గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)
పండిత వంశంలో కొల్హాపూర్ లో రసవాదునికి కుమారుడుగా అప్పా శాస్త్రి పుట్టాడు .చిన్నప్పుడు విద్య లన్నీ ఔపోసన పట్టాడు .’’సంస్కృత చంద్రిక ‘’అనే పత్రికకు వ్యాసాలూ రాసేవాడు .తర్వాత సంపాదకుడయ్యాడు .సాధారణ అంశాలపై ‘’సంస్కృత వాదిని ‘’అనే శీర్షిక నిర్వహించి సంస్కృత భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు .’’విద్యా వాచస్పతి ‘’,’’విద్యాలంకార ‘’బిరుదులు పొందాడు .నలభై ఏళ్ళకే 1913లో తనువు చాలించాడు .కొన్ని నాటకాలపై విమర్శలు రాశాడు .ఆయన సంస్కృతం లో రాసిన ‘’లావణ్య మావి ‘’అనే నవల కు బంకిం చంద్ర చటర్జీ బెంగాలీలో అదేపేరుతో రాసిన నవల ఆధారం.
287-కృష్ణమాచార్య (1869-1924)
పరవస్తు రంగా చార్య కుమారుడైన కృష్ణమాచార్య 1869లో జన్మించి 1924లో మరణించాడు మద్రాస్ లో సంస్కృత విద్యకు సూపరింటెండెంట్ గా ఉండేవాడు .కాళిదాసు రచనలపై గొప్ప వ్యాస పరంపర రాశాడు .’’సహృదయ’’ అనే సంస్కృత పత్రిక నిర్వహించాడు .’’పతివ్రత’’ ,పాణిగ్రహణం ,వరరుచి ‘’అనే వచన గ్రందాలు రాశాడు .సాంఘిక నీతి నియమాలను ప్రతి బి౦బి౦ చే ‘’సుశీల ‘’నవల రాశాడు .
288-అనంతా చార్య (1874
రామానుజా చార్య అనుయాయులైన ‘’ముడుంబై నంబి ‘’వంశం లో చివరివాడు అనంతా చార్య .1874లో కంచిలోని ప్రతివాది భయంకర కుటుంబం లో జన్మించాడు .అన్ని శాస్త్రాలు నేర్చాడు ఆయన శిష్యులంతా దేశమంతా ఉన్నారు .వైష్ణవ మత వ్యాప్తి కోసం విస్తృతంగా పర్యటించాడు .దీనికోసం అనేక శాస్త్ర గ్రంధాలు రాసి ప్రచురించాడు .న్యాయ వేదాంత జర్నల్స్ కు ‘’మంజుభాషిణి ‘’అనే సాహిత్య పత్రిక కు ఎడిటర్ గా ఉన్నాడు ‘’.ఆయన రాసిన ‘’వాల్మీకి భావ దీపిక ‘’రామాయణం లోని వేదాంత సారాన్నిసంపూర్ణంగా ఆవిష్కరించే గ్రంధం .జగన్నాధ ప్రసాద్ హిందీలో రాసిన నవలను సంస్కృతం లో ‘’సంసార చక్ర ‘’గా రాశాడు .
289- పండిత రాజ -కృష్ణమాచార్య (1874
సుమారు 1874లో జన్మించిన కృష్ణమాచార్య శ్రీ వత్స గోత్రుడైన వేంకటేశుని కుమారుడు .చిన్నప్పుడే శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు .వ్యాకరణం అభిమాన విషయం .సంస్కృత, తమిళ, మళయాళ భాషలలో అనర్గళంగా ప్రసంగించే నేర్పున్నవాడు .కొచ్చిన్ లో మహారాజ పతాకాన్ని,’’ పండిత రాజ ‘’బిరుదాన్ని అందుకొన్నాడు .తనకు సంస్కృతవచనం లో ఉన్న ప్రావీణ్యాన్ని క్లిష్టమైన చారిత్రిక అంశాలను సులభం గా చెప్పే విధానం కోసం ఉపయోగించాడు .సునిసిత మేధ శక్తి ఉన్నవాడు .నిత్య పరిశీలనా శీలి .’’పార్వతీ పరిణయం ,ప్రియ దర్షిక ,వామనుడి కావ్యాలంకార సూత్ర వృత్తి ,వాసవ దత్త మేఘ సందేశ’’ రచనల కర్తృత్వం ఎవరిదో నిగ్గు తేల్చి చెప్పాడు .’’సంక్షిప్త కాదంబరి ,హర చరిత్ర ,వేమా భూపాల చరిత్ర’’ లను యువతకు అందుబాటులో తెచ్చాడు. వ్యాకరణ తర్క శాస్త్రాలపై పలు రచనలు చేశాడు .’’మహా కవి సుభాషిత ‘’,’’సుభాషిత శతకం ‘’,భర్తృహరి సుభాషిత శతకసంగ్రహం ‘’,ఆయన కృషియే .’’ప్రస్తుతాంకూర విమర్శ ‘’,త్రిలుప్త కౌతుక ,వ్రుత్తి వార్తిక లపై గొప్ప విమర్శలు రాశాడు .’’వాసవ దత్త’’ పై రాసిన వ్యాఖ్య బహుదా ప్రశంసనీయం గా ఉన్నది .’’సుబందు’’ కవి మనసులోని ఆంతర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు .’’సాహిత్య రత్న మంజూష ‘’ ఎన్నో విషయాలపై సేకరి౦పబడిన అసామాన్య శ్లోక సముచ్చయం .
290-రాజ గోపాల చక్ర వర్తి (1882
తండ్రి గీతాచార్యుడు మైసూర్ సంస్కృత కళాశాలలో మీమాంస ప్రొఫెసర్ .చక్రవర్తి 1882లో జన్మించాడు .వంశానుగతంగా కవిత్వం, పాండిత్యం అబ్బి అనేక రాజాస్థానాలు సందర్శించి బిరుదులూ సన్మానాలు అందుకొన్నాడు .1922లో బెంగుళూరు సెంట్రల్ కాలేజి సంస్కృత విభాగ అధిపతి అయ్యాడు .’’శైవలిని ‘’’’కుముదిని ‘’అనే శృంగార కావ్యాలను రాసి మంచి పేరు సంపాదించుకొన్నాడు .’’విలాసకుమారి ‘’’’సంగర ‘’వచన రచనలూ చేశాడు .డెల్ఫీ లోని ఆరకిల్ ఆధారంగా ‘’త్రిపోద్’కావ్యం ’రాశాడు .’’పద్య హర్ష చరిత్ర ‘’,గంగా తరంగం ‘’,’’మధుకర దూత ‘’,వియోగి విలాపం ‘’రాశాడు .భారత దేశ యాత్రా సాహిత్యం గా ‘’తీర్దాటనం ‘కావ్యాన్ని ’నాలుగు అధ్యాయాలలో రచించాడు .అతని ‘’కవి కావ్య విచారం ‘’సాహిత్య చరిత్ర తో బాటు ,విమర్శన చరిత్రకూడా ఉన్న సృజనాత్మక గ్రంధం .అత్యాధునిక చారిత్రిక విషయాలనూ పొందుపరచాడు .1934లో మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-8-15-ఉయ్యూరు
