ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69
30— నోబెల్ బహుమతి అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -1
94 ఏళ్ళు జీవించి ఎదురులేని నాటక రచయతగా పేరుపొంది ఆ శతాబ్దపు యువ మేధావిగా ప్రసిద్ధి చెందిన ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా 2-11- 19 50 లో మరణించాడు. మహోన్నతులలో చివరి వాడు నిజమైన మొదటి సంస్కారవంతుడైన వ్యక్తీ బెర్నార్డ్ షా అని నాటక నవలా రచయిత అయిన జె .బి. ప్రీస్ట్లీ అభివర్ణించాడు. షా నాటకాలతో ప్రసిద్ధి చెందటమే కాక మహా గొప్ప విమర్శకుడు కూడా. ఒక్క మాటలో అతనిని “మూవర్ అండ్ షేకర్” అని అనాలి. అన్ని రకాల భేషజాలకు బద్ధ వ్యతిరేకి. ఆయన వ్యంగ్య రచయత మాత్రమే కాదు సంస్కరణవాది కూడా. అయితే దేనికీ నిబద్దుడైన వ్యక్తీ కాదు. అతనివి అనేక పార్స్య్వాలు. ఉపాధ్యాయుడు, ప్రతి దానినీ ఖండిస్తూ దేనిని అంగీకరించేవాడు కాదు. అతనిది యుద్ధ క్షేత్రం. అతనిలో విశ్వ భావనలు ఉన్నాయి. డాన్ క్విక్సోట్ కు ఉన్న పోరాట పటిమ కలవాడు. డాన్ జువాన్ లాగా ప్రభావితం చేయగల వ్యక్తీ. పశ్చిమ ప్రపంచ నైతికతను చాలెంజ్ చేసినవాడు.
జార్జి బెర్నార్డ్ షా ఐర్లాండ్ లోని డబ్లిన్ లో 26 -7- 1856 న తండ్రి జార్జి కార్ షా కు ముగ్గురి సంతానంలో ఒకే ఒక మగ పిల్లవానిగా జన్మించాడు. తండ్రి అసమర్దపు సివిల్ ఉద్యోగి. తల్లి లుసిండా ఎలిజబెత్ గర్లీ షా ఒక భూస్వామి కుమార్తె. తండ్రి నుండి షా కు ఐరిష్ తెలివి, విలాస౦ సంక్రమించాయి. మద్యపానం మాత్రం అబ్బలేదు. తండ్రిని తాగుబోతుగా చెప్పుకున్నాడు షా. అంతే కాక భరించరాని వాడుగా తయారయ్యాడని చెప్పుకున్నాడు. తల్లి గాయకురాలు, కళలపై అభిమానం కలది. కొడుకుకు సంస్కృతిపై అభిమానం కల్గించింది. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం. డ్రామాలపై గొప్ప అభిరుచిని కల్గించింది. షా సాధారణ విద్య పరిమితమైనది. 13 వ ఏట వేస్లియన్ కన్ వెంషనల్ స్కూల్లో చేరాడు. తర్వాత డబ్లిన్లోని సెంట్రల్ మోడల్ బాయ్స్ స్కూల్లో చదివాడు. ఈ స్కూల్ అంటే అతనికి పరమ యావగింపు. 80 ఏళ్ల కాలం వరకు ఎక్కడా ఆస్కూల్ ఊసు ఎత్తలేదు. భార్యకు కూడా చెప్పలేదు. దానిని గురించి తర్వాత చెబుతూ షా “It was to me what the blacking warehouse was to Dickens “అన్నాడు. ఈ స్కూల్లో ఏడాదే చదివి 18 71 లో కమర్షియల్ డే స్కూల్లో చేరాడు. తండ్రి దమ్మిడీ కూడా సంపాదించలేక కుటుంబ పోషణను వదిలేశాడు.తల్లి మ్యూజిక్ టీచరుగా పని చేస్తూ చదివించింది. 15 వ ఏట డబ్లిన్ లోని ఒక లా౦డ్ ఏజెంట్ కు సహాయకునిగా పని చేసాడు. ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతున్నా అక్కడే 27 ఏడూ వచ్చే దాక కాషియర్ గా పని చేసాడు. తల్లి తాగుబోతు భర్తను వదిలేసి౦ది . ఆమె ప్రోత్సాహంతో రచయతగా మారాలని అనుకున్నాడు. తల్లి ఆసరాతో తాను ఒక మనిషిగా నిలబడాలని భావించానని చెప్పుకున్నాడు. పెన్నును నమ్ముకున్న ఈ మేధావి అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పెన్నుతో పొడిచి చీల్చి చెండాడాడు. 5 నవలలు రాసినా ఎవరూ ప్రచురించే సాహసం చేయలేదు. షా ప్రముఖ వ్యక్తీ అయిన తర్వాత అమెరికా పబ్లిషర్లు వీటిని దొంగతనంగా ముద్రించారు. 9 కఠిన సంవత్సరాలు గడిపి మొదటిసారిగా 35 డాలర్ల రాబడి సాధించాడు. అందులో 25 డాలర్లు ఒక పేటెంట్ మందుకు ప్రకటన రాయటం వలన వచ్చిందే.
