మూడు రోజులు గదిలోనుంచి బయటకు రాలేదు దాసు .శాస్త్రి కూడా ఏమి జరుగుతోందో అనే ఆందోళనతో మూడు రోజులూ గడిపి నాలుగవ రోజు ఉండబట్టలేక తలపు బద్దలు కొట్టాలనే ప్రయత్నం లో ఉంటే స్నేహితుడు వచ్చి వారించి ఇంకొక్క రోజు ఆగమని చెప్పాడు .సరే అన్నాడు శాస్త్రి .నాలుగవరోజు అసలు నాగేశు బతికి ఉన్నాడో లేదో అనుమానం నాలుగురోజులనుంచి భోజనం లేదని ఆరాటం తో గది తలుపులు బద్దలు కొట్ట టానికిసిద్ధమయ్యారు .ఇంతలో లోపల గొళ్ళెం తీసిన చప్పుడు వినిపించింది .నాగేశ్వరుడు కన్నీరు కారుస్తూ రెండు గ్రంధాలను చేత్తో పట్టుకొని బయటకు  వచ్చాడు .కొత్త గ్రంధాన్ని పరిశీలించి చూడగా ఆరణ్యకాండ పూర్తయినట్లు కనిపించి అందరూ అతడిని కావలించుకొని ఆనంద బాష్పాలు కార్చారు శాస్త్రి నాలుగు రోజులనుంచీ భోజనం కూడా చేయలేదు .ఆదుర్దాతో .కొడుకును గట్టిగా ఆశ్లేషించి ‘’నాయనా నాలుగు రోజులనుంచి తిండిలేకుండా ఎలా ఉన్నావు ?’’అనిఆడిగితే ‘’రామ చంద్ర మూర్తి  అరణ్యవాస విషయాలను వెల్లడిస్తూ దుఖాన్ని ఆపుకోలేక పోవటం చేత  దాన్ని రాసే నేను కూడా దుఖం ఆపుకోలేక రచన సాగక అన్నపానీయాలపై ఆసక్తే లేకుండా పోయింది ‘’అని చెప్పగా అతడి భక్తికి శ్రీరామ కరుణా కటాక్షాలకు ఆశ్చర్యపోయారు .అతడికి చక్కగా తలంటి స్నానం చేయించి ,మంచి పిండివంటలతో భోజనం తయారు చేయించి అందరూ తృప్తిగా భోజనంచేశారు .

  నాగేశ్వర దాసు రామాయణం మొత్తం తన 13 వ ఏటనే రాయటం పూర్తి చేశాడు .కృష్ణా సాగర సంగమం దగ్గర మొరుతోటలో వేంచేసిన  శ్రీ ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న శ్రీ రంగేశునికి కృతి సమర్పణ చేయాలని భావించి ,ఒక శివరాత్రి నాడు తలిదండ్రులు బంధు మిత్రులతో ఆలయం లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ,అక్కడి పూజారులు అనుమతించలేదు .ఏమాత్రం అవమానంగా భావించకుండా ముఖమండపం చేరి ముక్తేశ్వర స్వామిపై   పద్యాలు  నిండు భక్తితో  చెప్పాడు

image.png

 –

image.png

పద్యాలు పూర్తికాగేనే ముక్తీశ్వర స్వామి లింగ రూపం లో దాసు దోసిట్లో ప్రత్యక్షమయ్యాడు .దాసు పరవశంతో పరమానందంగా నృత్యం చేశాడు .ఆలయం లో లింగం కనిపించక పూజారులు కంగారు పడుతుతూ బయటికి వచ్చి చూసి విషయం తెలిసి దాసుపాదాలపై వ్రాలి క్షమించమని  కోరి లింగాన్ని యధాస్థానం లో ఉండేట్లు చేయమని దాసును ప్రార్ధించారు

image.png

అని పద్యం చెప్పారు దాసు .ఆలయ పూజారులు సగౌరవంగా దాసును అతని తలిదండ్రులను అందరినీ  గర్భాలయం లోకి ఆహ్వానించి  ఉచితాసనాలు ఏర్పాటు చేసి గౌరవించారు .తన ఆధ్యాత్మ రామాయణ తెలుగు అనువాదాన్ని నాగేశ్వర దాసు ముక్తేశ్వర సన్నిధానం లో ఉన్న శ్రీ రంగేశునికి  సభక్తికంగా అంకిత మిచ్చాడు .

ఆధారం –శ్రీ పంగులూరి వీరరాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లినాథ సూరి వ్యక్తిత్వం  

మల్లినా సూరి వ్యక్తిత్వం

మల్లినాథుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ,మహా విద్యా వేత్త .సంస్కృత భాషలోని ప్రతి శాఖ లోనూ అపార పాండిత్యజ్ఞాన సంపన్నుడు .ఆయన రాసిన వ్యాఖ్యానాలలో ఉటంకించిన అనేక రచనలు రచయితలను పరిశీలిస్తే ఎన్ని రచనలు చదివాడో ఎంతమంది కవులను అధ్యయనం చేశాడో తెలిసి ఆశ్చర్యపడతాం .ఆ రచనలు ఆకవులు మనమెప్పుడూ కనీ వినని వారే .సూరి రచనలను మనం క్రమంగా అధ్యయనం చేస్తే ,ఆయన పండిత లోకం లో సాధించిన క్రమానుగత అభి వృద్ధి ,పొందిన గుర్తింపు తెలుస్తుంది.ఆయన మొదటి వ్యాఖ్యానం సంజీవని లో సూరి తనను మల్లినాథుడు అని మాత్రమే చెప్పుకొన్నాడు యే బిరుదులూ పేర్కొనకుండా.శిశుపాల వధకు వ్యాఖ్య రచించే నాటికి సూరి మహోపాధ్యాయ ,సుధీ అయ్యాడు .భట్టి కావ్య  వ్యాఖ్యానం లో సుధీ అని చెప్పుకోన్నాడే కాని అంతకు ముందు చెప్పుకొన్న కవి అనే మాట వదిలేశాడు .తప్పుడు వ్యాఖ్యానాలు రాసిన తనకు ముందున్న వ్యాఖ్యాతలను ఆయన వదిలిపెట్ట లేదు ఉతికి ఆరేశాడు .కాని ఆయన ఆరాధ్యకవి కాళిదాసు లాగా సూరి మహా వినయసంపన్నుడు..తనకున్న ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు .

  మల్లినాథుడు ‘’రఘు వీర చరిత  ‘’వంటి కావ్యాలు రాశాడు .అది అలభ్యం .ఆయన రాసిన కవిత్వ మేకాక ,తానూ రాసిన వ్యాఖ్యానలన్నిటిలో రఘు వంశం లోని మొదటి సర్గలోని శ్లోకాలు ఉదాహరించాడు .ఏకావలి లో చంద్రోదయం లో తన శ్లోకాలే ఉదాహరణ గా చెప్పాడు కూడా. సూరి లోని మహా విద్వత్ వ్యాఖ్యాత తనలోని కవిత్వానికి నీడ అయ్యాడేమో ?

  మల్లినా ధనాథుడు  దురాశాపరుడు ,అత్యాశా పరుడు కానే కాదు .అత్యంత పవిత్రుడు తన నడవడిలో ,కార్యక్రమాలలో కూడా . సూరి రచనలలో ఎక్కడా మనకు ఆయన సంపన్నుడు అనికానీ ,బీదరికం లో ఉన్నట్లు కానీ సూచన కనిపించదు.మహా దైవ భక్తుడు మల్లినా థుడు  .మానవమాత్రులను స్వప్రయోజనం కోసం  స్తుతించి పబ్బం గడుపుకొనే తత్వమున్న వాడు కానే కాదు .ఏదో ఒక దైవాన్నిహరిని , కానీ హరుని కానీ  కీర్తించే వాడు కూడా కాదు .సూరి రాసిన స్తోత్రాలను పరిశీలి౦చినా ,రఘువంశం మొదలైన ఆయన ఉదాహరించిన శ్లోకాలను పరి శీలించినా ఆయనకు హరి –హర భేదం లేదని ,అర్ధనారీశ్వరం పై ఉన్న ఆసక్తి స్పష్టమౌతుంది  .

 ఆధారం –విద్యా వాచస్పతి ,పండిత రాయ ,సాహిత్య విశారద ప్రొఫెసర్ ఎన్. సి. వి .నరసింహా చార్య (ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత శాఖాధ్యక్షులు )రచించిన ‘’Mallinadha –A study ‘’.లో ‘’Personality of Mallinadha ‘’వ్యాసం . ఈ పుస్తకాన్ని శ్రీ నరసింహా చార్యులవారు  మా మైనేని గోపాలకృష్ణ గారి ద్వారా పరిచయమై ,ఈ గ్రంధాన్ని నాకు 2-11-2016 న దీపావళి నాడు ఆదరంగా పంపారు .వారి రచనల నాధారంగా వారి గురించి గీర్వాణకవుల కవితా గీర్వాణం 2వ భాగం లో రాశాను .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20 ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి 

కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి

వ్యాకరణాచార్య,వ్యాకరణాలంకార విద్యా ప్రవీణ ,శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కళాశాల వ్యాకరణాలంకార శాస్త్రో పాద్యాయులు శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు  1942లో జయాపుర సంస్థానానాధీశ్వరులు ,కళా ప్రపూర్ణ ,సాహిత్య సామ్రాట్ ,డి.లిట్ శ్రీ మహారాజా విక్రమ దేవ వర్మగారి సమాదరణం తో’’ కౌముదీ శరదాగమనం ‘’రచించి ప్రచురించారు .ఈ మహాగ్రందాన్ని పరిచయం చేస్తూ మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ రామానుజస్వామి ‘’భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది కి తెలుగు అనువాదం వ్యాఖ్యానం రాసిన జోగన్న శాస్త్రి గారి పుస్తకానికిముందు మాటలు రాసే అవాశం కల్పించారు .శాస్త్రిగారు ఈ కాలేజీలోనే చదివి ,మద్రాస్ యూని వర్సిటి నుంచి వ్యాకరణం ప్రత్యేక అంశం గా శిరోమణి పొందారు.ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య, అలంకార స్పెషల్ సబ్జెక్ట్ లలో విద్యా ప్రవీణ అయ్యారు .విద్యా వ్యాసంగం పూర్తయ్యాక శాస్త్రి గారు మాతృ విద్య సంస్థలోనే వ్యాకరణ పండితులుగా నియమింపబడి ఎందరో విద్యార్ధులకు వ్యాకరణం కరతలామలకం చేశారు .వ్యాకరణం ను చాలా ఇష్టంగా దాదాపు పావు శతాబ్దం పాటు బోధించిన అనుభవం వారిది .కనుక జోగన్న శాస్త్రి గారుసిద్ధాంత కౌముది పై వ్యాఖ్య రాయటానికి  సర్వ విధాలా అర్హులే .సంస్కృత వ్యాకరణం అంటే వ్యాకరణం మాత్రమే కాక ,ఫైలాలజి, ఫిలాసఫీ కూడా కలిపి ఉండే మహాద్భుతం .పాణిని వ్యాకరణ సిద్ధాంతాలను సులభతరం చేయటానికి చాలామంది ప్రయత్నించినా ,భట్టోజీ దీక్షితుని సిద్ధాంత కౌముది అన్నిటికంటే మిన్న .దాదాపు ఒకటిన్నర శతాబ్దాలుగా వ్యాకరణం లో అనుభవం సాధించటానికి సిద్ధాంత కౌముది మాత్రమె కరదీపికగా ముందు ఉంది .కనుక దీనిపై కొత్తగా వ్యాఖ్యానం రాయాల్సిన అవసరం ఉందని గ్రహించి దానికి పూనుకొన్నారు శాస్త్రి గారు .’’I trust many scholors  will follow his foot steps  and augment in Telugu literature in various ways .His attempt is laudable ‘’ అని ఆంగ్లం లో ప్రశంసించారు .

మద్రాస్ యూని వర్సిటి తెలుగు హెడ్ శ్రీ కోరాడ రామకృష్ణయ్య ‘’తెలుగులోని వ్యాకరణ పుస్తకాలన్నీ పాణినీయం ను అనుసరించి రాసినవే .’’In order  to master the grammatical    principles of their own language shastri ‘s SHARADAgaMANA ‘’Supply a long felt  necessity ‘’ఇలాంటి సాంకేతిక పుస్తకాలు తెలుగులో రాయటం,ప్రచురించటం అత్యంత సాహసంతో కూడిన పని దాన్ని సుసాధ్యం చేసిన జగ్గన్న శాస్త్రి అభినందనీయులు ‘’అన్నారు ఆంగ్లం లో .

చిట్టి గూడూరు నారసింహ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులవారు (ఎస్టిజి వరదాచార్యులు )’’దుర్బోధకమైన కౌముదిని విద్యార్ధులకు కరతలామలకం గా రాసిన శాస్త్రిగారు అభినందనీయులు ‘’అన్నారు .ఆంద్ర యూనివర్సిటి తెలుగు లెక్చరర్ విద్వాన్ గంటి జోగి సోమయాజులు ‘’ఈకాలం లో ఇలాంటి గ్రంధం రావటం చాలా సంతోషంగా ఉంది .ఆంద్ర భాష అధ్యేతలకు ఇది గొప్ప సహాయకారి’’అన్నారు  .కళాప్రపూర్ణ ,శాస్త్ర రత్నాకర ,మహారాజా సంస్కృత కళాశాల హెడ్ పండిట్ బ్రహ్మశ్రీ తాతా సుబ్బారాయ శాస్త్రి ‘’దీక్షిత సిద్ధాంతాలను అవగతం చేసుకొనే వారి అరచేతిలో మాణిక్యం ఇది .విశ్వ విద్యాలయ పరీక్షలలలో సాహిత్య విద్యా ప్రవీణ ,వ్యాకరణ విద్యా ప్రవీణ కక్ష్యలవారు దీని ద్వారా కౌముదిని తేలిగ్గా వంటపట్టించు కోగలుగుతారు ‘’అని మెచ్చారు .మహామహోపాధ్యాయ ,కళాప్రపూర్ణ ,కవిరాజ, కవి సార్వభౌమ ,ఆంద్ర వ్యాస ,అభినవ శ్రీనాధ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ‘’ఇంతవరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు ,శాస్త్రిగారుసుబోధకం గా రాశారు .మిగిలిన భాగాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తారని భావిస్తాను ‘’అని ఆశీర్వదించారు .ఆంద్ర యూని వర్సిటి విశ్రాంత ఆంద్ర ఉపన్యాసకులు శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రి ‘’ఆంద్ర భాషలో తత్సమ భాగం ఎక్కువ అవటం ,తెలుగు వ్యాకరణాలు పాణిని సంప్రదాయం లోనే ఉండటం వలన సిద్ధాంత కౌముది విషయాలను సులభతరంగా తెలియ జేయటం వలన శాస్త్రి గారి రచన పరమ ప్రామాణికం గా ఉంది ‘’అని కితాబిచ్చారు .

విజయనగర మహారాజ సంస్కృత కాలేజి సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీ ఘండి కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘’గ్రంధ నిర్మాణమే కాక శాస్త్రిగారు సౌజన్య,సౌశీల్యాది గుణ సంపన్నులు .ఈ రచన నిరుపమానం .సంస్కృత భాషలోసర్వజ్ఞ శ్రీ మాధవాచార్యుల వ్యాఖ్యాన శైలి ఇందులో ఉన్నది .మాధవాచార్యులు ఏది రాసినా గురువు అవసరం లేనట్లే శాస్త్రి గారి ఈ రచన కూడా దానికి దీటుగా ఉంది ‘’అని మనస్పూర్తిగా మెచ్చుకొన్నారు .

శ్రీ జగ్గన్న శాస్త్రి గారు తన అభిప్రయాన్ని ఇలా చెప్పారు ‘’శాబ్దిక సార్వ భౌముడు భట్టో జీ దీక్షితులు పాణినీయ వ్యాకరణ పాల సముద్రాన్నితన ‘’ప్రతిభా మందరం’’ చేత మదించి సారాన్ని ‘’వ్యాకరణ సిద్ధాంత కౌముదిగా రాశాడు  .దీనికి ముందు కాశిక మొదలైనవి లోకం లోప్రచారం లో ఉన్నాయి .వాటిలో ప్రకరణ విభాగాలు లేకపోవటం తో అర్ధం చేసుకోవటం కష్టంగా ఉండేది .వీటికి భిన్నంగా కౌముది సునాయాసంగా అర్ధమయేట్లు ఉంది .ఇది వ్యాకరణ జ్ఞానం కావాలనుకొనే వారు తప్పక చదవాలిసిన గ్రంధం .విద్యా ప్రవీణ శిరోమణి భాషా ప్రవీణ విద్వాన్ ,ఎంఏ పరీక్షలకు ,ప్రభుత్వ ఎంట్రన్స్ పరీక్షలకు పాఠ్య గ్రంథం గా ఉన్నది .అందుకని అన్నిభాషలలోకిఅనువాదం పొందింది .మహా రాజా విక్రమ దేవ వర్మగారు నన్ను దాన్ని తెలుగులో రాసి విద్యార్ధులకు ఉపయుక్తం చేయమని కోరగా రాశాను .నాగ్రంధముపై అమోల్యా భిప్రాయాలు అందించిన విద్వత్ వరేణ్యులకు ,ముద్రణ చేయించిన రాజావారికి కృతజ్ఞుడను ‘’అని వినయంగా శాస్త్రి గారు చెప్పారు .

గ్రంధాది లో సంస్కృత శ్లోకాలు శ్రీ మేధా దక్షిణా మూర్తి కి ముందుగా సమర్పించి ,తర్వాత గురువు నౌడూరు  వేంకట శాస్త్రి గారిని స్మరించారు .తర్వాత శ్రీ  తాతాసుబ్బారాయ శాస్త్రి గారిని ప్రస్తుతించారు .తర్వాత తల్లి,  తండ్రి అయిన వెంకమాంబ ,సోమేశ శాస్త్రి గార లకు వందన సమర్పణ చేశారు .’’ అప్పల్ల వంశ జలధి సోమం సోమేశ శాస్త్రిణ౦-వే౦క మార్ధాంగ రుచిం వందే మత్పితరం సదా ‘’ ఆ పిమ్మట విక్రమ దేవవర్మ మొదలైన వారికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .’’జోగన్న శాస్త్ర్యభి జ్ఞాత నామా రాజేశ్వరీ ప్రియః –పాణిన్యాది మునీన్నత్వా శబ్ద శాస్త్ర ప్రవరకాం ‘’అని తన సంగతి చెప్పి పాణిన్యాదులకు నమస్కరించారు .చివరగా –

‘’శబ్ద శాస్త్ర వివిత్సూనాం కుర్వేహ ముపకారకం –వైయాకరణ సిద్ధాంత కౌముదీ శరదాగమం ‘’

‘’పద క్లేశ మహా మేఘైశ్చన్నేయం దైక్షితీ కృతిహి- చకాస్తు కౌముదీ దానీం శరదాగమ  సంగతాః’’

ఇంతకంటే శాస్త్రిగారి జీవిత విశేషాలు అందు బాటులో లేవు .ఇందులో సంజ్ఞాప్రత్యయ ప్రకరణం నుంచి స్త్రీ ప్రత్యయ ప్రకరణం వరకు 14ప్రకరణాలు 534శ్లోకాలో ఉన్నాయి .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-20-ఉయ్యూ

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంద్ర మహా భక్తవిజయ కర్త- .శ్రీ పంగులూరి వీర రాఘవుడు

సుమారు 1957లోనే   ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’అనే అమూల్య రచన చేసినవారు శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారు .ఈ పు స్తక౦ పై రెడ్డిపాలెం ఆనందాశ్రమానికి చెందిన యోగి పుంగవులు  శ్రీ లక్ష్మీ కాంత యోగి  ఇలా వివరిచారు-‘’ఇండియాలో ఇతర దేశాలలో మహా బుద్ధిమంతులు అక్కడి మహా భక్తుల జీవిత విశేషాలను విశాల దృక్పధం తో రాశారు.అవి దివ్య జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి .వీటి వలన భక్తీ జ్ఞాన వైరాగ్యాలు కలుగుతున్నాయి .ఆంద్ర దేశం లో అలాంటి మహా భక్తుల చరిత్ర రాయటానికి ఎవరూ సాహసించలేదు .పంగులూరి వారు ముసలితనం లో అలాంటి రచన 80 సంవత్సరాల వయసులో చేసి ధన్యులయ్యారు ‘’.రచయిత ఈపుస్తక రచనలో తన ఉద్దేశ్యాన్ని ‘’మనశ్శక్తిని ఆత్మ శక్తిగా మార్చగలవి కర్మ భక్తీ జ్ఞానాలు .ఆత్మ శక్తిని బయటికి తీసినవాడే సమర్ధుడు .భగవంతుడు శక్తి స్వరూపుడు .భక్తుని భావాన్ని బట్టి ఆ శక్తి ఆకారం దాలుస్తుంది .భక్తుడు భగవంతునిలాగా సర్వ సమర్ధుడు .ప్రత్యక్ష భగవంతుడే భాగవతోత్తముడు .భగత్స్వరూపులైన అలాంటి వారి జీవిత విశేషాలు ,వారు చేసినమహాద్భుతాలు వివరించటానికే ఈ పుస్తకం రాశాను.ముద్రణకు ధనసాయం చేసినవారందరికీ కృతజ్ఞతలు . ‘’అని చెప్పుకొన్నారు .ఈ గ్రంథం7-5-1957 న ముద్రణ పొందింది .వెల 5 రూపాయలు మాత్రమే .

 

image.png

  కవిరచయిత అయిన వీర రాఘవుడుగారు బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామ వాసి .శ్రీమాన్ కాశీ  కృష్ణాచార్యులవారు ‘’ఆంధ్రలో అనేక వర్ణాలలో పుట్టి మహా భక్తులైన వారెందరో ఉన్నారు .వారి పేర్లు సుపరిచితం అయినా వారి గురించి పూర్తిగా ఎవరికీతెలియదు.ఈలోపాన్ని పూరించిన వారు పంగులూరి వారు .అలాగే మరి కొందరి జీవితాలను బుర్ర కధలు ‘’గా మార్చి లోకానికి అందించాలి ‘’అని ప్రశంసించారు .గుంటూరుకు చెందినశ్రీ రాగం ఆంజనేయులు-పాండిత్య ,కవిత్వాల జోలికి వెళ్ళకుండా ,అనుభవోపేతమైన వాక్యాలతో భక్తుల చరిత్ర సుబోధకం గా రాశారు .దేశాభిమానం ,ఆత్మ విశ్వాసం ,ఆత్మ గౌరవం కలిగించారు ‘’అన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మహా విద్వాన్,పండిత  శ్రీమాన్ వేదాంతం జగన్నాధా చార్యులు  -‘’ఈపుస్తకం చదువుతుంటే ఆనా౦ద బాష్పాలు కారుతాయి ,ఆనంద పారవశ్యం కలుగు తుంది ‘’అని శ్లాఘించారు

 వీరరాఘవ శర్మగారు మహా భక్త కవి వరేణ్యులు .గుంటూరు లోని శ్రీ రామనామ క్షేత్రం లో వెలసిన శ్రీ కోదండ రామ స్వామి పై ప్రార్ధనా పద్యాలు చెప్పారు .

పోతనతో ప్రారంభించి మొత్తం 43 మహా భక్తుల విజయగాధలను శ్రీ పంగులూరి వీర రాఘవశర్మ గారు ఈ భక్త విజయం లో రాశారు .

వీరి కుమారులు డా శ్రీ పంగులూరి హనుమంతరావు రావు గారు ఈ పుస్తకాన్ని ఆధునీకరించి అందమైన రంగుల ముఖ చిత్రం తో కొంత సరళభాషతో 2014 న శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్ అనే తమ స్వంత సంస్థ  ద్వారా ముద్రించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .నాకు సరస భారతికి ఆత్మీయులైన రావు గారు ఆ నూతన గ్రంధాన్ని నాకు పంపారు .

  ఇంతకంటే వివరాలు నాకు లభించలేదు .

దీపావళి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో

ఇవాళ నరక చతుర్దశి నాడు” మాడున చమురు” ముచ్చట మనుమడు, మనుమరాలితో

 

https://photos.google.com/share/AF1QipNv7UOmrkMXobfvHQzyygf5bsdV-X2Xe7SS589r5UPwP7WLEARczbfD39yL4-UjtQ/photo/AF1QipOZMhYApL8EQK7PJEf-v3hq-8OyXlVA76Rhu8UG?key=bGdYQ1Vmb1laWEJLNUxUa1ZhNDhVVlVFY25CWXJn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి

ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి

కొందరు కవులు, పండితులు ఎన్ని గొప్ప రచనలు చేసినా ,వారిని గుర్తించే వారు ఆకాలం లో ఉండేవారే కానీ తర్వాత కాలం లో వారి గురించి ఆలోచించే వారు కరువైపోతున్నారు .అలాంటి మహా కవి పండితులలో శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకరు .వారు అభినవ గుప్తుని ధ్వన్యాలోకాన్ని తెలుగులో ఆనువదించారు .ఈశా వాస్యోపనిషత్ ,కఠ ఉప నిషత్ లను పద్యాలుగా సులభ శైలిలో ఆంధ్రీకరించిన ప్రతిభా శాలి .వీరు కవి శేఖర ,సాహిత్య విద్యా ప్రవీణ ,ఉభయ భాషా ప్రవీణులు .వేదాంత విమర్శన విశారద బిరుదాంకితులు.విజయనగరం లో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల లో ఆంద్ర భాష ప్రధాన ఆచార్యులు .పై మూడు గ్రంధాలు మాత్రమేకాక కావ్య కంఠముని రచించిన ఉమా సహస్రం కు పద్యానువాదం ప్రభా వ్యాఖ్యా వివరణం కూడా రాశారు .’’అంజలి ‘’అనే శ్రీ రమణ మహర్షికి అంజలి  ఘటించే పద్యాలు రాశారు .’’భామతి ‘’అనే స్వతంత్ర నవ్య కావ్యం రాశారు

  పంతుల వారి విద్యావైదుష్యాన్ని  గురించి మహా రాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల అధ్యాపకులు ,న్యాయ విశారద న్యాయ సుధానిధి ,న్యాయ మీమాంసాలంకార విద్యా ప్రవీణ శ్రీ కొల్లూరి లక్ష్మణ మూర్తి శర్మ అద్భుతం గా ,కొని యాడారు .ఆయన మాటల్లోనే ‘’పంతులు గారు బాల్యం నుంచే కవిత్వం అలవడిన అదృష్ట శాలి .సంగీతం వీరి సాహిత్యానికి మెరుగులు దిద్దింది .అతి కష్ట సాధ్యాలైన ఉపనిషత్తులను,శాస్త్ర గ్రంధాలను సులభ శైలిలో ఆంధ్రీకరించటం వీరి పాండిత్య ప్రకర్షకు ,శాస్త్ర విజ్ఞానానికి గీటు రాయిగా ఉంది .అధ్యాపక వృత్తి కొనసాగిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట రచనలు చేయటం వీరి దైవోపాసనా శక్తిని చాటుతోంది .’’భారతీయ సంస్కృతియే పున రుద్ధరణమే ప్రతి భారతీయుని కర్తవ్యమ్ ‘’అని ఎలుగెత్తి చాటే మహాత్ముల మాటలను వృధా పోనీకుండా ,సంస్కృత భాషలోని అనర్ఘ రత్నాలను తెలుగు భాషలోకి తీసుకు రావాలంటే సంస్కృత పండితులకే సాధ్యం అని,ఆ సమయం ఆసన్నమైందని ఎరిగిన ‘’క్రాంత దర్శి’’   శ్రీ లక్ష్మీ నారాయణ శాస్త్రి .మహాకావ్యాలు ప్రవృత్తి,నివృత్తి దాయకాలు .సహజీవనం ,విశ్వ సౌభ్రాతృత్వం వీటిలో ఉన్నాయి ధ్వని యొక్క వాదాన్ని శంకించే వారి వాదాలన్నిటికి స్వస్తి చెప్పి ‘’ధ్వని ని కావ్యాత్మ’’ గానిరూపించిన సహృదయ విద్వ దగ్రేసరుడు శ్రీమదానంద వర్ధన అభినవ  గుప్తపాదుడు . అందుకే కావ్యాలు రాయాలన్నా ,మహా కావ్యాలు చదివి అనుభూతి చెందాలన్నా ఆయన రాసిన ‘’ధ్వన్యా లోకం ‘’ దానికి ‘’లోచనం’’ అనే వ్యాఖ్య అత్యంత ముఖ్యమైనవి . భగీరధుడు ఆకాశ గంగను హిమవత్పర్వత ద్వారంగా భారతావనిలో ప్రవేశింప జేసినట్లు శ్రీ శాస్త్రి గారు ప్రభా మతి చేత’’ ధ్వనిని’’ నాక లోకం నుంచి ‘’గుప్త లోచనోన్మీలన’’ద్వారా సహృదయ హృదయాలలో ప్రవేశింప జేశారు .పండితులకు మాత్రమె సాధ్యమయ్యే ‘’కర్కశ  గ్రంధులను’’కూడా వీరి ‘’ప్రభా మతి’’సర్వజన సువిజ్ఞేయం చేసింది .ఈ ఆంధ్రీకరణం తెలుగు వారి వాకిట బంగారు తోరణం .ప్రవేశించి నవారికి అంతా కొంగు బంగారమే .శాస్త్రి గారి పద్య ,వచనాలు రెండూ మధుర కోమల ప్రసన్న కాంతి లలితాలే ‘’

  స్వామి శివ శంకర స్వామి వేటపాలెం తీర్దాశ్రమం నుంచి శాస్త్రి గారి ఈశావాస్యోపనిషత్ ‘’ఆంధ్రీకరణం చదివి తమ అమూల్యాభిప్రాయం గా ‘’సామాన్య జ్ఞానం కలవారికి సక్రమ మార్గం లో ఉపనిషత్ సారం గ్రహించాలంటే మంచి అనువాదం తప్పని సరి .ఈ ఉపనిషత్ కు తెలుగులో చాలా అనువాదాలున్నాయి .కానీ శాస్త్రిగారు శంకర భాష్యాన్ని అనువదించటమే కాక ,ఇతర మతాచార్యుల భాష్యాలలోని ముఖ్య విషయాలను కూడా తేట తెల్లంగా చెప్పారు .టీకా కారుల వివరణ కూడా పొందు పరచారు .మూలానికి పదవిభాగ ,టీకా తాత్పర్యాలు సులభ శైలిలో రాశారు .సాహితీ సమితి సభ్యులవటం వలన స్వమతాన్ని కూడా ధైర్యంగా చెప్పారు .త్రిమతా చార్యుల తత్వాన్ని కూడా తెలియ జేశారు .గురువుల వద్ద వివిధ శాస్త్రాలు నేర్చిన శాస్త్రిగారు వేదవేదాంత అలంకార సంగీత శాస్త్రాలనూ క్షుణ్ణంగా  మధించారు .కావ్య రచన లతో పాటు ,గేయ కావ్యాలూ రాశారు .లోచనాది వ్యాఖ్యాన సమన్విత ‘’ప్రభా మతి సహితంగా ‘’ధ్వన్యాలోకాన్ని ‘’పద్య గద్యాత్మకంగా   అనితర సాధ్యంగా శాస్త్రి గారు ఆంధ్రీకరించారు .వేదాంత డిండిమం’’మొదలైన వాటిని గేయాత్మకంగా తెలుగు చేశారు.’’భామతి ‘’మొదలైన స్వతంత్ర పద్యకావ్యాలనూ మహా ప్రజ్ఞతో రాశారు ‘’అని శ్లాఘించారు .ఇది 24-9-1944లో ప్రధమ ముద్రణ ,30-6-1959లో ద్వితీయ ముద్రణ పొందింది .

