నేపధ్య సంగీతం :
శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం. నది తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి తులసీరాం హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది. బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత óá ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .
శంకర శాస్త్రి ని పరిచయం చేస్తూ ఆయన పద సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శ౦కర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విశ్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్తాఫలం.
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడు
అసలు ఆ పాత్ర ఏమి చెప్పడు .అంతా మనం వూహించు కోవలసిందే . ఉహా సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను. నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ పాత్రనును విశ్లేషిస్తుంది. తులసి రైలు ఎక్కేటప్పుడు మైసూర్ లో పరాభవం జరిగినప్పుడు ఎక్కడ తొణకడు బెణకడు. ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తొట్రుపడడు .
తన కూతురి పెళ్లి కూడా ”అపస్వర౦’తో ఆగిపోయినా విచారించడు. అంతా పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీరమ్ వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కార చేతన. అది కట్టుబాట్లకు ఆచార వ్యవహారాలకు అ౦దనిది, అంతు బట్టనిది. హృదయ గత మైనది. .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారా౦శం .శిష్టాచార పరాయణుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాషాభేదం లేదని ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు. మాట్లాడిన నాలుగు మాటలు majestic గా ఒక కలెక్టర్ హుందాతనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,ద్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి
కూతురు వెన్న రాస్తుంటే సజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశ౦ .అక్కడ ఆర్ద్రత వర్షించింది. అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుడయాడు
చివరి సీను లో ”దొరకునా ఇటువంటి సేవ ”పాటకు ముందు”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ అజ్ఞాత దాతకు ,నా నమోవాకాలు ఆ కళాభిజ్ఞాతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది. మనసు లో ఆనంద జ్యోతి వెలుగుతుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధరించరా ,విని తరించరా ”అని అనిపించిన ఆ పాత్ర. తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విశ్వనాద్ కళా విశ్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా విశ్వనాద్ సృష్టికర్తగా కళా నీరా జనాలందుకున్నారు. ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృష్టింప బడుతు౦దొ తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించిన మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలాసం చేసే కళా మూర్తి వుందని ఎవరు ఊహించలేదు .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో కాసేపే నాట్యం చేసినా బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విశ్వనాద్ చేతిలో మనోజ్ఞ మనోహర శిల్పమూర్తి గా మలచబడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .వున్నా చాల పొడుపు .అంత సాత్వికాభినయమే . వూహాలోక సంచారమే .ఏదో తెలీని పిచ్చి ఆరాధనా తత్త్వం .ఒక devotion dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకాలకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు శ౦కర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంటగట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించు కోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శ౦కర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్రాలు గా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చత సాక్షాత్కరించింది .ఆ హావ భావాలు పరమ మనోహరాలు. శ౦కర శాస్త్రికి సన్మానం జరిగే టప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది
”బ్రోచే వారెవరురా ”పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి, సాధించాలనుకున్న గమ్యం చేరువవుతున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆన౦దమ్ తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శ౦కర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన చూపుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె ఆత్మానందానికి ప్రతీక .
జమీందారును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరాధనాకృతిగా నిలబడాలన్న తపన అది. .తనమూలం గా శ౦కరశాస్త్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక మూగ వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగాexplore expose చేసిన కళా తపస్వి విశ్వనాద్ పరిశీలనా దృష్టికి హట్స్ ఆఫ్
అల్లు రామ లింగయ్య :
శివునిహృదయం మాధవునికి మాధవుని మనసు శ౦కరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన
పరీక్షలకు తట్టు కొని నిలబడుతుంది. ఆ స్నేహబంధం పవిత్ర మయినపుడు వీడదు. వాడదు. శ౦కర మాధవులు దేవతాస్వరూపులు స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శ౦కర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవంను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రదారికి కూడా గర్వ కారణం .అల్లు రామలింగయ్య లోని కళాజీవి ధన్యుదయాడు ”వాడెంత నేను గట్టిగా కన్నెర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”అని శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు చెప్పి కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కాపోతాడు .
ఇలా యెంత చెప్పిన తరగనిగని గని శంకరాభరణం . చూసి పులకి౦న్చాల్సి౦దే. చెప్పి మెప్పించలేము.
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24-03-99 న స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి కృష్ణా జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లెపల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజున చూపించాను. చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం చేయటం నా అదృష్టం.
















































































