తిక్కన భారతం –28 ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2

  తిక్కన భారతం –28 
                ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2 
మౌసల పర్వం అంటే రోకలికధ .అదే యాదవ వినాశనానికి కారణమైంది .అందుకే ఎక్కడైనా తగాదాలు బంధు జనం మధ్య వస్తే ”ముసలం ప్రారంభ మైంది ”అనే మాట లోక సహజ మై పోయింది .బల రామ ,శ్రీ  కృష్ణుల నీడలో యాదవులందరు ద్వారకా నగరం లో సకల సుఖాలు అనుభవిస్తున్నారు .మత్తు లో జోగుతూ ,మదం బలిసి విశృంఖలం గా ప్రవర్తిస్తున్నారు .అవినీతి, బంధువులతో తగాదాలతో ధర్మ నాశనం చేస్తున్నారు .యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు .పెద్దల మీద గౌరవం, భక్తీ పూర్తిగా పోయాయి .యాదవ కుల నాశనం అయితే తప్ప ,శ్రీ కృష్ణావతార ప్రయోజం పూర్తీ కాదు .అప్పటికే గాంధారి తన వంశం లాగానే యాదవ వంశమూ  నిర్వంశం కావలి అని కృష్ణుని శపించింది .అది ఒక నెపం మాత్రమె .అప్పటికే చరిత్ర రాసి ఉంచాడు పరమాత్మ .ఆ శాపం ఫలించే సమయానికి యాదవ వంశ ప్రవర్తన నీతి బాహ్యం గా మారి పోయింది .”–గురుల కవమానమోనరించు దిరుగు, లజ్జ –విడిచి ,యభి లాషముల వెంట ,విభుల పంపు –సేయ కున్మార్గుల ,దమ చిత్తములకు –వచ్చి నట్లు వర్తింతురు వనిత లధిప ”.–ఆడ వాళ్ళు కూడా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు .ధర్మ చ్యుతి తట్టుకోవటం కష్టమైంది కన్నయ్యకు .సంఘం ఇలా నీతి బాహ్యమై అధోగతి పాలై పోయింది .”వినాశ కాలే విపరీత బుద్ధిహ్ ”ఆ వినాశనాన్ని సూచిస్తూ ,ప్రకృతి విరుద్దాలైన విశేషాలు కలగటం సహజం .
”అరుణములు ఘూర్ణి తంబు లై న,లోచ–నములు మెరయ ,మహోగ్ర దండము ధరిం చి –తిరుగు నొక్కొక్క చోట ,,నడ్రుశ్యుడగుచు ,–నన్తకున్డిదే ,యదె ,తోచే ననగ నదిప ”అంతకుడు అంటే యముడు ఎక్కడ పడితే అక్కడ కానీ పిస్తూ కానీ పించాకుండా ఎర్రటి కళ్ళ తో కనీ పిస్తున్నాడట .–”విను గూడు గూర పాకము -గాను గొని ,ప్రొయి వాపిడింప గా   ,నప్పుడ ,సం –జనితము లై ,ప్రువ్వులు గల –గోన ,మిల మిల ,మొదలు నందు గురుకుల ముఖ్యా !”విప రీతాలన్నీ జరిగి పోతున్నాయి .యాదవులు కణ్వాది మహర్షులను అవమానించారు .శ్రీ కృష్ణునికి అవకాశం చిక్కింది .ఆ నెపం తో పాపం ప్రదర్శితం అఎట్లు చేశాడు .పాప ఫలాన్ని వారితో అనుభ విన్చేట్లు చేశాడు .దాని ద్వ రా ధర్మ స్తాపన చేయాలని సంకల్పం .అందుకే వారికి అంతటి శిక్ష తప్పని సరి .మహర్షులకు జరిగిన అవమానం విన్న కృష్ణుడు నిశ్చలం గా ఉన్నాడు .”విదాత్రు కరణీయం ”అన్నాడు .అంటే బ్రహ్మ రాత తప్పించు కో లేనిది .యాదవ నాశనాన్ని ,ఎక్క దైనా మంచి తీర్ధ భూమి లో చేస్తే బాగుంటుందని సంకల్పించాడు .ఉత్సవం పేరు తో మొత్తం యాదవు లందర్నీ తరలించేశాడు .