  శాస్త్రి గారి ‘’ఆంద్ర కాఠకోపనిషత్ ‘’ను ప్రస్తుతిస్తూ విజయనగారసంస్కృత కాలేజి వ్యాకరణ ,అలంకార శాస్త్ర ఉపన్యాసకులు శ్రీ నౌడూరు వేంకట శాస్త్రి ‘’అర్ధ జ్ఞానం తో ఈ ఉపని షత్తును అధ్యయనం చేసి శాస్త్రి గారు ‘’అన్యూన్యాతిరిక్తం గా ఆంధ్రీకరించటం అభినందనీయం ‘’అన్నారు ‘’.The present translation has rendered the original into Telugu and it reads well ‘’అని కీర్తించారు మహారాజా కాలేజి ప్రొఫెసర్ కె.రంగా చారి .విజయనగర ప్రభుత్వ సంస్కృత కాలేజి ప్రధాన ఆంద్ర పండితులు శ్రీ ఆకొండి రామ మూర్తి ‘’శాస్త్రి గారు నాకు బంధువు చిరపరిచితులు కూడా .శాస్త్రి గారు నాకు ఈ అనువాదాన్ని మా ఇంట్లో నాకు చదివి వినిపించారు .అందులోని అమూల్య విషయాలను ఆస్వాదిస్తూ ,ఆకవితామృత రసాస్వాదనను మహా పార వశ్యంగా విన్నాను .ఎక్కడా దోషం కనిపించలేదు .మహా వృద్ధ పండితులు మాత్రమే చేయదగిన సాహస కార్యాన్ని శాస్త్రిగారు అలవోకగా ,అసాధారణంగా ,నిర్దుష్టంగా ఆంధ్రీకరింఛి నందుకు మనసారా అభి నందిస్తున్నాను .ప్రిన్సిపాల్ శ్రీ రామానుజ స్వామి ‘’shastri is proficient in Sanskrit and Telugu .The trans lation gives a good coception of the teaching of SHANKARA .This book alone serve the purpose of enrichingthe Telugu language .Lakshmi Narayana has to be congratu lated on making a real contribution to the Telugu literature and earning the gratituseof Telugu people .’’అన్నారు .ఈ పుస్తకం 1-9-1953న ప్రచురితం .

గ్రంధ కర్త శాస్త్రిగారు తమ గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారికి నిండుమనసుతో కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .అమూల్యాభిప్రాయం తెలిపిన శ్రీ కిళాంబి రంగా చార్యుల గారికి ,ముద్రణ ఖర్చును భరించిన శ్రీ జ్ఞానేద్రాశ్రమానికి ,శ్రీ జ్ఞానానంద రామానందుల వారికి సవినయం కృతజ్ఞతలు ప్రకటించారు .ఈ గ్రంధం 1-5-1935లో ప్రచురితమైనది .

ధన త్రయోదశి శుభా కాంక్షలతో

  మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-11-20

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలు 

దీపావళి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు రేపు 13-11-20శుక్రవారం ధన త్రయోదశి  శుభాకాంక్షలు
                           త్రయోదశి రేపు  సాయంత్రం 4గంటలవరకు ఉంది ఆతర్వాత చతుర్దశి వస్తుంది  తెల్ల వారుజామున చతుర్దశి ఉన్నప్పుడే తలంటి పోసుకొంటారు కనుక తెల్లవారితే శనివారం
  అంటే 14-11-శనివారం తెల్లవారుఝామునే తలంటి పోసుకోవాలి  ఈ రోజే నరకచతుర్దశి .
రాత్రి అమావాస్య ఉన్నప్పుడే దీపావళి అమావాస్య టపాసులు కాల్చాలికనుక ,చతుర్దశి శనివారం మధ్యాహ్నం 1.48 వరకే ఉండి,తర్వాతఅమావాస్య వస్తుంది  రాత్రిగల అమావాస్య ఉంటుంది కనుక 14 వ తేదీ రాత్రికే దీపావళి టపాకాయలు కాల్చుకోవాలి ‘
 మొత్తం మీద 14శనివారం తెల్ల వారుజామున తలంటి,, ఆసాయంత్రం దీపావళి చేసుకోవాలి
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక శోభ 

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక శోభ

కార్తీక మాసం లో శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 16-11-20 కార్తీక శుద్ధపాడ్యమి సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజూ ధ్వజస్తంభానికి కార్తీకదీపాల ఏర్పాటు ,,దీపదర్శనం
17-11-20 మంగళవారం నుంచి ప్రతిమంగళ వారం రాత్రి 7గంటలకు ప్రమిద దీపాలతో దీపాలంకరణ జరుగుతుంది భక్తులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . -గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మ కర్త

image.png
Posted in దేవాలయం | Tagged | Leave a comment

విశ్వ గాయకునికి విశిష్ట నివాళి

గాయకులలో కొందరు బహుళ ప్రజాదరణ పొందితే, అందులో కొందరు బహుముఖ ప్రజ్ఞను చాటితే ,వారిలో  అరుదుగా అతికొద్దిమందిమాత్రమే  ఫలప్రదమౌతారు .అలాంటి అరుదైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం .కర్నాటక సంగీతం లో ఏమాత్రం ప్రవేశం లేనిస్థాయి నుంచి అత్యుత్తమ సంగీత గాయకుడుగా రూపు దాల్చాడు .సంగీత జ్యోతి కాంతులు విశ్వ వీధుల్లో ప్రజ్వరిల్ల జేశాడు .’’రాగాలన౦తాలు నీ వేయిరూపాలు –భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు ‘’అన్న శంకరాభరణం చిత్రం లోని వేటూరి పాటకు నిలువెత్తు గాన జ్యోతి గా భాసింఛి భారతీయ లౌకికవాదాన్ని విశ్వవ్యాప్తం చేశాడు .అలుపెరుగని గాన రవళితో అర్ధ శతాబ్దం తనదైన ముద్ర వేశాడు .అందులో ముప్పై ఏళ్ళు తనకు సాటి ఎవరూ లేరని 40వేల పాటలు 16భాషలలో పాడి  నిరూపించాడు  .వయసు మీదపడుతున్నా యువకోత్సాహం చల్లారలేదు .భావోద్వేగం తో నవ్వు, విషాదం .దుఖం , ప్రేమ ,శృంగారం ఒలికించిన  పాటలు చిరస్మరణీయాలు .అందులో విషాదాన్ని అత్యద్భుతంగా అతని స్వరం ఆవిష్కరించింది ..అమెరికన్ కవి లాంగ్ ఫెలో అన్నట్లు అతని మరణం  మన హృదయాలపై మరణ మృదంగ ధ్వని విన్పించి నిద్ర పుచ్చాయి .గానమే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించిన సార్ధకజీవి బాలు .ఘంటసాల మాస్టారి ‘’పాడుతా తీయగా ‘’ను తానూ అంతగా పాడి, ప్రపంచ దేశాల వర్ధమాన గాయనీ గాయకులచేత గానం చేయించి, భారతీయ సినీ సంగీత లహరి ని ఎల్లలు దాటించి ప్రవహింప జేసిన కారణ జన్ముడు గానగంధర్వ బాలు అనే పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.

   ఈ విశ్వ గాయకుడు ‘’బాలు’’ కు గోదావరి జిల్లా రచయితల సంఘం (గోరసం )అధ్యక్షుడు,కవి కధకుడు, నిత్యోత్సాహి శ్రీ శిష్టు సత్య రాజేష్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల 88 కవులచే ఘననివాళి గా కవితా కల్హారాలు పూయించి  , ‘’గాన గందర్వుడు బాలు ‘’గా చక్కని పుష్పమాల కూర్చి విశిష్ట నివాళి అందింఛి అందరికీ మార్గదర్శి అయ్యాడు .ఇక్కడ 88 సంఖ్య ను’’ దేవతా సంఖ్య’’ అంటే ఏంజెల్ నంబర్ అంటారు .కనుక ‘’సంగీతదేవత’’కూడా ప్రత్యామ్నాయం కావచ్చు .ఇందులోని కవితలు బాలుని విభిన్న కోణాలలో ఆవిష్కరి౦చి అతని బహుముఖ ప్రజ్ఞాశీలతను మనముందుంచుతాయి .’’ఆతను నడిచిన బాట౦తా పాటల పరిమళమే ‘’అని రాదికారాణి అంటే ,అతడిది రసామృతమనీ .అక్షర ప్రతిరూపమనీ ‘’స్వాతి,అతనిపేరులోని అక్షరాలకూర్పుతో రాజేష్ ‘’గమకానికి చిరునామా ,భారత స్వర సౌధం ‘’అనగా. శీనమ్మ’’సంగీతసామ్రాజ్ఞానికి మకుటం లేని మహారాజు ‘’అనీ హావభావ రాగ మనోహరగానమని ముక్కా ,శృతి లయలగతులు మార్చాడని స్వర్ణలత ,’’పాటే మంత్రం ‘’అని రాజ్యలక్ష్మీ ,’’శ్రోతకు స్వరాభిషేకం ,పాటకు పట్టాభి షేకం చేసిన గాన త్రివిక్రమ విక్రముడు ‘’అని పరిమి ,’’ప్రణవ నాదానికి ప్రాణం పోసిన భిషగ్వరు ‘’ డని  వీరమణి  వీర తాళ్ళు  వేశారు ‘’నూతన గళాలకు నడకలు నేర్పిన గానమయూరి ‘’అని శైలజ ,’’ఆగాన లహరికి వెన్నెల జలపాతం వెలవెల బోతుంది ‘’అని మాకే ,’’గాన తేజస్వీ ,పాటల తపస్వీ ‘’అని మంజీత ‘’పాటతో హాయి నింపే శాంత ముగ్ధుడు ‘’అంటూ కవిత,’’సప్తస్వరాల గుప్త నిక్షేపం ‘’అని దుర్గా ,’’ప్రేమికులను ,శ్రామికులను మెప్పించిన గానం ‘’అని ముద్దు ,’’పాటను ఇష్టపడిపాడాలికాని కస్టపడి కాదు ‘’అని సుద్దు చెప్పాడని పద్మావతి ,’’పండిత పామర హృదయనేత పండితారాధ్యుడు’’అంటూ పరాంకుశం ,’’ఒక్కడై  వచ్చి  ఒక్కడై వెళ్లి శూన్యం మిగిల్చాడు ‘’అని  బొక్కేల,,’’గాయక ,నట ,సంగీత దర్శక బాలు ‘’అని రామారావు ,’’వినమ్రతకు నిలువెత్తు నిదర్శనం ‘’అని శైలజ మొదలైన వారంతా తమ మనోభావాలకు కమ్మని కవితా మాలలల్లి  విశ్వగాయకుడు బాలు కు విశిష్ట నీరాజనం పట్టారు .ఈ కవితా కదంబం చక్కగా ఉన్నా చిక్కగా లేక, వదులొదులుగా ఉందేమో అనిపించింది .మంచి ప్రయత్నం. రాజేష్ తోపాటు కవులందరికీ అభినందనలు .

   గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

హాం రేడియో విజ్ఞాన సర్వస్వం

 

హాం రేడియో విజ్ఞాన  సర్వస్వం

ఉయ్యూరు హైస్కూల్ లో నా జూనియర్ ,నా ప్రాణ స్నేహితుడు సూరి నరసింహం తమ్ముడు సూరి శ్రీరామ మూర్తి ,ఢిల్లీ లో టెక్నీషియన్ గా పని చేస్తూ ,వారానికో సారి నాకు చాలా వివరంగా ఇన్లాండ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడు .ఆతర్వాత  ఎమెచ్యూర్ రేడియో అనే హాం రేడియో ను ఇండియాలో వ్యాప్తి చేసే సంకల్పం తో చాలా శ్రమ పడి,స్వయం కృషితో ,తీవ్రమైన అధ్యయనం తో,అధికారులవివిధ దేశాల పెద్దల , పరిచయాలతో దాన్ని సాధించి పయనీర్ అనిపించుకొన్నాడు .అతడు ఉయ్యూరు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి తన హాం రేడియో ప్రగతిని వివరించే వాడు. నాకు అది గ్రీక్ అండ్ లాటిన్ గా, కోతలు గా అనిపించేవి .క్రమంగా అతని గురించి పేపర్లు రేడియో టివి ఇంటర్వ్యులతో అతడి గొప్ప తనం ఏమిటో అర్ధమైంది ఆరేడియో సభ్యులు యెంత విశ్వ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలను ముందే కనిపెట్టి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ముందు చూపుతోసమన్వయము చేస్తూ బాధితులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ ,ప్రభుత్వాల ,ప్రజల ,ప్రజా సంస్థల అభిమానం పొందుతున్నారో అర్ధమైంది అతడిపై ఆరాధనా భావం ఏర్పడి అంతటివాడు నాకు ఆప్తమిత్రుడైనందుకు గర్వమూ కలిగింది .అతడు రాసిన ఆర్టికల్స్ నాకు పంపేవాడు వచ్చినప్పుడు హాం సమాచార విషయాలు తెలియ జేసేవాడు ఫోటోలతో సహా .కృష్ణా  జిల్లా హైస్కూల్స్ ,కాలేజీ లలో దాన్ని పరిచయం చేయటానికి చాలా తంటాలు పడ్డాడు కానీ పెద్దగా ఎవరికీ ఎక్కిన దాఖలా లేదని పించింది అంతా ‘’లైట్ తీసుకొన్నారు ‘’అయినా పట్టు వదలని విక్రమార్కుడుగా ఈ ‘’పొట్టిసూరి’’ అనే  శ్రీరామమూర్తి త్రివిక్రముడై విశ్వ హృదయం లో చిరస్థానం సంపాదించి ,చిర యశస్సు నార్జించాడు .మా ఉయ్యూరు కు ’’ హాం చిత్ర పటం’’ లో ముఖ్య స్థానం కల్పించాడు .ఉయ్యూరు కు చెందిన ‘’కేమోటాలజీ పిత డా కొలచల సీతారామయ్య ‘’ గారిపై నేను పుస్తకం రాసి సరసభారతి ద్వారా ప్రచురించి ఉయ్యూరు కాలేజి లో ఆవిష్కరింప జేసినప్పుడు సూరి అతని భార్య ,సీతారామయ్య గారి బంధువులు కూడా పాల్గొని విజయవంతం చేశారు .మేమిద్దరం ఫోన్ ద్వారా మెయిల్ ద్వారా టచ్ లోనే ఉంటున్నాం .

  నిన్న సాయంత్రం అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చి  సూరి తాను రాసిన ‘’ALL ABOUT AMETEUR RADIO –HAAM RADIYO ‘’ అనే430 పేజీల  ఉద్గ్రంధం నాకు అందజేసి ,నేను ఇచ్చిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడూ తీసుకొని సంతోషించాడు ఒకగంట సేపు తన అనుభవాలు గుది గుచ్చి మాట్లాడాడు .ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడో శాఖా చంక్రమణం చేసి ముగించటం సూరి ప్రత్యేకత .చెప్పిన దాంట్లో సార్వకాలిక సత్యాలు అనుభవాలు అనుభూతులే ఉంటాయి .ఈ మధ్య నేను రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య’’ధారా వాహిక నెట్ లో చదివి బెస్ట్ కాంప్లిమెంట్ కూడా చేసిన సహృదయుడు సూరి .

  ఇప్పుడే అతడిచ్చిన పుస్తకం తిరగేశా .అద్భుతం అని పించింది .అందులో ఆపుస్తకం గురి౦చి, అతని గురించి విలువైన అభిప్రాయాలు రాసిన మాటలలో సూరిని మీకు ఆవిష్కరించి చూపుతున్నాను .పాప్యులర్ హాం ప్రమోటర్ అమెరికా కు చెందిన-  మిస్టర్ గార్డెన్  వెస్ట్’’ఇది అద్భుతమైన పుస్తకం  ,హాం గురించిన విజ్ఞాన సర్వస్వం .ఇండియాలో, ప్రపంచం లోనూ హాం రేడియో గురించి తెలుసుకొనే వారికి గొప్ప’’ కర దీపిక ‘’  అన్నాడు .డాక్టర్ ఫేజెల్ యు.ఆర్.రెహ్మాన్ –చైర్మన్ NIAR ‘’రచయితకు రాజీవ్ గాంధీ రాజకీయ నాయకుడు కాకముందు నుంచి పరిచయం ఉండటం ,హాం రేడియో విస్తరణపైవారిద్దరూ  సుదీర్ఘంగా ఆలోచనలు చేయటం ,ప్రణాళికకలు రచించటం గురించి అత్యంత విస్తృతంగా రాశాడు .దేశ ప్రణాలికా రచయితలూ ,సిద్ధాంత కర్తలు హాం రేడియో చేసిన అద్భుత కృషిని గుర్తించారు ‘’అన్నాడు .జర్మని కి చెందిన ఫ్రాంజ్ బెర్నేట్ ‘’ఈ పుస్తకం ఆసా౦త౦ చదివాను .ఇది ప్రత్యేక పుస్తకం .ఇండియన్ అమెచ్యూర్ రేడియో గురించి సాధికారమైన వివరణ ఉంది .అంకిత భావం తో యువ హామ్స్ఇండియాలో ,ముఖ్యంగా విపత్తుల సమయం లో చేసిన నిస్వార్ధ సేవను ప్రతి బి౦బి౦చి౦ది ‘’అంటాడు .మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు ‘’చాలాకాలంగా సూరి నాకు పరిచయం .నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో –NIAR స్థాపించటం లో అతడు ప్రవక్త –ప్రోటాగనిస్ట్.దీనిద్వారా అతడు ప్రజలకు అందించిన సేవ నిరుపమానం .ఎందరో ప్రజల ధన,మాన ప్రాణ జీవితాలను కాపాడిన నిస్వార్ధ సేవ అతడిది .అతడి సేవలను ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రపంచ వ్యాప్తం గా బాగా గుర్తించాయి .మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్-‘’సూరి అత్యద్భుత గుణాలు మూర్తీభవించిన నాయకుడు .ప్రపంచ ప్రసిద్ధ NIARస్థాపించటం లో ఆయన దూర దృష్టి, విజ్ఞత కనిపిస్తుంది . సూరి ,ఆ సంస్థ ప్రకృతి సిద్ధమైన విపత్తులలో చూపినచచొరవ ,వేలాది మనుష్యుల జంతువుల ప్రాణాలను,ఆస్తులను  కాపాడటం లో చూపిన నైపుణ్యం చిరస్మరణీయం ‘’అన్నారు .’’సాంకేతిక విషయ వివరణలో ఈ గ్రంథం ఒక మహా విజ్ఞాన సర్వస్వమే .క్రిస్టల్ లాడర్ ఫిల్టర్  నుంచి పి.ఎ.ట్రాన్సిస్టర్ దాకా నిర్మాణం ఇందులో వివరంగా ఉన్నది ,సరదాగాఇండియాలో హాం రేడియో గురించి తెలుసుకోవాలన్నా ,ప్రపంచ వ్యాప్త హాం రేడియో గురించి అంతరిక్షం లో హాం సీలు తెలుసుకొని అర్ధం చేసుకోవాలన్న వారందరికీ  ఈ పుస్తక౦ గొప్ప మార్గదర్శి ‘’ అని  గార్డన్ వెస్ట్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు .ఇంతటి విలువైన గ్రంధాన్ని ఎంతో పరిశోధనతో ,పరిశీలనతో రాసిన ఆప్తమిత్రుడు సూరి శ్రీరామ మూర్తి నా దృష్టిలో ‘’హాం సూర్యుడు అంటే హాం సూరి ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీక,  మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు

 

కార్తీక,  మార్గశిర మాసాలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు

సాహితీ బంధువులకు ఆధ్యాత్మిక భావుకులకు దీపావళి శుభాకాంక్షలు –

1-పరమ శివునికి ఇష్టమైన పవిత్ర కార్తీక మాస సందర్భంగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 16-11-20 కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం 10గంటలనుండి –విజయనగర సామ్రాజ్య సంస్థాపనా చార్య , శ్రీ శ్రీ మాధవ  విద్యారణ్య స్వామి సంస్కృతం లో రచించిన ‘’శ్రీ శంకర విజయం ‘’-జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య చరిత్ర- ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .

2-మాధవునికి అత్యంత ప్రీతి పాత్రమైన  మార్గశిర మాసం లో  15-12-20 మార్గశిర శుద్ధ పాడ్యమి మంగళ వారం ఉదయం 10 గంటలనుంచి’’ శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ డా .ఇలపావులూరి పాండు రంగారావు గారి ‘’సహస్ర ధార’’ఆధారంగా ప్రత్యక్ష ప్రసారం

3-కార్తీక మాసం లో 16-11-20 సోమవారం నుండి అంతర్జాలం లో మహాకవి భారవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’ 4 వ సర్గ నుండి దారావాహికగా రాసి అందిస్తున్నానని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది –

             మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి

మా ఇంట్లో ఇవాళ 6-11-20 శుక్రవారం సాయంత్రం ” హాం రేడియో అధినేత ”సూరి శ్రీరామమూర్తి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14 11-మనోహరమైన ట్రిప్

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -14

11-మనోహరమైన ట్రిప్

హోవర్ క్రాఫ్ట్ లో నేనూ అమ్మమ్మ,లెక్స్ ము౦దుసీట్లలో ,వెనక ఏమీ పట్టనట్లు నాన్సీ,ప్రక్కన కూతురు  ప్రక్కన చిన్నపిల్ల వెండీ కూర్చున్నాం .టిక్ నాకు,అమ్మమ్మకు మధ్య కూర్చుంది .టెలోస్ ను దాటి హార్బర్ కు చేరేలోపు ఎల్లీ ఆవలిస్తోంది .హార్బర్ లోపడవలు మహా బాగా అనేకరంగుల్లో ఆకర్షణగా,అనేకరూపాలలో  ఉన్నాయి భూమి మీద వాటి కంటే .అందులోకొన్ని ఈదుతున్న ఏనుగుల్లాగా ,పులుల్లాగా ,సింహాలు తాబేళ్లు ,డాల్ఫిన్స్ కుక్కలు  పిల్లుల ఆకారంలో ముచ్చటగా ఉన్నాయి .దీన్ని ఇదివరకు చూశానునేను. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారని లెక్స్ ను అడిగాను .అంతులేని సముద్రంలో రీఫ్స్అంటే దిబ్బల  మధ్యగా చొచ్చుకు పోతున్నాం అంతటా నీల౦ రంగే .ఆనందంపట్టలేక పిల్లలు కేరింతలు కొడుతుంటే ఆపుతోంది నాన్సీ .నా చెవిలో ‘’బాగున్నాడుకదా’’అంది అమ్మమ్మ ప్రశ్నార్ధకంగా .ఆమె అన్నీ తెలిసింది .ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేది కనుక నేను ముభావంగానే ఉన్నాను .ముసలితనంలోనూ అమ్మమ్మ  అందంగానే కనిపిస్తుంది .

క్రమంగా మా క్రాఫ్ట్ దిగటం మొదలుపెట్టి  మధ్యలో ఉన్న  ఒక అడవిలోని పచ్చగడ్డిపై నెమ్మదిగా లాండ్ అయింది .ప్రక్కన ఒక పూల్, స్ప్రింగ్ ఉన్నాయి .సముద్రం నుంచి పొగ అనంతాకాశాన్ని కప్పేస్తూ ప్రశాంతత కల్పిస్తోంది ..’’హాట్ స్ప్రింగ్స్ అరుదుగా ఉంటాయి.మనకూ నార్త్ అమెరికాలో ఉన్నాయి అక్కడినుంచే ప్రవహించి ఇక్కడికి వచ్చాయేమో ?’’అంది నాన్సీ .’’ఇలాంటిది మనకెక్కడా లేవు ?ఈ స్ప్రింగ్స్ దగ్గర అసాధారణ పుష్పాలున్నాయి ఎక్కడైనా చూశావా .ఇలాంటి మనోహర వాతావరణం ఎక్కడా లేదు అందుకే దీన్ని ‘’భూమి ఒడి’’దిలాప్ ఆఫ్ దిఎర్త్ అంటారు ‘’అన్నాడు లెక్స్  .’’భలే పేరు ‘’అంది అతడివైపు అభినందన చూపుతో అమ్మమ్మ .’’నిజమే .మీరుప్రపంచం  చివర ఉన్నట్లు అనుభూతి పొందుతారు .దానికి ఈ స్ట్రీం మాజికల్ ఎంట్రన్స్ అనిపిస్తుంది ‘’అన్నాడు చిరునవ్వుతో .ఇంతలో ఒక జెట్ ఆ స్ప్రింగ్ ను చీల్చుకొంటూ బయటి రాగా అందరం హాయిగా నవ్వాం .’’మనం అంతా కళ్ళుమూసుకొని ఏదైనా అనుకొంటే వెంటనే తీరుతుంది స్ప్రింగ్ లో నుంచి నీరు చిమ్మినప్పుడు కోరాలి ఇక్కడ ఆచారం అది  ‘’అన్నాడు లెక్స్.నాన్సీ కూడా కళ్ళు మూసుకొన్నది .మళ్ళీ మేము హోవర్ క్రాఫ్ట్ ఎక్కాం.నేను లెక్స్ పక్కనే  కూర్చున్నా అతడిని బాగా గమనించటానికి ..నెమ్మదిగా పైకి లేచి౦ది క్రాఫ్ట్ .నాగురించి తెలుసుకోవాల్సింది ఏముంది అని తన విషయం చెప్పాడు –‘’నేను పెరు లో తెల్లవాళ్ళు నిరంతరం నల్లవారిని బాధపెట్టే ఇండియన్ లు ఉండే చోట ఉంటాను .మానాన్న ఓల్డ్ ఆర్డర్ కు చెందిన చీఫ్టేన్.నాకు గుర్రపుస్వారీ వచ్చుకనుక ఆయన చేసే సుదూర ప్రయాణాలలో నేనూ వెంట వెళ్ళేవాడిని .ఆగుర్రం నాదైపోయింది .స్వారి నా ఇష్టమైంది .ఇక్కడ దాన్ని కోల్పోయాను .మా నాన్న దారుణంగా చంపబడ్డాడు తెల్లగవర్నర్లే ఆ దారుణం చేసి ఉంటారు .ఆయన వాళ్ళు చెప్పినట్లు చేసేమనిషి కాదు . ముక్కు సూటి వ్యక్తీ .అమ్మా నేను ఆయన లేకపోవటాన్ని జీర్ణిం చు కోలేకపోయాం .మావాళ్ళు నన్ను  చీఫ్టేన్ గా ఉండమని బలవంతపెడితే సరే నన్నాను .నేనొక అందమైన తెలివిగల అమ్మాయిని పెళ్ళాడా .మాకు ముగ్గురు పిల్లలు .మా అమ్మాయి పెళ్ళయ్యాక నా భార్య చనిపోయింది .ఆడుఖం ఇంకా నన్ను వదలలేదు .ఆశోకమే ననిక్కడికి తెచ్చింది .మాపిల్లలు పెరిగిపెద్దవారై ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు .ఇక్కడి మనిషి ఒకాయనపరిచయమై నన్నుఇక్కడికి తెచ్చాడు ‘’అన్నాడు లెక్స్.

‘’ఒకప్పుడిక్కడ మనుషులు  ఉండేవారు .ఈ స్వర్గాన్ని వదిలి వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు అర్ధం కాదు ‘’అన్నాను .’’కొందరు భూమి క్రస్ట్ లోకి పనిమీద వెడతారు .ఎక్కువకాలం ఉండరు .టెలోస్ లో   సరైన సెటిలర్స్ ను వెతకటానికి వెల్తారేమో మానవ  గూఢచారుల్లా ఉంటారు  ?’’అన్నాడు లెక్స్.నేనుకూడా ఇక్కడికి ఎలా వచ్చానో అతడికి చెప్పాను .మళ్ళీ మేము ఒక ఐలాండ్ మీద దిగాం .ఇక్కడ పాం ట్రీస్,ట్రాపికల్ ట్రీస్ బాగా  ఉన్నాయి .ఒక దుప్పి మాదగ్గరకు దూసుకొచ్చింది .’’వాటికి మనుషులు అలవాటే .ఇది ‘’జు’  ’పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది .ఇక్కడి జంతువులు అడవి రాజు సింహం ఏనుగులతో సహా  మచ్చిక చేయబడి ప్రమాద రహితంగా ఉంటాయి .డ్రాగన్స్ కూడా చూడచ్చు .ద్రాగన్స్ పేరు చెప్పగానే పిల్లల్లో ఉత్సాహం ఉబికింది .డ్రాగన్స్ కధల్లో ఉంటాయి కానీ నిజంగా ఉంటాయా “’అని అడిగారు .’’అవి రక్తం తాగే మనుషులదగ్గర ఉండవు ప్రశాంతంగా ఉండే చోట్లలోనే ఉంటాయి .అద్భుత జంతువులవి .మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడుచూశాను వాటిని .అవి మిత్ కాని లెజెండ్ కానీ కావు నిజమైన జంతువులే .ఒకప్పుడు వేలాది సంవత్సరాలక్రితం ఉండేవి భూమిపైన.వాటిపై స్వారీ చేసే మనుషులుకూడా ఉండేవారు .కుర్రకారు దాన్ని ఎంచుకోనేవారు .దానికి ట్రెయినింగ్ చాలాకాలం కస్టపడి నేర్చుకోవాలి .భూమిపై వాటిని వేటాడి చంపుతుంటే భయపడి అగర్తాలోకి చేరిసురక్షిత౦గా ఉన్నాయి డ్రాగన్స్ .కొన్నిటిని మచ్చిక చేసి ట్రాన్స్ పోర్ట్ కు వాడుతున్నారు .అవి అందంగా అనేక రంగుల్లో ఉంటాయి కానీ మౌలికంగా అవి అడవి అంత ఆకు పచ్చరంగులో ఉంటాయి .ఇక్కడ వాటిపై సురక్షితమైన  జీన్స్ వేసి ,రైడింగ్ క్లాసులు కూడ   నిర్వహిస్తున్నారు .వాటికి గుర్రాలకున్న తెలివి తేటలన్నీ ఉన్నాయనీ ,ఇక్కడి టెలోస్ మనుషులతో స్నేహంగా ఉంటాయని ‘’అన్నాను .

పిల్లలిద్దరూ ఉత్సాహంగా ఉల్లాసంగా విన్నారు .నాన్సీ కూడా విన్నదికానీ నమ్మటం లేదని అనిపించింది .డ్రాగన్స్ తో తన అనుభవాన్ని  ఒకసారి ఒక డ్రాగన్ పై స్వారీ చేసిన సంగతిని లెక్స్ చెప్పాడు .డ్రాగన్స్ తోపాటు మానవ హింసను భరించలేని మరికొన్ని అరుదైన జంతువులు భూమిని వదిలి ఇక్కడేఆగర్తాలొ క్షేమంగా ఉన్నాయని కూడా చెప్పాడు .

‘’ఎంత మంచి సువాసన వస్తోందో ఇక్కడ చూశారా ‘’అంది అమ్మమ్మ .నాకేమీ కొత్తగాలేదు .’’ఇక్కడ అనేక దేశాల స్పైసెస్ పండిస్తారు .విత్తనాలు చల్లుతారు అవే మొలకెత్తి చెట్లు అవుతాయి .వీటికి కాపలాదార్లు  రూఫ్ లెస్ ఇళ్ళలో చుట్టూ ఉంటారు .ప్రతి ఇంటికీ ఫెన్సింగ్ ఉంటుంది .మేము ఒక ఇంటి ము౦దు ఆగాం .అక్కడ ఓనర్లు బ్రేక్ తీసుకొంటున్నారు .మమ్మల్ని ఆహ్వానించి కాఫీ కాకుండా టీలాంటి డ్రింక్ ఇచ్చారు .తినటానికి కేక్స్ కాకుండా బ్రెడ్ పెట్టారు.అవి స్వీకరించి ప్లాంటేషన్ చూశాం ఎక్కడా కలుపు మొక్కలు లేవు .రైతులు చేతిలో మ్యూజికల్  ఇన్స్ట్రు మెంట్స్ పుచ్చుకొని ,చుట్టూ తిరుగుతూ పాడుతూ వాయిస్తూ వాటికి ప్రేరణ కలిగిస్తున్నారు .పిల్లలు ఫ్లూట్ ,ఆయన గిటార్ వాయిస్తున్నారు .నాన్సీ చెవులు మూసుకొని ఇక ఆపండి అన్నట్లు చూసింది .అమ్మమ్మ కోపంగా చూసింది .

