నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. వేదకాలం నుంచి సమాజంలో సోదరభావం, సామరస్యత వెల్లివిరిసేందుకు ఈ పున్నమి వేడుకలను చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. నేడు రాఖీ పౌర్ణిమ సందర్భంగా రక్షాబంధనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
ఈ సృష్టిలో తల్లీబిడ్డ ల ప్రేమానుబంధం తరువాత అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యం సంతరించుకున్నది అన్నా చెల్లెళ్ల అనురాగం. ఈ అప్యాయతానురాగాల బంధానికి ప్రతీకే రక్షాబంధనం. వేదకాలంలో శ్రావణ పౌర్ణమి కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యారులు ఈ రోజునే యజ్ఞోపవీతం చేసేవారు. మిగిలిన విద్యలు నేర్చుకునే వారు అదే రోజున మణికట్టుకు దారం కట్టుకునే వారు. అదే కాలక్రమంలో రాగ బంధాలకు ప్రతీక అయిన రక్షాబంధనంగా మారిందని చరిత్రకారులంటున్నారు.ప్రముఖ కవి సోమన దీనికి కవిత్వంలో నూ స్థానం కల్పించారు. ఆయన దీన్ని నూలు పూ ర్ణిమ అని పేర్కొన్నారు. సాంస్కృతిక చారిత్రక వారసత్వనేపథ్యంలో రాఖీకి విశిష్ట ప్రాధాన్యం ఏర్పడిం ది. ప్రస్తుతం నగరాలు, పల్లెలు అన్న తేడా లేకుం డా ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.
చరిత్రలో రక్షాబంధనం
- దేవ, రాక్షస సంహారంలో సహస్రాక్షునికి వి జయం సిద్ధించాలనే ఆకాంక్షతో అక్షితలు, ఆవాల మిశ్రమాన్ని తెల్లని బట్టలో కట్టి దాన్ని ఇంద్రుని భుజానికి ఇంద్రాణి తగిలించిందని పురాణోక్తి.
- రక్షా బంధనం విశిష్టతను ప్రాశస్త్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు భవిష్య పు రాణగాథలో ఉంది.
- హుమాయూన్ చక్రవర్తిని సాయం కోరేందుకు ఉదయపూర్ రాణి రాఖీ పంపిందని, దీంతో ఆ చక్రవర్తి ఆమెను తన సోదరిగా భావించి సాయం అందించాడని ఉదయపూర్ రాజ కథల్లో ఉంది.
- అలెగ్జాండర్ భారత్కు వచ్చిన సమయంలో రాజు పురుషోత్తమునితో యుద్ధానికి దిగుతాడు. అతి బలవంతుడైన పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్ మరణం తప్పదని విన్న అలెగ్జాండర్ ప్రియురాలు రుక్సానా ఒక రాఖీని పురుషోత్తమునికి కడుతుంది. దీంతో యు ద్ధంలో అలెగ్జాండర్ ప్రాణాలతో పురుషోత్తమునికి చిక్కినా మరణదండన విధించకుండా వదిలేసినట్లు చరిత్ర చెబుతోంది.
- రాఖీ కట్టడం మొగలాయిల కాలం నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందినట్లు ఆధారాలున్నాయి. తనకు రక్షగా ఉండమని కోరేందుకుముంజేతికి దారంకట్టడం ఆచారంగా ఇతిహాసాలు చెబుతున్నాయి.
ప్రేమకు ప్రతి రూపం అన్నాచెల్లెళ్లు
ప్రతి ఇంట్లో రాఖీ వేడుకలను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి రోజున అన్నా దమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఆశ పడుతుంటారు. తన సోదరితో రాఖీ కట్టించుకోవాలని ఎల్లవేళలా తనకు అండగా ఉంటాననే హామీ ఇవ్వా లని ప్రతి సోదరుడు ఆరాట పడుతుంటాడు. సోదరుని నుదుట తిలకం దిద్ది, ముంజేతి మణికట్టుపై రక్షా బంధనాలు కట్టి సోదరులు ఇచ్చే కానుకలను స్వీకరించాలి. పరస్పరం మిఠాయిలతో నోరు తీపి చేసుకోవాలి.
రాఖీ రూపురేఖల్లో కొత్త పోకడలు
నేడు రాఖీలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో దారానికి పసుపు, కుంకుమ అద్ది తమలపాకు చుట్టి రాఖీలుగా వాడుకునే వా రు. నేడు ప్లాస్టిక్ కోటెడ్ డిజైన్స్, పింగాణి, స్పాంజి, పూసలు, క్రిస్టల్స్, గాజు, రుద్రాక్షలు కలిపి రాఖీలను అందంగా రూపొందిస్తున్నారు. కొందరు కళాత్మకంగా వెండి, బంగారు కోటింగ్ వేయించి మరీ రాఖీలను తయారు చేయిస్తున్నారు.