దరిద్రంతో బాధపడుతున్న షా చాలా అవమానకర పరిస్థితుల్లో జీవించాడు. బూట్లు అరిగి చినిగిపోయి ఉండేవి. దుస్తులు అసహ్యంగా మురికితో ఉండేవి. చేతి కఫ్ఫ్ లు చీలికలు పేలికలుగా ఉండి ఎప్పుడూ కత్తెర దెబ్బలు తింటూ ఉండేవి. మార్ఫోక్ జాకెట్టు వేసుకుని నికర్స్ బ్రోకర్స్ లాగ బ్రిటిష్ మ్యూజియం లో గడిపేవాడు. అక్కడ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ జర్మనీ సంగీతజ్ఞుడు వాగ్నర్ రాసిన “Tristan Und Isolde” చదివాడు. ఇబ్సన్ నాటకాల విమర్శకుడు, అనువాదకుడు విలియం ఆర్చర్ తోనూ, సిడ్నీ వెబ్ అనే యువ సివిల్ సర్వెంట్ తోనూ పరిచయం కల్గింది. వాళ్ళతో షా’’ ఆదర్శ ధామ భావాలను ‘’(Utopian Ideas) సిగ్గుపడుతూ పంచుకునే వాడు. హెన్రీ జార్జ్ గురించి విని సోషలిస్టు భావాలను పెంచుకున్నాడు. షెల్లీ ని చదివి శాకాహారి అయ్యాడు. ఆయనకు మశూచికం సోకి గడ్డం గీసుకోలేక గడ్డం పెంచి షా అంటే గడ్డం మనిషి అన్పించాడు. ఇరవై ఏట ఆ గడ్డమే శోభనిచ్చింది. 30 వ ఏట గడ్డం బిరిసెక్కింది. దానిని ఎప్పుడూ దువ్వుకుంటూ మాకీవిల్లీ లాగా దుస్తులు ధరించేవాడు. కీర్తి ప్రతిష్టలు వ్యాపించిన తర్వాత తన నకిలీ మేఫిష్ట్ఫీలియన్ రూపాన్ని చూసి గర్వ పడేవాడు. గడ్డం పూర్తిగా తెల్లబడితర్వాత బక్కపలచని శాంతాక్లాజ్ లాగా కన్పించేవాడు లేదా’’ దైవరూప సైతాను’’లాగా కన్పించేవాడు.
ఆర్చర్ దయ వల్ల షాకు ఒక పత్రికలో పుస్తకాల సమీక్ష చేయటం మరొక దాన్లో కళాప్రదర్శనలు సమీక్ష చేయటం ఉద్యోగం దొరికింది. 29 వ ఏట సంగీత విమర్శకుడు అయ్యాడు. “కోర్నో ది బెసేటో” అనే మారు పేరుతో ఈ సమీక్షలు రాసేవాడు. ఆరేళ్ళు సంగీత కచేరీలు, ఒపెరాలపై రచనలు చేసాడు. అందులో హాస్యం, వ్యంగ్యం బాగా పండేవి. ఆయనకు సంగీతం జన్మతహా వచ్చిందని చెప్పుకునేవాడు. 15 వ ఏతే మొజార్ట్, హాన్దేల్. బీతొవెన్, మెండేల్సన్, రోసినీ ,వేర్దిల సంగీత స్వరాలపై అవగాహన కల్గిందని చెప్పాడు. షా రాసిన’’ ద పెర్ఫెక్ట్ వాగ్నరైట్’’ ఆ సంగీతజ్నుని సంగీత విధానాన్ని ఆవిష్కరించిన గొప్ప పుస్తకం. “Ring of the Nibelings” అనే పుస్తకంలో గ్లాక్,వెర్దీల విస్మృత రచనలన్నింటి గురించి రాసాడు. ఇన్నేళ్ళుగా రాస్తున్నప్పటికీ బీదరికం మాట్లాడుతూనే ఉంది. కానీ అతనిలోని హాస్యం మాత్రం తగ్గలేదు. ఒకసారి బజారులో వెడుతూ ఉండగా ఒక గాయకుడు డబ్బు కోసం తన టోపీని చేత్తో పట్టుకోగా దానిని “నొక్కు” అని చెప్పి షా వెళ్ళిపోయాడు. 