‘’నువ్వు సరిగా ప్రవర్తించలేకపోతే ,హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు .సంగీతం హృదయాహ్లాదంగా ఉ౦దిమాకు .ఆపిల్లల్తో సహా అంతా ఎంజాయ్ చేస్తున్నారు ,డాన్స్ చేస్తున్నారు .పాడుతున్నారు నవ్వుతున్నారు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు చూడు’’అని సివియర్ గానే అంది అమ్మమ్మ .ఎలుగుబంటి తో సహా అడవి మృగాలు చూశాం .ఎలుగు వీపుతట్టాడు లెక్స్ ఆప్యాయంగా. టిక్ పిల్లలతో పాటే ఆన౦దిస్తోంది ‘’వెళ్దామా ?’’అన్నాడు లెక్స్

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-20-ఉయ్యూరు  .

 

.

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

 

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి -గబ్బిట దుర్గా ప్రసాద్  విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -నవంబర్  

1938మార్చి నెల 25న ప్రమీలా నిసర్గి కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది .తల్లి స్వాతంత్ర్య సరయోధురాలు .తండ్రి స్వయం వ్యక్తిత్వమున్న వాడు .ఆకుటుంబం లో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తి  ప్రమీల .1958లో బి.ఎస్. సి .చదివి పాసై ,1960లో ‘’బాచిలర్ ఆఫ్ లాస్’’ చదివి డిగ్రీ పొందింది .’’లా ‘’లో గ్రాడ్యుయేట్ డిగ్రీ 1963లో అందుకొన్నది .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’ అంటే న్యాయశాస్త్ర సిద్ధాంత అధ్యయనం కు (జూరిస్ ప్రుడెన్స్ )అర్హత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది .

  ప్రమీల తన న్యాయ వాద జీవితాన్ని ఎం.ఎల్.చేస్తూనే ,అండర్ గ్రాడ్యుయేట్-ఎల్.ఎల్ .బి.  అయిన తన లెక్చరర్, గ్రాడ్యుయేట్ క్లాసులు బోధించటం పై ధైర్యంగా రిట్ పిటీషన్ వేయటం తో  ప్రారంభంచి౦ది .ఆ తర్వాత అనేక  సంచలనాత్మక ,సున్నితమైన కేసులు చేబట్టి, సమర్ధంగా వాదించి మంచి లాయర్ గా పేరు పొందింది .మహిళలకు వెన్ను దన్ను గా నిలిచి ,వారికి జరుగుతున్న అన్యాయాల నుండి విముక్తి చేయటమే జీవిత ధ్యేయంగా భావించింది .అంతకు కొన్ని దశాబ్దాల ముందు లాయర్ వృత్తి అంటే మగవారికి మాత్రమే అన్నట్లు ఉండేది .ఆ అపప్రధను తొలగించి మహిళా న్యాయ వాదులు కూడాసర్వ సమర్దులే అని చాలెంజి చేసితన వాదనలద్వారా  నిరూపించి,ప్రముఖ లాయర్ గా కీర్తి గడించింది ప్రమీల .అనేక వివాదాస్పదమైన కేసుల్లో మంత్రులకు వ్యతిరేకంగా వాదించి ,అభాగ్యులకు న్యాయం చేకూర్చింది .నాయకుల అన్యాయం ,అవనీతి పై తీవ్ర పోరాటమే చేసి విజయం సాధించిన  మహిళా యోధురాలు లాయర్ ప్రమీల .

   1978లో ప్రమీలా నిసర్గి రాజకీయ అరంగేట్రం చేసింది .మొదటి మహిళా సెనేట్ మెంబర్ అంటే ఎం.ఎల్ .ఏ.గా కర్ణాటక అసెంబ్లీ కి జనతా పార్టీ తరఫున పోటీ చేసి,  ఎన్నికై,చరిత్ర సృష్టించి,1978నుంచి అయిదేళ్ళు 83వరకు ఉన్నది .బెంగుళూరు లో చామరాజపేట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది .1991లో నార్త్ బెంగుళూరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి సి.కె.జాఫర్ షరీఫ్ చేతిలో ఓడిపోయింది .మళ్ళీ 1991లో బెంగుళూరు చామరాజు పేటనుంచి  శాసన సభకు ఎన్నికై 1994వరకు ప్రజా వాణి వినిపించింది .2007లో ప్రమీల రాష్ట్ర మహిళా సంఘానికి అధ్యక్షురాలు –చైర్ పర్సన్ అయింది .2007నుంచి 2014వరకు ‘’ఇండియన్ వుమెన్ లాయర్ ‘’కు ప్రెసిడెంట్ గా పని చేసింది .

  బాల కార్మికులు ,హౌస్ అండ్ రెంట్ కంట్రోల్ ,పని చేసే చోట సెక్సువల్ హింస ,గృహ హింస ,ఖైదీల దుస్థితి మొదలైన సున్నితమైన అంశాలపై రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు అనేక రిపోర్ట్ లను అందజేసింది .అసంఘటిత వర్గాల హక్కులకోసం నిలబడి పని చేసింది .హిందూ ,మహమ్మదీయ చట్టాల వలన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వాలకు తెలియ జెప్పుతూ వాటిలో రావాల్సిన సంస్కరణలను సూచించింది .క్రిమినల్ ప్రొసీజర్ లా ,ఎవిడెన్స్ యాక్ట్ ,సైబెర్ యాక్ట్ ,సమాచార హక్కు చట్టం లలో పునర్విమర్శ –రివిజన్ కు  సిఫార్సు చేసింది .విద్యా కమిటీలో సభ్యురాలై, ఆమె సూచించినవిషయాలు విధానాలను అందరూ అంగీకరించి మెడికల్ ,టెక్నికల్ ,సాధారణ విద్యలలోఅమలు జరిపి ప్రభుత్వం గొప్ప మేలు చేకూర్చింది .విద్యా కమిటీలో ఉండగా, అనేక యూని వర్సిటీలు సందర్శించి ,అక్కడి ఉత్సవాలలో పాల్గొన్నది .శాసన సభ్యురాలిగా ఉంటూ ,ప్రభుత్వం లో చాలా విషయాలలో సామర్ధ్యంగా పని చేసి, తన శక్తి నిరూపించింది నేగి .’’సామ్రాగ్నిస్వ ఉద్యోగ్ ట్రస్ట్’’ కు అధ్యక్షురాలై స్త్రీజన నైపుణ్యాభి వృద్ధికీ ,స్పెషల్ చిల్డ్రన్ ల నైపుణ్యాభి వృద్ధికీ గొప్ప కృషి చేసింది..

  ప్రమీలా నిసర్గి కి సాహిత్య రంగం కూడా చాలాఅభిమాన విషయమే . ’’కామెంటరి అండ్ హౌస్ అండ్ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ కర్ణాటక ‘’అనే అత్యంత విలువైన గ్రంథం రచించింది ప్రమీల. కన్నడ సాహిత్య పరిషత్ తో ఆమెకు విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉన్నది.కర్ణాటక సాహిత్య ప్రముఖులకు ఎందరికో తన చేతులమీదుగా ఘనసన్మానం చేసింది .2018ఆగస్ట్ లో ప్రమీల కు’’ పవర్ బ్రాండ్స్ సంస్థ— ‘’భారతీయ మానవతా వికాస్ పురస్కార్’’అందించి గౌరవించి సత్కరించింది .భారత దేశం లో ప్రమీలా నిసర్గి గౌరవ ప్రదమైన ప్రముఖ ‘’ ఆడ్వొ కేట్ యాక్టి విస్ట్’’గా నూ ,చట్టం ,న్యాయాల సంస్కరణల సంధానకర్త గా చిర కీర్తి నార్జించింది .అసాధారణ రాజకీయ నేతృత్వం ,నిశిత దృష్టి,చాతుర్యం ,సామాన్యమానవుల అభివృద్ధికై అసాధారణ కృషి ,రేపటి పచ్చదనం పై అవిశ్రాంత కృషి ,ఎవరూ అందుకోలేనంత సర్వ సమర్ధత కు చిరునామా ప్రమీల నిసర్గి .

  -గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతికి 15వేల రూపాయలు అందజేత

సాహితీ బంధువులకు శుభ కామనలు -ప్రఖ్యాత అణు శాస్త్ర వేత్త 117వ మూలకం” టేన్నిస్సిన్  ”కనిపెట్టిన ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారు ,వారి శ్రీమతి కృష్ణ మయి గారు  నాలుగు రోజుల క్రితం అమెరికా నుంచి ఫోన్ చేసి, రెగ్యులర్ గా సరసభారతి బ్లాగ్ చదువుతున్నామనీ ,ఎన్నో అమూల్య విషయాలు తెలుస్తున్నాయని అభినందించి సరసభారతి సాహిత్య కృషికి దీపావళి కానుకగా 15 వేల రూపాయలు అందజేయాలను కొన్నామని చెప్పి ,విజయవాడలో ఉన్న మా మేనకోడలు,వారికి అమెరికాలో కుటుంబ స్నేహితురాలు శ్రీమతి ఇందుమతి ద్వారా నా బాంక్ అకౌంట్ కు  ఆడబ్బు ప౦పారని తెలియజేయటానికి సంతోషంగా ఉంది .వారి సౌజన్యానికి ధన్యవాదాలు .వారికెల్లప్పుడూ శుభం జరగాలని,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనీ  నేనూ ,సరసభారతి కోరుతున్నాం ..అందరికి దీపావళి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ 3-11-20

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు 1.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి నవంబరు1.
దేవులపల్లి తన మొదటి రచన ‘కృష్ణపక్షం ‘, లోతన కవిత్వంలోని మెళుకువలు చెప్పడం కోసం బరంపురం నుంచి బళ్ళారి వరకూ ప్రచారం చేసారు,
1921 లో ఉపాధ్యాయుడిగా  వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. (పిఠాపురం స్కూల్లో జీతం 70 రూ., పెద్దాపురంలో 60 రూ.కాకినాడ మెక్లారన్ లో 50 రూ.
తన కవితా ప్రచారం లోఅన్నీ పోగొట్టుకుని మునిగిపోయిన ఆయన్ని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పిలిచి  తక్కువ జీతం అయినా 40 రూ.  మీద ఉద్యోగంలో చేరమని కోరారు, ‘జీతం తక్కువ అని అనుకోవడం లేదు, ఇంతకు ముందు నేను పనిచేసినప్పుడు సంవత్సరానికి పది రూపాయలు తగ్గుతూ వచ్చింది, కాబట్టి నేనే మీకు డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకే చేరను’ అని ఛలోక్తి గా జవాబిచ్చారు.  స్వేచ్చాప్రవ్రుత్తి గల ఆయన  ఏ ఉద్యోగంలోనూ  కొనసాగలేక పోయారు
ఆయన మంచి వక్త, వేల మంది వచ్చినా ఆయన ౩ గం. పాటుచేసే   ప్రసంగం  కదలకుండా వినేవారు. తన  కొడుకు బుజ్జాయి ని  ఒక్క క్షణం వదలకుండా తన సభలకు తిప్పుకుపోతుండడం వలన, బుజ్జాయి చదువుకోలేకపోయారు. తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని బొమ్మలు వేసిన అడవి బాపిరాజును చూసి  బుజ్జాయి చదువుకోలేకపోయారు. తనని ఒళ్లో కూర్చోబెట్టుకొని బొమ్మలు వేసిన అడవి బాపిరాజు ను చూసి  బుజ్జాయి ప్రముఖ చిత్రకారుడు అయారు.
‘పల్లకీ’ అనే భావ కవిత వారి కవితల్లో  తలమానికం. ప్రియురాలి మనస్సులోని ఉద్వేగానికి ‘పల్లకీ’ప్రతీక. బోయీల అరుపుల్లో, పల్లకీ నడకల్లోని  భావమూ, ధ్వనీ కలిసిపోయి, మృదు మధురమైన చిత్రం ఈ కవితలో మన కళ్ళ ముందు నిలుస్తుంది.

1937 లో మద్రాసు ‘ఆకాశవాణి’ వారి ప్రసంగంతో నే మొదలైంది.  ఎన్నో పాటలు, సంగీత రూపకాలు వారివి  ప్రసారం అయాయి.
సినిమా కవి గా గుర్తింపు పొందిన వారు ఐదు వందల పై చిలుకు పాటలు రాసారు. ‘అలలు కొలనులో గల గల మనినా..’ అన్న పాట –  లలిత లలిత లతాంతాలవంటి పద చిత్రాల కూర్పుతో శబ్దమూ భావమూ కలిసి పోయి –  మనల్ని  సమ్మోహితుల్ని చేస్తుంది
‘అసలే ఆనదు చూపు..ఆపై కన్నీరు’ అంటూ శబరి ఆవేదనను వ్యక్తం చేయటంలో ఆయనకు ఆయనే సాటి
1964 లో తన గొంతు బొంగురు పోవడాన్ని గుర్తించారు. అప్పుడు తను రాసిన ఉపన్యాసాన్ని తిరుపతిలో బాలాంత్రకపు రజనీ కాంత రావు చేత చదివించారు. తన 6 7 వ ఏట గొంతు కాన్సర్ ఆపరేషన్ జరగటంతో మూగతనం వచ్చింది, ఉపన్యాసాలను పాలగుమ్మి పద్మరాజు చేత చదివింప జేసేవారు.   చేతిలో కాగితం, పెన్నూ వుంచుకొని 16 ఏళ్ల పాటు తను మాట్లాడ దలచుకున్నది అంతా రాసి చూపించేవారు.  భావకవితా భాస్కరుడు దేవులపల్లి  తను ఎప్పుడూ ‘మహాకవి’ అని అనిపించుకోవడానికి తాపత్రయపడలేదు.
మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…
ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…
కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…
తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..
పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…
పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…
గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…
ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…
ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు.
“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ న…
నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం.”
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…
అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది.
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…
తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…
చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
“పొద్దున్నేఎవరో హానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..
అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు.
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు.
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…మీరే చదవండి .
శాస్త్రిగారికి స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయినందున ఎక్కడి కెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…
ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…
అందులో ఏముందో చదివి మారుతీ రావు గారు లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికిచాలా టైం పట్టింది. ఏం సమాధానం చెవెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…
అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…
చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…
దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…
“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…
నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…
నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడించారు శాస్త్రిగారు…
“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..
“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..
దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”
“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…
ఆ తర్వాత ఇంక బయలు దేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…
“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించూపించారు శాస్త్రిగారు
……“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…’” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…
“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటు న్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”
“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….మన శాస్త్రీ గారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..
సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…
వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం)
“.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు)
“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం)
“..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)
మొదలైనవి…
ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” –కృష్ణపక్షం. పార్వతీశం వేపగారి  సౌజన్యముతో

Posted in సమయం - సందర్భం | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13 10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

 అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -13

10-మళ్ళీకలయికమాదుర్యం కొత్తపరిచయాలు

పగలైనా రాత్రైనా నాన్సీ నాన్ స్టాప్ గా ఆవలిస్తూనే ఉంది .మాన్యుల్ ఒడిలో ఎల్లీ హాయిగా నిద్రపోయింది .ఇంటికి తిరిగొచ్చాక నేను మాన్యుల్, అమ్మమ్మ కలిసి ఎక్కడైనా తిరిగి వద్దామని అనుకొన్నాం .మాన్యుల్ ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు .అయితే మనం ఎప్పుడు ఏది అనుకొన్నా సిద్ధంగా ఉంటాడు .నిద్ర మొహంతో పిల్లను ఎత్తుకొని నాన్సీ నిద్రకు వెళ్ళింది .రోడ్లు ఉండవుకనుక మనమే దారి చేసుకోవాలి .టెలోస్ లో  ఎక్కడికైనా వెళ్లి రాగలనునేను.హోవర్ క్రాఫ్ట్ లోనూ వెళ్ళవచ్చు .ఇంకా అలవాటుకాలేడదుకనుక చేతులు పట్టుకొని గడ్డిలో నడిచాం .సడన్ గా ఆగాం మంచి మ్యూజిక్ వినిపిస్తే .జంటలు ఆనందంగా డాన్స్ చేస్తున్నారు .మహాద్భుతం అంది అమ్మమ్మ .వాళ్ళ స్టెప్స్ మరీ ముచ్చటగా ఉన్నాయి ఆవిడకు .’’సరదాగా ఉంటే మీరూ వెళ్లి కలిసి డాన్స్ చేయచ్చు.అలసిపోతే ఆ చెట్టుదగ్గర కలుద్దాం ‘’ ‘’అన్నాడు మాన్యుల్ .

  మాన్యుల్ ఆ  బృందం లో కలిసిపోయాడు నేను,అమ్మమ్మ  అతడిని అనుసరించా౦ .ఆ డాన్స్ ను మాటల్లో చెప్పలేం .మ్యూజిక్ ని   బట్టి ప్రతివాడూ డాన్స్ చేస్తున్నట్లు అనిపించింది .కాని మొత్తం మీద హార్మని అంటే ఐక్యతకూడా ఉంది .నా వెనకనించి ‘’హలో మళ్ళీ ‘’అనే మాట వినిపిస్తే వెనక్కి తిరిగి చూస్తే నా స్నేహితురాలు  సిసిల్లా అని గుర్తుపట్టి .ఇద్దరం కలిసి డాన్స్ చేశాం  ‘’’’చాలా కాలమైంది ‘’అన్నాను .’’ఇక్కడ కాలం ఉండదు.ఇక్కడ ఎప్పుడూ ‘’ఇప్పటికిప్పుడే ‘’గా ఉంటుంది.అందరం పాజిటివ్ గా ఆలోచిస్తాం .ఈ క్షణాన్నే ప్రేమి౦చి ఆన౦దిస్తాం కనుక .భూమ్మీద ప్రేమ కపటం .అశ్లీలం .మేము పని చేయటం రిలాక్స్ అవటం లో సంతోషపడతాం ఒకరికొకరుసాయపడతాం.అందమైన అరణ్యాలలో విహరించటం ,మేము ప్రేమించే వారితో మనసు విప్పి మాట్లాడుకోవటం ఇక్కడ ముఖ్యం ‘’   అన్నది నవ్వుతూ .నా భుజం వదిలేసి కనిపించకుండా వెళ్ళిపోయింది సిసిల్లా .ఆమె వెంట వెళ్ళా కాని కనిపించలేదు .ఇంతలో మాన్యుల్ వచ్చి నన్ను దూరంగా ఉన్న చెట్టు దగ్గరకు తీసుకు వెళ్ళాడు .అక్కడ అమ్మమ్మ ఎవరో మా కంటే పెద్దాయన తో  మాట్లాడుతోంది .

  ‘’ఈయన ఈమధ్యే వచ్చాడు .వచ్చి రెండు నెలలే అయింది .మీలాగా ‘’అన్నాడు మాన్యుల్ .కొత్తగా వచ్చిన వారితో సమావేశాలు మేము ఏర్పాటు చేస్తాం ‘’నేనూ వస్తా నన్నాను .’’వద్దు నువ్వు వచ్చిన విధానం వేరు .నువ్వు ఆర్నియాల్ , నా పర్య వేక్షణలో ఉంటావు .నీకోసం ప్రత్యేకమైన ప్లాన్లున్నాయి ‘’అన్నాడు మాన్యుల్ .’’సిసిల్ల కూడా అందులో ఉందా?’నేను మళ్ళీ ఆమెను కలుసుకో గలనా ?అని నసుగుతూ అడిగా.చిరునవ్వు నవ్వాడేకాని జవాబివ్వలేదు.చెట్టుకింద అమ్మమ్మ తో మాట్లాడే ఆయన పేరు ‘’లెక్స్ ‘’అసలు అలేగ్జాండర్ ‘’  అని అమ్మమ్మ పరిచయం చేయగానే ,కొద్దిగా వంగి గ్రీట్ చేశాడు .పొడుగ్గా లావుగా తెల్లజుట్టు తో 60ఏళ్ళ వాడనిపించాడు .తెల్లని పళ్ళు బ్రౌన్ కలర్ శరీరం తో ఇండియన్ లేక నేటివ్ అమెరికన్ అనిపిస్తాడు .పొడవైన ముక్కు చూస్తే గ్యారంటీగా నేటివ్ అమెరికన్ అని చెప్పవచ్చు .’’నువ్వు ప్రయాణం చేసినంత దూరం నేను చేయకుండానే ఇక్కడకొచ్చాను ‘’ఆన్నాడు లెక్స్ మంచి ఇంగ్లీష్ లో .’’పేపరులో అగర్తా పేరు వినగానే ఇక్కడికి రావలనిపించి౦ది రావటం అంత తేలికకాదు .వచ్చాను.క్వార౦ టైన్ లో ఉన్నట్లు అనిపించింది .కాని అందమైన ప్రదేశం ఇది ‘’అన్నాడు .’’మనం లోగడ కలిశాం .ఈ కొత్తవాళ్ళు నీతో గడపటానికి ఇష్టపడతారు ‘’అన్నాడు మాన్యుల్ .’’ఇక్కడికి ఈమధ్యే ఒక య౦గ్ విడో ,ఆమెపిల్లా వచ్చారని తెలిసింది .ఎక్కడ వాళ్ళు ?’’అడిగాడు లెక్స్ .ప్రాచీన ఇండియన్ విధానం లో అతడికి అభివాదం చేశాను అతడూ అలాగే చేశాడు .చేతులు కలిపాం .’’వాళ్ళను రేపు చూస్తారు వాళ్ళు సంధించే ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి ‘’అన్నాను నవ్వుతూ .’’ప్రశ్నలంటే నాకు మహా సరదా .నేను ప్రాచీన సంప్రదాయాలున్న చిన్న పెరూవియాన్ విలేజి లో మోడరన్ ఇండియన్ చీఫ్ గా ఉన్నాను ‘’అన్నాడు .’’మీ వూరుగురించి మరిన్ని విషయాలు చెప్పండి .మీరు మా ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది భోజనాలు, నిద్ర అయ్యాక ఆ విషయాలు చెప్పవచ్చు ‘’అన్నాను సరే నని తలూపాడు ..మర్నాడుకలుద్దామని మాన్యుల్ కి చెప్పి వెళ్లాను  .

  అతని ప్లాన్ తో మేము  చూడని  మంచి దర్శనీయ ప్రదేశాల టూర్ చేద్దామను కొన్నాం నాన్సీ సంతోషిస్తు౦దనుకొంటే .ఆమె కుంగిపోయి సోఫాలో కూర్చుని నన్ను ప్రక్కన కూర్చో మన్నది ఎల్లీగార్డేన్ లో ఆడుతోంది .’’పిల్లను స్కూల్లో చేర్చాలి రోజంతా దానితో గడపటంవలన పని చేసుకొనే టైం దొరకటం లేదు.  నాకు ఇబ్బందిగా ఉంది ‘’అంది .’’నువ్వేమీ పెద్దగా పని చెయ్యక్కర్లేదు  .దగ్గరలో స్కూల్ లేదు .చదువుకోవాలంటే లైబ్రరీ ఉంది .అక్కడే చదవటం రాయటం ఉపయోగించే పనులు నేర్చుకొంటారు .ఇది భూమిపైన చదువు లాంటిది కాదు .పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతె పేరెంట్స్ తో మాట్లాడి టీచర్స్  పెయింటింగ్  క్రాఫ్ట్ సింగింగ్ కధలు వగైరా బోధిస్తారు .మొదట నువ్వు మీ అమ్మాయిని లైబ్రరీ టీచర్ కు పరిచయం చేయాలి ‘’అన్నాను .ఆమె ఏడవటం మొదలుపెట్టి నా ఒడిలో ఒదిగిపోయి,తర్వాత అడ్వాన్స్ అయ్యానని గ్రహించి లేచి నిలబడింది .’’నేనంటే నీకు ఇష్టం అనుకొంటాను ఈ కొత్త దేశం లో మనమిద్దరం కలిసి ఉంటె—‘’అంటూండగా ఎల్లీ రాకతో ఆపేసింది అదృష్టవశాత్తు .’అమ్మా నాకో ఫ్రెండ్ దొరికింది ఇంగ్లీష్ బాగా మాటాడుతుంది .ఆఅమ్మాయి పీటర్ పాన్ అంటే నాకిష్టం .ఆమె ఫెయిరీలతో మాట్లాడుతుంది కూడా .మేమిద్దరం చాలా సరదాగా గడిపాం ‘’అంటూ వరద ప్రవాహంగా చెప్పేసింది ఎల్లీ .’’ఎల్లీ !ఇక్కడ మనం ఉండటం లేదు .నీకు తగ్గ స్కూల్ లేదు .నేను చాలా పోగొట్టుకున్నాను ఇక్కడికి రావటం మూలంగా .ఇక్కడ నాకేం నచ్చలేదు మళ్ళీ మనం సియాటిల్  వెళ్లిపోదాం .అక్కడ మన ఇల్లు అలాగే ఉంది .దాన్ని అమ్మకానికి పెట్టలేదు’’అంది కటువుగా.

‘’  అయితే అమ్మా మన కొత్త అంకుల్ టిం నా డాడీ కాదా  .ఆయనిక్కడే ఉంటాడుగా .’’అంటూ కన్నీటి పర్య౦తమై  అన్నది .ఆమెను దగ్గరకు తీసుకొని ..’’పైన భూమి మీద ఉన్న టైం ఇక్కడ ఉండదు .నువ్వు ఇక్కడికొచ్చి ఏడాది అయింది తెలుసా ‘’?అన్నాను  .’’మాన్యుల్ తో మాట్లాడాలి ‘’అంది నాన్సీ కోపంగా .ఆమెపై నాకు ప్రేమ లేదు .ఆమె నా మంచి స్నేహితుడి భార్య .నేనామెకు సాయం చేస్తున్నాననే అనుకొంటున్నాను .కుక్కను తోడుగా తీసుకు వెడదామంటే సరే అన్నానుఅంతే తప్ప ప్రేమ లేదామెపై ‘’.మన అతిధి లెక్స్ తో చిన్న ట్రిప్ ప్లాన్ చేశా౦ .అయ్యాక మాన్యుల్ తో మాట్లాడు ‘’అన్నాను .’’చూసింది చాలు ఇక్కడ ఇంకేమీ చూడాలని లేదు ‘’అంది నిష్టూరంగా .ఎల్లీతో పాటు వచ్చిన చిన్నపిల్ల బయట డోర్ దగ్గరే ఉండిపోయింది .’’పోనీ నేను రానా ??’అందా పిల్ల ఆమె వైపు వంగాను ఆప్యాయంగా  .’’తప్పకుండా మరి నీ పేరు “’?అన్నాను.’’వెండీ .ఇంగ్లాండ్ నుంచి వచ్చాను ‘’అంది.నల్ల జుట్టుతో అందంగా ముద్దులు మూటగట్టుతూ ,నవ్వితే రెండుబుగ్గలు సొట్టలు పడి చక్కని ఆపిల్ల ఆకర్షణీయంగా ఉన్నది .’’అమ్మ చనిపోయాక డాడీ తో ఇక్కడికొచ్చాను .వచ్చి యెంత కాలమైఁ౦దో తెలీదు ఇక్కడ టైం ఉండదుకదా.బహుశా ఎక్కువ కాలం అయి ఉండదు .’’అన్నది .

  నాన్సీ అక్కడినుంచి లోపలి వెళ్ళి ఒక ట్రేలో నాలుగు కప్పుల డ్రింక్ తో వచ్చింది .ఆమె కొంత ఊరట చెంది౦ద నిపించింది ..’’నాకూ రావాలనే ఉంది. ఎల్లీ బాగా ఇష్టపడుతోంది టూర్ కి .చేసే పనేం లేదుకనుక నేనూ వస్తే బాగుండు నని పిస్తోంది ‘’అన్నది వాతావరణాన్ని తేలిక పరుస్తూ .చిరస్మరణీయమైన జర్నీకి ఇది బోణీ అని పించింది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-11-20-ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -12

               9-టెలోస్ ,పరిసరాల టూరు -2

‘’ఫాక్టరీలు ఉండి ఉంటాయి .అక్కడ పని విసుగ్గా ఉంటుంది ‘’అంది నాన్సి .ఇంతలో ఎల్లి ‘’నేను  ఇసుక, నీళ్ళతో తో పేపర్ చేయగలను  ‘’అంది .’’మేము హెంప్ వాడుతాం దానితో మంచి పేపర్ తయారౌతుంది ‘’అన్నాను నేను .’’సూర్యకాంతి నామొహం పై పడి బలే హాయిగా ఉంది కానీ చర్మం నల్లబడుతుందేమో ‘’అంది అమ్మమ్మ .అలా జరగదని చెప్పాను .ఇక్కడి సూర్యుడు ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఆధారం గాఉంటాడు అందులోనుంచి ప్రమాదకర కిరణాలు వెలువడవు ‘’అన్నాను .’’టెలోస్ ఇంతపెద్దదా ??’’అని చేతులు రెండూ బారుగా చాచింది ఎల్లీ .సరిగ్గా కూర్చోమనిచేప్పి ‘’టెలోస్ యెంత పెద్దదో చెబుతా విను .టెలోస్ ఒక దేశం కాదుఅగర్తా రాజ్యంలో   ఒక ముఖ్యనగరం.భూమికింద అంతటా వ్యాపించి ఉంటుంది .ఇక్కడా అనేక దేశాలు ,రాష్ట్రాలు భూమిపైన ఉన్నట్లే ఉంటాయి .’’అద్భుతం ‘’అని అమ్మమ్మ .ఒక క్షణం యంత్రం గాలిలో ఆగి భూమికి దగ్గరలో దిగింది .మావాళ్ళు అనుసరించారు .మేము ఆగిన చోట నీరు మిలమిల మెరుస్తోంది .తీరాన పచ్చగడ్డి భూమి నుంచి ఉన్న చిన్న బ్రిడ్జి  ఒక ఐలాండ్ కు కలిపింది .అది ఆకాశ ,సరస్సులను కలిపినట్లున్నది .పైన నీలిరంగు నుంచి ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ లోకిమారి౦ది . అది అరుదైన వజ్రంలా తరంగాలపై భాసించింది .నిజంగా అంతే.కాళ్ళకు చెప్పులులేకుండా బ్రిడ్జిపై20అడుగులు  నడిచాను  .పచ్చగడ్డి మరోవైపుకూడా  మెరుస్తోంది .ఇకడికి ఇదివరకు చాలాసార్లువచ్చాను కనుక అద్భుత పాలెస్ కు దారి నాకు తెలుసు .చిన్న పెవిలియన్ అంతా పూల సముద్రంగా ఉంది .పైన ఒక ఆర్చి ఉంది .దానిపై ‘’పోర్ధో లోగస్ ‘’అని పేరుంది .ఇది లైబ్రరీకి  వెళ్ళే అతిపెద్ద దారుల్లో ఒకటి .పెవిలియన్ బహు సుందరంగా ఉంది .గోడలు విలువైన రాళ్ళతో అల౦క రింపబడ్డాయి .లోపలున్న స్టెయిర్ కేస్ కింద ఇంటికి దారి చూపిస్తుంది . లోపల చర్చి లాగా ఉంది .అమ్మమ్మా, ఎమిలీ ఆగి చప్పట్లు కొట్టారు .నాన్సీ మాత్రం టూరిస్ట్ లా నిశ్చేస్టు రాలై’’కింద హేడ్స్ కు దారా ?’’అంది నవ్వుతూవ్యంగ్యంగా . నేను ఆనవ్వును ఒప్పుకోలేదు .హేడ్స్ అంటే ఎమిలీకి తెలీదు .అక్కడి జెం స్టోన్ ను తాకుతూ ఆనందం అనుభవిస్తోంది .నాతోపాటే టేక్ కూడా దిగింది కిందికి నా కంటే ముందుగా .దానికి నెమ్మదిగా నడవటం ఇష్టం ఉండదు .అమ్మమ్మ చేయిపట్టుకున్నా కాని ఆవిడా 20ఏళ్ళ పిల్లలాగా ఉత్సాహంగా ఉంది .ఎల్లీ నిపట్టుకొని నాన్సీ నెమ్మదిగా వస్తోంది . పిల్లభయపడుతు౦దనుకొందికాని ఆమే భయపడుతోంది .

