ఆంధ్ర విదుషీకుమారి, ఆంధ్ర సరస్వతి, సాహితీ రుద్రమ, ఊటుకూరి లక్ష్మీకాంతం – జయంతి (25 డిసంబర్ 1917) – రాబోయే సంవత్సరం ఊటుకూరి లక్ష్మీకాంతం గారి “శతజయంతి” ఉత్సవాలు ప్రారంభం (1916-17 డిసంబర్ 25)
విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీకుమారి, తెలుగు మొలక, ఆంధ్ర సరస్వతి, కవయిత్రీ తిలక
కళాప్రపూర్ణ, ప్రముఖ కవయిత్రి, సమాజసేవకురాలు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ జయంతి – 25 డిసంబర్ (1917)
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (1917 – 1996) కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారు. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు నాళము కృష్ణారావు. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు నాళము సుశీలమ్మ. ఈమె పింగళ నామ సంవత్సరం డిసెంబరు 25, 1917 న ఏలూరులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట మార్చి 24, 1930లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
ఆంధ్రులు నిత్యం గర్వించదగ్గ మహా కవయిత్రి, విదుషీమణి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి నమస్కృతులు ప్రస్తుతిస్తూ, సారస్వత నీరజనాల్ని అందించడం మనందరి విధి.
కొంపెల్ల శర్మ. Kompella Sarma.