”తన రధము లేమి ,నొండొక –ఘన రధమును ,దారకుండు గైకొని యెలమిం -గొని రా ,వెడ వెడ గైసే–సిన ,కృష్ణుడు ,నిర్వికార చిత్తత వెడలెన్ ”–కృష్ణుడికి రధం లేదు సారధి వేరే రధం తెస్తే చాలా వేగం గా యే రకమైన చిత్త వికారం లేకుండా ,వెళ్లాడు యాదవులున్న చోటికి .–”బొడవు చీర పూత లొంటి యట్టులు గాగ –నేమి వాహనంబు నెక్క కించు –కేని ,వికృతి లేని ,హృదయంబు మిత్ర సం –భాషణంబు గలిగి ,బలుడు వెడలె ”బాల రాముడు రోజూ వేసుకొనే విలువైన చీని చీనాంబరాలు కాకుండా చాలా సాధారణ వస్త్ర ధారణం చేసి ,రధాన్ని ఎక్క కుండా ,బంధువు లతో మాట్లాడు కొంటూ యే వికారం లేని శుద్ధ అంత రంగం తో బయల్దేరాడు .ఇలా ,నిర్వికారం గా అన్నదమ్ములు బాల రామ కృష్ణులు బయల్దేరటం తో కాలపురుషుని శాంత ,గామ్భీర్యాలను  సూచించాడు .సాత్యకి తో సహా ,అంతా విపరీతం గా మద్యం సేవించి ,ఊగి పోతున్నారు .సాత్యకి కృత వర్మ ను అనవసరం గా నిందించాడు .ఆయనా నానా మాటలు అన్నాడు .ఇలా నెమ్మదిగా కలహం ప్రారంభ మైంది .కృత వర్మ భూరిశ్రవనుడి చావుకు కారణం సాత్యకే నని దెప్పి పొడిచాడు .శమంతక మణి కోసం ,సత్రా జిత్తు ను చంపినా విధానాన్ని జ్ఞాపకం చేశాడు సాత్యకి .ఇదంతా విని సత్యభామ కన్నీరు కార్చింది .కృష్ణుడికి కృత వర్మాదుల కోపం వచ్చింది .అతి క్రూరం గా చూశాడు .అసహ్యాన్ని ప్రదర్శించాడు .ఈ విధం గా సాత్యకిని ప్రోత్సహించి నట్లే కృష్ణుడు .సాత్యకి మదిరావేశం తో కృత వర్మను నరికేశాడు .భోజ ,అంధక వీరులందరూ సాత్యకి పై విరుచుకు పడ్డారు .తమ్ముడు సాత్యకిని కాపాడే ప్రయత్నం ఏమీ చేయ లేదు కృష్ణుడు .ముని శాపం వల్ల పుట్టిన ముసలం అంటే రోకలి వల్ల జన్మించిన తుంగ మొక్కలతో బాదు కొన్నారు అందరు చచ్చి పోయారు బహుసా దీని వెనక ఉన్న కధ అందరికి తెలిసిందే .ఒక యాదవుడు కడుపు తో ఉన్నట్లు నటించి మునిని అవమానించాడు ”నీ కడుపు లో ఏముంది “‘అని ముని అడిగితే ,వాడు పెడసరం గా ”ముసలం అంటే రోకలి ”అన్నాడు .దానికి కోపించి ముని అదే నీకు పుట్టి మీ యాదవ వినాశానికి కారణ మవుతుందని శపించాడు .అలాగే రోకలి పుట్టింది .పాపం ఏమి చేయాలో తెలీక దాన్ని అరగ దీసి సముద్రం లో కలిపారు .అదే తుంగ మొక్కలుగా పుట్టింది .దానితో బాదుకొనే యాదవు లందరూ చచ్చారు .తుంగ మొక్క చాలా సున్నితం గా మెత్త గా ఉంటుంది .అదే వినాశానికి ఆయుధమై పోయింది అదీ విచిత్రం .
”తండ్రి ,పుత్రుడన్నదమ్ముడు నాకయ –య్యిరుదేరంగు వారు ,నేపు రేగి –మడియ ,మొదగాలి బడు మ్రాకుగాముల తె–రంగు దోచే ,నేమనంగ గలదు  ..”అన్నాలేదు తమ్ముడూ లేదు తండ్రీ లేదు  బంధువులు అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఒకరి నొకరు చచ్చేదాకా కొట్టుకు చచ్చారు .ఇదే ”యాదవ కులం లో ముసలం ”అంటే .అనిరుద్ధ ,ప్రద్యుమ్నాదు లైన కృష్ణుని కొడుకులూ చని పోయారు .మిగిలిన వారెవ్వ రైనా ఉంటె అవతార మూర్తి కృష్ణుడు తానే  తుంగ బుర్ర లతో  మోది చంపేశాడు .యాదవ కులాన్ని సమూలం గా నాశనం చేశాడు .గాంధారి వాక్యానికి సార్ధకత్వం చేకూర్చాడు .ఆడవారిని ,ఏనుగులు మొదలైన వాటిని ద్వారక కు తర లింప జేశాడు .తాను తపోవనానికి వెళ్తున్నట్లు తలి దండ్రులకు తెలియ జేశాడు .ఇని గంభీర విషయాలను తిక్కన అతి చిన్న పదాలతో అలంకార రహితం గా చెప్పి మనసుల్ని ఆకర్షిస్తాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –6-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.