  కింద మంచి వెలుతుఋ  నులి వెచ్చగా ఉంది .అందమైన ద్వారం దగ్గర మాన్యుల్ స్వాగతం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు .అందర్నీ ఆప్యాయంగా ఆహ్వానించాడు .ఎల్లీని గట్టిగా హత్తుకొని గాల్లోకి ఎగరేసి పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేశాడు  ఆప్యాయంగా .కిందికి దింపే టప్పుడు ఆపిల్ల అతని మెడను గట్టిగా కావలించి,’’నువ్వూ ,టిక్ నాకుమంచి స్నేహితులు  బాగా ఇష్టం ‘’అంది .మాన్యుల్ ‘’ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ లో ఉన్నాం మనం ఇప్పుడు’’అన్నాడు ఇంగ్లీష్ లో .అమ్మమ్మకూ ఇంగ్లీష్ పై అభిమానం ఎక్కువే స్పానిష్ అయినా ,’’ఇక్కడ  విశ్వం  లోని అన్ని  కాలాల అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి .పుస్తకాల బదులు యాక్టర్స్ మన ప్రశ్నలకు జవాబు చెబుతారిక్కడ  .దృశ్యాలు ప్రదర్శించి సమాధానాలు చెబుతారు మనం అడిగిన వాటికి .కాస్త ఆగండి ‘’అన్నాడు నాన్సీకి కోపం వచ్చి ‘’అసలు పుస్తకాలే ఉండవా .ఐతే లైబ్రరీ పేరు ఎందుకట’’?అంది .’’పుస్తకాలూ ఉంటాయి కాని ఇక్కడ నటన ముఖ్యం .ఏదైనా అడుగు ?’’అన్నాడు .’’మెర్లిన్ అనే వాడున్నాడా అసలు “?లేక పుక్కిటి పురాణమా ?’’అని వెంటనే ప్రశ్నించింది .’’నాతో రండి  ‘’అన్నాడు మాన్యుల్ .పైకి కొన్ని మెట్లు ఎక్కించి రెండువైపులా ద్వారాలున్న విశాల కారిడార్ లోకి తీసుకు వెళ్ళాడు .అదొక ప్రత్యేక లైబ్రరి. ఒకప్పుడు నిజమైన గుహ.. అక్కడ చాలా చిన్నచిన్న స్టేజెస్,వాస్తవాన్నీ ఫిలిం లను కలుపుతూ అంతులేని జ్ఞాన ఖనిలా అనిపించింది .దారులు నెట్ వర్క్ ,గదులు ఉన్నాయి .ఇవన్నీ చెప్పటానికి గైడ్ అవసరం .ఇక్కడ చాలా మంది గైడ్ లున్నారు కొందరు మౌలికంగా ,కొందరు హోలోగ్రామ్స్ గా ఉంటారు .

  ‘’మా వాళ్ళు ఏదో తెలుసుకోవాలని తహతహపడుతారు. మా వాళ్ళు సింబాలిక్ బాంధవ్యం కోరుతారు .సామూహిక జ్ఞానం పొందాలని భావిస్తారు .దీనికి ప్రశ్నలు అవసరమే .అదేఇక్కడ లైబ్రరీ అంటే ‘’అని వాళ్లకు తెలియ జెప్పాను ముఖ్యంగా నాన్సీకి .కిందికి దిగి ఒక దియేటర్ లాంటి దానిలోకి వెళ్లి సీట్లలో కూర్చున్నాం .స్టేజి పైనుంచి మెర్లిన్ మాకు అభివాదం చేశాడు .మెర్లిన్ తాను  నిజంగా మనిషినే ననీ ,చాలా ముఖ్యమైన వాడిననీ ,అందరి గౌరవం పొందిన వాడిననీ ,మంత్రగాడ౦టే  అసూయ అనీ చెప్పాడు .కొన్ని ట్రిక్కులు ప్రదర్శించాడు .ఎల్లీ మురిసిపోయింది .క్షణం లో ఆమె ఒళ్లోఅకస్మాత్తుగా  ఒక తెల్ల కుందేలు పిల్ల వచ్చి కూర్చుని వెంటనే వెళ్ళిపోయింది .

  మెర్లిన్ నాన్సీకి తనజీవిత కధ వివరించి చెప్పాడు.ఆశ్చర్యపోయింది ఆమె. కొన్ని సీన్లు నటించి చూపాడు ,కొన్ని ఫిలిం బిట్లు ప్రదర్శింఛి తన ప్రదర్శన పూర్తి చేశాడు ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్ మెర్లిన్ .’’నేను ఇన్వెన్షన్ కాని ,ఇ౦పోస్టర్ ని కాని కాను .భూలోకవాసులు తెలిసో తెలీకో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు .కాని కొత్త శకం వస్తోంది .కనుక భూలోకం  శుద్ధి చేయబడాలి శుద్ధి చెందాలి .ప్రేమ ,సత్యం తో అక్కడ పునర్నిర్మాణ౦ జరగాలి తప్పదు.అది కాంతివంతమైన భూమిగా మారాలి చీకటి పారద్రోలాలి .మెర్లిన్ అనే నేను శాశ్వత భూమి పై  ప్రతిజ్ఞ చేసి  ఈ మాట చెబుతున్నాను ‘’అనగానే స్టేజ్ పై చీకటి ఆవరించి ప్రదర్శన పూర్తయింది .మేమ౦దరం ఆశ్చర్య చకితులమయ్యాం .నాన్సీ లేచిను౦చొని’’ఇది నాటకంలాగా ఉంది కానీ వాస్తవంగా లేదు.ఇక్కదేమైనా పుస్తకాలున్నాయా ’’అని గట్టిగా అరచింది .నేనూ అమ్మమ్మా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపడ్డాం.అమ్మమ్మ నా చేయిపట్టి లాగి షాకైంది. ఎల్లీ ఏడుపు లంకి౦చుకొంది. ‘’అంతా నిజమే అమ్మా .నువ్వే చెప్పు నిజ౦ కాదా ?’’అన్నదిపాపం .మాన్యుల్ వచ్చి ఆపైల్లనుపైకెత్తుకొని చెవిలో ఏదో చెప్పాడు  .ఆపిల్ల ఏడుపు ఆపి నవ్వింది .ఆపిల్లకు ఏం చెప్పాడో తెలీదుకాని,ఏడ్చేపిల్ల హాయిగా నవ్వింది .

  లైబ్రరీలో కొంత భాగం చూశాం .కొన్ని చోట్ల విశాలమైన గాలరీలు పెయింటింగ్ లతో  హాయిగా కూర్చునే కుర్చీలు టేబుళ్లు ,కౌచేస్ అంటే మంచాలతో  ముచ్చటగా ఉన్నాయి .ఆకలేస్తే ఒక చోట ఆగాం .వెంటనే తాగటానికి డ్రింక్స్ వచ్చాయి .సర్వర్లు ఎవరూలేరు .తానే ఏర్పాటు చేశానన్నాడు మాన్యుల్ .అక్కడ ఉన్నవేవో తిని ఆకలి తీర్చుకొన్నది  పేచీపెట్ట కుండా ఎల్లీ .వాటిల్లో విషం ఉ౦దేమోననే భయంతో నాన్సీ ఏదో తిన్నట్లు నటించింది .ఆమెను చూసి జాలేచి ‘అనుమానముంటే మనకుక్కకు పెట్టి టెస్ట్ చేయి ‘’అన్నాను  .అమ్మమ్మ నావైపు వార్నింగ్ ఇస్తున్నట్లు చూసింది .ఒక బ్రెడ్ ముక్క తీసి టెక్ కు పెట్టింది నాన్సీ .ఒక్కసారిగా మింగేసి  ఇంకాకావాలన్నట్లు చూసి౦ది కుక్క .అలసిన ఎల్లీ విశ్రాంతి తీసుకోవాలని అంది అక్కడ ఆగటానికి వీలుందా అని మాన్యుల్ ను అడిగాను .ఒక లిఫ్ట్ లోనుంచి మమ్మల్ని బయటికి తీసుకు వెళ్ళాడు .అక్కడ పట్టపగలు గా ఉంది .ఇక్కడ ఉండటం లో ఇబ్బంది ఏమిటి అంటే పగలుకు రాత్రికి తేడా తెలుసుకోవటం కష్టం .ఇక్కడి ‘’ఫ్రెండ్లీ  సన్షైన్’’అంతమనోహరంగా ఉంటుంది .మొదట్లో ఇబ్బందిగా ఉన్నా, క్రమేపీ అన్నీ తెలుస్తాయి .

సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )

  • మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-12(చివరి భాగం )

    1948లో సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు అన్న పూర్ణయ్య గారు ప్రధానకార్య దర్శిగా పార్టీ విస్తరణకు నిర్విరామ కృషి చేశారు .1952లో సోషలిస్ట్ లంతా కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు బొంబాయిలో జరిగిన జనరల్ కౌన్సిల్ కు మద్దూరి హాజరైనా ,ఆ  విలీనం ఆనయనకు నచ్చలేదు .ఆంధ్ర పార్టీలో ఆయనకు గౌరవస్థానం ఇవ్వలేదు.ఆయన క్రమ౦గా రాజకీయాలకు దూరమౌతున్నారు .ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి అవతార్ మెహర్ బాబా వైపు ఆకర్షి౦ప బడి 1953జులై10న  ‘’వెలుగు ‘’వారపత్రిక ప్రారంభించి  మొదటి సంచికలో ‘’అబద్ధం రాజ్యమేలుతోంది. ప్రేమ సత్యం దూరమయ్యాయి ‘’స్వతంత్ర భారత బానిసల్లారా లేవండోయ్ ‘’అని ప్రజల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది .భుక్తి ముక్తి చూపిస్తుంది వెలుగు పత్రిక .సోషలిజంద్వారా భుక్తినీ నీలోని వెలుగు చూపించి మేల్కొల్పి ముక్తినీ కల్పిస్తుంది ‘’అని రాశారు జయప్రకాష ,ఆంధ్రకేసరి ఆశీర్వదించారు .ప్రజా సేవలో 33ఏళ్ళు గడిపి 1953డిసెంబర్ 2నుంచి తాను  ఏ పార్టీకీ చెందని ప్రజా సేవకుడుగా మిగిలారు .మెహర్ బాబా కీర్తి వ్యాపించటానికి మద్దూరి చేసిన కృషి అద్వితీయం .1954ఫిబ్రవరి 20నుంచి 11రోజులు మెహర్ బాబా ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి వెన్నంటి ఉండేవారు .ఆయనపై ప్రత్యేక సంచిక తెచ్చారు .సభలలో అప్పటికప్పుడు ఆంగ్లకవితలు రాసి  చదివి బాబాకు సమర్పించేవారు .

      ఏలూరులో బాబా అన్నపూర్ణయ్య గారి అల్లుడు ఇంట్లో కుటుంబం వారందర్నీ ఆశీర్వదించి పూర్ణయ్య గారితో అయిదు నిమిషాలు ప్రత్యేక ఏకాంత దర్శనమిచ్చారు .ఆంధ్రలో ఇలాంటి అవకాశం ఎవ్వరికీ దక్కలేదు .ఒక్క మద్దూరికే దక్కింది ఆ అదృష్టం .కళా వెంకటరావు ,పాలకొడేటి సూర్య ప్రకాశరావు మద్దూరిబుచ్చి వెంకయ్య ,మద్దూరి కృష్ణమూర్తి ,నరసింహ దేవర సత్యనారాయణ లను బాబా ఆశీర్వదించారు మద్దూరివారి ప్రత్యేక ఆహ్వానం తో వచ్చిన మహర్షి బులుసు సాంబమూర్తి గారిని బాబా ఆలింగనం చేసుకొని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టారు.

      1954 వేసవి ఎండలకు మద్దూరి ఆరోగ్యం దెబ్బతిన్నది .రాజమండ్రిలో బావమరది కొల్లూరి కృష్ణ శాస్త్రి ఇంట్లో భోజనం చేస్తూ కాలం గడిపారు ఒక హోటల్ యజమాని మద్దూరికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేశాడు .సెప్టెంబర్ లో ఏలూరు వెళ్ళారు అక్కడే సెరిబ్రల్ మలేరియా వచ్చి 1954 సెప్టెంబర్ 11న మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్యగారు 65వ ఏట మరణించారు మరణవార్త టెలిగ్రాం ద్వారా తెలుసుకొన్న మెహర్ బాబా ఆయన తనలో లీనమయ్యారని తెలియ జేశారు ఏలూరులోనే అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని రాజమండ్రి లో గోదావరిలో నిమజ్జనం చేశారు .

     అన్న పూర్ణయ్య గారికి నివాళులర్పించిన నేతలు ఆయన త్యాగనిరతిని బహుదా ప్రశంసించారు .మధు దండావతే -,’’విలువలు పునరుద్ధరించిన నేత మద్దూరి .ఆయనజీవితం యువతకు స్పూర్తి ‘’వావిలాల-‘’వేలూరు జైలులో ఆయనతో గడిపి ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను .సర్దార్ గౌతు లచ్చన్న-న్యాయానికి నిలబడే శక్తి ప్రజల్లో కల్గించాడు ‘’.నండూరి ప్రసాదరావు ‘’నిస్వార్ధ సేవకుడు కూతురు స్కూలుఫీజు  కూడా చెల్లించలేని స్థితిలో ఉండేవాడు ‘’.నార్ల-‘’ఆయన నాగురువు .నా మొదటి రచన ను కాంగ్రెస్ పత్రికలో ప్రచురించి ప్రోత్సహించారు .’తులసి గంగాధరరావు –‘’క్వారీ వర్కర్స్ సభకు ఆహ్వానించి రమ్మంటే యెంత సేపు చూసినా రాకపోతే నేను అడిగితే ‘’రావటానికి రిక్షా బాడుగ డబ్బులు లేవు .’’అన్నారు మీ డబ్బు ఏం చేశారు అని అడిగితె ‘’భూపతి కోటేశ్వరరావు కు కొంత ,ప్రెస్ కు కొంత,ఎవరెవరో వచ్చి అడిగితె వారికీ ఇచ్చి భోజనం లేకుండా ఉండిపోయాను ‘’అని చెప్పిన మహాత్యాగి ‘’శ్రీమతి రాజ్యం సిన్హా ‘’కృష్ణాజిల్లా ముడునూరులో ఉండే మా నాన్న అన్నే అంజయ్య గారు వీరూ ,నేతాజీ శిష్యులు .వక్త రచయితా ఉద్యమనిర్మాత మద్దూరి ‘’,  ‘భాట్టం శ్రీరామమూర్తి –‘’ఆయన నా గురువు అనిచెప్పి గర్వపడుతున్నాను .మా వర్ణాంతర  వివాహం దగ్గరుండి జరిపించిన విశాల హృదయుడు ‘’,మద్దూరి జయరాం ‘’మా తండ్రిగారికి స్థిర చరాస్తులు లేవు .ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల  భూమికంటే అభిమానులు సన్మానించి  ఇచ్చిన రెండు రూపాయలే గొప్ప గా భావించేవారు .చనిపోవటానికి ఏడాదిముందు నన్ను యూనివర్సిటీలో చేర్పించారు నాన్న ‘’

    అన్నపూర్ణయ్యగారు నడిపిన పత్రికలు -ననవ శక్తి, జయ భారత్ ,వెలుగు ,

    సమాప్తం

    ఆధారం –శ్రీ రావినూతల శ్రీరాములు రాసిన ‘’మహాత్యాగి మద్దూరి అన్న పూర్ణయ్య జీవిత చరిత్ర ‘’

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-11

1945జూన్ లో జైలు నుండి విడుదలయ్యాక  మద్దూరి అన్న పూర్ణయ్యగారు ఏకాకి అయ్యారు .రెండేళ్లక్రితమే భార్య చనిపోవటం కూతురు అత్తారింట్లో ఉండటం కొడుకు విద్యాబుద్ధులను మేనమామలే చూస్తూండటం వలన ఆయన దగ్గర ఎవరూ లేరు .రాజమండ్రిలో బావమరది ఇంట భోజనం చేస్తూ మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు .అప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ తో సంబంధాలు వదిలేశారు .కాంగ్రెస్ తో సంబంధం కొనసాగించారు .1945కి కాంగ్రెస్ లో గ్రూపులు ముఠాలు ఎక్కువయ్యాయి .ఈయన వాటికి అతీతులు .రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పూర్ణయ్య గారు నామినేషన్  వేశారు .కా౦గ్రెస్ లో  బలమైన వర్గామున్న డా ఎబి నాగేశ్వరరావు ప్రత్యర్ధి .అందులోని ఇద్దరు మద్దతు ఇవ్వటం తో దువ్వూరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికై ,,1948జనవరి 25వరకు ఉండి,ప్రత్యేక సోషలిస్ట్ పార్టీ ఏర్పడటం తో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు .1946శాసన సభ స్థానం నుంచి మద్రాస్ శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్ధిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ప్రతిపాదించినా ,కొందరు హైకమాండ్ తో అన్నపూర్ణయ్య నేతాజీ అనుచరుడనీ ,ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఒత్తిడి చేశారు .క్రొవ్విడి లింగరాజుకు టికెట్ వచ్చింది .ప్రజలు సహించలేక లి౦గరాజుకు ప్రచారం చేయమని నిరశన తెలిపారు .వారికి నచ్చ చెప్పి లింగరాజు పక్షాన నిలిచి గెలిపించారు పూర్ణయ్య .

  తన తొలి ప్రేయసి పత్రికా రచన అని దువ్వూరి ఎప్పుడూ చెప్పేవారు .రాజమండ్రిలో మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947ఆగస్ట్ 15న పట్టణం లో 60చోట్ల గొప్పగా వేడుకలు జరిగాయి .మొదట పంజా రోడ్డులోని పార్కు వద్ద  దువ్వూరి గాంధీ విగ్రహం ఆవిష్కరించారు అప్పటినుంచి ఆ పార్కు మద్దూరి వారి  పేరుమీదుగా పిలువబడింది.1997లో శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి అన్న పూర్ణయ్యగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు .లాంచీ రేవులో నేతాజీ విగ్రహాన్నీ , ఈయనే ఆవిష్కరించారు .గౌతమీ వ్యాయామ శాల ,ప్రభుత్వ బాలికా విద్యాలయం  సభల్లో ప్రసంగించారు .సాయంత్రం 50 వేలమంది ఉన్న సభలో దువ్వూరి గంభీరోపన్యాసం చేశారు .

   శ్రీ పివిజి  రాజు ఆర్ధిక సాయంతో దువ్వూరి ‘’జయ భారత్ ‘’పత్రిక స్థాపించారు .యర్రమిల్లి నరసింహారావు, భాట్టం సహాయ సంపాదకులు 1947నవంబర్ 1న మొదటి సంచిక వెలువరించి ‘’సోషలిస్ట్ వారపత్రిక ‘’అన్నారు .సంపాదకీయం తోపాటు అమృతారావు కలం పేరుతొ ‘’కలం చిందులు ‘’రాసేవారు మద్దూరి .చిన్న కదా కవిత జనవాక్యం శీర్షికలు ఉండేవి .ఒక్కోసారి ప్రముఖ దేశభక్తుని ముఖ చిత్రం వేసేవారు .1947ఆగస్ట్ 27సంచిక ప్రకాశంగారి చిత్రం తో వచ్చింది .ఆయన గురించి రాస్తూ ‘’ఆంధ్రులకు ఏ సమస్యమీదా ఏకాభిప్రాయం లేదు కానీ ,ప్రకాశంగారిని పూజించటం లో మాత్రం ఏకీ భావం ఉంది కారణం ఆయన ధైర్య సాహసాలు త్యాగం .ఈ సుగుణాలున్న వారు చాలామంది ఉన్నా ఆపద ఎక్కడ ఉంటె ప్రకాశం అక్కడ ప్రత్యక్షమౌతాడు .వరదలు తుఫాన్లు వచ్చి ప్రజలు నిలువ నీడ లేక అల్లాడుతుంటే ఆంధ్ర కేసరి వాలిపోవాల్సిందే.’’

  సోషలిస్ట్ నాయకులు అచ్యుత్ పట్వర్ధన్ ,లోహియా ,కమలాదేవి ,అశోక్ మెహతా ,పివిజి రాజుగార్లను పత్రికలో ఘనంగా పరిచయం చేశారు దువ్వూరి .

1-అచ్యుత్ పట్వర్ధన్ –విఖ్యాత సోషలిస్ట్ నాయకుడు.కాశే విశ్వవిద్యాలయంలోప్రోఫేసర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరి లక్నో ఫైజా పూర్ ఎఐసి సి సభ్యుడై ,తర్వాత నిరాకరించి 1942ఆగస్ట్ విప్లవం లో 3ఏళ్ళు అజ్ఞాతం లో ఉంటూ అరుణా ఆసఫాలీ సహాయంతో ఆగస్ట్ విప్లవం నడిపాడు సతారాలో బ్రిటిష్ ప్రభుత్వం బదులు స్వదేశీ ప్రభుత్వం నడిపిన ఘనుడు .అన్న రావుసాహెబ్ కూడా దీటైనవాడు .వారి కుటుంబం  మహారాష్ట్రలో చాలా ప్రభావమైనది .అచ్యుత్ అనర్గళవాగ్ధాటికి ముగ్ధులు కావాల్సిందే .

  రామ మనోహర్ లోహియా-విజ్ఞాని.ఎఐసిసి విదేశాంగ శాఖ కార్యదర్శి గా పేరు పొందాడు సోషలిస్ట్ పార్టీ జాతీయకార్యవర్గ ప్రముఖుడు ఆగస్ట్ విప్లవాన్ని తేజో వంతంగా నడిపిన ధీరుడు .ఎర్రకోటలో జయప్రకాష్ తో పాటు జైలు జీవితం గడిపిన యోధుడు .

శ్రీమతి కమలాదేవి-అఖిలభారత మహిళామండలి అధ్యక్షురాలు .భారత నారీరత్నం .ఏఐసిసిసి సభ్యురాలు .సామ్యవాద భారత్ కోసం తీవ్ర కృషి చేసిన నారీమణి

శ్రీ అశోక్ మెహతా –సోషలిస్ట్ పార్టీ నిర్మాతలలో ఒకడు .హింద్ మజ్దూర్ సభ నిర్మాత కూడా మేధావి వక్త విద్యా సంపన్నుడు అరుదైన వ్యక్తిత్వమున్నవాడు ప్రజలను నడిపించే అమోఘ శక్తి ఉన్నవాడు. ప్రజాసోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి .మధ్యప్రదేశ్ నున్చిపార్లమేంట్ కు నిలబడ్డాడు ఆయన్ను గెలిపించిన గౌరవం పొందాలి .చిన్నవయస్సు దేశభక్తుడు .కార్మిక కర్షకనాయకుడు .బహుళ గ్రంధకర్త మహా మేధావి .నిర్మాణ శక్తి సంపన్నుడు నిష్కళంక సేవామూర్తి.

శ్రీ పివిజి రాజు –‘’భూమి నంతటినీ జాతీయం చేసే బిల్లు రావాలి దీనితో పాతపద్ధతులు ఆచారాలు తొలగిపోయి భూమి అంతాప్రభుత్వ పరమౌతుంది .సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులోత్తే జమీందారీ వ్యవస్థ రద్దు త్వరగా జరగాలి .జయప్రకాష్ అడిగిన వెంటనే సోషలిస్ట్ పార్టీకి 10వేల రూపాయల విరాలమందించిన వదాన్యుడు పివిజ్ రాజు  ‘’

  ఇంతటి మహత్తర వారపత్రిక కొన్ని సంవత్సరాలే నడిచి మూలపడింది .

కేంద్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఆచార్య నరేంద్రదేవ్ .ప్రధానకార్యదర్శి జయప్రకాష నారాయణ్ ఆంధ్రలో సోషలిస్ట్ పార్టీ ఆడ హాక్ కమిటీ ఏం బాలకృష్ణ కార్యదర్శిగా ,మద్దూరి చక్రధర్ వగైరా సభ్యులతో 1950మే నెలలో ఏర్పడింది .జయప్రకాష్ ఆంధ్రలో పర్యటించినప్పుడు మద్దూరి ఆయన వెంట ఉంటూ ప్రసంగాలకు తెలుగులో అనువాదం చేసేవారు .బహిరంగ సభలకు జనం బాగా వచ్చేవారు .తనపర్యటన లో వసూలైన లక్షరూపాయలు ఆంద్ర రాష్ట్ర పార్టీకి ఇచ్చాడు జెపి .

  1952 జనరల్ ఎన్నికలలో మద్రాస్ శాసనసభకు ఆంధ్రనుంచి ఆరుగురు సభ్యులు సోషలిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు .ఈ పార్టీకి విశాఖజిల్లా బలమైన కేంద్రం .మద్దూరిని శాసన సభ్యుడిగా చూడాలని పివిజి రాజు ఆశపడ్డాడు .ఏదోఒక నియోజకవర్గం నుంచి పోటీచేయమని వొత్తిడి చేశాడు .రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మృదువుగా తిరస్కరించారు మద్దూరి .1952లో ఆంధ్రరాజకీయం డోలాయమానంగా ఉంది .ప్రకాశం కాంగ్రెస్ ను వదిలి ప్రజాపార్టీ పెట్టటం అండర్ గ్రౌండ్లో అప్పటిదాకా ఉన్న కమ్యూనిస్ట్ లు బయటికొచ్చి ఎన్నికలలో నిలబడటం తో రాజమండ్రి స్థానానికి నాలుగుపార్టీలు పోటీ పడ్డాయి .కాంగ్రెస్ తరఫున డా కే ఎల్ నరసింహారావు  ,ప్రజాపార్టీ నుంచి క్రొవ్విడి లింగరాజు ,సోషలిస్ట్ పార్టీ నుంచి అన్నపూర్ణయ్యగారు కమ్యూనిస్ట్ అభ్యర్ధిగా చిత్తూరి ప్రభాకర చౌదరి  పోటీ చేశారు .ఆంధ్రాయూని వర్సిటి సోషలిస్ట్ విద్యార్దినాయకుడు ఎవికే చైతన్య రాజమండ్రి లో ఉండి మద్దూరికి తీవ్ర ప్రచారం చేశాడు .మైకుకట్టిన కారులో మద్దూరి ప్రచారం చేస్తూ తన రాజకీయం వివరిస్తూ ,14ఏళ్ళు జైలులో ఉన్నానని తెలియజేస్తూ ,గెలిచినా ఓడినా రాజమండ్రిలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రచారం చేశారు .ప్రచారం ఉధృతంగా ఉన్న సమయం లో కాంగ్రెస్ ను దుయ్యబడుతూ ప్రచారం చేసి ఒకరోజు అర్ధరాత్రి 12గంటలకు కాంగ్రెస్ అభ్యర్ధి నరసింహారావు ఇంటి తలుపుతట్టారు మద్దూరి .ఆయనకొడుకు తలుపు తీసి ఆశ్చర్యపోగా ‘’మీ నాన్న ఉన్నాడా ??’’అంటూ లోపలి వెళ్ళగా ఆయన దువ్వూరి వారిని భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసి దగ్గరుండి తినిపించాక  గంటసేపు ప్రత్యర్దులిద్దరూ కులాసా కబుర్లు చెప్పుకొన్నాక పూర్ణయ్యగారిని రిక్షా ఎక్కించి గౌరవంగా పంపారు రావుగారు .కానీ విజయం కమ్యూనిస్ట్ లదేఅయింది .ఓడినా విచారపడ లేదు మద్దూరి ‘’స్వాతంత్ర్యం నాగురించికాదు. భావి తరాలకోసం .కాంగ్రెస్ కు రిజైన్ చేసిన నరేంద్ర దేవ్ వంటినాయకులు బై ఎలెక్షన్ లో ఓడిపోలేదా? గెలుపు వోటములు ముఖ్యం కాదు .ఇక భవిష్యత్తు అంతామనదే ‘’అని కార్య కర్తలను ఊరడించిన స్థిత ప్రజ్ఞుడు మద్దూరి అన్నపూర్ణయ్యగారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-10

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-10

అన్నపూర్ణయ్యగారు నాలుగు అంకాల అసంపూర్ణ నాటకం రాసి పేరు పెట్టలేదు .అనాధ విద్యా  వంతుడికి బ్రాహ్మణ కన్యకు  పెళ్లి జరిగి ,ఇద్దరూ స్వతంత్ర సమరంలో జైలుకు వెళ్ళటం ఇందులో కధ.స్వాతంత్ర్య పోరాటగాధను ‘’అక్క ‘’నవలగా రాశారు కాని అలభ్యం .భార్యమరణం పై ‘’వీరపత్ని ‘’గేయం రాశారు .అది గొప్ప ఎలిజీగా నిలబడింది .

 శ్రీమతి వెంకట రమణమ్మ –అన్నపూర్ణయ్యగారి భార్య వెంకట రమణమ్మ .2-3-1906న పెద్దాపురం లో పుట్టారు7-6-1919న అన్నపూర్నయ్యగారితో పెద్దాపురం లో పెళ్లి జరిగింది .ఆమెకు 14,ఆయనకు 20 వయసు .కట్నకానుకల విషయం లో తేడావచ్చి వేరొక సంబంధం చేయాలని తండ్రి భావిస్తే ఆమె ఈయన్నే పెళ్లి చేసుకొంటానని భీష్మించి పెళ్ళాడింది .ఉద్యమం కోసం చదువు మానవద్దని ఆమె ఆయనకు ఉత్తరం రాసింది .కానీ ఆయన వినలేదు. కానీ ఆమె సాహచర్యంతో ఆయనలో గొప్ప మార్పు వచ్చింది .1925లో ఈ దంపతులు గౌతమీ ఆశ్రమం లో చేరారు .1927లో పుట్టిన కూతురికి  రాజేశ్వరి పేరు పెట్టారు .1932లో సీతానగర ఆశ్రమ౦ చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే ,ముందుగా ఆడవారిని బయటికి పంపిస్తుంటే  రమణమ్మ గారు మాత్రం ‘’మగవారితో పాటే మేము ‘’అని అక్కడే ఉన్నారు .తర్వాత పెద్దలు నచ్చ చెప్పి పంపించారు .

  రాజమండ్రిలో విదేశీ వస్త్రాల దుకాణాలవద్ద పికెటింగ్ చేయగా రమణమ్మ గారిని  గారిని అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలులో ఉంచారు .1934 అక్టోబర్2 గాంధీ జయంతి నాడు ఆమె రాజమండ్రిలో ఖద్దరు వస్త్రాలు  అమ్మారు.7-7-1935న దంపతులు గౌతమీ ఆశ్రమ౦  వదలి రాజమండ్రి చేరారు .1937లో వీరికిపుట్టిన కొడుకు తాతగారిపేరు జయరాం అనిపెట్టారు .1935లో ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది .కాంగ్రెస్ స్వర్ణోత్సవాల బాధ్యత దువ్వూరిపై పడింది .తన ఆరోగ్యం గురించి  బాధ పడవద్దనియధా ప్రకారం కార్యక్రమాలు చేయమని కోరిన ఉత్తమా ఇల్లాలు .6-4-1940న అన్నపూర్ణయ్యగారిని ఖైదు చేసే నాటికి కుమార్తెకు 13,కొడుక్కి 3ఏళ్ళు .స్థిరాస్థి శూన్యం .1945జూన్ లో ఆయన విడుదల అవటానికి రెండేళ్ళ ముందే ఆమె చనిపోయారు .1940-43మధ్యకాలం ఆమెకు  గడ్డుకాలం .పిల్లల్ని ఎలాపోషించిందో ఊహకు అందని విషయం .పుట్టి౦టి కొల్లూరి వారే కొంత అండగా నిలిచారు .