1894లో సంగీత విమర్శకునిగా రాజీనామా చేసి ఫ్రాంక్ హారీష్ పత్రిక సాటర్ డే రివ్యూ లో డ్రామా క్రిటిక్ గా చేరాడు. ఇబ్సన్ నాటకాలతో అధిక ప్రేరణ పొందిన షా సొంతంగా సమస్యలపై నాటకాలు రాయటం ప్రారంభించాడు. నాలుగేళ్ళు నాటకాలు ఎలా రాయాలి అన్నదానిపై అనేక వ్యాసాలూ రాసాడు. అసంబద్ధమైన ముగింపులు ప్రొఫెషనల్ హీరోలను అసహ్యించుకున్నాడు. సార్డో రాసిన యాంత్రిక విధానపు నాటకాలను విమర్శించాడు. “It is the capacity for making good or bad art a personal matter makes a man a critic. The plain working truth is that it is not only good for the people to be shocked occasionally but absolutely necessary to the progress of the society that they should be shocked pretty often” అని నాటకాలపై తన అభిప్రాయం చెప్పాడు. ఇబ్సన్ నాటకాలు ప్రమాదకరం అని భావించినప్పుడు షా నాటక రచయితగా ముందుకు వచ్చాడు. ఇబ్సన్ సమకాలలీన నాటకాన్ని చాలా గొప్పగా ప్రభావితం చేసి నాటక రంగా చరిత్రలో సువర్ణాధ్యయాన్ని నెలకొల్పాడని “The Quintessence of Ibsenism “ అన్నదాంట్లో వివరించాడు.
1884 లో చివరి ఐదవ నవల రాస్తూ తన రచనలు 50 లేదా 60 తిరస్కరి౦ప బడినాయని దేనిని అంగీకరించలేదని ఇక నవలలు చాలు అన్పించిందని చెప్పుకున్నాడు. అప్పటికే సోషలిస్టు అయిన షా కొత్తగా ఏర్పడిన రోమన్ జనరల్ ఫెబియాస్ పేరు మీద ఏర్పడిన’’ఫేబియన్ సొసైటీ ‘’లో చేరాడు. ఈ సంస్థ క్రమగా ఊహా స్వర్గ విధానాన్ని వదలి శాస్త్రీయ సోషలిజం వైపు అడుగులు వేసింది. వారి నినాదం “Educate Agitate Organise”. ఈ సంస్థకు నియమ నిబంధనలను షా రాసాడు. బాధ పడటం కంటే ఇంకొక అంతర్యుద్ధాన్ని ఎదుర్కుంటాం అని ఆ సంస్థ చెప్పేది. స్వేచ్చ, సర్వ జనోపయోగం కోసం ఈ సంస్థ పని చేసింది. షా గొప్ప పాంఫ్లెటీర్ మాత్రమే కాని వక్తగా తడబడే వాడు. నెమ్మది నెమ్మదిగా తనను తాను తీర్చి దిద్దుకుని మాహా వక్త అయ్యాడు. వారానికి మూడు సార్లు పార్కుల్లో, వీదులమూలల్లో ఖాళీ హాళ్ళలో లెక్చర్లు ఇస్తూ 12 ఏళ్ళు గడిపాడు. ప్రతి స్థాయి లోని శ్రోతలను అలరించటానికి కావలసిన మసాలా అంతా సమకూర్చుకునేవాడు. ఈయనపై పోలీస్ నిఘా కూడా ఉండేది. ఒక సారి ఉపన్యాసం ఆపటానికి ప్రభుత్వం అరడజన్ మంది పోలీసులను పంపించింది. చట్టాన్ని కాపాడే వారు మాత్రం షాను అభినందించేవారు. రెండు సార్లు స్వచ్చందంగా జైలుకు వెళ్ళాడు. ఫ్రీ స్పీచ్ కోసం పట్టు బట్టేవాడు. ప్రభుత్వ అనుమతి లభించేది కాదు. తాను సోషలిస్టు ప్రాపగాండా చేసేవాడినే కాని సంయమనం కోల్పయేవాడిని కాను అని చెప్పుకున్నాడు.
![]()
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-15-ఉయ్యూరు