 దువ్వూరి ఎక్కువకాలం వెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు .ఆయననుంచి భార్యకు ఉత్తరాలు వచ్చేవికావు .ఎప్పుడైనా ఈమె కార్డు రాసేది .1942లో భర్తను బేషరతుగా విడుదల చేయమని లేకపోతే కుటుంబ పోషణకు డబ్బు మంజూరు చేయమని రమణమ్మగారు ప్రభుత్వానికి అర్జీపెట్టారు .ప్రభుత్వం నెలకు 15రూపాయలు మంజూరు చేసింది .తర్వాత అది చాలదనిపెంచమని , కూతురి పెళ్లి చేయటానికి ధనం సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరారు .1942జులై నుంచి జీవన భ్రుతి 25రూపాయలు చేశారు .పుట్టింటి అండకోసం కాపురం ఏలూరు కు మార్చారు .1942ఆగస్ట్ లో కూతురుపెళ్లి  అనీ 200రూపాయలు మంజూరు చేయమని లేకపోతె 13రోజులు పెరోల్ పై విడుదల చేయమని పూర్ణయ్యగారు ప్రభుత్వాన్ని కోరితే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది .తనతమ్ముడు సూర్యనారాయణ శాస్త్రికి కూతురు రాజేశ్వరి నిచ్చి వెంకటరమణమ్మగారు 1942ఆగస్ట్ 28న తండ్రి జైలులో ఉండగానే వివాహం జరిపించారు .పెళ్లి ఖర్చులు 512రూపాయలు అందులో 200రూపాయలు రమణమ్మగారు అప్పుగా తెచ్చినవే .

  6-12-1943 వెంకటరమణమ్మగారు37వ ఏటనే  తుదిశ్వాస విడిచారు .చివరిరోజులలో  భర్తను చూడాలని ఆరాట పడిన ఆమె తపన అర్ధం చేసుకుని ,దువ్వూరి పెరోల్ కోసం అప్ప్లై చేశారు. ఆర్డర్ వచ్చేలోపే ఆమె మరణ వార్త టెలిగ్రాం చేరింది .ముందుగా లింగరాజుగారు చూసి ఎలా చెప్పాలో అర్ధంకాక దిగాలుగా ఉంటే ,దువ్వూరి ‘’ఏమిటీ రమణమ్మ పోయిందా ?””అని అడిగారట .టెలిగ్రాం చేతికివ్వగా చదివి మౌనంగా ఒక మూల కెళ్ళి కూర్చున్నారు .1947స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొవ్వూరులోని వీర స్మరణ మందిరం లో రమణమ్మ గారి చిత్రపటాన్ని శ్రీమతి చుండూరు వెంకటరత్నమ్మగారు ఆవిష్కరించి అంజలి ఘటించారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం )

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -3(చివరి భాగం )

నాలుగేళ్ళు అజ్ఞాత వాసం లో గడిపి ఆగస్ట్ ఉద్యమవీరుడు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్  బొంబాయి రాగా అఖండ ప్రజావాహిని వీరోచిత స్వాగతం పలికింది .కాంగ్రెస్ నాయకులుమాత్రం రాలేదు మొహం చెల్లక  .తర్వాత పూనాలో కూడా అఖండ స్వాగతమిచ్చారు ప్రజలు .అక్కడ ప్రసంగిస్తూ ‘’అ౦తిమస్వాతంత్ర్యంకోసం పోరాడాలి .కాంగ్రెస్ విధానాల్లో పెద్ద మార్పురావాలి సంపూర్ణ స్వాతంత్ర్యమే మన ధ్యేయం .బ్రిటిష్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి .ఆత్మ బలిదానానికి సంసిద్ధులై మనం పనిచేయాలి .పెద్ద విప్లవ సైన్యం నిర్మించాలి.కార్మిక సంఘాలలో కమ్యూనిస్ట్ ల ప్రాధాన్యత తొలగించటానికి కాంగ్రెస్ సోషలిస్ట్ లు నడుం కట్టాలి ’అని గర్జించాడు .వల్లభాయి ,విఠ లుభాయి సోదరుల్లా రావు భాయ్, అచ్యుత్ సోదరులు భారత స్వాతంత్రోద్యమం లో కలిసిపని చేశారు .పటేల్ బార్డోలీ వీరుడైతే ,పట్వర్ధన్ సతారా వీరుడు .

 పట్వర్ధన్ విజ్ఞాన సముద్రుడు .ఆయన ఇంటి లైబ్రరీలో దేశం లో ప్రచురితమైన ప్రతిరాజకీయ పుస్తకం దొరుకుతుంది .ఆయన చదవని రాజకీయ పుస్తకం లేదు .అన్ని విషయాలపై ఉత్తమ గ్రంధాలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి .అజ్ఞాతవాసం లో ఉంటూ రైళ్ళరాకపోకల్ని తెలుసుకొంటూ వాటికి ఆటంకం కలిగించేవాడు .రైల్వే అధికారులకు సింహ స్వప్నంగా ఉండేవాడు .ఎంత విప్లవవాది అయినా గాంధీ పేరు చెబితే వినమ్రుడయ్యెవాడు .లోహియాలాగా’’ గాంధియన్  సోషలిస్ట్’’ . తుది నిర్ణయ౦ లో కాంగ్రెస్నే అనుసరిస్తారిద్దరూ .కాంగ్రెస్ ను విప్లవాత్మకం చేసే ప్రయత్నం చేశారు .పోరాటం పెరిగినకొద్దీ అతి వాదం పెరిగి దాన్నే అనుసరించాల్సి వచ్చింది .అతివాద చైతన్యం పెరిగింది .రాజకీయ చైతన్యానికి మహాత్ముడే కారణమని పట్వర్ధన్ ప్రగాఢ విశ్వాసం .అప్పటికి పాతికేళ్ళ క్రితం ‘’స్వరాజ్యం నా జన్మ హక్కు ‘’అన్నందుకు తిలక్ మహాశయుడిని తెల్లప్రభుత్వం ఆరేళ్ళు ఖైదులో ఉంచింది .గాంధీ వల్లనే వాక్ స్వాతంత్రం వచ్చి,’’మా దేశం విడిచిపొండి’’అని ఆజ్ఞాపించగలుగుతున్నాం .స్వతంత్ర వృక్షాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది కాంగ్రెస్ .కాంగ్రేసే మహాత్ముడు మహాత్ముడే కాంగ్రెస్ .ఆయన సాధించేది సత్య సామ్రాజ్యం అని అభిప్రాయ పడ్డాడు పట్వర్ధన్ .గాంధీని చూస్తే పూనకమే వస్తుంది ఆరాధనాభావం తో పులకి౦చి పోయేవాడు .పెద్దల మితవాదం మాత్రం నచ్చలేదు కుండబద్దలుకొట్టినట్లుగా నిష్కర్షగా దాన్ని ఖండించాడు .స్వతంత్ర పోరాటం లో గాంధీ మితవాదం అతివాదులకు ఏమీ అడ్డు రాదు అని కాంగ్రెస్ సోషలిస్ట్ ల మనోభావం .అతివాద కార్యక్రమాలు చేబట్టినప్పుడే అతి వాదం వస్తుంది మాటలతో రాదు .దీనికి విరుద్ధంగా ‘’ప్రజా విప్లవమే మార్కిస్ట్ ల పంధా ‘’గా ఉండేది .స్వతంత్ర ఉద్యమలో ఎన్నో తప్పటడుగులు వేశారు కమ్మీలు .ఒక నిర్దుష్ట కార్యక్రమం ఇచ్చి నడపగలిగినవారిలో పట్వర్ధన్ ఒకడు .

  1942స్వతంత్ర భారత రేడియో కేంద్రం గురించి ఉషా మెహతా చెప్పిన విషయాలు –1942‘’ఆగస్ట్ ఉద్యమ కాంగ్రెస్ ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని దీన్నినేనూ నా సహచరులు కలిసి  ఏర్పాటు చేశాం  ఆగస్ట్ 20న మొదటి ప్రసారం చేశాం .అప్పుడులోహియా బాంబేలో అజ్ఞాతంలో ఉన్నారు .డిసెంబర్ లో ప్రసారాలు నిలిపేశాం .ప్రచారప్రసారాలు లోహియా రాసేవారు .కొన్ని నేనూ పట్వర్ధన్ రాశాం .వేటిని రేడియోలో చదవటానికి మాజీ ప్రొఫెసర్ కుందస్తూర్ ఉన్నారుకాని ఆమె అరెస్ట్ కాలేదు  .అందుకని గ్రామఫోన్ రికార్డులుగా ప్రసంగాలు తయారు చేసి వాటితో ప్రసారం చేసేవాళ్ళం .కాంగ్రెస్ కమిటీ చేసిన ఉపన్యాసాలు రికార్డ్ చేసి రేడియోలో ప్రసారం చేశాం .మొదట్లో రోజుకొక్కసారి తర్వాత రెండుసార్లు ప్రసారం చేశాం .రేడియో యంత్రాగం బొంబాయిలో ఒక ప్రసిద్ధ న్యాయవాది అల్లుడి ఇంట్లో ఉండేది.పోలీసులు ఆచూకీ చేసి నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి ,ఆరోజు నేనే రేడియో ప్రసారం చేసి చివర్లో వందేమాతరం రికార్డ్  వేస్తుంటే ,పోలీసులువచ్చి నన్ను అరెస్ట్ చేశారు .వాళ్ళు నాలుగుగదులు దాటిరావాలి. తాళాలు పగలకొట్టి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు .’’అని వివరించారు .

 ఉషా, ఆసఫాలీ ,పట్వర్ధన్ ,ఆజాద్ ,జయప్రకాష్ వంటి నిస్వార్ధ త్యాగధనులు ‘’స్వాతంత్ర్యం మా జన్మ హక్కు ‘’అని చాటి చెప్పటానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు .1946జూన్ 8న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులు పట్వర్ధన్ లోహియా జయప్రకాష్ అరుణా ఆసఫాలీ లు ఒక ప్రకటన చేస్తూ ‘’భారత్ లో బ్రిటిష్ పెట్టుబడిదార్లు దొడ్డిదారిన ప్రవేశించారు. వారినుండి మనదేశాన్ని మనం కాపాడుకోవాలి .ఇదే సోషలిస్ట్ పార్టీ ఆదర్శం ‘’.అని చెప్పారు .

  కాంగ్రెస్ లో ఉంటూ సోషలిజాన్ని సాధించలేమని గ్రహించి ఈ సోషలిస్ట్ లు 1947లో పట్వర్ధన్ నాయకత్వం లో ‘’సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ‘’స్థాపించారు .1950లో అచ్యుత్ పట్వర్ధన్ రాజకీయాలనుంచి విరమించాడు .మళ్ళీ సెంట్రల్ హిందూకాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేసి 1966లో రిటైరయ్యాడు .తర్వాత పూనా లో ఎవరికీ అందుబాటులో ఉండకుండా ,ఉత్తర ప్రత్యుత్తరాలుకూడా జరపకుండా ఒంటరిజీవితం గడిపాడు పట్వర్ధన్ రెండు గ్రంధాలు రాశాడు -1.  Ideologies and the perspective of social change in India 2- The communal triangle in India.

 ఆగస్ట్ ఉద్యమమమహానాయకుడు సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు అచ్యుత్ పట్వర్ధన్ 1992 ఆగస్ట్ 5న 87వ ఏట వారణాసి లో మరణించాడు .త్యాగమూర్తి అచ్యుత్ పట్వర్ధన్ .

ఆధారం –శ్రీ గోపరాజు వెంకటానందం 1946లో  రచించిన  ‘’ఆగస్ట్ ఉద్యమవీరుడు అచ్యుత పట్వర్ధన్ ‘’

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్ -2

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్ -2

వ్యష్టి సత్యాగ్రహం రోజుల్లో పట్వర్ధన్ ,అశోక్ మెహతా జైలు జీవితం గడుపుతూకలిసి ‘’కమ్యూనల్ ట్రయాంగిల్ ఇన్ ఇండియా ‘’అనే ఉద్గ్రంధం రాశారు .మహాదేవ దేశాయ్ దీన్ని మెచ్చారు  క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక గాంధీ ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం మొదలు పెట్టాడు .1942ఆగస్ట్ 7 న బొంబాయి కాంగ్రెస్ మహా సభలలో అంతిమ స్వాతంత్ర్య సమరం చేయాలని నిర్ణయించారు.చివరి హెచ్చరిక ఇవ్వటానికి గాంధీకి సర్వాధికారాలు ఇస్తూ కాంగ్రెస్ తీర్మానించింది .ఆయన ఉద్రేకం తో ఊగిపోయి ప్రసంగింఛి ‘’డు ఆర్ డై’’నినాదం ఇచ్చాడు .తొమ్మిదో తారీకున జరిగే కాంగ్రెస్ కమిటీలో తీర్మానం ఆమోదించాలి . 8రాత్రికే తెల్లప్రభుత్వం భయపడి గాంధీని కార్యవర్గ సభ్యులను అరెస్ట్ చేసి కనిపించని చోటికితీసుకు వెళ్ళింది .

  దిశా నిర్దేశం చేసే వారు లేక ప్రజలు వెతకసాగారు .విషవాయువు లాఠీచార్జి ,కాల్పులతో ప్రభుత్వం భీభత్సం సృష్టించింది .గాంధీ ఆదేశాన్ని అనుసరించి ప్రభుత్వం  తో పోరాటానికి ప్రజలు సిద్ధపడ్డారు .అరెస్ట్ కు ముందు గాంధీ దగ్గరకు  బాలకృష్ణ శర్మ వెళ్లి ‘’మాకిచ్చిన కార్యక్రమం ఏమిటి ??’’అని అడిగాడు .గాంధీ కోపం తో ‘’నా ఉపన్యాసం అంతా కార్యక్రమమే .దాన్ని అర్ధం చేసుకోలేని వాళ్ళను నమ్మి యుద్ధం ఎలా చెయ్యను ?’’అన్నాడు .దీనినే శిరోధార్యంగా భావించి ప్రజలు ఉద్యమించారు .దేశమంతా విప్లవజ్వాలలు ఎగసి పడ్డాయి .ఎక్కడ చూసినా స్వాతంత్ర్య వీరుల రక్త ప్రవాహాలే .బొంబాయిలో ఏడు రోజులు ప్రభుత్వమే లేదని పించారు .మధ్య రాష్ట్రాలలో ఆరుజిల్లాలు ఉత్త్రరాష్ట్రాలలో 13జిల్లాలు ,ఆంధ్రా అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు బ్రిటిష్ ప్రభుత్వ అధికారానికి ప్రజలు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు .

   ఆగస్ట్ 9నుంచి 1942డిసెంబర్ చివరి వరకు ప్రభుత్వ దౌర్జన్యకాండల ఫలితాలు సెంట్రల్ అసెంబ్లీలో హో౦ మెంబర్ వివరాలు ప్రకటించాడు .అరెస్ట్ అయినవారు -66,229,జిల్లాలో మగ్గుతున్నవారు -18,000.మిలిటరీ పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారు -940,తుపాకీ గాయాలైనవారు -1630.మిలిటరీ సాయంకోరిన చోట్లు -60,తుపాకీ కాల్చవచ్చిన సంఘటనలు -538,విమానాలద్వారా ప్రేల్చిన ప్రదేశాలు -5.

  జయప్రకాశనారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,రామమనోహర్ లోహియా ,అరుణా ఆసఫాలీ మొదలైన వారు రహస్య మార్గాలద్వారా విప్లవాన్ని సాగిస్తూ ,ప్రజల ఉద్రేకాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపారు .ప్రభుత్వం కంటపడకుండా పట్వర్ధన్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .పట్వర్ధన్ నాయకత్వం లో మహారాష్ట్ర సతారా జిల్లాలో ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజలే ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టించారు .రహస్యంగా అచ్యుత్ ‘’క్విట్ ఇండియా ‘’పత్రిక లను రాసిదేశామంతా వెదజల్లాడు .అచ్యుత్ లోహియా ,ఉషా మెహతా రహస్య రేడియో ద్వారా దేశమంతా ప్రచారం చేశారు .చివరికి ప్రభుత్వం కనిపెట్టి పట్టేసింది .జయప్రకాష్ లోహియాలను అరెస్ట్ చేసింది .పట్వర్ధన్ ఉషాలిద్దరూ ప్రభుత్వం కన్ను గప్పుతూ ,రహస్య కార్యకలాపాలు చేస్తూ ప్రజా మార్గదర్శకత్వం చేశారు .విసిగి వేసారిన ప్రభుత్వం వీరిపై ఉన్న అరెస్ట్ వారెంటు ఉపసంహరించుకొన్నది .

  అజ్ఞాతవాసం లో పట్వర్ధన్ చేసిన మహాకార్యం సతారా జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వ కూకటి వ్రేళ్ళను పెకలించిపారేసి ప్రజాప్రభుత్వం అనే ప్రతి సర్కార్ లేక పారలల్ గవర్నమెంట్ నిర్మించి పాలించటమే .చత్రపతిశివాజీ స్పూర్తితో ఆయన అలా నిర్వహించాడు . రెండేళ్ళు అయ్యాక అకస్మాత్తుగా మిలిటరీ గుంపులు సతారా చేరి భీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేసి సతారా  జిల్లా వశపరచుకొన్నారు .కామ్రేడ్ సోలీ బాట్లే వాలా  ఆజాద్ హింద్ ఫౌజు న్యాయ విచారణకు కావలసిన భోగట్టా సేకరించటానికి వచ్చి ,అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన హి౦సా దౌర్జన్యాలు తెలుసుకొని పత్రికా ముఖంగా  ప్రకటించాడు .ఇన్ని చేసినా ప్రజల స్వాతంత్ర్య కాంక్ష పెరిగిందేకాని తగ్గనే లేదు .గొప్ప సంచలనం ఆగస్ట్ ఉద్యమం కలిగించింది .దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు హర్షించాయి .

అచ్యుత్ అజ్ఞాతం లో ఉన్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది .ఆయన్ను పట్టిస్తే 5వేలరూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది .ఆబహుమతి పొందాలనే తహతహతో ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసులతో సతారాజిల్లలో అనుమానమున్న గ్రామాలన్నీ వెతికి వెతికినిరాశ తో వెనక్కి వెళ్లిపోతుంటే ,అతడు ఎక్కిన రైలులోనే పట్వర్ధన్ ప్రయాణించాడు .ఆ రాత్రి ఆపోలీసాఫీసర్ పక్కనే కూర్చున్నాడుకూడా .కానీ గుర్తించలేక దిగులుమొహం తో పూనాలో దిగి వెళ్ళిపోయాడు .ఇలాంటి సంఘటనలు కధలుగాధలుగా ఆనాడు చాలా చెప్పుకొనేవారు .

  వైస్రాయి వేవెల్ సిమ్లా సమావేశ సన్నాహం లో ఉంటె ,పట్వర్ధన్ సతారలో ఒక బహిరంగ సభలో ఉపన్యాసం చేశాడు .అజ్ఞాతం లో ఉంటూ బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యాడు .1945డిసెంబర్ 11న కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై ఆగస్ట్ ఉద్యమం ఆజాద్ హింద్ ఫోజు యడల అవలంబించైనా వైఖరి వలన వైఖరి కాంగ్రెస్ అహింసా సిద్ధాంతంపై అపోహలు కలిగాయని తెలుసుకొని నివారించేప్రయత్నం లో ఒక తీర్మానం చేసింది .సమావేశం లో పట్వర్ధన్ కాంగ్రెస్ పెద్దల వైఖరిని తీవ్రంగా విమర్శించి అచ్యుత్, అరుణా కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడుమౌలానా ఆజాద్ కు  ఒక పెద్ద లేఖ రాసి అంద జేశారు .దీనికి కాంగ్రెస్ చరిత్రలో గొప్ప ప్రాధాన్యత లభించింది .ఆ లేఖలోని ముఖ్య విషయాలు ‘’కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ తర్వాత ప్రజలకు నాయకత్వం లేక ఎవరికి తోచినట్లు వారు నడిచారు .మేము అజ్ఞాతంలో ఉంటూ సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మూడేళ్ళుపాలించాం .ప్రజలు మాకు మద్దతునిచ్చారు .మాదీ అహింసా విధానమే .పోలీసులు యెంత దౌర్జన్యం చేసినా మేము పోరాడామేకాని లొంగి పోలేదు .ప్రజా సంఘటన శక్తి అపారం కాగా ,మేము మోతాదు లను బుద్ధిపూర్వకంగా ప్రయోగించాం .లేకపోతే శిక్షణ లేని ఆగస్ట్ ఉద్యమ మహా సంరంభం కొన్ని వారాల్లోనే దిగజారి పోయేది .మా అమోఘ నిశ్చయానికి మా అంతరాత్మ సాక్షి .దూర ప్రాంతాలవారికీ వార్తలు అందించగలిగాం .కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఒక రాష్ట్రంలో సహాయనిరాకరణ ఉద్యమం జయప్రదంగా చేశాం .కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అనే తోక కాంగ్రెస్ శరీరాన్ని ఆడిస్తోందని గ్రహించండి .కాంగ్రెస్ ప్రజా భిమానం ఉప్పెనలో ఉంది .దీనికి మీ దగ్గర నివారణ లేదు పరిపాలనా విధానం గురించి ప్రనణాళికలేదు మీకు .సత్యాగ్రహం విఫలమైనా ఎన్నికల విజయం పంచుకొన్నాం .శాసన సభలు రాజీమార్గానికి విఫలమైనప్పుడు ,నిర్మాణకార్యక్రమం ఆదర్శంగా మిగిలిపోయినప్పుడు ,ముఖ్య వ్యవస్థ నిరోధక శక్తి తగ్గుతున్నప్పుడు ,జైలుకు పోవటం నామమాత్రం  అయినప్పుడు ,కాంగ్రెస్ విషమ పరిస్థితి ఎదుర్కోక తప్పదు.ఈ ప్రశ్నలన్నీ  మమ్మల్ని బాధించాయి  గాంధీ అభిప్రాయానికి భిన్నంగా  కాంగ్రెస్ చాలా సార్లు అహింసా తీర్మానం చేసింది .1940జులై 7న కాంగ్రెస్ అధ్యక్షుడు ‘’కాంగ్రెస్ ప్రపంచ శాంతి స్థాపించే సంస్థకాదు రాజకీయ సంస్థ .అహింస విషయంలో గాంధీతో నడవలేదు .అరాచకం ,విదేశ దాడి పెరిగితే హింసా విధానం పూర్తిగా విడవగలమని మాలో చాలా మంది అనుకోము ‘’అన్న విషయం గుర్తుందా ?గత సంఘర్షణల్లో పాల్గొన్న వారనేకులు ఇపుడు నోరు విప్పలేకపోతున్నారు .మేమేదో తప్పుచేశామనే తీర్మానం మాకు బాధ కలిగిచింది .మేము దోషం చేశామని అనుకోవటం లేదు .మేముకోరేది ఆత్మగౌరవ సంర్ధనం కాదు .మా దృక్పద గణ్యతను   సమర్ధించమని కోరుతున్నాం .మాకోరికను మీరు హర్షించగలరని భావిస్తున్నాం.’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్

ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత  పట్వర్ధన్

5-2-1905 న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో అచ్యుత పట్వర్ధన్ జన్మించాడు .తల్లి తండ్రీ వైపు వారంతా సాంప్రదాయ కుటుంబీకులే.తండ్రి గొప్ప ప్లీడర్ మహాదాత .తల్లి వీరమాత .వీరి సంతానమంతా స్వాతంత్రోద్యంలో పాల్గొన్న వాళ్ళే ,తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమం లో పాల్గొని జైలు కెళ్ళింది .అచ్యత్ అన్న రావు చాలాసార్లు జైలు కు వెళ్ళాడు. సోదరి విజయ 1942ఉద్యమం లో కాలేజీ మానేసి ఉద్యమం లో చేరి అన్నకు ,జయప్రకాష్ నారాయణ కు కార్యదర్శిగా పని చేసింది .ఈ రహస్యోద్యమం లో  ఆమెకు తెలిసిన రహస్యాలు ఇంకెవ్వరికీ తెలియవు .గాంధీ గారి ‘’డు ఆర్ డై’’అనుసరిచి సోదరుడు ,సోదరి పని చేశారు .

  అచ్యుత్ మంచి సంగీత గాయకుడు .అన్ని వాయిద్యాలు వాయించేవాడు .చిన్నప్పటినుంచి దేశభక్తి గీతాలు పాడేవాడు .లెక్కలు వచ్చేవికావు . సంపన్న కుటుంబం కనుక ఇల్లు నిత్యాన్నదానాలు అతిధులతో కళకళ లాడేది .బాగా ధనవంతుడైన పినతండ్రికి పిల్లల్లేక అచ్యుత్ ను దత్తత తీసుకొన్నాడు .అచ్యూత్ , రావు అహ్మద్ నగర్ లో మెట్రిక్ పూర్తి చేసి ,బెనారస్ కాశీ విశ్వవిద్యాలయం లో చేరారు .1893నవంబర్ 16 అనీబిసెంట్ ఇండియారాగా జనం బ్రహ్మ రధం పట్టారు .ఆమె భారత్ నే మాతృభూమిగా భావించి దాస్య విముక్తికి సంకల్పించింది .ఇక్కడే దివ్యజ్ఞాన సమాజం స్థాపించి ప్రపంచమంతా వ్యాపింప జేసింది .మానవ సేవ పరమావధిగా ఉన్న ఆ సమాజం వైపు అచ్యుత్ తండ్రి ఆకర్షితు డయ్యాడు .

  1898జూన్ 6న లో బీసెంట్,  కొందరుకలిసి  ‘’సెంట్రల్ హిందూ కాలేజి ‘’స్థాపించారు.దీనికి ప్రిన్సిపాల్ గొప్ప విద్యావేత్త  డా జి ఎస్ అరండేల్ .ఇందులో పని చేసేవారంతా సేవాభావం తో చేసేవారే .ఒకరినిమించి మరొక ప్రజ్ఞా దురీణులు .భగవాన్ దాస్, గోవిందదాస్ ,గుర్తు, లాంగ్ వంటి మేదావులున్నారు .కొంతకాలం గడిచాక పండిత మదన మోహన మాలవ్యా దీన్ని తీసుకొని హిందూ విశ్వ విద్యాలయం గా మార్చాడు .ఇక్కడ చదివిన అచ్యుత్ సోదరులు పీకే తెలంగ్ ,జ్ఞాన్ చంద్ ల శిష్యులై వారి అడుగుజాడల్లో నడిచారు .రావు వక్తృత్వం లో దిట్ట ఎన్నో బహుమతులు పొందాడు .ఒకసారి విశ్వ విద్యాలయ పార్లమెంట్ కు  అచ్యుత్ ప్రధానిగా ఉన్నాడు .ఎం.ఎ.పాసై అచ్యుత్  యూరప్ వెళ్లి వచ్చి ఇక్కడే ఆర్ధిక శాస్త్ర లెక్చరర్ గా చేరి పని చేశాడు .

   దేశం లో శాసనోల్లంఘన ఉద్యమం మహాఊపుగా సాగుతోంది .రావు అప్పటికే ఉద్యమంలో చేరి జైలు కెళ్ళాడు .బొంబాయ్ ఉద్యమానికి గొప్ప కేంద్రమైంది .ప్రచారం కోసం ఉమాశ౦కర దీక్షిత్ ఒక రహస్య పత్రిక స్థాపించి నడిపాడు .పట్వర్ధన్ వెంటనే తానూ రహస్య ఉద్యమం లో చేరి  జైలుకెళ్లాడు .ప్రభుత్వ జైళ్ళు అన్నీ సత్యాగ్రహులతో నిండిపోయాయి .ఉద్యమం చల్లబడింది .యువకుల్లో ఉద్రేకం ఉప్పొంగింది .గాంధీ రాజకీయాన్ని సా౦ఘి కోద్యమం గా మార్చాడు .రష్యాలో లెనిన్ నాయకత్వం లో సామ్యవాద రాజ్యం స్థాపించటం ఇక్కడి యువకులకు అర్ధమై ,ఇక్కడ ఉద్యమానికి ‘’స్వరాజ్యం ‘’అన్నదానికి నిర్దిస్టరూపం ఇవ్వలేక పోవటం గమనించి తామే నడు౦కట్టాలని యువత భావించింది .సామ్యవాదమే పరిష్కారం అని నిర్ణయించారు .

   ఈ సామ్య వాద సిద్ధాంతానికి  నాసిక్ జైలు ప్రధాన కేంద్రమైంది .జయప్రకాష్ ,అచ్యుత పట్వ ర్ధన్, అశోక్ మెహతా, మీనూ మసానీ మొదలైనవారు కలిసి సిద్ధాంత రూప కల్పన చేశారు .1934 మేనెలలో పాట్నా అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో శాసనోల్లంఘన విరమిస్తూ ,శాసన సభా ప్రవేశానికి వీలుకలిగిస్తూ తీర్మానం చేశారు .అప్పుడే జయప్రకాష్ పట్వర్ధన్లు ,ఆచార్య నరేంద్ర దేవ్ అధ్యక్షత న సమావేశమే కాంగ్రెస్ మితవాద మార్గాన్నితీవ్రంగా విమర్శించి ,కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించి ,యువకులకు భాగస్వామ్య౦  కల్పించారు .

  యువకిశోరం అచ్యుత్  పట్వర్ధన్ పాట్నాలో కాంగ్రెస్ పై నిప్పులు కక్కుతూ రాట్నం –ఖద్దరు తో స్వరాజ్యం రాదనీ ఉపన్యసించాడు .కాంగ్రెస్ నాయకులీ ప్రసంగానికి ఆశ్చర్యపోయారు .1936లక్నో కాంగ్రెస్ కమిటీ సభలో కూడా పట్వర్ధన్ కాంగ్రెస్ ను తీవ్రగా విమర్శించాడు .యువకుల మనోభావం అర్ధం చేసుకొన్న నెహ్రు  నిర్మించిన అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గం లో సామ్యవాద యువకులైన  ముగ్గురు-జయప్రకాష్ ,నరేంద్ర దేవ్ ,పట్వర్ధన్ లకు  అవకాశం కల్పించాడు.మర్యాదగా తిరస్కరించాడు పట్వర్ధన్ .అప్పటికి అతని వయసు 30మాత్రమే .పదవీ వ్యామోహం ఆయనకు లేదన్నదానికి ఇదే నిదర్శనం  .

   1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక .ఇండియాను యుద్ధంలోకి ది౦చ వద్దని వాక్ స్వాతంత్ర హక్కు ఇవ్వమని గాంధీ వైస్రాయి లిన్ లిత్ గో తో మాట్లాడి విఫలుడయ్యాడు.రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రివర్గాల చేత రాజీ నామా చేయించాడు గాంధీ .వేరే మార్గం లేక గాంధీ  వైస్రాయియికి లేఖరాసి ,వినోబా భావేతో వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభింప జేశాడు .యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ సత్యాగ్రహం లో జనం పాల్గొని జనం స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు .వ్యష్టి సత్యాగ్రహం ప్రజాపోరాటం కాజాలదు అని కమ్యూనిస్ట్ లు  భావించినా ప్రపంచామంతావ్యష్టి సత్యాగ్రహం తో  మారు మోగింది .ప్రతిపోరాటం లోనూ ఏదో ఒక సాకుతో కమ్మీలు తప్పించుకోనేవారు .ఉప్పు సత్యాగ్రహాన్నికూడా ‘’ప్రజల పోరాట శక్తి తగ్గించే మత్తు మందు ‘’అని పెదవి విరిచారు .వ్యష్టి సత్యాగ్రహాన్ని ‘’పూలదండల సత్యాగ్రహం ‘’అని హేళన చేశారు ,1942ఆగస్ట్ ఉద్యమాన్ని ‘’ఆగస్టు అల్లర్లు ‘’అనీ జపాన్ ఏజెంట్లు ,పంచమాంగ దళం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యా చర్యలనీ ప్రచారం చేసిన ప్రబుద్ధులు కమ్యూనిస్ట్ లు .ఊరందరిదీ ఒకదారి ఉలిపి కట్టేది మరో దారి అనే సామెత వీరిది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం ) 

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం )

ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ

భూలాభాయ్ జీవితం లో మహత్తర ఘట్టం ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ .భారత్ నుండి రహస్యంగా జపాను వెళ్ళిన నేతాజీ సుభాశ్ చంద్ర  బోస్ నాయకత్వం లో శత్రువులకు భారత ప్రభుత్వ సైన్యం స్వతంత్ర జాతీయ సైన్యం అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ గా ఏర్పాడి భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం మొదలుపెట్టింది .భారత్ నుంచి బ్రిటిష్ వారిని వెడల గోట్టటమే వీరి ధ్యేయం .రెండవ ప్రపంచయుద్ధం పూర్తయి జర్మనీ ఇటలి పరాజయం పొందటం ,జపాన్ మిత్రమండలికి లొంగిపోవటం జరిగాయి .ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా లొంగిపోవాల్సి వచ్చింది .ఈ సైనికులలో చాలామందిని  బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .కొందరిని ఢిల్లీ లోని ఎర్రకోటలో బంధించి  హింసించింది .భారత ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ విషయం విచారించింది .ముందుగా విచారి౦ప బడిన నాయకులు కెప్టెన్ షా నవాజ్ ,లెఫ్టినెంట్ సైగల్ ,లెఫ్టినెంట్ ధిల్లాన్ . ఈ విచారణపై ప్రపంచం అంతా దృష్టి కేంద్రీకరించింది . ఫౌజుతరఫున వాదించటానికి భూలా భాయ్ దేశాయ్ ,నెహ్రు, ఆసఫాలీ లను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది .ఎక్కువ శ్రమ తీసుకొని నేతాజీ విడుదలకు కారణమైనవాడు  భూలాభాయ్ .బోసు సర్వ సైన్యాధిపతిగా స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ,మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన బోసువీరులను భారత ప్రభుత్వం రాజద్రోహులుగా పరిగణించటం ప్రపంచ స్వతంత్ర దేశాలన్నీ విని ముక్కు మీద వేలేసుకొన్నాయి .స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటేరోజుల్లో ,బ్రిటన్ పై యుద్ధం చేయటం నేరంగా భావించి విచారిస్తున్నదుకు సభ్య ప్రపంచం నివ్వెర పోయింది .లాల్ ఖిల్లా తీర్పుకోసం ఉత్కం తో ఎదురు చూసింది .

  భూలాభాయ్ వాదిస్తూ ‘’పరప్రభుత్వం పై యుద్ధ ప్రకటన ప్రతి పరతంత్ర జాతి జన్మ హక్కు ‘’అని గట్టిగా గంభీరంగా ప్రకటించాడు .తన యావత్ శక్తియుక్తులన్నీ ధారపోసి వాదించాడు భాయ్ .ఆయనవాదనను విని మెచ్చి సంతోషించని వాడే లేడు ఆనాడు .112మంది సాక్షులతో వాజ్మూలాలు చెప్పించాలనుకొని ,కాని ప్రాసిక్యూషన్ వారి 28సాక్షుల మాటలూ విన్నతర్వాత ,అందులో పసలేదని గ్రహించి ,,కేవలం 11మంది సాక్షులతోనే సరిపుచ్చి రెండు రోజులు ఫౌజుచర్యను సమర్ధిస్తూ దీర్ఘ ఉపన్యాసాలు చేశాడు .ఆయన సంది౦చిననమౌలిక ప్రశ్నలు –1-పరాధీన జాతికి స్వాతంత్రం కోసం యుద్ధం చేసే హక్కు ఉందా లేదా ?ఉన్నదనటానికి అనేక ప్రమాణాలున్నాయి 2-సువ్యవస్థమైన స్వతంత్ర భారత తాత్కాలిక సైన్యానికి మలయాలో 2లక్షల 50వేలమంది ,తూర్పు ఆసియాలో 2లక్షలమంది ప్రజలు భక్తీ విశ్వాసాలు చాటారు .అక్షరాజ్యాల ఆమోదం కూడా పొందింది ఈసైన్యం .ఇవన్నీ యదార్ధ విషయాలే కల్పనలుకావు .3-ఆజాద్ హింద్ ఫౌజ్ సువ్యవస్థిత సైన్యం ,దానికి చట్టముందనీ నేనేమీ శ్రమపడి వాది౦చ క్కరలేదు .దస్తావేజులపై దస్తావేజులు ప్రాసిక్యూషన్ వారే సమర్పింఛి రుజువు చేసినందుకు ధన్యవాదాలు .అయితే ఆ చట్టం లో కొరడాలతో కొట్టే నిబంధనను మాత్రమే అడ్వకేట్ జనరల్ అధిక్షేపించారు 4-1911 ఇండియన్ ఆర్మీ చట్టం లో 45వ అధికరణాన్ని ఆయన మర్చి పోయినట్లున్నాడు .అందులో బ్రిటిష్ ఇండియన్ చట్టం కింద దండనార్హం అయిన ఏ సివిల్ నేరానికైనా వారంట్ ఆఫీసర్ హోదా కంటే తక్కువ హోదా ఉన్నవారి ని 30కొరడా దెబ్బలు కొట్టాలని ఉంది .యుద్ధకాలానికి మాత్రం దాన్ని తొలగించారు ,కనుక స్టాట్యూ ట్ లో లేదని చెప్పటానికి వీల్లేదుకదా .కొరడా దెబ్బలను ఆమోదించిన సందర్భాలు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ లో చాలా ఉన్నాయి .5-ఫౌజ్ యుద్ధం ప్రకటించటానికి రెండు కారణాలున్నాయి .ఒకటి ఇండియాకు స్వాతంత్రం. రెండు తూర్పు ఆసియా ప్రజల ధనమాన ప్రాణ రక్షణ 6-నూతన ప్రభుత్వానికి జపాన్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవులను ధారా దత్తం చేసింది .ఈ ప్రభుత్వం స్వయంగా 50చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న ‘’జయవాడే ‘’అనే భూభాగాన్ని సంపాదించింది .సుమారు 1500చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న మణిపూరు ,విష్ణు పూరు ప్రాంతాలను అయిదారు నెలలు పాలించింది కూడా .అండమాన్ దీవులను కర్నల్ లోకనాధం రెండు శాఖలు మాత్రమే నిర్వహించాడు .అందులో ఒకటి చిన్నదైన విద్యాశాఖ. స్కూళ్ళు ఎక్కువ లేవు ఖర్చు తక్కువ అని అధిక్షేపించక్కరలేదు .15శాతం అక్షరాస్యతున్న మనదేశం లో కంటే అక్కడే ఎక్కువ స్కూళ్ళు న్నాయి .ఈ దీవులకు ‘’షాహిద్ ‘’,’’స్వరాజ్’’ అనే పేర్లు కూడా పెట్టారు .జయవాడిలో 15వేలమంది ప్రజలున్నారు . వారంతా భారతీయులే ,ఆజాద్ హింద్ ప్రతినిధే వీటిని  పాలించాడు 7-ఫౌజు ఇండియా-బర్మా సరిహద్దు దాటినప్పుడు రెండు ఫర్మానాలు జారీ అయ్యాయి .ఒకటి స్వతంత్ర భారత ప్రభుత్వ అధ్యక్షుని  చేత ,రెండవది జనరల్ కావేబే చేత .జపాన్ జయించే భారత్ భూ భాగమంతా ఫౌజు కే అప్పగించబడుతుందనీ ,వారే దాన్ని పాలిస్తారని ఫర్మానాల సారాంశం .8’’స్టాంప్ కలె క్టింగ్’’ అనే వారపత్రికలో టి.యే .బ్రో హెడ్ అనే విలేకరి ఇ౦ఫాలులో  ఉపయోగానికి ముక్కాణీ,అణా స్టాంపుల ప్రూఫ్ కాపీలు తానూ చూశానని’’ ఢిల్లీ కోట’’ బొమ్మ ,’’ఢిల్లీ చలో’’ అనే నినాదం వాటిపై ముద్రించబడి ఉందనీ  రెండు భాషలలోనూ  ‘’తాత్కాలిక భారత ప్రభుత్వం ‘’అని ఉందనీ ,తర్వాత వీటి అవసరంలేక ఆ అచ్చులు భగ్నం చేయబడి స్టాంపులు తగలబెట్ట బడినాయని.కనుక తాత్కాలికప్రభుత్వం ఏర్పడి పరిపాలించటం జరిగింది కనుక దానికి యుద్ధం చేసే హక్కుకూడా ఉన్నదని  ఒప్పుకోక తప్పదు.యుద్ధకాలంలో జరిగే పనులు సాధారణ ‘’లా ‘’క్రిందకు రావు .యుద్ధకాలం లో ఒక జర్మన్ పౌరుడు బ్రిటిష్ వాడి నెవరినైనా కాల్చిచంపితే హత్యాద్రోహం కింద శిక్షిస్తారా ?9-అంతర్జాతీయ న్యాయ శాస్త్రం ప్రకారం పరదాస్యం నుంచి విముక్తికావటానికి ఏ దేశమైనా చేసే యుద్ధం ధర్మ సమ్మతమే అవుతుంది .యుద్ధం చేసే ఆ రెండు పక్షాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండనక్కర లేదు .బోయర్ యుద్ధం దీనికి ఉదాహరణ  మొదటి చార్లెస్ ను ఉరితీయటాన్ని మీరు ఏమంటారు ?రెండవ జేమ్స్ కధఏమిటి ?’’10-ఫౌజు సైనికులు తిరుగుబాటు దార్లే కావచ్చు ,కాని 1870లో అమెరికన్ సభాపతి గ్రాంట్ ‘’తిరుగుబాటు దార్ల పోరాటం అంతర్జాతీయ ధర్మం ప్రకారం యుద్ధం కిందకే వస్తుంది ‘’అని బల్ల గుద్ది చెప్పలేదా  ? రెండవ పక్షం ఓడిపోయిన వ్యక్తులపై దోషా రోపణ చేయరాదని అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పుల్లర్  తీర్పు ఇవ్వలేదా ?11-స్పానిష్ –అమెరికన్ కాలనీలు స్వతంత్రంకోసం స్పెయిన్ దేశం పై తిరుగుబాటు చేస్తే  ఆ పోరాటాన్ని సక్రమ యుద్ధం అనే బ్రిటన్ చెప్పలేదా .ప్రభుభక్తి శాశ్వత ధర్మం కాదు .అలా అయితే ఏ పరాధీన జాతీ స్వతంత్రాన్ని పొందనే లేదు 12-ప్రభుభక్తికీ దేశభక్తికీ సంఘర్షణ వస్తే దేశ భక్తినే ఎంచుకోవాలని 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటనే గొప్ప నిదర్శనం .ఇదే న్యాయం కాకపొతే ప్రపంచం లో న్యాయాని చోటే ఉండదు 13-‘’లా ఆఫ్ నేషన్స్ ‘’అనే  వాటిల్ ప్రామాణిక ప్రాచీన ఆంగ్ల ధర్మ శాస్త్రం లో ‘’ప్రజల రాజ్య సంరక్షణ కింద ఉన్న ఒక దుర్బల రాజ్యాన్ని ,ఆ ప్రజల రాజ్యం రక్షించలేక పొతే ,ఆ దుర్బల రాజ్యం వెంటనే స్వతంత్రాన్ని మళ్ళీ పొందుతుంది ‘’అని ఉన్నదాన్ని బట్టి ఆజాద్ హింద్ ఫౌజు నిర్మాణ సందర్భం లో కూడా ఇలాంటిపరిస్థితు లే ఏర్పడ్డాయి 14.చివరగా క్రూరకృత్యాలు హత్యలుజరిపారు అన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ సాక్షులే క్రాస్ పరీక్షలో చెప్పలేక పోయారు .ఇక్కడ హింసలు అంటే నియమ ఉల్లంఘన  చేసినందుకు శిక్షే కానీ వేరేదీ కాదు అని గ్రహించాలి 15-హత్యల విషయం రుజువే కాలేదు .మహమ్మద్ హుస్సేన్ ను తుపాకీ తో కాల్చినట్లు చేసిన అభియోగం లో ని ముగ్గురు సిపాయిలలో జాగీరాం కు అంతకు ముందు ఎప్పుడూ తుపాకి పట్టనే లేదని చెప్పాడు ,ముగ్గురి గుళ్ళూ అతని గుండెలో దిగాయన్న ప్రాసిక్యూషన్ ఆరోపణలో పస లేదనిరుజువైంది కదా .ఇలాంటి మేధో విలసిత అత్యంత అనుభవ పూర్వక భూలా భాయ్ డిఫెన్స్ వాదన కు ప్రభుత్వ మైండ్ బ్లాకై పోయింది .ముద్దాయిలను బేషరతుగా విడిచిపెట్టింది .

  బోసు వీరుల విడుదలవగానే భూలా భాయ్ ని అభినందిస్తూ దేశం నలు మూలాలనుంచి అభినందన టెలిగ్రాములు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .బోసువీరులూ భాయ్ ని అభినదించారు .  బొంబాయి ప్రోగ్రెసివ్ గ్రూప్ సమావేశం లో భాయ్ ప్రసంగిస్తూ ‘’షా నవాజ్ ,సైగాల్ ,ధిల్లాన్ లను విచారిస్తున్నప్పుడు భారతజాతీయ సేనకు చెందిన 40వేల మంది ఆఫీసర్లు సామాన్య సైనికులు లాల్ ఖిలాలో విచారి౦పబడ్డారు .ఈ ముగ్గురు ఆఫీసర్లు భారతీయ యువకులకు ప్రతినిధులు .స్వాతంత్ర్యం తదితర సమస్యల కంటే ఎక్కువ గుణ పాఠం ఫౌజు విచారణలో భారతీయులకు నేర్పింది ‘’అన్నాడు .ఈ విచారణ తర్వాత భాయి రాజకీయాలనుండి విర మించాడు .

  భూలాభాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది .దీనికి కారణం ఫౌజు కేసు విచారణలో ఆయన నిద్రాహారాలు మానేసి కృషి చేయటమే అని పెద్దలంతా భావించారు .తీవ్రమైన జబ్బులోకూడా మౌలానా అబ్దుల్ కలాం కోసం’’ ఆజాద్ ,ఆజాద్’’ అని కలవరించాడు .అంతటి మమైక్యం పార్టీతో వ్యక్తులతో ఆయనకు ఉండేది .నాలుగు నెలలు బాధపడి చివరకు 5-5-1946 న స్వాతంత్రం రాకుండానే భూలాభాయ్ దేశాయ్ 68వ ఏట బొంబాయి స్వగృహం లో మరణించాడు . పెద్ద ఊరేగింపుగా ఆయనను స్మశానానికి వేలాది అభిమానులు పౌరులు పెద్దలతో తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు .ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక లాంచనాలతో తమ నివాళి అర్పించింది .

.గాంధీ ‘’మహా నాయకుడు దేశాయ్ .ఆయన బాధ కు పరి సమాప్తి లభించింది .అందరికి ఆయన ఆదర్శనీయుడు ‘అన్నాడు .ప్రకాశం పంతులు ‘’క్రాస్ పరీక్షలో మేటి .న్యాయ శాస్త్ర మేధావి ‘’అన్నారు .ఆజాద్ ‘’అసెంబ్లీలో నాయకుడుగా గొప్ప దేశ సేవ చేశాడు ఈ కేసు ద్వారా అంతర్జాతీయ న్యాయ శాస్త్రం లో ఒక నూతన అధ్యాయం ఆవిర్భవించింది ‘’.నెహ్రూ ‘’బోసు వీరుల విచారణలో ఆయన ప్రసంగం చిరస్మరణీయం ‘’.జిన్నా ‘’నాతో ఏకీభవించలేదు కాని మాస్నేహం భంగం కాలేదు ‘’.ఆలీఖాన్ ‘’ఆయన ప్రసంగాలు శ్రోత్ర పేయాలు ‘’.కెప్టెన్ షా నవాజ్ ‘’మా దేశ ప్రజలే మమ్మల్ని జపాను చేతిలో కీలు బొమ్మలు అంటారని భయపడ్డాం .దేశాయ్ ధైర్యంగా ముందుకొచ్చి నేతాజీ గౌరవాన్ని ,దేశ గౌరవాన్ని కాపాడాడు ‘’.సరోజినీ నాయుడు ‘’దయ ఉదారహృదయం ఉన్నవాడు ఆయన చేసిన దానాలకు  లెక్కే లేదు .స్వాతంత్రం కోసం త్యాగం చేశాడు ‘’. కెప్టెన్ సెఘాల్ ‘’జీవించి ఉంటె స్వతంత్ర భారతానికి ఇంకా ఎక్కువ తోడ్పడి ఉండేవాడు ‘’.రాజాజీ ‘’కుశాగ్ర బుద్ధి కుసుమకోమల హృదయుడు .ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు ‘’.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ‘’దేశానికి స్వతంత్రం రాకముందే మరణించటం విచారకరం ‘’.కేఎం మున్షి ‘’నేను దేశాయ్ శిష్యుడిని .ఆయన లేని లోటు తీర్చలేనిది ‘’.జెవి మౌలంకర్ ‘’భారత దేశ యోగ క్షేమాలకోసం న్యాయశాస్త్రాన్ని ఉపయోగించిన ఉత్తమ వ్యక్తీ ‘’.సర్దార్ పటేల్ ‘’ఆయన సేవలకు దేశం ఎంతో రుణపడి ఉంది ‘’.డా.రాజేంద్ర ప్రసాద్ ‘’ఆయనమరణం నన్ను కలచి వేసింది ‘’.డా.లతీఫ్ ‘’రాజీ పద్ధతిలో సిద్ధహస్తుడు దేశాయ్ ‘’.కే భాష్యం’’నాయకులకు ఆయన సలహాలు అత్యంత అవసరమైన తరుణ౦ లో మరణించాడు ‘’.వివి గిరి ‘’రాజనీతిజ్ఞుడైన న్యాయవాది ‘’.రామస్వామి అయ్యర్ ‘’అనేక సంస్థానాలు ఆయన సలహా కోరేవి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఫౌజు కేసు చేబట్టిన ధీమూర్తి ‘’. హరేకృష్ణ మెహతాబ్ ‘’దేశాయ్ విశదీకరణ విప్లవకారులకు శిలాశాసనం ‘’.గోపీనాధ బార్డో లాయ్’’దేశ స్వాతంత్రంకోసం వాదించిన అత్యుత్తమన్యాయవాది దేశాయ్ ‘ఒక ఉజ్వల తార అస్తమించింది ‘’అంటూ ప్రముఖులు నివాళి అర్పించారు . మద్రాస్ లో సానుభూతి తీర్మానం చేశారు .పెక్కు చోట్ల హర్తాల్ జరిగింది .పత్రికలూ ప్రత్యేక వ్యాసాలు రాశాయి .ధన్యజీవిగా అభి వర్ణించాయి .

  బ్రిటన్ లో చర్చిల్ ప్రభుత్వం పోయి, లేబరు ప్రభుత్వం రాగానే పార్లమెంటరీ రాయబారులు ఇండియా వచ్చి ఇక్కడి దుస్థితిని  ప్రభుత్వానికి తెలియజేశారు .ప్రతిస్టంభన పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులను పంపింది .వారొచ్చి,గాంధీ జిన్నా మొదలైనవారితో సిమ్లాలో  సంప్రదింపులు జరుపుతుండగా భూలాభాయ్ మరణ వార్త తెలిసింది  .భూలాభాయి ఆత్మకు శాంతికలగాలని అందరూ కోరారు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-10-20-ఉయ్యూరు ’

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3      

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3

1-స్వతంత్ర రాజ్యాలతో అఖండ భారత్ ఉండాలి .2-కేంద్ర ప్రభుత్వమే దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ ,నాణాలముద్రణ వగైరాది అధికారాలు కలిగి ఉండాలి 3-హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం లకు సంపూర్ణ మత స్వేచ్చ ,అందరితో సమానావకాశాలు ,గౌరవ రాజకీయ ప్రతి పత్తితో రాజ్యపద్దతి ఉండాలని ,పాకిస్తాన్ ఏర్పాటు తమకిస్టం లేదని,ఐకమత్యమే బలమని ,ఐకమత్యంలేకపోతే మరో ‘’బాల్కని రాజ్య ‘’అవుతుందని హెచ్చరించారు .కనుక భూలాభాయ్ ,ఆలీఖాన్ కలిసి కల్సి ఉండే ప్రణాళిక తయారు చేసి వైశ్రాయికి అందజేశారు .ఇందులో ముఖ్యసూత్రాలు -1-కేంద్రంలో తాత్కాలికంగా హిందూ ముస్లిం ల ప్రభుత్వం ఏర్పరచి ,అల్పసంఖ్యాకులకు తిన ప్రాతినిధ్యమివ్వటం .2.ఈప్రభుత్వం ఇండియాచట్టానికి లోబడి పని చేయటం .తర్వాత ,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను  విడుదల చేయటం మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని బట్టి వైస్రాయి నడుచుకోవటం .1945జూన్ 10న పంచగనిలో విశ్రాంతిలో ఉన్న  గాంధీజీ ని ఈ ఇద్దరు కలిసి ప్రణాళికకు ఆయన ఆశీస్సులు పొందారు.

      వైస్రాయి వేవెల్ లండన్ వెళ్లి ,అక్కడి బ్రిటిష్ మంత్రులతో సంప్రదించి ,తిరిగివచ్చి ,1945జూన్ 15వర్కింగ్ కమిటీ సభ్యులను విడుదల చేశాడు .ప్రణాళికపై చర్చించటానికి సిమ్లాలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మొదలైనపార్టీ ల సభ జరిగింది  .అన్నిపార్టీల వారూ వేవెల్ నే నాయకుడుగా అంగీకరించారు .వేవెల్ జూన్ 29నుంచి జులై 14వరకు సమావేశం సాగించి సాగించి చివరికి సంప్రదింపులు భగ్నమయ్యాయనే ఆశ్చర్యవార్త ఆశగా ఎదురు చూస్తున్న వారికి తెలియ జేసి వైఫల్యానికి కారణం తానే అంటూ  వేవెల్ ప్రకటించాడు .సిమ్లా సభ విఫలమయ్యాకు భూలాభాయ్ ని జాతీయ వాదులు  నిందించారు.వర్కింగ్ కమిటీ సభ్యులంతా జైల్లో ఉంటె స్వతంత్రించి ప్రతిపక్షాలతో ఒడంబడిక చేసుకోవటం ఏమిటని దూషించారు  .దేశాయ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ కార్య దర్శి శ్రీప్రకాశ’’నిర్బంధంలో ఉన్న కమిటీ సభ్యులను విడుదల చేయించటానికే భూలాభాయ్ చొరవ తీసుకొన్నాడు .ఆయన చేసింది నూటికి నూరుపాళ్ళు చట్టబద్ధమే .కమిటీ సభ్యులను విడుదల చేయటానికి వైస్రాయి విముఖత చూపటం వలననే ఈ ఆలోచన చేశాడు భాయ్ లేకపోతె మనవాళ్ళ విడుదలకు ఆశలే ఉండేవికావు .విడుదలైనవారికి జరుగుతున్న స్వాగతాలు ,వాక్ స్వాతంత్రం ,వ్రాసే స్వాతంత్రం వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఆజంట సాధించిన విజయాలే .సిమ్లాసభ వైఫల్యానికి వైస్రాయేకారణం  .జిన్నా వైఖరి మంకుపట్టుకూడా కలిశాయి .జిన్నా ముసల్మానులకు లు ద్రోహం చేశాడు,అతనిలో ముస్లిం అంశ,సంస్కృతీ లేవు  ఇన్నాళ్ళూ బూకరిస్తున్న జిన్నాను వైస్రాయి నొక్కాల్సిన చోట నొక్కాడు .’’అని డాక్టర్ సయ్యద్ యార్జంగ్ ఒక  ప్రకటన చేశాడు .కనుక భూలాభాయ్ తప్పేమీలేదు .అతడు ప్రశంస నీయుడే ‘’అని ప్రకటించాడుశ్రీప్రకాశ.

   స్వాతంత్రం కోసం కృషి  చేసే యువకులను చూస్తే భూలాభాయ్ కి ఎంతో సరదా .కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ లు ఉద్యమ చేయటం చూసి వారిపై సానుభూతికలిగింది భాయ్ కి .సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన యుద్ధం ప్రజాయుద్ధమన్నారని ఆగస్ట్ విప్లవాన్ని వెన్నుపోటు పొడిచారని కమ్మీలపై ప్రజలకు కోపం .గాంధీ విడుదలయ్యాక ,కమ్యూనిస్ట్ కార్యదర్శి పిసి జోషి ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .గాంధీ వారికి అయిదు ప్రశ్నలు వేశాడు –ప్రజాయుద్ధం అన్న మాటలో ప్రజ అంటే ఎవరు 2-మీ పార్టీ   ఆడిట్ కు ఎవరైనా ఒప్పుకుంటారా?3-రెండేళ్లుగా కార్మికులతో సమ్మె చేయించి వారి నాయకుల అరెస్ట్ కు మీరుతోడ్డారని అంటారు నిజమేనా ?4-కాంగ్రెస్ లో  చొరబడటం ఒక విధంగా మీ కుటిల నీతి కాదా  5-మీపార్టీ పై ఇతర దేశాల పెత్తనం ఉందికదా ?

  తనపై ఆరోపణలను భూలాభాయి సరోజినీ నాయుడు ,రాజాజీ వంటి వారి తో కమిటీ వేసి విచారించమని జోషి గాంధీని కోరాడు .తాను  చెప్పాల్సిందంతా గాంధీకి చెప్పానని రాజాజీ అన్నాడు .అనారోగ్యం వలన  భాయ్ వెంటనే చెప్పలేకపోయినా తర్వాత పరిశీలించి గాంధీకి తన అభిప్రాయం తెలిపాడు .రెండుపార్టీలుభాయ్ ని మధ్యవర్తి గా ఉండ మనటం మాయన నిష్పక్షపాతానికి నిదర్శనం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2

   కేంద్ర అసెంబ్లీ లో భూలాభాయ్ మాట్లాడిన విషయాలు ఒక తీవ్రవాది మాట్లాడినంత పరుషంగా ఉండేవి .ఇండో బ్రిటిష్ వ్యాపార వొడంబడిక ,జాయంట్ పార్లమెంటరి కమిటీ నివేదిక క్రిమినల్ లా సవరణ బిల్లు ,ఆర్మీ రిక్రూట్ మెంట్ బిల్లు ,ఆర్దికబిల్లు మొదలైన విషయాలలో భాయ్ చేసిన ఉపన్యాసాలు చాలా విలువైనవి .బ్రిటిష్ పాలకులుయుద్ధ సమయం లో  భారత దేశం లో ప్రజా ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంటే ,ఇండియాకు స్వాతంత్రం ఇవ్వటానికి హిందూ ముస్లిం సఖ్యత లేదన్న అసత్య ప్రచార సమయం లో ,భారత శాసన సభలో భూలాభాయ్ నాయకత్వం లో అసెంబ్లీ సభ్యులైన కాంగ్రెస్ వారు ,ముస్లిం లీగు సభ్యులు కూడా ఏకమై ,ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు ను అనేక సార్లు ఓడించారు .శాసన సభ్యుల ఐక్యత చూసి తెల్ల ప్రభుత్వం  తెల్ల బోయింది .హిదూ ముస్లిం ఐక్యత ఏర్పడు తుందేమోనని కంగారు పడింది కూడా .ఫైనాన్స్ బిల్లును ఓడించి భారత్ లో ప్రజా స్వామిక ప్రభుత్వం లేదని ప్రపంచానికి నిర్దంద్వంగా తెలియ జేశారు భూలాభాయి  నాయకత్వంలోని సభ్యులు .ప్రభుత్వం చెప్పేదాంట్లో సత్యం లేదని నిరూపించారు .సభలో ఓడిన బిల్లును వైస్రాయి వీటో అధికారం ప్రయోగించి బలవంతంగా రుద్దే దురుద్దేశాన్ని లోకానికి చాటగలిగారు .1935నుంచి 45వరకు ఉన్న దశకం లో దేశం రాజకీయంగా అట్టుడికి పోతున్న తరుణం లో ,సెంట్రల్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడుగా భూలాభాయి ఉంటూ, యెనలేని కీర్తి నార్జించాడు దేశ విదేశాలలో .

  1939సెప్టెంబర్ లో ప్రారంభమైన రెండవప్రపంచ యుద్ధం లో  భాగస్వామిగా ఇండియాను చేయాలని ప్రభుత్వం కోరగా భారతీయులు అంగీకరించక అసమ్మతి తెలిపారు .బ్రిటిష్ వారి స్వంతయుద్ధాలలో ఇండియా 1927నుంచీ పాల్గోన్నదనీ ,కాంగ్రెస్ గుర్తు చేస్తూనే ఉంది .యుద్ధం ప్రారంభం కాగానే గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధం ఉద్దేశ్యం ఏమిటి అని నిలదీశారు .దానికి ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని రూపుమాపి ,ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటమే అని ప్రభుత్వం సమాధానం చెప్పింది .’’మీతో కలిసి సమానంగా యుద్ధం చేసి శత్రు సంహారం చేయటానికి మాకుకూడా మీతో పాటు సమాన ప్రతిపత్తి ఇవ్వండి ‘’అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరింది .కానీ కుటిల తెల్ల ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా ,ఇండియాను యుద్ధంలోకి దించి ,ఇండియా అంగీకరించే యుద్ధం చేస్తోందని ప్రభుత్వం ప్రచారం చేసింది .ఈ అసత్య ప్రచారాన్ని త్రిప్పికొట్ట టానికే కాంగ్రెస్ వ్యష్టి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది .

 అప్పటికే అధికారం లో ఉన్న ఆరు రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ,ఇండియా యుద్ధం లో పాల్గొనటానికి అసమ్మతిగా మంత్రిపదవులను త్యజించి వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొన్నారు .1940 డిసెంబర్ 1 న భూలాభాయ్ ని అరెస్ట్ చేసి ,ఎరవాడ సెంట్రల్ జైలులో డిటిన్యుగా   తీసుకు వెళ్ళింది .జైలులో ఆయన జబ్బు పడ్డాడు .1941సెప్టెంబర్ 17న విడుదల చేసింది .

  భూలాభాయ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడుగా ,బొంబాయి రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండేవాడు .1942లో కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశాడు  .1942ఏప్రిల్ లో క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక,ఆగస్ట్ 7న బొంబాయి కాంగ్రెస్ సమావేశం లో ‘’బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం నుంచి పూర్తిగా వైదొలగాలి ‘’అనే తీర్మానం చేయటానికి సమావేశమైంది .ఆగస్ట్ 8న జాతీయ నాయకులను అరెస్ట్ చేసి అహ్మద్ నగర్ కోటలో బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .దేశంలో ఉవ్వెత్తున విప్లవం చెలరేగింది .అణచటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి ,విఫలమై మారణ యంత్రాలను కూడా ప్రయోగించింది .మహాత్ముని అర్ధాంగి కస్తూరిబాయ్ మాత  ,ఆయన కుడిభుజం మహ దేవ దేశాయ్ మరణించారు .ఈ మరణాలు ప్రజల్ని మరింత ఉద్రేక పరచాయి .గాంధీ ఆగాఖాన్ భవనం లో ఉపవాసం చేసి ,ఆగస్ట్ ఉద్యమానికి కాంగ్రెస్ కారణం కాదనీ ప్రభుత్వానినిదే బాధ్యత అని నిరూపించాడు .అనారోగ్య రీత్యా ఆతర్వాత గాంధీని విడుదల చేశారు .

  దేశంలో జరుగుతన్న ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు ఎంతోవ్యధ చెందుతున్నాడు  భూలాభాయ్  .గాంధీ   నెహ్రు అజాట్ వంటి అగ్రనాయకులు జైల్లో ఉండటం ఆయన్ను కలచి వేసింది .వారి విడుదలకు ,ప్రతిష్టంభన తొలగటానికి మార్గాలు  అన్వేషించాడు.శాసన సభా ప్రతిపక్ష నాయకూడుగా  ,ముస్లిం  పక్ష ఉపనాయకుడునవాబ్ జాదా లియాఖత్ ఆలీఖాన్ తో సంప్రదించి ఇద్దరూకలిసి అన్యోన్యంగా కేంద్రం లో జాతీయ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా నైనా ఏర్పాటు చేస్తే సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అని అలోచించి లియాఖత్ నుఒప్పించి ఒక ప్రణాళిక తయారు చేశాడు భూలాభాయ్ . రెండవ ప్రపంచం మొదలైన నాటి నుంచీ జనాబ్ జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగు ఈశాన్య వాయవ్య రాష్ట్రాలతో ముస్లిం మేజారిటీరాష్ట్రాలను పాకిస్తాన్ పేరుతొ నిర్మించాలని కోరింది .జిన్నా వాదం ప్రమాదమైనదని జాతీయ ముస్లిం లు వాదించారు .దేశాన్ని రెండుముక్కలు చేయాల్సిందే అని పట్టుబట్టాడు జిన్నా .భారత దేశం అవిభాజ్యం అన్నది కాంగ్రెస్ .పాకిస్తాన్ వాదాన్ని ఖండిస్తూ జాతీయ ముస్లిం లు భావి భారత ప్రజలంతా సంపూర్ణ స్వాతంత్ర్యం తో తులతూగాలని ప్రచారం చేశారు .రాజ్యపద్దతి ముఖ్యంగా మూడు అంశాలపై ఆధార పడి ఉండాలని వా౦ఛి౦చారు . అ వివరాలు తర్వాత తెలుసుకొందాం .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

స్వాతంత్రోద్యమఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -1

భూలా భాయి జీవంజీభాయి దేశాయ్ 13-10-1877 న గుజరాత్ లోని సూరత్ జిల్లా చారిత్రాత్మక బార్డోలికి దగ్గరున్న బల్సూరులో   అనవిల్ బ్రాహ్మణ న్యాయవాద  కుటుంబ లో పుట్టాడు .తండ్రి ప్రభుత్వ ప్లీడర్ .స్వగ్రామ౦ లో చదువు ముగించి బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజిలో చేరి ప్రధమ శ్రేణిలో పట్టా పొంది ,ఎం ఏ పాసై ,అహ్మదాబాద్ కాలేజిలో  హిస్టరీ ప్రొఫెసర్ అయ్యాడు . రెండేళ్ళు పని చేసి ,ఎల్.ఎల్ .బి.చేసి ,బాంబే హైకోర్ట్ లో న్యాయవాదిగా చేరాడు .అక్కడ అందరూ బారిస్టర్లే.స్వదేశీ న్యాయవాదిగానే ఉంటూ భూలాభాయ్ ,వాదనా సామర్ధ్యం తో త్వరలోనే అద్వితీయ న్యాయవాది యై ,ప్రభుత్వం దృష్టిలోపడి ,1923లో వైస్రాయ్ కార్యవర్గ పదవి ని స్వీకరించమని కోరినా నిరాకరించి, అనేకసార్లు ,హై కోర్ట్ న్యాయమూర్తి పదవికిఆహ్వాని౦చినా తిరస్కరించి ,1926లో తాత్కాలికంగా అడ్వొకేట్ జనరల్ పదవి మాత్రం స్వీకరించాడు .

  మితవాదిగా రాజకీయం లోకి ప్రవేశించి,అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం లో  భూలాభాయ్  పని చేసి విస్తృత ప్రచారం తెచ్చాడు .అప్పుడే గాంధీజీ వల్లభభాయ్ పటేల్ లతో పరిచయం కలిగింది .1928 బార్డోలీ సత్యాగ్రహం  చరిత్రాత్మకమై సైమన్ కమీషన్ బహిష్కరణ లో దేశం ఊగిపోయింది .ప్రజలు అనేక కస్టనష్టాలు  ఎదుర్కొంటూ అత్యంత ధైర్య సాహసాలతో ‘’సైమన్ గోబాక్ ‘’నినాదాలతో దేశాన్ని అట్టుడికి౦చారు .అప్పుడే బార్దోలీలో రీ సెటిల్ మెంట్ విషయంలో పన్నుల నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది .ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించింది .1930లో గాంధీ –ఇర్విన్ ఒడంబడిక జరిగి ,లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సభకు గాంధీకి ఆహ్వానం వచ్చింది .గాంధీ నిరాకరించాడు .బార్డోలీ పన్నుల విషయం లో ఒక ప్రత్యేకకోర్టు పెట్టి విచారిస్తామని ప్రభుత్వం తెలియజేయగా గాంధీ లండన్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు .1931లో బార్డోలీ విచారణ సంఘం ఏర్పడింది .

 1928లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రూం ఫీల్డ్ కమిటీ ముందు  రైతులపక్షాన భూలాభాయ్ వాదింఛి,1931 బార్డోలీ విచారణ సంఘం  ఎదుట కూడా వాదించాడు  1932సత్యాగ్రహ ఉద్యమం లో గాంధీతో పాటు పాల్గొన్నాడు .ఈ మహోద్యమానికి ముఖ్యకారణం లార్డ్ విల్లింగ్టన్ వైఖరే .గాంధీ లండన్ నుంచి రాగానే నెహ్రూను అలహాబాద్ లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను పెషావర్ లోనూ దేశవ్యాప్తంగా వేలాది సత్యాగ్రహులను  అరెస్ట్ చేసి౦ది ప్రభుత్వం .కలకత్తాలో ఆర్డినెన్స్ పెట్టారు .దేశమంతా నానా భీభత్సంగా ఉన్నది .గాంధీ వైశ్రాయికి ఒక టెలిగ్రాం పంపిస్తూ ఆయనతో మాట్లాడాలని ఉందని తెలిపాడు .రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విషయాలుతప్ప ,ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదని జవాబు రాగా, గత్యంతరం లేక కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటానికి దిగాల్సి వచ్చింది .

 ఉద్యమం జయప్రదంగా సాగుతుంటే వైస్రాయ్ ఆరు వారాలలో అణచి వేస్తానని  ప్రగల్భాలు పలుకగా ,,ఉద్యమం ఉవ్వెత్తున రెండేళ్ళు నడిచింది .1921ఉద్యమం లో 30వేల మంది 1930ఉద్యమం లో 60వేలమంది ,1932లో లక్ష ఇరవై వేలమంది  ప్రజలు స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు  ,1932లో సత్యాగ్రహ ఉద్యమంలో భూలాభాయ్ పాల్గొని ఒక ఏడాదిజైలు శిక్ష  అనుభవించి ,10వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాడు .విడుదలై 1933లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సభలో కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యాడు .

  వ్యూహం మార్చి కాంగ్రెస్ శాసనసభ ఆక్రమణకు దిగింది .శాసనసభా బహిష్కరణ కు వత్తాసు పలికిన పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యకారకుడు భూలాభాయ్ .గుజరాత్ నుంచి కేంద్ర శాసన సభ సభ్యుడుగా భాయ్ ఎన్నికయ్యాడు .కాంగ్రెస్ పక్ష నాయకుడయ్యాడు .శ్రీ ఎస్ సత్యమూర్తి ఉపనాయకుడు .పండిత మోతీలాల్ నెహ్రూ చనిపోయాక అంతటి ప్రతిభాశాలి శాసన సభలో కరువయ్యారు .ఆకొరత తీర్చటానికి భూలాభాయ్ ని పార్టీ ఎంపిక చేసింది .అప్పటికి ఈయనకు  అందులో  అనుభవం లేదు..స్వయం కృషితో అనుభవం సాధించి 1936లో ప్రభుత్వ విధానాలకు అసమ్మతి తెలుపుతూ  అసెంబ్లీ నుంచి పార్టీ సభ్యులతో మొదటి సారిగా వాకౌట్ చేసి భూలాభాయ్ చరిత్రసృస్టించాడు .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-9

మహా త్యాగి మద్దూరి  అన్నపూర్ణయ్య-9

ఆంద్ర జయప్రకాష్ –జయప్రకాష్ నారాయణ జీవితానికి అన్నపూర్ణయ్య గారి జీవితానికీ చాలా సామ్యం ఉన్నది .ఇద్దరూ యువజనాకర్షణలో సిద్ధ హస్తులు .జాతీయ ఉద్యమం లో వామపంధా అనుసరించిన త్యాగమూర్తులు .మొదట్లో కాంగ్రెస్ తర్వాత మార్క్సిజం అధ్యయన శీలురు  .’’వెలుగు ‘’పత్రికలో మద్దూరి ‘’ 1953 వేసవి శిక్షణలో జెపి పూనాలో 21రోజులు ఉపవాసం చేసి ,నాస్తికత్వం నుంచి   ఆస్తికత్వానికి మారాడు .1953సెప్టెంబర్ లో ‘’బొంబాయి సోషలిస్ట్ జనరల్ కౌన్సిల్  ఆధిభౌతిక వాదం నా సమస్యలను పరిష్కరించలేకపోయింది .నేను ఇవాళ మార్క్సిస్ట్ ను కాను ‘’అని చెప్పాడు అంటూ రాశారు .మానవులమధ్య ప్రేమ బంధం గాఢ౦ గా ఉండాలి .జయప్రకాష్ నిర్ణయం దివ్యమైనది .కేవల నాస్తికుడు పరమ ఆస్తికుడై ప్రేమ తత్వాన్ని శరణు జొచ్చాడు .మహా పురుషుల గమ్యం ఇదే..ఆ గమ్యాన్ని  చేరిన జెపి కి ఇవే జోహార్లు అని రాసినమాటలు అక్షరాలా అన్నపూర్ణయ్యగారికీ వర్తిస్తాయి .ప్రజా సేవలో 33ఏండ్లు పండిపోయి 1953డిసెంబర్ 2న అన్నపూర్ణయ్య గారు తాను ఏ పార్టీకీ చెందను అని ప్రకటించారు .ఆత్మ విచారణ మార్గం లో గురువును వెతుక్కొంటూ మెహర్బాబా శిష్యుడయ్యారు మద్దూరి .

   యువజన శిక్షణా శిబిరాలు –గాంధీ ఆశీస్సులతో 1934లో జయప్రకాశ్ మొదలైన వారు కాంగ్రెస్ లో అంతర్భాగం గా ‘’కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ‘’స్థాపించారు .1937లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉంది .బలం పు౦జు కోవచ్చునని వాళ్ళు ఈ పార్టీలో చొచ్చుకుపోయారు .ఆంద్ర యువకులకు మూతన రాజకీయ దృక్పధం అలవాటు చేయటానికి కొత్తపట్నం లో వాలంటీర్ల శిక్షణా శిబిరం నిర్వహించారు .ఇది ఒంగోలుకు తూర్పున పది మైళ్ళ దూరం లో సముద్రం ఒడ్డున శిబిరం . 170మంది వాలంటీర్లు చేరారు .వీరిలో పుచ్చలపల్లి సుందరయ్య ,కొల్లా వెంకయ్య ,మాకినేని బసవపున్నయ్య ,జొన్నలగడ్డ రామలింగయ్య ,పిడతల రంగా రెడ్డి మొదలైన వారున్నారు .ఇందూలాల్ యాజ్ఞిక్ ,జహీర్ ,జోరాబేగం ,స్వామి సహజానంద సరస్వతి ,ఆచార్య రంగా ,జయప్రకాష్ నారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,బాట్లివాలా ,సిపి అల్లం గో ఉపన్యాసాలిచ్చి  అవగాహన కల్పించారు .

   ఆంధ్రరత్న దుగ్గిరాలవారి ముఖ్య శిష్యుడు జనాబ్ గౌసు బేగం వాలంటీర్ దళాధిపతి  .చండ్ర రాజేశ్వరరావు డ్రిల్లు ,అన్నాప్రగడ కామేశ్వరావు గెరిల్లా పద్ధతులు నేర్పేవారు .అల్లూరి సత్యనారాయణ రాజు ,ఆయన భార్య ,అన్నా ప్రగాడ, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు .శిబిర నిర్వహణ బాధ్యతా అన్నాప్రగడ ,మద్దూరి,అల్లూరి నేతి చలపతిసాగి విజయ రామరాజు వహించారు .స్థానికుల తోడ్పాటుతో జయప్రదంగా జరుగున్న ఈ శిబిరాన్ని ప్రభుత్వం నిషేధించింది.1937మే 21న గుంటూరు  జిల్లా కలెక్టర్ వెల్లోడి రెండు వాన్ల రిజర్వ్ తో వచ్చి ,వాలంటీర్లపై లాఠీ చార్జి చేశాడు .అన్నా ప్రగడ,అన్న పూర్ణయ్య గార్లకు బాగా దెబ్బలు తగిలాయి .భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం గురించి అన్నపూర్ణయ్య గంభీర ఉపన్యాసం చేశారు .1942లో దువ్వూరికి ఇచ్చిన చార్జి షీటు లో శిబిరం లోనిషేధిత  కమ్యూనిజం గూర్చిబోధించారని ఆరోపణ ఉన్నది .తాను  ఆపని చేయనే లేదు అని దువ్వూరివారు తీవ్రంగా ఖండించారు .

 1938 మే 4న ఆంద్రా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యం లో గుంటూరుజిల్లా మంతెన వారిపాలెం లో  అన్నాప్రగడ యువజన శిక్షణా శిబిరం నిర్వహించాడు .దీన్ని ప్రభుత్వం నిషేధించలేదు .అన్న పూర్ణయ్య ఇక్కడా జాతీయోద్యమం సోషలిజం గూర్చి మాట్లాడారు .మాడభూషి వెంకటా చారి,  చండ్ర , సివికే రావు ,కంభం పాటి సత్యనారాయణ పివి శివయ్య ,జొన్నలగడ్డ ,అధ్యాపకులుగా ఉన్నారు ఎస్ ఏ డాంగే,పిసి జోషి, అధికారి  మొదలైన పెద్దలు ప్రేరణ కలిగించారు  .మాదల వీరభద్రయ్య రాసిన గేయాని అన్న పూర్ణయ్య గారు పాడి స్పూర్తి క లిగించారు .

   1936,37లో మద్దూరి విస్తృతంగా గోదావరి జిల్లాలో పర్యటన చేసి యువకులను సోషలిం వైపు ఆకర్షించారు.బట్ట గుండులో జరిగిన తమిళనాడు సోషలిస్ట్ సభకు అధ్యక్షత వహించారు ఏలూరు లో జరిగిన పగోజి సభకు  అధ్యక్షత వహించగా శ్రీమతి కమలకుమారి ప్రారంభించారు .అదేకాలం లో రాజమండ్రి అల్యూమినం ,ప్రెస్ వర్కర్లను సంఘటితం చేసి వారి యూనియన్ లకు అధ్యక్షుడై కార్మిక సంక్షేమానికి యెనలేని కృషి చేశారు అన్నపూర్ణయ్య .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కచేరి వైరల్ సీన్ సితారా-1

కచేరి వైరల్

  సీన్ సితారా-1

‘’ఒరే భడవాకానా !పెళ్ళయి ఏడాదిన్నర అయింది .మీ ఆవిడ కడుపులో కాయ ఏమైనా కాయి౦చేది ఉందా లేదా .మునిమనవణ్ణి చూసిహరీ అందామని ఆగాను ‘’మనవడికి బామ్మ ఫోన్

‘’నసపెట్ట కే బామ్మా .చూస్తావులే .’’మనవడు రిప్లై

‘’నీకూ మీతాతలాగే బద్ధకం  ఎక్కువ .కచేరీ చేస్తున్నావా క్రమం తప్పకుండా .ఏమో నాకు డౌటే.ఆయనా అంతే నేను కచేరీకి పిలిచేదాకా తొందరే ఉండేదికాదు .అందుకే పెళ్ళైన కొత్తలోనే  మీనాన్న నా కడుపులో పడ్డాడు ‘’బామ్మ

‘’కచేరీ ఏమిటే ?’’అది నీదాకా పాకిందా?’’

‘’నా దాకా ఏమిట్రా ప్రపంచమంతా పాకి ప్రతి ఇంట్లోనూ కచేరీయే.సరే మాటలేనా త్వరలో శుభవార్త చెవిన వేస్తావా లేదా?లేకపోతె నేనే వచ్చి దగ్గిరుంది కచేరీ చేయించాల్సి వస్తుంది ఆతర్వాత నీ ఇష్టం ‘’

ఓసి బామ్మో !మాకు రెండు తరాల వెనకున్నా నీ స్పీడ్ అందుకోటం కష్టమే .నీ మనవరాలితో ఒక సారి మాట్లాడు ఇస్తాను ఫోను ‘’

ఏమే!మా వాడు లైన్ లోనే ఉన్నాడట .నువ్వు సహకరిస్తున్నావా .అమ్మా ఇదే కచేరీకి తగినకాలం .కచేరీఎచేస్తారో కష్టమే పడతారో ,రెండునెలల్లో నాకు శుభవార్త చెప్పాలి .మా వాడు కాస్త  మందం వాళ్ళ తాత లాగా .నా లాగా నువ్వే విజ్రు౦భి౦చు .వాడు ఇంట్లో నుంచేగా పని చేస్తా .సిస్టం ఆఫ్ చేసినప్పుడల్లా నీ సిస్టం స్టార్ట్ చేయించు .మొహమాట పడితే కష్టమే తల్లీ .రెండునెలలోపు నాకు శుభవార్త రాకపోతే క్షణాలమీద వచ్చి వాలి నేనే దగ్గరుండి సాపాసాలతో కచేరీ చేయిస్తాను .అంత శ్రమ నాకివ్వవని నాకు తెలుసు .ఏమిటి మాట్లాడవు ?’’

‘’సరే అమ్మమ్మగారూ .డెఫినిట్ గా కచేరీ ఫలం చెవినేస్తా౦  త్వరలో ఫికర్ మత్ కేజియే .అయినా ఇంత కచేరీ పాండిత్యం మీ పల్లెటూరిలో ఎలా వ్యాపించిందో .మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది ‘’అంది ముసిముసి నవ్వులతో మనవరాలు .

  సీన్ సితారా-2

నేను ‘’ఏరా బ్రాహ్మీ !ఈమధ్య కనిపించటమేకాదు , వినిపించటం కూడా లేదే ?’’

బామ్మర్ది బ్రాహ్మి ‘’ఏం చెప్ప మంటావ్ బావా ‘’అంటూ ఏడ్పు లంకించుకొన్నాడు

నేను ‘’ఏడుపు ఆపి సంగతి అఘోరించు ‘’

బ్రాహ్మీ –‘’-సరే బా ! .పగలూ లేదు రాత్రీ లేదు కచేరీ చేయమంటుంది అరగంటకో సారి మా ఆవిడ .’’

నేను –‘’నీకూ మీ ఆవిడకూ సంగీత౦  రాదు కదరా .ఎట్లా చేస్తారు ?’’

బ్రాహ్మీ –‘’నువ్వో ఇక్ష్వాకుల కాలం వాడివి .టివి ఉన్నా ఏదీ చూడరు మీ ఇద్దరూ.  గంతకుతగ్గ   బొంత మాఅక్క .అదేదో సుబ్బు సీరియల్ ట మా ఆవిడ చూసి కచేరీ పాట లంకి౦చు కొంది బా. ఇంట్లోనుంచే పని అయినా అరగ౦టకోసారి కచేరీ అనిపిలవటం నేను వెళ్ళటం నా ఒళ్ళు హూనం అవటం పులుసు కారిపోవటం జరుగుతోంది .’’

నేను –‘’మరీ అంత అర్జెంట్ ఏమిట్రా ?’’

బ్రాహ్మీ –‘’మా అమ్మ వార్నింగ్ ఇచ్చిందిట నాలుగు నెలలలోపు కడుపు తెచ్చుకోకపోతే నాకు రెండో పెళ్లి చేస్తానని బెదిరించిందట .అందుకే నా పులుసు కార్పిస్తోంది .చెప్పుకోటానికి సిగ్గుగా ఉంది బా .

నేను –‘’అది మీ ఫామిలీమాటర్ .నన్ను ఇన్వాల్వ్ చేయకు .మీ తంటా లేవో మీరు పడి మీఅమ్మ  మనసుకు శాంతి చేకూర్చండి .’’

  సీన్ సితారా-3

‘’ఒరే అల్లుడూ !బయట కచేరీలుబాగా  చేసే వాడివని పేరు .ఇంట్లో కూడా చేస్తున్నావా ?లేక అలసిపోయి మూడంకె వేసి ముసుగు తన్ని పడుకు౦టు న్నావా ?’’

మేనల్లుడు ‘’ఇంట్లో కచేరీ ఏమిటి మామయ్యా !నాకేం అర్ధం కావటం లేదు ‘’

మామ ‘’ఓరి సత్తెకాలపు సత్తయ్యా! నీ వల్లకాదు కాని  అమ్మాయినిపిలు ‘’

      ‘’అమ్మాయ్! అమ్మా మామేనల్లుడేమైనా కచేరీలు  చేస్తున్నాడా ఇంట్లో  ?బయటి మోతేనా?’’

‘’బాబాయి గారూ !అదో ముద్దపప్పు వ్యవహారం .అంతా నేనే కలగ జేసుకోవాల్సి వస్తోంది .మీరే ఒక సారి చెప్పండి .

‘’ఇప్పటి దాకా వాయి౦చానమ్మా.మాకున్నది మీరే .శీఘ్రంగా మమ్మల్ని ఉద్ధరించండి .అమ్మా కచేరీ  బాధ్యతా మొత్తం నువ్వే తీసుకొని రిజల్ట్ త్వరలో చెప్పాలి చెవులకు. దానికోసం ఎదురు చూస్తుంటాం నేనూ మీ పిన్నీ ‘’

‘’సరే బాబాయ్ !ఇక చూడండి. తడాకా చూపి కచేరీపై కచేరీ చేయించి బయటికి వెళ్ళకుండా శుభవార్త మీ చెవిన వేస్తాం .నాకొదిలేయ్యండి బాబాయ్ ‘’

  సీన్ సితారా-4

‘’ఏమే పిల్లా !ఎంతో సేపు నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు అప్పుడే నిద్రా ?ఇంకా మీకు రాత్రి ఎనిమిది కూడా అయి ఉండదు .ఇక్కడ మాకు ఉదయం పదిన్నర .

‘’నిద్రా లేదు పాడూ లేదు అత్తా !ఆయన ఆ గదిలో కంపుకోట్టుడు .ఈ గదిలో నేను సీరియల్స్ తో కాలక్షేపం .

‘’అదేంటే !వర్క్ ఫ్రం హోం కదా .నీ వర్క్ వదిలి వేరే వర్క్ ఏంటే వాడి బొంద .అసలు కచేరీ చేసుకొంటున్నారా ?

‘ఈ మధ్య కచేరీ అంటే ఆమడ దూరం జరుగు తున్నాడు అత్తా .నాకు ఏదో ఇదిగా ఉంది .నువ్వు చెప్పిచూడు ఘాటుగా .

‘’ఒరే ఏబ్రాసీ ! పిచ్చ వేషాలెయ్యమాక .అది చెప్పినట్లు అడిగినప్పుడల్లా కచేరీ చేసి కడుపు నో కాయకాయించు .లేకపోతే మా ఆస్తి అంతా మీకు దక్కదు .కచేరీ చేస్తారో  కిందా మీదా పడతారో నాకు తెలీదు .రెండు నెలలలే గడువు నాకు శుభవార్త అందించాలి .విన్నావా ?’’

‘’సరే పిన్నీ .అయినా అమెరికాలో ఉంటూ ఈ కచేరీ సాహిత్యం నీ చెవిన ఎలా పడిందీ ?’’

‘’ఒరే !ప్రపంచం కుగ్రామంఅయి ,కరోనాలో ఒక ఇల్లే అయిపొయింది .వైరస్ లా వార్తలు క్షణాలమీద పాకుతున్నాయి .అమెరికాలోనేకాదు ఈమధ్య ఆఫ్రికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా మొదలైన అన్ని దేశాలవాళ్ళ నోళ్ళలో కచేరీ పద౦ నానుతోంది .నువ్వు ఇండియాలోఉన్నా నీ చెవికి సోకలేదా ఆశ్చర్యం గా ఉందే.అమ్మాయికివ్వు ‘’

‘’అమ్మాయ్ !మా వాడి చెవుల తుప్పు వదిలించా .ఇక నీదే భారం .కచేరీ సామ్రాజ్యం లో విహరించి మాంచి రిజల్ట్ ఇవ్వండి త్వరగా ‘’

‘’సరే పిన్నీ !ఫికర్ వద్దు నేనే దున్నేస్తా .దారికి తెచ్చి కచేరీలో కచేరీలనిపిస్తా మీ వాడితో .నువ్వన్నట్లు ఆన్ లైన్ రిజల్ట్ అందిస్తా అత్య౦త త్వరగా .అయినా పిన్నీ’’ కచేరీ’’ కాయిన్ చేసి ‘’వైరల్’’ లా వ్యాపింపజేసి కర్తవ్య బోధ చేసిన  సుబ్బు అభినందనీయుడు  పిన్నీ .ఉంటా కచేరీ టైమయింది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యలమంద కోటీశ్వర శతకం

యలమంద కోటీశ్వర శతకం

నరసరావుపేట  తాలూకా శ్రీ కోటీశ్వర క్షేత్ర నివాసి ,అచల గురుసంప్రదాయకుడు శ్రీ బెల్లం కొండ కోటి నాగయ్యకవి  ‘’శ్రీ యలమంద కోటీశ్వర శతకం ‘’రాశాడు .వృషభ గోత్రజుడు .తల్లి సొమా౦బ,తండ్రి పిచ్చయ్య .కవి పాశుపతం మొదలైన అనేక ఉపాసనా సిద్ధుడు ,పరమహంస స్వరూప నిత్యానంద రాజయోగి.కోటి నాగార్యుడుగా సుప్రసిద్ధుడు . రేపల్లె తాలూకా మాచవరం వాస్తవ్యులు శ్రీ అలపర్తి వెంకయ్య చౌదరి ధర్మపత్ని శ్రీమతి  వేంకాయమ్మ ద్రవ్య సహాయం తో ,నిడుబ్రోలు తాతాముద్రాక్షర శాలలో 1934లో ప్రచురింపబడి౦ది .వెలలేదు .

  సీస పద్యం లో  యలమంద గొప్పతనం వర్ణించాడు కవి .యలమంద అంటే కోటప్పకొండ .అక్కడి స్వామి త్రికోటీశ్వరుడు .కైలాసానికి మించిందీ , సమస్త ఓషధులకు నిలయమైనదీ ,తిరుమలకు సాటియైనదీ ,అణిమాది అష్ట సిద్ధులను అందించేది ,’’వసుధ యాదవ మణి యొప్పుగా నందున్న మహిలో ఉన్నదీ ,రుష్యాదుల బిలాలున్నదీ,అందానికి సాటి ,మంచుకొండలున్నదీ , శ్రీకోటీశ్వరునికి నెలవై ఉన్నదీ ,కోటి లింగాని జ్ఞాన కొండ యలమంద కొండ .ఆ కొండపై వెలసిన వాడే శ్రీ యలమంద కోటీశ్వర స్వామి .

  జన్మ సార్ధకం చేసే చతుర్విధ ఉపాయాలు ,జనన రాహిత్యానికి వివిధ సూచనలు ,గర్భం లోని పిండ వృద్ధిక్రమం ,పంచీకరణం ,హంస గమనాగమనం ,జ్ఞానే౦ద్రియాది నిర్మాణం ,సాంఖ్య తారక అమనస్క యోగ విషయాలు ముముక్షు తత్వ మార్గానికి సోపానాలుగా,పండిత పామర  రంజకం గా ఈ శతకం కోటి లింగకవి రాశాడని బాపట్ల తాలూకా మాట్లూరు వాసి శ్రీ ఆకుల కోటి లింగయ్య మెచ్చుకున్నాడు .కవిగారు తన శతకాన్ని నారాయణ శతకం లాగా చదు వుకోవాలని సూచించాడు .

  ‘’శ్రీ భక్త హృదయవాసా –మౌనిజన- సేవ్యత్రికూట వాసా –శోభితామల వికాసా –మమ్మేలు –శుభ దృష్టి కొటీశ్వరా ‘’అని శతకం ప్రారంభించాడు కవి .’’గొప్పదనమునకు గాదు భక్తిగా జెప్పితి –ప్రాపు నీవని వేడితి –నన్ను తమ దాపునకు జేర్పమంటి –క్రూరుండు వీడ౦చు నను-నీవు వేరు శాయకు  -కర్మ చే నిలబుట్టియు  జీవులు –కర్మములు చేయు చుండి –కర్మ చేతను గిట్టుచు మరు జన్మ గా౦చు దురు  -ఋతు వేళ కమలమందు –సతి శుక్ల శోణితములు నండమగు కోటీశ్వరా !

‘’తల్లి పొత్తిలి  యందున బెరుగుచును –తగమూత్ర మలము లందు –తల్లడిలి పొర్లాడుచుజరపితిని –సోయంచు పూరకంబు –లోపలి పోయి కు౦భ కమగుచును –హం యంచు రేచకంబు  వెలికొచ్చు-హర నామ కోటీశ్వరా-ముందు పరమాత్మ యందు నవ్యక్త-మందున మహత్తత్వము –అ౦దునను హంకారము –నను గల్గె-నతిమాయ కోటీశ్వరా-వాయువులో సగ భాగము వ్యానమై –వరుస మిగిలిన భాగము –తోయమాకాశాగ్ని భూమిలో –తోడ్పడియె కోటీశ్వరా-తోయమున నర్దాంశము రస మయ్యె-రూప శబ్ద స్పర్శ ము –గంధరస –రూపింప జలపంచకం బని యొప్పె-రూఢిగా కోటీశ్వరా-తన్ను డా జూచుకొనుటె యమనస్కము కోటీశ్వరా’’

చాలా గహన వేదాంత విషయాలు అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు శతకం లో రాసి నిజంగానే ముముక్షులకు మోక్ష మార్గ దర్శనం చేసిన శ్రీకోటి నాగార్య కవి ధన్యుడు .

 కోటప్పకొండగుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి[1] చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.ఇక్కడ కాకులు వాలవు .అదొక విచిత్రం . మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

విజయదశమి 25-10-20 శుభాకాంక్షలు

విజయదశమి శుభాకాంక్షలు 25-10-20

 

https://photos.google.com/share/AF1QipMvejhzYk7FBCN2o7qrWN5t67vKBpH768jRTpYZLy4NHu7LbPEVBPxAJUsuVVLZhw/photo/AF1QipPqPbZoV9ntmpkt8CG13bKeFCQCpT4GuAC5fwSv?key=aUdsVDVodjhWemhTMGZDZE1aWnl2TUJMYzN1N1pn

Posted in దేవాలయం | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

పెద వేగి దేవాలయం  -2చివరి భాగం )

4-ఏకాదశ రుద్రులు –ఛాతి మధ్యలో దండలకూర్పు గా చేసిన ఆభరణం తాబేలు  లేక సాలీడు ను పోలిఉండటం జుగుప్సాకరం .రుద్రునికి ఇష్టమైంది మర్కటం .శివుడిని కచ్ఛ పేశ్వరుడు అనీ అంటారు.జందెం ఉదరబంధంపూర్ణ ఘట ఖచిత మణులతో పొదగబడిఉన్నాయి  .ఆకర్నా౦తాలై   కుడి ఎడమ మకర వ్యాఘ్ర కుండలాలు భుజ స్కంధాలై పడి ఉంటాయి .పైన వస్త్రం లేదు. కుడి చేయి పైకెత్తి విపత్కర స్థితిలో రుద్రాక్షమాల పట్టుకొని ఉంటాడు .ఎడమ చేయి కంటికి పైన ,చేతుల నాగ భుజ కీర్తులు ,వలయ కంకణాలు ఉన్నాయి .పాదాల సర్ప నూపురాలు కింద గజ్జల పట్టెడ గొలుసులు ,ధోవతి బదులు చర్మాలు౦ టాయి.పట్టికలు రెండూ పైకి లాగి ముక్త ,రత్న మేఖల హారాలతో బంధి౦ బడి ఉంటాయి .మొలత్రాడు అంటే మేఖలానికి  చిరుగంటలున్నాయి .పూర్తిగా నిలుచున్నరుద్రప్పురుషుని మనోహర రూపం ఇది .శతరుద్రీయం ,రుగ్వేదాలలో వర్ణించిన అగ్ని రుద్రరూపుడుగా కనిపిస్తాడు.పది శిరసులపై ఉన్న జటలన్నీ మధ్యపురుష శిరోజాలతో కలుపబడి ,పైన ఒకే చోట ముడి వేయబడింది .ప్రతి ముఖం విలక్షణం .మూడవ నేత్రంలేదు .ఈశానుడు గాభావించవచ్చు .

మధ్య పురుషుని రెండు చేతులు కాక, ఇరువైపులా 11భుజాలవంతున మొత్తం 22భుజాలు ముంజేతి నుండి ఉద్భవించాయి .భుజతరు అంటే చేతుల వృక్షం అన్నమాట .ముంజేతులకు గుండ్రని కంకణాలున్నాయి  .అన్ని చేతులలో ఆయుధాలు ఉండటం మరో విశేషం .కనుక ఇది రుద్ర రూపం .అదో వస్త్రం చర్మ౦మోకాళ్ళ వరకే ఉంది .పట్టికలతో బంధింపబడి మేఖలతో ముడి వేయబడింది .రెండుకాళ్ళ ఆమధ్య వ్రేలాడేది రుద్రుని మేఢ్రం.అధో రేతం  స్ఖలన రుద్రుని సూచిస్తోంది .ఇతడు శశ్ని దేవుడు .గుడిమల్లం లో నూ ఇలాగే ఉంటాడు .మొత్తం మీద మధ్య పురుషుడు మహా దేవుడుగా ,తక్కిన రూపాలు శివ,శంకర నీలలోహిత ఈశాన విజయ ,భీమ దేవదేవ, భవోద్భవ, రుద్ర రుద్రా కపాలీ గా చెప్పబడుతున్నాడు .మధురలో 4వ శతాబ్ది ఏకాదశ రుద్ర శిల్పం శ్రీ శ్రీరామమూర్తిగారు కనిపెట్టారు . మధుర  రుద్రమూర్తులు వరుసగా ఒకదాని ప్రక్క ఒకటి నాభి వరకు విడివిడిగా అర్ధ శిల్పం లో కనిపిస్తాయి. కాని పెదవేగి రుద్రరూపం లో ఒకే మూర్తిలో కుదించి వేర్వేరు శీర్షాలు భుజాలు ద్వారా వేర్వేరు రుద్ర రూపులు కనిపిస్తారు .ఈ శిల్పం క్రీశ 6-7శతాబ్దికి చెందింది కావచ్చు .శాలంకాయనులు ,పూర్వ చాళుక్యులు వైదికాకాచారాలను పాటిస్తూ బ్రాహ్మణులను గౌరవించినట్లు శాసనాలు చెబుతున్నాయి .పెదవేగి రుద్ర రూపం లాంటి శిల్పం దేశంలో ఇంకెక్కడా లేదు అనేది నిర్వివాదం .

5-కాల భైరవుడు –పెదవేగి చుట్టూ కిలో మీటరు పరిధిలో కోట గోడలు ఉండేవి .వేంగీనగర స్థాపన శాలంకాయనరాజులు లు చేశారు .నగరాధి దేవత దుర్గ లేక అంబ .కోటరక్షకురాలు .క్షేత్ర నాయకుడు కాలభైరవుడు .కోట ఈశాన్యాన ఒకటి ,పశ్చిమ ద్వారం వద్ద రెండోది కాలభైరవ విగ్రహాలున్నాయి .నాలుగు చేతులు .విరబోసిన జట,కుడి చేతిలో త్రిశూలం ,కింది చేయి నడుముపై ,ఎడమ చేత కపాలం ,చురిక ఉన్న విగ్రహమూర్తి కాలభైరవుడు .ఒకమీటరు ఎత్తు,,70 సెంటీమీటర్ల వెడల్పు ,18 సెంటీ మీటర్ల మ౦ద౦  ఉన్న విగ్రహం .శంకరాచార్యులవారు కాశీ కాలభైరవుని ఈశ్వరునిగా భావించి అష్టకం రాశారు .

విజయదశమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు- సాదర ఆహ్వానం.

మిత్రులారా,

నమస్కారం.

 అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 32 గంటలునిర్విరామంగా న్యూ జీలండ్  నుంచి అమెరికా దాకా జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషాసాహిత్యాభిమానుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా సుమారు 25 వేల మంది 200 కి పైగా సాహితీ ప్రసంగాలు విని ఆనందించారు. ఆ సదస్సుని విజయవంతం చేసిన ఐదు ఖండాల వక్తలకు, వేదిక నిర్వాహకులకు, సాంకేతిక నిపుణులకూ, వీక్షించి, ఆనందించి మాకు అభినందన సందేశాలను అందజేస్తున్న  తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు మా అభివాదాలు.

ఆ సదస్సు సాధించిన విజయాలకి పరాకాష్టగా అక్టోబర్ 31, 2020 (శనివారం) నాడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా విజయోత్సవాలు” నిర్వహించాలని 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వావర్గం నిర్ణయించారు. భారత కాలమానం ప్రకారం ఆ నాడు మధ్యాహ్నం 1:00 pm కి ప్రారంభం అయి సుమారు ఐదు గంటలు సాగే ఆ విజయోత్సవాలలో ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త శ్రీ కె. బ్రహ్మానందం గారు ప్రారంభోపన్యాసం చేస్తారు. 30 మందికి పైగా వక్తలు సాహిత్య ప్రసంగాలు చేస్తారు. 

ఈ విజయోత్సవాల సమగ్ర ప్రకటన ఇందుతో జతపరిచాం.  అన్ని ప్రసంగాలూ ప్రపంచవ్యాప్తంగా యూ ట్యూబ్ లోనూ , ఫేస్ బుక్ లోనూ ప్రత్యక్ష ప్రసారం లో ఈ క్రింది లింక్ లలో చూసి ఆనందించమని కోరుతున్నాం.

You Tube Link:

https://youtu.be/OXLoVspTnOM

Face Book Link: 

https://www.facebook.com/permalink.php?story_fbid=132931561907857&id=100332915167722

Hope to meet you on October 31, 2020  from 1:00 pm- 6:00 Pm (India Time)  on the internet.  

భవదీయులు,

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సస్), కవుటూరు రత్న కుమార్ (సింగపూర్);

రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్);

రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం),

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పెద వేగి దేవాలయం

 

పెద వేగి దేవాలయం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 12కిలో మీటర్ల దూరం లో పాడుపడి ఉన్న ఊరే పెదవేగి.ఒకప్పుడు వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణంగా వర్ధిల్లిన వేంగీ నగరమే ఇది .పురాతత్వ సర్వేక్షణ తరఫున డా కార్తికేయ శర్మ చేసిన పరిశోధనలలో అపురూప శైవ విగ్రహాలు కనిపించాయి .ఇవి క్రీ .శ. 4-6శతాబ్దాల నాటివి .ఇవే కాక తూర్పు చాళుక్యరాజుల పాలన నాటి ఆలయ శిల్పాలు ,ప్రతిష్టా మూర్తులు దొరికాయి .వాటి వివరాలు తెలుసు కుందాం

1-సోమాయ ఫలకం –ఇది దాచేపల్లి తెల్లరాయి తో చేయబడింది .12,9,2సెంటిమీటర్ల కొలతలు కలిగింది .పార్వతీ పరమేశ్వరులు ఒకే ‘’మంచక ‘’అధిష్టానం పై కూర్చుని ఉంటారు శివుని జటలు చక్కగా బంధింపబడి ఉంటాయి .త్రినేత్రుడు . యజ్ఞోపవీతం మూడు పాయలు స్పష్టంగా కనిపిస్తుంది. శివుని వామభాగం లో అర్ధ పర్యంకం పై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది .పరమేశుడు ఎడమ చేతితో అమ్మవారిని దగ్గరకు తీసుకోవటం చూడగలం .నూతన దంపతులైన ఈ ఆది మిధునం విలక్షణముఖ వర్చస్సుతో  వేంగీ పురవాసులకు అర్చా దేవతలయ్యారు .చిన్న ఫలకమే కనుక ఇది ఒక శివ భక్తుని పూజా మందిరం లో అర్చనకు స్థాపింపబడి ఉండవచ్చు .ఈ సోమాయ ఫలకం అత్యంత ప్రాచీనమైనది .తర్వాత పాలించిన పల్లవ,విష్ణు కుండిన రాజుల కాలం లో దేవాలయ ఫలకాలపై శివ పార్వతి, చిన్న పిల్లాడుగా స్కందుడు ,వినాయకుడు చేరారు .శివ పార్వతి అర్చా ఫలకం మాత్రం ‘’పెద్దమడియం ‘’ వాటికన్నా చాల పురాతనమైనది .

2-పంచలింగ ఫలకం -7,7,2 సెంటీ మీటర్ల ఫలకం పై అర్ధశిల్పంగా పంచలింగాలు ఒకే అధిష్టానం పై ప్రతిష్టించి న ఫలకం .పద్మ బంధం గా అధిష్టానం ఉంటుంది .పంచలింగాలు ఒకే వరుసలో ఉన్న శిల్పం ఇంకెక్కడా లేదు .ఇవి రుద్రుని పంచ భూతాలూ లేక ముఖాలకు ప్రతి రూపాలు కావచ్చు .ఈ మూర్తులుకూడా ఆకాలం లో చక్కగా అర్చనలు అందుకొన్నారు .శివుడిని పంచ శర(బాణ)ఆననుడిగా అంటే ముఖాలు ఉన్నవాడిగా చాలా ఆగమ గ్రంథాలు పేర్కొన్నాయి .

3-నాగ దేవత –ఇది కాల్చిన మట్టి ఫలకం .అండా కారం గా 11,9,2  సెంటి మీటర్ల ఫలకం విచిత్రమైన స్త్రీ రూపం ఇందులో కనిపిస్తుంది .ఆమె సింహాక్షి ,సింహ ముఖి ,లంబ స్తని , సన్నని నడుము, చక్కని నాభి ,పూర్ణ వక్షోభాలతో ఉంటుంది .సర్ప శిరస్సుపై యోని నుంచి మోకాళ్ళవరకు వంగి కూర్చుని ఉంటుంది .పాములే భూషణాలు కుండలాలు కంఠమాల ,కేయూరాలు  ,మేఖల శిరోజాలు అన్నీ సర్పాలే .రెండు చేతులలో ముకుళించిన కమలాల కాండాలు ఎత్తి పట్టుకొని ఉంటుంది .కనుక ఈ దేవత కుమారి అని చెప్పటానికి ఇదే నిదర్శనం .ఏ సంప్రదాయానికి చెందిందో చెప్పలేక పోయారు. బహుశా అదితి కాని ,పృధ్వీ దేవత కాని అయి ఉండవచ్చునని అభిప్రాయం .

4-ఏకాదశ రుద్రులు –ఈ శిల్పం పెదవేగి కి దగ్గరలో దొరికింది .ఎరుపు రంగు ఇసుక రాయి శిల్పం .11తలలు ,24చేతులు ఉన్న  ఈ శిల్పం ఒకమీటరు ఎత్తు,85 సెంటీ మీటర్ల వెడల్పు ,32 సెంటీ మీటర్లమందం కొలతలు కలది .ఇది ప్రతిష్ట చేయబడిన విగ్రహమే అని కిందున్న బుడుపు ను బట్టి చెప్పవచ్చు .ఈ ఆలయం ఎక్కడ ఉండేదో తెలియటం లేదు .ఊరికి మధ్యలో ఉన్న శివాలయం లో ఉండి ఉండవచ్చు .మొదటగా ఈ శిల్పాన్ని మరికొన్నిటిని  శ్రీ రాళ్ళబండి సుబ్బారావుఒక ప్రత్యేక సంచికలో తెలియజేశారు .ఈ శిల్పాన్ని శిల్పించిన తీరు యావత్ భారత మూర్తి కళా చరిత్రలో లేనే లేదు .రుద్రుని ‘’అరుణాయ ,తామ్రాయ ‘’అంటారు .కానీ సదా శివ లక్షణాలు ఈ శిల్పం లో లేవని అసలు శివ శిల్పం కాదని కార్తికేయ శర్మ అభి ప్రాయ పడ్డారు .మధ్యరూపం నిల్చుని ఉన్న పూర్తి మానవ రూపం .కుడివైపుకు వంగినట్లు ఎత్తుగా ఉన్న పిరుదును బట్టి చెప్పవచ్చు .జట తురాయిలాగా నిలువుగా ఉన్నా ,ముఖాగ్రం లో మకుటం ఉంది .మకుటం మీదరత్న ఖచిత  వైదిక పతకాలు లేక మాడలు న్నాయి .ఫాలమున నిటారుగా త్రినేత్రం ఉన్నది .నాసిక ,పెదిమలు కొంతవరకు చిద్ర౦ (రంధ్రం  )మైంది .కంఠం పై మూడు రేఖలున్నాయి .మెడలో హారాలు మూడు దళసరిగా ముత్యాలు రత్నాలు పొదిగి ఉంటాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ

23-10-20 శుక్రవారం నవరాత్రి 7వ రోజు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ మహా లక్ష్మి అలంకరణ

https://photos.google.com/share/AF1QipOIuz4MTG9Ss5AoCAcoES2JU01-WXV6eDl6iyBH8W3sT_BTScDb1qQQIh6AlxgnoQ?pli=1&key=eWVUT1B3WURPN2dGVmliWHF5UjdmZ1o1TFdOZi1B

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా అర్హుడు .కవిగారి కవితా సంస్థానం లో విందు వసిస్టమహర్షి విశ్వామిత్ర పరివారానికీ ,,భరద్వాజ మహర్షి ససైన్యంగా వచ్చిన భరతుడు ఆతర్వాత వానర రాక్షసుల అశేష జనాలతో వచ్చిన శ్రీరామాదులకు ఇచ్చిన విందు లాగా ఉండేది .కవిగారుమాత్రం పడకకుర్చీలో మందహాసంతో మహావేగంగా కవితాగానం చేసేవారు .అయినా ఎవరికి తగ్గ గౌరవ మర్యాదలు జరిగి పోయేవి .ప్రతినెలా ఒకటవ తేదీ ఒక మహా కవికి ఒక మహా పండితునికి అక్కడ మహా సత్కారం .ఏ రాజాస్థానం లోనూ జరగనంత వైభవంగా జరిపించేవాడు వేదా౦త కవి .దైన్యం నైరాశ్యం లేని రాజకవిత ఆయనది ‘’ అన్నారు సరస్వతీ కంఠా భరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ .’’పట్టాభి గారి వలన ఈ కవి కావ్యభావాలు విన్న నెహ్రు పండితుడు ‘’ఆంద్ర బెర్నార్డ్ షా ‘’బిరుదు అందించాడు .కవితా రాజ్య పట్టాభి షిక్తుడు వేదా౦తకవి .’’అనికీర్తించారు ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య .’’మహతీ నాదా౦చిత వాణి,ఆంధ్రనాటక కావ్య ప్రాదుర్భూతి నిదాన విభాదీపిత మతి ‘’అన్నారు తెనుగు లెంక శ్రీ తుమ్మల .’’జగజ్జననీ వరప్రసాద కవితా ప్రపంచ సామ్రాట్ ‘’అని మెచ్చారు కిరణ్ కవులు .’’దారాళ వాగ్గు౦ఫి తారమ్య రచనా ,ప్రవచనాతిచాతుర్య పాటవుడు ‘’అన్నారు రాళ్ళభండిసుబ్బయ్య .ఇంతమంది చేత కీర్తింపబడిన వేదాంత కవి గారికి విజయవాడలో గజారోహణ ,సువర్ణాభి షేకం జరిగితే కవిమాత్రం ‘’చదివిన వాడ గాను ,మిము సన్నుతి జేసిన వాడనుగాను ,సంపదలు గడించినట్టి ధనవంతుడను గాను –సమస్త విశ్వముల్ బ్రతికెడి తల్లి చల్వ తమపై వెద జల్లెడివాడ నేను ‘’అని అత్య౦త వినయంగా చెప్పుకొన్నారు .తన గురువు తిరుపతి కవి గురించి గర్వంగా ‘’తిరుపతి వేంకటేశ్వరుడు –పరపతి గల గురు దేవుడు –ధరలో అతనికన్న మొనగాడూ –తరువాత ధాత వ్రాతకు లేడూ’’.’’అతడు వడ్డికాసులవాడూ –ప్రతిభ కేడు కొండలవాడూ ‘’అని చెప్పుకొన్నాడు జగజ్జనని ,ఆంద్ర బెర్నార్డ్ షా ,మహాకవి ,మహావక్త ,మనోహర్ ,వేదా౦త కవి . అన్నారు రాయప్రోలు .

అనిమెచ్చారు శ్రీమతి కాంచనపల్లి కనకాంబ

అంటూ కీర్తించారు జాషువా .

అంటారు శ్రీ మందరపు సత్యాచార్య కవి .

వేదా౦త కవికి ఘన సన్మానం విజయవాడ రామనగర్ ఈశ్వర మహల్ లో 26-10-1955 విజయ దశమి పండుగనాడు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది .సభాధ్యక్షత వహించాల్సినరెవిన్యు మంత్రి శ్రీ కల్లూరి చంద్ర మౌళి అని వార్యకారణాల వల్ల రాలేకపోతే ,జాతీయనాయకులు,శాసన సభ్యులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరావు పంతులుగారు అధ్యక్షత వహించారు .శ్రీ నార్లబదులు తెనాలి పురపాలక సంఘా ధ్యక్షులు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి సభా ప్రారంభం చేయగా ,జనాబ్ షేక్ చిన పీర్ సాహెబ్ ,షేక్ ఆదం సాహెబ్ గార్లు మంగళవాద్యం వాయించగా వేద శీర్వచనం జరిగింది .ఆంద్ర భోజ ,శాసన సభ సభ్యులు శ్రీ సి హెచ్ వి మూర్తి రాజు ,అధ్యక్ష ,ప్రారంభకుల ప్రసంగాల తర్వాత శ్రీ వేదాంత కవికి ఆహ్వాన సంఘం స్వాగతం పలికి 16నవరసులతో కనకాభి షేకం చేసి ,వెయ్యిన్నూట పదహార్లు నగదుకానుక అందించి , ‘’వేదా౦త కవి కాంతులు ‘’ప్రత్యేక సంచిక ఆవిష్కరింఛి ఈ విలువైన గ్రంథం ,పట్టు పీతాంబరాలు ,చందన తా౦బూలాదులు బహూకరించి పుష్పమాలా౦ కృతులను చేసి ఘన సన్మానం చేశారు .

సాహిత్యాచార్య శ్రీ జమ్మలమడక మాధవరాయ శర్మ ,కవిసామ్రాట్ శ్రీ వేదాంతం లక్ష్మీ కా౦త కవి ,సరస్వతీ కంఠాభరణ శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ ,ఉభయ భాషా ప్రవీణ శ్రీ జాస్తి వెంకట నరసయ్య ,మాట్లాడారు .కవిగారి ‘’తెలుగు తల్లి ‘’నాటకం అంకితం పొందిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ,కవి గారు ప్రసంగించారు .పెద్దలు పంపిన అభిమాన ఆశీర్వచనాలు ,అభినందనలు శ్రీ శ్రీ రాయని రాములు చదువగా ,శ్రీ బిఏ రాజు మనోహర శైలిలో తాము రాసిన పద్యాలు ‘’మనోహరాలు ‘’గానం చేసి కరతాళధ్వనులు అందుకొన్నారు .

మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రా బిస్మిల్లాఖాన్ జనాబ్ షేక్ ఆదం సాహెబ్ గారి నాదస్వర వాద్యం బాండు మేళం తో ,పౌరుల ఆన౦దాతి రేక పుష్ప వృష్టితో గజారోహణ మహోత్సవం శ్రీ వేదా౦త కవి గారికి జగన్మోహనంగా పురవీధుల గుండా జరిగింది .

మరునాడు సభకు సహకారమంత్రి శ్రీడి సంజీవయ్య రాలేకపోగా ,ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి అధ్యక్షతన, మహాదాత శ్రీ చుండూరి వెంకట రెడ్డి సభా ప్రారంభోపన్యాసాలు చేశారు .తరువాత అభినవ తిక్కన శ్రీ తుమ్మల ,శ్రీ వేదుల ,నవయుగ కవి చక్రవర్తి శ్రీ జాషువా ,కుమారుడు శ్రీ వలరాజు ప్రసంగించారు అందరికి శాలువాలతో సత్కారం చేశారు ‘.

జీవిత విశేషాలు

వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి “వేదాంతకవి”గా ప్రసిద్ధుడు. ఈయన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి శిష్యుడు. తండ్రి శంభుశాస్త్రి, అన్న లక్ష్మీకాంతం జాతీయోద్యమాలలో పాల్గొని ఉద్యమగీతాలను గొంతెత్తి పాడేవారు[1]. వారి ప్రభావంతో ఈయన దేశసేవ, కవిత్వసేవ విడదీయలేని అనుబంధంగా ఏర్పరచుకుని కవితావేశానికి గురిఅయ్యారు . భార్య పార్వతీ దేవి .1928-1931ల మధ్య వివిధ జైళ్ళలో శిక్ష అనుభవించిన దేశభక్తుడు . 1928లో జైలుకు వెళ్లినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్యతో కలిసి ఒకే గదిలో ఉన్నారు. ఆ శిక్షాకాలంలో పోలీసుల లాఠీదెబ్బలవల్ల కుడిచేతి ఉంగరం వేలు విరిగింది. తలకు బలమైన దెబ్బలు తగలడం వల్ల ఎడమకన్నుకు అంధత్వం ఏర్పడింది. కవిగారి రచనలు శాంతి సంగ్రామం, స్వతంత్ర గర్జన, జమీన్ రైతు, రాజకోట ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వంచే నిషేధానికి గురి అయ్యాయి. రాజకోట నాటకాన్ని పేరుమార్చి కాంగ్రెస్ భారతం పేరుతో ముద్రింప బడినాయి .

రచనలు –

1. ఆకలిమంట (నాటకం)

2. తెనుఁగుతల్లి (నాటకం)

3. ఛలో హైదరాబాద్ (నాటకం)

4. విశ్వస్వరాజ్యం (నాటకం)

5. జమీన్ రైతు (నాటకం)

6. పంజాదెబ్బ

7. కవితా సంస్థానము (విమర్శ)

8. కష్టకాలం (నాటకం)

9. గడుగ్గాయి

10. కెరటాలు

11. దండయాత్ర

12. భగవన్మతభాష్యం

13. వీర భారతము

14. మహారథి కర్ణ (నాటకం)

15. కల్పతరువు

16. పట్టాభిషేకం

17. బ్రిటీష్ గయోపాఖ్యానం (నాటకం)

18. రాజకోట (నాటకం)

19. శాంతి సంగ్రామము

20. స్వతంత్ర గర్జన

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అమరావతి — విశ్వనగరం

అమరావతి

అమరావతి బిడ్డ పుట్టి 5 ఏళ్ళు
బిడ్డ మారి(పారి)పోయి 325 రోజులు
పుట్టించిన తండ్రి రాడు గాజులు ఇచ్చి మళ్ళి … చూడడు
తిడుతున్నారని పెంచుతున్న తండ్రి మాట్లాడాడు
ఎవర్ని అడగాలో తెలియదు. న్యాయస్థానాలు ఎప్పుడు చెబుతాయో తెలియదు
ఎంచేద్దాం . బాలసార నామకరణం చేయించిన పంతులుని(మోడీ) నిలదీద్దాం అంటారు. సమన్యాయం అని ఆంధ్రా నీ: ఏమి కావాలో అడక్కుండా రైతులను నోట్లో మట్టి కొట్టి
వచ్చే సంవత్సరం మళ్లీ ఏళ్ళు / రోజులు పెరుగుతాయి కానీ చివరకు బిడ్డ కు జాతి అంటించి …
దీన … అమ్మ రా(వ)తే ….

 

విశ్వనగరం

మురుగు మూసి మూసేస్తే చాలు ..అసలు మురికి కనబడదు అన్నా
ఒక్క మురికి కాల్వ లేకుండా మంచి నీరు ఇస్తానన్నా
నీళ్లు లేని చోట .. మురికి నీరు ఊరుతున్నా
ఆక్రమిస్తే చాలు LRS ఇళ్ళుకడితే చాలు BRS అన్నా
900 కోట్లతో మురికి కాల్వ లేకుండా కొత్త పరిపాలన భవనం వస్తుంది కానీ అన్నా
వందేళ్లకు పడే వానకు పది రోజులు ఆగితే … సరిపోతుంది …. అన్నా
తప్పు మాదీ కాదు … మీది కూడా అన్నా
‘O’ నగరం అన్నా ఇది విశ్వనగరం అన్నా

 

7 నెంలాలు దాటినా రెండు నగరాల మధ్య ఒక్క బస్సు కూడా తిప్పలేని విశ్వ నగరాలు మనవి

Posted in రచనలు | Tagged | Leave a comment

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )

   చతుర్ధ ఖండం

మొదటి మంత్రం –‘’సా బ్రహ్మేతి హో వాచ బ్రాహ్మణో వా ఏతద్విజయతే మహీ యధ్వమితి తతో హైవ విదా౦చకార బ్రహ్మేతి ‘’

భావం –ఉమా దేవి ఇంద్రునితో ‘’ఆ యక్షుడు పరమేశ్వరుడు .పరమేశ్వరుడే మీ విజయానికి కారణం ‘’అని చెప్పగా ఇంద్రుడు ఆ వచ్చింది పరమేశ్వరుడైన బ్రహ్మ స్వరూపం అని గ్రహించాడు .

రెండవ మంత్రం –‘’తస్మా ద్వా ఏతే దేవా అతితరా మి వాన్యాన్ దేవాన్ ,యదగ్నిర్వాయు రింద్ర స్తే హ్యేన  న్నేదిస్టం పస్పర్శు స్తే హ్యేన ప్రథమా విదా౦ చకార బ్రహ్మేతి ‘’

భావం –అగ్ని ,వాయువు ,ఇంద్రుడు ఈ ముగ్గురే యక్షరూపంలో ఉన్న పరబ్రహ్మ ను చూసి విషయం తెలుసుకొన్నారు కనుక  ఈముగ్గురు దేవతలు మిగిలిన దేవతలకంటే అధికులయ్యారు .

మూడవ మంత్రం –‘’తస్మాద్వా ఇంద్రోతితరా మి వాన్యాన్ దేవాన్  స హ్యేన న్నేదిష్టం పస్పర్శ  న హ్యేన ప్రథమో విదా౦  చకార బ్రహ్మేతి ‘’

భావం –అగ్ని ,వాయువు, ఇంద్రులలో ఇంద్రుడు యక్ష బ్రహ్మ తో మాట్లాడి ఆయన స్వభావం స్వయంగా విని తెలుసుకొన్నాడు కనుక ఇంద్రుడు అగ్ని వాయువులకంటే గొప్ప వాడయ్యాడు .నాలుగవ మంత్రం –త స్యైష ఆదేశో య దేత ద్విద్యుతో వ్యద్యుత దా ఇతీ న్యమీష దా ఇత్యధి దైవత౦ ’’

భావం –బ్రహ్మ తత్త్వం మెరుపులాగా ప్రకాశ మానమైనదనీ ,మెరుపులాగా అంతలోనే అదృశ్య మౌతుందనీ  దేవతా విషయకమైన విషయక మైన ఉపదేశం .

ఐదవ మంత్రం –‘’అధాధ్యాత్మం య దేత ద్గచ్ఛతీవ చ మనోనేన చైత ముపస్మరో త్య భీక్ష్ణ౦ సంకల్పః ‘’

భావం –ఇంకా అధ్యాత్మ ఉపదేశం చెప్పబడుతోంది .ఈ బ్రహ్మ తత్వాన్ని మనస్సు పొండుతున్నట్లున్నది .మనసు చేత బ్రహ్మ తత్వాన్ని స్మరించాలి అని జీవుడి సంకల్పం .

ఆరవ మంత్రం –త ద్ధ తద్వనం నామ  తద్వన మిత్యుపాసి తవ్యం  స య ఏత .దేవం వేదాభి  హైనం సర్వాణి  భూతాని సంవా౦ఛంతి’’

భావం –బ్రహ్మ తత్వాన్నే ఉపాసించాలి .ఎవడు బ్రహ్మ తత్వాన్ని ఉపాసిస్తాడో ,అతడిని సర్వ భూతాలూ కోరుకొంటాయి .వనం అంటే ఉపాస్య వస్తువు అని అర్ధం .

ఏడవ మంత్రం –‘’ఉపనిషదం  భో బ్రూ హీ త్యుక్తా య ఉపనిషద్బ్రాహ్మీం  వావ త ఉపనిషదమబ్రూ మేతి’’

భావం –శిష్యుడు గురువును బ్రహ్మ విషయం ఉపదేశించమని కోరితే  గురువు బ్రహ్మకు సంబంధించిన ఉపనిషత్తు ను ఉపదేశి౦చాను  అని చెప్పాడు .

ఎనిమిదవ మంత్రం –‘’’తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్టా వేదాః  సర్వా౦గాని  సత్య మాయతనం ‘’

భావం –బ్రహ్మ సంబంధమైన ఉపనిషత్తు కోసం క్రుచ్ఛ ,చా౦ద్రాయణాది కర్మలు, బహిర ఇంద్రియ నిగ్రహం ,సంధ్యావందనాది విహిత కృత్యాలు ,రుక్ మొదలైన సంహితల .శిక్షా మొదలైన షట్ శాస్త్రాల అధ్యయనం ముముక్షువులకు అవసరమైన ముఖ్య విషయాలు .

తొమ్మిదవ మ౦త్రం –‘’యోవా ఏతా మేవ౦  వే  దాపహత్య పాప్మాన మనంతో స్వర్గే లోకే జ్యేయే ప్రతి తిష్టతి ప్రతి తిష్టతి’’

భావం –ఈ ఉపనిషత్తు ను గురు ముఖతా అధ్యయనం చేసి ,అందులోని విషయాలను మననం చేసే ముముక్షువు కర్మ బంధనాలు విడిపోయి బ్రహ్మలోకం లో శాశ్వత స్థితి పొందుతాడు .

ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం  బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః

  సమాప్తం

దుర్గాష్టమి శుభాకాంక్షలతో

మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం

నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం

https://photos.google.com/share/AF1QipOxlfKBRu7rxJcUsyPyNH1iINcw-EMf4m-jGg5PFgHumyr9Y9il4BRGs9rfQdVq0Q/photo/AF1QipMeXRt-LUrKzoFw5W2Lp1QRCNoph6R5iOvh86oC?key=ZTV6T2FTTWtzNWVhU3J2RTF1dkpSNGVjVFN0S0Fn

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment